పరాకాష్టకు ‘గుమ్మనూరు’ గూండాగిరి | Tdp mla Commission demanded for railway development works | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు ‘గుమ్మనూరు’ గూండాగిరి

Dec 17 2025 4:32 AM | Updated on Dec 17 2025 7:08 AM

Tdp mla Commission demanded for railway development works

రైల్వే అభివృద్ధి పనుల్లో రూ.70 లక్షల కమీషన్‌కు డిమాండ్‌

సొంత పార్టీ ఎంపీకే బెదిరింపు

చేష్టలుడిగి చూస్తున్న టీడీపీ అధిష్టానం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు, అనుచరుల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. గుంతకల్లు నియోజక­వర్గాన్ని సొంత సామ్రాజ్యంగా భావిస్తున్న గుమ్మనూరు కుటుంబీకులు.. ఎవరు ఏం చేయాలన్నా కమీషన్‌ చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలిచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులకూ వెనుకాడటం లేదు. వారి రౌడీయి­జానికి ఏకంగా టీడీపీ ఎంపీయే టార్గెట్‌ అయ్యారు. కమీషన్ల కోసం సొంత పార్టీ ఎంపీనే గుమ్మనూరు వేధిసు­్తన్నా  ఆయనపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసు­కో­క­పోవడంతో టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 

ఏం జరిగిందంటే..
వెస్ట్‌ గుంతకల్లులోని ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి సెప్టెంబర్‌లో టెండర్లు ఖరారయ్యాయి. రాజమండ్రికి చెందిన సుబ్బారాయుడు అనే కాంట్రాక్టర్‌ రూ.7 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్‌ దాఖలు చేసి పనులు చేజిక్కించుకున్నారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు దౌర్జన్యం గురించి తెలుసుకున్న ఆ కాంట్రాక్టర్‌ ఆ పనులను అనంతపురానికి చెందిన మారుతీప్రసాద్‌ అనే వ్యక్తికి సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇచ్చాడు. మారుతీప్రసాద్‌ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు అత్యంత సమీప బంధువు అని సమాచారం. 

ఈ భారీ కాంట్రాక్ట్‌ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణస్వామి రూ.7 కోట్ల టెండర్‌లో కమీషన్‌గా తమకు రూ.70 లక్షలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ సుబ్బరాయుడుని డిమాండ్‌ చేశారు. తాను ఆ పనులను అనంతపురం ఎంపీ బంధువుకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చినట్టు చెప్పడంతో.. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ లక్ష్మీనారాయణకు ఫోన్‌చేసి కమీషన్‌ డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. 

రూ.70 లక్షల కమీషన్‌ ఇవ్వకపోతే పనులు జరగనిచ్చేది లేదని బెదిరించడంతో కంగుతున్న ఎంపీ లక్ష్మీనారాయణ విషయాన్ని అధిష్టాన వర్గానికి చేరవేశారు. మంత్రి నారా లోకేశ్‌కు కూడా ఫోన్‌ చేసి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు అరాచకాల గురించి ఎంపీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

అనంతలోనూ అదే తీరు
అనంతపురంలోనూ ఈ కమీషన్ల దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనుల్లో సైతం అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. అమృత్‌ రైల్వేస్టేషన్‌లో భాగంగా రూ.కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో తమకూ 10 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు సంబం«ధిత కాంట్రాక్టర్‌ను డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిసింది.

అధిష్టానమా.. అయితే నాకేంటి?
కమీషన్లు, బెదిరింపులు విషయం చంద్రబాబుకు తెలిసినా గుమ్మనూరు ఏ మాత్రం బెదరడం లేదు. అధిష్టానం అయితే నాకేంటి? నా కమీషన్లు నాకు ముఖ్యం అంటూ భీష్మించుకుని కూర్చున్నట్టు సమాచారం. తమ సొంత సామ్రాజ్యంలో అధిష్టానం జోక్యాన్ని కూడా సహించబోని గుమ్మనూరు కుటుంబీకులు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. గుమ్మనూరు  తీరుతో టీడీపీ అధిష్టానం నిర్ఘాంతపోయినట్టు సమా­చారం. 

ఈ విషయమై సంబంధిత విభాగపు అధికారి వివరణ కోరగా.. పైప్‌లైన్‌ పను­లుతోపాటు రైల్వేస్టేషన్‌లో పైప్‌లైన్లను ఆధు­నికీకరించడంతోపాటు సంప్, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణాన్ని రూ.7 కోట్లతో చేపట్టేందుకు రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్‌ సుబ్బా­రాయుడు పనులు దక్కించుకుని సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. మూడు నెలలు గడిచినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఈ విషయమై ఆరా తీయగా కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల పనులు ప్రారంభించలేకపోతున్నామని కాంట్రాక్టర్‌ చెప్పినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement