breaking news
Ananthapur
-
చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచుదాం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో 16 నెలలుగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 28న చేపట్టనున్న ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇందులో మేధావులు, విద్యార్థులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈనెల 28న 10.30 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ దగ్గరున్న అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై ఆర్డీఓ ఆఫీసు వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల నిలువుదోపిడీకి స్కెచ్.. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, వేధింపులు రాజ్య మేలుతున్నాయని ‘అనంత’ దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ ఆస్తులను నిలువుదోపిడీ చేసేందుకు భారీ స్కెచ్ వేశారన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిందని, అప్పట్లోనే అందులో 7 కళాశాలలు పూర్తి కాగా మిగతా 10 కళాశాలల నిర్మాణాలు 30 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. నేడు వాటిని పీపీపీ అంటూ ప్రైవేటీకరణ చేస్తుండటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంద న్నారు. పేద వర్గాలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్నట్లుగానే జిల్లాలో కూడా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీ కరణ ఆపే ఉద్యమంలో అన్ని వర్గాలూ పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, శింగనమల, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బీసీ రమేష్గౌడ్, వెన్నం శివారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్, నగర కమిటీ అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు బాకే హబీబుల్లా, సోషియల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబాసలాం, మేధావుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, కార్పొరేటర్లు శేఖర్బాబు, శ్రీనివాసులు, రహంతుల్లా, ఇసాక్, నాయకులు ఫయాజ్, చింతకుంట మధు, కుళ్లాయిస్వామి, రామచంద్ర, దాదాపీర్, నాగార్జునరెడ్డి, మైను తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాల్సిందే పీపీపీని నిరసిస్తూ ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
రైతుల ముసుగులో నయా దందా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు నయా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనం, ఎరువులు, పురుగు మందుల దుకాణదారులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఓ వైపు వసూళ్లు కొనసాగిస్తూనే... మరోవైపు సరికొత్త ఎత్తుగడతో వసూళ్లకు ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ పార్టీ ముద్ర వేసి కొందరినే టార్గెట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రైతుల ముసుగులో వారే ఫిర్యాదులు ఇప్పించి సదరు దుకాణంలో తనిఖీలు చేయడం, చిన్నపాటి పొరపాట్లు గుర్తించడం, సరుకు సీజ్.. కేసు నమోదు.. లైసెన్సు రద్దు అంటూ బెదిరిస్తున్నట్లు తెలిసింది.జిల్లాలో డివిజన్, మండల స్థాయి అధికారుల వరకు కొందరు ఈ సరికొత్త ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, పలువురు అసోసియేషన్ నాయకుల పాత్ర ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీల సమయంలో రూ. లక్షలు ఖర్చు చేసి పోస్టింగ్లు తెచ్చుకున్న కొందరు అధికారులే వసూళ్లకు తెరలేపినట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాన వనరుగా జిల్లా కేంద్రం.. జిల్లా వ్యాప్తంగా 800 వరకు దుకాణాలు ఉన్నాయి. అందులో అనంతపురం నగర పరిధిలోనే 250 దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఉండడంతో ప్రధాన ఆర్థిక వనరుగా నగరాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం రైతుల ముసుగులో టార్గెట్ చేసిన దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, మందులు కొనిపించడం.. తర్వాత బిల్లులు ఇవ్వలేదని, వేరే కంపెనీ సరుకు ఇచ్చారని, దిగుబడులు రాలేదని... ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేయించి తనిఖీలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.ఇటీవల గార్లదిన్నె, కల్లూరు, అనంతపురంలో కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి వారి దుకాణాల్లో తనిఖీలు చేశారు. చిన్నపాటి తప్పిదాలను బూచిగా చూపించి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కొంత మొత్తం చేతులు మారినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు చేయించడం కోసం కొందరు రైతులను దళారులుగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ప్రతి పనికీ, సంతకానికి రేటు నిర్ణయించి మరీ దండుకుంటున్న అధికారులు నేడు కుట్రపూరిత చర్యలకు దిగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నిషేధిత సరుకు అమ్ముతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరి షాపుల వైపు చూసే పరిస్థితే తమకు లేదని అధికారులే చెబుతుండటం విశేషం. కొందరు వ్యవసాయాధికారుల కక్కుర్తి తామే ఫిర్యాదు ఇప్పించి దుకాణాల్లో తనిఖీలు సీజ్, కేసులంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు ప్లాన్ -
‘డైట్’లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
అనంతపురం సిటీ: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీసు)పై భర్తీ చేయనున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 30, 31 తేదీల్లో స్క్రూటినీ, నవంబర్ 5 నుంచి 8 వరకు ఆన్లైన్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. నవంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఖాళీల వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం వెబ్సైట్ చూడాలన్నారు. బీటీపీకి పెరుగుతున్న వరద గుమ్మఘట్ట: రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వేదవతి హగరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. దీంతో క్రమంగా బీటీప్రాజెక్టుకు నీరు చేరుతోంది. గురువారం నాటికి ప్రాజెక్టులో 1652.2 అడుగుల నీరు ఉన్నట్లు జలవనరుల శాఖ డీఈఈ గీతాలక్ష్మి తెలిపారు. క్యూసెక్కుల ఇన్ప్లో ఉందన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య బుక్కరాయసముద్రం: గ్రామాలలో ఎవరైనా మద్యం అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. బీకేఎస్లోని ఎకై ్సజ్ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం షాపులలో నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు ఏపీ ఎకై ్సజ్ సురక్షా యాప్ను డౌన్ లోడు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా బాటిల్ మూతపై క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా ఆ మద్యం గుర్తింపు పొందినదో, లేదో తెలిసిపోతుందన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ రామమోహన్రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్, బీకేఎస్ ఎకై ్సజ్ సీఐ నాగ సునీత, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతినారాయణకు జీవిత సాఫల్య పురస్కారం
అనంతపురం కల్చరల్: జిల్లాకు చెందిన కవి డాక్టర్ శాంతినారాయణకు అమృతలత సాహిత్య జీవన సాఫల్య పురస్కారం–2024 వరించింది. ఈ మేరకు గురువారం పురస్కార ప్రదాత డాక్టర్ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2న నిజామాబాద్లో జరగనున్న కార్యక్రమంలో ఆయనకు పురస్కారంతో పాటు రూ.25 వేల నగదు అందించనున్నట్లు వెల్లడించారు. తెలుగు కథా సాహిత్యంలో విలక్షణ రచయితగా శాంతినారాయణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు 70 కథానికలు, నాలుగు నవలలు, నాగలకట్ట సుద్దులు (రెండు సంపుటాలు’ రచించారు. విమలా శాంతి సామాజిక సేవా సమితి ద్వారా యువ రచయితలు, కవులకు పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ శాంతినారాయణ సాహిత్య కృషిని గుర్తించిన గత ప్రభుత్వం ఆయనకు ‘డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం’ అందించి గౌరవించింది. ఇదే క్రమంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికై న శాంతినారాయణకు పలువురు రచయితలు, కవులు అభినందనలు తెలిపారు. సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న శాంతినారాయణ అనంత ఖ్యాతిని ఘనంగా చాటారని ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, జనప్రియకవి ఏలూరు యంగన్న హర్షం వ్యక్తం చేశారు. -
డబుల్ రిజిస్ట్రేషన్లపై సీఎంకు ఫిర్యాదు
అనంతపురం టౌన్: ఫేక్ రిజిస్ట్రేషన్లతో ఇతరుల స్థిరాస్తులను లాక్కొవాలని చూస్తే కుదరదని, ఈ అంశంపై బాధితులను బెదిరించినా ఊరుకునేది లేదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా అనంత నగరంలో ఎలాంటి భూ వివాదాలు, భూ కబ్జాలు లేవన్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో చోటామోటా నాయకులు ఫేక్ రిజిస్ట్రేషన్లతో అత్యంత విలువైన భూములను కబ్జా చేస్తూ బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసేందుకు ఎంత వరకై నా పోరాటం సాగిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న భూకబ్జాల పర్వాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగానే నగరంలో భూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు వివరించారు. నగర ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే అన్యాయాలకు తెరదీయడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వాయిదా ఈ నెల 28న నిర్వహించాలనుకున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నవంబర్ ఆఖరుకు వాయిదా వేస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి తెలిపారు. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా సినీరంగానికి సేవలు అందించిన కళాకారులను, సినీనటులను సత్కరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సినీ రంగానికి సేవలందించిన రాయలసీమ కళాకారులను పార్టీలకు అతీతంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఒకరి స్థిరాస్తిని లాక్కొంటామంటే కుదరదు ఫేక్ రిజిస్ట్రేషన్లతో బాధితులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి -
నా బిడ్డను ఇవ్వకపోతే చచ్చిపోతా!
● సర్వజనాస్పత్రిలో దివ్యాంగ బాలింత ఆవేదన అనంతపురం మెడికల్: ఏందమ్మా నా బిడ్డను నా చేతికెందుకివ్వరూ. రెండ్రోజులవుతోంది నా బిడ్డను నాకిచ్చేయండి. లేకపోతే చచ్చిపోతా’ అంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్నర్సులను ఓ బాలింత వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ 30 ఏళ్ల గర్భిణి (ఓ కాలు లేదు) ఈ నెల 10న ఆస్పత్రికి వచ్చింది. రక్తహీనత, తదితర సమస్యలతో బాధపడుతుంటే లేబర్ వార్డులో అడ్మిషన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న ఆమె మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు కామెర్లులా ఉండడంతో ఆస్పత్రిలోని నవజాతా శిశు కేంద్రంలో అడ్మిట్ చేశారు. ఫొటోథెరపీ కింద బిడ్డను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. బిడ్డకు తల్లిపాలు ఇబ్బంది లేకుండా మదర్మిల్క్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు. ఆస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో అడ్మిషన్లో ఉన్న బాలింతకు తన బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా ఎస్ఎన్సీయూ వద్దకెళ్లి సిబ్బందిని ప్రాధేయపడుతోంది. బిడ్డకు బాగలేదని మళ్లీ ఇస్తామని చెబుతున్న సిబ్బందితో గొడవ పడి తిరిగి వార్డుకు చేరుకుంటోంది. ఇదే అంశంపై గైనిక్ హెచ్ఓడీ షంషాద్ బేగం మాట్లాడుతూ.. బాలింత సంబంధీకులు ఇప్పటి వరకూ ఎవరూ రాలేదని తెలిపారు. తన పేరు మాత్రం మంజుల అని, ఎవరూ లేరని సమాధానం చెబుతోందన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేని కారణంగా శిశువును అప్పగిస్తే ఆ పసికందును ఏం చేస్తుందోనని సిబ్బంది భయపడుతున్నారని, సంబంధీకులు ఎవరైనా వచ్చి బాలింతకు మేలుగా ఉంటుందని పేర్కొన్నారు. -
వ్యక్తి హత్య
● పోలీసుల అదుపులో అనుమానితులు తాడిపత్రి టౌన్: స్థానిక భగత్సింగ్ నగర్కు చెందిన పెయింటర్ రాజా (45) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇళ్లకు పెయింటింగ్ పనితో జీవనం సాగిస్తున్న రాజాకు 20 ఏళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లికి చెందిన సరస్వతితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజా మద్యానికి బానిసగా మారి తరచూ గొడవ పడుతుండడంతో పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భగత్సింగ్ నగర్లో ఒంటరిగానే జీవిస్తున్నాడు. రోజూ మరో ఇద్దరితో కలసి రాత్రి సమయంలో ఫుల్గా మద్యం సేవించే వాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో వెళుతున్న రాజా అశోక్పిల్లర్ సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు తలపై సిమెంట్ దిమ్మెతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం గుర్తించిన స్థానికుల సమాచారంతో ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐ ఆరోహణరావు, ఎస్ఐ గౌస్మహమ్మద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, రాజాతో కలసి రోజూ మద్యం సేవించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు
తాడిపత్రి రూరల్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని సకాలంలో రైల్వే పోలీసులు కాపాడారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన వెంకటస్వామినాయక్, అతని సోదరుల మధ్య పొలం వివాదం ఉంది. స్థిరాస్తి పంపకంలో తనకు జరిగిన అన్యాయాన్ని తాళలేక చనిపోతున్నట్లు ఇంట్లో చెప్పి గురువారం ద్విచక్ర వాహనంపై చింతలాయపల్లికి చేరుకున్నాడు. అక్కడ బైక్ వదిలి తాడిపత్రికి వచ్చాడు. అనంతరం అతిగా మద్యం సేవించి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గూడ్స్ రైలును గమనించి దానికి ఎదురుగా పట్టాలపై పరుగు తీస్తుండడం గమనించిన కానిస్టేబుల్ శివారెడ్డి, రైల్వే పోలీసులు వెంటాడి సకాలంలో పట్టాలపై నుంచి పక్కకు లాగారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కుటుంబసభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ అనంతరం అప్పగించారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి అనంతపురం టౌన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు పలువురు సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. ఈ మేరకు అనంతపురంలోని మంత్రి నివాసంలో గురువారం కేశవ్ను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. జీఓ 523 ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, వరప్రసాద్, మల్లికార్జున, చంద్ర, శివశంకర్తోపాటు పలువురు పాల్గొన్నారు. డిసెంబర్లోపు షీప్ సొసైటీ ఎన్నికలు అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు డిసెంబర్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ తెలిపారు. స్థానిక షీప్ డెవలప్మెంట్ కార్యాలయంలో యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్, పర్సన్ ఇన్చార్జి /డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్మన్ పాల్గొన్నారు. నిద్రావస్థలో ఉన్న ప్రాథమిక గొర్రెల సంఘాలను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా గడువు మీరిన సంఘాలకు త్వరలో ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని సభ ఆమోదించింది. జీవాలకు, కాపర్లకు బీమా సదుపాయం ఉందని, షెడ్లు నిర్మాణాలను ప్రోత్సహిస్తామని, జీవాల సంరక్షణకు మెరుగైన వైద్య సేవలు, వ్యాక్సినేషన్లు ఇస్తామని తెలిపారు. -
బాబుకు కనువిప్పు కల్గించేందుకే ‘కోటి సంతకాలు’
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డికూడేరు/అనంతపురం అగ్రికల్చర్: సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టామని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్ అధ్యక్షతన ఉరవకొండ నియోజకవర్గంలోని మండలాల పరిశీలకులు, కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘విశ్వ’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం దుర్మార్గమన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ పటిష్టత కోసం చురుగ్గా పని చేసే వారికే గ్రామ, అనుబంధ కమిటీల్లో చోటు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ఉరవకొండలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దేవేంద్ర, ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ దేవా, కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండల కన్వీనర్లు బైరెడ్డి రామచంద్రారెడ్డి, డొనేకల్లు రమేష్, సోమశేఖర్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వడ్డే గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్, పార్టీ నేతలు ముస్టూరు నరేష్, నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం
● కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య బ్రహ్మసముద్రం: వైద్య కళాశాల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని, అంతేకాక పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతాయని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మసముద్రం మండలం మామడూరులో ఆ పార్టీ మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన గురువారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగయ్య మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులు తీసుకువచ్చారన్నారు. ఇందులో పలు కళాశాలల నిర్మాణాలున పూర్తయి తరగతులూ జరుగుతున్నాయన్నారు. రూ. 5 వేల కోట్ల కేటాయిస్తే మిగిలిన కళాశాలలూ పూర్తవుతాయన్నారు. అయితే నిధులు కేటాయించకుండా పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా ప్రైవేట్ వ్యక్తలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఈ కుట్రకు సీఎం చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం సూత్రధారులు టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వీధివీధికీ బెల్టుషాపులు ఏర్పాటు చేసి ప్రతి బాటిల్పై రూ. 30 అదనంగా వసూలు చేస్తూ దోపిడీ సాగిస్తున్నారన్నారు. అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యే అయిన తరువాత అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసి, దోపిడీకి తెరలేపారన్నారు. చివరకు బీటీపీ కాలువ మట్టిని కూడా ఎమ్మెల్యే విక్రయించుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామంలో సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం గంగాధరప్ప, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, ఎంపీపీలు కంభం చంద్రశేఖర్రెడ్డి, భీమేష్, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కై రేవు ప్రతాప్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శులు గోపాలరెడ్డి, మంజునాథ, బూత్ కమిటీ విభాగం సునీల్, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ హనుమంతరాయుడు, మండల ఉపాధ్యక్షులు రాము, మల్లికార్జున, వైస్ ఎంపీపీ బి.పల్లప్ప, ఎంపీటీసీలు శివన్న, తిప్పేస్వామి, సర్పంచ్లు రాంమ్మోహన్, నాగభూషణ, గంగాధర, ఎల్లప్ప, మండల కో ఆప్షన్ సభ్యుడు ఈశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మహదేవప్ప, అనుబంధ సంఘాల అధ్యక్షులు అభిలాష్రెడ్డి, తిప్పేస్వామి, పాతలింగ, ఎరడికెర ఎర్రిస్వామి, తిమ్మారెడ్డి, శరణప్ప, మహలింగ, ఆర్ఎంపీ వసంత్, మంజు, శంకర్నాయక్, నాగిరెడ్డి, జనార్ధన, జానీ, నాయకులు అయ్యన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న తలారి రంగయ్య, సంతకాలు సేకరిస్తున్న రంగయ్య, పార్టీ శ్రేణులు -
పుట్టడమే నేరమా?
అప్పగిస్తే సంరక్షిస్తాం రాయదుర్గం: అమ్మా .. అనే పిలుపు కోసం తహతహలాడే వారు ఎందరో ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్నో బాధలను సైతం లెక్కచేయకుండా చిరునవ్వుతో కష్టాన్ని భరిస్తూ, పురిటి నొప్పులతో పునర్జన్మను పొందే తల్లులూ ఎందరో ఉన్నారు. అంతటి త్యాగమూర్తుల పేరుకే మచ్చతెచ్చేలా కొందరు కర్కశత్వం ప్రదరిస్తున్నారు. పేగు పంచుకుని పుట్టిన వారిని కనికరం లేకుండా ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. అమ్మా! నేనేం పాపం చేశా, పుట్టడమే నేరామా? అంటూ పసి హృదయాలు ఆక్రోసించేలా చేస్తున్నారు. జిల్లాలో గత మూడేళ్లుగా 31 మంది పసికందులు శిశుగృహలో చేరారు. లెక్కకు రాని మరణాలు మరెన్ని ఉన్నాయి. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం పరిసరాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండడం విశేషం. ఇటీవల కళ్యాణదుర్గంలో ముళ్లపొదల్లో లభ్యమైన శిశువును సరిగ్గా చూసుకోలేక మృత్యుఒడికి చేర్చారు. అలనాపాలన చూడాల్సిన అధికారులు సరైన వసతులు సమకూర్చక పోవడంతోనే శిశువు మృతికి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి అప్పటి ఐసీడీఎస్ పీడీని బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. అసలు కారకులను మాత్రం ఉపేక్షిస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఏ కారణం చేతనైనా బిడ్డను పోషించడం భారమనుకుంటే శిశుగృహలో అప్పగించాలి. శిశువులను పెంచి పోషించే బాధ్యత తీసుకుంటాం. బిడ్డను అప్పగించాక 60 రోజుల్లో మనసుమారితే ఎప్పుడైనా సరే వెనక్కు తీసుకెళ్లవచ్చు. ఇటీవల పెళ్లికాని ఓ అమ్మాయి కూడా బిడ్డకు జన్మనిచ్చింది. వేరే ఆలోచన చేయకుండా నేరుగా శిశుగృహకు అప్పగించింది. ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా చేయకుండా భయపడి ముళ్లపొదలు, రోడ్డుపక్కన వదిలివెళ్లడం మంచిది కాదు. శిశుగృహలో ఏ ఒక్క బిడ్డా మృతి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ విషయంపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నాం. – అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ -
●జోడెద్దుల జోరు
● 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తిన ఎద్దులు బొమ్మనహాళ్: జోడెద్దులు జోరుగా కదిలాయి. 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తి సన్మానం అందుకున్నాయి. ఈ అరుదైన ఘనతను బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన రైతుచిన్న బసయ్య పొలంలో గురువారం అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన ఎద్దులతో కసలి సాధించాడు. ఇందుకు శివ, ఇస్సప్ప, రేవప్ప, రాముడు, వన్నప్ప సాయం తీసుకున్నాడు. కాడెద్దులతో గురువారం తెల్లవారుజాము 5 గంటలకు విత్తు పనులు చేపట్టి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి ఎద్దులను గ్రామంలో ఘనంగా ఊరేగించి, సంబరాలు నిర్వహించారు. -
దంచికొట్టిన వాన
●‘అనంత’లో విరుచుకుపడిన వరుణుడు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో 50 మి.మీ, బుక్కరాయసముద్రంలో 72, అనంతపురం రూరల్ మండలంలో 70 మి.మీల భారీ వర్షపాతం నమో దైంది. అలాగే, ఉరవకొండలో 65 మి.మీ, ఆత్మకూరు 50 మి.మీ, రాప్తాడులో 40 మి.మీ, కూడేరు 32 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నార్పల, విడపనకల్లు, కళ్యాణదుర్గం, వజ్రకరూరు, డి.హీరేహాళ్, శింగనమల, గుత్తి, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు తదితర మండలాల్లోనూ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షంతో అనంతపురం నగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలిమరపై పిడుగు కూడేరు: మండలంలోని కలగళ్లలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన జోరు వర్షం కురిసింది. గ్రామ సమీపాన గ్రీన్కో కంపెనీ ఏర్పాటు చేసిన గాలిమరపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగి గాలిమర కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
రేయ్ నా కొడకల్లారా.. జాగ్రత్త!
అనంతపురం సెంట్రల్: ‘రేయ్.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్మెన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా.. ఒక్కో యూట్యూబ్ నా కొడుక్కి చెబుతున్నా జాగ్రత్త’’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి బూతులతో రెచ్చిపోయారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానిం చడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ జగదీష్ అదే రీతిలో స్పందించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఎస్పీ జగదీష్ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగా వేచి ఉన్నా.. ఎస్పీ జగదీష్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి వెనుతిరిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకున్నారు. అంతుచూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నేను చదువుకున్న వాన్ని.. మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడే జేసీ ప్రభాకర్రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అధికారపార్టీలో ఉన్నా.. చివరుకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటిదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఎస్పీ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఝలక్
సాక్షి,అనంతపురం:తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ నిరాకరించారు. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ ప్రకటించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయానికి జేసీ ప్రభాకర్రెడ్డి వచ్చారు. గంట సేపు వేచి ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్లారు. -
మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం
● డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా స్పష్టం చేశారు. బుధవారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడీఆర్ఎం యు.సుధాకర్, సీనియర్ డీసీఎం మనోజ్తో కలిసి ఆయన మాట్లాడారు. దసరా, దీపావళి పండగల తోపాటు నార్త్లో జరుపుకునే పలు పండుగల కారణంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా డివిజన్ వ్యాప్తంగా దాదాపు 66 ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపినట్లు తెలిపారు. ఇందులో గుంతకల్లు డివిజన్ నుంచి 12 ప్రత్యేక రైళ్లు ఉన్నాయన్నారు. తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బంది క్యూర్ కోడ్ జాకెట్లు ధరించి నేరుగా టిక్కెట్లు విక్రయం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైలు బోగీలోని టాయిలెట్స్లో నీరు రాకపోయిన, శుభ్రత లోపించిన, వైద్య పరమైన ఇబ్బందులపై ప్రయాణికులు వార్ రూమ్కు ఫిర్యాదు చేసిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. దాదాపు రూ.400 కోట్ల తిరుపతి రైల్వేస్టేషన్, రూ.50 కోట్లతో రేణిగుంట రైల్వేస్టేషన్ ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. గుంతకల్లులోని ధర్మవరం లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. మున్సిపాలిటీ స్థల సేకరణ పెండింగ్లో ఉందని, ఇందుకు అవసరమైన రూ.1.08 కోట్లను ఈ వారం లోపు మున్సిపాలిటీ ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎం శ్రీకాంత్రెడ్డి, ఆర్పీఎఫ్ ఏఎస్సీ అనిల్కుమార్సింగ్ పాల్గొన్నారు. -
పచ్చదనంపై గొడ్డలి వేటు
కళ్యాణదుర్గం: గ్రామ కంఠం స్థలంపై కన్నేసిన టీడీపీ నేతలు అటవీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 200 పచ్చని చెట్లను నేలకూల్చారు. ఘటనపై పంచాయతీ అధికారులతో కలిసి రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండలంలో కొత్తూరులోని జెడ్పీహెచ్ఎస్లో ప్రాథమిక పాఠశాలను విలీనం చేసిన తర్వాత 1 నుంచి 9 వ తరగతి వరకూ 286 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలం లేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల విన్నపం మేరకు స్థానిక సర్పంచ్ నాగమణి,. ఆమె భర్త బాబు.. గ్రామస్తులతో చర్చించి ఆట స్థలం కోసం జుంజప్ప గుడి ఎదుట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసుకోవాలని సూచించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత స్థలాన్ని శుభ్రం చేసుకున్నారు. అయితే సర్వే నంబర్ 681 లో 3 ఎకరాల గ్రామకంఠంపై ఎప్పటి నుంచే కన్సేసిన టీడీపీ నేతలు కొందరు పాఠశాల క్రీడా మైదానం ఏర్పాటు పేరుతో ఆక్రమించుకునేందుకు రంగంలో దిగారు. బ్లాక్ ప్లాంటేషన్ పథకం కింద 2021లో నాటిన సుమారు 200 చింతచెట్లను అటవీ చట్టాన్ని ఉల్లంఘించి రాత్రికి రాత్రే నరికేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ.. స్కూల్ విద్యార్థుల ఆట స్థలం కోసం కొత్తురు గ్రామ సర్పంచ్ నాగమణి, ఆమె భర్త బాబు సమక్షంలో గ్రామస్తులందరితో చర్చించి, వారి ఆమోదం మేరకు జుంజప్ప గుడి ఎదుట ఉన్న స్థలంలో పిచ్చి మొక్కలు తొలగించుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయితే కొందరు ఉద్దేశ్యపూర్వకంగా గ్రామకంఠం స్థలంలోని 200 చింత చెట్లను నరికివేశారని, దీనిపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అటవీ రేంజ్ అధికారి రామచంద్రుడు మాట్లాడుతూ.. కొత్తూరులో చింతచెట్లను నరికిన అంశంపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. వైఎస్సార్సీపీ నేత బాబు మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడా మైదానం కోసం పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేసుకోవాలని గ్రామస్తులందరి ఆమోదంతో తెలిపామన్నారు. ఆ మేరకే పిచ్చి మొక్కలను తొలగించారన్నారు. అయితే కొందరు టీడీపీ నాయకులు గ్రౌండ్ పేరుతో 200 చింతచెట్లను తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి లోకేష్తో కలసి బుధవారం ఆర్డీఓ వసంతబాబుకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అటవీ చట్టాన్ని ఉల్లంఘించిన టీడీపీ నేతలు స్కూల్ క్రీడా మైదానం పేరుతో 200 చెట్ల నరికివేత గ్రామకంఠం స్థలాన్ని ఆక్రమించేందుకు ఎత్తుగడ -
మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదనే హత్య
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వివాహిత హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే హతమార్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురిడిలో నివాసముంటున్న వివాహిత నాగమణి తన భర్త బోయ హనుమంతరాయుడు చేతిలో సోమవారం తెల్లవారుజామున హత్యకు గురైన విషయం తెలిసిందే. హతురాలి సోదరుడు, రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం హనుమంతరాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నాగమణిని తానే హత్య చేసినట్లు హనుమంతరాయుడు అంగీకరించాడు. మద్యం తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా తనని తిట్టిందని, ఈ నెల 20న తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకెళ్లి వచ్చి ఇంటి ఎదుట నిద్రిస్తుండడంతో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకెళ్లి నరికి హతమార్చినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ మ్యుటేషన్ సూత్రధారి డీటీ
నకిలీ పత్రాలు సృష్టించి రూ.52 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు పథకం పన్నారు. విషయం కాస్త వెలుగు చూడడంతో పాత్రధారిగా ఉన్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడి చుట్టూ విచారణ ఉచ్చును అధికారులు బిగించారు. దీంతో అసలు కీలక సూత్రధారి వెలుగులోకి వచ్చాడు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ తహసీల్దార్ కీలకంగా వ్యవహరించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణలో స్పష్టమైంది. ఉరవకొండ: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పసులూరి రమేష్బాబు, రాకేష్బాబు, రవికుమార్తో పాటు వారి అక్కాచెల్లెళ్లలకు అదే గ్రామంలోని సర్వే నంబర్లు 133, 165, 164–1లో 13.18 ఎకరాల భూమి వారి తాత, ముత్తాతల కాలం నుంచి సంక్రమించింది. హక్కుదారులు సాగులో సైతం ఉన్నారు. ఓ వ్యక్తి తనకు సంబంధం లేని భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న ఘటన వజ్రకరూరు మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు అప్రమత్తమై డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన పుష్పావతి, రవికుమార్, రమేష్బాబు, రాకేష్బాబు తదితరులకు చెందిన భూమిలోని మూడు ఎకరాలకు తాడిపత్రి పరిధిలోని నందలపాడు ప్రాంతానికి చెందిన రుషింగమయ్య అనే వ్యక్తి మ్యుటేషన్ టైటిల్డీడ్ కమ్ పీపీబీ కోసం ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో ఈ నెల 13న వజ్రకరూరు మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేశాడు. ఈ తతంగం గురించి తెలుసుకున్న భూమి యజమానులు వజ్రకరూరుకు చేరుకుని కూపీ లాగారు. తర్వాత అనంతపురంలో డీఆర్ఓను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసిన రుషింగమయ్య, సహకరించిన మీ సేవ నిర్వాహకుడు శ్రీనాథ్గౌడ్పై విచారణ చేపట్టి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. అలాగే అనంతపురం రూరల్ తహసీల్దార్తో పాటు ఇటుకలపల్లి పీఎస్లోనూ ఫిర్యాదు చేశారు. తీగ లాగారు.. డొంక కదిలింది మ్యుటేషన్కు అక్రమంగా దరఖాస్తు చేసుకున్న వైనంపై ఈ నెల 20న ‘ఫేక్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్కు దరఖాస్తు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలుడింది. దీంతో ఉలిక్కి పడిన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. తమ చేతికి చిక్కిన తీగను లాగుతున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతూ వచ్చింది. నకిలీ పత్రాలతో భూమి కాజేసేందుకు ప్రయత్నించిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ తహసీల్దార్ మోహన్కుమార్ విచారణ చేపట్టారు. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో ఉరవకొండ ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా కదిరికి బదిలీపై వెళ్లిన అధికారి సదరు భూమిపై కన్నేశారు. దీంతో ఆగమేఘాలపై పావులు కదిపారు. తనకు సన్నిహితంగా ఉన్న వజ్రకరూరులోని మీ–సేవ నిర్వాహకుడు శ్రీనాథ్గౌడ్ ద్వారా ఈ నెల 13న సదరు పొలానికి సంబంధించి అసలు యజమాని తాడిపత్రికి చెందిన రుషింగమయ్య అంటూ ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సరిఫికెట్లు సృష్టించి మీ–సేవ ద్వారా ముట్యేషన్కు దరఖాస్తు చేయించినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో వజ్రకరూరులోని మీ–సేవ నిర్వహకుడు శ్రీనాథ్గౌడ్ను ఆ మండల తహసీల్దార్ నరేష్ విచారణ చేసి మీ–సేవ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. భూమికి సంబంధం లేని వ్యక్తి పేరుతో మ్యుటేషన్కు ఎలా దరఖాస్తు చేశారంటూ శ్రీనాథ్గౌడ్ను అధికారులు ప్రశ్నించగా... కదిరిలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ పేరు బహిర్గతం చేశాడు. నకిలీ పత్రాలతో మ్యుటేషన్కు దరఖాస్తు చేసిన వజ్రకరూరులోని మీ–సేవ కేంద్రం, రుషింగమయ్య పేరుతో మ్యుటేషన్కు దరఖాస్తు చేసిన దృశ్యం అక్రమాలకు తొలి ‘గురు’వు ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసి ప్రస్తుతం కదిరిలో పనిచేస్తున్న సదరు అధికారిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బినామీల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి మీ–సేవ నిర్వాహకుడికి వాట్సాప్లో ఆయనే స్వయంగా పంపినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఫోన్లో మీ–సేవ నిర్వాహకుడితో జరిపిన సంభాషణకు సంబంధించి వాయిస్ రికార్డులను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో అనంతపురం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, రూ. కోట్లు విలువ చేసే భూమికి నకిలీ ఎన్ఓసీలు జారీ చేసిన అంశంపై నేటికీ విచారణ కొనసాగుతోంది. తాజాగా నకిలీ పత్రాలతో మ్యుటేషన్కు దరఖాస్తు చేయించి, రూ.52 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు పన్నిన పన్నాగం కాస్త బట్టబయలు కావడంతో అక్రమాలకు తొలి గురువుగా ఉన్న సదరు డీటీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ పత్రాలతో రూ.52 కోట్ల భూమికి ఎసరు మ్యుటేషన్కు దరఖాస్తు చేసి అడ్డంగా దొరికిన వైనం లోతైన విచారణ చేపట్టిన అధికారులు -
పప్పుశనగ విత్తనం కోసం ధర్నా
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పంట సాగుకు వీలుగా 90 శాతం సబ్సిడీతో విత్తన పప్పుశనగను వెంటనే రైతులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రబీ ప్రారంభమై 25 రోజులు కావస్తున్నా రైతులకు రాయితీ విత్తనం ఇవ్వకుండా చంద్రబాబు సర్కారు మోసం చేస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో సాగుకు వీలుగా వెంటనే విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత రబీతో పాటు ఈ ఖరీఫ్లోనూ అననుకూల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విత్తనం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కేటాయింపులు, రాయితీలు కుదించడం, ధరలు బాగా పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. 90 శాతం సబ్సిడీతో వెంటనే పంపిణీ చేయాలన్నారు. అనంతరం జేడీఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సీపీఎం, రైతు సంఘం నాయకులు వి.రామిరెడ్డి, ఆర్.చంద్రశేఖర్రెడ్డి, ఎం.కృష్ణమూర్తి, బి.శివారెడ్డి, బీహెచ్ రాయుడు, చెన్నారెడ్డి, సంజీవరెడ్డి, పోతులయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల ఆదాయ వనరులు గుర్తించండి
● ఎంపీడీఓలతో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అనంతపరం టవర్క్లాక్: గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే నిధులు ముఖ్యమని, ఇందుకు గాను పంచాయతీల సొంత ఆదాయవనరులను గుర్తించాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపీడీఓలకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. పంచాయతీల ఆదాయ వనరుల గుర్తింపు అంశంపై జెడ్పీలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం గిరిజమ్మ ప్రారంభించి, మాట్లాడారు. వృథాగా ఉన్న పంచాయతీ స్థలాలను వాణిజ్య కేంద్రాలుగా మార్చాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫ్యాక్టరీలు, వెంచర్లు, సెల్ టవర్లు ఏర్పాటు వంటి వాటికి అనుమతులు ఇవ్వాలన్నారు. చెత్తతో సంపద తయారీ, ఇంటి పన్నులు, ప్యాక్టరీ పన్నుల సక్రమంగా వసూళ్లు చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు. 28 నుంచి మండల కేంద్రాల్లో శిక్షణఉమ్మడి జిల్లాలో పంచాయతీ సొంత ఆదాయ వనరుల గుర్తింపు ప్రతి మండలంలో శిక్షణ తరగతులు నిర్వహించాలనిధ ఎంపీడీఓలకు జెడ్పీ సీఈఓ శివశంకర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి 29 వరకు రెండు రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, డిజిటల్ అసిసెంట్లు, ఇంజనీరింగ్ అసిసెంట్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణ విధివిధానాలను వెల్లడించారు. -
‘సమగ్ర’ అక్రమాలపై విచారణకు ఆదేశం
● అసిస్టెంట్ కలెక్టర్ చైర్మన్గా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన కలెక్టర్ అనంతపురం సిటీ: సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్లో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టారంటూ అందిన ఫిర్యాదులపై కలెక్టర్ ఓ.ఆనంద్ సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి అసిస్టెంట్ కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ సంక్షేమం, సాధికారత జిల్లా అధికారిని సభ్యులుగా నియమించారు. ఏఎంఓ, ఏఏఎంఓ (కన్నడ), ఏసీఎంఓ, అలెస్కో పోస్టులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కులం ఆధారంగా ఎంపిక చేయడం విద్యా శాఖను కుదిపేసింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురికి పోస్టులు కట్టబెట్టిన తీరును ప్రస్తావిస్తూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నోటిఫికేషన్లోని గైడ్లెన్స్ పాటించకుండా అర్హత లేని వారికి పోస్టులు కట్టబెట్టడం దుమారం రేపింది. ఈ అక్రమాలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసి ఏడు రోజుల్లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరణ తాడిపత్రి టౌన్: స్థానిక డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన కంబన్న దృష్టిని ఏమార్చి అతని ఏటీఎం కార్డు నుంచి ఓ దుండగుడు నగదు అపహరించాడు. బుధవారం తాడిపత్రిలోని షాదీఖానా ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగదు డ్రా చేసుకునేందుకు కంబన్న వెళ్లిన సమయంలో అక్కడకు చేరుకున్న ఓ యువకుడు మాటలు కలిపి ఏటీఎం కార్డు మార్చి ఇచ్చాడు. అప్పటికే పిన్నంబర్ను గుర్తించిన సదరు యువకుడు... కాసేపటి తర్వాత కంబన్న ఏటీఎం కార్డు నుంచి రూ.10వేలు డ్రా చేసుకున్నాడు. వెంటనే కంబన్న మొబైల్కు మెసేజ్ వెళ్లడంతో తన వద్ద ఏటీఎం కార్డును ఆయన పరిశీలించి, అది తనది కాదని నిర్ధారించుకున్నాడు. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాలీబాల్ విన్నర్స్ అనంతపురం, పెనుకొండఅనంతపురం కార్పొరేషన్: నగరంలోని కొత్తూరు జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో బాలుర విభాగం విజేతగా అనంతపురం, బాలికల విభాగం విజేతగా పెనుకొండ జట్లు నిలిచాయి. ఉమ్మడి జిల్లాలోని ఏడు డివిజన్ల నుంచి బాలబాలికల జట్లు తలపడ్డాయి. అండర్ –17 బాలుర విభాగంలో కళ్యాణదుర్గం జట్టుపై 29 – 19 పాయింట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో గుంతకల్లు డివిజన్ జట్టుపై పెనుకొండ డివిజన్ జట్టు విజయం సాధించింది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు డీఈఓ ప్రసాదబాబు, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. బాలుర జట్టులో భానుతేజ, మంజునాథ్, గోవర్ధన్, లక్ష్మి, ప్రసన్న కుమార్, వరుణ్కుమార్, అభి, భరత్కుమార్, చరణ్యాదవ్, గణేష్, ఈశ్వర్, ఉదయ్కిరణ్, ముస్కిన్ ఉన్నారు. అలాగే బాలికల జట్టులో అక్షర, లక్ష్మీప్రియ, తుషిత, గుణప్రవళిక, అరుంధతి, కుసుమ, జ్యోతి, నవిత, మానస, నిఖిల, సాయిదర్శని, శృతికీర్తన చోటు దక్కించుకున్నారు. -
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
అనంతపురం అర్బన్: ‘‘వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలి. నూతన సాంకేతిక పద్ధతులు, పథకాలు, కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆత్మ’ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకు కచ్చితంగా అందాలన్నారు. ప్రస్తుతం యూరియా నిల్వలకు ఇబ్బంది లేదని, భవిష్యత్తులోనూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మండల వ్యవసాయ అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ–పంట నమోదు గడువులోగా పూర్తవ్వాలని చెప్పారు.అనంత హార్టీకల్చర్ కాంక్లేవ్లో ఎంఓయూ చేసుకున్న కంపెనీలు ఆ మేరకు పనిచేసేలా చూడాలన్నారు. ‘నేషనల్ బ్యాంబూ మిషన్’ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలన్నారు.లైవ్ స్టాక్ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని 163 ఎఫ్పీఓల టర్నోవర్ రూ. 3 కోట్ల మేర జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధి కారి ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ అఽధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ‘ఆత్మ’ పీడీ పద్మలత తదితరులు పాల్గొన్నారు. ‘అమృత్’ వేగవంతం చేయాలి పట్టణాల్లో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు నెలల వ్యవధిలో 30 వేల ఇళ్లలో హోమ్ కంపోస్ట్, రూఫ్ గార్డెన్ ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మునిసిపాలిటీలు తమ పనితీరు మెరుగుపర్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అమృత్ పనులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, పన్ను వసూళ్లు, టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు, మెప్మా పథకాల అమలుపై జిల్లాలోని మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తాడిపత్రిలో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గుత్తిలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిల్పారామంలో ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్ గదులను ఆసక్తి ఉన్న స్వయం సహాయక బృందాలకు కేటాయించాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకు ప్రస్తుతం వారు ఉన్న చిరునామా మార్పునకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హోమ్ కంపోస్ట్, రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెండు నెలల్లో 30 వేల ఇళ్లలో హోమ్ కంపోస్ట్, రూఫ్ గార్డ్డెన్లు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మునిసిపల్ ఆర్డీ నాగరాజు, నగరపాలక కమిషనర్ బాలస్వామి, మెప్మా పీడీ విశ్వజ్యోతి, కమిషనర్లు శివరామకృష్ణ, వంశీకృష్ణ భార్గవ్, దివాకర్రెడ్డి, టీఈలు వాసుదేవరెడ్డి, భవాని, అర్షత్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
మూడో పట్టణ సీఐగా రాజేంద్రనాథ్యాదవ్
● సస్పెండ్ అయిన నెలల వ్యవధిలోనే పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు అనంతపురం సెంట్రల్: నగరంలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్ సీఐగా రాజేంద్రనాథ్ యాదవ్ నియమితులైనట్లు తెలిసింది. సస్పెండ్ అయిన నెలల వ్యవధిలోనే పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇటీవల నగరంలో రామకృష్ణ కాలనీకి చెందిన యువతి ఎరికల తన్మయికి ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి కూడేరు మండలం గొటుకూరు సమీపంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.ముందురోజు బాధిత తల్లిదండ్రు లు వన్టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదు.ఈ క్రమంలో మరుసటి రోజే యువతి శవమై కనిపించడంతో ఉన్నతాధికారులు రాజేంద్రనాథ్ను సస్పెండ్ చేశారు. అయితే, ఐదు నెలలు తిరగకనే త్రీటౌన్ సీఐగా నియమితులు కావడం గమనార్హం. గతంలో టీడీపీ హయాంలో ఇటుకలపల్లి సీఐగా రాజేంద్రనాథ్ పనిచేశారు. ప్రసన్నాయపల్లి ప్రసాద్రెడ్డి, కందుకూరు శివారెడ్డి హత్యల విషయంలో ఈయన వ్యవహార శైలి అప్పట్లో వివాదాస్పదమైంది. -
దేశంలో ఎక్కడా చూడని అతి పెద్ద భూకబ్జా
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమక్షంలో దేశంలో ఎక్కడా, ఎప్పుడూ చూడని అతిపెద్ద భూకబ్జా అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాపంపేటలో 930 ఎకరాలను కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. 1908లో ఇచ్చిన శోత్రియం డాక్యుమెంట్లను అడ్డుపెట్టుకుని ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించారు. ఇలాగైతే 1928లో డైక్లాయిడ్లో మా పూర్వీకుల పేర్లు కల్గిన భూములను మాకు రిజిస్టర్ చేస్తే 2 వేల ఎకరాలకు పైగానే వస్తాయని, అధికారులు రిజిస్టర్ చేస్తారా? అని ప్రశ్నించారు. పరిటాల బంధువుల పేరిట జీపీఏ పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత శోత్రియందారుల వారసులు ఆమె బంధువుల పేరిట 3.5 ఎకరాల రిజిస్ట్రేషన్ జీపీఏ,290 ఎకరాలకు పెండింగ్ రిజిస్ట్రేషన్ జీపీఏ చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడ పరిటాల సమీప బంధువు శ్రీరాములు బోర్డులు నాటారన్నారు. తాను ప్రెస్మీట్ పెట్టి, కలెక్టర్ను కలిసి విన్నవించిన తర్వాత బోర్డులన్నీ తొలగించారన్నారు. రెగ్యులరైజ్ చేసుకోవాలంటూ ఇప్పటికే 10 సెంట్ల యజమానితో రూ. 30 లక్షలు తీసుకున్నారన్నారు. మరో 19 సెంట్ల యజమానితో మంతనాలు సాగిస్తున్నారన్నారు. ఈ డబ్బంతా పరిటాల సునీత కుమారుడు సిద్దార్థ్కు వెళ్తోందన్నారు. సునీత తన పెద్ద కొడుకుకు ధర్మవరం, చిన్న కొడుకుకు అనంతపురం రూరల్ మండలం అప్పగించిందన్నారు. అక్కడ ఆయన రూ. 500 కోట్లు, ఇక్కడ ఈయన రూ. 500 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారని ఆరోపించారు. ‘ఈనాడు’తో కలిసి కుట్ర పాపంపేట బాధితుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈనాడు పత్రికతో కలిసి కుట్ర పన్నారని ప్రకాష్రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే ఖాళీ స్థలాలు మాత్రమే అప్పగించాలంటూ శోత్రియందారుల వారసులు అడుగుతున్నట్లు ‘ఈనాడు’ పత్రిక రాసిందని, ఇలా విభజించు–పాలించు అనే కుట్ర అమలు చేస్తున్నారని చెప్పారు. 6 వేలమంది ఉద్యమబాట పట్టకుండా విభజించే ప్రయత్నాలకు తెరలేపార న్నారు. మండల సర్వేయర్, వీఆర్ఓ 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. దీనిపై కొందరు ఆర్టీఐ కింద కోరగా వీఆర్ఓ సంతకం ఫోర్జరీ అని తేలిందన్నారు. తప్పుడు పత్రాలతో జీపీఏ చేయించినవారు, చేయించుకున్నవారు కలెక్టర్తో గ్రూపు ఫొటో తీసుకున్నారన్నారు. సమస్యపై తాను బాధితులతో పాటు కలెక్టర్ను కలిశానని, ఆధారాలతో వివరిస్తా.. 15 నివషాలు గడువు కావాలని కోరినా స్పందించలేదన్నారు. అప్పట్లోనే రూ.7 కోట్ల వసూళ్లు 2017లో జీపీఏను అడ్డుపెట్టుకునే అదే ప్రాంతంలోని విద్యారణ్యనగర్లో 600 ఇళ్ల యజమానుల నుంచి రూ. 7 కోట్ల దాకా పరిటాల కుటుంబం వసూలు చేసిందన్నారు. పైగా అక్కడ పరిటాల రవీంద్ర నగర్ అని బోర్డు కూడా ఏర్పాటు చేశారని, ఇప్పటికీ ఆ ఇళ్లకు చట్టబద్ధత లేదని చెప్పారు. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకుని సరిదిద్దా లని సూచించారు. తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత అంటే సరిపోదని, అలాంటప్పుడు జీపీఏలు రద్దు చేయమని అధికారులను కోరాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కలెక్టర్, ప్రభుత్వం చొరవ తీసుకుని రిజిస్ట్రేషన్ రద్దు చేయించకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 15 వేల కుటుంబాలతో కలిసి రోడ్లపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బండి వపన్, నాయకులు భోగే గోపాల్రెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి, భాస్కర్రెడ్డి, మఠం శ్యాంసుందర్, ఈశ్వరయ్య, నీరుగంటి నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, సందీప్యాదవ్, నాయకులు ఆకుల మునిశంకరయ్య, గోపాల్రెడ్డి, గోపి, చిరంజీవి పాల్గొన్నారు. పరిటాల కుటుంబం అండతో 930 ఎకరాల కబ్జాకు యత్నం ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ‘ఈనాడు’తో కుట్ర రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
నాడి పట్టే వారేరీ?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యులు వెళ్లి సేవలందించే పరిస్థితి ఉండేది. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో పీహెచ్సీల్లోనే వైద్యులు లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పీహెచ్సీల్లో 90 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఈ ప్రభుత్వం 50 మందిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ప్రజల నాడిపట్టే వైద్యులే కరువయ్యారు. అదేవిధంగా నెలలో ప్రతి గ్రామానికి రెండుసార్లు వెళ్లి సేవలందించే సంచార వైద్య సేవలూ (104) అటకెక్కాయి. ఎంఎల్హెచ్పీ, స్టాఫ్నర్సులే సేవలందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
ఏఎస్పీనే బెదిరిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి?
గుత్తి: ‘తాడిపత్రిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజే పోలీసుల సమక్షంలోనే రేయ్ ఏఎస్పీ.. ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరే వాడి నంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. దీన్ని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకే కాదు.. చివరకు ఐపీఎస్లకూ రక్షణ లేని పరిస్థితి దాపురించిందనిపిస్తోంది. 24 గంటలు గడిచినా డీజీపీ, డీఐజీ, ఎస్పీలు స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ ఏఎస్పీనే లెక్కచేయకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంట’ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం గుత్తిలో పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అనంత’ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పట్ల మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచుతామంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు సీఎం చంద్రబాబు చెప్పారని, అయితే అదే రోజు తాడిపత్రిలో ‘ఒరేయ్ ఏఎస్పీ’ అని టీడీపీ నేత సంబోధిస్తుంటే మీరు ఎలా పోలీసుల గౌరవాన్ని పెంచుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాకుండా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు చీము,నెత్తురు ఉంటే చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వాలన్నారు. ఇలాగే కొనసాగితే సామాన్యులు కూడా పోలీసులను గౌరవించరన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనకు ఎదురు తిరిగినా, ప్రశ్నించినా రైలు పట్టాలపై పడుకోబెడ తానని బెదిరించినా కేసు పెట్టరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు జర్నలిస్టులను సైతం బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు ‘స్థానిక’ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్, అబ్జర్వర్ తిప్పేస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా కష్టపడి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ మోచేతి నీళ్లు గుమ్మనూరు తాగలేదా అని సూటిగా ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బీ, వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, పట్టణ, పార్టీ మండల కన్వీనర్లు మధు,గంగ రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, డాక్టర్ శాంతి ప్రియ, మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్కుమార్ యాదవ్, మాజీ కన్వీనర్లు పీరా, గోవర్దన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ విభాగం సంయుక్త కార్యదర్శి సీవీ రంగారెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, నాయకురాళ్లు శ్రీదేవి, కళ్యాణి, భాగ్యమ్మ, లక్ష్మిదేవి, డాక్టర్ శాంతి ప్రియ, సుగుణమ్మ, కౌన్సిలర్లు వాల్మీకి శివ, కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వైవీఆర్, బోయ తిప్పేస్వామి, కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు డీజీపీ, డీఐజీ, ఎస్పీల చేతగాని తనంతోనే ఈ దుస్థితి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
రాత్రి 7 గంటలైతే మూతే!
● పెద్దపప్పూరు పీహెచ్సీలో దుస్థితి పెద్దపప్పూరు: ఆ ఆసుపత్రికి రోగులు వెళ్లినా వైద్యాధికారులు ఉండరు. పేరుకే 24 గంటల ఆసుపత్రి.. కానీ రాత్రి 7 గంటలకే మూతపడుతోంది. పెద్దపప్పూరు పీహెచ్సీలో వైద్య సేవలు పొందడం రోగులకు గగనమైపోయింది. ఆసుపత్రికి ఇద్దరు వైద్యులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం ఒక్కరినే కేటాయించింది. ఆమె కూడా ఇటీవల సమ్మె బాట పట్టడం గమనార్హం. ఇక.. ఆస్పత్రిలో ఇద్దరు స్టాఫ్నర్సులు ఉన్నా వారు ఎప్పుడొస్తారో ఎప్పుడెళ్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఆస్పత్రికి ఫార్మసిస్టును కూడా ప్రభుత్వం నియమించలేదు. ఈ క్రమంలో రోగులు చేసేదేమీ లేక ఆర్ఎంపీల వద్దకు క్యూ కడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్యాధికారులు స్పందించి పెద్దపప్పూరు పీహెచ్సీపై దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి అనంతపురం మెడికల్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, పీహెచ్సీలకు వచ్చే వైద్యులకు మెరుగైన సేవలందించాలని వైద్యులను డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీహెచ్సీల్లో రోగులకందుతున్న సేవలపై డీఎంహెచ్ఓ సమీక్షించారు. వర్షాకాలంలో రోగాలు ప్రబలే అవకాశం అధికంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించిన ఎస్పీ
అనంతపురం:: తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్గా స్పందించారు. జేసీ వ్యాఖ్యలను ఖండించిన ఎస్పీ... ఆ వ్యాఖ్యలు ఐపీఎస్ అధికారిని భయపెట్టేలా ఉన్నాయన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి వద్ద ఉన్న తుపాకుల లైసెన్స్ రద్దు చేసే అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పాలి కానీ, కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. ‘‘తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా.. నీకు బుద్ధి, జ్ఞానం లేవు. ఏఎస్పీ రంజిత్ ఓ పనికిమాలిన వాడు.. వేస్ట్ ఫేలో.. గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు’’ అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. -
అంబరం.. దీపావళి సంబరం
ప్రతి లోగిలి దీపకాంతులతో తేజోమయంగా మారింది. పటాసుల మోతతో పల్లె, పట్నం తేడా లేకుండా గర్జించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల దీపావళి పండుగ సంబరం అంబరాన్నంటింది. వాడవాడలా కాంతులు వెదజల్లాయి. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలు బాణాసంచా పేలుస్తూ ఆనందంలో మునిగితేలారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు ఇళ్లలో లక్ష్మీ పూజ చేసుకున్నారు. సాయంత్రం వేళ ఇంటి ముంగిళ్లను అందంగా అలంకరించి దీపాలు వెలిగించారు. – అనంతపురం కల్చరల్: -
అమరు వీరుల త్యాగాలే స్ఫూర్తి
అనంతపురం సెంట్రల్: విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని పోలీసు కార్యాలయ ఆవరణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఐజీతో పాటు కలెక్టర్ ఏ. ఆనంద్, ఎస్పీ పి. జగదీష్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథులుగా హాజరై సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ షిమోషి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు 24 గంటలూ పోలీసులు శ్రమిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించడం అభినందనీయమని కలెక్టర్, ఎస్పీలను ప్రశంసించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసులు, రెవెన్యూ శాఖలు కీలకమని, ఈ రెండు శాఖలు కలిసి పనిచేస్తేనే శాంతిభద్రతల పరిరక్షణ సులభమవుతుందన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పోలీసు అమరువీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసుల నిబద్ధత, త్యాగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమర వీరుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు పోలీసులకు సహకారం అందించి చట్ట వ్యతిరేక, అసాంఘిక, అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్రహర్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేసులు, రవిబాబు, శ్రీనివాస్, ఎస్.మహబూబ్బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు సాకే త్రిలోక్నాథ్, జాఫర్, సుధాకర్రెడ్డి, హరినాథ్, లక్ష్మీనారాయణ, పలువురు సీఐలు, ఆర్ఐలు, మినిస్టీరియల్ ఉద్యోగులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
రాప్తాడు: విద్యుత్ షాక్కు గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. రాప్తాడులోని ఆటో నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురంలోని ఆజాద్ నగర్లో నివాసముంటున్న షేక్ ఫకృద్ధీన్ (55)కు భార్యతో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో నగర్లో వెడ్డింగ్, డ్రిల్లింగ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆటోనగర్లోని సాయిరంగా ఏజెన్సీస్ నిర్వహిస్తున్న 21వ షాపు వర్షానికి కారుతుండడంతో పైన రేకులు వేసే పనిని ఫకృద్ధీన్కు యజమాని గంగాధర్ అప్పగించాడు. దీంతో మంగళవారం మరో వ్యక్తి జాఫర్తో కలసి పనిలో నిమగ్నమైన ఫకృద్ధీన్.. రేకులకు డ్రిల్లింగ్ చేస్తుండగా విద్యుత్ ప్రసరించి షాక్కు గురై కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంతకల్లు టౌన్: పట్టణంలోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న ముల్లా షెక్షావలి (28) విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న షెక్షావలికి ఏడాదిన్నర క్రితం ఆదోనికి చెందిన ఫరీదాతో వివాహమైంది. మంగళవారం సాయంత్రం గేదెల కోసమని తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చుట్టూ బండలు పాతి, రేకులు బిగించేందుకు ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రాలు వేస్తున్న సమయంలో షాక్కు గురై షెడ్డుపై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మనోహర్ తెలిపారు. రెండిళ్లలో చోరీ గుమ్మఘట్ట: మండలంలోని గోనబావి క్రాస్లో నివాసముంటున్న మారెప్ప, చౌడప్ప ఇళ్లలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కూలి పనుల కోసం ఇళ్లకు తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు మారెప్ప, మైసూరుకు చౌడప్ప వలస వెళ్లారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. మంగళవారం ఉదయం విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటి యజమానులకు సమాచారం అందించారు. మారెప్ప ఇంట్లో 3 తులాల బంగారు ఆభరణాలు, చౌడప్ప ఇంట్లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లుపోలీసులు పేర్కొన్నారు. -
గుత్తిలో కల్తీ పెట్రోల్ కలకలం
● పోలీసులు, రెవెన్యూ అధికారులకు బాధితుడి ఫిర్యాదు గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలోని పరమేశ్వరయ్య పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని గుత్తికి చెందిన యువకుడు చంద్రశేఖర్ ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు.. మంగళవారం ఉదయం చంద్రశేఖర్ రూ.100 విలువైన పెట్రోలును ఓ బాటిల్లో పోయించుకున్నాడు. అయితే పెట్రోల్ నాణ్యతలో తేడాను గమనించిన అతను వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సురేష్, డీటీ సూర్యనారాయణ, సీఎస్డీటీ ప్రవీణ్కుమార్, వీఆర్వో సుధాకర్ రెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని పెట్రోల్ను పరిశీలించారు. నాలుగు బాటిళ్లలో సేకరించిన సాంపిల్స్తో పాటు చంద్రశేఖర్ వద్ద ఉన్న బాటిల్ పెట్రోల్ను సీజ్ చేసి అనంతపురంలోని ల్యాబ్కు పంపారు. ఘటనపై సీఎస్డీటీ ప్రవీణ్కుమార్, డీటీ సూర్యనారాయణ మాట్లాడుతూ... పెట్రోల్లో నాణ్యతను గుర్తించేందుకు సాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే కల్తీ పెట్రోల్ ఘటనపై సుమారు రెండు గంటల పాటు వివాదం నెలకొంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు రెండు సార్లు పెట్రోల్ బంక్కు వచ్చారు. బాధితున్ని, పెట్రోల్ బంక్ సిబ్బందిని విచారించారు. ఎలాంటి కల్తీ పెట్రోల్ అమ్మడం లేదని నిర్వాహకులు తెలిపారు. -
రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అనంతపురం కేంద్రంగా నవంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. క్రీడల నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలని సూచించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతి ఉత్సవాలు ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. ఆయా శాఖల ఉమ్మడి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రోటోకాల్పై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు రాయలసీమ వంటకాల రుచి చూపాలన్నారు. క్రీడలు విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, మహేష, వీవీఎస్శర్మ, సువర్ణ, ఆనంద్కుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్రావు, సోమశేఖర్, పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్లు హరికుమార్, మోహన్రావు, బాలకిషన్ పాల్గొన్నారు. 31న యూనిటీ మార్చ్ అనంతపురం అర్బన్: జిల్లాకేంద్రంలో ఈ నెల 31 నిర్వహించనున్న సర్దార్@150 యూనిటీ మార్చ్ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో యూనిటీ మార్చ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని యూనిటీ మార్చ్తో పాటు ఏక్భారత్ ఆత్మ నిర్వర్ భారత్ పాదయాత్ర నిర్వహించనున్నామన్నారు. యువత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మై భారత్ ప్రోగ్రాం ఇన్చార్జ్ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహితలు బిసాటి జీవన్కుమార్, కె.జయమారుతి, యెగా మాస్టర్ మహేష్బాబు పాల్గొన్నారు. 5 వేల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు అనంతపురం అర్బన్: ‘‘కంబదూరు మండలంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాకు అవసరమైన 5,276.81 ఎకరాల భూమిని గుర్తించాం. ఇందులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్రాజెక్టుకు భూ సేకరణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు 5,276.81 ఎకరాలు అవసరం కాగా 4,292.28 ఎకరాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. వీటికి సంబంధించి లీజు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పారు. మిగిలిన 984.53 ఎకరాలు గుర్తింపునకు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సమస్యలు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని సూచించారు. సమస్యల రాకుండా రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా భూములు గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, ఏపీఎస్జీఈఎల్ అభివృద్ధి అధికారి కిషోర్రెడ్డి, ఎల్డీఎం నరేష్రెడ్డి, కంబదూరు తహసీల్దారు బాలకిషన్, ఎన్టీపీసీ అధికారులు శివకుమార్, వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధిమాంద్యం పిల్లల్లో దీపావళి వెలుగులు
కణేకల్లు: మండలంలోని కణేకల్లుక్రాస్లో ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో ఉన్న బుద్ధిమాంద్యం, మానసిక వికలాంగుల పాఠశాలలోని 150 మంది చిన్నారులతో కలసి దీపావళి సంబరాలను పోలీసులు నిర్వహించారు. ఆర్డీటీ అధికారుల అనుమతిలో సోమవారం రాత్రి రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు, ప్రొబేషనరీ ఎస్ఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని తొలుత విందు భోజనం ఏర్పాటు చేయించారు. అనంతరం వెంట తీసుకెళ్లిన క్రాకర్స్ను కాల్పించారు. వేడుకల్లో ఆర్డీటీ ఆస్పత్రి ఇన్చార్జ్ దుర్గేష్, మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు. అనాధ బాలికలతో దీపావళి అనంతపురం సెంట్రల్: నగరంలోని కోవూరునగర్లో క్రీసెంట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెయిన్బో హోంలో నాల్గో పట్టణ సీఐ జగదీష్ దీపావళి సంబరాలను నిర్వహించారు. అనాథ బాలికలతో కలసి బాణాసంచా పేల్చి పండగను ఆనందంగా జరుపుకున్నారు. కణేకల్లులో చిన్నారులతో కలసి క్రాకర్స్ కాల్పిస్తున్న సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగమధు అనంతపురంలో అనాథ బాలికలతో టపాసులు కాల్పిస్తున్న అనంత నాల్గో పట్టణ సీఐ జగదీష్ -
ఘనంగా బాబా అవతార ప్రకటన దినోత్సవం
ఉరవకొండ: సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని సోమవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. ఉదయం సత్యసాయి అవతార ప్రకటన చేసిన రాతి గుండు వద్ద నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి చిత్రపటాన్ని ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సత్యసాయి సేవా సమితి అధ్వర్యంలో భక్తులకు అన్నదానం, వస్ర వితరణ చేశారు. పీఏబీఆర్లో కొనసాగుతున్న మరమ్మతులు కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) జలవిద్యుత్ ఉత్పత్తి కేందంలో గేట్ లింక్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంగళవారం చేపట్టిన పనులను ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 9 రోజుల క్రితం గేట్ లింక్ దెబ్బ తినడంతో జల విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం లింక్ ఛానెల్ ద్వారా 40 క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 60 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందన్నారు. అలాగే తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 25, కుడి కాలువకు లీకేజీ 35, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద లీకేజీ 130 క్యూసెక్కుల చొప్పున అవుట్ ఫ్లో ఉందన్నారు. డ్యాంలో ప్రస్తుతం 5.386 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కసాపురంలో ఘనంగా లక్ష్మీపూజ గుంతకల్లు రూరల్: దీపావళి సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం లక్ష్మీపూజను ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖ మంటపంలో సీతాదేవి అమ్మవారిని ధనలక్ష్మీగా కొలువుదీర్చి పూజించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ముగ్గురు డాక్టర్లకు ‘షోకాజ్’ గుత్తి: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యల్లప్ప మంగళవారం వెల్లడించారు. ఎలాంటి అనుమతి లేకుండా సోమవారం డాక్టర్లు పవిత్ర, రమ్యశ్రీ, రాజేష్ సెలవులో వెళ్లారని, దీంతో వైద్య సేవలకు అంతరాయం కలిగినట్లు వివరించారు. అనుమతి లేకుండా సెలవులో వెళ్లినందుకు వారి మెయిల్, వాట్సాప్ నంబర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
గొడ్డలితో నరికి...
● భర్త చేతిలో హత్యకు గురైన వివాహిత డి.హీరేహాళ్(రాయదుర్గం): కట్టుకున్న ఇల్లాలిపై అనుమానం పెంచుకున్న భర్త ఉన్మాదిగా మారి ఆమెను హతమార్చిన ఘటన డి.హీరేహాళ్ మండలం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన నాగమణి (36)కి 18 ఏళ్ల క్రితం డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామానికి చెందిన హనుమంతరాయుడుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇటీవల హనుమంతరాయుడు మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో అకారణంగా భార్యను తరచూ వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. దీపావళి పండుగ పూట మద్యం తాగేందుకు డబ్బు కావాలని భార్యను అడిగాడు. ఆ సమయంలో తన వద్ద డబ్బు లేదని ఆమె తెలపడంతో సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య మెడపై గొడ్డలితో నరికాడు. ఘటనతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
భూ పరిహారంలో అన్యాయం
తాడిపత్రి రూరల్: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన తమకు తక్కువ పరిహారం నిర్ణయించడం సమంజసం కాదని, తక్షణమే పరిహారాన్ని మరింత పెంచాలంటూ ఆర్టీఓ కేశవనాయుడుకు పలువురు రైతులు విన్నవించారు. తాడిపత్రి – పుట్లూరు మార్గంలో రైల్వే బ్రిడ్జి ఏర్పాటుకు 3.79 ఎకరాల భూసేకరణ అంశంపై గన్నెవారిపల్లి సచివాలయం–3లో మంగళవారం రైతులతో తహసీల్దార్ సోమశేఖర్తో కలసి ఆర్డీఓ సమావేశమయ్యారు. రైతు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం నిర్ణయించకుండా వ్యవసాయ భూమి పేరుతో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. వ్యవసాయ భూమిని కమర్షియల్గా కన్వర్షన్ చేసుకోనంత మాత్రాన రైతులకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. భూసేకరణలో నిర్ణయించిన ఽపరిహారం మొత్తం ఏ రైతుకూ ఇష్టం లేదన్నారు. పరిహారం ధర పెంచేలా చర్యలు తీసుకోవాలని మరో రైతు శ్రీధర్నాయుడు సూచించారు. ఆర్డీఓ కేశవనాయుడు మాట్లాడుతూ.. పరిహారం తక్కువగా నిర్ణయించారని కోర్టుకు వెళ్లడం వల్ల పనులు నిలిచిపోవని, ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి ఎలాంటి అడ్డంకులు సృష్టించాలన్నా ప్రయోజనం ఉండదన్నారు. భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.38లక్షలు నిర్ణయించామని, ఈ ధర ప్రకారం రైతులు అమోదం తెలిపితే పరిహారం అందజేస్తామని, తిరస్కరిస్తే వారి మొత్తం కోర్టులో డిపాజిట్ చేసి పనులు చేపడతామని హెచ్చరించారు. -
ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
● కూటమి పాలనంతా దోపిడీ మయం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ● మాజీ ఎమ్మెల్యే వైవీఆర్తో కలిసి పామిడిలో ‘కోటి సంతకాల సేకరణ ’పామిడి: కూటమి ప్రభుత్వ మోసపూరిత, అవినీతి పాలనపై అలుపెరుగని పోరాటాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పనిచేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం స్థానిక కోటవీధిలోని తలవాలకట్ట వద్ద గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి కోటి సంతకాల సేకరణతో పాటు అనుబంధ విభాగాల కమిటీ నియామకాలకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ‘అనంత’తో పాటు వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, పార్లమెంటు పర్యవేక్షకులు నరేష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రూ.8 వేల కోట్లతో 17 మెడికల్ కళాశాల నిర్మాణాలను ప్రారంభించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి కోట్ల రూపాయలను దోచుకోవాలని చూస్తున్నారన్నారు. మెడిసిన్ విద్యను పేద విద్యార్థులకు అందని ద్రాక్ష చేసి పేదల జీవితాలను చీకటిమయం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఉద్యమాలు చేసి కూటమి ప్రభుత్వ మెడలు వచ్చి ఇప్పటికే అన్నదాత సుఖీభవ, ఫీజు రీయింబర్స్మెంట్ సాధించామని గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాజాగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే రథ సారథులన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్వయంగా అధినేత వైఎస్ జగన్ తెలిపారని గుర్తు చేశారు. కార్యకర్తలకు ఏ కష్టమెచ్చినా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. విద్య, వైద్య రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తే.. కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో వాటిని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. జగన్ను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం, మెడికల్ కాలేజ్ల పెంపు, ప్రజా సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్రెడ్డి, ఆర్గనైజింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, పట్టణ, రూరల్ కన్వీనర్లు నాగూరు ఈశ్వర్రెడ్డి, రమావత్ రామకృష్ణ నాయక్, ఓసీ మహిళా విభాగం డైరెక్టర్ కుమ్మెత లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు బోయ రామచంద్ర, అనుంపల్లి సూరి, ఆర్సీ వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు బీ. ఆసిఫ్, రజాక్, ఆదామ్, పీ. అనిల్కుమార్రాజా, బొల్లు వెంకట్రామిరెడ్డి, ఎన్. హరినాథ్రెడ్డి, చాకలి సుంకన్న, శివ, రాజు, ఓబులేసు, సర్పంచ్ నారాయణస్వామి, రామకృష్ణారెడ్డి, బయపరెడ్డి, జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడికి గాయాలు
గుత్తి: కదులుతున్న రైలు నుంచి దిగబోతూ ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన వీరేష్ రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లాడు. సోమవారం సాయంత్రం తిరుపతిలో రైలు ఎక్కి మంగళవారం వేకువజాము 2.30 గంటలకు తాను దిగాల్సిన గుత్తికి చేరుకున్నారు. అయితే నిద్రమత్తులో గుత్తికి రైలు చేరుకున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. పక్కన ఉన్న వారు నిద్ర లేపడంతో అప్పటికే కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టు తప్పి రైలు కిందపడడంతో ఒక కాలు నుజ్జునుజ్జయింది. రైల్వే పోలీసులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సబబు కాదు ● మాజీ విప్ వెన్నపూస గోపాలరెడ్డి అనంతపురం: ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సబబు కాదని కూటమి ప్రభుత్వానికి శాసనమండలి మాజీ విప్ వెన్నపూస గోపాలరెడ్డి హితవు పలికారు. వైద్య కళాశాల ప్రైవేటీ కరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటిసంతకాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన సంతకం చేసి, మాట్లాడారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ, నాయకులు ప్రభాకర్, ఆదినారాయణ చౌదరి, మాజీ ఎన్జీఓ నాయకులు ఓబుళరావు, కొండారెడ్డి, శ్రీనివాసరెడ్డి, హరినాథరెడ్డి, ప్రకాష్, విశ్వేశ్వరరెడ్డి, చెన్నకేశవులు పాల్గొన్నారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసంది. గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
సత్యసాయి నామం.. దివ్య చరితం ● ఘనంగా సత్యసాయిబాబా అవతార ప్రకటన దినోత్సవం ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా అవతార ప్రకటన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు యజుర్ మందిరం నుంచి నాదస్వరంతో వేదమంత్రోచ్ఛారణలతో ర్యాలీగా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సంగీత విభావరి నిర్వహించారు. ‘సాక్షాత్ పరబ్రహ్మసాయి’ పేరుతో సత్యసాయి పూర్వ విద్యార్థులు చర్చలు నిర్వహించారు. సత్యసాయి తత్వాన్ని చక్కగా వివరించారు. సాయంత్రం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ‘శతనాద నీరాజనం’ పేరుతో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం నిర్వహించారు. 100 మంది సంగీత విద్వాంసులు, 75 మంది సంగీత వాయిద్యకారులు, 25 మంది సంగీతకారులతో కలసి సంగీత విభావరి సాగింది. భారతీయ, పాశ్చాత్య సంగీత రీతులలో వారు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మైమరపించింది. సందడిగా దీపావళి వేడుకలు ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు సండిగా సాగాయి. సోమవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకరరాజు ప్రమిదలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఆయన మిరుమిట్లు గొలిపే బాణసంచా పేల్చారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, ట్రస్ట్ ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు. -
అధికారం మనదే.. 'ఆడుకోండి'
‘‘రండి బాబూ రండి! కడప, కర్నూలు, మహబూబ్నగర్, గద్వాల, కర్ణాటక, తెలంగాణ, ఊరు ఏదైనా పర్వాలేదు. మా ఊరికి రండి! హాయిగా పేకాట ఆడండి! మస్తుగా ఎంజాయ్ చేయండి! పేకాట ఆడేందుకు ఇక మీరు రాయచూరు, బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింది! పేకాటకు ఇబ్బందే లేదు. మళ్లీ మనకు మంచి రోజులు వచ్చాయి. మీకు అన్ని మర్యాదలు చేస్తాం!’’ అంటూ పేకాట రాయుళ్లకు నిర్వాహకులు స్వాగతం పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పేకాట నిర్వాహకులు యథేచ్ఛగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దీన్ని ఆదాయ మార్గంగా ఎంచుకుంటే, కొందరు పోలీసులు పోస్టింగ్తో పాటు డబ్బులు వస్తాయనే ఆశతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పేకాటకు మార్గం సుగమమైంది. సర్కారు ఏర్పడిన కొత్తలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా పేకాట ఆడించేలా చూస్తా అని ‘ఆఫీసర్ క్లబ్’లో వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి పేకాట ఆడించి, డబ్బులు దండుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బరితెగించారో ఇట్టే తెలుస్తోంది! ఉమ్మడి ‘అనంత’లో స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సులు, కొందరు పోలీసుల సహకారంతో ఆటాడిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులకు నెలవారీ మామూళ్లు నిర్ణయించి పేకాట నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని చూసి కొందరు పోలీసులు పట్టుబట్టి మరీ ‘పేకాట’ పరిధిలోని స్టేషన్లకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసుకోండని వారి అనుచరులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జోరుగా.. » తాడిపత్రిలోని పాతమార్కెట్లో ఓ తెలుగు యువత నాయకుడి ఆధ్వర్యంలో క్లబ్ నడుస్తోంది. చుక్కలూరులో సుంకులమ్మ పాలెంకు చెందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ఆటాడిస్తు న్నారు. ఓ మాజీ సర్పంచ్ తమ్ముడి ఆధ్వర్యంలో గన్నేవారిపల్లి కాలనీలో పేకాట నిర్వహిస్తున్నారు. » ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. మైలారం పల్లిలో ‘అందర్ –బాహర్’ నిర్వహిస్తున్నారు. కడప, పొద్దుటూరు, బళ్లారి, గుంతకల్లుతో పాటు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు. ఒక్కొక్కరితో రూ.5 వేలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. కూడేరు మండలంలో పోలీసుల కనుసన్నల్లోనే విచ్చలవిడిగా పేకాట నడుస్తోంది. » శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం మల్లాగుండ్లతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో పేకాట నడుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత కనుసన్నల్లో పేకాట ఆడిస్తున్నారు. » కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, బ్రహ్మసముద్రం,శెట్టూరు,కుందురి్పలో పేకాట శిబిరాలకు కర్ణాటక వాసులు కూడా తరలివస్తున్నారు. » హిందూపురం ఇందిరమ్మ కాలనీ, సేవామందిర్ పరిసరాల్లో టీడీపీ నేతలు రోజూ రూ.30 లక్షల వరకూ పేకాట ఆడిస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో కూటమి నేతకు చెందిన తోటలో నిత్యం పేకాట నడుస్తోంది. కగ్గళ్లుకు చెందిన ఓ మాజీ సర్పంచ్ ఈ దందాలో కీలకంగా ఉన్నారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లోనూ విచ్చలవిడిగా పేకాట నడుస్తోంది. » ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో ఆడుతున్నారు. » పుట్టపర్తిలో మొన్నటి వరకూ ఓ పోలీసు అధికారి కనుసన్నల్లోనే విచ్చలవిడిగా పేకాట సాగింది. ఆ అధికారికి నెలకు రూ.30 లక్షలు ఇచ్చేవారంటే ఏ స్థాయిలో నడిచిందో ఇట్టే తెలుస్తోంది. ఆ అధికారి బదిలీ తర్వాత తాత్కాలికంగా ఆట కట్టేశారు. ఇప్పడు తిరిగి ఆడించేందుకు నిర్వాహకులు ప్రయతి్నస్తున్నారు. కళ్లు బైర్లు కమ్మాల్సిందే! పేకాట స్మాల్ స్టేక్ (చిన్నబ్యాంకులు), హైస్టేక్ (పెద్దబ్యాంకులు)..ఇలా రెండు రకాలుగా జరుగు తోంది. స్మాల్స్టేక్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ ఆడతారు. హైస్టేక్లో రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు..ఇలా మూడు రకాలు ఆడతారు. » స్టేక్ ఏదైనా ఒక్కో బ్యాంకుకు 250 పాయింట్లు ఇస్తారు. పేకాట నిర్వాహకుడికి డబ్బులు ఇస్తే వారికి 250 పాయింట్ల లెక్కన కాయిన్లు ఇస్తారు. పేకాట శిబిరం వద్ద డబ్బు కట్టలు ఉండవు. శిబిరానికి వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన కారు వద్దకు వెళ్లి డబ్బులు ఇస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్లు ఇస్తారు. అయితే స్టేక్ను బట్టి పాయింట్ల విలువ మారుతుంది. ఒక్కో పాయింట్ విలువ రూ.50 వేల బ్యాంకు అయితే రూ.200, రూ.లక్షకు రూ.400, రూ. 2లక్షలకు రూ.8 వేలుగా నిర్ణయిస్తారు. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటుంది. » ఒక్కో గేమ్ పది మంది ఆడతారు. కొన్ని సందర్భాల్లో ఏడుగురుంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్లు ఇవ్వాలి. » రూ.50 వేలు బ్యాంకు ఆడేవారు 8 పాయింట్లు, రూ.లక్ష బ్యాంకు ఆడితే 6, రూ.2లక్షలు ఆడితే 4 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన రూ.50 వేలు బ్యాంకు ఒక ఆటకు నిర్వాహకుడికి రూ.1600, రూ.లక్ష బ్యాంకు ఆటకు రూ.2,400, హైస్టేక్ అయిన రూ.2లక్షల బ్యాంకు ఆటకు రూ.32 వేలు వస్తుంది. » ఒక శిబిరంలో రోజూ కనీసం వంద ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన రూ.50 వేలు బ్యాంకు రోజుకు రూ.1.60 లక్షలు, రూ.లక్ష బ్యాంకునకు రూ.2.40లక్షలు, రూ.2లక్షల స్టేక్కు రోజుకు రూ.32 లక్షలు నిర్వాహకుడికి వస్తుంది. » రూ.50వేలు, రూ.లక్ష బ్యాంకులు ఎక్కువగా ఆడతారు. వీరు రోజులో వంద గేమ్లు కచ్చితంగా ఆడతారు. రూ.2లక్షల బ్యాంకు మాత్రం ఆర్థికంగా బలమైన వారు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఆడతారు. ఇవి సగటున రోజుకు 50 గేమ్లు జరుగుతాయని తెలుస్తోంది.పేకాట రాయుళ్లకు ఇస్తున్న సదుపాయాలు ఇలా..పేకాట ఆడేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాటు చేస్తారు. రూ.2 లక్షల బ్యాంకు ఆడేవారికి డబుల్ బ్లాక్, గ్లెన్లివెట్ లాంటి విదేశీమందు ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విమాన టికెట్లు బుక్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని పేకాటకు తీసుకొచ్చేవారికి నెలకు రూ.లక్ష–2 లక్షలు గిఫ్ట్గా ఇస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పేకాట జరిగే ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలకు రూ.10 లక్షలు, పేకాట శిబిరానికి మంత్రి అనుమతిస్తే రూ.25 లక్షలు, స్థానిక పోలీసు స్టేషన్కు, ఆపై అధికారికి కొంత మొత్తం ఖరారు చేసి ప్రతి నెలా పంపిస్తున్నారు. -
‘రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా’.. పోలీసులపై రెచ్చిపోయిన జేసీ
అనంతపురం జిల్లా: తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. ‘‘తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా.. నీకు బుద్ధి, జ్ఞానం లేవు. ఏఎస్పీ రంజిత్ ఓ పనికిమాలిన వాడు.. వేస్ట్ ఫేలో.. గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు’’ అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్రెడ్డి రెండు రోజుల క్రితం కూడా వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి చూశారు.ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. -
చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రజా ఉద్యమం
రాయదుర్గంటౌన్: సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రజా ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ, పంచా యతీ సంస్థాగత కమిటీల ఎంపికపై అవగాహన కార్యక్రమంతోపాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం ‘దుర్గం’లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్రెడ్డి, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త సైనికుడిలా మారాలన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేసేందుకే కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ కమిటీలతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా అండగా నిలవనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలలు పూర్తయి వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తే జగన్కు పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణను నిలుపుదల చేద్దామని పిలుపునిచ్చారు. నకిలీ మద్యానికి ఏపీ అడ్డాగా మారిందన్నారు. బెల్టు దుకాణాలు తెరిచి.. వాటి ద్వారా కల్తీ మద్యాన్ని అమ్ముతూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజగోపాలరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పొరాళ్ల శివకుమార్, పట్టణ కన్వీ నర్ మేకల శ్రీనివాసులు, మండల కన్వీనర్ రామాంజనేయులు, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, డీ.హీరే హాళ్ కన్వీనర్లు బ్రహ్మానందరెడ్డి, రామాంజనేయులు, గౌని కాంతారెడ్డి, రామాంజనేయులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కార్యకర్తలకు పెద్దపీట వేసేందుకే సంస్థాగత కమిటీలు: మెట్టు -
21 నుంచి పోలీసు అమర వీరుల వారోత్సవాలు
అనంతపురం సెంట్రల్: పోలీసు అమర వీరుల వారోత్సవాలను ఈనెల 21 నుంచి 31 వరకూ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడక్లో చైనాతో జరిగిన యుద్ధంలో అనేక మంది దేశం కోసం అసువులు బాశారని, అమరవీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వారోత్సవాలు ఇలా.. ● 21న స్మృతి పరేడ్, పోలీసు అమరులకు నివాళి. ● 22, 23 తేదీల్లో పోలీసు అమరుల గ్రామాల సందర్శన, అమరుల సేవలపై అవగాహన. ● 24 నుంచి 27 వరకూ చర్చా వేదికలు, వక్తృత్వపు పోటీలు. ● 26న పోలీసు త్యాగాలు, పరాక్రమాలు తెలియజేసే చిత్ర ప్రదర్శన. ● 26 నుంచి 27 వరకూ ఓపెన్హౌస్, విద్యార్థులకు అవగాహన. ● 28న వైద్య శిబిరాలు. ● 29న పోలీసుల త్యాగాలపై సెమినార్లు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ● 30న పోలీసు అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం. ● 31న జిల్లా వ్యాప్తంగా సమైక్యతా దినం ఆచరణ, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ. -
●దివ్వెల కేళి.. వెలుగులు నిండాలి
చీకటిని పారదోలుతూ కొత్త వెలుగులు నింపేందుకు దీపావళి పర్వదినం వచ్చేసింది. సోమవారం పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమైపోయారు. ఆదివారం రాత్రి నుంచే ప్రతి ఇంట్లో సందడి నెలకొంది. దీప కాంతుల వెలుగుల్లో కొత్త శోభ సంతరించుకున్నాయి. దీపావళి పర్వదినాన సాక్షాత్తు మహాలక్ష్మి భూలోకానికి వచ్చి ఇల్లిల్లూ తిరుగుతుందని అందరి నమ్మకం. ఈ క్రమంలో అమ్మవారిని మనసారా కొలిచేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇక.. ఆదివారం జిల్లావ్యాప్తంగా టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్ షాపుల్లోనూ సందడి నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ప్రతి ఇంటా కాంతులు విరియాలి
అనంతపురం: దీపావళి పండుగతో ప్రతి ఇంటా ఆనందాల కాంతులు విరియాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటి అనే చెడును పారదోలే వెలుగు అనే మంచికి సంకేతంగా దీపావళిని జరుపుకుంటామని పేర్కొన్నారు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు వారి దగ్గర ఉండి జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు. కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఓ.ఆనంద్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి అనుగ్రహంతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, అందరి ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. దీపావళిని అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి అనంతపురం టవర్క్లాక్: దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రజలకు ఆదివారం ఆమె పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. -
భాషా పండితుల సమస్యలపై రాజీలేని పోరాటం
● పండిత పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రిస్వామి అనంతపురం సిటీ: రాష్ట్రంలోని భాషా పండితుల సమస్యల పరిష్కారానికి తాను రాజీ లేని పోరాటం సాగిస్తానని పండిత పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రిస్వామి అన్నారు. అనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఎర్రిస్వామి దంపతులను ఆ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పండిత పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2004 నుంచి అనేక పోరాటాలు చేసి భాషా పండితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పని చేసి, భాషల ఉనికికి, తెలుగు సంస్కృతిని కాపాడేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి, ఏపీటీఎఫ్–1938 అసోసియేషన్ అధ్యక్షుడు కులశేఖర్రెడ్డి, పీఆర్టీయూ నుంచి విష్ణువర్ధన్రెడ్డి, ఎస్టీయూ నుంచి రమణారెడ్డి, యూటీఎఫ్–రమణయ్య, పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాసులు, హెడ్మాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో విద్యా వ్యవస్థ ● ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాస్ అనంతపురం సిటీ: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్(ఎన్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్లస్ టూ పాఠశాలల్లో పని చేసిన వారిని తిరిగి అదే పాఠశాలలకు నియమించి విద్యా ప్రమాణాల మెరుగునకు చొరవ తీసుకోవాలన్నారు. రిలీవర్ రాకపోవడంతో చాలా మంది బదిలీ అయిన ఉపాధ్యాయులు పాత పాఠశాలల్లోనే పని చేస్తున్నారన్నారు. వారిని తక్షణమే బదిలీ స్థానాలకు పంపాలన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేసి, బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. అర్హులైన ఎస్జీటీ (పండిట్లు)లకు పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం ఎన్టీఏ జిల్లా తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పతకమూరి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా రవి, ఆర్థిక కార్యదర్శిగా వెంకటేశులు, అదనపు కార్యదర్శిగా వరలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివశంకర్ హాజరయ్యారు. పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం ● మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్ అనంతపురం టవర్క్లాక్: ఐక్య పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం దక్కుతుందని, ఇందుకు సిద్ధం కావాలని మెడికల్, హెల్త్ ఫీల్డ్ స్టాప్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎనుక్నున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బలరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వేమారెడ్డి, ట్రెజరర్గా ధనుంజయ, ఉపాధ్యక్షుడిగా హరికృష్ణ, సహాయ కార్యదర్శిగా నరసింహరావు, సభ్యులుగా నారాయణ స్వామి, కేవీ రమణ, బాలాజీ, జాన్సన్, గణేనాయక్ను ఎంపిక చేశారు. అసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె లక్ష్మన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.రాంకుమార్, రాష్ట్ర నాయకులు బి.వెంకటరమణ, రాఘవేంద్ర, విజయకుమార్ పాల్గొన్నారు. హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ కదిరి టౌన్: ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చిన కేసులో ఆమె కుమారుడితో పాటు కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ నారాయణరెడ్డి ఆదివారం వెల్లడించారు. కదిరిలోని నిజాంవలీ కాలనీలో నివాసముంటున్న షేక్ ఖాశీంబీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాను అడిగిన డబ్బు, ఇంటి పత్రాలు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ నెల 12న ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని కొడుకు బాబాఫకృద్దీన్ కత్తితో పొడిచి హతమార్చి ఉడాయించాడు. ఘటనపై హతురాలి కుమార్తె అమ్మాజాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో బాబాఫకృద్ధీన్, ఆయన రెండో భార్య రసూల్బీని ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
పండగ పూట విషాదం
నల్లమాడ: దీపావళి పండగ పూట సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని గోపేపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నల్లమాడకు చెందిన ఇ.లక్ష్మణ సాయి (19), అరుణ్కుమార్ (19) అక్కడికక్కడే మృతిచెందారు. చారుపల్లి బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, మృతుల సమీప బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుడైన వెంకటనారాయణ కుమారుడు లక్ష్మణ సాయి, కూరగాయల వ్యాపారి కుళ్లాయమ్మ కుమారుడు అరుణ్కుమార్, లేట్ గంగులప్ప కుమారుడు చారుపల్లి బన్నీ ముగ్గురు మంచి స్నేహితులు. స్థానిక గంగా థియేటర్ సమీపంలో ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. లక్ష్మణ సాయి ఇంటర్, అరుణ్కుమార్, బన్నీ పదో తరగతి వరకు చదివి..అనంతరం చదువు మానేశారు. బన్నీ కొన్ని నెలల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలిసింది. లక్ష్మణ సాయి, అరుణ్కుమార్ ఇంటి వద్దనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. చారుపల్లి బన్నీ బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి నల్లమాడలోని షిర్డీ సాయిబాబా గుడి వద్ద ఇతరులు చిన్నమ్మ కథ నాటకం ఏర్పాటు చేశారు. లక్ష్మణ సాయి, అరుణ్కుమార్, చారుపల్లి బన్నీ ముగ్గురూ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు చిన్నమ్మ కథ నాటకాన్ని తిలకించారు. బస్సు ఎక్కిద్దామని బయలుదేరి.. నాటకం నుంచి వచ్చిన తర్వాత.. బన్నీ బెంగళూరు వెళ్లడానికి కదిరిలో బస్సు ఎక్కించడానికి ముగ్గురూ కలిసి ఒకే ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కదిరికి వెళ్లారో లేక ఏదైనా కారణంతో మార్గమధ్యం నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టారో తెలియదు కానీ గోపేపల్లి వద్ద రోడ్డు మలుపులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. లక్ష్మణ సాయి, అరుణ్కుమార్ ఎగిరి సమీపంలోని బండరాళ్ల మీద పడటంతో ఇరువురికీ తల, ఛాతిపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన చారుపల్లి బన్నీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. సీఐ నరేంద్రరెడ్డి తమ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం ఇదేరోజు సాయంత్రం లక్ష్మణ సాయికి నల్లమాడలో, అరుణ్కుమార్కు స్వగ్రామం నల్లసింగయ్యగారిపల్లిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతులిద్దరూ ఏకై క సంతానం కావడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీ ఇద్దరు యువకుల దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు -
సేవ పేరుతో దోపిడీ
భక్తుల సెంటిమెంట్ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొందరు స్వార్థపరులు. సేవ పేరుతో చందాలు వసూలు చేస్తూ అక్రమార్జనకు తెరలేపారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం వేదికగా చేసుకున్నారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉన్నా... పెత్తనం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో భక్తులకు అసౌకర్యాలు తప్పడం లేదు. ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలోనే కాకుండా కర్ణాటకలోనూ భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న ఆత్మకూరు మండలం పంపనూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర ప్రతిష్టను కొందరు స్వార్థపరులు దిగజారుస్తున్నారు. దేవదాయశాఖ పరిధిలోని ఈ ఆలయంలో పెత్తనమంతా ప్రైవేట్ వ్యక్తులదే కావడం గమనార్హం. ప్రతి వారమూ రూ.లక్షల్లో ఆదాయం ఉన్నా... ఆ ఆదాయం ఏమవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒక్కప్పుడు 3.90 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయం.. ప్రస్తుతం 50 సెంట్లకు మించి లేదు. మిగిలిన ప్రదేశంలో అనధికార గోశాల, అన్నదాన కమిటీ అంటూ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. స్వామికి సేవ చేస్తున్నామనే పేరుతో నెలకు రూ. లక్షల్లో దోపిడీ సాగిస్తున్నారు. పెత్తనమంతా వారిదే.. దశాబ్దాలుగా పంపనూరు ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతోంది. ఇదేమని అడిగితే స్వామి వారికి సేవ చేస్తున్నామని చెబుతున్నారు. దేవదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేకుండా ఆలయంలో గోశాల నిర్వహణ, అన్నదానం అంటూ కమిటీలు ఏర్పాటు చేశారు. గోశాలను ఆదినారాయణ నాయుడు, అన్నదాన కమిటీని సత్య రంగయ్య అనధికారికంగా నిర్వహిస్తున్నారు. గోశాలలో ప్రస్తుతం 60 వరకు ఆవులు ఉన్నాయి. ఆలయానికి వచ్చే భక్తులను గోపూజ పేరుతో ఆకర్షిస్తూ మేత, ఇతర పోషణకు రోజుకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక చందాల రూపంలో అయితే 15 రోజులకు రూ.300, 30 రోజులకు రూ.500, 90 రోజులకు రూ.1,200 అంటూ బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. అయితే ఆవులకు మేత, ఇతర పోషణ ఖర్చులు మొత్తం ఆలయ నిర్వహణ ద్వారానే సమకూరుతుండడం గమనార్హం. ఇక అన్నదాన కమిటీకు సంబంధించి ఆలయంలోనే మూడు ప్రదేశాల్లో టేబుళ్లు వేసుకుని చందాలు వసూలు చేస్తున్నారు. ఇందుకు రసీదు కూడా ఇస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎలాంటి ఆడిట్ ఉండదు. భక్తుల సెంటిమెంట్ను తెలివిగా వ్యాపారంగా మార్చి నిలువు దోపిడీ చేస్తున్నారు. రికార్డులంటూ ఏమీ ఉండవు.. అనధికారికంగా నిర్వహిస్తున్న గోశాల, అన్నదాన కమిటీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఉండవు. గోశాల, అన్నదాన కమిటీలకు వారానికి రూ.లక్షల్లోనే ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయానికి సంబంధించి జమాఖర్చులపై నిర్వాహకులు కానీ, దేవదాయ శాఖ ఈఓ కాని సరైన వివరాలు వెల్లడించలేకపోతున్నారు. గోశాల, అన్నదాన కమిటీలకు దాతలు, భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు ప్రస్తుతం ఎంత మేర ఉందో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ అంశంపై ఇటీవల నిర్వాహకులను పంపనూరు గ్రామస్తులు నిలదీశారు. ఆ సమయంలో వారికి సరైన సమాధానాలు ఇవ్వలేక నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈఓ బాబు సైతం స్పందించకుండా ఎండోమెంట్తో అన్నదాన కమిటీ, గోశాలకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకున్నారు. ఈ మొత్తం గోల్మాల్ వ్యవహారాన్ని ఎండోమెంట్ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడం వెనుక మర్మమేమిటో సుబ్రహ్మణ్యేశ్వరుడికే తెలియాలని భక్తులు అంటున్నారు. అక్రమాలు పెచ్చుమీరుతున్నా.. దేవదాయ శాఖ ఈఓ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఇదంతా గమనించిన భక్తులు ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయ ప్రతిష్ట దిగజారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంపనూరు క్షేత్రంలో అక్రమార్కుల దందా భక్తుల సెంటిమెంట్తో వ్యాపారం అనధికారికంగా గోశాల, అన్నదానం నిర్వహణ సేవ పేరుతో రూ. లక్షల్లో వసూళ్లు ఆడిట్ వివరాలు లేవంటున్న ఎండోమెంట్ అధికారులు -
కూటమి అరాచకాలపై పోరుకు సిద్ధంకండి
ఉరవకొండ: కూటమి ప్రభుత్వ అరాచకాలపై పోరుకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ ఉరవకొండ సమన్వయకర్త, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల తరపున పార్టీ గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలు నిర్మాణాత్మకంగా పనిచేయాలన్నారు. ఆదివారం ఉరవకొండలోని వీరశైవ కల్యాణ మంటపంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు తాడిపత్రి రమేష్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి హాజరయ్యారు. విశ్వ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించే వరుకూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు మరింత ఉధృతంగా సాగిద్దామని పిలుపునిచ్చారు. ఏడాదిన్నర పాలనలో ఆరోగ్యశ్రీ పథకానికి సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. 108, 104 గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన పూర్తి అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. రైతాంగ సమస్యలు గాలికొదిలేసి ఎరువులు, విత్తనాలు అందించలేని దౌర్భగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గమంతటా ఉద్యమంలా కొనసాగాలన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 28న ఉరవకొండలో తలపెట్టిన భారీ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలన్నారు. వజ్ర భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక మోసం చేయడమే చంద్రబాబు నైజమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రామ కమిటీలదే కీలక పాత్ర అన్నారు. తాడిపత్రి రమేష్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం కాకుండా కోటి సంతకాల సేకరణతో అడ్డుకుందామన్నారు. పీపీపీ విధానం వల్ల ఒక్కో వైద్య విద్యార్థిపై రూ.5 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు భారం పడుతుందన్నారు. చంద్రబాబు విధానాల కారణంగా భావితరాలకు వైద్య విద్య అందకుండా పోతుందన్నారు. అనంతరం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాయలసీమ జోనల్ చైర్మన్ వై.ప్రణయ్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెస్త రమణ, ఎంపీపీలు కరణం పుష్పవతి, దేవీబాయి, నరసింహులు, నారాయణరెడ్డి, జెడ్పీటీసీలు ఏసీ పార్వతమ్మ, త్రిలోక్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఐదు మండలాల కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు నిర్మాణాత్మకంగా పనిచేయాలి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 28న భారీ నిరసన వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ -
ఫేక్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్కు దరఖాస్తు
● వజ్రకరూరులో వెలుగు చూసిన ఘటన ● డీఆర్వోకు ఫిర్యాదు చేసిన బాధితులు వజ్రకరూరు: ఓ వ్యక్తి తనకు సంబంధం లేని భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న ఘటన వజ్రకరూరు మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు అప్రమత్తమై డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన పుష్పావతి, రవికుమార్, రమేష్బాబు, రాకేష్బాబు తదితరులకు అదే గ్రామంలోని సర్వే నంబర్లు 133, 165, 164–1లో 9.75 ఎకరాల భూమి వారి తాత, ముత్తాలకాలం నుంచి సంక్రమించింది. అయితే తాడిపత్రి నియోజకవర్గంలోని నందలపాడు గ్రామానికి చెందిన రుషింగమయ్య అనే వ్యక్తి ఇందులోని మూడు ఎకరాల భూమిని మ్యుటేషన్ టైటిల్డీడ్ కమ్ పీపీబీ కోసం ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో ఈ నెల 13న వజ్రకరూరు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. ఈ తతంగం గురించి తెలుసుకున్న భూమి యజమానులు వజ్రకరూరుకు చేరుకుని కూపీ లాగారు. తర్వాత డీఆర్ఓను అనంతపురంలో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసిన రుషింగమయ్య, సహకరించిన మీ సేవ నిర్వాహకుడు శ్రీనాథ్గౌడ్లపై విచారణ చేపట్టి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. ఇదిలా ఉండగా జిల్లాలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ అధికారి వాటా్స్ ద్వారా వివరాలు పంపించి, మ్యుటేషన్ చేయాలని ఒత్తిడి చేయడంతో తాను రుషింగమయ్య పేరుతో దరఖాస్తు చేసినట్లు మీ సేవ కేంద్రం నిర్వాహకుడు చెబుతున్నారు. -
మారుతి సుజుకి– నివ్యా ఆటోమొబైల్స్షోరూం ప్రారంభం
అనంతపురం సెంట్రల్: నగర శివారులోని శిల్పారామం వద్ద జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ‘మారుతి సుజుకి అరెనా–నివ్యా ఆటో మొబైల్స్ షోరూం’ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై అలరించారు. సినిమా పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఆమెను చూడటానికి యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మారుతి సుజుకి మిడ్ – ఎస్యూవీ విక్టోరిస్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ మారుతి సుజుకి మొదటి నుంచి ఎంతో నమ్మకమైన బ్రాండ్ అన్నారు. తన ప్రయాణం చిన్నప్పుడు మారుతి 800తో మొదలైందని గుర్తు చేసుకున్నారు. జీవితమనేది చాలా విలువైనదని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ తొలిసారిగా పెట్రోల్ కార్లను మారుతి సంస్థ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. నివ్యా ఆటో మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లు ప్రసాద్రెడ్డి, మల్లు నివేదితా రెడ్డి మాట్లాడుతూ కొత్త అరెనా షోరూమ్లో సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ అన్నీ ఒకేచోట లభిస్తాయని తెలిపారు. నూతన మారుతి సుజుకి విక్టోరిస్ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్, సీఎన్జీ, ఆల్గ్రిప్ వేరియంట్లలో అందుబాటులో ఉందన్నారు. దీని ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. మెరిసిన సినీనటి మీనాక్షి చౌదరి -
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ గూండాగిరి
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
ఉరవకొండలో అమానుషం
అనంతపురం జిల్లా: కుల కట్టుబాటును కాదంటూ వేరే ఊరు అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని నిశ్చితార్థం చేసుకున్నందుకు ఒక కుటుంబాన్ని కులం నుంచి వెలి వేశారు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీకి చెందిన జోగి వెంకటేష్ కుమారుడు జోగి మణికుమార్కు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో వివాహ నిశ్చితార్థం చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి, అబ్బాయి ఉన్నత చదువులు చదువుకోవడంతో వారి భవిష్యత్తు బాగుంటుందని పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీ శివమొగ్గలో ఘనంగా నిశి్చతార్థం చేశారు. ఈ విషయం సంచార జాతుల కులపెద్దలకు తెలియడంతో వారు పంచాయితీ ఏర్పాటుచేశారు. కులస్తులకు కర్ణాటక వారితో ఇప్పటివరకు ఎలాంటి వివాహ సంబంధాల్లేవని, మీరెలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఇందుకు అబ్బాయి తండ్రి వెంకటేష్ స్పందిస్తూ.. సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్నా మీరు కట్టుబాట్లు అంటూ ఇంకా ఎంతకాలం హింసిస్తారని కులపెద్దలను ప్రశి్నంచారు. దీంతో కులపెద్దలు ఆగ్రహిస్తూ ‘మీరు నిశ్చితార్థం తెంచుకుని.. మేం చెప్పిన విధంగా నడుచుకోవాలి. లేదంటే మీ కుటుంబాన్ని 30 ఏళ్ల పాటు కులం నుంచి వెలివేస్తాం. దీంతో పాటు ఉరవకొండ నుంచి నిశ్చితార్థానికి వెళ్లిన వారు ఒక్కొక్కరు రూ.1,200 చొప్పున సంఘానికి రుసుం చెల్లించాలి’.. అని హుకుం జారీచేశారు. కులపెద్దల అనాగరిక ఆచారాన్ని నిరసిస్తూ జోగి వెంకటే‹Ù, కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీపావళి పండుగ తర్వాత కుల పెద్దలకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశముంది. -
హాకీ, బాస్కెట్బాల్ జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్లో అండర్– 14 హాకీ, బాస్కెట్బాల్ జట్లకు క్రీడాకారుల ఎంపిక జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్టేడియంలో శనివారం జరిగాయి. ఎంపికై న జట్లు త్వరలో జరగబోయే అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటాయని కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. హాకీ అండర్– 17 బాలురు: సంతోష్, సాదిక్, కుమార్, బాలరాజు, వెంకటేష్, నవదీప్, విక్రాంత్, ఉదయ్కుమార్, మనోజ్, మేఘనాథ్, పోతులయ్య, బీమా, సాత్విక్, గోవర్ధన్, అశోక్, బాలాజీ, జగదీష్, సాదిక్, రిహాన్. బాలికలు: మిరాంబి, జ్యోతి, దివ్య, నవ్యశ్రీ, శ్రీవల్లి, లాస్యరెడ్డి, ప్రేమలత, మోక్షిత, నందిని, కీర్తన, యశ స్విని, ఉషశ్రీ, అనురాధ, దీపిక, స్వాతి, జగదీశ్వరి, సమీర, మల్లిక. అండర్ – 14 బాలికలు:సనా, గుణశ్రీ, శ్రీరూనికా, శ్రీలేఖ, ఇందు, అర్చన, మాన్య, ప్రియాంక, నాగమణి, మానస, హేమ, హిమబిందు, కావ్యశ్రీ, వర్షిని, మోక్షిత, భానుశ్రీ, స్వాతి, నందలక్ష్మి. బాలురు:వరుణ్, లక్ష్మినారాయణ, శివశంకర్, సునీల్, ఉదయ్కుమార్, బాబాఫరీద్, అభినాష్, మణికుమార్ రాజు, మనోజ్, సాదిక్, జయంత్, పవన్, విక్కీ, అజయ్, నవీన్, రవిజేత, మురళి, భార్గవ్. బాస్కెట్బాల్ అండర్ –17 బాలురు: సాయిసాత్విక్ వర్ధన్, కౌశిక్, లచ్చి, యశ్వంత్, కార్తీక్ నాయక్, సంతోష్, మనీష్, ఉజ్జనేశ్వర్, యేసుర్, భరత్ సింహారెడ్డి, హేమంత్, నవీన్కుమార్ రెడ్డి. బాలికలు:ధన్వి, శ్రావ్య, వాణిశ్రీ, మన్విత, శరణ్య, శ్రావణి, వర్షిని, సంధ్యా, మహిత, రచన, జయలక్ష్మి, ఓం శ్రీజోత్స్న. అండర్ –14 బాలురు: యోగేశ్వర్, మిథిల్, సత్య, షణ్ముక, గౌతమ్, అభిజ్ఞారాం, రాఘవ్, వరుణ్యకుమార్రెడ్డి, ప్రశాంత్, భావిష్రెడ్డి, తరుణ్రాజు, హితేష్చౌదరి. బాలికలు: హర్షిత, సిద్రహ్, పూజిత, అమృత, ప్రియదీప్తి, కారుణ్య, అరీనా, భావన, పల్లవి, ఆఫ్రీన, ప్రజ్వల, సోనాక్షి. -
మార్కెట్యార్డులో ‘తాళ్ల’ పంచాయితీ
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో రెండు రోజులుగా తాళ్ల పంచాయితీ నడుస్తోంది. ప్రతి శని, ఆదివారం నిర్వహించే గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, ఆవులు, గేదెలు, ఎద్దుల సంతల్లో వివిధ రకాల తాళ్లు అమ్ముకునేందుకు ఏటా టెండర్ నిర్వహించి, నిబంధనల మేరకు కోట్ చేసిన వారికి అనుమతులు ఇస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది రామాంజినేయులు అనే వ్యక్తి ఏడాదికి రూ.16.38 లక్షలు చొప్పున మూడేళ్లకు టెండర్ దక్కించుకున్నాడు. ఈ ఆగస్టు నుంచి తాళ్లు అమ్ముకోవడం మొదలు పెట్టాడు. అయితే ఉన్నఫళంగా శుక్రవారం, శనివారం కొందరు వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులమని హల్చల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెటింగ్ ఏడీ, గ్రేడ్–2 సెక్రటరీ, ఇతర అధికారులతో పాటు టెండర్ దక్కించుకున్న వ్యక్తులతో ఘర్షణకు దిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తాళ్లు అమ్ముకునే బాధ్యత తమకే అప్పగించాలంటూ రెండు రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు సాధ్యం కాదని చెబుతున్నా.. తాము కూడా తాళ్లు అమ్ముకుంటామని శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ఆవరణలో కాసేపు హడావుడి చేసినట్లు తెలిపారు. అయితే టెండర్ దక్కించుకున్న వాళ్లు ఏమాత్రం తగ్గకుండా తాము కూడా మార్కెటింగ్ అధికారులు, పోలీసులతో పాటు మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళతామని హెచ్చరించడంతో సమస్య ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు చెబుతున్నారు. తాము పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి టెండర్ దక్కించుకుని తాళ్ల వ్యాపారం చేసుకుంటుంటే.. జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ యార్డు గేటు బయట, పరిసర ప్రాంతాల్లో తాళ్లు అమ్ముకోవడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. తాళ్ల అమ్మకం పంచాయితీపై మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరికీ గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. వీరి మధ్య పోటీ కారణంగా ఈసారి తాళ్ల టెండర్ గరిష్టంగా రూ.16.38 లక్షలు పలికినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే అనుచరులమంటూ కొందరు హల్చల్ తమకు బాధ్యతలివ్వాలని టెండర్దారులతో ఘర్షణ ఎవ్వరికీ చెప్పలేక మార్కెటింగ్ శాఖ అధికారుల మౌనం -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే ప్రజల ప్రయోజనాల కోసం నిజాలు వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. సాక్షి మీడియా నిజాలు రాస్తే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. నకిలీ మద్యం, అవినీతి, ప్రజా సమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రజాస్వామ్య బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోంది. ఇది కేవలం ఒక పత్రికపై దాడి కాదు. మీడియా స్వేచ్ఛపై దాడి. – అనంత వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విమర్శ స్వీకరించే ధైర్యముండాలి ప్రభుత్వానికి ఏమి అవసరమో అది మాత్రమే వినపడాలి అనే ధోరణి సరికాదు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏకంగా 11 కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలి. తప్పుడు కేసునుల వెంటనే ఎత్తేయాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానం మానుకోవాలి. జర్నలిస్టుల గళాన్ని అణచే చర్యలను తక్షణం ఆపాలి. – వి.రాంభూపాల్, సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు అనంతపురం: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్పై కరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడేనని రాజకీయ, జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ఖండిస్తున్నారు. పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. -
పచ్చని చెట్లతోనే స్వచ్ఛమైన గాలి
కూడేరు: పచ్చని చెట్లతోనే స్వచ్ఛమైన గాలి (మనం పీల్చే ఆక్సిజన్) లభిస్తుందని ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం కూడేరులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఎంపీ, కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత భగవతి ఫంక్షన్ హాలు నుంచి పెట్రోల్ బంక్ వరకు విద్యార్ధులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత వర్మీకంపోస్టు ఎరువు తయారు చేశారు.. ఎంత విక్రయించారు.. ఎంత ఆదాయం వచ్చిందని ఆరా తీస్తే అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండల అధికారులతో కలిసి కలెక్టర్, ఎంపీ మానవహారంగా ఏర్పడ్డారు. పరిశుభ్రత పాటిస్తామని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పెన్నహోబిలం వద్ద త్వరలో మొక్కలు నాటే ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించారు. తర్వాత జాగృతి ఫౌండేషన్ చైర్మన్ పురుషోత్తం అందజేసిన బట్టతో తయారు చేసిన సంచులు, మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ శివశంకర్, డ్వామా పీడీ సలీం బాషా, డీఎప్ఓ గురు ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ శైలజ, డిప్యూటీ ఎంపీడీఓ రాధాకృష్ణ, తహసీల్దార్ మహబూబ్బాషా, ఎంఈఓ మహమ్మద్ గౌస్, ఏపీఓ పోలేరయ్య, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. -
శిక్షణ అంశాలు ఆచరణలో పెట్టాలి
రాయదుర్గంటౌన్: శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను పాత్రికేయులు ఆచరణలో పెట్టి వృత్తికి వన్నె తేవాలని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు సూచించారు. రాయదుర్గంలోని ఓ ఫంక్షన్ హాలులో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ‘గ్రామీణ విలేకర్ల పునశ్చరణ తరగతులు’ శనివారంతో ముగిసాయి. శిక్షణకు సురేష్కుమార్, సుబ్బరావుతోపాటు చివరి రోజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు నైపుణ్యంతో ఎదగాలని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అయూబ్, శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ ప్రతినిధులు కమలాక్షుడు, గురు రాఘవేంద్రప్రసాద్, ఖాజా హుస్సేన్, ఆవుల మనోహర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
‘నకిలీ మద్యం.. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ పాలనలో బెల్టు షాపులు లేవు. ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపించింది. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారంతా టీడీపీ నేతలే. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా?. చంద్రబాబు అబద్దాల ముఖ్యమంత్రి. నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమను చంద్రబాబు రాష్ట్రమంతా నడిపిస్తున్నారు. కల్తీ మద్యం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.ఏపీలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చాలా కాలం నుంచి లిక్కర్ దందాకు చంద్రబాబు ప్లాన్ చేశారు. చంద్రబాబు మనుషుల చేతుల్లోనే లిక్కర్ షాపులున్నాయి. లక్షలాది బెల్టు షాపులు టీడీపీ వారివే. చంద్రబాబు డర్డీ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ లిక్కర్ అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. కల్తీ మద్యం అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలి. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయి. జోగి రమేష్ ఛాలెంజ్ను చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్వీకరించలేదు?.రాష్ట్రంలో అన్యాయం, అరాచక పాలన సాగుతోంది. లోకేష్ మీ నాన్నలా రాజకీయాలు చేయకు.. మంచి రాజకీయాలు నేర్చుకో. చంద్రబాబు సిట్ అంటేనే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు వేసే సిట్.. ఆయన సిట్ అంటే సిట్, ఆయన స్టాండ్ అంటే స్టాండ్ . చంద్రబాబు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రి గా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శాఖలు సరిగా పనిచేయలేదని సాక్షాత్తూ మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇస్తే పేదల పరిస్థితి ఏంటి?. వైఎస్సార్సీపీ, ప్రజలు అడిగే ప్రశ్నలకు కూటమి నేతల దగ్గరా సమాధానాలు లేవు’ అని అన్నారు. -
‘శుభప్రదమ్’ ఆరంభం
గుంతకల్లు: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్యరాజేష్, ’మిరాయ్’ హీరోయిన్ రితికానాయక్ శుక్రవారం గుంతకల్లులో సందడి చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటైన ‘శుభప్రదమ్’ మెగా షాపింగ్ మాల్ను అట్టహాసంగా ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.భవానితో కలసి షోరూమ్ మొత్తం కలియతిరిగారు. ఫొటోలకు ఫోజులిస్తూ సెల్పీలతో ఉత్సాహ పరుస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీలోనే మొట్టమొదటి శుభప్రదమ్ మెగా షోరూంను తమ చేతుల మీదుగా, అందులోను గుంతకల్లులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శుభకార్యాలకు దుస్తుల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సరసమైన ధరకే శుభప్రదమ్ షాపింగ్ మాల్లో ఎంతో నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగొళ్లపై చక్కటి ఆఫర్లను నిర్వాహకులు అందజేస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం షోరూమ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఇద్దరు హీరోయిన్లు పలు పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. కార్యక్రమంలో శుభప్రదమ్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు పసుపుల హరినాథ్, మంజు. ఓంకార్, పత్రాల సురేష్, రంగ తదితరులు పాల్గొన్నారు. తారలు దిగిరావడంతో సందడిగా మారిన గుంతకల్లు ఏపీలోనే మొట్టమొదటి షోరూం -
ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి
కుందుర్పి/బెళుగుప్ప: ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు బిల్లులు జమ అవుతాయని, ఇందుకు ప్రతి కూలీ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని డ్వామా పీడీ సలీంబాసా తెలిపారు. కుందుర్పి మండలం మలయనూరు, నిజవళ్లి, కుందుర్పి, బెళుగుప్ప మండల కేంద్రంలో ఉపాధి సిబ్బంది శుక్రవారం చేపట్టిన ఈ–కేవైసీ నమోదు ప్రక్రియను శుక్రవారం ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. ఇకపై కూలి పనికి వెళ్లిన కూలీలకు మాత్రమే బిల్లులు చెల్లింపులు ఉంటాయన్నారు. లోకేషన్ ఆధారంగా పనుల్లో పాల్గొనే కూలీలను రెండు సార్లు ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారన్నారు. బిల్లులు చెల్లింపులో ఇకపై ఎలాంటి అవకతవకలకు అస్కారముండదని పేర్కొన్నారు. గడువులోపు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కుందుర్పి ఎంపీడీఓ మాధవి, ఏపీఓ మురళీధర్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
అనంతపురం అర్బన్: తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది తహసీల్దార్లకు పదోన్నతి కల్పించగా ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. పదోన్నతి పొందిన వారిలో ఉరవకొండ తహసీల్దారుగా ఉంటూ కూడేరు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న ఎస్కే మహబూబ్బాషా, రాయదుర్గం తహసీల్దారు జి.నాగరాజు ఉన్నారు. పోస్టింగ్ ఇచ్చేంత వరకూ వారు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగనున్నట్లు సమాచారం. వృద్ధాశ్రమం కోసం జోలె పట్టిన రామ్లక్ష్మణ్ శింగనమల(నార్పల): వృద్ధాశ్రమానికి తమ వంతు సాయంగా జోలె పట్టి చందాలు సేకరించారు ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్. వివరాలు.. నార్పల మండలం కురగానిపల్లిలో చంద్రశేఖర్ రెడ్డి, స్రవంతి దంపతులు చెన్నకేశవ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి నిస్వార్థ సేవలను గుర్తించిన రామ్, లక్ష్మణ్ శుక్రవారం నేరుగా కురగానిపల్లిలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులతో మాట్లాడారు. వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నార్పలలో జోలె పట్టి చందాలు ఆర్థించారు. అనాథ వృద్ధులను చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్న వారికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు గవ్వల శివశంకర్, కేఎల్ఎన్ ప్రసాద్, ఈడిగ శ్రీధర్, చంద్ర, లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● పాత్రికేయులకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సూచన రాయదుర్గంటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయులు కూడా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పాత్రికేయులకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ సూచించారు. రాయదుర్గంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో రెండు రోజుల పాటు సాగే జర్నలిస్టుల శిక్షణ తరగతులను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా యూనియన్ నాయకులు భోగేశ్వరరెడ్డి తదితరులతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోందని, దీనిపై కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, మహమ్మద్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు. వీఏఏకు షోకాజ్ అనంతపురం అగ్రికల్చర్: ఆర్ఎస్కే వేదికగా రైతులకు విక్రయించిన ఎరువులకు సంబంధించి మార్క్ఫెడ్కు కట్టాల్సిన సొమ్ము వెంటనే చెల్లించాలని కూడేరు–2 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ) కె.నరేష్కుమార్కు జేడీఏ ఉమామహేశ్వరమ్మ షోకాజ్ నోటీసు జారీ చేశారు. గార్లదిన్నె మండలం మర్తాడు ఆర్ఎస్కే అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో ఎరువుల సొమ్ము రూ.1,08,478 చెల్లించకుండా సొంతానికి వాడుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కూడేరుకు బదిలీ అయిన నేపథ్యంలో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల్లోపు మార్క్ఫెడ్కు సొమ్ము జమ చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వలస కార్మికుల మృతిరాయదుర్గం టౌన్: బెంగళూరులో చోటు చేసుకున్న ప్రమాదంలో రాయదుర్గానికి చెందిన వలస కార్మికుడు మృతి చెందాడు. వివరాలు... స్థానిక అంబేడ్కర్ నగర్ ఫస్ట్ క్రాస్లో నివాసముంటున్న నాగరాజు (37)కు భార్య గాయత్రి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే బేల్దారి మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి నెలమంగల ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ● తాడిపత్రి టౌన్: మండలంలోని అయ్యవారిపల్లి సమీపంలో ఉన్న సుగుణ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికుడు పురుషోత్తం నిషాద్ (31) మృతి చెందాడు. యూపీకి చెందిన పురుషోత్తం నిషాద్ గురువారం రాత్రి తాడిపత్రి మండలం బుగ్గ వద్దకెళ్లి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మత్తులో వాహనాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డాడు. అటుగా వెళుతున్న వారు గమనించి క్షతగాత్రుడిని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తనకు ఫ్యాక్టరీ యాజమాన్యం కేటాయించిన గదికి వెళ్లిన పురుషోత్తం నిషాద్.. శుక్రవారం ఉదయం అల్ఫాహారం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకే పీజీ సీట్లు ఉన్న అనస్తీషియాకు 4, ఆబ్స్ట్రిక్స్, గైనకాలజీ 4, పీడియాట్రిక్స్ విభాగానికి 4 పీజీ సీట్లు మంజూరయ్యాయి. అలాగే కొత్తగా హాస్పిటల్ అడ్మిని స్ట్రేషన్ విభాగానికి 3 పీజీ సీట్లు వచ్చాయి. ప్రతి విద్యార్థీ కౌశల్ క్విజ్లో పాల్గొనాలి అనంతపురం సిటీ: జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే కౌశల్ క్విజ్లో విద్యార్థులందరూ పాల్గొనేలా చూడాలని జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్బాబు ఆదేశించారు. కౌశల్ క్విజ్–2025కు సంబంధించి రూపొందించిన పోస్టర్లను అనంతపురంలోని సైన్స్ సెంటర్లో శుక్రవారం ఆవిష్కరించారు. శనివారం నిర్వహించనున్న పాఠశాల కాంప్లెక్స్ సమావేశాల్లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో కౌశల్ క్విజ్లో పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేయాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఆనంద భాస్కర్రెడ్డి, డీఈఓ కార్యాలయ ఏడీ శ్రీనివాసులు, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఎస్టీయూ ప్రతినిధులు చంద్రశేఖర్రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. అక్రమంగా టపాసులు విక్రయిస్తే చర్యలు అనంతపురం సెంట్రల్: జిల్లాలో అక్రమంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లైసెన్స్ కలిగిన దుకాణాదారులు మాత్రమే టపాసులు విక్రయించాలని స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవ్వరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాత్కాలిక లైసెన్స్దారులు జిల్లా యంత్రాంగం సూచించిన ప్రదేశాల్లో మాత్రమే నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీరు, ఇసుక, ఇతర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్దంగా ఉంచుకోవాలన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను విక్రయ పనుల్లో ఉంచుకోరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సరదాకు కూడా చేతిలో పట్టుకొని కాల్చకూడదని, అగ్నిప్రమాదం సంభవించే ప్రదేశాల్లో టపాసులు ఉంచరాదని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ 100, 112కు సమాచారం అందించాలని కోరారు. అత్యాచారం కేసులో పదేళ్ల జైలు ఆత్మకూరు: వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం నాల్గవ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆత్మకూరు ఎస్ఐ లక్ష్మణరావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మదిగుబ్బ గ్రామానికి చెందిన పెద్దన్న అనే వ్యక్తి 2018లో మండల పరిధిలోని ఒక గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 15 మంది సాక్షులను విచారించిన అనంతరం ముద్దాయి పెద్దన్నపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ అనంతపురం నాల్గవ సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. -
అదరగొట్టిన రాహుల్, అభినవ్
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ సెంటర్లో బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఆంధ్ర బ్యాటర్లు ఎస్వీ రాహుల్, అభినవ్ చెలరేగి సూపర్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 4 వికెట్లు కోల్పోయి 470 పరుగులు సాధించింది. గురువారం కురిసిన వర్షం కారణంగా శుక్రవారం రెండో రోజు మ్యాచ్ రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్నైట్ స్కోర్ 210/2తో బరిలో దిగిన ఆంధ్ర బ్యాటర్ తేజ ఆట ప్రారంభమైన కాసేపటికి పెవిలియన్ ముఖం పట్టాడు. ఈ దశలో జత కట్టిన ఎస్వీ రాహుల్, అభినవ్.. ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. నిలకడగా ఆడుతూ.. అవకాశం దొరికినప్పుడుల్లా బంతిని బౌండరీలు దాటిస్తూ భారీ స్కోర్కు బాటలు వేశారు. ఎస్వీ రాహుల్ 292 బంతులను ఎదుర్కొని 15 ఫోర్లు,2 భారీ సిక్సర్లతో 151 పరుగులు చేసి, క్రీజ్లో కొనసాగుతున్నాడు. అభినవ్ 190 బంతుల్లో 101 పరుగులు చేసి అవుటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో యుగల్ షైనీ 2/37, మన్నన్, దేవ్లక్ర చెరో వికెట్ తీసుకున్నారు. 151 పరుగులతో నాటౌట్గా నిలిచిన రాహుల్ 101 పరుగులు చేసిన అభినవ్ -
ఎత్తిపోతల పథకంలో సాంకేతిక సమస్య
● ఒక్కసారిగా ఆగిపోయిన మోటర్లు ● మరమ్మతుల అనంతరం మళ్లీ నీటి పంపింగ్ వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ఎత్తిపోతల పథకంలో శుక్రవారం తెల్లవారుజామున సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నీటిని ఎత్తిపోస్తున్న తొమ్మిది మోటర్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. రాగులపాడు లిఫ్ట్కు 2,800 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. అయితే కొన్ని గంటలకే కాలువలో నీటిమట్టం పెరిగిపోయింది. అప్రమత్తమైన లిఫ్ట్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ నాగరాజు, ఎస్ఈ రాజ్స్వరూప్, ఈఈ శ్రీనివాస్నాయక్, డీఈ వెంకటరమణ, జేఈ సురేష్నాయక్ తదితరులతో పాటు మరికొందరు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని మోటర్లను పరిశీలించారు. కాలువలో నీటి మట్టం పెరగడంతో అధికారులు ఛాయాపురం వద్దకు చేరుకుని ఎస్కేప్ చానల్ వద్ద జేసీబీతో నీటిని మళ్లించారు. అనంతరం నాలుగు పంపుల ద్వారా నీటి పంపింగ్ ప్రారంభించారు. ఇంజినీరింగ్ అధికారుల బృందం రాగులపాడు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని మరమ్మతులు ప్రారంభించింది. మధ్యాహ్నం నుంచి తిరిగి తొమ్మిది పంపుల ద్వార నీటి పంపింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు, వజ్రకరూరు తహసీల్దార్ నరేష్కుమార్, ఉరవకొండ సీఐ మహానంది తదితరులు అక్కడకు చేరుకుని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఛాయాపు రం వద్ద ఎస్కేప్ ఛానల్ నుంచి కృష్ణా జలాలు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
వీడిన మిస్సింగ్ మిస్టరీ
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కొడిమి దర్గా కొట్టాలకు చెందిన బాలుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఈ నెల 12న అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఆరు రోజులైనా లభ్యం కాకపోవడంపై ‘వీడని మిస్సింగ్ మిస్టరీ’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం వెలువడిన కథనంపై పోలీసులు స్పందించారు. వివరాలను అనంతపురం రూరల్ సీఐ శేఖర్ వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు అదృశ్యమయ్యాడు. 12న కేసు నమోదు చేశామన్నారు. వజ్రకరూరు మండలం కమలపాడులో రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడకెళ్లి బాలుడిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ అనంతపురం సిటీ: స్థానిక సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ శుక్రవారం ముగిసింది. మొత్తం 32 మండలాల నుంచి 46 మంది విద్యార్థులు హాజరు కాగా, తాడిపత్రి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని హాజియా తబ్సూమ్ ప్రథమ స్థానం, గుంతకల్లు రైల్వే హైస్కూల్ విద్యార్థి ఉదిత్ రెండో స్థానంలో నిలిచారు. వీరిని విజయవాడలో శనివారం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ, ఎన్జీసీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆనంద భాస్కర్రెడ్డి తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా ఆర్ట్స్ కాలేజ్ అధ్యాపకుడు డా.కిశోర్, డా.చంద్రశేఖర్ వ్యవహరించారు. -
ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఇద్దరి అరెస్ట్
● సింగిల్ బారెల్ రైఫిల్, సెల్ఫోన్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ పుట్టపర్తి టౌన్: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఉత్తర ప్రదేశ్కు చెందిన సాజాద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలమ్ షేక్ను శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్, ఫోన్కాల్స్ ద్వారా సంబంధాలు నెరపడంతో అతన్ని ఈ ఏడాది ఆగస్టు 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా..ఉత్తర ప్రదేశ్కు చెందిన సాజాద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలమ్ షేక్ పాత్ర తేలింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందం ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఆ రాష్ట్రంలోని అమ్రోహోలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సాజాద్ హుస్సేన్ను అరెస్ట్ చేసింది. అతని నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాద్ మెటీరియల్ స్వాధీనం చేసుకుంది. అదే రోజు ఆంఽధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఏటీఎస్ బృందాలు దాడులు నిర్వహించి..మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో మాలేగావ్లో తౌఫీక్ ఆలమ్షేక్ను అదుపులోకి తీసుకున్నాయి. అతని నుంచి సింగిల్ బారెల్ రైఫిల్, సెల్ఫోన్లు, జిహాద్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాయి. వీరిద్దరూ పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఆధారిత వాట్సాప్ గ్రూప్లు, చానల్స్లో కూడా క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. వీరు యువతను జిహాదీ వైపు మళ్లించడంతో పాటు పాకిస్థాన్లో మిలటరీ శిక్షణ తీసుకుని భారతదేశంపై యుద్ధం చేయాలని యోచిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన ఇద్దరినీ పుట్టపర్తి మేజిస్టేట్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పీఎఫ్ఐ ప్రతినిధుల జిహాదీ కార్యకలాపాలు దేశంలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ప్రతినిధులు ఇతర నిషేధిత సంస్థలతో సంబంధాలు పెట్టుకుని సామాజిక సేవ పేరుతో జిహాదీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పాక్ ఆధారిత సోషల్ మీడియా గ్రూపులపై గట్టి నిఘా ఉంచామన్నారు. యువత సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సందేహాస్పద కార్యకలాపాలు, దేశ వ్యతిరేక, రాడికల్ భావాలను ప్రోత్సహించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. నిందితుల అరెస్టుకు శ్రమించిన ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్తో పాటు ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, ముదిగుబ్బ సీఐ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి
ఉరవకొండ: పాల్తూరు, హోన్నూరు, బెల్లనగుడ్డం తదితర గ్రామాలకు బస్సులు నడపాలంటూ గ్రామీణ విద్యార్థులు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, ఇంటర్, టెన్త్ చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సకాలంలో బస్సులు లేకపోడంతో విద్యా సంస్థలకు చేరుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము ప్రమాదకర పరిస్థితుల్లో ఆటోల్లోనే ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. కళాశాలలు, పాఠశాలల సమాయానికి అనుగుణంగా బస్సులు నడిపాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. బస్సులు నడిపేలా అధికారులతో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. -
ఎస్ఆర్ఐటీకి జాతీయ స్థాయి పురస్కారాలు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి. ఈ మేరకు ఆ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. ఏఐసీటీఈ–ఎడుస్కిల్స్ సంయుక్తంగా ఇటీవల దేశ వ్యాప్తంగా ఉన్న అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలల వర్చువల్ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కళాశాలల్లో ఎస్ఆర్ఐటీ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఘనతకు గుర్తింపుగా సిమ్లాలో ఎడుస్కిల్స్ కనెక్ట్’25 నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పురస్కారాలను ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్ రెడ్డి అందుకున్నారు. బెస్ట్ ఫర్మార్మింగ్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ అవార్డు, టాలెంట్ కనెక్ట్ ఎక్స్లెంట్ అవార్డు, ఫైవ్ ఇయర్స్ పార్ట్నర్ షిప్ అవార్డులు లభించినట్లు రంజిత్రెడ్డి తెలిపారు. అలాగే జెడ్స్కాలర్ ఇంటర్న్షిప్ డొమైన్, జూనియర్ ఇంటర్న్షిప్ డొమైన్, సెల్కోన్ ఇంటర్న్షిప్ డొమైన్, ఎడుస్కిల్స్ అకాడమీ ఇంటర్న్షిప్ డొమైన్ విభాగాలలో కూడా ఎస్ఆర్ఐటీలోని సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలకు ఉత్తమ అవార్డులు దక్కాయన్నారు. బోధనా విభాగంలోనూ ఎస్ఆర్ఐటీ ప్రతిభ చాటుకుందన్నారు. డాక్టర్ సాయి చైతన్య కిషోర్కు డైరెక్టర్ ఎక్సలెన్స్ అవార్డు, డాక్టర్ రంజిత్రెడ్డి, వరుణ్కుమార్కు డెటికేటెడ్ సీఓఈ ఎడుకేటర్ అవార్డు, డాక్టర్ హేమంత్కుమార్ యాదవ్కు బెస్ట్ ఫర్మార్మింగ్ సీఓఈ కోఆర్డినేటర్ అవార్డులు దక్కాయన్నారు. కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ స్థాయిలో ర్యాంకులు, అవార్డులు సాఽధించడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో అధ్యాపకులు చేసిన కృషి అభినందనీయం అన్నారు. -
ఐక్య ఉద్యమాలతో చేనేత పరిరక్షణ
● చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు అనంతపురం అర్బన్: ఐక్య ఉద్యమాలతోనే చేనేత రంగం పరిరక్షణ సాధ్యమవుతుందని, ఈ మేరకు ఉద్యమ కార్యచరణను రూపొందిస్తున్నట్లు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, గోవిందు తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో చేనేతలకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కూటమి పెద్దలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి చేనేత రంగం నిర్వీర్యమవుతోందన్నారు. నేతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. మంత్రుల సొంత ఇలాకాలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని రక్షించుకునే లక్ష్యంగా ఉద్యమాలు సాగిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో అధ్యయన యాత్ర చేపట్టి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ధర్మవరం పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, నేతన్న నేస్తం కింద రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలని, నేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత పెన్షన్, చేనేత బ్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మధు, పురుషోత్తం, రాధాకృష్ణ, రామ్మోహన్నాయుడు, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యం..ఈ–స్టాంప్ల విక్రయం
● అధిక ధరకు విక్రయిస్తున్నా పట్టించుకోని అధికారులు అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లాలో ఈ– స్టాంప్లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో మొత్తం 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా స్టాంప్ వెండర్లు ఉండగా ఇందులో ఒక్క అనంతపురంలోనే దాదాపు 40 మందికి పైగా ఉండడం గమనార్హం. వీరు కర్నూలులోని స్టాక్ హోల్డింగ్ సంస్థకు ఇండెంట్ పంపి.. ఈ–స్టాంప్ విక్రయాన్ని చేపడుతున్నారు. ప్రతి స్టాంప్ విక్రయంపై వెండర్లకు ప్రత్యేకంగా కమీషన్ ఉంటుంది. ఇది చాలదన్నట్లు ప్రతి స్టాంప్పై అదనపు సొమ్ము వసూలు చేస్తున్నారు. రూ.100 స్టాంప్ కావాలంటే రూ.150 చెల్లించుకోవాల్సి వస్తుండడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వెండర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో స్టాంపుల కొరత: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను స్టాంపుల కొరత వేధిస్తోంది. కొన్ని నెలలుగా స్టాంపుల స్టాక్ లేదు. కేవలం స్టాంపుల విక్రయం ద్వారానే ప్రతి నెలా రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోట్లలో ఆదాయం ఉండేది. ప్రస్తుతం స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండిపడింది. -
‘ఓపెనింగ్’ అదిరింది
అనంతపురం కార్పొరేషన్: బీసీసీఐ ఆధ్వర్యంలో అనంతపురం స్పోర్ట్స్ సెంటర్లోని ప్రధాన క్రీడామైదానం వేదికగా గురువారం ప్రారంభమైన సీకే నాయడు క్రికెట్ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి డిల్లీ జట్టుపై 74.2 ఓవర్ల వద్ద రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులతో పటిష్ట స్థాయికి చేరుకుంది. వర్షం కారణంగా 15 ఓవర్లు మిగిలి ఉండగానే ఆట ముగిసింది. బీసీసీఐ నూతన నిబంధనల మేరకు టాస్ లేకుండానే అతిథి జట్టుకు బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఢిల్లీ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్రెడ్డి, కార్యదర్శి భీమలింగారెడ్డి, సహాయ కార్యదర్శి జి.మురళీకృష్ణ, ఏసీఎల్ఓ శర్మాస్వలి, తదితరులు పర్యవేక్షించారు. బ్యాటింగ్ బరిలో దిగిన ఆంధ్ర జట్టు ఓపెనర్ సాయిశ్రావణ్ నిలకడగా ఆడుతూ 160 బంతుల్లో 9 బౌండరీలతో 73 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్గా వచ్చిన మరో బ్యాటర్ జీఎస్పీ తేజ 165 బంతుల్లో 8 బౌండరీలతో 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో దేవ్లక్రా 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా, భరద్వాజ్ 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూలదోశాడు. చికిత్స పొందుతూ యువకుడి మృతి గుమ్మఘట్ట: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. వివరాలు... గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప గ్రామానికి చెందిన తిప్పేస్వామి, గంగమ్మ దంపతుల కుమారుడు నవీన్ (25) పది రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఉన్న తన సోదరిని చూసేందుకు ద్విచక్రవాహనం వెళుతుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నవీన్ను తొలుత కళ్యాణదుర్గంలో ప్రాథమికి చికిత్స అందజేసి అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక నవీన్ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఘటనపై కళ్యాణదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
శ్రీదేవికి మెమో
అనంతపురం రూరల్: మిషన్శక్తి– మిషన్ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్గా పనిచేస్తున్న ఉరవకొండ సీపీడీఓ శ్రీదేవికి ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి చార్జ్మెమో జారీ చేశారు. మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో ఈ నెల 3న శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ అంశంలో ఐసీడీఎస్ పీడీ నాగమణిని అప్పట్లో ఉన్నతాధికారులు సస్సెండ్ చేశారు. అయితే శిశువు మృతికి అసలు కారకులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ నెల 9న ‘పసివాడి ప్రాణం.. లెక్కలేని తనం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. స్పందించిన ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి కథనంలో పేర్కొన్న విధంగా మిషన్ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్ బాధ్యతారాహిత్యాన్ని ప్రస్తావిస్తూ మెమో జారీ చేశారు. శిశుగృహలో ఉన్న పిల్లల భద్రత, సంక్షేమానికి చర్యలు తీసుకోవడం, ప్రత్యేక దత్తత ఏజెన్సీల పనితీరును పర్యవేక్షించడం, ఆసుపత్రిలో సంరక్షణ, పర్యవేక్షణ ప్రమాణాలు పాటించడంలో మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫలితంగానే నవజాత శిశువు మృతి చెందినట్లుగా అభియోగాలు వచ్చాయని పేర్కొన్నారు. పదిరోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, శిశువు మృతికి కారకులైన శిశుగృహ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడనున్నట్లు సమాచారం. -
ఎస్జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అండర్ – 19 బ్యాడ్మింటన్, వాలీబాల్ జిల్లా జట్లను గురువారం ఎంపిక చేశారు. అనంతపురంలోని అశోక్నగర్లో ఉన్న జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్టేడియంలో బ్యా డ్మింటన్, జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల పర్యవేక్షించారు. వాలీబాల్ బాలుర జట్టులో మణికంఠ, కార్తీక్, సాయిచరణ్, శ్రీకాంత్, పవన్కుమార్ నాయక్, ధనుష్కుమార్, మధు, విష్ణువర్ధన్, విజయసాయి, రెహమాన్, వంశీ, అమర్ చోటు దక్కించుకున్నారు. బాలికల జట్టుకు సాయిబృందా, యుమున, శాలిని, శ్వేత, బిందు, దీప్తి, వైష్ణవి, నాగరత్న, సుస్మిత, వేదశ్రీ, హసీనా, లాస్య, యస్మిత ఎంపికయ్యారు. అలాగే బ్యాడ్మింటన్ బాలికల జట్టులో ఎ.అన్విత, ఎస్.హిమబిందు, టి.సన్నిధి, వి.విజయలక్ష్మి, పి.దీక్షిత్ నారాయణ చోటు దక్కించుకోగా, బాలురు జట్టుకు బి.యువరాజు, జతిన్ సాయిరెడ్డి, ఎ.అఖిల్, ఎం.రిత్విక్సాయి, కె.కార్తీక్కుమార్రెడ్డి ఎంపికయ్యారు. -
రైలు ఢీకొని వివాహిత మృతి
యాడికి: రైలు ఢీకొని ఓ వివాహిత మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన కురుబ దస్తగిరి, మద్దిలేటమ్మ (40) దంపతులకు పదో తరగతి చదువుతున్న ఓ కుమారుడు ఉన్నాడు. మతి స్థిమితం లేకుండా బాధపడుతున్న మద్దిలేటమ్మ గురువారం ఉదయం దస్తగిరి తోటకు వెళ్లిన సమయంలో నెమ్మదిగా రైలు పట్టాలపై చేరుకుని అటూఇటు తిరుగుతుండగా రైలు ఢీకొంది. ఘటనలో శరీరం ఛిద్రమైంది. సమాచారం అందుకున్న గుత్తి రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిర్వాసితులకు న్యాయం చేస్తాం : కలెక్టర్ తాడిపత్రి రూరల్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, స్థలాలు, ఇళ్లను కోల్పోయిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కలెక్టర్ ఓ.ఆనంద్ భరోసానిచ్చారు. గురువారం తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, రావివెంకటాంపల్లి, చల్లవారిపల్లి, పులి ప్రొద్దుటూరు గ్రామాల పరిధిలో చేపట్టిన 544డీ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమకు పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందంటూ పలుమార్లు రోడ్డు పనులను నిర్వాసితులు అడ్డుకుంటూ వచ్చారు. దీంతో గురువారం కలెక్టర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ సోమశేఖర్, హైవే ఇంజనీర్లు ఉన్నారు. ‘తమ్ముడా మజాకా’పై కలెక్టర్ సీరియస్ రాప్తాడు రూరల్: టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం మానసిక వికలాంగ కోటాలో అక్రమంగా పింఛన్ పొందుతున్న వైనంపై ‘తమ్ముడా మజాకా’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ స్పందించారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో నివాసముంటున్న తాడాల నాగభూషణం పదేళ్లుగా ఈ పింఛన్ పొందుతున్నాడు. ఇప్పటి వరకూ పింఛన్లు పొందుతున్న వందశాతం వైకల్యం ఉన్న వేలాదిమంది దివ్యాంగులకు ఇటీవల నోటీసులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం ... నాగభూషణం కు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెవడంతో గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా నోటీసు జారీ చేస్తామని ఎంపీడీఓ దివాకర్ పేర్కొన్నారు. -
కలంపై జులుమా?
ఈశాన్య రుతుపవనాల ప్రవేశంజిల్లాలోకి ఈశాన్య రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. ఈ రబీలో 1.08 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం: ప్రజల తరఫున పోరాడుతున్న ‘సాక్షి’ గొంతుక నొక్కడానికి కూటమి ప్రభుత్వం మరో సారి పోలీసులను ప్రయోగించింది. ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన రెండు అక్రమ కేసుల్లో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పోలీసులతో నోటీసులు జారీ చేయిం చింది. ఏకంగా రాష్ట్ర పోలీసులు హైదరాబాద్లోని ‘సాక్షి’ కార్యాలయానికి వెళ్లడాన్ని పరిశీలిస్తే, వారిపై అధికార పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని జర్నలిస్టులు, మేథావులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమే ‘సాక్షి’ పత్రిక ఎడిటర్పై కక్ష గట్టి పోలీసుల సాయంతో వరుసగా కేసులు నమోదు చేయడం ఆక్షేపణీయం. పత్రికల్లో వార్త ప్రచురిస్తే.. ఆ వార్తకు సంబంధించి ‘న్యూస్ సోర్స్’ను వెల్లడించాలని పోలీసులు బలవంతం చేయలేరు. వరుసగా కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. – డాక్టర్ శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం మూల్యం చెల్లించుకుంటారు పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి కార్యాలయాలపై దాడులు, ఎడిటర్పై కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి దాడులను అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. – సాకే హరి, ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్మార్గమైన చర్య కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం పత్రికలకు గాని, ప్రజలకు గాని అన్యాయాలపై మాట్లాడే అవకాశం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ప్రజల సొమ్ము దోచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే పత్రికలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. – తలారి రామాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ -
అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● మాజీ మంత్రి, సాకే శైలజనాథ్ పుట్లూరు: పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అసమర్థ కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా నిలదీద్దామంటూ ప్రజలకు మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. గురువారం పుట్లూరు మండలం కడవకల్లు, సూరేపల్లి, అరకటివేముల, ఎ.కొండాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కడవకల్లులో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా వైద్య కళాశాల నిర్మాణాలు చేపడితే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పొన్నపాటి మహేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు విష్ణునారాయణ, రమణాయాదవ్, నాయకులు పద్మావతమ్మ, సర్పంచ్ రామాంజనేయులు, నియోజకవర్గ యవజన విభాగం అధ్యక్షుడు భానుకిరణ్రెడ్డి, బీసీ సెల్ నాయకుడు నారాయణస్వామి, నాయకులు నాగేశ్వరరెడ్డి, నీలం భాస్కర్, నరసింహారెడ్డి, విశ్వనాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, నాగముని, రామకేశవ, కుళ్లాయిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నాగభూషణం, రసూల్, కేశవనాయుడు, కంచెం శ్రీనివాసులరెడ్డి, రామమోహన్, సూరి, పెద్దిరాజు(పెద్దోడు), తదితరులు పాల్గొన్నారు. -
బండారు ఇలాకా.. సమస్యల తడాఖా
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తన సొంత నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నా ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లాలన్నా నరకప్రాయంగా ఉంటోందని వాపోతున్నారు. ‘గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్లడమే మానేశారంట! నియోజకవర్గ స్థాయి నేతలకు సైతం అందుబాటులో ఉండడం లేదు, అలాంటిది ఇక రోడ్ల గురించి ఏం పట్టించుకుంటారు’ అని ప్రజలు మండిపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం కోటంక వీఽధిలో ప్రవహిస్తున్న మురుగు రేగడికొత్తూరు వద్ద గుంతల్లో నిలిచిన వర్షపునీరుగుంతల్లో వాహనాన్ని నడపలేక తోసుకుంటూ వెళుతున్న కొట్టాలపల్లి వాసి రేగడికొత్తూరుకు చేరుకునేందుకు గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు పొడరాళ్ల సమీపంలో ప్రధాన రహదారి దుస్థితి జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తే తప్ప మర్తాడుకు వెళ్లలేమంటున్న వాహనదారులు -
వీడని మిస్సింగ్ మిస్టరీ
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన 3వ తరగతి విద్యార్థి అదృశ్యంపై మిస్టరీ వీడలేదు. ఆరు రోజులైనా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చుట్టపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టినా లాభం లేకపోయింది. ఏమి జరిగిందంటే.. కొడిమి పంచాయతీ పరిధిలోని దర్గా కొట్టాలుకు చెందిన వేణు, వెంకటలక్ష్మి దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పేదరికం కారణంగా పెద్ద కుమారుడు ఈశ్వర్ చదువుకోలేకపోయాడు. ఉరవకొండలోని గిరిజన గురుకుల పాఠశాలలో రెండో కుమారుడు నరసింహ 6వ తరగతి, మూడో కుమారుడు రామాంజనేయులు 3వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 11న ఇద్దరూ గురుకులానికి బయలుదేరారు. దీంతో ఇద్దరినీ పిలుచుకుని అనంతపురానికి వచ్చిన ఈశ్వర్... వారికి కావాల్సిన సామగ్రిని ఇప్పించి బస్సులో ఉరవకొండకు బయలుదేరారు. రామాంజనేయులు తాను ఇంటికి వెళ్తానంటూ మారం చేస్తూ ఏడుస్తుండడంతో బస్సు రాచానపల్లికి చేరుకోగానే దింపేసి ఈశ్వర్, నరసింహ ఉరవకొండకు వెళ్లిపోయారు. రామాంజనేయులు ఎక్కడ? బస్సు దిగిన రామాంజనేయులు సమీపంలోని తమ ఇంటికి వెళ్లకుండా సిండికేట్నగర్కు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 3వ తరగతి అంటే పదేళ్లలోపు వయసు ఉంటాది. ఒంటరిగా బయట తిరిగే అంత జ్ఞానం కూడా ఉండదు. అలాంటి పిల్లాడు ఎవరి వద్దకు వెళ్లాడు, ఎక్కడికి వెళ్లాడో అంతుచిక్కడం లేదు. ఆరు రోజులు దాటినా ఆచూకీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో బాలుడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం ఆ దిశగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఉరవకొండకు వెళ్లి పాఠశాలకు వెళ్లి విచారించారు. తల్లిదండ్రులు కూడా కొడిమి, రాచానపల్లి పంచాయతీలతో పాటు అనంతపురం నగరంలో ఆస్పత్రి, ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆరా తీశారు. కాగా, బాలుడి మిస్సింగ్ కేసును సీరియస్గా తీసుకున్నట్లు అనంతపురం రూరల్ సీఐ శేఖర్ అంటున్నారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 94407 96811 (సీఐ)కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆరు రోజులైనా లభ్యం కాని బాలుడి ఆచూకీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టినా ఫలితం శూన్యం -
పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఏపీఐఐసీ అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్టనర్షిప్ డ్రైవ్లో భాగంగా రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏపీఐఐసీ అధికారులతో కలిసి ఆవిష్కరించి, మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇందు కోసం బుధవారం నుంచి నెలరోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్టనర్ షిప్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేసర్ ఎస్వీఎస్ఎస్ నాగకుమార్, మేనేజర్ మల్లికార్జున, అధికారులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు దీపావళిని పురస్కరించుకుని టపాసుల విక్రయాలు ప్రభుత్వ నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. టపాసుల విక్రయాలపై జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి డీఆర్ఓ మలోలతో కలిసి ఎస్పీ జగదీష్, డివిజన్స్థాయి అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, అగ్నిమాపక, విపత్తు, విద్యుత్, ఆరోగ్య, వాణిజ్య పనుల శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నిబంధనల మేరకు దుకాణాలు ఉండేలా చర్యల తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యం జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పర్యాటక స్థలాల అభివృద్ధిపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, పర్యాటక సంరక్షణ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, కసాపురం, గుత్తికోట, పెన్నహోబిలం, పెనకచెర్ల, వజ్రకరూరు, గూగూడు, హంపాపురం, తదితర పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు, ఛారిటీలు, తదితర సేవ సంస్థలు ముందుకు రావాలని సూచించారు. జిల్లాలో డిజిటల్ టూరిజాన్ని పోత్సాహించాలన్నారు. నగరంలో శిల్పారామాన్ని అభివృద్ధి చేసి స్థానిక కళాకారుల ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయాలకు కేంద్రంగా తీర్చిదిద్ధాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖాధికారి జయకుమార్, డీఈఓ ప్రసాద్బాబు, డ్వామా పీడీ సలీంబాషా, శిల్పారామం మేనేజర్ శివారెడ్డి, చరిత్ర ప్రొఫెసర్ సుధాకర్, పర్యాటక సంరక్షణ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శిశువు మృతి కారకులను ఉపేక్షించారా? అనంతపురం రూరల్: శిశుగృహలో నవజాత శిశువు మృతికి కారణమైన వారిని ఉన్నతాధికారులు ఉపేక్షించారా? లేదా శిక్షిస్తారా? అనేది మిస్టరీగానే ఉంది. ఈ నెల 3న శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈ నెల 5న డీఎంహెచ్ఓ, ఐసీడీఎస్ పీడీ, జీజీహెచ్ వైద్యుడితో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగింది. ఆ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి సైతం ఈ నెల 6న శిశుగృహలో విచారణ చేపట్టి ఈ నెల 7 న ఐసీడీఎస్ పీడీ నాగలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శిశువు మృతికి కారణమైన శిశుగృహ సిబ్బందిపై కూడా విచారణ జరుగుతోందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలుంటాయని అందరూ భావించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ అంశాన్ని అక్కడితో ఉన్నతాధికారులు తొక్కిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇదే అంశంపై ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారందరిపై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని... రాప్తాడు రూరల్: మద్యం తాగేందుకుని భార్య డబ్బు ఇవ్వకపోవడంతో భర్త అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ వైఎస్సార్ కాలనీలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. దూదేకుల మహమ్మద్ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ తరచూ భార్య బీబీని వేదించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 5న మద్యం తాగేందుకు రూ. 500 కావాలని భార్యను అడిగాడు. ఆమె తన వద్ద లేవని తెలపడంతో గొడవపడి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భార్య బీబీ బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
పీఎం సభకు వస్తారా? లేదా!
అనంతపురం అర్బన్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అనే చందంగా మారింది జిల్లా అధికారుల పరిస్థితి. కర్నూలు జిల్లాలో గురువారం నిర్వహించనున్న సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో తన ప్రాబల్యం చూపించుకునేందుకు సీఎం చంద్రబాబు భారీ జనసమీకరణకు అధికారులను పురమాయించారు. ఈ క్రమంలో జిల్లా నుంచి 1,500 మంది వ్యాపారులను సభకు పంపేలా ‘టార్గెట్’ విధించారు. జిల్లాలో ఈ బాధ్యతను తీసుకున్న డీఆర్డీఏ, మెప్మా, నగర పాలక సంస్థ, డ్వామా, జిల్లా పంచాయతీ శాఖ అధికారులు వెంటనే రంగంలో దిగి కలెక్టరేట్లో ప్రత్యేకంగా 50 మందిని సిబ్బందిని ఏర్పాటు చేసి, 8 వేల మంది వ్యాపారుల ఫోన్ నంబర్ల జాబితాను అందించి, అందరికీ ఫోన్లు చేయించారు. దీంతో కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీసీ హాల్తో పాటు ఆరుబయట ప్రాంతంలోనూ ఫోన్ కాల్స్ చేస్తూ సిబ్బంది తలమునకలయ్యారు. కేవలం వ్యాపారుల కోసమే ప్రత్యేకంగా ఒక్కో అర్బన్ మున్సిపాలిటీ నుంచి 100 మంది చొప్పున 500 మందిని, నగర పాలక సంస్థ పరిధి నుంచి 300 మంది, రూరల్ మండలాల నుంచి 700 మంది చొప్పున మొత్తం 1,500 మందిని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రూరల్ మండలాలకు చెందిన 700 మందికి 14 బస్సులు కేటాయించారు. అలాగే గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, అనంతపురం నగర పాలక సంస్థ నుంచి 800 మందికి 16 బస్సులు ఏర్పాటు చేశారు. ఉన్నది 511, పంపింది 318 అనంతపురం క్రైం: కర్నూలులో నేడు జరిగే ప్రధాని మోదీ కార్యక్రమానికి బస్సులను ఇష్టారాజ్యంగా పంపడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం రీజియన్ పరిధిలో 511 బస్సులుంటే 318 బస్సులను తరలించారు. బస్సులు ఉండవన్న ముందస్తు సమాచారం లేక చాలా మంది గ్రామీణులు నగరంలో ఉండి పోవాల్సి వచ్చింది. జనసమీకరణలో అధికార యంత్రాంగం 8 వేల మంది వ్యాపారులకు కలెక్టరేట్ నుంచి ఫోన్కాల్స్ -
● నేత్రదానం
శింగనమల(నార్పల): మరణానంతరం నేత్ర దానంతో మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించారు నార్పలకు చెందిన రామాంజనేయులు కుటుంబసభ్యులు. బుధవారం తెల్లవారుజామున రామాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారు. అంతటి విషాదంలోనూ బాధిత కుటుంబ సభ్యులు సహృదయంతో ఆలోచించి మృతుడి నేత్రాలను దానం చేస్తున్నట్లు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి తెలిపారు. దీంతో సొసైటీ బృందం అక్కడకు చేరుకుని రామాంజనేయులు మృతదేహం నుంచి నేత్రాలను సేకరించింది. నేత్రాలను దానం చేసిన రామాంజనేయులు భార్య రాజేశ్వరి, కుమారుడు త్రిగుణ, చెల్లెళ్లు భారతి, శ్రీదేవిని పలువురు అభినందించారు. మహిళలతో మందుబాబుల అనుచిత ప్రవర్తన కళ్యాణదుర్గం: మండలంలోని నారాయణపురం గ్రామంలో మందుబాబులు రాత్రి సమయాల్లో హంగామా చేస్తున్నారు. మద్యం సేవిస్తూ అటుగా వెళుతున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి స్థానిక పాత అంగన్వాడీ కేంద్రం వద్ద ఫూటుగా మద్యం సేవించిన గ్రామానికి చెందిన పి.రామాంజనేయులు, జి. రామాంజనేయులు అనే ఇద్దరు యువకులు నానా హంగామా చేశారు. కొల్లాపురమ్మ ఆలయానికి వెళ్తున్న మహిళలను అసభ్యంగా మాట్లాడుతూ కవ్వింపు చర్యలకు దిగారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. వేళాపాళ లేకుండా గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారని, ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం సేవించి గ్రామంలోని యువకులు పెడదోవ పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. 25 లోపు ఈ–క్రాప్ చేయించుకోండి : జేడీఏగార్లదిన్నె: ఈ నెల 25వ తేదీ లోపు ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని పంటలు సాగు చేసిన రైతులకు జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. గార్లదిన్నె మండలం కమలాపురం, మర్తాడు గ్రామాల్లో బుధవారం వ్యవసాయ అధికారులు చేపట్టిన ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఏడీ అల్తాప్ అలీఖాన్తో కలసి ఆమె పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు పంటలకు ఈ–క్రాప్ నమోదు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది అనూష, మహేశ్వరి, శశిధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మహిళ అనుమానాస్పద మృతి రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మీనుగ సుబ్బయ్య, ఈశ్వరమ్మ దంపతుల ఇంట్లో మంగళవారం రాత్రి వారి మనవరాలు, ఆమె భర్త గొడవపడ్డారు. ఈశ్వరమ్మ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరుగుతున్నాయంటూ కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. దీంతో ఈశ్వరమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భర్త సుబ్బయ్య చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యరాప్తాడు: మండలంలోని గంగలకుంట గ్రామ రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.... నార్పలకు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ (75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన ఆయన బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, లక్ష్మీనారాయణకు భార్య నారాయణమ్మ, ఓ కుమార్తె ఉన్నారు. ధర్మవరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాలువలో వ్యక్తి మృతదేహం కనగానపల్లి: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం కనగానపల్లి మండలం బాలేపాళ్యం సమీపంలో కాలువలో బయటపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన నాగభూషణ (65) రెండు రోజుల క్రితం పంపనూరు వద్ద హంద్రీనీవా కాలువలో ఈ కొడుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కాలువ వెంబడి పరిశీలిస్తూ ముందుకు సాగారు. బాలేపాళ్యం సమీపంలో హంద్రీనీవా కాలువలో బుధవారం కనిపించిన మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
..ఇలా జిల్లా వ్యాప్తంగా ఎందరో అర్హులైన దివ్యాంగులు తమ పింఛన్లు రద్దవుతాయనే ఆందోళనలో సతమతమవుతున్నారు. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం తమకు అర్హత లేకున్నా దర్జాగా సామాజిక పింఛన్లను పొందుతుండడం గమనార్హం.
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన తాడాల నాగభూషణం నాలుగు చక్రాల వాహనాల మెకానిక్గా పని చేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని మానసిక వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందాడు. అప్పట్లో వైద్యులపై ఒత్తిడి చేయించి ఈ సర్టిఫికెట్ పొందాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందుతున్నాడు. తొలుత నెలకు రూ.1,500 వచ్చేది. ఆ తర్వాత రూ.3 వేలు, ఇప్పుడు రూ.6 వేలు వస్తోంది. మానసిక రోగి...ఇంత యాక్టివ్ ఎలా? ఈయన మానసిక రోగిగా ఉంటూ ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నాడనేది ప్రశ్న. అంతేకాదు రాప్తాడు ఆటోనగర్ ప్రెసిడెంట్గానూ పని చేశాడు. ప్రస్తుతం గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్న టీఎన్టీయూసీ పార్లమెంటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. నాగభూషణం అక్రమంగా పొందుతున్న పింఛన్పై గతంలోనూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వందశాతం వైకల్యం కల్గిన అసలైన బాధితుల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైన కూటమి సర్కారు.. తాడాల నాగభూషణం వంటి వారి విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.ఇదిగో ఈ ఫొటో బాగా పరిశీలించండి. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇటీవల రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ‘ఆటోడ్రైవర్ సేవలో’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంలో తీసిన ఫొటో ఇది. ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తి (సర్కిల్లో) టీఎన్టీయూసీ (తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్) హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం. ఈయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడట! దివ్యాంగ కోటాలో (పింఛన్ ఐడీ 112723626) ప్రతినెలా రూ.6 వేల పింఛను తీసుకుంటున్నాడు. ఇటీవల జిల్లాలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో 9,601 మందికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వారందరూ మరోమారు వైద్యుల వద్ద వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. వీరిలో చాలామంది తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ జాబితాలో టీఎన్టీయూసీ నేత తాడాల నాగభూషణం పేరు మాత్రం లేదు. -
నకిలీ మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు
అనంతపురం: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, కూటమి పెద్దల కనుసన్నల్లో రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాలు కల్తీమయం అయ్యాయన్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో ఫేక్ వీడియో సృష్టించి, పక్షపాత దర్యాప్తు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు తప్పుడు వార్తలు రాయిస్తూ, దొంగ డిబేట్లు పెట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మద్యమే కాకుండా.. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్నీ కల్తీ చేస్తున్నారని, చివరకు చంద్రబాబు, ఆయన పార్టీ కూడా కల్తీనే అని విమర్శించారు. ఎకై ్సజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం నాలుగు అణాలు ఖజానాకు వెళితే.. 12 అణాలు చంద్రబాబు జేబులోకి వెళ్తోందనే విషయాన్ని మరవకూడదన్నారు. ప్రతి పల్లెలో నాలుగైదు బెల్టుషాపులు ఉన్నాయని, చంద్రబాబు ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు ఏర్పాటయ్యాయని ఆరోపించారు. ఇందులో తయారైన మద్యం అన్ని షాపుల్లోకి చేరిందన్నారు. ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిలే అన్నారు. నకిలీ మద్యం మకిలిని వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. పోలీసు ఆఫీసర్లే వీడియో రికార్డు చేయించారు ‘నకిలీ మద్యం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. వెంటనే అతని వద్ద ఉన్న వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తారు. కానీ స్వయంగా పోలీసు ఆఫీసర్లే అతనితో వీడియో రికార్డు చేయించారు. అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా అతనితో మాజీ మంత్రి జోగి రమేష్పై ఆరోపణలు చేయించారు. ఇది చాలా దుర్మార్గం’ అని గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రభుత్వం పోలీసుల పట్ల ఎలా వ్యవహరిస్తోందో అందరూ గమనించాలన్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయ్యారని, మరికొందరు సస్పెండ్ అయ్యారని, ఇంకొంత మంది రాష్ట్రం వదలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ఐపీఎస్ అధికారులు కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడొద్దన్నారు. చంద్రబాబు అక్రమంగా సంపాదిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, ఈ అంశాన్ని బీజేపీ, పవన్కల్యాణ్ గుర్తించాలన్నారు. కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఈ విషయాలన్నింటినీ గమనించాలన్నారు. చంద్రబాబు దోపిడీపై పవన్కళ్యాణ్, బీజేపీ నేతలు ప్రధానికి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి మూడింటిలో ఒక బాటిల్ నకిలీ మద్యమే పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారు సీబీఐ విచారణ జరపాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ డిమాండ్ -
టమాట.. నష్టాల బాట
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో 19 వేల హెక్టార్లలో రైతులు టమాట పండిస్తున్నారు. ఇందులో అనంతపురం జిల్లాలో 12 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 7 వేల హెక్టార్లు ఉన్నాయి. 7 లక్షల టన్నుల దిగుబడితో అన్నమయ్య తర్వాతి స్థానంలో అనంత జిల్లా ఉండడం గమనార్హం. ఎకరాకు 14 నుంచి 18 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. కట్టెలు, తీగలు కట్టిన టమాట పంటలో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వస్తుండగా... మామూలు పద్ధతిలో ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. కిలో రూ.22 నుంచి రూ.25 పలికితే పెట్టుబడి పోయి కొంత వరకు మిగులుతుందని అంటున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో కూలీలు, రవాణా ఖర్చులు, మార్కెట్లో కమీషన్లకు కూడా రాబడి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరంభంలో ఊరించి.. సీజన్ ఆరంభం జూన్, జూలై, ఆగస్టులో మార్కెట్లో టమాట ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్లో మార్కెట్ పరిస్థితి తారుమారు అయింది. ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్టో 15 కిలోల బాక్సు ధర గరిష్టంగా రూ.270 ఉండగా కనిష్టం రూ.130 ప్రకారం పలుకుతోంది. సగటున రూ.200తో క్రయవిక్రయాలు సాగుతున్నాయి. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకు మాత్రమే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100 నుంచి రూ.200 మధ్య పలుకుతుండడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రోజూ మార్కెట్కు 2 వేల నుంచి 3 వేల టన్నుల వరకు సరుకు వస్తోంది. అంతటా ఇదే పరిస్థితి! మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చు మిగులుతుందనే ఉద్దేశంతో టమాట కోతలకు స్వస్తి పలికారు. దీంతో పొలాల్లోనే పంటను పశువులకు వదిలేశారు. ఇప్పటికే 60 శాతం పంట పూర్తి కాగా, మరో 40 శాతం మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు తడిసినవి, మచ్చ ఉన్న కాయలను కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. టమాట సాగులో అన్నమయ్య తర్వాత రెండో స్థానంలో ‘అనంత’ ఉండగా ఆ తర్వాత చిత్తూరు, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. కాగా, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లా పరిధిలోని టమాట మార్కెట్లలో ధరల పరిస్థితి కూడా ఇలాగే ఉందని రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. నెలన్నర రోజులుగా రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు కిలో రూ.15 లోపు పలుకుతుండటంతో దక్కని పెట్టుబడి -
అన్యాయం.. అప్రజాస్వామికం
అనంతపురం: ఇటీవల రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చేలా ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ‘సాక్షి’ ఎత్తి చూపుతోందనే అక్కసుతో సర్కారు పెద్దలు రెచ్చిపోతున్నారు.పోలీసుల సాయంతో ప్రజా గొంతుకగా ఉండే ‘సాక్షి’ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అయితే, ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని జర్నలిస్టు సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కక్షసాధింపు చర్యలు, అణచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరి కాదంటున్నారు. వాస్తవాలు తెలియజేయడమే నేరమా? ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా కర్తవ్యం. అలా చేయయడమే నేరమని ప్రభుత్వం భావిస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. – రాచమల్లు భోగేశ్వర రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి ‘సాక్షి’ గొంతునొక్కే చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేయాలని చూస్తే సహించబోం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలువబడే మీడియాపై దాడులు చేయడం పిరికిపంద చర్య. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా పత్రికా విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. – కేపీ కుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ తీరు సరికాదు జర్నలిస్టులు వారికి అందిన సమాచారం ప్రకారం వార్తలు రాస్తుంటారు. నకిలీ మద్యం గురించి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ వార్తలు రాసిన జర్నలిస్టులు లేదా పత్రికా ఎడిటర్, యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడం సరికాదు. దీన్ని జర్నలిస్టులను బెదిరించే ధోరణిగా భావించాల్సి ఉంటుంది. – రేపటి రామాంజినేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి -
ఏసీబీ వలలో సీనియర్ ఆడిటర్
● రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం అనంతపురం టవర్క్లాక్: జిల్లా ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, పార్ట్ టైమ్ స్వీపర్ నూర్ మహమ్మద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. బుధవారం ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలోని రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంట్గా పని చేసిన బుల్లె శ్రీనివాసులు ఈ ఏడాది మే 31న ఉద్యోగ విరమణ చేశారు. పెన్షన్ కోసం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని ఆడిట్ శాఖ కార్యాలయంలో సంప్రదించారు. ఫైలు పెట్టడానికి సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.8 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు బుల్లె శ్రీనివాసులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ కర్నూలు డీఎస్పీ సోమన్న నేతృత్వంలో ఏసీబీ అధికారులు వల పన్నారు. ఇందులో భాగంగా బాధితుడు బుధవారం లంచం డబ్బు తీసుకుని ఆడిట్ కార్యాలయానికి వెళ్లారు. సీనియర్ ఆడిటర్కు ఇవ్వబోగా.. స్వీపర్ నూర్ చేతికి ఇవ్వాలని సూచించారు. అతను డబ్బు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేశారు. సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, స్వీపర్ నూర్ను అరెస్టు చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు. ‘అదనపు’ బాధ్యతలు నిర్వర్తించలేం ● జేడీఏతో మొరపెట్టుకున్న ఏఈవోలు అనంతపురం అగ్రికల్చర్: ఈ–క్రాప్ గురించి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మను కలిశారు. తక్కువగా ఈ–క్రాప్ నమోదయిన మండలాలు, గ్రామాలకు తమను నియమించడం పట్ల అభ్యంతరం తెలిపారు.ఉన్నఫళంగా కొత్త ప్రాంతాలకు వెళ్లి ఈ–క్రాప్ చేయడం కష్టమని చెప్పారు. ఈ నెల 25లోపు ఈ–క్రాప్ పూర్తి చేయాలనే నిబంధన పెట్టారని, ఇంత తక్కువ సమయంలో తమ వల్ల కూడా కాదని అన్నారు. ఆయా మండలాల్లోని ఆర్ఎస్కే అసిస్టెంట్లకే అప్పగించాలని కోరారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అదనపు బాధ్యతలు తీసుకుంటేనే గడువులోపు ఈ–క్రాప్ పూర్తవుతుందని జేడీఏ తెలిపారు. అక్కడికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని తేల్చిచెప్పారు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా?
● సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంపై కలెక్టర్ ఆనంద్ ఫైర్ అనంతపురం మెడికల్: ‘ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏడాదిలో 69 వేల మంది రోగులు వైద్యం పొందగా అందులో కేవలం 29 వేల మందిని ఎన్టీఆర్ వైద్య సేవల కింద నమోదు చేశారు. కనీసం ఆస్పత్రికి వచ్చిన వారిలో 50 శాతం మందిని కూడా నమోదు చేయకపోవడమేంటి? హెచ్డీఎస్లో రూ.1.7 కోట్లు ఉంటే రూ.10 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారా..? ఎన్టీఆర్ వైద్య సేవ, అబా రిజిస్ట్రేషన్లోనూ ఎంతో వెనుకబడ్డారు. మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా’ అంటూ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యంపై కలెక్టర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కలెక్టర్ అధ్యక్షతన హెచ్డీఎస్ (హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులతో ఏవి అత్యవసరమో వాటినే అజెండాలో చేర్చాలి కానీ అందరూ ఇచ్చిన వాటిని నమోదు చేయడం సరికాదన్నారు. అబా రిజిస్ట్రేషన్ కేవలం 50 శాతమే నమోదైనట్లు లెక్కల్లో చూపుతున్నారని, ఏళ్లు గడుస్తున్నా అందులో పురోగతి ఉండదా అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య కుమార్ను కలెక్టర్ ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలారు. ఏసీలు కొనుగోలు చేయడంతో పాటు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోగులకందే సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. బయోవేస్టేజ్ను సరిగా తీసుకెళ్లకపోవడంతో ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం లేకపోలేదని హెచ్డీఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి 50 వీల్చైర్లను అందిస్తామని హెచ్డీఎస్ సభ్యుడు రమణ తెలిపారు. సమావేశంలో హెచ్డీఎస్ కో చైర్మన్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కిరణ్కుమార్ రెడ్డి, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బెన్డెక్ట్, హెచ్డీఎస్ సభ్యులు విశాల ఫెర్రర్ పాల్గొన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు.. తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికులు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ముందు వారు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీనా.. టీడీపీనా అంటూ నూతన ఏజెన్సీ నిర్వాహకులు తమకు ముచ్చెమటలు పట్టిస్తున్నారని వాపోయారు. అరగంట పాటు వారిని కదలనివ్వలేదు. -
ఏరా.. ల... కొడకా!
సాక్షి, కర్నూలు జిల్లా: అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అనుచరుడిపై బూతులతో విరుచుకుపడ్డారు. ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. గుమ్మనూరు జయరాం ఆలూరులోని ఉపాధ్యాయనగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 16న జయరాం పుట్టిన రోజు సందర్భంగా ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహం ఎదుట రెండు రోజుల కిందట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. జయరాం మంగళవారం ఆర్ అండ్ బీ అతిథిగృహానికి చేరుకోగా.. ఫ్లెక్సీని చించివేసిన విషయం అనుచరులు ఆయనకు తెలియజేశారు. వెంటనే ఆయన కారు దిగి ఎదురు షాపులో ఉన్న జ్యోతి ముఖ్య అనుచరుడు రహిమాన్ను పిలిచి ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. తమ పారీ్టకే చెందిన నాయకుడిని టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులు తిట్టడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. జయరాం హడావుడి కారణంగా దాదాపు 15 నిమిషాలు కర్నూలు–బళ్లారి రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
తప్పుమీద తప్పు చేస్తున్న ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాష్ట్రంలో బయట పడిన నకిలీ మద్యపు డంపులు, ఫ్యాక్టరీల వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టను దేశ వ్యాప్తంగా బజారుపాలు చేసింది. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తోంది’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ విచారణ కోరుతున్నామని చంద్రబాబు చెబితే హుందాగా ఉండేదన్నారు. సీబీఐ విచారణ జరపాలని ఎంపీ మిథున్రెడ్డి కోరిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారన్నారు. నకిలీ మద్యం కుంభకోణం వెనుక రాష్ట్ర పెద్దల హస్తం ఉందని ప్రజలు నమ్ముతుండడంతో దిగజారుతున్న ప్రభుత్వ పరువును నిలబెట్టుకునే క్రమంలో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ముద్దాయి మాట్లాడినట్లు ఒక వీడియో విడుదల చేశారన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మళ్లించేందుకే జోగి రమేష్ మీద అభాండాలు, మిథున్రెడ్డి కంపెనీల్లో ‘సిట్’ సోదాలతో హడావుడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బేవరేజస్ కంపెనీల నుంచి కాకుండా ప్రైవేట్గా నకిలీ మద్యం అమ్మకాలతో రూ.15 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. అతిపెద్ద భూ కబ్జా కనిపించలేదా? రాష్ట్రంలో ఎన్నడూ చూడని భూకబ్జా అనంతపురం నగర శివారులోని పాపంపేట పొలంలో చేస్తున్నారన్నారు. 930 ఎకరాల శోత్రియం భూముల్లో నివాసం ఉంటున్న 15 వేల కుటుంబాల ఇళ్లు, స్థలాలను కచ్చా భూములుగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పాగా వేయాలని చూస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, టీడీపీ, సీఎంఓ, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు స్పందించలేదన్నారు. కందికుంట ప్రసాద్కు బాధ ఎందుకో..? రూ.కోట్లు విలువైన భూములు కబ్జా చేస్తున్న పరిటాల సునీత బంధువుల వ్యవహారంపై విమర్శిస్తే కందికుంట ప్రసాద్కు ఎక్కడ బాధ అయ్యిందో అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయింది వాస్తవమో కాదో మంత్రి పార్థసారథిని అడిగి తెలుసుకోవాలన్నారు. ధర్మవరంలో నేసేవారితో రూ.కోట్లు వసూళ్లు చేసింది పరిటాల శ్రీరామో కాదో మీ కుల పెద్దలను అడిగినా, మంత్రి సత్యకుమార్ను అడిగినా చెప్తారన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడానికి మీకు, నాకు పొలం గట్ల తగదాలేవీ లేవన్నారు. ‘రూ.3 కోట్ల కారు అనేది పెద్ద విషయమా? ఏడుసార్లు గెలిచిన కుటుంబం వారి ట్రాక్ రికార్డు, రూ.150 కోట్లతో ఇల్లు కట్టుకోకూడదా? రూ. 15 కోట్లు విలువ చేసే కార్లు ఉండకూడదా? రూ.1000 కోట్ల ఆస్తులు వారు సంపాదించుకోకూడదా?’ అంటూ కందికుంట వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు కిందకు ఇంకవని, లక్షల ఎకరాల భూములు బీళ్లుగా మారతాయని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏమి చేశావు కందికుంట ప్రసాద్ అని నిలదీశారు. నీ అంత ట్రాక్ రికార్డు మాకు లేదు కందికుంట ప్రసాద్ అంత ట్రాక్ రికార్డు తమకు లేదని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ‘డీడీల స్కాం కేసులో సీబీఐ నీపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అప్పీలు ౖఫైలెంది. ఇప్పుడు కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నువ్వు జైలుకు పోకుండా చూసుకో. ఇదీ నీ ట్రాక్ రికార్డు’ అని అన్నారు. ‘ఇక నా ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాలంటే... నేను రాజకీయాల్లోకి రాకముందే సిద్ధరాంపురంలో మా కార్యకర్తలకు మేము సొంతంగా డబ్బులిచ్చి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాం. 2013లో దాదాపు ఐదారు వేల మందికి ‘దీపం’ ధరతోనే గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాను. వేలాదిమంది రైతులకు ఉచితంగా బోర్లు వేయించి, గొర్రెలు, బర్రెలు ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఎంతైనా సంపాదించుకోవచ్చనే నీ విధానానికి మేము చాలా దూరంగా ఉన్నాం. కోవిడ్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి ఇచ్చాం. సహాయక చర్యల కోసం రూ.కోట్లు ఖర్చు చేశాం. పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా నీళ్లు తెప్పించాం’ అని వివరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, మద్దెలచెరువు సుధీర్రెడ్డి, లింగారెడ్డి, బండి పవన్, ఈశ్వరయ్య, నీరుగంటి నారాయణరెడ్డి, మీనుగ నాగరాజు తదతరులు పాల్గొన్నారు. నకిలీ మద్యంపై ఎంపీ మిథున్రెడ్డి సీబీఐ విచారణ అడిగిన గంటల్లోనే ‘సిట్’ ఏర్పాటు సీబీఐ విచారణ కోరతామని చంద్రబాబు చెబితే హుందాగా ఉండేది మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
మాటల్లోనే ఘనాపాటి.. అభివృద్ధి అధోగతి
అనంతపురం క్రైం: ఆయన మాటల్లోనే ఘనాపాటి.. చేతల్లో మాత్రం కాదు. ఆర్భాటంగా ప్రకటనలు చేయడమే కానీ ఆచరణలో చేసిందేమీ ఉండడం లేదు. కోటలు దాటుతున్న మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆశించినస్థాయిలో జరగడం లేదు. తాము అధికారంలోకి వస్తే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీ అమలులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విఫలమయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. మరి ఎక్కడ పనులు చేపట్టారో తెలియని పరిస్థితి. నగరం నలుమూలలా సరైన రోడ్లు లేవు. గుంతలు పడిన, కంకర తేలిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎ.నారాయణపురం బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతూనే ఉంది. రాజీవ్కాలనీ రహదారి నిర్మాణం అధ్వానంగా ఉంది. రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. అనంతపురం వేదికగా జరిగిన ‘సూపర్ సిక్స్’ సభ సందర్భంగా రూ.లక్షలు వెచ్చించి సప్తగిరి సర్కిల్లో రోడ్డు ప్యాచ్వర్కులు చేశారు. అయితే నాసిరకంగా చేపట్టడంతో ప్యాచ్వర్క్ కాస్తా తేలిపోయింది. వర్షాలు వచ్చినపుడు గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు అసౌకర్యంగా మారుతోంది. గుంతల్లో అదుపుతప్పి పలువురు ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. వైఎస్సార్సీపీ పాలనలోనే అభివృద్ధి పరుగులు గత వైఎస్సార్సీపీ హయాం (2019–2024)లో అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టింది. నగరం అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి రహదారుల రూపురేఖలు మార్చేశారు. మురుగు కాల్వలు, శివారు ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టారు. రూ.375 కోట్లతో బళ్లారి బైపాస్ రోడ్డు నుంచి రాప్తాడు పంగల్ రోడ్డు దాకా రహదారి నిర్మాణం జరిగింది. క్లాక్ టవర్ – పీటీసీ వరకు ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ నగరానికే వన్నె తెచ్చిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నగరంలో రోడ్లన్నీ గుంతలమయమే నాసిరకం ప్యాచ్ వర్క్లతో తేలిన కంకర ముందుకు సాగని నారాయణపురం వంతెన నిర్మాణం కలగా మిగిలిన రాజీవ్ కాలనీ రహదారి నిర్మాణం అనంతపురంలోని ప్రధానమైన కూడళ్లలో సప్తగిరి సర్కిల్ ఒకటి. ఇక్కడ రోడ్డుపై ఏర్పడిన గుంతలను కూటమి ప్రభుత్వం హడావుడిగా ‘ప్యాచ్ వర్క్’లో భాగంగా మరమ్మతు పనులు చేయించింది. పనులు చేయించిన కాంట్రాక్టర్ డబ్బు మిగుల్చుకోవడానికి నాసిరకంగా చేపట్టడంతో కొద్ది రోజులకే కంకర తేలిపోయింది. వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. ఇది విద్యుత్ నగర్కు వెళ్లే మార్గం. ఇక్కడ రోడ్డు కంకర తేలి ఉంది. వాహనాలు వెళ్లే సమయంలో కంకర రాళ్లు టైర్ల కిందపడి సమీపంలోని వారిపైకి దూసుకొస్తున్నాయి. కొందరు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇవేమీ పాలకుల కంటికి కనిపించడం లేదని వాహన దారులు మండిపడుతున్నారు. గుంతలు పూడ్చండి అనంతపురంలో ద్విచక్రవాహనం నడపాలంటే నరకమే. సప్తగిరి సర్కిల్ నుంచి సాయినగర్, రుద్రంపేట రోడ్డు, అరవిందనగర్, నాయక్ నగర్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గుంతలైనా పూడ్చి పుణ్యం కట్టుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఆ దిశగా దృష్టి సారించాలి. – లక్ష్మణ్, సున్నంగేరి అడుగు అడుగేయలేం నగరంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లపై పెద్ద ఎత్తున నీరుపారుతోంది. అడుగు వేయలేని పరిస్థితి. ప్రధానంగా సఫ్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, తాడిపత్రి బస్టాండ్, అరవిందనగర్, వేణుగోపాల్ నగర్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు సర్కిల్, బళ్లారి బైపాస్ ఇలా చాలా కూడళ్లు, కాలనీలకు వెళ్లే రోడ్లు గుంతలు పడ్డాయి. కొన్ని కాలనీల్లో నడవడానికి కూడా అనువుగా లేవు. రోడ్ల మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలి. – మహేష్, చిరువ్యాపారి, అనంతపురం -
మొక్కజొన్న పంట దగ్ధం
బెళుగుప్ప: మండలంలోని నక్కలపల్లిలో మహిళా రైతు హనుమక్క తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంగళవారం పూర్తిగా కాలిపోయింది. తోటలోని ట్రాన్స్ఫ్మార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసి పడడంతో మొత్తం మంటలు వ్యాపించాయి. రెండు ఎకరాల్లోని పంటతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయింది. కాలిపోయిన పంటను స్థానిక వ్యవసాయాధికారి అనిల్కుమార్ పరిశీలించారు. నష్ట నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. 25 లోపు పంట నమోదు పూర్తి కావాలి : డీఏఓ బుక్కరాయసముద్రం: జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పంటలను ఈ నెల 25వ తేదీలో ఈ–క్రాప్ నమోదు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. బీకేఎస్, గోవిందపల్లి పంచాయతీలో సాగులో ఉన్న పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ–క్రాప్ నమోదైన పంట నష్టపోతే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు తప్పని సరిగా ఈ– క్రాప్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్యాంసుందరరెడ్డి, రైతు సేవా కేంద్రం ఇన్చార్జ్లు ఇర్ఫాన్, విజయశాంతి, తిరుమలేష్, రైతులు పాల్గొన్నారు. ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయండి ● ధర్నాలో యుఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ రుష్యేంద్రబాబు అనంతపురం అగ్రికల్చర్: ప్రైవేట్ బ్యాంకులను వెంటనే జాతీయం చేయాలని ఆల్ ఇండియా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు యూనియన్ (యుఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ డి.రుష్యేంద్రబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలోని సాయినగర్లో ఉన్న కొటక్ బ్యాంకు ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రుష్యేంద్రబాబు మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న దమననీతిని ఎండగట్టారు. వీటిని జాతీయకరణ చేయడంతో పాటు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఉద్యోగులపై విధించిన క్రమశిక్షణా చర్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే క్యాథలిక్ సిరియన్ బ్యాంకుకు వేతన సవరణ అమలు చేయాలని, నైనింటాల్ బ్యాంకు మూసివేతను ఆపాలని, తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు ఉద్యోగుల వయోపరిమితి 60 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఉద్యోగ సంఘాల నాయకులు రఘునాథరెడ్డి, శివారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, శివానందగుప్తా, శంకర్, భారతి, మున్వర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం అందక విలవిల
అనంతపురం మెడికల్: ప్రజల ఆరోగ్యం కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. సకాలంలో ఎన్టీఆర్ వైద్య సేవలందక రోగులు విలవిలలాడుతున్నారు. బకాయిలు పేరుకుపోయాయని నెట్వర్క్ ఆస్పత్రులు గుండె, కిడ్నీ, కేన్సర్ తదితర ప్రాణాంతక సమస్యలున్న కేసులను చూడకుండా తిరస్కరిస్తుండటంతో రోగులు తిరిగి ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వస్తున్నారు. అధిక సంఖ్యలో రోగులు వస్తుండటంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు అప్పోసప్పో చేసి ప్రైవేట్గా వైద్యం చేయించుకుంటున్నారు. వైద్యమందక.. ప్రత్యక్ష నరకం ● కదిరికి చెందిన 59 ఏళ్ల వ్యక్తికి ఇటీవల గుండె నొప్పి వచ్చింది. హుటాహుటిన అనంతపురం సాయినగర్లోని ఓ కార్డియాక్ ఆస్పత్రికి వచ్చారు. అందులో వైద్యులు పరీక్షించి ‘యాంజియో’ చేయాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స చేయడం లేదని చెప్పడంతో.. రూ.18,000 వెచ్చించి సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ● అనంతపురానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు జారిపడి కాలు విరిగింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కుటుంబీకులు నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ లేదని చెప్పారు. దీంతో వృద్ధురాలు పని చేస్తున్న ఇంటి యజమాని ఆమెకు రూ.35,000 వెచ్చించి ఆపరేషన్ చేయించారు. ● గాండ్లపర్తికి చెందిన యువశ్రీ అనే గర్భిణి మూడవ ప్రసవం కోసం అనంతపురంలోని సాయినగర్లో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది. కాగా అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డెలివరీ చేయలేం అని చెప్పడంతో.. చేసేదిలేక ఆమెను సర్వజనాస్పత్రిలో చేర్చారు. ● జిల్లాలోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కార్డియాక్, నెఫ్రాలజీ సేవలను తిరస్కరించడంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేసులు అధికమయ్యాయి. సూపర్ స్పెషాలిటీలోని క్యాథ్ల్యాబ్లో ఉన్న 30 పడకలు నిండిపోయాయి. కేసులు పెరిగితే పరిస్థితేంటని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. జీజీహెచ్ నుంచి కేసులను రెఫర్ చేయవద్దంటూ చెబుతున్నారు. అదేవిధంగా డయాలసిస్ రోగుల పరిస్థితి అదే విధంగా ఉంది. రోజూ 70 నుంచి వంద మంది వరకు రోగులకు డయాలసిస్ చేయాల్సి ఉంది. కాగా వీరంతా సూపర్ స్పెషాలిటీ, సర్వజనాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 5 ప్రీ ఆథరైజేషన్లు మాత్రమే.. జిల్లాలోని 46 నెట్వర్క్ ఆస్పత్రుల్లో మంగళవారం 5 ప్రీ ఆథరైజేషన్లు మాత్రమే జరిగాయి. సాధారణంగా రోజూ 100 నుంచి 200 వరకు ప్రీ ఆథరైజేషన్లు జరిగేవి. అటువంటిది తక్కువ స్థాయికి పడిపోయాయంటే నెట్వర్క్ ఆస్పత్రుల నిరసన ఏ స్థాయికి చేరుకుందో తెలుస్తుంది. నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు జీజీహెచ్, సూపర్స్పెషాలిటీకి రోగుల క్యూ ప్రజల ఆరోగ్యంపై పట్టనట్టు వ్యవహరిస్తున్న కూటమి సర్కారు -
రైతు కష్టాలు పట్టని అసమర్థ ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ రైతువిభాగం నాయకులు ఉరవకొండ: ప్రత్యామ్నాయ పంటల సాగు కింద సబ్సిడీతో పప్పుశనగ విత్తనాన్ని రైతులకు పంపిణీ చేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం ఉరవకొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రైతువిభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకలసిద్ధార్థ్, రూరల్ సమన్వయకర్త రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడారు. రబీ సీజన్ కింద జిల్లాలో పప్పుశనగను ఉరవకొండ అత్యధికంగా 40 వేల హెక్టార్లలో పప్పుశనగను రైతులు సాగు చేస్తుంటారన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరుకూ రైతులకు రాయితీతో పప్పుశనగ విత్తనం పంపిణీ చేయలేదన్నారు. కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. రాయితీ విత్తన పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరతో విత్తనాలను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. జిల్లాలో గత ఖరీఫ్, రబీతో పాటు ప్రస్తుత ఏడాది ఖరీఫ్, రబీకు సంబందించి విత్తన ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, ఫలితంగా విత్తనం అందక పోవడంతో రైతులపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ చొరవ తీసుకుని విత్తన కంపెనీలకు బకాయిలు చెల్లించి, సకాలంలో రైతులకు విత్తనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బసవరాజు, పార్టీ మండల సమన్వయకర్త ఓబన్న, సుద్దాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
● జెడ్పీ జీఈఓ శివశంకర్ గుమ్మఘట్ట: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జెడ్పీ సీఈఓ శివశంకర్ అన్నారు. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురంలో ఎంపీడీఓ జయరాములుతో కలిసి ఆయన పర్యటించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రంగారెడ్డి పాల్గొన్నారు. జెడ్పీలో పదోన్నతుల కార్యాచరణ ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65 మందికి అవకాశం అనంతపురం టవర్క్లాక్: జిల్లా పరిషత్ పరిధిలోని ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణను చేపట్టినట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య మంగళవారం తెలిపారు. సీనియర్ అసిసెంట్లు, గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,019 మందికి లబ్ధి చేకూరనుండగా ఇందులో ఉమ్మడి జిల్లాలో 65 మంది ఉండడం గమనార్హం. పది వేల జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి డిప్యూటీ ఎంపీడీఓను నియమించనున్నారు. దీంతో ఇకపై ఈఓఆర్డీలను డిప్యూటీ ఎంపీడీఓలుగా పిలువనున్నారు. పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 20 తేదీలోపు అధికారికంగా వెలువడనున్నట్లు తెలిసింది. త్వరలో కింది స్థాయి ఉద్యోగులకూ పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం. వ్యక్తి దుర్మరణం శింగనమల: కారు ఢీకొన్న ఘటనలో ఓ దిచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం సూరేపల్లికి చెందిన సూర్యనాగశేఖర్(52) మంగళవారం అనంతపురానికి వెళ్లి అక్కడ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. శింగనమల మండలం నాయనపల్లిక్రాస్లో టీ తాగిన అనంతరం 544–డీ జాతీయ రహదారిపైకి చేరుకునేందుకు యూటర్న్ తీసుకుంటుండగా తాడిపత్రి నుంచి బెంగుళూరుకు వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన సూర్యనాగశేఖర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. -
గుంతకల్లు ఆస్పత్రిలో డీసీహెచ్ఎస్ విచారణ
గుంతకల్లు టౌన్: నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిపై రోగి, సహాయకులు దాడికి యత్నించి, స్టాఫ్నర్సులను దూషించిన ఘటనపై ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజన్ విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆస్పత్రికి విచ్చేసిన ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్రెడ్డితో పాటు ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడు సల్మాన్ జావేద్, స్టాఫ్నర్సులు, సెక్యూరిటీ గార్డులను పిలిచి ఘటనకు దారితీసిన కారణాలను విచారించారు. నిందితుల వివరాలు, పోలీస్స్టేషన్లో కేసు నమోదు, వారిపై తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. సమగ్ర నివేదికను కలెక్టర్కు పంపనున్నట్లు డీసీహెచ్ఎస్ తెలిపారు. అలాగే ఆస్పత్రులు రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, ప్రతిరోజూ ఔట్పేషెంట్లు, సాధారణ కాన్పులు, తదితర విషయాలను సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. మూగజీవాలపై చిరుతల దాడి కుందుర్పి: మండలంలోని కర్ణాటక సరిహద్దున ఉన్న కొత్తపల్లి గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన రెండు ఆవులపై మంగళవారం మధ్యాహ్నం చిరుతలు దాడి చేసి చంపేశాయి. అటవీవాఖ అధికారులు చర్యలు తీసుకుని చిరుత దాడుల్లో మృతి చెందిన మూగజీవాలకు పరిహారం అందించాలని బాధిత రైతులు మారెన్న, పెద్ద రామప్ప, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. -
పీఏబీఆర్లో ఆగిన జల విద్యుత్ ఉత్పత్తి
కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) వద్ద ఏర్పాటైన ఏపీ జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. డ్యాం నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే ప్రాంతంలోని గేట్ లింక్ దెబ్బతింది. దీంతో నీటిని విడుదల చేయడానికి గేట్ ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 5న జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 3 లక్షల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు ఏపీ జెన్ కో జేఈ కిరణ్ తెలిపారు. బుధ, గురువారాల్లో గేట్ లింక్కు మరమ్మతులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్, జెన్కో సివిల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతులు పూర్తి కాగానే యథావిధిగా జల విద్యుత్ను ఒక టర్బైన్లో గంటకు 3 వేల చొప్పున రోజుకు సుమారు 72,500 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని జేఈ కిరణ్ తెలిపారు. శిల్క్ సమగ్ర పథకానికి టెండర్లు అనంతపురం అగ్రికల్చర్: శిల్క్ సమగ్ర–2 పథకానికి టెండర్లు ఆహ్వానించినట్లు పట్టు పరిశ్రమశాఖ జిల్లా అధికారి ఐ.విజయకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రొఫైలాక్టిక్ మెసర్స్ ఫర్ అస్యూర్డ్ కకూన్ ఈల్డ్’ కింద రైతులకు నాణ్యమైన క్రిమిసంహారక మందులు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన డీలర్లు ఈ నెల 25న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నెల 29న కలెక్టరేట్లో టెండర్లు ఫైనలైజ్ చేస్తామన్నారు. దరఖాస్తుదారులు ఈఎండీ రుసుం కింద రూ.62,500 డీడీ రూపంలో డీఎస్ఓ, పట్టు పరిశ్రమశాఖ పేరు మీద సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 86395 00606 నంబరులో సంప్రదించాలని సూచించారు. పట్టుచీరల వ్యాపారి ఖాతాలో నగదు మాయం యాడికి: సైబర్ నేరగాళ్లు పట్టుచీరల వ్యాపారి బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి దాదాపు రూ.4,22,215 మాయం చేశారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు పట్టుచీరల వ్యాపారి. ఈయనకు తాడిపత్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అకౌంట్ను సైబర్ నేరగాళ్లు మంగళవారం హ్యాక్ చేశారు. మొదటి విడతగా రూ.3,50,000 డ్రా అయినట్లు వ్యాపారి సెల్ఫోన్కు మెసేజీ వచ్చింది. అప్రమత్తమైన శ్రీనివాసులు వెంటనే బ్యాంకు సిబ్బందికి సమాచారాన్ని తెలిపేలోపు రూ.4,999 కట్ అయినట్లు మరో మెసేజీ వచ్చింది. ఇక మూడోసారి రూ.67,216 కట్ అయినట్లు మెసేజీ వచ్చింది. పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బు సైబర్ నేరగాళ్లు కొట్టేయడంతో శ్రీనివాసులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణఅనంతపురం : రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనంతపురం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సాధారణ సభ్యుల అత్యవసర సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. కర్నూలు పర్యటనకు వస్తున్న మోదీ రాయలసీమ ప్రజల ఆకాంక్ష అయిన హైకోర్టు ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జిల్లా కోర్టు విధులను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేశారు. రాజధాని ఆంధ్రా ప్రాంతంలో ఏర్పాటైతే.. హైకోర్టు సీమలో ఏర్పాటు చేయాలని, రాయలసీమలో రాజధాని ఏర్పాటైతే ఆంధ్రా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నాడు జరిగిన పెద్దమనుషుల ఒప్పందాన్ని అనంతపురం బార్ అసోసియేషన్ సెక్రెటరీ ఈ.వెంకట్రాముడు ఉటంకించారు. హైకోర్టు సీమ ప్రజల హక్కు అని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) రాష్ట్ర నాయకులు సూర్యచంద్ర యాదవ్ పేర్కొన్నారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కి.మీ వేగంతో ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గాలి వీచింది.
హక్కుల సాధనకు ఉద్యమించాలి అనంతపురం అర్బన్: చట్టాల అమలు, హక్కుల సాధనకు ఉద్యమించాలని మహిళలకు ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన ఐద్వా 16వ రాష్ట్ర మహాసభలకు రెండవ రోజు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద విధానాలను అవలంబిస్తూ మనువాదం అమలుకు ప్రయత్నిస్తూ మహిళల హక్కులను హరించేందుకు సిద్ధమవుతోందన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర క్రియాశీలకమన్నారు. ప్రధానంగా పాడిరంగంపై ఆధారపడిన మహిళలు అధికంగా ఉన్నారన్నారు. పాడి పరిశ్రమను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దళితులు, మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకురాళ్లు రమాదేవి, హేమలత, రాణి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, ఆవాజ్ రాష్ట్ర కార్యద్శి చిస్తి మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి టీచర్, జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతమ్మ, కోశాధికారి సావిత్రి పాల్గొన్నారు. -
లారీ పరిశ్రమ కుదేలు
తాడిపత్రి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో డీజిల్పై అదనపు పన్ను వసూలు చేస్తుండడంతో లారీ పరిశ్రమ కుదేలవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. ఇంత కాలం రికార్డు ధరలతో తీవ్రంగా నష్టపోయిన వినియోగదారులకు ఈ నెలలో కేంద్రం అందించిన ఉపశమనంతో పాటు దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పెట్రోల్, డీజిల్పై రూ. 2 నుంచి రూ.7 వరకు వ్యాట్ తగ్గించాయి. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీస ఆలోచన చేయడం లేదు. ఫలితంగా లారీ యజమానులు వ్యాట్ రూపంలో తీవ్ర నష్టాలను మూటగట్టు కోవాల్సి వస్తోంది. 3 వేల లారీలపై ప్రభావం తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ పరిశ్రమలైన అర్జాస్ స్టీల్ప్లాంట్, అదానీ పెన్నా.. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్, విండ్ మిల్స్, వందలాది గ్రానైట్, కడపస్లాబ్ యూనిట్లతో పాటు చిన్న, మధ్యతర పరిశ్రమల వల్ల వేలాది లారీలకు నిత్యం బాడుగలు ఉంటాయి. ఒక్క తాడిపత్రి ప్రాంతంలోనే లారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఉపాధి కలుగుతోంది. తాడిపత్రి నుంచి రోజూ ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు నగరాలకు పలు రకాల ముడిసరుకును లారీల ద్వారా రవాణా చేస్తుంటారు. అక్కడి నుంచి కూడా సరుకులు జిల్లాకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే రాష్ట్రంలో డీజిల్పై వ్యాట్ పన్ను అధికంగా ఉండడంతో తాడిపత్రి ప్రాంతంలోని 3వేల లారీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పొరుగు రాష్ట్రాలకు ఆదాయం ఏపీకి సరిహద్దులోని మూడు రాష్ట్రాల్లో డీజిల్ ధర రూ.5 నుంచి రూ.7 వరకు తక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు డీజిల్పై వ్యాట్ శాతాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. అయితే ఏపీలో మాత్రం డీజిల్పై వ్యాట్ శాతాన్ని కూటమి ప్రభుత్వం తగ్గించకపోవడంతో జిల్లాలోని లారీ యజమానులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. దీంతో ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు సరిహద్దు రాష్ట్రాలపై ఆధారపడుతున్నారు. సరుకు రవాణాలో భాగంగా సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ట్యాంక్లను ఫుల్ చేయించుకుని వస్తున్నారు. ఫలితంగా ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే రూ.4 వేలకు పైగా మిగులుతోందని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. వ్యాట్ను తగ్గింపుపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం నాలుగు రాష్ట్రాల్లో కంటే ఏపీలో డీజిల్పై వ్యాట్ అధికం తీవ్రంగా నష్టపోతున్న లారీ యజమానులు సరిహద్దు రాష్ట్రాల్లో డీజిల్ కొట్టిస్తున్న వైనం -
ఎస్జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ –19 సాప్ట్బాల్, బేస్బాల్, హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను మంగళవారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్లో ఎంపిక చేశారు. ఎస్జీఎఫ్ ఉభయ జిల్లాల కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని, వ్యాయామ ఉపాధ్యాయులు గోపాలరెడ్డి, సంజీవరాయుడు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, లతాదేవి, ఓబులేసు, నాగరాజు, రాగేష్బాబు, ప్రతాప్రెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు. ఎంపికై న బాలుర హాకీ జట్టులో మహ్మద్ జునైద్, గోవర్ధన్, శశికుమార్, లవన్కుమార్ నాయక్, అభిషేక్, శబరీష్, స్వామి, జిలాన్, కుమారస్వామి, మహేష్, సుధీర్, రామ్చరణ్, అక్షయ్కుమార్, ఖాదర్బాషా, విష్ణువర్ధన్, సుధీర్, సుధీర్రెడ్డి, అరవింద్ ఉన్నారు. అలాగే బాలిక జట్టులో శివగంగ, భావన, అరిఫా, అక్షయ, సాయివింద్యశ్రీ, శ్రీచైతన్య, భవ్య, వీక్షిత, బేబి, జయశ్రీ, ఆసిన్, తేజశ్రీ, షాను, అంకిత, లక్ష్మన్, రామతులసి, సుమతల, స్వాతి చోటు దక్కించుకున్నారు. బేస్బాల్ బాలుర జట్టుకు ఫర్మాన్, సాయివర్ధన్, కిషోర్, అర్జున్ నాయక్, రాజశేఖర్, షేక్ మహ్మద్, యోగేష్, గురునాథ్, జయవర్ధన్ నాయక్, హర్షిత్, భరత్కుమార్, రాఘవేంద్ర, మణికంఠ, గౌతమ్ గంభీర్, హరీష్, రాజేష్, బాలిక జట్టుకు అఫ్రీన్ భాను, దేవయాని, దివ్య, వైష్ణవి, మోక్షిత, కీర్తన, లక్ష్మి, రశ్మిత, సురేఖ, గుల్షన్, వనిత, మనీషా, హారిక, హర్షిత, ప్రసన్న, భార్గవి ఎంపికయ్యారు. సాప్ట్బాల్ బాలికల జట్టులో అమ్ము, ప్రవసి, భార్గవి, ఓం శాంతి, వైష్ణవి, అక్ష్మిత, యక్షిత, నాగేశ్వరి, ఆశాబేగం, గౌతమి, తులసి, దివ్యశ్రీ, దీక్షిత, వేణువైష్ణవి, చంద్రకళ, శశితేజ, బాలుర జట్టులో శివశంకర్ రెడ్డి, సురేష్, మనోజ్కుమార్, మురళి, ముఖేష్, హర్షవర్ధన్, సిద్ధిక్ బాషా, షాకీర్బాషా, మహ్మద్ శుభం, కార్తీక్, కుశాల్సాయి, మంతేష్, లక్ష్మీపతి, శంకర్ సూర్య, నరసింహ, షెక్షావలి చోటు దక్కించుకున్నారు. -
ఉద్యాన అభివృద్ధికి కేంద్రం సహకారం
● వర్క్షాపులో రాష్ట్ర ఉద్యానశాఖ కన్సల్టెంట్ విద్యాశంకర్ అనంతపురం అగ్రికల్చర్: క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందింస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్హెచ్బీ) సహకారం అందిస్తోందని ఉద్యానశాఖ సీడీపీ రాష్ట్ర కన్సల్టెంట్ విద్యాశంకర్ తెలిపారు. మంగళవారం అనంతపురంలోని ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల ఉద్యానశాఖ అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్తో కలిసి అధికారులు, రైతులు, ఎంటర్ప్రెనూర్స్కు వర్క్షాపు నిర్వహించారు. విద్యాశంకర్ మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటికే అరటి పంటను క్లస్టర్ కింద ఎంపిక చేసి ఎస్కే సంస్థ, ప్రెష్కార్టు సంస్థలకు సీడీపీ పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులు ఇచ్చామన్నారు. జిల్లా పరిధిలో కనీసం రూ.100 కోట్లు విలువ చేసే పంటను ఎంపిక చేసుకుని ముందుకు వచ్చే సంస్థలు, ఎఫ్పీఓలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 20 శాతం వాటా భరిస్తే... 20 శాతం బ్యాంకు రుణం, 20 శాతం సభ్యులైన రైతుల వాటా, మిగిలిన 40 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో అందిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో దానిమ్మ, చీనీ, అరటి, టమాట, మిరప, కర్భూజా, కళింగర పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనం, మొక్కలు, ఎగుమతులు, కల్టివేషన్, పోస్ట్ హార్వెస్టింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ అంశాలపై ఏదైన ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు, మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు అందిస్తే అనుమతులు జారీ చేస్తామన్నారు. దీని వల్ల ఎఫ్పీఓలు, సంస్థలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు ఉంటాయన్నారు. నాణ్యమైన పంట పండించడంతో పాటు బ్రాండింగ్ ద్వారా మార్కెటింగ్ పరిస్థితి మెరుగై ఎగుమతుల ద్వారా ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. -
నాడు గగ్గోలు.. నేడు గప్చుప్
అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు... నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపడం లేదంటూ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరాయుడుు, కుళ్లాయిస్వామి మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో మంగళవారం జెడ్పీ కార్యాలయం ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రధానిపై ఎందుకు ఒత్తిడి తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. కనీసం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ కూడా శంకుస్థాపనలకే పరిమితం కావడం సిగ్గుచేటని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ.. గతంలో ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు.. తిరుపతి వెంకన్న సాక్షిగా.. ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అప్పట్లోనే చంద్రబాబు సైతం పదేళ్లు కాదు.. ఏకంగా పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారని, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తరువాతనే మోదీని ఏపీలో అడుగుపెట్టనిస్తామన్నారు. లేదంటే మోదీ పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు, జిల్లా ఆఫీస్ బేరర్స్ నరసింహ, వెంకట్ నాయక్, వంశీ, మంజునాథ్, ఉమామహేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అవకాశ వాద రాజకీయాలకు పరాకాష్ట రాయలసీమ జిల్లాల్లో అడుగు పెట్టడానికి ప్రధాని మోదీ అనర్హుడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నినాదాలు -
లారీ యజమానులను ఆదుకోవాలి
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో డీజిల్పై వ్యాట్ అధికంగా ఉంటోంది. ఇది కరువు ప్రాంతమైన తాడిపత్రిలో లారీ పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇప్పటికే లారీలకు బాడుగలు లేవు. ఉన్న అరకొర బాడుగలకు పోటీ ఉంటోంది. 2012లో ఉన్న బాడుగలు దాదాపు ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. అప్పట్లో లీటరు డీజిల్ రూ.52 ఉండగా ప్రస్తుతం రూ.97కు పైగా చేరింది. డీజిల్ ధర రెండింతలు పెరిగిన బాడుగలు పెరగకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ఫైనాన్స్ కంతులు కట్టుకోలేక లారీ యజమానులు ఆర్థికంగా చితికిపోతున్నారు. చివరకు ఉన్న లారీలనూ అమ్ముకోవాల్సి వస్తోంది. డీజిల్పై వ్యాట్ పన్నును తగ్గిస్తే లారీ యజమానులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బీకే నదీముద్దీన్, తాడిపత్రి లారీ అసోసియేషన్ కార్యదర్శి -
ఓలా ఈ –బైక్ కంపెనీకి జరిమానా
అనంతపురం: ఓలా ఈ–బైక్ కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషనర్ జరిమానా విధించింది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం బత్తువానిపల్లి గ్రామానికి చెందిన పోలవరపు నాగరాజు 2024 ఏప్రిల్ 19న తన రూపే క్రెడిట్ కార్డు ద్వారా రూ.80,449 మొత్తాన్ని ‘ఓలా ఈ–బైక్’ కొనుగోలు నిమిత్తం చెల్లించాడు. కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ మొత్తాన్ని వారికి జమ చేశాడు. అయితే, ఓలా కంపెనీ వారు బైక్ను ఇవ్వకపోగా ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్కు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ 18న ఓలా ఈ–బైక్ కంపెనీకి నాగరాజు లీగల్ నోటీసులు పంపాడు. వినియోగదారుల కమిషన్లో కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓలా కంపెనీ ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తమకు ఎలాంటి మొత్తం చెల్లించలేదని, ఆన్లైన్ ద్వారా చెల్లింపు విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కంపెనీ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా వారి వివరాల మేరకు ఓలా కంపెనీకి నాగరాజు నగదు చెల్లించినట్లు నిర్ధారణ కావడంతో వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారు వాదనలతో ఏకీభవించింది. డబ్బు వెనక్కి చెల్లించకపోవడం, బైక్ ఇవ్వకపోవడాన్ని సేవాలోపంగా పరిగణించింది. ఫిర్యాదుదారు చెల్లించిన రూ. 80,449 మొత్తానికి 9 శాతం వార్షిక వడ్డీతో 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి చెల్లించాలని తీర్పు వెలువరించింది. అలాగే, మానసిక వేదనకు పరిహారంగా రూ.20 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేల చొప్పున మొత్తం సొమ్మును 45 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత, సభ్యులు గ్రేస్మేరీ, బి. గోపీనాథ్ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు సేవా లోపం లేదని నిర్ధారణ కావడంతో ఎస్బీఐపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. -
తాడిపత్రిలో ‘కాక’ రేపిన జేసీ
తాడిపత్రి టౌన్: జేసీ కుటుంబం తమ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులనే కాకుండా సొంత పార్టీ నాయకులపై సైతం కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశ మైంది. తాజాగా సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీకే చెందిన కాకర్ల బ్రదర్స్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్రెడ్డి ప్రకటించి సొంత పార్టీ నాయకులే విస్తుపోయేలా చేశారు. సీఎం సామాజికవర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అందుకే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానించడం గమనార్హం. గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో జేసీ, కాకర్ల బ్రదర్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేడుకల్లో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొని రణరంగం సృష్టించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువర్గాలు ఒకరిని మించి మరొకరు బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. కాకర్ల బ్రదర్స్ స్టిక్కర్ కనిపిస్తే వాహనాలను ధ్వంసం చేస్తామని అప్పట్లో టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకుల ముందు జేసీ ప్రభాకర్రెడ్డి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జేసీ తనకు తానుగా కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి చర్చకు తెరతీశారు. కాగా, కాకర్ల రంగనాథ్ సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు మంత్రి నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్న నేపథ్యంలో తాడిపత్రి టీడీపీలో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. -
గుట్టను కరిగిస్తున్న ‘తమ్ముళ్లు’
రాప్తాడు: మండలంలోని గొందిరెడ్డిపల్లి గుట్టను టీడీపీ నాయకులు కరిగిస్తున్నారు. ఈ గుట్ట రాప్తాడు సమీపంలో 44వ జాతీయ రహదారికి దగ్గర్లోనే ఉంది. మొన్నటి వరకు గుట్టకు తూర్పు వైపున అక్రమంగా మట్టిని తవ్వేసిన ‘తమ్ముళ్లు’.. ఇప్పుడు కొండ చుట్టూ రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొడుతున్నారు. గుట్ట తవ్వుకునేందుకు లీజుదారులు అభ్యంతరం తెలిపినా వారు వినడం లేదు. గొందిరెడ్డిపల్లి, ఎం.బండమీదపల్లి, రాప్తాడుకు చెందిన నలుగురు ‘తెలుగు తమ్ముళ్లు’ కలసికట్టుగా దోపిడీకి తెరలేపారు. వీరికి సొంతంగా టిప్పర్లు, జేసీబీలు, హిటాచీ వాహనం ఉన్నాయి. వీటి సాయంతో నిత్యం మట్టి తవ్వకాలు చేపడుతూ నగరానికి తరలిస్తున్నారు. రోజూ 100 నుంచి 150 ట్రిప్పుల మట్టి రవాణా చేస్తున్నారు. ఖర్చులన్నీ పోను రోజూ రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న ఈ నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చాక గొందిరెడ్డిపల్లి కొండ పుణ్యమా అని రూ.కోట్లకు పడగలెత్తారు. వీరి అక్రమ దందాకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారికి నెలవారీ మూమూళ్లు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే పోలీసులు, ఆర్టీఏ, భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పొరపాటున ఎవరైనా వీరి వాహనాలను ఆపితే వెంటనే కొందరితో ఫోన్లు చేయిస్తున్నారు. తరచూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెబుతూ మట్టి దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ నిరాటంకంగా మట్టిదోపిడీ -
గుత్తిలో పందుల దొంగల బీభత్సం
● రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి గుత్తి: స్థానిక తురకపల్లి రోడ్డులో పందుల దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి, తిరిగి సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పందుల పెంపకందారులపై రాళ్లు, మద్యం బాటిళ్లతో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన పది మంది దుండగులు పందులను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న చేపల వెంకటేష్ గమనించడంతో అతనిపై రాళ్లు, మద్యం బాటిళ్లతో విరుచుకుపడ్డారు. దాడిలో వెంకటేష్కు చెందిన రెండు ఐచర్ వాహనాలు దెబ్బతిన్నాయి. దూసుకొస్తున్న రాళ్లు, మద్యం బాటిళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ఐచర్ వాహనాల డ్రైవర్లు, చేపల సిబ్బంది అక్కడి పరుగు తీసి ఓ గదిలో దూరి షట్టర్ వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పందుల పెంపకందారులు నారాయణస్వామి, వెంకటరాముడు, శీను, గంగన్న తదితరులు తురకపల్లి రోడ్డులోకి చేరుకోగా మరోసారి వారిపై కూడా రాళ్లు, బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. నారాయణస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే పందుల పెంపకందారులు కూడా దీటుగా ఎదుర్కొవడంతో కొన్ని పందులను వదిలి బొలెరో వాహనంలో ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)లో ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ రాయపరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, 16న ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. 17న కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు. విద్యార్థులకు సైన్స్ సెమినార్ పోటీలు అనంతపురం సిటీ: జాతీయ సైన్స్ సెమినార్–2025ను పురస్కరించుకుని ‘క్వాంటమ్ ఏజ్ బిగిన్స్ – పొటెన్షియల్, ఛాలెంజస్’ అంశంపై జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చదివే 8 ,9 10 విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సైన్స్ సెంటర్ జిల్లా అధికారి బాలమురళీకృష్ణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15న పాఠశాల స్థాయిలో పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన ఇద్దరికి 16న మండల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. మండల స్థాయిలో ఎంపికై న ఇద్దరి చొప్పున ఈ నెల 17న అనంతపురంలోని సైన్స్ సెంటర్లో ఉదయం 10 గంటలకు సైన్స్ సెమినార్ నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఐదు చార్ట్స్, స్లైడ్స్ ఉపయోగిస్తూ గరిష్టంగా ఆరు నిమిషాల పాటు ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి సెమినార్లో ప్రతిభ చాటిన ఇద్దరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. -
ప్రశ్నిస్తే దాడులు.. మహిళలపై వేధింపులు
● మన్నీలలో అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ● ప్రాణాలు పోకముందే స్పందించాలని వేడుకోలు రాప్తాడురూరల్:అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్న కుటుంబాలతో గ్రామస్తులకు ప్రమాదం పొంచి ఉందని పలువురు వాపోయారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలో పోలీసు గ్రీవెన్స్లో అధికారులను కలిసి విన్నవించారు. సుమారు వందమంది గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.బోయ బాలు, బోయ జయరాం, బోయ ఈశ్వర, బోయ శివ, బోయ బాలచంద్ర, ముష్టూరు బోయ అంజితో పాటు వారి బంధువులతో గ్రామంలో ఏ క్షణమైనా ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పొలిమేర దగ్గర ముష్టూరు గ్రామానికి చెందిన దివంగత బోయ కాటమయ్య 100 సంవత్సరాల క్రితం 5 ఎకరాల డీ పట్టా భూమి ఇతరులతో కొనుగోలు చేశాడన్నారు. ఆయన కుమారులు, మనవళ్లు ఇప్పుడు దౌర్జన్యంగా దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నారు. ఎవరైనా నిలదీస్తే దాడులు చేస్తున్నా రన్నారు. తోటల్లో స్టార్టర్ పెట్టెలు, మోటార్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లను ధ్వంసం చేస్తున్నారన్నారు. వీరి దెబ్బకు భయపడి తోటల వద్ద మహిళలు ఒంటరిగా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ఇటుకలపల్లి, వజ్రకరూరు, బత్తలపల్లి, కూడేరు, ఉరవకొండ, అనంతపురం వన్టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల గ్రామంలో ఓ యువతికి పెళ్లి నిశ్చయమైతే పెళ్లి చేసుకునే యువకుడికి ఫోన్ చేసి ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా చెప్పడంతో ఆ పెళ్లికాస్తా పెటాకులైందన్నారు. ఈ ఘటనపై గ్రామ ప్రజలందరూ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారంతా ఇంటి మీదకు వచ్చి గొడవ చేయాలని చూశారన్నారు. గతంలో పోలీసులు కందుకూరు గ్రామంలో ఇలానే నిర్లక్ష్యం చేయడంతో ఒక హత్య జరిగిందని, మన్నీల గ్రామ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తే అంతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్నగిరి ఆదిశేషు, అల్లు షెక్షావలి నాయుడు, అల్లు రామాంజనేయులు, వర్గ ప్రసాద్, రామాంజనేయులు, అన్నగిరి శంకరయ్య, నాగమణి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పూజారి ముసుగులో గంజాయి విక్రయం
● ఇద్దరి అరెస్ట్.. 4 కిలోల గంజాయి స్వాధీనం గుంతకల్లు: ఆలయ పూజారి ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు మరొకరిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎకై ్సజ్ సీఐ శివసాగర్ వెల్లడించారు. సోమవారం గుంతకల్లులోని హనుమన్ సర్కిల్లో తనిఖీలు చేపట్టిన సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే అడ్డుకుని పరిశీలించారు. వారి వద్ద 4 కిలోల ఎండు గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏలూరు జిల్లా వెంకటాపురంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న పూజారి సురేష్బాబు కుమారుడు తిరునగరి మోహన్సుందర్ జల్సాలకు అటువాటు పడి పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామ రామాలయంలో అర్చకుడిగా చేరాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి అబ్బేదొడ్డికి చెందిన సాయిరామ్ అలియాస్ గంజాయి సాయి ద్వారా గుత్తి, గుంతకల్లు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ప్రమాదంలో వ్యక్తి మృతి బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలకు చెందిన శివస్రసాద్ (35) వ్యక్తిగత పనిపై సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. బీకేఎస్ శివారున నార్పల క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న ఆటో బోల్తాపడింది. ఆ సమయంలో వెనుకనే ఉన్న శివప్రసాద్ వేగాన్ని నియంత్రించుకోలేక బోల్తాపడిన ఆటోను ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే 108 అంబులెన్స్లో అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. చికిత్సకు స్పందించక మృతిచెందాడు. ఘటనపై బీకేఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ఎక్కబోతూ... పెద్దపప్పూరు: ట్రాక్టర్ ఎక్కబోతూ కాలు జారి కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... మండలంలోని నామనాంకపల్లికి చెందిన నారాయణమ్మ (70)కు ముగ్గురు సంతానం కాగా, చిన్న కుమారుడి వద్ద ఉంటూ వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పని కోసం వెళ్లిన ఆమె సాయంత్రం వర్షం కురుస్తుండడంతో కూలీలందరితో కలసి ఇంటికి వెళ్లేందుకు ట్రాక్టర్ వద్దకు చేరుకుంది. ట్రాక్టర్ ఎక్కబోతుండగా కాలికి అయిన బురద కారణంగా జారి కిందపడింది. ఆ సమయంలో ఆయుపట్టుకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ ఢీకొని... తాడిపత్రి రూరల్: టిప్పర్ ఢీకొని ఓ ఆటో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన కుళ్లాయప్ప (38) ఉపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చి షేర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆటోలో వెళుతుండగా చుక్కలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ టిప్పర్తో సహా ఉడాయించాడు. అదే సమయంలో మరో ఆటోలో వెళుతున్న సోదరి కృష్ణవేణి గుర్తించి వెంటనే కుళ్లాయప్పను తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. -
నిన్న యూరియా తిప్పలు.. నేడు విత్తన అవస్థలు
అనంతపురం అగ్రికల్చర్: సకాలంలో సరిపడా విత్తనం, ఎరువులు అందించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను ఏడిపిస్తోంది. రబీ మొదలై 15 రోజులు కావొస్తున్నా అన్నదాతలకు విత్తన పప్పుశనగ ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ఈ పాటికే విత్తన పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నా అసలు పంపిణీ ప్రక్రియే ప్రారంభించకపోవడం గమనార్హం. వ్యవసాయ శాస్త్రవేత్తలేమో పంట సాగుకు అసలైన అదను ఈనెల 15న (రేపు) ప్రారంభమవుతుందని, నవంబర్ 15 వరకు విత్తనాలు వేసుకోవచ్చని చెబుతున్నారు. జిల్లాలో 65 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంట సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ రాయితీ విత్తనం ఎప్పుడిస్తారనే విషయం మాత్రం సర్కారు తేల్చడం లేదు. వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ నోరు విప్పడం లేదు. దీంతో పప్పుశనగ రైతులు విత్తనం కోసం ఎదురుచూస్తూ అదును మీరుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులు నేడు విత్తనం కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే తొలిసారి.. రాయితీ విత్తనం ఇవ్వకుండా జాప్యం చేస్తుండటం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రబీ సన్నాహకాలు ఎంత ఆలస్యమైనా అక్టోబర్ 10 లోపు పంపిణీ మొదలు పెడతారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 15 రోజుల క్రితమే కేటాయింపులు, ధరలు ప్రకటించినా, వాటికి కూడా కొర్రీలు వేసింది. 28 వేల క్వింటాళ్ల నుంచి 14 వేల క్వింటాళ్లకు కుదించింది. రాయితీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గించేసి జిల్లా రైతులపై రూ.కోట్ల మేర భారం మోపింది. ప్రజాప్రతినిధుల తీరుపై మండిపాటు రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రిగా పయ్యావుల కేశవ్ చెలామణి అవుతున్నారు. 14 మంది ఎమ్మెల్యేలు, ఇరువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు అధికార పార్టీకి చెందిన వారే అయినా అదునులో విత్తన పప్పుశనగ అందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని చెబుతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా 2020, 2021లో ఖరీఫ్, రబీలో రైతులు ఇబ్బంది పడకుండా సకాలంలో విత్తనాలు, అవసరమైన ఎరువులు సాఫీగా అందించారని గుర్తు చేసుకుంటున్నారు. రబీ రైతులకు విత్తనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం దాటవేత రేపటి నుంచి పంట సాగుకు అదను -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
బుక్కరాయసముద్రం: శింగనమల నియోజక వర్గంలో బాధిత వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజనాథ్ భరోసానిచ్చారు. బీకేఎస్ మండలం చెదుల్ల గ్రామంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్త వన్నూరప్పను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని సోమవారం పోలీస్ స్టేషన్లో బాధితులు పిర్యాదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు అక్రమ కేసులు బనాయించి స్టేషన్కు రావాలని బెదిరిస్తున్నారని వన్నూరప్ప భార్య వాపోయింది. స్పందించిన శైలజనాథ్ వెంటనే పీఎస్కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ప్రజల పక్షాన నిలిచి బాధితులకు న్యాయం చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు చట్ట బద్దంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, చెదుల్ల సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పార్వతి, మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంతరెడ్డి, బండ్లపల్లి ప్రతాపరెడ్డి, కాటమయ్య, నరేష్, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శైలజనాథ్ -
హంద్రీ–నీవా కాలువలో వ్యక్తి గల్లంతు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందని నాగభూషణం, ఓబులేసు సోమవారం బెళుగుప్ప మండలం జీడిపల్లిలో ఉన్న బంధువు కర్మకాండలకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. హంద్రీ నీవా కాలువ వద్దకు చేరుకోగానే స్నానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓబులేసుకు ఈత రాకపోవడంతో మెట్ల వెంట దిగి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని వచ్చాడు. అనంతరం నాగభూషణం కాలువలో దిగి ఈత కొడుతూ ప్రవాహ వేగానికి కొట్టుకు పోయాడు. ఆ సమయంలో ఓబులేసు కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసే లోపు నాగభూషణం (62)కనిపించకుండా పోయాడు. సమాచారుం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆశగా తరలివచ్చి.. అర్జీలు అందించి
అనంతపురం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పోటెత్తాయి. ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 422 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి అర్జీదారులతో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు నాణ్యమైన పరిష్కారం చూపాలని చెప్పారు. వినతుల్లో కొన్ని... ● తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని అనంతపురం పాతూరులో నివాసముంటన్న చాంద్బాషా విన్నవించాడు. గతంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కంటింజెట్ ఉద్యోగిగా పనిచేసే వాడినని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఉద్యోగం చేయలేక పోయానని చెప్పాడు. ప్రస్తుతం ఆరోగ్య బాగుందని, తిరిగి తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. ● మిషన్ వాత్సల్య పథకం కింద తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించాలని స్థానిక జనచైతన్య నగర్కు చెందిన నీలావతి విన్నవించింది. తన భర్త చనిపోయాడని, కుటుంబపోషణ భారంగా ఉందని వాపోయింది. తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, మిషన్ వాత్సల్య పథకం కింద ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ● తమ భూమిని వేరొకరి పేరున ఆన్లైన్లో నమోదు చేశారని కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామానికి చెందిన రాము ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 523లో తమకున్న రెండు ఎకరాలు భైరవానితిప్ప కాలువకు పోయిందని చెప్పాడు. ఆన్లైన్లో తమ భూమికి సంబంధించి 68 సెంట్లు రమేష్ అనే వ్యక్తి పేరున నమోదైందన్నాడు. ఇందుకు సంబంధించి ఫైలు కలెక్టరేట్కు వచ్చినా పరిష్కారం కాలేదని వాపోయాడు. న్యాయం చేయాలని కోరాడు. ● పెద్దమనిషిగా ప్రజల తరఫున మాట్లాడిన తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా కూడేరు పోలీసుస్టేషన్లో కేసు పెట్టారని కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన గొల్ల చిదంబరప్ప వాపోయాడు. తమ గ్రామంలోని పోస్టాఫీసు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామంలో కొందరు జేసీబీతో కూల్చి ఆక్రమించుకున్నాని చెప్పాడు. ప్రజలకు అక్కడ పోస్టాఫీసు కావాలని చెప్పినా వినకుండా తనపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని, దీనిపై న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీలు -
ఎస్జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్, ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే బాలబాలికల జట్ల ఎంపిక సోమవారం అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేపట్టారు. ఉభయ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శలు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని హాజరై ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేశారు. ఖోఖో బాలికల జట్టుకు స్వప్న, సోనిక, ధానేశ్వరి, అంజలి, లలిత, హరిణి, భవ్యశ్రీ, శ్వేత, పావని, సంధ్య, జయషాలిని, మౌనిక ఎంపికయ్యారు. బాలుర జట్టులో నందకిషోర్, కార్తీక్, అనిల్కుమార్, హరికృష్ణ, దేవేంద్ర, నరేంద్ర, చరణ్, సందీప్, పూరణ్చంద్ర, గణేష్కుమార్, జైకృష్ణ, హర్ష చోటు దక్కించుకున్నారు. అలాగే హ్యాండ్బాల్ బాలుర జట్టుకు అభిషేక్, అర్జున్, పవన్కుమార్, తరుణ్, పునీత్కుమార్, దేవేంద్ర, హిమేష్, శివశంకర్, అభిరాం, సూర్యతేజ, ఉదయ్సాయి, జగన్మోహన్, లిఖిత్, లోవరాజు, వర్ధన్, జాఫర్ ఎంపికయ్యారు. బాలికల జట్టులో అర్చన, రక్షిత, సుస్మిత, నాగరత్న, గంగమ్మ, హాసిని, లక్ష్మి, గురువర్షిణి, హరిణి, జనప్రియ, నందిని, ఉమ, అక్షయ, రిత్, బృందా, హర్షిత చోటు దక్కించుకున్నారు. ప్రేమికులు తెచ్చిన తంటా ● పోలీసులపై చర్యలకు రంగం సిద్ధం అనంతపురం సెంట్రల్: ప్రేమికులకు ఇచ్చిన కౌన్సెలింగ్ పోలీసు సిబ్బంది మెడకు చుట్టుకుంది. పలువురిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గార్లదిన్నె మండలంలో ఓ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల యవతి, 16 సంవత్సరాల బాలుడు ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన వారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో మోకాళ్లపై నిలబెట్టి తీవ్రస్థాయిలో మందలించారు. ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు.. ఆ రోజు ఏం జరిగిందనే అంశంపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై నాల్గవ పట్టణ సీఐ జగదీష్ను వివరణ కోరగా... ప్రేమ జంటను మోకాళ్లపై నిలబెట్టలేదని, మంచిగా జీవించాలని కౌన్సెలింగ్ చేసినట్లు వివరించారు. -
నో‘ట మాట’ లేక
టమాట ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ధరలు ఆకాశాన్నంటి రైతులకు లాభాలు తెచ్చి పెట్టే ఈ పంట.. మరో సారి అథఃపాతాళానికి పడిపోయి కన్నీరు పెట్టి స్తోంది. ఎక్కడ పడితే అక్కడ పారబోసేలా చేస్తోంది. కొన్ని రోజులుగా మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పడి పోయాయి. ఒక్కో బాక్సు రూ.70 నుంచి రూ. 100 లోపే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటలను మార్కెట్కు తీసుకువెళ్లే వాహనం ఖర్చులు కూడా మిగలకపోవడంతో దిక్కుతోచక రోడ్ల పక్కన పారబోస్తున్నారు. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పిల్లలపల్లి వద్ద ప్రధాన రహదారిపై కుప్పలు కుప్పలుగా టమాటలను పారబోసిన దృశ్యమిది. – బ్రహ్మసముద్రం: -
కూలిన కల్వర్టు రక్షణ గోడ – ఇద్దరికి గాయాలు
● నాసిరకం పనులే కారణమన్న స్థానికులు కళ్యాణదుర్గం: స్థానిక టీ సర్కిల్ మీదుగా 20 అడుగులకు పైగా వెడల్పుతో వెళుతున్న కల్వర్టుకు ఇటీవల నిర్మించిన రక్షణ గోడ ఆదివారం సాయంత్రం ఉన్నఫళంగా కుప్పకూలింది. అవతలి వైపుగా ఉన్న దుకాణాలకు, కల్వర్టుకు మధ్యలో రక్షణ గోడను కట్టారు. గోడ పక్కనే తోపుడు బండ్లను పెట్టుకుని వ్యాపారాలతో కొందరు జీవనం సాగిస్తున్నారు. గోడ కుప్పకూలుతుండగా గమనించిన స్థానికులు సాహసం చేసి కూరగాయల వ్యాపారి గోవిందమ్మ, అరటి పండ్ల వ్యాపారి కావేలమ్మను పక్కకు లాగారు. అప్పటికే గోడ కూలడంతో ఇద్దరూ గాయపడ్గారు. కూరగాయల బండితో పాటు ఓ ద్విచక్ర వాహనం శిథిలాల కింద చిక్కుకుని నుజ్జునుజ్జయ్యాయి. అరటి పండ్లు నేలపాలయ్యాయి. స్థానికులు అప్రమత్తం కాకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉండేదని పలువురు వాపోయారు. క్షతగాత్రులను వెంటనే ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాసిరకం పనులే కారణం.. కల్వర్టు పనులు చేపట్టిన టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ నాసిరకం పనులు సాగించారని, దీంతో గోడ కుప్పకూలిందంటూ పలువురు స్థానికులు ఆరోపించారు. ఆదివారం ఉదయం కూడా కల్వర్టు కింద పనులు చేశారని తెలిపారు. నీరు ఎక్కువగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అండ చూసుకుని కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారన్నారు. ప్రాణాలు పోయిఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించి, బాధితులను ఆదుకోవాలని కోరారు. కాగా, విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్, టీడీపీ నేతలు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు. -
పురుగు మందు పీల్చి ఉక్కిరిబిక్కిరి
గుంతకల్లుటౌన్: మొక్కజొన్న పంటలో మొవ్వ తొలుచు పురుగులను నియంత్రించడానికి ఆకుసుడుల్లో క్రిమిసంహారక మందులను వేస్తున్న తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పురుగు మందు వాసన పీల్చడంతో దాని గాఢతకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులతో చేనులోనే కళ్లు తిరిగిపడిపోయారు. ఈ ఘటన ఆదివారం గుంతకల్లు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ గుంతకల్లు సమీపంలోని ఐదు మోరీల వద్ద బాపట్ల జిల్లా ద్రోణాదులకు చెందిన కౌలురైతు సుబ్బరాయుడు 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం రైతు పిలవడంతో మొక్కజొన్నలో పట్టిన పురుగు నివారణకు మందు చల్లడానికి ఒక్కొక్కరికీ రూ.280 చొప్పున కూలి మాట్లాడుకుని స్థానిక మహబూబ్నగర్ కాలనీకి చెందిన 19 మంది వ్యవసాయ కూలీలు ఒకే ఆటోలో కలిసి వెళ్లారు. కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ అనే పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపి ఆకుసుడుల్లో వేస్తుండగా.. మందు వాసన పీల్చడంతో వహీదాబేగం,మహాలక్ష్మి, వరలక్ష్మి, సుశీల, చంద్రకళ, శారదమ్మ, అశ్విని, రామాంజినమ్మ, నాగేశ్వరమ్మలకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులయ్యాయి. కళ్లు తిరిగి అక్కడే పడిపోయారు. కౌలురైతు, తోటికూలీలు వెంటనే వారిని ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణ సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పురుగు మందు గాఢత నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్రెడ్డి తెలిపారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని, తరువాత పరీక్షలు నిర్వహించి వారిని డిశ్చార్జ్ చేస్తామని ఆయన తెలిపారు. కాగా.. మిగిలిన పది మంది కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో వారు ఇళ్లకు వెళ్లిపోయారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం మొక్కజొన్నలో కత్తెర పురుగులను నియంత్రించడానికి వినియోగించే కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ పురుగు మందు చాలా ప్రమాదకరమైనది. పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించాలి. గాలి ఎదురుగా వచ్చినప్పుడు పురుగు మందు ముఖంపై పడుతుంది. అప్పుడు దానిని పీల్చడం వల్లనే అస్వస్థతకు గురవుతారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు కూడా మందు పిచికారీ చేయొద్దు, చల్లొద్దని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా చాలా మంది వినడం లేదు. – లీనా వసుంధర, మండల వ్యవసాయాధికారిణి, గుంతకల్లు 9 మంది మహిళా వ్యవసాయ కూలీలకు అస్వస్థత -
అలా చేస్తే బాబుకు పుట్టగతులుండవ్
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన బీకేఎస్ మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లి, వెంకటాపురం గ్రామాల్లో రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ ఎం మోహన్రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారంటూ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారన్నారు. ఏనాడూ మెడికల్ కళాశాలల గురించి మాట్లాడని చంద్రబాబు నేడు జగనన్న తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముసలన్న, ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, సర్పంచ్లు పార్వతి, రమేష్, పూల నారాయణస్వామి, కాటమయ్య, చికెన్ నారాయణస్వామి, వరికూటి కాటమయ్య, శివారెడ్డి, కుళ్లాయప్ప, పట్నం ఫనీంద్ర, బాలక్రిష్ణారెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే మాజీ మంత్రి శైలజానాథ్ -
‘చల్ల’గా పాగా వేసేశాడు
అనంతపురం క్రైం: ఆక్రమణలు వద్దు ‘బాబో’ అంటూ ప్రజలు మొత్తుకుంటున్నా ‘చల్ల’గా ఆయన పాగా వేసేశాడు. ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలంలో భవనం నిర్మించి వేలాది రూపాయల అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నాడు. కోర్టు రోడ్డులోని సూరి హోటల్ ఎదురుగా 7 అడుగుల వెడల్పు, 67 అడుగుల పొడవు మేర స్థలాన్ని ఓ టీడీపీ నేత ఆక్రమించాడు. ఇందులో హోటల్ను నడుపుకునేందుకు అద్దెకిచ్చాడు.తాజాగా ఆ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నాడు. స్థలం కబ్జా చేయడమే కాకుండా పట్టపగలే యథేచ్ఛగా అక్కడ నిర్మాణాలు చేపడుతుండడంపై ఇటీవల పలువురు నగర పాలక సంస్థ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనరు బాలస్వామి ఆ స్థలాన్ని పరిశీలించి తక్షణం తొలగించుకోవాలని ఆదేశించారు. అధికారుల ఎదుట సరేనని తల ఊపిన కబ్జారాయుళ్లు వారు అటు వెళ్లగానే ఇటు పనులు తిరిగి ప్రారంభించడం గమనార్హం. దీనిపై మళ్లీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నగరంలో ఎక్కడైనా నాలుగడుగుల స్థలంలో తోపుడు బండి పెట్టుకుంటే వెంటనే అక్కడ వాలి తరిమేస్తున్న అధికారులు.. నగరం నడిబొడ్డున స్కావెంజర్ లైన్లో స్థలాన్ని ఓ టీడీపీ నేత ఆక్రమించినా పట్టించుకోకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం... తేల్చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ నేత అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్నారని, దీంతోనే అధికారులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున స్కావెంజర్ లైన్ స్థలం కబ్జా ఓ టీడీపీ నేత బరి తెగింపు -
నేడు పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్! అనంతపురం సెంట్రల్: ‘న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారి ఎదుటే నాపై దాడి చేశారు. అయినా దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు’ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిలో గాయపడిన మరో బాధితుడు ప్రభాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము శ్రీనగర్కాలనీ సమీపంలోని ఎలైట్హోమ్లో నివసిస్తున్నామన్నారు. ఈనెల 10న అక్కడ ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లామన్నారు. పక్కింట్లో నివాసముంటున్న ఓ బాలుడు క్రికెట్ బాల్ వేయమని కోరగా వేశానని, ఆ బంతి భువన చక్రవర్తి కారుకు తగలిందని చెబుతూ కొంతమంది తనపై చెప్పుతో దాడి చేశారన్నారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వెళ్తే మళ్లీ పోలీసుల సమక్షంలోనే తనపై చేయి చేసుకున్నారని వాపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ హరికుమార్ను కూడా కొట్టే ప్రయత్నం చేశారన్నారు. అన్నీ తెలిసిన మాలాంటి వారికే ప్రజాస్వామ్యంలో రక్షణ లేదంటే, ఇక సామాన్యులు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. తాము తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకై నా సిద్ధమన్నారు. ఇప్పటికీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అల్లుడు తేజ అనుచరులమని చెప్పుకుంటూ కొందరు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర స్థాయి గోల్ షూట్ విజేత ‘అనంత’ కదిరి అర్బన్: చిత్తూరు జిల్లా నేరేబైలు గ్రామంలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి గోల్ షూట్ పోటీల బాలికల విభాగంలో ఉమ్మడి అనంతపురం జట్టు విజయం సాధించింది. అబ్బాయిల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా గోల్షూట్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్ ఆదివారం వెల్లడించారు. గుత్తిలో టీడీపీ కార్యకర్తల గూండాగిరి గుత్తి: పట్టణంలో టీడీపీ కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. దస్తగిరి, కుష్బూ అనే దంపతులపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశారు. వివరాలు.. రెండు మాసాల క్రితం దస్తగిరి ఇంటిని టీడీపీ కార్యకర్తలు బలవంతంగా ఖాళీ చేయించారు. అంతే కాకుండా భార్యాభర్తపై దాడి చేశారు. ఈ ఘటనపై దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 21 మందిపై కేసు నమోదు చేశారు. తమపైనే కేసు పెడతారా అంటూ ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న దస్తగిరి, కుష్బూ దంపతులపై షణ్ముఖ, శివ, పుల్లయ్యతో పాటు మరో ముగ్గురు దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి బస్టాండ్కు చేరుకోగా.. అప్పటికే టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి ఉడాయించారు. గాయపడిన దంపతులను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపారు. అనంతరం వారు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. పైగా వారినే గద్దించి స్టేషన్ నుంచి బయటకు పంపారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితుడు దస్తగిరి చెప్పాడు. -
రబీ అంచనా 1,07,503 హెక్టార్లు
అనంతపురం అగ్రికల్చర్: రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానపంట కింద పప్పుశనగ 65,017 హెక్టార్లు కాగా ఆ తర్వాత నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7,888, వరి 6,069, జొన్న 4,919, ఉలవ 1,377, పొద్దుతిరుగుడు 1,230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చని చెబుతున్నారు. అక్కడక్కడా గోధుమ, సజ్జ, రాగి, కొర్ర, పెసర, మినుము, అలసంద, నువ్వులు, కుసుమ, ఆముదం తదితర పంటలు కూడా సాగులోకి వస్తాయని అంచనా వేశారు.గతేడాది రబీ సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 వేల హెక్టార్లు తగ్గవచ్చంటున్నారు. 80,950 మెట్రిక్ టన్నుల ఎరువులు.. ఈ రబీలో 80,950 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని ప్రణాళిక రూపొందించారు. అందులో యూరియా 25,990 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్లు 37,900 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9,500 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) 4,900 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్పాస్ఫేట్ (ఎస్ఎస్పీ) 2,660 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ కంపెనీల ద్వారా సరఫరా చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రబీ కింద 4 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చాయన్నారు. విత్తనం కోసం ఎదురుచూపు.. రబీ మొదలై 12 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ రాయితీ కింద విత్తన పప్పుశనగ ఎప్పుడిస్తారో అర్థం కాక రైతులు విలవిల్లాడుతున్నారు. ధరలు, రాయితీలు, కేటాయింపులు ప్రకటించి నెల రోజులవుతున్నా విత్తన సేకరణే ప్రారంభించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అసలే కేటాయింపులు 28 వేల నుంచి 14 వేల క్వింటాళ్లకు, రాయితీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి పరిమితం చేసి ఇబ్బందులోకి నెట్టిన కూటమి సర్కారు... కేటాయింపుల మేరకై నా ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం గమనార్హం. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలకే పప్పుశనగ సాగును రైతులు ప్రారంభించారు. చంద్రబాబు సర్కారుపై ఆశలు సన్నగిల్లిన కొందరు విధిలేని పరిస్థితుల్లో బళ్లారి, కర్నూలు జిల్లాల నుంచి విత్తనం తీసుకువస్తున్నట్లు తెలిసింది. -
డీఎస్పీ కార్యాలయం ఎదుట.. దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్: ఆర్థిక వ్యవహారాలతో విసుగు చెందిన దంపతులు అనంతపురం డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన అశోక్ మూడేళ్ల క్రితం బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన గాలి ఆంజనేయులు కుమార్తె గిరిజను పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులకు ముగ్గురూ కుమార్తెలు కాగా, తన అవసరాల కోసం అల్లుడు అశోక్ వద్ద దాదాపు రూ. 18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఏడాది క్రితం చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడి ఆంజనేయులు మృతి చెందాడు. వీరికి దాదాపు 30 ఎకరాల వరకూ స్థిరాస్తి ఉంది. దీంతో అశోక్ తాను రూ.3, రూ.4తో వడ్డీకి తెచ్చి నగదు సమకూర్చానని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అత్త లక్ష్మీదేవిని కోరాడు. అదే సమయంలో తన వాటా కింద రావాల్సిన స్థిరాస్తిని పంచివ్వాలని గిరిజ కోరింది. అయితే అప్పు చెల్లించకపోగా వాటాగా ఇవాల్సిన స్థిరాస్తిని ఇచ్చేందుకూ లక్ష్మీదేవి అంగీకరించలేదు. ఈ విషయంగా పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక అశోక్ తన భార్య గిరిజతో కలిసి ఆదివారం ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఉన్న డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ను పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకుని టూటౌన్ పీఎస్కు తరలించారు. తన వదినలైన వందన (బీసీ వెల్పేర్ జూనియర్ అసిస్టెంట్), కవిత (కూడేరు మండలం కదరంపల్లి అంగన్వాడీ వర్కర్), కంబదూరు చెందిన రామకృష్ణస్వామి అలియాస్ బంబంస్వామి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని బాధితుడు అశోక్ వాపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. -
ఉపాధి బిల్లుల్లో గోల్మాల్!
కళ్యాణదుర్గం: ఉపాధి హామీ పథకం పనులు చేయించిన వారి మెటీరియల్ పేమెంట్ బిల్లుల చెల్లింపులో గోల్మాల్ జరిగింది. గత టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల విడుదలకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత దృష్టి సారించింది. ఈ అవకాశాన్ని కంబదూరు మండలంలోని ‘పచ్చ’ నేతలు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పనులు చేసిన వారికి మొండిచేయి చూపి.. తమ అనుచరులైన వారి ఖాతాలకు వేతనాలు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఇందుకు ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. 2014 – 2019 మధ్య కాలంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మండలంలో వివిధ శాఖల ద్వారా ఉపాధి హామీ పథకం నిధులతో 497 పనులు చేపట్టారు. 2019 నాటికి మెటీరియల్ పేమెంట్ కింద ఇవ్వాల్సిన బిల్లులు ఆగిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం పెండింగ్ ఉపాధి బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంది. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు వేతన బిల్లులపై కన్నేశారు. కొంతమంది ఉపాధి సిబ్బందితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు పనులు చేసిన వారిని కాకుండా.. తాము చెప్పిన వారి ఖాతాలకు మెటీరియల్ పేమెంట్ డబ్బులు పడేలా ప్రణాళిక రచించారు. ఈ క్రమంలోనే మండలంలో శాఖల వారీగా అప్పట్లో చేసిన 497 పనులకు సంబంధించి రూ.22.34 లక్షల బిల్లులను టీడీపీ నేతల అనుచరుల ఖాతాలకు జమ చేశారు. తూతూ మంత్రంగా విజిలెన్స్ విచారణ.. కంబదూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ నిధుల అక్రమాలపై రెండు రోజుల క్రితం అనంతపురం నుంచి డ్వామా విజిలెన్స్ అధికారి ఒకరు విచారణకు వచ్చారు. అయితే తూతూ మంత్రంగా విచారణ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విచారణ ‘మమ’ అనిపించడం అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉపాధి నిధులు జమ అయిన అకౌంట్లను పరిశీలించి ఉంటే పూర్తిస్థాయిలో అక్రమాలు వెలుగులోకి వచ్చేవని పలువురు తెలిపారు. పనులు చేసిన వారికి మొండిచేయి పచ్చ నేతల అనుచరుల ఖాతాలకు నిధులు జమ 2014– 19 నాటి బిల్లుల మంజూరులో అక్రమాలు -
పేదలకు వైద్య విద్య దూరం
కళ్యాణదుర్గం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో నష్టపోయేది మన పిల్లలేనని, పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో తలారి రంగయ్య మాట్లాడుతూ.. పేదలకు వైద్య విద్యను సులభతరం చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలకు అనుమతి తీసుకువచ్చారన్నారు. వీటిలో 5 కళాశాలలను ప్రారంభించి, అడ్మిషన్లు చేపట్టి తరగతులూ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారన్నారు. మిగిలిన 12 కళాశాలల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఓ మెడికల్ కాలేజ్ ఏర్పాటై ఉండేదన్నారు. అయితే వీటి నిర్మాణాలు వద్దని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాసి అడ్డుకోవడమే కాక, తాజాగా వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందే పరిస్థితి లేకుండా పోతోందన్నారు. కళాశాలలు ప్రైవేట్ పరమైతే వైద్య విద్య అత్యంత ఖరీదుతో కూడుకుంటుందని, ఫలితంగా వేరే చిన్న దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన మన పిల్లలు అనారోగ్యం బారిన పడటం, ఆక్సిడెంట్ల బారిన పడడం కారణంగా చాలా మంది చనిపోయారని గుర్తుచేశారు. ప్రభుత్వంతో డబ్బులు లేవంటూ సాకులు చెప్పడం సరికాదన్నారు. కూటమి కుట్రలను తిప్పికొట్టి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కోటి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు రాస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేరు, ఊరు, సెల్ నంబర్తో పాటు సంతకాలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజ్కుమార్, మున్సిపల్ విభాగం వైఎస్సార్సీపీ కన్వీనర్ సుధీర్, రూరల్ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, జి.హనుమంతరాయుడు, కౌన్సిలర్లు తిరుమల వెంకటేశులు, గోపారం శ్రీనివాసులు, పరమేశ్వరప్ప, శెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ్, దొడగట్ట నారాయణ, కిష్టప్ప, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు నాగలక్ష్మి, తిప్పేస్వామి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు యర్రంపల్లి కృష్ణమూర్తి, రామాంజనేయులు, నాయకులు మురళి, రామిరెడ్డి, రాజు, మల్లికార్జున, పాతలింగ, చరణ్, షెక్షావలి, బిక్కిహరి, రాజు, చిరు,ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ రాజగోపాల్, దొడగట్ట నాయకులు గోవిందప్ప, బసవరాజు, సూరి, తమ్మన్న, బుశప్ప, చిత్తయ్య, ఎర్రిస్వామి, సవారప్ప, రాజు, రవి, పాలన్న, గంగన్నతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే నష్టపోయేది మన పిల్లలే మాజీ ఎంపీ తలారి రంగయ్య -
మహిళా చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం
● ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి అనంతపురం అర్బన్: మహిళా రక్షణ చట్టాల అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి మండిపడ్డారు. ఫలితంగా దేశంలోను, రాష్ట్రంలోను మహిళలకు రక్షణ కరువైందన్నారు. బేటీ బచావో... బేటీ పడావో అని మాటల్లో చెబుతున్నా.. ఆచరణలో చూపించడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి, కోశాఽధికారి సావిత్రి, జిల్లా కార్యదర్శి చంద్రిక, నాయకురాలు నాగమణితో కలిసి విలేకరులతో పుణ్యవతి మాట్లాడారు. మహిళల సమస్యలపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు అనంతపురం నగరంలో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద ప్రతి నెల రూ.1,500, వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలు వరకు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హమీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాట వాటిని అమలు చేయలేదన్నారు. వీటిపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం నగరంలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ యల్లనూరు: మండలంలోని మల్లాగుండ్ల సమీపంలో చిత్రావతి నది ఒడ్డున పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్న నాగశేఖర్, సీతారామిరెడ్డి, శీనుతో పాటు 12 మందిని అరెస్ట్ చేసి, 11 ద్విచక్ర వాహనాలు, రూ.82,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. కర్ణాటక మద్యం పట్టివేత అనంతపురం సెంట్రల్: కర్ణాటక మద్యం తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ టాస్క్ఫోర్సు సీఐ జయనాథ్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ ఆదివారం వెల్లడించారు. టాటా జెస్ట్ వాహనం నుంచి తెల్లటి సంచులను దింపుతుండగా అనుమానం వచ్చిన ఎకై ్సజ్ పోలీసులు గమనించి, తనిఖీ చేశారు. అందులో 90 ఎంఎల్ సామర్థ్యం ఉన్న కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యం ఉన్నట్లుగా గుర్తించి వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. మద్యం దింపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో తన పేరు వెంకటపతి అని, లెనిన్నగర్లో నివాసముంటున్నట్లుగా వెల్లడించాడు. కర్ణాటకలోని బాగేపల్లి నివాసి కిషోర్ నుంచి తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి అనంతపురంలో తన స్నేహితుడు నాగేంద్ర ద్వారా అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
బొమ్మనహాళ్: ఈత సరదా ఓ బాలుడిని బలిగొంది. బొమ్మనహాళ్ ఎస్హెచ్ఓ కమల్బాషా తెలిపిన మేరకు.. బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన రుద్రన్న, బసమ్మ దంపతుల కుమారుడు శివకుమార్ (16).. గోవిందవాడ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్నాడు. రెండవ శనివారం సెలవు కావడంతో తన స్నేహితులు ఆరుగురితో కలసి గ్రామ సమీపంలోని హగరి నదిలో ఉన్న కుంటలో ఈత కోసం వెళ్లాడు. అయితే శివకుమార్కు ఈత రాదు.. రెండు సార్లు మునిగిపోతుంగా స్నేహితులు వెలికి తీశారు. అయినా వినకుండా మూడో సారి కూడా నీటిలో దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం వరకూ స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం పెద్దలకు తెలిస్తే తమను దండిస్తారనే భయంతో ఇంటికి చేరుకుని మిన్నకుండిపోయారు. రాత్రి అయిన శివకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత స్నేహితులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే గజ ఈతగాళ్లను రంగంలో దించి శివకుమార్ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆదివారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చందనలో చోరీ యాడికి: రెండు రోజుల క్రితం యాడికిలోని ఐదు ఇళ్లలో ఒకే రోజు చోటు చేసుకున్న చోరీలను మరువక ముందే మండలంలోని చందన గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. చందన గ్రామంలో నివాసముంటున్న ఆనంద్.. తాడిపత్రి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. వారం క్రితం ఆనంద్ భార్య సరోజ, కుమారుడు, కుమార్తెతో కలిసి కర్ణాటకలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆనంద్ తమ్ముడు రమణయ్య కుటుంబ సభ్యులూ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం నంద్యాలకు వెళ్లారు. దీంతో ఇంటి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం... ఆనంద్ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దుండగులు శనివారం రాత్రి ప్రహరీ దూకి తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. విధులు ముగించుకుని శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న ఆనంద్.. చోరీ విషయాన్ని గుర్తించి భార్యకు తెలపడంతో ఆదివారం ఉదయం ఆమె ఇంటికి చేరుకుంది. ట్రంకు పెట్టెలో ఉన్న 3 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి సామగ్రి, రూ.8 వేల నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 748 మంది టీచర్లు నేడు విధుల్లోకి అనంతపురం సిటీ: కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపికైన 748 మంది సోమవారం నుంచి విధులకు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నూతన ఉపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు జారీ చేశారు. కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులందరికీ జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్బాబు శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లోకి చేరిన మొదటి రోజు నుంచే ఫేషియల్ యాప్లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని డీఈఓ సూచించారు. పాత వారిని రిలీవ్ చేయండి.. కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారు సోమవారం విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ప్రస్తుతమున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు. గతంలో బదిలీ అయి, సబ్స్టిట్యూట్ లేని కారణంగా డిప్యుటేషన్పై పాత స్థానాల్లో కొనసాగుతున్న వారు వెంటనే రిలీవ్ అయ్యేలా చూడాలన్నారు.‘పెళ్లి పెటాకులు’ కేసులో నిందితుడికి రిమాండ్ రాప్తాడురూరల్: పెళ్లి పెటాకులు చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలు పెట్టుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు బాలచంద్ర అంతకు ముందురోజు వరుడుకి ఫోన్ చేసి వధువుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని, అందుకు సంబంధించిన ఫొటో కూడా పంపుతానని ఇద్దరు ఉన్న ఓ ఫొటోను మొబైల్కు పంపాడు. అలాంటి యువతిని పెళ్లి చేసుకుంటాన్నంటే నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళనకు గురైన వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. బాలచంద్ర ఫోన్కాల్తోనే పెళ్లి చెడిపోయిందని, తనకు ఆయనకు ఏమాత్రం పరిచయం లేదని, కేవలం కక్ష కట్టి తన పెళ్లి చెడగొట్టాడంటూ బాధితురాలు ఇటుకలపల్లి పీఎస్లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు రోజుల గాలింపు అనంతరం ఆదివారం బాలచంద్రను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. 3వ తరగతి విద్యార్థి అదృశ్యం రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన 3వ తరగతి విద్యార్థి కనిపించడం లేదు. ఈ మేరకు అనంతపురం రూరల్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే...కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన వేణు.. పాత సామాన్లు ఏరుకుంటూ వాటిని గుజరీకి వేయడం ద్వారా జీవనం సాగించేవాడు. ఈయనకు ముగ్గురు కుమారులు కాగా, పెద్దకుమారుడు ఈశ్వర్ చదువుకోలేదు. రెండో కుమారుడు నరసింహ 6వ తరగతి, మూడో కుమారుడు రామాంజనేయులు 3వ తరగతి ఉరవకొండలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ నెల 11న తమ్ముళ్లను ఉరవకొండకు వదిలేందుకు ఈశ్వర్ పిలుచుకెళ్తుండగా తాను ఇంటికివెళతానంటూ రామాంజనేయులు ఏడ్వడంతో రాచానపల్లి వద్ద బస్సులో నుంచి దించేసి వెళ్లారు. ఈశ్వర్ సాయంత్రం ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం తెలపడంతో కంగారుపడిన వారు రామాంజనేయులు కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం వేణు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. -
ఇన్చార్జ్లే దిక్కు!
● వేధిస్తున్న సబ్ రిజిస్ట్రార్ల కొరత అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ల కొరత వేధిస్తోంది. సీనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జ్లుగా నియమించి నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిల్లో ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ల పక్రియను కొనసాగిస్తున్నారు. అనంతపురంలోని రామ్నగర్ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు సైతం లేకపోవడం గమనార్హం. దీంతో ఇటీవల రూరల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఇస్మాయిల్కు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పటించారు. రూరల్ కార్యాలయంలో సైతం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. అక్కడ సైతం ఇన్ చార్జ్ను నియమించారు. కళ్యాణదుర్గం, గుత్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పక్రియను కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. తనకల్లు, చిలమత్తూరు కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో అనంతపురం కార్యా లయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ప్రసాద్బాబును ఇన్చార్జ్గా చిలమత్తూరుకు పంపారు. తనకల్లులో అక్కడే పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్కు బాధ్యతలు అప్పగించారు. ప్రజలకు చుక్కలు.. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న పనికి సైతం రోజుల తరబడి ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మీని వివరణ కోరగా.. ఆమె స్పందించారు. ఉమ్మడి జిల్లాలో 9 మంది కొత్త సబ్ రిజిస్ట్రార్ల అవసరం ఉందన్నారు. ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అక్కడి నుంచి కొత్త ఎస్ఆర్లను కేటాయిస్తారన్నారు. ఆర్డర్ రాగానే ఖాళీగా ఉన్న కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామన్నారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కి.మీ వేగంతో ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గాలి వీచింది.
కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి అనంతపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బి. నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, డాక్టర్ తలారి రంగయ్య, వై. విశ్వేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్ రెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, బోయ తిప్పేస్వామి, మహేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో జరిగే నష్టాల గురించి గ్రామ స్థాయి నుంచే ప్రజలకు వివరించాలన్నారు. డాక్టర్ కావాలనే రిజర్వేషన్ వర్గాల కలను చిదిమేసిన సంగతి ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే ర్యాలీలో అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ అనుబంధ సంఘాలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. -
వైద్య సిబ్బందిపై దాడికి యత్నం
● గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘటన గుంతకల్లుటౌన్: వైద్య సిబ్బందిపై ఓ రోగి, అతని సహాయకులు దాడికి యత్నించిన ఘటన గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరి గింది. గుంతకల్లు టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. శనివారం పట్టణంలోని సీఐటీయూ కాలనీ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో గాయపడిన వినోద్ చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ విభాగానికి వచ్చాడు. అతనికి సహాయకులుగా ఉషాకిరణ్, సుధా, నారాయణ వచ్చారు. ఈ క్రమంలోనే డాక్టర్ సల్మాన్జావెద్ గాయపడిన వినోద్ను తాను చూస్తానని, సహాయకులుగా ఉన్న వారు బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన ఉషాకిరణ్, సుధాలు వైద్యుడిని అసభ్యకరంగా తిట్టారు. చొక్కా పట్టుకుని లాగారు. అడ్డుగా వెళ్లిన నర్సులు రామాంజినమ్మ, హసీనాలను కూడా అసభ్యపదజాలంతో దూషించారు. దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న సెక్యూరిటీ గార్డు ప్రవీణ్ను అంతు తేలుస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులు, సిబ్బంది మొత్తం టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐ మస్తాన్కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ సల్మాన్ జావెద్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వినోద్కు వైద్యం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోగి సహాయకులు పేర్కొన్నారు. భయంగా విధులు నిర్వర్తిస్తున్నాం ప్రజలకు అనునిత్యం వైద్యసేవలందిస్తున్న తమకే రక్షణ లేకుండా పోతోందని ఆస్పత్రి నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడిపై దాడిని అడ్డుకున్నందుకు తమను అసభ్యకరంగా దూషించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రివేళ ఒక్కోసారి మద్యం సేవించి వచ్చే రోగి సహాయకులు బూతులు తిడుతున్నా గత్యంతరం లేక భరిస్తున్నామన్నారు. ఆస్పత్రి వద్ద మూత పడిన పోలీస్ ఔట్పోస్టును తెరిపించాలని వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు. -
మోసం చేయడం చంద్రబాబు నైజం
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజంబుక్కరాయసముద్రం: నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన శనివారం బీకేఎస్ మండల పరిధిలోని గాంధీ నగర్, అమ్మవారిపేట, రేకులకుంట గ్రామంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్ రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ను మోసం చేసి టీడీపీని లాక్కున్నారన్నారు. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత మోసం చేయడాన్ని రివాజుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు 30 ఏళ్ల చరిత్రలో చెప్పుకోదగ్గ ఒక్క పథకమూ లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వైఎస్సార్ సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముసలన్న, మహిళా రాష్ట్ర కార్యదర్శి లలితా కల్యాణి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, సర్పంచ్లు పార్వతి, నరసమ్మ, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, ఆది, ముత్యాలశీన, నందినే మల్లికార్జున, 6 మండలాల అధ్యక్షులు పూల ప్రసాద్, ఎల్లారెడ్డి, మహేశ్వరెడ్డి, ఖాదర్వలి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతున్న మాజీ మంత్రి శైలజానాథ్ -
అక్రమంగా కేసు కట్టారు
కడదరకుంట రెవెన్యూ పొలం సర్వే నంబర్లు 122,123,124లో మాకు వ్యవసాయ భూమి ఉంది. భూమిలోకి వెళ్లేందుకు ఉన్న రస్తాని టీడీపీ నాయకులు వడ్డే ఆంజనేయులు ఆక్రమించాడు. దీనిపై మేము రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే రికార్డులు పరిశీలించి రస్తా ఉందని వారు తేల్చారు. 2023లో ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు పనులు కూడా చేశారు. అయినా, అవతలి పక్షం వారి ఫిర్యాదుతో సీఐ రాజు నాపైనే కేసు కట్టి వేధిస్తున్నారు. – కురుబ రామచంద్ర, కడదరకుంట, కూడేరు మండలం -
రైతులను ఆదుకునే మనసు లేదా?
అనంతపురం:‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ముఖ్యంగా జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. రైతుల కష్టాలు దయనీయంగా మారాయి’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, దీంతో రైతులు పండించిన పంటలను రోడ్లపై పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో తీవ్ర వర్షాభావం నెలకొని వారి వేదన వర్ణనాతీతంగా మారిందన్నారు. వేరుశనగ, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేదు.. జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ 4.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉన్నా కేవలం 2.25 లక్షల ఎకరాల్లో సాగు చేశారని గుర్తు చేశారు. ఆగస్టులో ఆలస్యంగా వర్షాలు కురిస్తే భూమి బీడు పెట్టలేక జొన్న, సజ్జ, కొర్రలు వేశారన్నారు. ఖరీఫ్ సీజన్లో కేవలం 28 రెయినీడేస్ నమోదయ్యాయని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదన్నారు. ఖరీఫ్లో సాగు చేసిన వేరుశనగ పంటకు ఇటీవల తెగుళ్లు ఆశించడంతో దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం వేరుశనగ సాగు కోసమే రైతులు రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టారని, దిగుబడి కూడా రాకపోవడంతో వారికి నేడు దిక్కుతోచడం లేదన్నారు. సీజన్ ముగిసినా జిల్లాలో ఈ–క్రాప్ బుకింగ్ 50 శాతం కాకపోవడంతో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పారు. ఇప్పటికే 2023–24 ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించలేదని, 2024–25లోనూ ఇన్పుట్, ఇన్సూరెన్స్ చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుత రబీ సీజన్లో పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నా విత్తన పప్పుశనగ అందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పప్పుశనగను 40 శాతం సబ్సిడీతో అందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక 25 శాతానికే పరిమితం చేశారని మండిపడ్డారు. అది కూడా గత ఏడాది 27 వేల క్వింటాళ్లకు పైగా విత్తన పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది 14 వేల క్వింటాళ్లకు కుదించి రైతులకు అన్యాయం చేశారన్నారు. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. రైతులు అవస్థలు పడుతున్నా జిల్లాలో ప్రజాప్రతినిధులకు పట్టడంలేదని, లిక్కర్ షాపులు, కాంట్రాక్ట్లు చేసుకోవడానికే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా కనీసం ఐఏబీ సమావేశం నిర్వహించలేదంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో 40 నుంచి 50 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాన్ని రైతుకు ఎంత అవసరం ఉంటే అంత పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం కూడా అందజేయాలని కోరారు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి వైద్య సేవలు సజావుగా సాగేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరు గుర్తుకొస్తుందన్న భయంతో పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, కల్చరల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవ రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. కరువు రక్కసితో అన్నదాతల కుదేలు ఇన్పుట్, ఇన్సూరెన్స్ అందించడంలో ప్రభుత్వం విఫలం ఇప్పటిదాకా కనీసం ఐఏబీ సమావేశం నిర్వహించలేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగన్
అనంతపురం : అణగారిన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఎస్సీ సెల్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్ కమార్రెడ్డి, విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు అకృత్యాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.77 వేల కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎస్సీలకు నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ మోసాన్ని అందరికీ తెలియచెప్పాలన్నారు. రాష్ట్రమంతటా లక్ష మంది ఎస్సీ యువకులతో ‘జగనన్న దళిత ఫోర్స్’ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతనంగా మంజూరైన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ కేటగిరీలో 880 సీట్లు కోల్పోయే ప్రమాదముందన్నారు. డాక్టర్ కావాలనే కలను కూటమి ప్రభుత్వం చిదిమేసిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, ఉమ్మడి జిల్లా అబ్జర్వర్ నల్లాని బాబు, రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర మహిళా అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, జిల్లా ప్రధాన కార్యదర్శి శోభ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పసులూరు ఓబులేసు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోవిందప్ప, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రాఘవ, గుంతకల్లు అధ్యక్షుడు వీరేష్ బాబు, కళ్యాణదుర్గం అధ్యక్షడు తిప్పేస్వామి, రాయదుర్గం అధ్యక్షుడు కె.రామాంజినేయులు, ఉరవకొండ అధ్యక్షుడు అక్కులప్ప, కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు, శింగనమల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఆంజినేయులు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేది జగన్మోహన్రెడ్డేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారాన్ని అప్పగించడడంతో పాటు సమ సమాజాన్ని స్థాపించడమే ఆయన లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగానే గత మంత్రి వర్గంలో 70 శాతం బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అప్పగించారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పెత్తందార్లకు దన్నుగా ఉంటూ పేదలను విస్మరించారని అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించారని గుర్తు చేశారు. సమసమాజ స్థాపనే జగన్ లక్ష్యం పేదలను విస్మరించిన బాబు కూటమి ప్రభుత్వంలో దళితులపై పెరిగిన అకృత్యాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో ఎస్సీ విద్యార్థులకు అన్యాయం ఈ అన్యాయాన్ని ప్రతి పౌరునికీ తెలియజేయాల్సిన బాధ్యత మనదే లక్ష మంది ఎస్సీ యువకులతో జగనన్న ఫోర్స్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు -
మందలించారని యువకుడి ఆత్మహత్య
రాప్తాడు: ఇంట్లో మందలించారని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం రైల్వే పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.... అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన రాము, లక్ష్మీదేవి దంపతులు. పదేళ్ల క్రితం రాము మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు కులవర్దన్ (21) వ్యవసాయ పనులతో పాటు తల్లితో కలిసి పాడి ఆవులు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదిలా ఉండగా ఏడాది కిత్రం అప్పు చేసి రూ.లక్ష విలువైన బైక్ కొనుగోలు చేశాడు. వీటిని తీర్చలేక, పనులకు వెళ్లకపోవడంతో ఇంట్లో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కులవర్దన్ శనివారం గంగులకుంట గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే కీమెన్ సమాచారంతో ధర్మవరం రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుని వద్ద దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుతాసుపత్రికి తరలించారు. -
దళితులపై దౌర్జన్యాలను తిప్పికొట్టాలి
దళితులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోఓబులేసు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మిద్దె కుళ్లాయప్ప పిలుపునిచ్చారు.నార్పల మండలంలో ఎస్సీ యువకుడు, వికలాంగుడు అయిన చిన్న కుళ్లాయప్పను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించి మడకశిరకు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బందులకు గురి చేయించారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మండిపడ్డారు. కుప్పంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎంఎస్ రాజు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి ఏనాడైనా స్పందించారా అని నిలదీశారు. దళిత బిడ్డల మానప్రాణాలు పోతున్నా.. పట్టించుకోకుండా.. చంద్రబాబు తొత్తుగా మారారని విమర్శించారు. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు -
యువతులు అన్ని రంగాల్లోనూ రాణించాలి
● ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపు అనంతపురం కల్చరల్: యువతులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) రాష్ట్ర మహాసభల సందర్భంగా మూడురోజుల పాటు సాగిన సాంస్కృతికోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాలు వేదికగా సాగిన వేడుకలకు ఐద్వా రాష్ట్ర నేతలు రమాదేవి, సావిత్రి, డాక్టర్ ప్రసూన, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రియాజుద్దీన్, వన్నూర్ మాస్టర్ తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం కూడా కలిసి రావడంతో వారు చిన్నారులకు బోధనా పద్ధతుల్లో మహిళల శక్తిని, సాధికారతను వివరించిన తీరు ప్రశంసలందుకుంది. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా అశోక్మాస్టర్ , విజయ్మాస్టర్ శిష్య బృందాలతో కలిసి పల్లెటూరు మా పల్లెటూరు, ఘల్లు ఘల్లు జోడెద్దులబండిరా నృత్యాలు, వరకట్నం లఘునాటికను నిషిత , ఆరాధ్యా బృందాల అద్భుతంగా ప్రదర్శించి మెప్పించారు. అలాగే ప్రజానాట్యమండలి కళాకారుల ఉద్దీపన గీతాలతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు. అనంతరం మూడురోజులుగా ప్రేక్షకులను అలంరింపజేసిన మాస్టర్లకు, చిన్నారులకు జ్ఞాపికలందించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, చంద్రిక, అశ్విని, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భర్త, కుమారుడి ఆచూకీ తెలపండి
యాడికి: ‘యాడికి పోలీసులు న్యాయం చేయలేదు. నా భర్త, కుమారుడి ఆచూకీ తెలిపి మీరైనా న్యాయం చేయండి’ అంటూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి వద్ద లక్ష్మిదేవి అనే మహిళ శనివారం మొరపెట్టుకుంది. వివరాలు.. ఈ నెల 8వ తేదీన యాడికి మండలం వెంగన్నపల్లికి చెందిన లక్ష్మిదేవి పట్ల అదే గ్రామానికి చెందిన విశ్వనాథ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని లక్ష్మిదేవి తన భర్త నారాయణ స్వామి, పెద్ద కుమారుడు నవీన్కు చెప్పింది. వారు విశ్వనాథ ఇంటికి వెళ్లి నిలదీయడంతో గొడవ జరిగింది. అనంతరం విశ్వనాథ తన నలుగురు సోదరులతో కలిసి లక్ష్మిదేవి ఇంటిపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి లక్ష్మిదేవి, నారాయణ స్వామి, నవీన్ బయలు దేరుతుండగా ఇద్దరు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. అనంతరం అదేరోజు సుమారు 10 మంది పోలీసులు వచ్చి ముగ్గురినీ పోలీస్టేషన్కు తీసుకెళ్లారు. లక్ష్మిదేవిని అర్ధరాత్రి ఇంటికి పంపారు. గొడవ జరిగిన నేపథ్యంలో ఆమె తన సొంతూరికి వెళ్లకుండా తన బంధువులైన వీరన్నపల్లికి చేరుకుంది. పోలీసులు నారాయణ స్వామి, నవీన్ను మూడు రోజులైనా ఇంటికి పంపలేదు. పైగా నారాయణ స్వామి, లక్ష్మిదేవి, నవీన్తో పాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మిదేవి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లక్ష్మిదేవిని కూడా మూడు రోజుల పాటు పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పారు. ఈ క్రమంలో శనివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి యాడికి పోలీసుస్టేషన్కు లక్ష్మిదేవిని పిలిపించి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, పోలీసుల తీరును ఏఎస్పీకి లక్ష్మిదేవి వివరించి న్యాయం చేయాలని వేడుకుంది. ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని లక్ష్మిదేవికి ఏఎస్పీ భరోసా ఇచ్చారు. -
గురుకులాల సమస్యలపై అలసత్వం
అనంతపురం సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో ఎస్టీయూ అనుబంధం సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం రాష్ట్ర స్థాయి ప్రతినిధి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రమణారెడ్డి మాట్లాడారు. గురుకులాల్లో పాత టైం టేబుల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీజీటీ హిందీ పోస్టును పునరుద్ధరించాలని గురుకుల విభాగం రాష్ట్ర ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లోని క్వార్టర్స్కు ఏడాదిన్నర కాలంగా పూర్తి హెచ్ఆర్ఏ పేరుతో రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని రాష్ట్ర కో కన్వీనర్ రామానాయుడు ధ్వజమెత్తారు. అయితే క్వార్టర్స్ శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. గురుకులాల్లో డీఎస్పీ ద్వారా పోస్టు కోల్పోయిన పార్ట్ టైం టీచర్లకు మిగిలిన ఖాళీల్లో అవకాశం కల్పించాలని మరో ప్రతినిధి ఫకృద్దీన్ కోరారు. అదనపు ప్రధాన కార్యదర్శి సూర్యుడు, అసోసియేట్ అధ్యక్షుడు నారాయణస్వామి, తిరుపతయ్య మాట్లాడారు. జిల్లా కార్యదర్శి మల్లికార్జున, అరుణ్కుమార్, చిన్నన్న, హనమంతు, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి -
డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె
అనంతపురం మెడికల్: తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని పీహెచ్సీ వైద్యులు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజు శనివారం కొనసాగాయి. పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని మండిపడ్డారు. పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ విభాగంలో 20 శాతం బ్రాంచ్లో కొనసాగించాలన్నారు. అలాగే చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి సంబంధించి అలవెన్స్లు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ శివసాయి, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ శివకృష్ణ పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి కుందుర్పి: విద్యుత్ కార్యాలయం వద్ద మరమ్మతులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విద్యుత్ శాఖ, పోలీసు అధికారులు తెలిపిన మేరకు... తాడిపత్రికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ కుందుర్పిలో వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన జనార్ధనాచార్యులు (34)తో శనివారం విద్యుత్ కార్యాలయంలో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఉన్నట్టుండి విద్యుత్ షాక్కు గురవడంతో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆర్టీటీ ఉద్యోగి మృతి రాప్తాడురూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎకాలజీ సెంటర్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఎకాలజీ సెంటర్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాగరాజు (45) ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 7న పంగల్ రోడ్డు వైపు బైకులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నాగరాజును సర్వజనాస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి చేజారిందని తేల్చారు. ఈ క్రమంలో తిరిగి అక్కడి నుంచి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈయన భార్య సుచరిత బెళుగుప్ప జెడ్పీ హైస్కూలులో గణితం టీచరుగా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నాగరాజు మృతి బాధాకరమని ఎంపీపీ కమలమ్మ, సర్పంచులు అతావుల్లా, బొమ్మయ్య, ఓబన్న పేర్కొన్నారు. -
పాపం జయరంగారెడ్డి..
● రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం అవస్థలు ● ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయడంతో సకాలంలో అందని వైద్యం పుట్లూరు: నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల పదో తేదీన ఉపాధి హామీ పనుల కోసం వెళుతున్న సమయంలో తూఫాన్ వాహనం ఢీకొనడంతో గోపురాజుపల్లికి చెందిన జయరంగారెడ్డి, వసంత గాయపడ్డారు. వీరిలో జయరంగారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించే జయరంగారెడ్డి కుంటుంబంలో ఇప్పటికే భార్య కంటి ఆపరేషన్ చేయించుకోగా, కుమారుడు రాజారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో అండగా ఉన్న జయరంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఆ కుటుంబంలో అంధకారం నెలకొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పలు నిలిపివేయడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందలేదు. గాయపడిన జయరంగారెడ్డిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కాలు విరగడంతో పాటు నరాలు తెగిపడటం వల్ల సర్జరీ చేయడానికి న్యూరో సర్జన్ అందుబాటులో లేరనే కారణంతో చికిత్స ఆలస్యమౌతోంది. రోజులు గడిస్తే కాలు తొలగించాలని వైద్యులు చెబుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటుగా వైద్యం చేయించేందుకు ఆపన్నహస్తం కోసం అర్థిస్తున్నారు. ప్రత్యేక సహాయ నిధితో జయరంగారెడ్డిని ఆదుకోవాలని గోపురాజుపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. -
పోలీసుకు న్యాయం కరువు
అనంతపురం సెంట్రల్ : సామాన్య ప్రజలు అన్యాయానికి గురైతే ఠక్కున గుర్తొచ్చేది పోలీసులు. అలాంటిది న్యాయం చేసే పోలీసుకే పోలీసుస్టేషన్లో అన్యాయం జరుగుతోంది. తన భార్యపై దాడిచేసిన వారి మీద కేసు నమోదుచేయాలని రెండ్రోజులుగా ఓ కానిస్టేబుల్ పోలీసులను వేడుకుంటున్నా కనికరించడంలేదు. దాడికి పాల్పడిన వారు టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు కావడంతో చర్యలు తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులు శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు.వివరాలివీ..అనంతపురం శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎలైట్ హోమ్స్లో పోలీసు డాగ్స్క్వాడ్లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్కుమార్ ఉంటున్నారు. కింది పోర్షన్లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు తేజ సంబంధీకులు భువన్ చక్రవర్తి కుటుంబం ఉంటోంది. అయితే, శుక్రవారం సాయంత్రం హరినాథ్కుమార్, అతని స్నేహితుడు వాకింగ్కు వెళ్లారు. అదే సమయంలో.. పక్కింటి బాలుడు క్రికెట్ ఆడుకుంటూ బంతి వేయాలని వీరిని కోరాడు. దీంతో సదరు కానిస్టేబుల్ బంతి వేయడంతో బాలుడు బ్యాట్తో కొట్టాడు. బంతి భువన్ చక్రవర్తి కారుకు తగిలింది. దీంతో.. ఆయన దాదాపు 20 మంది ఎమ్మెల్యే అమిలినేని అనుచరులను తీసుకొచ్చి కానిస్టేబుల్ ఇంటిపై దాడిచేశారు. ఇక ఈ విషయంపై నాల్గవ పట్టణ సీఐ జగీదీష్ను వివరణ కోరగా.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని.. కానిస్టేబుల్ భార్య సుజాత తమతో దురుసుగా ప్రవర్తించారంటూ భువన్ చక్రవర్తి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. స్టేషన్లో కూడా దాడి చేశారుకానిస్టేబుల్ భార్య సుజాత మాట్లాడుతూ.. ‘మాకు న్యాయం చేయాలని స్టేషన్కు వస్తే అక్కడ కూడా వారు దాడిచేశారు. చెప్పుకోలేని మాటలు మాట్లాడారు. స్టేషన్లో శుక్రవారం రాత్రి 2 గంటల వరకూ ఉన్నాం. శనివారం కూడా మ.2 గంటల వరకూ ఉన్నప్పటికీ పోలీసులు మాకు న్యాయం చేయలేదు. పైగా నీ ఉద్యోగం ఊడిపోతుంది.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో.. బట్టలు తీసుకుని కర్నూలు బందోబస్తుకు పో అంటూ నా భర్తను బెదిరిస్తున్నారు. పోలీసుశాఖలో పనిచేసి ఏం ఉపయోగం? ఇంత అవమానకరమైన బతుకు బతకడం కంటే చావడమే మేలు. సీఎం సార్.. మమ్మల్ని కాపాడండి. మా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత’.. అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?ఈ సందర్భంగా స్టేషన్ వద్ద హరినాథ్కుమార్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖలో పనిచేస్తున్న నాకే రక్షణ లేకుండాపోతోంది. దాదాపు 20 మంది రౌడీలను నా ఇంటిపైకి తీసుకొచ్చి భువన్ చక్రవర్తి, అతని భార్య కళ్యాణి, చెల్లెలు అంజలి కలిసి నా భార్య సుజాతపై దాడిచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు వచ్చి వేడుకున్నా. కేసు తీసుకోవడానికి సీఐ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వారి వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నారట. ఇక నేను పోలీసు ఉద్యోగం చేసి కూడా ఏం ప్రయోజనం? ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేస్తా’.. అని చెప్పారు. -
ఉపాధి అక్రమాలపై విచారణ చేపట్టండి
● డ్వామా పీడీకి మాజీ ఎంపీ రంగయ్య వినతి అనంతపురం టౌన్: కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ డ్వామా పీడీ సలీంబాషాకు మాజీ ఎంపీ రంగయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం సలీంబాషాను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. కంబదూరు మండల వ్యాప్తంగా ఉపాధి పనులు చేయకుండానే టీడీపీ నాయకులతో ములాఖత్ అయిత ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పనులకు రాని కూలీల పేర్లను సైతం మస్టర్లలో నమోదు చేసి బిల్లులు పెద్ద ఎత్తున డ్రా చేశారన్నారు. మెట్ట భూముల్లో ఉద్యాన పంటల సాగులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. నిధులను కొల్లగొట్టిన వారి నుంచి సొమ్ము రివకరీ చేయాలని, లేకుంటే డ్వామా కార్యాలయం ఎదుట ఆందోళ కార్యక్రమాలు చేపడతామని హెచ్చ రించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నేతలు భీమేష్, గంగాధర్ తదితరులు ఉన్నారు. వాటర్ షెడ్ పనులు వేగవంతం చేయండి వాటర్ షెడ్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డ్వామా పీటి సలీంబాషా ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన వాటర్ షెడ్ పనులపై అధికారులతో శుక్రవారం డ్వామా కార్యాలయంలో ఆయన సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 7 ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పనులు రానున్న 3 నెలల్లో 100 శాతం పూర్తి కావాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 848 పనులు జరుగుతున్నాయని, వీటిలో 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు సైతం సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ ఏపీడీ సుధాకర్రెడ్డి, కృష్ణచైతన్యతో పాటు నియోజకవర్గ ఏపీడీలు పాల్గొన్నారు. -
స్తంభించిన ఎన్టీఆర్ వైద్య సేవలు
● నెట్వర్క్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు బంద్ ● సర్వజనాస్పత్రికి పరుగులు పెట్టిన రోగులు అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణం మీదకు తెస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన చేసిన వైద్య చికిత్సలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని 46 నెట్వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో కేన్సర్, డయాలసిస్, ఆర్థో రోగులు, గర్భిణులు, బాలింతలు, హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి క్యూ కట్టారు. నగరంలోని ప్రముఖ ఆస్పత్రులు శస్త్రచికిత్సలను నిరాకరించడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు లోనయ్యారు. కొందరు ప్రైవేట్గానే డబ్బులు వెచ్చించి శస్త్రచికిత్సలు చేయించు కోవాల్సి వచ్చింది. కేవలం 10 ఫ్రీ ఆథరైజేషన్లు రెగ్యులర్గా అనంతపురంలోని వివిధ నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోజూ 150 నుంచి 200 మంది రోగులకు ఫ్రీ ఆథరైజేషన్లు నమోదు చేస్తారు. దాని ఆధారంగా ఎన్టీఆర్ వైద్య సేవ అనుమతితో శస్త్రచికిత్సలు చేస్తారు. కాగా ఆస్పత్రులు శస్త్రచికిత్సలకు నిరాకరించడంతో శుక్రవారం కేవలం 10 ఫ్రీ ఆథరైజేషన్లు మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కొన సాగితే రానున్న రోజుల్లో రోగులు మరింత ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. ● ఈ ఆటోలో కూర్చున్న పెద్దాయన ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన సాకే గంగన్న. నరాలు, గుండె తదితర సమస్యలతో అనంతపురం సాయినగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలు లేవని, ప్రైవేట్గా చూపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎమర్జెన్సీ సేవలందుతున్నాయి జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు అందుతున్నాయి. డయాలసిస్, కేన్సర్, తదితర రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ తదితరులతో మాట్లాడాం. గుండె, నెఫ్రాలజీ, కేన్సర్ కేసులకు సత్వర వైద్యం అందించేలా చూడాలని చెప్పాం. – డాక్టర్ కిరణ్కుమార్రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ -
బొమ్మనహాళ్లో కుండపోత వర్షం
అనంతపురం అగ్రికల్చర్/ బొమ్మనహాళ్: జిల్లాలో రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 7.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 84.2 మి.మీ కుండపోత వర్షం కురిసింది. మండలంలోని సిద్దరాంపురం, చంద్రగిరి, కురువల్లి గ్రామల్లో వరి, మొక్కజొన్న, మిరప, జొన్న తదితర పంటలు నీటమునిగాయి. చంద్రగిరిలో గ్రామదేవత ఆలయంలోకి వర్షం నీరు చేరింది. రోడ్డుపై వర్షపు నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బండూరు వంక పారడంతో గోవిందవాడ, దర్గాహొన్నూరు తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా కూడా గ్రామాల్లో నిలిచిపోయింది. ఇక రాప్తాడు మండలంలో 41 మి.మీ, బెళుగుప్ప 24.8, కళ్యాణదుర్గం 21, పామిడి 20.4, బ్రహ్మసముద్రం 12 మి.మీతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురం, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు, కంబదూరు, శెట్టూరు, గుమ్మఘట్ట తదితర మండలాల్లో జడితో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 100.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 18.8 మి.మీ నమోదైంది. -
రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన
రాప్తాడు రూరల్: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రెడ్డిగారి రమేష్కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు రాప్తాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కోసం నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను నేడు చంద్రబాబు ప్రైవేట్పరం చేస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగ్గొట్టారన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి వంచించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు విపరీతమైన ధనదాహంతో అక్రమ వసూళ్లు, అరాచకాలకు తెరలేపారన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై తీవ్ర వివక్ష చూపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్తో పాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు పాక్షికంగా అమలు చేశారన్నారు. కళ్లు ఆర్పకుండా అపద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలుండేవన్నారు. ఆయన వచ్చిన తర్వాత 17 కొత్త కళాశాలలను తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో ఏటా 5 వేలమంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదువుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాలను ఆపేసిందన్నారు. ఇప్పుడు ప్రైవేట్పరం చేసేందుకు పూనుకుందని, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దోచుకోవడంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్రంలోనే ఆల్టైం రికార్డ్ సాధిస్తోందన్నారు. ఒక్క పాపంపేటలోనే రూ.వేల కోట్ల విలువైన 500 ఎకరాలకు పైగా శోత్రియం భూములను తన బంధువుల పేరుపై అక్రమంగా జీపీఏ చేయించుకున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడం వల్ల నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటి 2 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతోందన్నారు. పరిటాల సునీత ఇచ్చిన లేఖ వల్ల 50 వేల పేదల గృహ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుప్రసాద్, రాప్తాడు ఎంపీపీ వరలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, పార్టీ మండల కన్వీనర్లు గోవిందరెడ్డి, పవన్, ఎంపీటీసీ సభ్యులు సునీల్దత్తరెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విపరీతమైన ధనదాహంతో టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగడదాం : మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
నంది విగ్రహం అపహరణ
పెద్దవడుగూరు: మండలంలోని పి.వీరన్నపల్లిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గ్రామస్తులు అటుగా వెళ్లలేకపోయారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. నంది విగ్రహం కనిపించడకపోవడంతో విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. పూజారి ఆదిశేషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల వలలో రైతు బొమ్మనహాళ్: మండలంలోని కొలగానహళ్లి గ్రామానికి చెందిన రైతు కావలి రామానాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నగదు కోల్పోయాడు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన అత్యవసర పరిస్థితుల్లో తన పొలాన్ని అమ్మి రూ.4.50 లక్షలు ఉద్దేహాళ్లోని ఏపీజీబీలో ఉన్న తన ఖాతాలో జమ చేసి ఉంచాడు. ఇటీవల రూ.3.50 లక్షలు డ్రా చేశారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో రైతు మొబైల్లో కోటక్ మహేంద్ర అనే యాప్ను ఓపెన్ చేయగా తన ఏపీజీబీ బ్యాంక్ ఖాతా నుంచి 5 సార్లు రూ.19,999లు చొప్పున మొత్తం రూ. 1 లక్ష నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లుగా మెసేజ్లు అందాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులను కలసి విషయాన్ని తెలపడంతో వారు ఖాతాను పరిశీలించారు. ఖాతా నుంచి నగదును సైబర్ నేరగాళ్లు అపహరించినట్లుగా నిర్ధారించుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితుడు స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు 1930 నంబర్కి సమాచారం అందించాడు. -
ప్రజా శ్రేయస్సే లక్ష్యం
అనంతపురం కార్పొరేషన్: ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదింటి బిడ్డల వైద్య విద్య కలను ముఖ్యమంత్రి చంద్రబాబు చిదిమేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ‘వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వెఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను అనంత ఆవిష్కరించారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు కోటి మందితో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు. నవంబర్ 22 వరకు సంతకాల సేకరణ కొనసాగుతుందన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు భాగస్వాములు కావాలన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపడతామన్నారు. నాడు ప్రజారోగ్యానికి పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన విషయాన్ని అనంత గుర్తు చేశారు. ఆస్పత్రుల అధునికీకరణ, విలేజ్ హెల్త్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారన్నారు. వైద్య కళాశాలలు వస్తే అనుబంధంగా బోధనాస్పత్రులు వస్తాయని, సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు అందుతుందని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,300 కోట్లతో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. రెండేళ్లలోనే ఏడు వైద్య కళాశాలలు పూర్తి చేశారని, 2023–24లో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయని వివరించారు. మరో రెండు కళాశాలలు గతేడాది ప్రారంభించాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు తన బంధువులు, వర్గీయులకు లబ్ధి చేకూర్చడం కోసం కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నారన్నారు. బాబుకు ప్రైవేటీకరణపైనే మోజు చంద్రబాబుకు ప్రైవేటీకరణపై మోజు ఎక్కువ అని అనంత ధ్వజమెత్తారు. 1998లోనూ అనంతపురం మెడికల్ కళాశాలను ట్రస్ట్కు అప్పగించాలని ప్రయత్నించారని, అప్పుడు ప్రజా ఉద్యమం చేపడితే ఆయన దిగివచ్చారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు నూతన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థనాయక్, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, అమర్నాథ్రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, బాకే హబీబుల్లా, ఓబిరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు చింతకుంట మధు, ఆసిఫ్, శ్రీనివాస్ దత్తా, సత్రసాల మంజునాథ్, జావెద్, భారతి, రాధాయాదవ్, ఉషా, హజరాబీ, కై లాష్, సాకే కుళ్లాయస్వామి, మీసాల రంగన్న, తలారి వెంకటేష్, ఉదయ్, కార్పొరేటర్లు కమల్భూషణ్, సాకే చంద్రలేఖ, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నవంబర్ 22 వరకు కోటి సంతకాల సేకరణ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత


