సుదూర బస్సు సర్వీసుల బదిలీ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు పక్క డిపోలకు మళ్లించారు. అనంతపురం డిపో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా బస్సుల నిర్వహణ భారంగా మారింది. సరైన మెయింటెనెన్స్ లేక బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాల సర్వీసులను తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, గుంతకల్లు డిపోలకు మళ్లించారు. వాస్తవానికి ఆ బస్సులు కూడా జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లాల్సిందే. స్వీయ తప్పిదాలు సరిదిద్దుకోలేని తనం, విధుల నిర్వహణలో సవాళ్లను స్వీకరించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ హయాంలోనే కొత్త బస్సులు
గత వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లాకు కొత్త బస్సులు వచ్చాయి. దీంతో సుదూర ప్రాంత సర్వీసులకు కొత్త బస్సులను కేటాయించి, ప్రయాణికులకు అప్పట్లో మెరుగైన సేవలు అందిస్తూ వచ్చారు. దీంతో ప్రయాణికులు కూడా ఆర్టీసీని ఆదరించారు. ఫలితంగా ఆర్టీసీ కొంత మేర నష్టాలను పూడ్చుకోగలిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతూ వస్తోంది. రాబడి బాగున్న సర్వీసులన్నీ పక్క డిపోలకు పంపి, ఆయా డిపోలపై అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఇది వివాదాలకు కేంద్రీకృతమవుతోంది.
రెండు సర్వీసులు బదిలీ..
అనంతపురం నుంచి హైదరాబాదుకు వెళ్లే రెండు సర్వీసులను బదిలీ చేస్తూ ఆర్ఎం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సర్వీసు గుత్తికి, మరో సర్వీసు తాడిపత్రికి బదిలీ చేశారు. గతంలో చైన్నెకి 4 సర్వీసులుంటే ప్రస్తుతం ఒకటి మాత్రమే నడుస్తోంది. హైదరాబాదుకు 10 సర్వీసులుంటే, ప్రస్తుతం 6 ఉన్నాయి. నెల్లూరుకు 4 ఉండగా ప్రస్తుతం ఒకటి, ఒంగోలుకు రెండు ఉండగా, ఒకటి మాత్రమే నడుస్తున్నాయి. ఇక 14 సర్వీసులున్న బెంగళూరుకు ప్రస్తుతం 9 మాత్రమే నడుస్తున్నాయి.
సమస్యకు పరిష్కారం ఇది కాదు..
సుదూర ప్రాంతాలకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ సర్వీసులను మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను పరిష్కరించడమంటే పక్కకు తప్పుకోవడం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తప్పిదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సి ఉండగా... ఉన్న సర్వీసులన్నీ రద్దు చేస్తూ పోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కేంద్రం నుంచి లాంగ్ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలో కనిపించని
సర్వీసులు
సవాలుగా తీసుకోని డిపో మేనేజర్లు
స్వీయ తప్పిదాలను సరిదిద్దుకోలేని ఆర్టీసీ యాజమాన్యం... ఆ భారాన్ని
ప్రయాణికులపై రుద్ది చేతులు దులుపుకుంది. ఫలితంగా సుదూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
సుదూర బస్సు సర్వీసుల బదిలీ


