breaking news
Telangana
-
Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బెదిరింపు మెయిల్ను పంపారు. నేడు రెండు గంటల సమయంలో కోర్టును పేల్చివేస్తామంటూ దుండగులు ఆ మెయిల్లో పేర్కొన్నారు.దాంతో కోర్టులో ఉన్న వారిని పోలీసులు బయటకు పంపిస్తున్నారు. కోర్టు హాల్స్ మొత్తం కాళీ చేపిస్తున్నారు. బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీం రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలో అణువణువూ గాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించినట్లు అధికారిక సమాచారం లేదు. కాగా నేడు జరగాల్సిన అన్ని కోర్టు కార్యకలాపాలను ప్రస్తుతానికి పోలీసులు నిలిపివేసినట్టు సమాచారం. -
తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.నల్లగొండ జిల్లా: బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించగా.. పోటాపోటీ నినాదాలతో బీజేపీ కార్యాలయ ప్రాంతం దద్దరిల్లితోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా.. వారిపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్ల దాడికి యత్నించగా.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.నిజామాబాద్: బీజేపీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా.. ఎన్డీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి సహా 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ED అక్రమకేసులపై నిరసనగా కరీంనగర్ ఎంపీ అఫీసు ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ముట్టడిని ఎదుర్కోనేందుకు ఎంపీ ఆఫీసుకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బారీకేడ్లతో ఎంపీ ఆఫీసుకు రాకుండా పోలిసులు ఆంక్షలు విధించారు. వరంగల్, భూపాల్పల్లి జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఎడారి ఎండలో మనుగడ కోసం మండే మూల్యం
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ), వలస వెళుతున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 35 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా, తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు సాగుతున్న వలసలపై గల్ఫ్ వలసలపై చర్చిద్దాం.దయలేని ఎండలో, ఎడారి గల్ఫ్ దేశాల్లో 50° డిగ్రీల ఎండకు కార్మికులు కుప్పకూలిపోవడం, ఉక్కపోత కార్మిక శిబిరాలలో ఉడికిపోవడం గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఉప్పు నీటి ద్రావణం ఎలక్ట్రోలైట్ కలిపిన నీరు తాగుతూ నీడలేని స్థితిలో పనిచేయడం సాధారణం. నీడ కలిగిన పని ప్రదేశాలు, 35° డిగ్రీలు దాటితే ప్రతి గంటకు 15 నిమిషాల విరామం లాంటి వసతులను ఇప్పుడు అమలు చేస్తున్నారు. “మా కుటుంబం పేదది, అప్పుల్లో ఉంది. నా పిల్లలకు చదువు అవసరం. అందుకే ఇక్కడే ఉంటూ, మా కష్టాలను పూడ్చేందుకు ఇంకా ఎక్కువ గంటలు పని చేస్తున్నాను.” అని ఒక కార్మికుడు చెప్పిన విషయం, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) కు చెందిన విజయ్ కొర్రా, సంతోష్ గుగులోతు 2017 లో చేసిన అధ్యయనం లోనిది. ఇది గల్ఫ్ వలసలలో తక్కువ నైపుణ్య కార్మికులపై మోపుతున్న కనిపించని భారాన్ని వెలుగులోకి తెస్తుంది. తెలంగాణ నుంచి లక్షలాది గ్రామీణ యువత బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. స్వదేశానికి సొమ్ము పంపాలనే 'రెమిటెన్స్' కల, అనారోగ్యం, ఆర్థిక పతనం, కుటుంబాల దుస్థితితో ముగిసిన సందర్భాలున్నాయి. వాతావరణ మార్పుల (క్లయిమేట్ చేంజ్) తో గల్ఫ్ ప్రాంతంలోని నరక సమాన వేడిని మరింత పెంచుతున్న వేళ, భారత్ - గల్ఫ్ భాగస్వామ్య దేశాలు తక్షణమే దృఢంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1983 వలస చట్టాన్ని పూర్తిగా మార్చేసి, త్వరలో ప్రవేశపెట్టనున్న 'ఓవర్సీస్ మొబిలిటీ' బిల్ సురక్షిత, చట్టబద్ధ, క్రమబద్ధ వలసలకు అనుకూలంగా విధానాలు రూపొందించాలి. వెల్ఫేర్ ఫండ్ ద్వారా సమగ్ర బీమా సబ్సిడీలు, చికిత్సలు, వేతన నష్టం పూడ్చేలా చర్యలు తీసుకోవాలి. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి సోలార్ టెక్, అగ్రో-ప్రాసెసింగ్ వంటి వాతావరణ అనుకూల నైపుణ్యాల్లో పునః శిక్షణ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి. ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎన్నారైలకు (NRIs) ఈ-బ్యాలెట్ ఆన్లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశహర్మ్యాలను నిర్మించిన కార్మికులను పట్టించుకోకపోతే, వారు పాలకులకు అధఃపాతాళం చూపిస్తారు. - మంద భీంరెడ్డి(రచయిత: తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మరియు వలస కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్న నిపుణుడు) -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం
సిద్దిపేట జిల్లా: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. గోపాల్ ‘తీన్’మార్! దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. -
Hyderabad: వైద్యురాలికి వేధింపులు
బంజారాహిల్స్: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న వైద్యురాలికి అందులోనే పనిచేస్తున్న యువకుడి నుంచి రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే వైద్యురాలు (41) ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నారు. 2021 సంవత్సరంలో సెంటర్ సూపర్వైజర్గా నామాల వెంకటేష్ వంశీని నియమించుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలితో పరిచయం ఏర్పడగా.. ఆమె ఫోటోలు తీస్తూ నానా రకాలుగా వేధించసాగాడు. గత ఏడాది నుంచి వెంకటేష్ వంశీ బాధిత వైద్యురాలిని అనుసరిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. గత అక్టోబర్లో ఆమె అపార్ట్మెంట్లోకి కూడా చొరబడి కారును ధ్వంసం చేశాడు. ఆమె అర్ధనగ్న ఫోటోలను, వీడియోలను బంధు మిత్రులకు వాట్సప్లో షేర్ చేశాడు. దీంతో తనను వేధిస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెంకటేష్వంశీపై బీఎన్ఎస్ సెక్షన్ 77, 78 (1)(2), 79, 351 (2), 324 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గండిపేటలోకి గలీజు!
మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని.. బుధవారం స్థానికులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. అదే సమయంలో.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఎఫ్టీఎల్ 428వ పాయింట్ వద్ద ఓ సెప్టిక్ ట్యాంక్ వాహనం నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్ను ప్రశ్నించారు. అది శివనాయక్కు సంబంధించిన వాహనమని.. హిమాయత్నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. తాగే నీళ్లలో మనుషుల వ్యర్థాలు అన్లోడ్ వ్యవహారంపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఉస్మాన్సాగర్లో అధికారులే దగ్గరుండి పారబోయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారి నరహరిపైనా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
ఖమ్మం జిల్లా: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ అభిమానుల సంబురాలు
ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు. ఆమెకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానుల మద్దతు ఉండడంతో ఫలితం వెలువడగానే సంబురాలు చేసుకున్నారు. ఈక్రమాన జగన్ ఫొటోతో సంబురాల్లో పాల్గొని తమ కృతజ్ఞత చాటుకున్నారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
ప్రజా విశ్వాసానికి నిదర్శనం !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై అధికార కాంగ్రెస్ పార్టీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. దాదాపు 7 వేల వరకు సర్పంచ్ స్థానాలు, మెజార్టీ వార్డు స్థానాల్లో గెలు పొందడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఫలితాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని రుజువైందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై పల్లె ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇమేజ్కు తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం మంచి ఫలితాలను సాధించి పెట్టిందని అంచనా వేస్తున్నాయి. సంక్షేమమే బాసటగా..!గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయానికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలే బాసటగా నిలిచాయనే అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలు గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి కారణమయ్యాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకట్రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటా పార్టీ ఆధిక్యం సాధించడం చూస్తే సీఎం రేవంత్రెడ్డి పాలనకు పల్లె ప్రజలు పట్టం కట్టిన విషయం స్పష్టమవుతోందని, పార్టీ పట్ల వ్యతిరేకత లేదని కూడా తేలిపోయిందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో పట్టు పెంచుకున్నామని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు ద్వారా పల్లె ప్రాంతాల్లో గట్టిగా పాగా వేయగలిగామని, బీఆర్ఎస్–బీజేపీలు కలిసినా ఆ రెండు పార్టీలకు కలిపి 30 శాతం సీట్లు రాకపోవడం ప్రతిపక్షాలపై ప్రజలకు నమ్మకం లేదని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి పాలనకు గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుండడం, ఓవైపు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తూ మరోవైపు అభివృద్ధి ఆగకుండా మంత్రివర్గం పని చేస్తుండడం, తెలంగాణను ప్రపంచ యవనికపై నిలబెట్టేందుకు సీఎం రేవంత్ చేస్తున్న కృషి లాంటివన్నీ కలిసి పంచాయతీల్లో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు కట్టబెట్టాయి..’ అని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 75 శాతం మా వాళ్లే..ఏ పార్టీ బలపర్చకుండా స్వతంత్రంగా గెలిచిన వారిలో 90 శాతం మంది తమ పార్టీ వారేనని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,200 గ్రామాల్లో తమ పార్టీ రెబెల్స్ బరిలో ఉన్నారని, పార్టీలో పనిచేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోటీకి ఇది నిదర్శనంగా నిలుస్తుందని చెబుతోంది. ఇప్పుడు గెలిచిన స్వతంత్రులు ఎక్కువ మంది కాంగ్రెస్ గూటికే చేరుతారని, తద్వారా రాష్ట్రంలోని 75 శాతం పంచాయతీలు తమ పక్షమే అవుతాయని విశ్లేషిస్తోంది. -
ఆ అభిప్రాయం తప్పని తేలింది
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా సంతృప్తి కలిగించే ఫలితాలు రాకపోయినా ఒక మోస్తరు మంచి ఫలితాలనే సాధించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీ పట్ట ణప్రాంతాలకే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉన్నా...దానిని ఈ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ద్వారా తప్పు అని నిరూపించగలిగామని అంటున్నారు. బుధవారం జరిగిన మూడోవిడత ఎన్నికల ఫలితాలతో కలిపి మొత్తంగా 700 దాకా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్టుగా వారు అంచనా వేస్తున్నారు. మొదటి విడత కంటే కూడా రెండు, మూడు విడతల్లో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్లలో గణనీయమైన స్థానాలు సాధించామని, ఇతర జిల్లాల్లోనూ కనీస ప్రాతినిధ్యం దక్కడంతో మొత్తంగా గ్రామీణ పాంతాల్లో గట్టి ఉనికిని ప్రదర్శించినట్టయ్యిందని చెబుతున్నారు. 900 మంది వరకు మా వాళ్లే: బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు మూడు విడతల్లో కలిపి మొత్తంగా 800 నుంచి 900 వరకు (ఇండిపెండెంట్లు కలుపుకొని) సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ బలపరిచినవారు విజయం సాధించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీ బలంగా చొచ్చుకు వెళ్లిందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ విధంగా క్షేత్రస్థాయిలో పెరిగిన పార్టీ బలం త్వరలోనే రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. పెద్దసంఖ్యలో వార్డుసభ్య స్థానాలను, ఉప సర్పంచ్లను సైతం గెలుచుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మొత్తంగా పార్టీకి బలంగా ఉన్న ప్రాంతాలు..ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో 163 మంది సర్పంచ్లకే బీజేపీ పరిమితం కావడాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలల్లో ఎన్నికలు జరిగితే 6 నుంచి 7 వేల గ్రామాల్లోనే అభ్యర్థులను నిలపాగలిగామని రాంచందర్రావు తెలిపారు. భద్రాచలం, మహబూబాబాద్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామటుకు పోటీకి నిలబెట్టలేకపోయామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీకి పట్టున్న అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు. -
బీఆర్ఎస్లో ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి ఊపిరి పోశాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేదు ఫలితాలను చవి చూసిన పార్టీలో.. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫలితాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. గ్రామాల్లో తమ పట్టు చెక్కు చెదరలేదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కనీసం 40 శాతం సర్పంచ్ పదవులు పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కేడర్ చెక్కు చెదరలేదు! పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్ను స్థానికంగా సమన్వయం చేసుకుని పట్టుదలతో పనిచేయడం వల్లే అధికార కాంగ్రెస్కు గట్టి పోటీనిచ్చామనే అభిప్రాయం బీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, పట్టుదల నాయకత్వానికి స్ఫూర్తినిచ్చేలా ఉందనే అభిప్రాయం పైస్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపం, గ్రూపు తగాదాలు, పాలన వైఫల్యం, పల్లెల్లో అభివృద్ధి కుంటుపడటం కూడా తమకు కలిసి వచ్చాయని గులాబీ దళం విశ్లేషిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి చోట్ల మినహా ఎక్కడా పెద్దగా బీజేపీ ప్రభావం కనిపించలేదని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు..ఆ పార్టీ బలపడిందనడానికి నిదర్శనం కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నూతనోత్సాహంతో ముందుకు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల దిశగా సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయడం, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాల సంబంధిత షెడ్యూల్ను పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించే అవకాశముంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీకి అధికార కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మరింత దూకుడుగా వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు కార్యాచరణపై గట్టిగా దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను విశ్లేషించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలహీనతలపైనా పోస్ట్మార్టమ్ చేయాలని భావిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత.. ఇతర పార్టీల్లోకి నేతల వలసలు, ఫిరాయింపులతో బలహీన పడిన నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
‘ఉచిత’ డిస్కం వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలను ఈ డిస్కం పరిధిలోకి తెస్తారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిత్తల్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడు దల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 15 జిల్లాలకు, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 18 జిల్లా లకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం వీటి పరిధిలో ఉన్న వ్యవ సాయ, లిఫ్ట్ ఇరిగేషన్ ఇతర తాగునీటి పథకాలకు చెందిన 29, 08,138 విద్యుత్ కనెక్షన్లను కొత్తగా ఏర్పడే డిస్కం పరిధిలోకి తెస్తారు. అయితే ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న కనెక్షన్లను కొత్త డిస్కంకు బదలాయించలేదు. ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న కనెక్షన్లను మాత్రమే మూడో డిస్కంకు కేటాయించారు. రెండు డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ సిబ్బందిని విభజించి కొత్త డిస్కంకు కేటాయిస్తారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అప్పులను కొత్తగా ఏర్పడే డిస్కంకు విద్యుత్ కనెక్షన్ల నిష్పత్తిలో బదలాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉచిత విద్యుత్ పథకా లను సమర్థంగా నిర్వహించడం, నాణ్యమైన విద్యుత్ అందించడమే కొత్త డిస్కం ఏర్పాటు లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఉచితాలన్నీ ఇందులోకే...ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలో ఉన్న ఉచిత పథకాలు ఇక నుంచి కొత్త డిస్కం పరిధిలోకి రానున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, మున్సిపల్ వాటర్ సప్లైకి సంబంధించిన కనెక్షన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విద్యుత్ కనెక్షన్లు కొత్త డిస్కంకు బదలాయిస్తారు. రెండు డిస్కంల పరిధిలోని 5,22,479 వ్యవసాయ విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లపై మూడో డిస్కంకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఆపరేషన్, మెయింటెనెన్స్ మొత్తం మూడో డిస్కం పరిశీలిస్తుంది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో), కేంద్ర విద్యుత్ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ సంస్థలతోపాటు పలు రకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు 70.55 శాతం, ఎన్పీడీసీఎల్కు 29.45 శాతం ఉన్నాయి. స్థానిక అవసరాలు, ఐదేళ్ల విద్యుత్ వినియోగ సగటు ఆధారంగా పీపీఏలను మూడో డిస్కం పరిధిలోకి తెస్తారు. రెండు డిస్కంల పరిధిలోని 2 వేల మంది సిబ్బందిని మూడో డిస్కంకు కేటాయిస్తారు. ఇందులో 660 మంది ఇంజనీర్లు, 1,000 మంది ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది, 340 మంది పాలనాపరమైన సిబ్బంది ఉంటారు. రూ. 35 వేల కోట్ల అప్పు బదలాయింపుప్రస్తుతం ఉన్న డిస్కంల పరిధిలోని అప్పులో కొంత భాగాన్ని కొత్త డిస్కంకు బదలాయిస్తున్నారు. ప్రస్తుతం రెండు డిస్కంలకు రూ.45,398 కోట్ల మేర అప్పులున్నాయి. వీటిల్లో రూ.35,982 కోట్ల అప్పు మూడో డిస్కంకు వెళుతుంది. ఉచిత పథకాలకు సంబంధించిన అప్పునే మూడో డిస్కంకు బదలాయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉచిత పథకాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ఇక నుంచి మూడో డిస్కంకు వెళుతుంది. అయితే, నిర్వహణ, పెట్టుబడి వ్యయానికి మూడో డిస్కం అప్పు చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉచిత పథకాలన్నీ మూడో డిస్కంకు బదలాయించడంతో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు లాభాల్లోకి వెళ్లే వీలుందని అధికారులు తెలిపారు. -
అన్యాయం కాదు.. సమన్యాయమే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని.. సమన్యాయం చేశామని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు ఏపీ ప్రభుత్వం వివరించింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ)తో పోల్చితే ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)ను నిర్లక్ష్యం చేశారన్న తెలంగాణ ఆరోపణ తప్పని పేర్కొంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఆయకట్టు 6.6 లక్షల ఎకరాల కంటే తగ్గలేదని ఎత్తిచూపింది.కృష్ణా జలాల కేటాయింపులో, వినియోగంలో అన్యాయం చేశారంటూ తెలంగాణ చేస్తున్న వాదనలకు చట్టపరమైన, చారిత్రక ఆధారాలు లేవని వాదించింది. ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి జస్టిస్ బ్రిజేశ్కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా కేంద్రం ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 గురువారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా ఈమేరకు తుది వాదనలు కొనసాగించారు. పునఃసమీక్షించవద్దు.. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిందని, అందువల్ల బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించకూడదని జైదీప్ గుప్తా వాదించారు. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపును కొనసాగించాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు అమల్లోకి రావడంతో 1944, ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధత లేకుండా పోయిందని.. దాన్ని చూపుతూ కేసీ కెనాల్, ఆర్డీఎస్ల కింద సమాన వినియోగం కోసం నీటిని కేటాయించాలని తెలంగాణ చేస్తున్న వాదన అసంబద్ధమని చెప్పారు. తెలంగాణ కేసీ కెనాల్ను కుడి కాలువగా.. ఆర్డీఎస్ను ఎడమ కాలువగా పోల్చడం ఊహాజనితమన్నారు. ఇక ఎస్ఆర్బీసీతో పోల్చితే.. ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేశారని తెలంగాణ ఆరోపించడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయలేదని ఎత్తిచూపారు. జైదీప్ గుప్తా గురువారం కూడా వాదనలు కొనసాగించనున్నారు. ఈ విచారణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు హాజరయ్యారు. -
వాళ్లు తోడేస్తున్నారు.. చూడండి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వాడకంలో ఈ ఏడాది సైతం తెలంగాణ తీవ్రంగా వెనకబడింది. ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో ఇప్పటి వరకు ఏపీ ఏకంగా 533.53 టీఎంసీల జలాలను వాడుకోగా, తెలంగాణ 116.9 టీఎంసీలతో సరిపెట్టుకుంది. రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 650.44 టీఎంసీలను వాడుకోగా, అందులో ఏకంగా 82.03 శాతాన్ని ఏపీ వాడుకోగా, 17.97 శాతాన్ని మాత్రమే తెలంగాణ వినియోగించుకుంది. కనీస నిల్వ మట్టాని (ఎండీడీఎల్)కి ఎగువన శ్రీశైలం జలాశయంలో 146.8 టీఎంసీలు, నాగార్జునసాగర్ జలాశయంలో 152.21 టీఎంసీలు కలిపి మొత్తం 299.02 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ బాధ్యతలను కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్–2కి అప్పగించగా, ఇంకా ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆలోగా ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను 2015లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. దీనిని 2024–25 నుంచి తెలంగాణ అంగీకరించడం లేదు. ఏపీ, తెలంగాణ మధ్య 29:71 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీ జరపాలని డిమాండ్ చేస్తోంది. 66:34 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకున్నా.. ఇప్పటివరకు చేసిన వాడకం పోగా ఏపీ కోటా కింద 82 టీఎంసీలే మిగిలి ఉంటాయని తాజాగా తెలంగాణ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది వర్షాలు పడేంతవరకు రావాలి..2026 మే 31తో ప్రస్తుత నీటి సంవత్సరం ముగియనుండగా, అప్పటివరకు ఏపీకి 142 టీఎంసీల కృష్ణా జలాలు అవసరం కానున్నాయని తెలంగాణ అంచనా వేసింది. 2024 డిసెంబర్ 1 నుంచి 2025 మే 31 వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి మొత్తం 142 టీఎంసీలను ఏపీ వాడుకోవడంతో దాని ఆధారంగా ఈ లెక్కలు వేసింది. ఏపీ కోటా కింద 82 టీఎంసీలే మిగిలి ఉండటంతో పొదుపుగా అంత మేరకే నీళ్లు వాడుకునేలా ఆ రాష్ట్రానికి సూచనలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ ఇటీవల కృష్ణాబోర్డు చైర్మన్కు లేఖ రాశారు. ఏపీకి 82 టీఎంసీలపైనే హక్కులుండగా, అదనంగా మరో 60 టీఎంసీల అవసరాలు కలిగి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నీటి వాడకాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షించాలని కోరారు. మళ్లీ జూన్లో వర్షాలు ప్రారంభమయ్యే వరకు శ్రీశైలం, సాగర్లో ఉన్న నీటి నిల్వలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, లేకుంటే తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచే 184 టీఎంసీలు...పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా 184.61 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 30.11 టీఎంసీలు, చెన్నై తాగునీటి సరఫరాకు కలిపి మొత్తం 218.69 టీఎంసీలను శ్రీశైలం నుంచి ఏపీ వాడుకుంది. కల్వకుర్తి లిఫ్టు అవసరాలకు తెలంగాణ 15.2 టీఎంసీలనే శ్రీశైలం నుంచి వాడుకుంది. ఇక నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ జలమండలి 8.3 టీఎంసీలు, ఎమ్మార్పీ లిఫ్టు ద్వారా 17.31 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 38.96 టీఎంసీలు కలిపి మొత్తం 64.57 టీఎంసీలను తెలంగాణ వాడుకోగా, సాగర్ ఎడమ కాల్వ ద్వారా 23.47 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 91.98 టీఎంసీలు కలిపి మొత్తం 115.4 టీఎంసీలను ఏపీ వాడుకుంది. ఇలా మొత్తానికి ఏపీ 533.53 టీఎంసీలు, తెలంగాణ 116.91 టీఎంసీలు వాడుకున్నాయి. ఉమ్మడి జలాశయాల్లో 299.02 టీఎంసీలు, ఇతర జలాశయాల్లో 90.60 టీఎంసీలు కలిపి మొత్తం 389.62 టీఎంసీలు ఎండీడీఎల్కి ఎగువన లభ్యతలో ఉన్నాయి. -
మూడో విడతలో 85.77%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తుది విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% ఓటింగ్ రికార్డయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం ముగియగా, ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది పూర్తయ్యాక విజేతలను ప్రకటించారు. బుధవారం రాత్రికల్లా దాదాపుగా కొన్నిచోట్ల మినహా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయింది.తుది విడతలో ఇలా....182 మండలాల్లో మొత్తం 4,159 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 సర్పంచ్లు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పంచాయతీలు, 18 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఈ దఫాలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56% కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, ఖమ్మం 88.84%, నల్లగొండ జిల్లా 88.72% నిలిచాయి. ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువైంది. వలసలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో పురుష ఓటర్లు తక్కువగా ఉండటం కొంత వరకు ప్రభావం చూపింది. అత్యల్పంగా నిజామాబాద్ 76.45%, రాజన్న సిరిసిల్ల 79.14%, జగిత్యాల 79.64% నమోదైంది. మూడు విడతలోనూ కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు, అక్కడకక్కడ ఉద్రికత్తలు మినహా మిగిలినచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ను విరివిగా వినియోగిస్తాం : సీఎస్ రామకృష్ణారావు మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినితో కలిసి సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ డా.జి. సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరందం ఉన్నారు. -
కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభం అయిందని, రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కాకతప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది భారత్ రాష్ట్ర సమితే అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని పేర్కొన్నారు. సీఎంకు ముచ్చెమటలు..పంచాయతీ ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా అధికార పక్షం వైపు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రుల్ని మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడింది. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన ‘జంగ్ సైరన్’..’ అని కేటీఆర్ అభివర్ణించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయడం, రైతుబంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలు అధికార పార్టీపై ప్రజల ఆగ్రహానికి కారణమని చెప్పారు.ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందికాంగ్రెస్ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను వీరోచితంగా తట్టుకుని బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ‘ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం..’ అని అభివర్ణించారు. ‘యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సువంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అరాచక కాంగ్రెస్ను, రేవంత్రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..’ అని ఆయన పేర్కొన్నారు. -
హస్తం.. హ్యాట్రిక్
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో హుషారు రేకెత్తించేలా గ్రామీణ ఓటరు తీర్పు ఇచ్చాడు. ఇంకోవైపు బీజేపీలోనూ ఈ ఎన్నికలు జోష్ పెంచాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ అగ్రస్థానంలో నిలవగా, బీఆర్ఎస్, బీజేపీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అయితే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈసారి గణనీయ సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో మూడో వంతు స్థానాల్లో తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాధించడం.. ప్రభుత్వ పనితీరుపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనగా అధికార పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నారు.అయితే అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకుని తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారని, ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియచేస్తోందని విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మరింత జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారిగా వందల సంఖ్యలో పంచాయతీల్లో పాగా వేయడంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మరిన్ని స్థానాలు గెలిస్తే బావుండునన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. 1205 పంచాయతీలు ఏకగ్రీవం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 12,728 గ్రామపంచాయతీలకు గాను ఏకగ్రీవాలు 1205 పంచాయతీలు, నామినేషన్లు వేయని పంచాయతీలు 21, కోర్టు స్టేలతో ఎన్నికలు జరగని 5 స్థానాలను మినహాయిస్తే 11,497 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు 7135 పంచాయతీల్లో విజయం సాధించారు.ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3508 పంచాయతీల్లో గెలుపొందగా, బీజేపీ దాదాపు 674 గ్రామాల్లో పాగా వేసింది. ఇలావుండగా.. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొని 1385 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. -
అనర్హత.. డిస్మిస్.. స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. బీఆర్ ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ మొత్తం పదిమంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. స్పీకర్ బుధవారం ఐదుగురి పిటిషన్లపై తీర్పు వెలువరించారు. బీఆర్ఎస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగినట్లు ఆ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. స్పీకర్ ఉత్తర్వులను శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాందీకి ఊరట లభించినట్లయింది. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ఎప్పటి లోగా నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. అందరి వాదనలు విన్నాకే..: రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నియమావళిని అనుసరించి డాక్టర్ తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. అదే తరహాలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల)పై పల్లా రాజేశ్వర్రెడ్డి; ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)పై కల్వకుంట్ల సంజయ్; గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు)పై చింత ప్రభాకర్ పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ చైర్మన్గా ఏర్పడిన ట్రిబ్యునల్ ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఇరు పక్షాలకు వాదన వినిపించేందుకు తగిన సమయం, అవకాశాలు ఇచి్చనట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు, శాసనసభ (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత)–1986 నిబంధనల మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ విఫలం తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తప్పుబట్టారు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని కేపీ వివేకానంద అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఏమీ కాదని గతంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ నిర్ణయం బలపరిచేదిగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకలాపాల్లో బహిరంగంగా పాల్గొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు. తాము మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం లేదన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటివరకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని పేర్కొన్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్లను ఏ ప్రాతిపదికన డిస్మిస్ చేశారో వెల్లడించాలని కోరినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువును దృష్టిలో పెట్టుకుని అనర్హత పిటిషన్లపై స్పీకర్ వెలువరించిన నిర్ణయం తూతూ మంత్రంగా ఉందని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాలనే స్పీకర్ నిర్ణయంగా వెలువరించారని కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటంతోనే తమకు న్యాయం జరుగుతుందని ఆ బీఆర్ఎస్ చెబుతోంది. స్పీకర్ నోటీసులకు కడియం సమాధానం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే ఉన్నానని, తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పీకర్కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కేపీ వివేకానందకు అందజేశారు. కడియం ఇచ్చిన సమాధానాలపై ఈ నెల 19లోగా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని స్పీకర్ గడువు విధించినట్లు సమాచారం. కడియంపై విచారణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పేందుకు చివరి నిమిషంలో ఆయన సమాధానాన్ని అందజేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. మరో ముగ్గురిపై నేడు నిర్ణయం పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గురువారం నిర్ణయం ప్రకటించే అవకాశముంది. పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్ (జగిత్యాల)పై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇదివరకే పూర్తయింది. ఈ నేపథ్యంలో గురువారం ఆ ముగ్గురిపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది. తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ కసరత్తు తాము దాఖలు అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం రాత్రి కేటీఆర్తో తెలంగాణ భవన్లో భేటీ అయి.. స్పీకర్ ఎదుట జరిగిన విచారణ పరిణామాలను వివరించారు. ఎప్పుడేం జరిగిందంటే..? – 2023 నవంబర్/డిసెంబర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్ఎస్ నుంచి 39 మంది అసెంబ్లీకి ఎన్నిక – మార్చి–ఏప్రిల్ 2024: బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు. స్పీకర్ వద్ద బీఆర్ఎస్ తరపున అనర్హత పిటిషన్లు దాఖలు. –ఏప్రిల్–జూలై 2024: స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ –సెప్టెంబర్ 2024: విచారణ షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్ను హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. కానీ డివిజన్ బెంచ్ దీన్ని సవరించి ‘రీజనబుల్ టైమ్‘లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. – జనవరి 2025: బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. – జూలై 31, 2025: స్పీకర్కు సుప్రీంకోర్టు 3 నెలల (అక్టోబర్ 31 వరకు) గడువు ఇచ్చింది. – సెపె్టంబర్ 29, 2025: విచారణలు మొదలు (మొదటి బ్యాచ్లో నలుగురు ఎమ్మెల్యేల విచారణ) – అక్టోబర్ 2025: క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింపు, మిగతా ఎమ్మెల్యేల విచారణ. – అక్టోబర్ 31, 2025: సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా నిర్ణయం ప్రకటించని స్పీకర్. – నవంబర్ 17, 2025: స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసి, 4 వారాల్లో (డిసెంబర్ 18లోగా) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. – నవంబర్ 20, 2025: 8 మంది ఎమ్మెల్యేలపై విచారణలు పూర్తి. – డిసెంబర్ 17, 2025: ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టివేత. -
కొత్త హైకోర్టు పనులపై సీఎస్ వికాస్ రాజ్ సమీక్ష
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు భవన సముదాయం పనుల పురోగతిని రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్లు (బిల్డింగ్స్, ఎలక్ట్రికల్), ఆర్అండ్బీ ఫీల్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ సంస్థ డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, కన్సల్టెంట్లు టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. పనుల వేగం, క్రమబద్ధత, నాణ్యతను వికాస్ రాజ్ సమీక్షించి, వివిధ దశల పూర్తి కాలపట్టికలను ఖరారు చేశారు.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కొత్త హైకోర్టు భవన సముదాయానికి రూ.2,583 కోట్ల పరిపాలనా అనుమతి ఉంది. మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎంఈపీ పనులకు రూ.1,980 కోట్లు, ఫర్నిచర్ మరియు ఆపరేటివ్ పరికరాలకు రూ.603 కోట్లు కేటాయించారు. 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.827 ద్వారా పరిపాలనా ఆమోదం లభించింది.పనుల సమీక్షలో భాగంగా, డ్రాయింగ్లను ముందుగానే సమర్పించాలని కన్సల్టెంట్లను వికాస్ రాజ్ ఆదేశించారు. తద్వారా కార్మికులు, సామగ్రి, యంత్రాల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పనుల పూర్తి కార్యక్రమాన్ని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్), కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ కలిసి రూపొందించాలని, దానిపై తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఒప్పందంలో పేర్కొన్న మైలురాళ్ల ప్రకారం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. న్యాయ అధికారుల సూచనలకు అనుగుణంగా మార్పు చేసిన నమూనాలను ఆలస్యం లేకుండా సిద్ధం చేసి, అనుమతులు పొందాలని కన్సల్టెంట్లకు ఆదేశించారు. జోన్-2కు సంబంధించిన అటవీ అనుమతులు సహా అన్ని క్లియరెన్సులను త్వరితగతిన పూర్తిచేయాలని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు సూచించారు.డిజైన్ మార్పుల వల్ల ఏర్పడిన ఆలస్యాలను అధిగమించేందుకు శాఖ, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాలని, ప్రాజెక్టును సమయానికి పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. -
BRS ఎమ్మెల్యేల పిటిషన్ లు కొట్టివేసిన స్పీకర్
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, స్పీకర్ నిర్ణయాన్ని పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. అరికపూడి గాంధీ,గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీర్పును వెలువరించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఆ ఐదుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి అనర్హత వేటు నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వరుస పరిణాలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుమంది ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. స్పీకర్ నిర్ణయంపై కేసీఆర్, కేటీఆర్తో పిటిషనర్లు వివరించినట్లు తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ స్పందించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లు డిస్మిస్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్న స్పీకర్.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు, అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. పార్టీ ఫిరాయించినట్ల ఎక్కడా ఆధారాలు లేవన్నారు. బీఆర్ఎస్ వాదనతో స్పీకర్ ఏకీభవించలేదు.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్ స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుగురి ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. స్పీకర్ దగ్గర మాకు న్యాయం దక్కలేదని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కోసం కోర్టులను ఆశ్రయిస్తాం. కండువాలు కప్పుకుని పార్టీ మారినా వేటు వేయలేదు. న్యాయం కోసంకచ్చితంగా కోర్టు తలుపులు తడతాం’’ అని పల్లా చెప్పారు. -
ఇది కాదు..అంతకు మించి జగ్గారెడ్డి మనసులో మాట?
-
శీతాకాల విడిది.. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు మధ్యాహ్నం హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మూర్మును హకీంపేట ఎయిర్పోర్టులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతం పలికారు.భద్రతా ఏర్పాట్లురాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హకీంపేట, బోలారం, అల్వాల్, తిరుమలగిరి, కార్కానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్ ఉండనుంది. కాగా, డిసెంబర్19 ఉదయం 11.00 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
కొత్త సర్పంచ్ల పదవి ప్రమాణస్వీకారం తేదీలో మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కి మార్చింది.తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే సరైన ముహూర్తాలు లేవని.. కావున అపాయింటెడ్ డే ను ఈ నెల 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ డేను రెండు రోజుల పాటు వాయిదా వేసి, డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు అదే రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను మాఫీ చేయడానికి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావుపై సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వేటు వేశారు. ఆయనను వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఇన్స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్ఐ అశోక్, హోంగార్డు కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్లను కూడా బదలీ చేస్తూ సీపీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన చలాన్లను క్లియర్ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సిబ్బందిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకున్న ఆయన, పోలీస్ వ్యవస్థలో అవినీతికి తావులేదని హెచ్చరిస్తున్నారు. -
మేము ఓట్లు వెయ్యం.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
సాక్షి, ఖమ్మం జిల్లా: తుదివిడత పల్లె పోరు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. అయితే ఓ గ్రామ పంచాయతీలో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ఎందుకంటే గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ గ్రామ ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లు అడగడానికి మాత్రమే మేము రాజకీయ నాయకులకు గుర్తుకు వస్తాం లేకపోతే మేము ఎవరికీ కనపడం అంటూ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. -
హైదరాబాద్: చందానగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్రూమ్లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.బుల్లీయింగ్కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు. -
అర్హతా.. అనర్హతా.. ఏం చెప్పబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మొదటి దశ విచారణలో భాగంగా.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం ఏంటి?.. ఐదుగురిపై వేటు వేస్తారా? లేదంటే ఫిరాయింపే లేదంటారా? స్పీకర్ ఏం చెప్పబోతున్నారు?.. అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల అడ్వొకేట్లకు మధ్యాహ్నాం రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. ఆపై శాసనసభ వెబ్సైట్లో తీర్పు ప్రతులను అధికారులు అప్లోడ్ చేయనున్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ BRS (భారత రాష్ట్ర సమితి) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు డెడ్లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉండడంతో.. నిర్ణయం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మాత్రం స్పీకర్ నోటీసులకు వివరణలు ఇచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని చర్చా నడుస్తోంది. -
అమెరికా ఫోన్లో ఏముంది?.. ప్రభాకర్రావుకు సిట్ సూటి ప్రశ్న!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఐబీ మాచీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ విచారణ ఆరో రోజుకు చేరుకుంది. జూబ్లీహిల్స్లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) SIT కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా విచారణలో నోరు మెదపని ప్రభాకర్ రావు ఆరో రోజు కూడా సిట్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటలు దాటవేస్తూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తరుణంలో.. సిట్ అధికారులు ప్రభాకర్ రావు కదలికలపై సీసీ కెమెరా నిఘా పెట్టారు. ప్రముఖుల ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్కు అనుమతి పొందిన నేపథ్యంలో అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నంబర్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు పెట్టమని ఎవరు చెప్పారు? అని సిట్ ప్రశ్నిస్తోంది. అయితే డేటా డిలీట్ పై పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న ఐఫోన్ లో క్లౌడ్ డేటా ఓపెన్ చేసినట్లు,ఫోన్ అమెరికాలో ఎందుకు వదిలేసి వచ్చినట్లు? అంటూ రాజకీయ ప్రముఖుల సీడీఆర్ డేటాతో ప్రభాకర్ని సిట్ ప్రశ్నించింది. ఎందుకు ట్రేస్ చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ అమాత్యుల పాత్ర ఉందా? అని ప్రశ్నించగా ఆ మాటలు దాటవేస్తూ.. విచారణకు ప్రభాకర్ రావు ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు 5ఐ క్లౌడ్, 5జిమెయిల్ ఖాతాల్లో ఉన్న డేటాపై సిట్ దర్యాప్తు చేసింది. గతంలో నాలుగు జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్ 2 అకౌంటల పాస్వర్డ్ ఇవ్వడంతో డేటా కనిపించకుండా ఉండటంతో సిట్ వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపింది. దానితో సిట్ ఎఫ్ఎస్ఎల్ డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు. మరోవైపు సింక్ అయిన డేటా యాపిల్, జిమెయిల్ కంపెనీల నుండి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఆ డేటాతో పాటు విచారణలో ప్రభాకర్ నోరు మెదిపితే కీలకమైన ఆధారాలు సిట్కు లభించనున్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుండి తొలిగించానని ప్రభాకర్ రావు సిట్కు తెలిపారు.ప్రభాకర్ రావు వాగ్మూలంపై వాస్తవం ఎంత అనేది జీమెయిల్,యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉంది. -
సర్పంచ్గిరీకి ఓ సలాం.. ఇప్పుడు గులాం
‘ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం. జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ. 12 వేలకుపైగా జనాభాతో 8,633 ఓటర్లతో ఉన్న రుద్రంగి రెండు దశాబ్దాల కిందట కల్లోల పల్లె. అక్కడ ఎన్నికలను మూడు తుపాకులు శాసించేవి. ఒకటి సీపీఐ(ఎంఎల్) జనశక్తి, మరోటి సీపీఐ మావోయిస్టు పార్టీ, ఇంకోటి పోలీసుల తుపాకీ. మూడు తుపాకుల నీడలో పల్లె అల్లకల్లోలంగా ఉండేది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ, ఓట్లు వేసి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని జనశక్తి నక్సలైట్లు, ఎవరికైనా ఓటేయండి.. నక్సలైట్ల మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయొద్దని పోలీసులు.. ఇలా మూడు తుపాకుల నీడలో పల్లె జనం వణికిపోయేవారు. రుద్రంగికి చెందిన మాజీ ఎంపీపీ ఇప్ప గంగారెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు చెల్కల గంగరాజయ్య, ఆకుల గంగారెడ్డిని ఇన్ఫార్మర్ పేరిట నక్సలైట్లు హత్య చేశారు. అటు పోలీసులు చేతుల్లోనూ అనేక మంది ఎన్కౌంటర్ కాబడ్డారు. ఇలా ఒక్క రుద్రంగిలోనే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక గ్రామాల ఒకప్పటి దృశ్యం. పల్లెల్లో అనేక మంది ప్రజాప్రతినిధులను, మాజీ సర్పంచ్లను నక్సలైట్లు చంపేశారు. పలువురు సర్పంచులపై భౌతికదాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటేనే వణుకుపుట్టేది. ఆ సర్పంచ్ గిరీకి ఓ సలాం అంటూ.. పోటీకి దూరంగా ఉండేవారు సామాన్యులు. ఇదంతా.. గతం..’సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ పదవికి ఎంతో మంది నామినేషన్లు వేసి పోటీలో ఉన్నారు. చదువుకున్న విద్యావంతులు, సమీప బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు బంధాలను మరిచి బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటాపోటీగా నీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నెన్నో వ్యూహాలు అమలు చేశారు. మందు విందులు, నోట్ల పంపిణీ, చీరల పంపిణీ ఇలా అభ్యర్థులు చేయని ప్రలోభాలు లేవు. ఆఖరికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లోనూ వేలం పాటలు, భూమిని విరాళంగా ఇవ్వడం, ఊరందరికీ అక్కరకు వచ్చే పనులు చేసేందుకు నగదు ఇవ్వడం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్కోక్కరు రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఊరిలోనే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన పదవీ కాంక్ష ఏమేరకు ప్రభావం చూపిందో అర్థమవుతుంది.ఇవీ గ్రామాల్లో గతానుభవాలుశాసించే తుపాకుల మధ్య గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఆఖరికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలున్నాయి. గ్రామాల్లో చీకటి పడిందంటే చాలు పోలీసుల బూట్ల చప్పుడు, నక్సలైట్ల తుపాకుల మోతలతో తెల్లవారేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఊరికి దూరంగా పట్టణాల్లో నివాసం ఉండేవారు. కొందరైతే రాత్రి అయితే ఊరు విడిచి వెళ్లేవారు. అనేక సందర్భాల్లో నక్సలైట్లు ప్రజాప్రతినిధులను పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ.. టార్గెట్ చేసి భౌతికదాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రామాభివృద్ధికి వచ్చే జవహర్ రోజ్గార్ యోజన(జేఆర్వై) నిధులను మింగారంటూ, అనేక మంది సర్పంచులపై దాడులు జరిగాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది ‘సర్పంచ్ గిరీకి ఓ సలాం.. మాకు వద్దు ఆ పదవి’ అంటూ దూరంగా ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. అందుకు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే తాజా ఉదాహరణగా నిలుస్తాయి.గతం గాయాలు ఇవీ..ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, మాజీ సర్పంచ్లను మావోయిస్టు, జనశక్తి నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ హత్య చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సర్పంచ్ రాధాకిషన్రావును నక్సలైట్లు హత్య చేశారు. ఇదే మండలం సుద్దాల మాజీ సర్పంచ్ ఏనుగు ప్రభాకర్రావు అలియాస్ వేణుగోపాల్రావును మారుపాక శివారులో చంపేశారు.చందుర్తి మండలం రామారావుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పోతుగంటి భాస్కర్ను చంపేశారు.ఎల్లారెడిపేట మండలం కంచర్లకు చెందిన మాజీ సర్పంచ్ సూర వెంకటిని, ఇదే మండలం సింగారంకు చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య ను, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ ఎల్సాని మల్లయ్యను నక్సలైట్లు చంపేశారు.గంభీరావుపేట మండలం గజసింగారంకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డిని కాల్చి చంపారు.జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన మాజీ సర్పంచ్ బచ్చు నందంను హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీపతి రాజయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ తుల సుధాకర్రావును, ఇదే మండలం పెద్దరాతిపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డిని చంపేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక మంది నక్సలైట్ల తూటాలకు బలి అయ్యారు. నక్సలైట్లు చేసిన భౌతికదాడులకు లెక్కే లేదు. ఇలాంటి పరిస్థిల్లో రెండు దశాబ్దాల కిందట సర్పంచ్ పదవి ముళ్ల కిరీటంలా భావించి తమకు వద్దు అనేవారు. కానీ, నక్సలైట్ల కదలికలు క్షీణించడంతో పల్లెల్లో ఎన్నికల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు వచ్చాయి. -
ఐపీఎల్కు కరీంనగర్ కుర్రాడు
కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్మన్ అయిన పేరాల అమన్ రావు ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్–19, అండర్–23లో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు. వేలంలో పాల్గొనేందుకు అమన్రావుకు పాస్పోర్టు లేకపోవడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అప్పటికప్పుడు స్పందించి పాస్పోర్టు జారీ చేయించారని సునీల్రావు తెలిపారు. మొట్టమొదటిసారిగా జిల్లాకు చెందిన కుర్రాడు ఐపీఎల్కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. -
హైదరాబాద్లో ఆరు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా రోజుల్లో హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్– బొల్లారం చెక్పోస్టు, కౌకూరు రోడ్డు, రిసాల బజార్, లక్డావాలా – అల్వాల్ టీ జంక్షన్, లోతుకుంట లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు– కార్ఖానా తదితర మార్గాల్లో నిరీ్ణత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. -
కన్నతల్లే కర్కశురాలై..
మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు.. చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విని్పస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్చ్.. ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలే లేవు!
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏడు గ్రామాలకు ఎన్నికలే లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు. కారణం ఆ పల్లెల్లో గిరిజనులు లేకున్నా.. ఏజెన్సీ నిబంధనల ప్రకారం సర్పంచి స్థానాలను గిరిజనులకే కేటాయించాల్సి రావడం. ఇక చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు గోకారం రిజర్వాయర్ ముప్పు తగ్గించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు లేకుండా పోయాయి.ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. -
తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా
మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. -
‘లవ్’ లీవ్ కావాలి!
అది చలికాలం మధ్యాహ్నం.. ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయం.. అందరూ మధ్యాహ్న భోజనం తర్వాత పనిలోకి జారుకుంటున్న వేళ.. ఓ కుర్ర ఉద్యోగికి మాత్రం మనసు మనసులో లేదు. ఎందుకంటే.. డిసెంబర్ 17న అతని గర్ల్ఫ్రెండ్ స్వరాష్ట్రం ఉత్తరాఖండ్కు వెళ్తోంది. మళ్లీ వచ్చేది జనవరి మొదటి వారంలోనే.. ఈ సుదీర్ఘ వియోగానికి ముందు ఆమెతో ఒక రోజు మొత్తం గడపాలి.. కానీ ఎలా?.. ఎలా? మేనేజర్కి ఏం చెప్పాలబ్బా..! సమస్య అల్లా మేనేజర్ వీరెన్ ఖుల్లర్.. సెలవు అడిగితే రొటీన్ సాకు చెప్పాలా? ’మామయ్యకి సుస్తీ’, ’ట్రైన్లో టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు’.. లాంటి పాత ట్రిక్స్ వాడాలా? ఇవేవీ వద్దనుకున్నాడు మన లవర్బాయ్.. ఎందుకంటే, నిజాయితీనే అతిపెద్ద ఆయుధమని అతనికి తెలుసు. ఈమెయిల్ బాంబు.. మొత్తానికి అబ్బాయి.. ధైర్యం చేశాడు. కీబోర్డుపై వేళ్లు ఆనించి ఒక పారదర్శకమైన ఈమెయిల్ను టైప్ చేసేశాడు. అందులో ఎలాంటి అతిశయోక్తులు.. అలంకారాలు లేనేలేవు. సూటిగా చెప్పేశాడు.. ‘డిసెంబర్ 16న వ్యక్తిగత కారణాల వల్ల సెలవు కావాలి, ఎందుకంటే నా గర్ల్ఫ్రెండ్ తన సొంతూరు ఉత్తరాఖండ్కు డిసెంబర్ 17న వెళ్తోంది. జనవరి మొదటి వారం వరకు తిరిగి రాదు. అందుకే ఆమె వెళ్లే ముందు ఆ ఒక్కరోజు తనతో గడపాలని కోరుకుంటున్నాను..’ఇదీ సెలవు దరఖాస్తు సారాంశం. ఆ మెయిల్ ’సెండ్’ బటన్ నొక్కిన క్షణం.. ఆఫీసులో కాదు, కుర్రాడి గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వీడు మామూలోడు కాదు మేనేజర్ వీరెన్ ఖుల్లర్ మధ్యాహ్న భోజనం తర్వాత ఈమెయిల్స్ పరిశీలిస్తుండగా, ఆ అసాధారణమైన ’లవ్ రిక్వెస్ట్’ కంట పడింది. ఖుల్లర్ ముఖంలో చిరునవ్వు, ఆశ్చర్యం కలగలిసిన భావం. ‘ఓహో! పాత రోజుల్లో అయితే వీడు ఉదయం 9.15 గంటలకే ’ఫీవర్’ అని మెసేజ్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎంత ధైర్యం!‘ అనుకున్నారు. నిజానికి, గతంలో ఇలాంటి రిక్వెస్ట్లు రాత్రికి రాత్రి ’జబ్బు’గా మారి, మర్నాడు ఉదయం అపాయింట్మెంట్ అడిగేవి. కానీ కుర్రాడి నిజాయితీ, పారదర్శకత బాస్కి తెగ నచ్చేశాయి. ప్రేమకు జై.. ఈ పోస్ట్ తక్షణం వైరల్ అయింది. నెటిజన్లు కుర్రాడి ధైర్యాన్ని, ఖుల్లర్ ఔదార్యాన్ని చూసి మనసారా మెచ్చుకున్నారు. ‘అసలైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదే!’, ‘ఆ మేనేజర్కి సలామ్’, ‘సెలవు దొరకడమే కష్టం అనుకుంటే, ప్రేమ పేరుతో దొరకడం అంటే లక్’.. అంటూ ప్రశంసించారు. ఆఫీసు అంటే కేవలం కట్టుబాట్లు, కఠిన నియమాలు కాకుండా, నమ్మకం, మానవత్వం కూడా ఉంటాయని ఈ చిన్న సంఘటన నిరూపించింది. ప్రేమోద్యోగి కథ సుఖాంతమైంది. అతను తన ప్రేయసితో హ్యాపీగా గడిపేందుకు టిక్కెట్ సంపాదించాడు. బేబీ ప్రేమ విషయంలో, బాసు కూడా ఓడిపోక తప్పలేదు! పండగ చేస్కోరా బుడ్డోడా..అప్పుడే మేనేజర్ ఖుల్లర్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ క్షణికావేశంలో, తాను ఒక డైరెక్టర్ కాదు, కేవలం ఒక మనిషి మాత్రమే అని గుర్తు చేసుకున్నాడు. మనిషి జీవితంలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన గౌరవించాడు. సెలవు మంజూరు చేస్తూ.. ఆ మహా ప్రేమ లేఖ స్క్రీన్షాట్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. దానికి ఆయన జత చేసిన వ్యాఖ్యే ఈ కథకు ’పంచ్’ పాయింట్.. ‘ప్రేమకు ’నో’ చెప్పే ధైర్యం మనకు ఎక్కడిది? సెలవును ఆమోదించాను! నువ్వు హ్యాపీగా వెళ్లు తమ్ముడూ!’.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బెదిరింపులకు సర్పంచ్లు లొంగొద్దుఎవరి బెదిరింపులకు సర్పంచ్లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్లకే ఉంటుందన్నారు.ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్నాయక్ పాల్గొన్నారు. -
‘గీతం’ బకాయిలు రూ.118 కోట్లా?
‘నామమాత్రపు బకాయిలున్నా పేద వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తారు. తొలగించే ముందు వినియోగదారులకు ఎలాంటి నోటీసు కూడా పంపరు. అలాంటిది రూ.118 కోట్లు బకాయిలున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవుల్లో ఉన్న వారి కోసం ఓ చట్టం, పేదవారి కోసం మరో చట్టాన్ని విద్యుత్ అధికారులు రూపొందించారా?’ ‘దశాబ్దాలుగా బిల్లు చెల్లించకుండా విద్యుత్ సేవలు పొందుతుండటం దిగ్భ్రాంతికరం. 2008–09 నుంచి బకాయిలు పేరుకుపోయాయి. విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేయాలని డిస్కమ్ల నుంచి స్పష్టమైన ఉత్తర్వులున్నా.. అధికారులు మాత్రం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇది సంబంధిత అధికారుల నిష్క్రియాత్మకతకు నిదర్శనం’ – జస్టిస్ నగేశ్ భీమపాక సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు దశాబ్దాలుగా ఓ సంస్థ విద్యుత్ బిల్లు చెనిష్క్రిల్లించకుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రూ.118.13 కోట్ల బకాయిలున్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) యూనివర్సిటీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు ఓ నీతి.. ఆర్థికంగా ఉన్నవారికో నీతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్యంలో తన ఇంటికి రూ.800 బకాయి ఉంటే అధికారులు సరఫరాను ఎలా నిలిపివేశారో ఈ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక గుర్తు చేసుకున్నారు. అలాంటి విద్యుత్ అధికారులు గీతం వర్సిటీకి ఎందుకు వెసులుబాటు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పదవుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారా అని ప్రశ్నించారు. విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా, పదవుల్లో ఉన్న వారి కోసం అధికారులు చేపట్టే ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని హెచ్చరించారు. విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో వివరించడానికి తదుపరి విచారణ తేదీన టీజీఎస్పీడీసీఎల్లోని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేశారు. చర్య తీసుకోకపోవడం సరికాదు.. బకాయిలను చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామంటూ గత సెప్టెంబర్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. గీతం వర్సిటీకి వి ద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం అన్యాయమన్నారు. టీజీఎస్పీడీసీఎల్ స్టాండింగ్ కౌన్సెల్ శ్రీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలోనూ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశామన్నారు. దాన్ని సవాల్ చేస్తూ 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. తొలుత వర్సిటీ మ ధ్యంతర స్టే పొందినా.. తర్వాత పిటిషన్ను ఉపసంహరించుకుందని చెప్పారు. దీంతో విద్యుత్ బకాయిలు గణనీయంగా పేరుకుపోయాయని చెప్పారు. మొత్తం రూ.118,13,46,432 బకాయిలున్నాయని, తదనుగుణంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ గత సెప్టెంబర్ లో మళ్లీ నోటీసు జారీ చేశారని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పెద్దఎత్తున, దీర్ఘకాలిక బకాయిలున్నా గీతం వర్సిటీపై ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. -
ఇదేం ‘ఉపాధి’?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) (వీబీ–జీ రామ్–జీ) బిల్లు–2025 పై సామాజిక ఉద్యమకారులు, నిపుణులు, మండిపడుతున్నారు. ప్రస్తుత ఉపాధి హామీ పథకం డిమాండ్ ఆధారిత, సార్వత్రికమైనదని.. దీన్ని కాస్తా సరఫరా ఆధారితానికి మార్చాలనుకోవడం ప్రమాదకర మని విమర్శిస్తున్నారు. స్థానికంగా జరగాల్సిన ఉపా ధి ప్రణాళికల రూపకల్పనను కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చాలనుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టడం వల్ల ఎందరో కార్మికులు ఉపాధికి దూరమయ్యారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కొత్త బిల్లులో ఏకంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో–స్పేషియల్ టెక్నాలజీ వాడకా న్ని తప్పనిసరి చేయాలనుకోవడం కార్మికులపై మరింత నిఘా పెట్టడమేనని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధా నం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అనేక నివేదికలు స్పష్టం చేశాయని సామాజిక ఉద్యమకారులు గుర్తుచేస్తున్నారు. సాధారణ పథకంగా మార్చే కుట్ర మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం తేవాలనుకుంటున్న వీబీ–జీ రామ్–జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టబద్ధ హక్కుల ఆధారిత వ్యవస్థను బడ్జెట్ పరిమితులతో సాధారణ పథకంగా మార్చే కుట్ర జరుగుతోంది. చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను, కేంద్రానికి ఎలాంటి జవాబుదారీతనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చాలనుకోవడాన్ని ఖండిస్తున్నాం. ఈ బిల్లులోని సెక్షన్ 5 (1) ప్రకారం కేంద్రం ఒకవేళ ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి హక్కుగా లభించదు. – పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి, నరెగ సంఘర్షణ మోర్చా జాతీయ కమిటీ సభ్యుడు పేరులోనే గ్యారంటీ.. నిజమైన హామీ లేదు ఉపాధిని హక్కుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ విచక్షణపై ఆధారపడే దయగా మార్చాలనుకోవడం ప్రస్తుత ఉపాధి హామీ చట్టం స్వభావం, మౌలిక లక్ష్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వీబీ–జీ రామ్–జీ అనేది గ్యారంటీ లేని ఒక పథకంగా మారనుంది. పేరులో గ్యారంటీ ఉన్నప్పటికీ ప్రతిపాదిత చట్టంలో నిజమైన హామీ లేదు. ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా ఆదివాసీలు, దళితులు, మహిళలపై పడుతుంది. ఇది కేవలం పరిపాలనా సమస్య కాదు.. ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం. తొలిసారిగా ఒక చట్టంలో సాంకేతికతలను తప్పనిసరిగా భాగం చేసిన పథకం ఇదే. ఈ స్కీమ్ ఎక్కడ అమలవ్వాలి, ఎన్ని నిధులివ్వాలి, ఏయే పనులు చేపట్టాలి వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఖర్చును మాత్రం రాష్ట్రాలపై మోపాలనుకుంటోంది. – చక్రధర్ బుద్ధ, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా ప్రస్తుత ఉపాధి హామీ చట్టం, ప్రతిపాదిత వీబీ–జీ రామ్–జీ చట్టంలో ప్రధాన తేడాలు..ఉపాధి హామీ చట్టం... » ఏడాదిలో 100 రోజులపాటు గ్రామీణులకు ఉపాధి హక్కుగా లభ్యం. » డిమాండ్ బట్టి నిధులు అనే విధానంతో పథకం అమలు. » ఏడాది పొడవునా ఉపాధి పనులకు కేంద్రం గ్యారంటీ. » ప్రజలు డిమాండ్ చేసిన 15 రోజుల్లోగా పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి పొందే హక్కు. » కూలీల వేతనాలు 100% కేంద్రమే భరిస్తుంది. అలాగే 75% మెటీరియల్ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. » 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల ప్రణాళిక రూపకల్పనపై గ్రామ సభలకే నిర్ణయాధికారం.ప్రతిపాదిత వీబీ–జీ రామ్–జీ చట్టం... » ప్రణాళికలు, సిస్టమ్లకు సరిపోతేనే ఉపాధి. » వ్యవసాయ పీక్ సీజన్లో 60 రోజులపాటు ఉపాధి పనుల నిలిపివేత. » కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలవారీగా నిధుల కేటాయింపు. » కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చయితే ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వాలదే. » కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉపాధి నిధుల చెల్లింపు నిష్పత్తి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు 90:10గా, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ఖరారు. » వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా రాష్ట్రాలకు, పంచాయతీలకు మార్గనిర్దేశం. » నిధుల పరిమితిలోనే 125 రోజులు ఉపాధి హామీ. -
రామగుండం సరే... మిగతా రెండు కష్టమే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూడు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై విద్యుత్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇందులో రామగుండం థర్మల్ నిర్మాణం సానుకూలంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. మక్తల్, పాల్వంచలో థర్మల్ యూనిట్ల ఏర్పాటుపై కొన్ని ఇబ్బందులను గుర్తించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలో ఇందుకు సంబంధించిన నివేదిక ఇస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం, మక్తల్, పాల్వంచలో థర్మల్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రామగుండం ప్లాంట్కు సంబంధించి ఇప్పటికే సమగ్ర నివేదికను రూపొందించగా, మక్తల్, పాల్వంచ ప్లాంట్ల సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీని నియమించారు. ఇందుకు సంబంధించి కన్సల్టెన్సీ నివేదిక వచ్చింది. దీనిపై అధికారులు సమీక్ష జరిపారు.మక్తల్కు బొగ్గు కష్టంమక్తల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ సాధ్యమయ్యేట్టు కన్పించడం లేదు. ఇక్కడకు బొగ్గు చేరవేయడం కష్టమని కన్సల్టెన్సీ పేర్కొంది. ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, రోడ్డు మార్గంలో బొగ్గు చేరవేసేందుకూ అనుకూల పరిస్థితులు లేవని తెలిపింది. భూసేకరణ కూడా కష్టమని, ఎక్కువ వ్యయంతో కూడుకున్నదని స్పష్టంచేసింది. ఇక్కడ ధర్మల్ యూనిట్కు మెగావాట్కు రూ.9–11 కోట్లు అవుతుందని అంచనా వేసింది. దీనివల్ల యూనిట్ విద్యుత్ రూ.10 పైనే ఉంటుందని చెప్పింది. నిర్మాణ వ్యయానికి చేసే అప్పు, దానిపై వడ్డీ తడిసి మోపెడవుతుందని పేర్కొంది. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అంత సానుకూలమైన పరిస్థితులు మక్తల్లో లేవని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల, వ్యవసాయ భూమి ఉండటం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది.పాల్వంచ ప్లాంట్ వ్యయం ఎక్కువ...పాల్వంచలో 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ప్లాంట్కు భూమి అందుబాటులోనే ఉంది. అయితే, ఇప్పుడున్న ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను కొన్ని దశాబ్దాలుగా నిల్వ ఉంచారు. ప్లాంట్ కన్నా బూడిద ఆక్రమించిన స్థలమే ఎక్కువగా ఉంది. దీన్ని వేరే చోట డంప్ చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా భూమి కొనుగోలు చేయడం తప్ప మరో మార్గం లేదు. పాల్వంచలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు అందుతున్న సింగరేణి బొగ్గు సగటు ఉష్ణశక్తి (జీసీవీ) 3600 మాత్రమే ఉంటుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించ తలపెట్టిన థర్మల్ యూనిట్కు 4 వేలపైనే జీసీవీ బొగ్గు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ బొగ్గు దిగుమతి చేసుకుంటే తప్ప ప్లాంట్ను నడపలేమని చెబుతున్నారు. దీనికోసం చేసే వ్యయం మెగావాట్కు రూ.10 కోట్లు దాటుతుందని చెబుతున్నారు. దీనివల్ల మార్కెట్లో లభించే విద్యుత్ కన్నా రెండు రెట్లు ధర ఎక్కువగా ఉంటుందని, పీక్ అవర్స్లో తప్ప ఈ విద్యుత్ను వాడటం సాధ్యం కాదని విద్యుత్ ఉన్నతాధికారులు అంటున్నారు.సరికొత్త వివాదంభవిష్యత్ విద్యుత్ డిమాండ్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, రాబోయే కాలంలో మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుందని కేంద్ర విద్యుత్ సంస్థ చెబుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న ప్లాంట్లపై సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో నిర్మాణంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది సందేహాస్పదంగా ఉంది. అత్యధిక వ్యయంతో చేపడితే విద్యుత్ కొనుగోలుకు డిస్కమ్లు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. తరచూ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే నిర్మాణ వ్యయంపై తెచ్చిన అప్పుపై వడ్డీ పెరుగుతుంది. ఇవన్నీ సరికొత్త వివాదానికి తెరతీస్తాయని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
ఏజెన్సీలో బలగాలకు చిక్కిన మావోయిస్టులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన డీవీసీఎం(డివిజన్ కమిటీ) ఇన్చార్జ్తో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసు బలగాలకు చిక్కినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం సిర్పూర్ యూ మండలం బాబ్జిపేట, కకర్బుడ్డి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన డీవీసీఎం ఎర్రగొల్ల రవితో మరో ఇద్దరు డీవీసీఎం కేడర్తోపాటు 16 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిని ఏకే 47, ఇన్సాస్ రైఫిల్ వంటి ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొదటగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిసింది. నిఘా వర్గాల సమాచారంతో కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, సిర్పూర్ యూ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోల కదలికలు గుర్తించి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో తీవ్ర నిర్బంధ పరిస్థితులు ఏర్పడడంతో సేఫ్ జోన్గా భావించి వీరంతా ఏజెన్సీకి వచ్చారా, లేక పోలీసులకు లొంగుబాటులో ఇది ఓ భాగమా? ఇంకా ఏదైనా కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న వారికి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపంత్ను ఈ విషయంపై ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, ఎలాంటి సమాచారమున్నా, పై అధికారులే వెల్లడించే అవకాశముందన్నారు. -
తుదివిడత పంచాయతీ నేడే..
సాక్షి, హైదరాబాద్: తుదివిడత పల్లె పోరుకు సర్వం సిద్ధ మైంది. బుధవారం జరగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. మంగళవారం పోలింగ్కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. సాయంత్రంకల్లా పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
పల్లెల్లో దాడులపర్వం
పంచాయతీ ఎన్నికల వేళ... పచ్చని పల్లెలు భగ్గుమంటున్నాయి. ఓటు వేయలేదనే నెపంతో కొందరు... తమకు సహకరించలేదనే కారణంతో మరికొందరు దాడులకు పాల్పడుతున్నారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడినర్సంపేట/దోమ/శంకరపట్నం: వరంగల్ జిల్లా చెన్నారా వుపేట మండలం చెరువుకొమ్ముతండాకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధ రాత్రి తండాలోని దుర్గమ్మ గుడి వద్ద కాంగ్రెస్ బలపరిచిన ఎనిమిదో వార్డు అభ్యర్థి కొర్ర మోహన్, కార్యకర్తలు సుమన్, రమేశ్, బోడ రాందాస్, పవన్, అజయ్, బాలు, రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు చలిమంట కాగు తున్నారు. ఈ సమయంలో బోడతండాకు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు బోడరెడ్డి, వెంకన్న, శ్రీను, ప్రసాద్, శ్రీనివా స్ అదే దారి గుండా వెళుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. అంతేకాక తీవ్ర పదజాలంతో దూషిస్తూ చలిమంట కాగుతున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తండావాసులు గమనించి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడిమూడోవిడత ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా రాకొండ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అర్జున్ బరిలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం దాటిన తర్వాత ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అర్జున్కు గాయాలవ్వగా, స్థానికులు వెంటనే అతడిని పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ స్నేహమెహ్ర ఆరా తీశారు. బాధితుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఓటెయ్యలేదని బాలింతపై...కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్కు చెందిన ఖమురున్నిసా పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. దీంతో కలత చెందిన ఆమె కుటుంబసభ్యులు యాస్మిన్, హకీంలు.. దాసరి పద్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. పద్మ కూతురు ప్రియాంక బాలింత అయినా, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు.అక్కడ సర్పంచ్ ఎన్నిక నామమాత్రమే..దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్తండా(తూర్పు) సర్పంచ్ పదవికి లకావత్ భాగ్యనాయక్ పోటీ చేయగా, ప్రత్యర్థులు ఏకగ్రీవానికి అంగీకరించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి లకావత్ శ్రీను తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. మరుసటి రోజు తాను పోటీలో నుంచి తప్పుకుంటానని ప్రకటించి ప్రచారం చేయలేదు. దీంతో అక్కడ సర్పంచ్ ఎన్నికకు పోటీ లేదని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో 8 వార్డులుండగా, 3 ఏకగ్రీవమయ్యాయి.సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నంరఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండా సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుగులోత్ చింతామణి భర్త రంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరగ్గా..పంచాయతీ పరిధిలోని సుకినీతండా పోలింగ్బూత్లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ మూడు రోజుల క్రితం రాంబాబు సెల్టవర్ ఎక్కగా స్థానికులు, అధికారుల చొరవతో దిగొచ్చాడు. అయితే రంగా మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సందర్భంగా చింతామణి మాట్లాడాడుతూ పలువురు దొంగ ఓట్లు వేశారని, చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్లు కూడా పోల్ అయ్యాయని ఆరోపించారు.సార్లరావులపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయండిహైకోర్టును ఆశ్రయించిన పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సార్లరావులపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్ పదవికి ఇస్లావత్ శ్రీకాంత్, జర్పుల ప్రవీణ్, ఇస్లావత్ శ్రీను, నేనావత్ గణేశ్, బానావత్ బాలు నామినేషన్లు వేయగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇస్లావత్ శ్రీను ఒక్కరే బరిలో ఉండగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన పలువురు తమను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు విత్డ్రా చేయించారని ఆరోపిస్తూ ప్రవీణ్, గణేశ్, శ్రీకాంత్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.ఇంట్లో కూర్చున్నా 208 ఓట్లు తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ సర్పంచ్ స్థానానికి పటేల్ సుదర్శన్రెడ్డి, పటేల్ విజయ్కుమార్రెడ్డి నామినేషణ్లు దాఖలు చేశారు. విజయ్కుమార్రెడ్డిని విత్డ్రా చేయించి, సుదర్శన్రెడ్డిని ఏకగ్రీవం చేయాలని గ్రాబపెద్దలు నిర్ణయించారు. అప్పటికే వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అయితే విజయ్కుమార్రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. దీంతో తాండూరులో ఉండే విజయ్కుమార్రెడ్డిని గ్రామస్తులు ఊర్లోకి రానీయలేదు. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా తాండూరులోనే ఉండిపోయారు. 11వ తేదీన తొలివిడత పంచాయతీ ఎన్నిక లు జరగ్గా, విజయ్కుమార్రెడ్డికి 208, సుదర్శన్రెడ్డికి 469 ఓట్లు వచ్చాయి.పైసలిస్తారా.. ప్రమాణం చేస్తారా..! చింతలమానెపల్లి(సిర్పూర్): రెండోవిడత జరిగిన ఎన్నికల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వగాడి శంకర్కు 338 ఓట్లు రాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి 361 వచ్చాయి. శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మంగళవారం గ్రామంలోని ఓటర్లను డిమాండ్ చేశారు. పళ్లెంలో పసుపు కలిపిన బియ్యాన్ని వేసి తనకే ఓటేసినట్టు పసుపు బియ్యం పట్టాలంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఎన్నికల్లో రూ.8 లక్షలు పంచినా గెలువలేదని, తనను ఓటర్లు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ 69 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలుతలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారి ఈ పంచాయతీకి 1956లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుంచి ప్రతిసారీ గ్రామస్తులు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈసారి సర్పంచ్ బరిలో ఇద్దరు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. పంచాయతీ పరిధిలో 10 వార్డులుండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గ్రామస్తులు బుధవారం పంచాయతీ ఓట్లను వినియోగించుకోనున్నారు. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.బెదిరింపులకు సర్పంచ్లు లొంగొద్దుఎవరి బెదిరింపులకు సర్పంచ్లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్లకే ఉంటుందన్నారు. ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్నాయక్ పాల్గొన్నారు. -
వాళ్లు మెంటలోళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తీ వ్రంగా మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో సమావేశం అనంతరం కిషన్రెడ్డి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్లో ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశం, అక్కడ చర్చించిన అంశాలు బయటకు రావడం చర్చకు వచ్చింది. దీనిపై కిషన్రెడ్డి స్పందిస్తూ.. ‘అక్కడ జరిగింది వేరు.. మీడియాలో వచ్చింది వేరు. పార్టీని, సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. అక్కడ చర్చించిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా ఆదేశించారు. అయినా.. ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది వేరైతే మీకు చెప్పింది వేరు. వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండటం దురదృష్టకరం: మోదీపై ఏఐసీసీ అగ్రనేత రా హుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్రెడ్డి మండిపడ్డారు. ఢి ల్లీలోని రామ్లీలా మైదాన్లో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్చో ర్–గద్దీ ఛోడ్ మహాధర్నాలో ప్రధానిపై రాహుల్ తీవ్ర వ్యా ఖ్యలు చేయడం సరికాదు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రా హుల్ వ్యాఖ్యలున్నాయి. రాహుల్ లాంటి ప్రతిపక్ష నేత మన కు ఉండటం దురదృష్టకరం’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించా...‘తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సోమవారం చర్చించాను. 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించాం. రూ. 400కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగి రిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశపైనా మాట్లాడాం. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరాను’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
శంషాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్ లోని రాయికుంట గ్రామంలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. 11.12.2025న జరిగిన ఈఎస్ఐసీ 197వ సమావేశంలో రూ.16,125 కోట్ల విలువ చేసే భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 1.32 లక్షలకు పైగా ఉన్న ఈఎస్ఐ ఇన్స్రూెన్స్ కలిగిన కార్మికులున్నారని తెలిపారు. శంషాబాద్ పరిధిలో పారిశ్రామికీకరణ వాణిజ్య సముదాయాలు వేగవంతంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వేల సంఖ్యలో కార్మికుల సంఖ్య పెరుగుతుందని, వారితో పాటు కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. శంషాబాద్ ఆస్పత్రి నిర్మాణం మొత్తం కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టంచేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు స్పీకర్ నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలంటూ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులతోపాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. లేదంటే తుది విడతగా మరోసారి న్యాయవాదులతో చర్చించాక నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియచేసే అవకాశం ఉందని అంటున్నారు. -
విద్యకు ఇవ్వండి మినహాయింపు.. నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీసీ)ను ఏర్పాటు చేయనున్నామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. నిర్మలా సీతారామన్తో పార్లమెంట్ ఆవరణలోని ఆమె చాంబర్లో రేవంత్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యతను రేవంత్ వివరించారు. ‘5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,560 మంది విద్యార్థులు ఉంటారు. మొత్తం 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యాహబ్లుగా ఉండటంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అత్యాధునిక వసతులు, లే»ొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుంది. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచి్చంచనున్నాం’అని రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, విద్యారంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపుతున్న చొరవను నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి.. ఎస్పీసీకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు. ఐఐఎం మంజూరు చేయండి తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థను మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్Šడ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్తో పార్లమెంట్ ఆవరణలోని ఆయన చాంబర్లో రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ లోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ‘ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించాం. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంది. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేస్తే.. అవసరమైన వసతుల కల్పనకు మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీతోపాటు అనుకూల వాతావరణం ఉంది’అని ధర్మేంద్ర ప్రధాన్కు వివరించారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని రేవంత్ కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు; హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, ఇతర వసతులు కలి్పంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. సోనియాతో భేటీ ఏఐసీసీ అగ్రనేత సోనియాగాం«దీతోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను సోనియాకు అందజేశారు. ప్రజాపాలనలో రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృధ్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సోనియా ఆకాంక్షించారు. -
ఆమె ఆత్మవిశ్వాసం ఎవరెస్ట్
‘నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను’ అనే మాట తిరుపతమ్మ నోటి నుంచి వినిపించినప్పుడు ఎంతమంది సీరియస్గా తీసుకొని ఉంటారో తెలియదు. ఆమె మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ‘నువ్వు పోటీ చేయడం ఏమిటి!’లాంటి వెక్కిరింపులకు తన విజయంతో దీటైన సమాధానం ఇచ్చారు తిరుపతమ్మ. ఆమె ఎత్తు మూడు అడుగులు. ఆమె ఆత్మవిశ్వాసం... ఎవరెస్ట్ అంత!తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామ చరిత్రలో తొలిసారి విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, సర్పంచ్గా ఘనవిజయం సాధించారు. ఆమెతో పాటు ఆమె ప్యానెల్లోని పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం మహిళలకు, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.రెక్కల కష్టం నమ్ముకొని...తిరుపతమ్మ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం తిరుపతమ్మ, సోదరుడు సుదర్శన్ భుజాలపై పడింది. ఇద్దరు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత తిరుపతమ్మ ఉపాధి హామీ పథకంలో వాచర్గా ఉద్యోగం సంపాదించారు. వాచర్గా పనిచేస్తూ ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు. గ్రామస్తుల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల తలలో నాలుక అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు# ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడిన రోజులు ఉన్నా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.నా విజయ రహస్యం... ఆత్మవిశ్వాసంఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే నా బలం. ఎన్నికలు నాకు కొత్త కావచ్చు. కాని గ్రామ ప్రజలు కొత్తవారు కాదు. వారు నా కుటుంబ సభ్యులు. ‘మంచి చేస్తే మంచే జరుగు తుంది’ అని బలంగా నమ్ముతాను. తమ్ముడు సుదర్శన్ చేసిన సేవలు, ప్రజలకు నాపై ఉన్న నమ్మకం సర్పంచ్గా నా గెలుపుకు కారణం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. – ఇల్లందుల తిరుపతమ్మ– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ -
నిజామాబాద్: ఇందల్వాయిలో కాల్పుల కలకలం
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాతకక్షల కారణమా.. లేక వేరే ఏ కారణాలో కానీ లారీడ్రైవర్ సల్మాన్పై కొంతమంది దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సల్మాన్ మృతిచెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, కాల్పుల కలకలం అనేది తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో కూడా చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్
ఢిల్లీ: సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది. ఇండ్ భారత్ కేసులో స్టేను సుప్రీంకోర్టు తాజాగా ఎత్తివేసింది. దాంతో సీబీఐ దర్యాప్తునకు అడ్డంగి తొలగింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసులు అవసరం లేదని సీజేఐ ధర్మాసనం తేల్చిచెప్పింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్న క్వాష్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. రఘురామ కృష్ణం రాజు, వాకాటి నారాయణ రెడ్డి కంపెనీల కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఎత్తివేసింది. ఖాతాల ఫ్రాడ్ తదితర అంశాలపై ఇతర న్యాయస్థానాల్లో సవాల్ చేసే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఫలితంగా ఫోర్జరీ పత్రాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఇక సీబీఐ దర్యాప్తు వేగవంతం కానుంది. బ్యాంకుల కన్సర్షియం నుంచి వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకొని నిధులు దారి మళ్లించిన రఘురామ కృష్ణంరాజు కంపెనీ.. గతంలో తీసుకున్న రుణాలను ఎఫ్డీలు చేసి.. వాటిపై మళ్లీ రుణాలు తీసుకుంది. -
మీ సేవా వాట్సాప్ సేవకు భారీ స్పందన:
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ డిజిటల్ సేవల వేదిక మీ సేవా (MeeSeva) కింద ప్రారంభించిన వాట్సాప్/చాట్బాట్ సేవను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు 22 రోజుల్లోనే 2.7 లక్షల సార్లు ఉపయోగించారని రాష్ట్ర ఐటీ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు.నవంబర్ 18న మీ సేవా కింద అదనపు డిజిటల్ ఛానల్గా ఈ సేవను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రజలు ఇకపై మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండానే ప్రభుత్వ సేవలు పొందగలుగుతున్నారు. ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయవచ్చు. బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తుల స్థితిని పరిశీలించవచ్చు. ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు.ఈ సేవ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని మంత్రి తెలిపారు. ప్రజల కేంద్రిత డిజిటల్ పరిపాలనను మరింత విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం వెల్లడించిన గణాంకాల ప్రకారం, నవంబర్ 18 నుంచి డిసెంబర్ 9 వరకు మీ సేవా వాట్సాప్ సేవను ప్రజలు మొత్తం 2,78,267 సార్లు వినియోగించారు. ఈ కాలంలో 2,09,084 వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి ప్రజలు ఈ సేవను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.అదే సమయంలో 75,655 దరఖాస్తు ఫారాలు సమర్పించబడ్డాయి. వీటిలో 1,403 మాత్రమే నిజమైన దరఖాస్తులు కాగా, మిగిలినవి సేవల గురించి తెలుసుకునేందుకు లేదా విధానాన్ని అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలుగా అధికారులు పేర్కొన్నారు. అలాగే 45,829 సార్లు దరఖాస్తుల స్థితి పరిశీలించబడింది. మొత్తం విజయ శాతం 81.3 శాతంగా నమోదైంది.ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న సేవల్లో జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పోలీస్ చలాన్లు, విద్యుత్ బిల్లుల సేవలు ఉన్నాయి. రోజువారీ పరిపాలనా అవసరాలకు వాట్సాప్ ఒక సులభమైన, నమ్మదగిన వేదికగా మారుతోందని మంత్రి తెలిపారు.భవిష్యత్తులోనూ మీ సేవా ద్వారా మరిన్ని డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలకు సులభంగా, నిరంతరాయంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు కీలకనేత
ఆసిఫాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బడే చొక్కారావు ఆసిఫాబాద్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సిర్పూర్లో మరో 15మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో 9మంది మహిళలు కాగా ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయుస్టులపై కేంద్రం కన్నెర్రజేసింది. 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించడంతో సాయుదబలగాలు వారిపై విరుచుకపడుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా ఆపార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడంతో ఆపార్టీకి దెబ్బమీద దెబ్బ తాకినట్లయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పొర్లు దండాలు పెడుతున్నా.. రోడ్లేయండి
కరీంనగర్ కార్పొరేషన్: ‘పొర్లు దండాలు పెడుతున్నా.. రోడ్లు వేయండి. డ్రైనేజీలు కట్టండి. వెనుకబడిన కిసాన్నగర్ను అభివృద్ధి చేయండి’అంటూ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్ వినూత్న తరహాలో నిరసన తెలిపాడు. సోమవారం కరీంనగర్ 3వ డివిజన్ కిసాన్నగర్లోని బీడీ కంపెనీ నుంచి మీ సేవ వరకు బురద రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ సమస్యలు పరిష్కరించాలన్నాడు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కిసాన్నగర్ అభివృద్ధి విషయంలో గత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించాడు. జిల్లా అధికారులకు, నగరపాలక సంస్థ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేకసార్లు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వినతిపత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నా డు. పాతికేళ్ల నుంచి ఇక్కడ రోడ్డు వేయలేదని, డ్రైనేజీ నిర్మించలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. బీజేపీ నాయకులు మెంగని రాజయ్య, బండిపల్లి సంజీవ్, గాలి సురేశ్, కల్యాణ్, సుమన్, చాడ ఆనంద్, మేకల సాయి పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గూండాల దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు.. భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు. -
కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడమే వరంగా మారింది..!
నల్గొండ జిల్లా: నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అయితగోని మధు గౌడ్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి, 439 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతూ యువ నాయకుడిగా తన సత్తాను చాటుకున్నారు.కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గ్రామాభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మధు గౌడ్కు ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించారు. దీంతో ప్రజల కోరిక మేరకు రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో మధు గౌడ్కు మద్దతుగా నిలిచారు. పారదర్శక పాలన, గ్రామ అభివృద్ధి, తన ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లిన ఆయనకు ప్రజలు ఘన విజయాన్ని అందించారు.ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి గ్రామ ఉపసర్పంచిగా కందుకూరి నవీన్ ఎన్నికయ్యారు. నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ల విజయంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. యువ నాయకుడి విజయం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. -
ఐడీపీఎల్ భూములపై విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు మంగళవారం ఆదేశించింది. గత కొన్నిరోజులుగా కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య ఈ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మాధవరం, ఆయన తనయుడిపై కవిత ఆరోపణలు చేయగా.. కవిత భర్త అనిల్పై మాధవరం కబ్జా ఆరోపణలు చేశారు. సుమారు 4 వేల కోట్ల రూపాయల విలువైన భూములపై ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో.. సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. -
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి... -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో 13 విమానాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మొత్తం 13 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన మొత్తం ఏడు విమానాలు రద్దయ్యాయి. ఇందులో ఐదు ఇండిగో, రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన ఆరు విమానాలు కూడా రద్దయ్యాయి. వీటిలో ఐదు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి.విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎయిర్లైన్స్ సిబ్బందిని ప్రయాణికులు కోరుతున్నారు. -
తెలంగాణ రైజింగ్ విజన్ ఆచరణ సాధ్యమేనా?
‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్ నేల విడిచి సాము చేస్తోందా? లక్ష్యాలు ఘనంగానే పెట్టుకున్నా.. ఆచరణలో సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పది వ్యూహాలు... మూడు మూల స్థంభాలున్న ఈ విజన్ డాక్యుమెంట్లో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు కీలకం. భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు అదనంగా మరికొంత చేర్చి సుమారు 30 వేల ఎకరాలు సిద్ధం చేశారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ రహదారుల మధ్య ప్రాంతంలోని ఊళ్లలో ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన్యత ఇవ్వడం కోసం ఫ్యూచర్ సిటీలోనే పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు, స్కిల్ యూనివర్శిటీ, ఏఐ యూనివర్శిటీలు ఈ సిటీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం సొంత రియల్ఎస్టేట్ ప్రయోజనాల కోసం రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీని రంగంలోకి తీసుకు వచ్చిందని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించినభూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని వివిధ పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ ఒక్క ప్రాజెక్టుతోనే హైదరాబాద్ న్యూయార్క్ లేదా డల్లాస్ వంటి అంతర్జాతీయ నగరాల స్థాయికి చేరుకుంటుందని భ్రమపెట్టడం అంత మంచిది కాదు. అయితే హైదరాబాద్ పరిసరాల్లోని మరో 27 మున్సిపాల్టీలను, గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులలో మూసీ పునరుద్ధరణ కూడా ఒకటి. గ్లోబల్ సమ్మిట్ ప్రచార ప్రకటనలో ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించారు.అందులో నగరంలోని వివిధ నిర్మాణాలు అద్బుతంగా కనిపిస్తాయి. మూసీ ప్రాజెక్టు ఊహాచిత్రం కూడా ఉంటుంది. కాని వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవన్ని క్లియర్ అయితే పరిశుభ్రమైన వాతావరణం, నది పూర్తిగా క్షాళన జరిగితే హైదరాబాద్ కు నిజంగానే ఒక హారంగా ఇది ఉంటుంది. డ్రై పోర్టు, దాన్నుంచి కృష్ణపట్నం వరకు 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే, బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నైకి హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కావాలని ఈ విజన్ డాక్యుమెంట్ లక్షించింది. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఈ ప్రతిపాదనలలో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ముంబై నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ రైలు నడపడం కోసం ఒక కారిడార్ నిర్మిస్తున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ బుల్లెట్ రైళ్ల డిమాండ్ ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే వచ్చే రెండు, మూడేళ్లలోనే బుల్లెట్ రైళ్లు వచ్చేస్తాయన్నట్లు ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.దేశం అంతటా ఇవి ఏర్పాటు కావాలంటే లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. వచ్చే దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా బాగా మెరుగైతే, అప్పుడు వేగంగా ఈ బుల్లెట్ రైళ్లు సాకారం అవుతాయేమో తెలియదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో మాన్యుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ది చేయాలని ఈ విజన్ లో తెలిపారు. వీటికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తారు. రీజినల్ రింగ్ రైల్వే, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్ వంటివాటిని కూడా ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఇవన్ని చూస్తే హైదరాబాద్ కేంద్రంగానే ఈ విజన్ డాక్యుమెంట్ అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ మరింత విస్తరిస్తే ప్రభుత్వ పాలన ఎంత సమర్థంగా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అయితే మూడు జోన్ల రాష్ట్రంగా మార్చాలని యోచిస్తున్నారు.ఈ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ఎంత వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరో వైపు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది మరో లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం డాలర్ విలువ 90 రూపాయలు ఉంది. వచ్చే ఇరవై,పాతికేళ్లలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందో ఊహించలేం. ఈ రకంగా చూస్తే ఈ లక్ష్యం సాధన అంత తేలిక కాదు. కాకపోతే రాష్ట్రాలు ప్రచారం కోసం ఈ అంకెలను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం సులభతర విధానాలు, డిజిటల్ పాలన, నాలెడ్జ్ హబ్, పెట్టుబడిదారుల ప్రత్యేక నిధి, వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్దరణ, వచ్చే వందేళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కరువు లేకుండా చూడడం వంటి వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ది, సుస్థిర అభివీద్ది అనేవాటిని మూల స్తంభాలుగా చేసుకుని పనిచేస్తామని తెలిపారు.ఇవన్ని చదవడానికి బాగానే ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూస్తే ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా నిర్మించిన వాటిలో సుమారు నలభై ఎయిర్ పోర్టులకు డిమాండ్ లేదని వార్తలు సూచిస్తున్నాయి. అయినా హైదరాబాద్ చుట్టూరా కొత్తగా ఈ ఎయిర్ పోర్టులు ఎప్పటికి వస్తాయో, అవి ఎంతవరకు బాగా నడుస్తాయో తేలడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు, 2047 నాటికి ఎంత మొత్తం అవుతుంది? లేదా ఎంత రుణం తీర్చగలుగుతారు? ఆర్థిక వనరులు ఎలా మెరుగు అవుతాయి? మొదలైనవాటిపై అంచనాలు వేయకుండా ఎన్ని విజన్ డాక్యుమెంట్లు రాసుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ అంటూ భారీ హడావుడి చేశారు. అతిశయోక్తులతో అంకెల గారడి చేశారు.కాని వాటిలో ఒక్క లక్ష్యం అయినా నెరవేరిందని చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఆలోచనల మధ్య ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం కూడా పెద్దగా ఉండకపోవచ్చు.ఏది ఏమైనా పాలకులకు ప్రచారానికి, ఆశల పందిరి వేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రస్తుతానికి ఈ విజన్ డాక్యుమెంట్లు పనికి రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రభాకర్ రావు నాన్ కోపరేషన్.. సిట్కు కొత్త తలనొప్పి!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిని కస్టడీ విచారణ జరుపుతున్నారనే పేరుకు తప్పించి.. ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత నాలుగు రోజులుగా ఏమాత్రం సహకరించని ఆయన.. ఐదోరోజైనా నోరు మెదపకపోతారా? అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు కస్టడీ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి ఆయన్ని పశ్నిస్తోంది సిట్. అయితే ఆయన మౌనంగానే ఉంటున్నట్ల సమాచారం. మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వర్గాలు చెబుతున్నాయి . సిట్ జరిపిన నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో.. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. కానీ, ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో.. తలలు పట్టుకున్నారు. అటు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. ఆపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. వారంపాటు కస్టడీ విచారణ తర్వాత సుప్రీం కోర్టులో ప్రభాకర్రావు విచారణ వివరాలను.. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిని తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సి ఉందన్నది తెలిసిందే. -
గుర్రం తన్నడంతో 12 ఏళ్ల బాలుడి మృతి
వరంగల్: సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్ర్డన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు.గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్ర్డన్ పార్క్కు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. -
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
నిర్మల్ జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. ముత్యాల కుటుంబానికి మూడోసారి..లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్రెడ్డి సర్పంచ్గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. -
మామ వేసిన ఓటుతో.. విజయం సాధించిన కోడలు
నిర్మల్ జిల్లా: లోకేశ్వరం మండలం బాగాపూర్ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. సర్పంచ్గా ముత్యాల శ్రీవేద బరిలో నిలిచారు. దీంతో అమెరికాలో ఉంటున్న ఆమె మామ ఇటీవల వచ్చి ఓటేశాడు. ఈ పంచాయతీ పరిధిలో 426 ఓట్లుండగా ఇందులో 378 ఓట్లు పోలయ్యాయి. ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా, మరో అభ్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకపోవడంతో అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓటు రావడంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందగా, ఆమె మామ ఓటే ఆమెకు కీలకమైందని అంతా చర్చించుకున్నారు. -
GHMC: అనుమతుల సంగతేంటో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులపైన స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం నగర శివారు మున్సిపాలిటీల పరిధిలో అన్ని రకాల బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్మెంట్లు, లేఅవుట్లు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతులు హెచ్ఎండీఏ నుంచి లభిస్తున్నప్పటికీ నిర్మాణ సంస్థలు, రియల్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు సొంత ఇల్లు కట్టుకొనేందుకు ఎదురుచూస్తున్న లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే 27 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రాంతాలు, సరిహద్దులపైన స్పష్టత వచ్చే వరకు ఈ గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ ముందుకొచి్చంది. హైదరాబాద్ మహానగరం విస్తరణ, అభివృద్ధిలో ఇదో మైలురాయిగా భావిస్తున్నప్పటికీ వివిధ అంశాల్లో ఇంకా స్పష్టత లేకపోవడం వల్ల గందరగోళం కనిపిస్తోంది. బడా నిర్మాణ సంస్థలు సైతం ఒక అడుగు వెనక్కి వేసి వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు అంచనా. మధ్యతరగతి ప్రజలు మాత్రం ఎక్కడి నుంచి అనుమతులు తీసుకోవాలో తెలియక నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఔటర్రింగ్ రోడ్డు వరకు సుమారు 2000 చ.కి.మీ.వరకు జీహెచ్ఎంసీ విస్తరించనున్న దృష్ట్యా సరిహద్దులోని ప్రాంతాల విలీనంపైన మరింత స్పష్టత రావలసి ఉంది. ఇప్పుడు హెచ్ఎండీఏ నుంచే.... ప్రస్తుతం హైరైజ్ బిల్డింగ్లతో పాటు అన్ని రకాల భవనాలు, లే అవుట్లకు హెచ్ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. జీహెచ్ఎంసీ విలీన ప్రకటన అనంతరం శివారు మున్సిపాలిటీల వరకు హెచ్ఎండీఏ నుంచి అనుమతుల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో అన్ని వర్గాల్లోనూ గందరగోళం ఏర్పడింది. ఆ తరువాత హెచ్ఎండీఏ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించినప్పటికీ ప్రజల్లో ఈ గందరగోళం కొనసాగడం గమనార్హం. సాధారణంగా ఐదంతస్థుల వరకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత పై అంతస్తుల నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల వివిధ సంస్థల మధ్య ఈ అంతస్థుల ఎలా ఉండనుందోనేనే అంశంపైన స్పష్టత వెలువడాల్సి ఉంది. ‘ఇటు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయాలా లేక, అటు హెచ్ఎండీఏకు దరఖాస్తు చేయాలా తెలియడం లేదు. పైగా ఈ రెండు సంస్థల మధ్య ఫీజుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకే స్పష్టత వచ్చే వరకు ఎదురు చూడడమే మంచిదనిపిస్తుంది.’ అని మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ మినహాయించి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిలోని 11 జిల్లాల్లో సుమారు 10,050 చ.కి.మీ.పరిధిలో హెచ్ఎండీఏ వివిధ రకాల నిర్మాణ అనుమతులను అందజేస్తుంది.బదిలీ ఎలా చేస్తారో... ఇప్పుడు హెచ్ఎండీఏ. జీహెచ్ఎంసీ రెండు సంస్థల మధ్య అధికారాల బదిలీ కీలకంగా మారింది. నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు హెచ్ఎండీఏ నుంచే జీహెచ్ఎంసీకి అధికారాలను బదిలీ చేయవలసి ఉంది. అప్పట్లో 12 శివారు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలతో కలిసి జీహెచ్ఎంసీ ఆవిర్భవించిన సమయంలో కూడా హెచ్ఎండీఏ నుంచే నిర్మాణ రంగానికి సంబంధించిన అధికారాలు జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యాయి. ప్రస్తుతం అదే పద్ధతిలో బదిలీ చేయవలసి ఉంటుంది. కానీ హెచ్ఎండీఏ పరిధిలో ఉండే ప్రాంతాలు, నిర్మాణ అనుమతులు, జీహెచ్ఎంసీలో విలీనమయ్యే ప్రాంతాలు, నిర్మాణ అనుమతులు, రెండు సంస్థల మధ్య సరిహద్దు ప్రాంతాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నిర్వహించనున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కీలకం కానుంది. ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఎప్పుడు జరుగనుందనే అంశంపైన కూడా స్పష్టత లేదు. అప్పటి వరకు అనుమతు ప్రక్రియలో ఈ స్తబ్దత కొనసాగే అవకాశం ఉంది. -
అమ్మా.. ఐశ్వర్య ఎక్కడున్నావ్!
రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు హయత్నగర్లోని వినాయకనగర్ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్నగర్లో ఓ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్నగర్ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్బినగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి కోరిక.. కొడుకు కానుక
మేడిపల్లి: వారిది నిరుపేద కుటుంబం. గౌడవృత్తితోపాటు ఉన్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామానికి ఎప్పటికైనా సర్పంచ్ కావాలని ఆ ఇంటి యజమాని కల కనేవాడు. అలా ప్రతిసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు. ఆర్థికంగా లేకపోవడంతో ప్రతిసారీ ఓడిపోయాడు. తన భర్త చివరి కోరికను కొడుకుకు చెప్పగా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఈసారి ఎన్నికల్లో తల్లిని సర్పంచ్ చేశాడు. వివరాల్లోకి వెళితే... ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కమ్మరిపేట.. భీమారం మేజర్ గ్రామ పంచాయతీలో విలీన గ్రామంగా ఉండేది. గ్రామానికి చెందిన కోటగిరి గంగరాజం, గంగరాజు (గంగవ్వ) దంపతులు. గంగరాజంకు ఎప్పటికైనా సర్పంచ్ కావాలనే కోరిక ఉండేది. అలా చాలాసార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ కోరిక తీరకుండానే గంగరాజం 2009లో చనిపోయారు. ఆ తర్వాత కమ్మరిపేట ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం గంగవ్వ వయస్సు 82 ఏళ్లు. రెండో విడత ఎన్నికలు రాగానే తండ్రి కోరికను కొడుకు లింగగౌడ్కు చెప్పింది. దీంతో తండ్రి కోరికను తల్లితోనైనా తీర్చాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీలో నిలబెట్టారు. నలుగురు పోటీలో ఉండగా.. గంగవ్వ స్వతంత్ర అభ్యర్థిగా 332 ఓట్లు సాధించింది. 128 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలిచింది. విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆమెను కరీంనగర్లోని ఆయన కార్యాలయానికి సోమవారం పిలిపించుకున్నారు. ఘనంగా సన్మానించారు. తన భర్త కోరికను కొడుకు ద్వారా తీరిందంటూ ఆ తల్లి బండి సంజయ్ ఎదుట ఆనందబాష్పాలు రాలి్చంది. -
ఓటేసేందుకు పట్నం నుంచి వచ్చి..
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్దికి చెందిన కొమ్మెట రమేశ్(32) హైదరాబాద్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు బాగానే ఉన్న రమేశ్.. సోమవారం ఉదయం చనిపోతున్నాను సారీ అంటూ సోదరులు చంద్రమోహన్, కిట్టులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. ఆందోళనకు గురైన వారు రమేశ్కు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం గాలించగా, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో సరైన ఉపాధి లభించక కుటుంబపోషణకు అప్పులు చేశాడని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు చంద్రమోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిందం గణేశ్ తెలిపారు. -
నడిచొచ్చే ప్రజాస్వామ్యం
ములుగు: మూడో విడతలో భాగంగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు మండలాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలే. ఆయా మండలాల్లోని పెనుగోలు, బొల్లారం, మండపాక, కలిపాక, పెంకవాగు, సీతారాంపురం, ముత్తారం, సర్వాయి, మల్కపల్లి, భూపతిపురం ఆదివాసీ గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు అడవిబాటలో నడిచి రావాల్సిందే. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు గుట్టలు, కొండలు దాటుతూ బాధ్యతగా ఓటు వేసి అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు. వాజేడు పరిధిలో ⇒ కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలులో 29 మంది ఓటర్లు ఉంటారు. వీరు కొండలు, గుట్టలు దాటుకుంటూ అడవి మార్గాన ప్రయా ణిస్తూ 20 కిలోమీటర్ల దూరంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ⇒ మొరుమూరు పంచాయతీ పరిధిలోని బొల్లారం గిరిజన గూడెంలో 263 మంది ఓటర్లు ఉంటారు. వీరు 9 కిలోమీటర్ల దూరంలోని ప్రగళ్లపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ⇒ ఏడ్జెర్లపల్లి పంచాయతీ పరిధిలోని మండపాకకు చెందిన 133 మంది ఓటర్లు 8 కిలోమీటర్ల దూరంలోని ఏడ్జెర్లపల్లికి వచ్చి ఓటేయాలి. వెంకటాపురం(కె) పరిధిలో ⇒ భోదాపురం పంచాయతీ పరిధిలో కలిపాక, పెంకవాగు గిరిజన గ్రామాల్లో 110 మంది ఓటర్లు ఉంటారు. వీరు కాలినడకన 5 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్లో ఓటేయాలి. ⇒ అలుబాక పంచాయతీ పరిధిలోని సీతారాంపురం, ముత్తారం గిరిజన గ్రామాల్లో 100 మంది ఓటర్లు ఉంటారు. వీరు 6 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. గుట్టలు, కొండలు దిగుతూ అడవిలో 20 కిలోమీటర్లు నడుస్తూ ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న పెనుగోలు ఓటర్లు (ఫైల్) కన్నాయిగూడెం మండలంలో.. సర్వాయి గిరిజనగూడెంలో 198 మంది ఓటర్లు, మల్కపల్లిలో 99 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ట్రాక్టర్పై 12 కిలోమీటర్లు ప్రయాణించి చిట్యాల పో లింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ఇదే పంచాయతీ పరిధిలోని భూపతిపురంలో 295 మంది ఓటర్లు ఉంటారు. రవాణా సౌకర్యం ఉన్నా, బైక్లు, ఆటో ల్లో 8 కిలోమీటర్లు వచ్చి చిట్యాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వార్డు ఓట్లన్నీ గంపగుత్తగా... తొర్రూరు రూరల్: రెండో విడత ఎన్నికల్లో 100 శాతం ఓట్లతో ఓ వార్డు సభ్యుడు చరిత్ర సృష్టించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలోని 6వ వార్డు నుంచి బానోతు తేజానాయక్ పోటీ చేశాడు. ఈ వార్డులో 95 ఓట్లు ఉండగా, మొత్తం ఓట్లు తేజానాయక్కే పడ్డాయి. ప్రత్యర్థులెవరికి ఈ వార్డులో ఓట్లు లేవు. -
నేటి నుంచి యాదగిరి క్షేత్రంలో ధనుర్మాస వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలకు సిద్ధమైంది. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణీకులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర భాగం హాల్లో తిరుప్పావై వేడుకధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ఆలయంలో ప్రతిరోజూ వేకువజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు జరిపిస్తారు. శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాల్లో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం, మార్గళి నివేదన వంటి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 14వ తేదీ రాత్రి 7గంటలకు ఆలయ ముఖ మండపంలో గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం, 15న ఉదయం 11.30గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తారు.కైంకర్యాల్లో మార్పులు..ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కైంకర్యాల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. మంగళవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు వేకువజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహిస్తారు. అనంతరం తెల్లవారు జామున 4గంటల నుంచి 4.30 వరకు తిరువారాధన, 4.30గంటల నుంచి 5గంటల వరకు తిరుప్పావై సేవాకాలం జరిపిస్తారు. ఉదయం 5గంటల నుంచి 6గంటల వరకు నివేదన, చాత్మర, 6గంటల నుంచి 7గంటల వరకు నిజాభిషేకం, 7గంటల నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన వంటి పూజలు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 7.45 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. నిత్య కైంకర్యాలు యథావిధిగా ఉండనున్నాయి. -
ఇంటి నుంచే యూరియా బుకింగ్
సాక్షి, హైదరాబాద్: యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రైతుల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇకపై రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదని, అవసరమైన కోటాను ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ నెల 20 నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్ను ప్రయో గాత్మకంగా అమల్లోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్తోపాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసు కోవచ్చని, రైతు తన పంటలకు అవసరమైన యూరియా పరిమాణం, తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచైనా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుందన్నారు. అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి సేవలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీ నంబరు లభిస్తుందని, ఆ బుకింగ్ ఐడీ ఆధారంగా, రైతు తాను ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. బుకింగ్ సమయంలో రైతు కేవలం పంట పేరు మరియు ఆ పంట సాగు విస్తీర్ణం నమోదు చేస్తే సరిపోతుందని, నమోదు చేసిన వివరాల ఆధారంగా, రైతుకు అర్హమైన మొత్తం యూరియా పరిమాణాన్ని మరియు ఏఏ వ్యవధుల్లో బుక్ చేసుకోవచ్చో గణిస్తుందని, రైతుల సౌకర్యార్థం, ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంచామని మంత్రి వివరించారు. యాప్ ప్రత్యేకతలు ⇒ రైతులు/ సిటిజన్, డిపార్ట్మెంట్ మరియు డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు⇒ మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే అవకాశం⇒లాగిన్ కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తుంది⇒ లాగిన్ అయిన రైతులు తన జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది. ⇒తర్వాత ఏ సీజన్, రైతు పట్టాదార్ పాస్బుక్ నంబర్, ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారో, ఏఏ పంటను వేస్తున్నారో ఎంటర్ చేయాలి.⇒ రైతు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్లో కనిపిస్తాయి. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశల్లో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి.⇒ పాస్బుక్లు లేని రైతులు వారి పట్టా పాస్బుక్ దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత పై వివరాలను నింపాలి.⇒ కౌలు రైతులు కూడా వారి పేరు, తండ్రిపేరు మరియు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ కన్ఫార్మేషన్ తర్వాత భూ యజమాని పట్టా పాస్బుక్ నంబర్ ఎంటర్ చేస్తే, యజమాని మొబైల్ నంబరుతో ఓటీపీ వ్యాలిడేషన్ తర్వాత కౌలు రైతులు కూడా తమ వివరాలు ఎంటర్ చేసేలా ఈ యాప్లో అవకాశం కల్పించారు. ⇒ ఇక, డీలర్లు వారి మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి..రోజువారీగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకం వివరాలను నింపాలి. -
తుది దశ ప్రచారం సమాప్తం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం అయింది. మూడో విడతలో భాగంగా బుధవారం (17న) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయ్యాక ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించి గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటించనున్నారు. ఇది పూర్తికాగానే ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.ఈ విడతకు సంబంధించి ఎన్నికల అధికారులు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రీపోల్ అరేంజ్మెంట్లలో భాగంగా... సోమవారం ఉదయం డి్రస్టిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా షామియానాలు, తాగునీటి వసతి కల్పించనున్నారు.మంగళవారం సాయంత్రంకల్లా అన్ని పోలింగ్ బూత్లకు ఎన్నికల విధుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేరుకుంటారు. మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4,157 పంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 11 చోట్ల, 36,434 వార్డుల్లో 112 చోట్ల ఒక్క నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇక మిగిలిన 3,752 సర్పంచ్ పదవులకు 13,128 మంది, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
రహదారులు 1.15 లక్షల కి.మీ.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వం రహదారి విధాన పత్రాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న 49 వేల కి.మీ. ప్రధాన రహదారులను 1.15 లక్షల కి.మీ.కు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. మూడు దశల్లో (2030, 2035, 2047 సంవత్సరాల్లో) ఈ ప్రణాళికను అమలు చేయనుంది. వాహనదారులు సురక్షిత ప్రయాణంతోపాటు వ్యయం కూడా తగ్గేలా ఈ చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ రహదారుల విస్తరణలో భాగంగా రింగ్రోడ్లు, రేడియల్ రోడ్లు కీలక భూమిక పోషించనున్నాయి. రాబోయే రెండు దశాబ్దాల్లో 21 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి కేంద్రం సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది.జాతీయ రహదారుల మీదుగా ఉన్న జిల్లా కేంద్రాలు మినహా చాలా జిల్లా కేంద్రాల నుంచి ప్రస్తుతం కేవలం రెండులేన్ల రహదారులు మాత్రమే ఉన్నందున వాటిని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా మార్చాలని నిర్ణయించింది. అలాగే మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు విధిగా రెండు లేన్ల రహదారులు ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా ఒక మండలం నుంచి మరో మండలానికి వెళ్లే రహదారులు సైతం రెండు లేన్ల రహదారులుగా ఉండాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక ఆదాయాన్ని సముపార్జించి పెద్ద పారిశ్రామికవాడలు, ప్రధాన పర్యాటక కేంద్రాలు, నిమ్జ్, సెజ్లు, ఫార్మా కేంద్రాలు, స్మార్ట్ సిటీలు, ప్రధాన ఆదాయవనరులుండే కేంద్రాల నుంచి హైదరాబాద్కు, అలాగే పోర్ట్లు, విమానాశ్రయ కేంద్రాలకు కూడా కనీసం నాలుగు లేన్ల రహదారులు ఉండేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైస్పీడ్ కారిడార్లు.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) సహకారంతో పొరుగున ఉన్న రాష్ట్రాల రాజధానులకు మన రాష్ట్రం నుంచి వెళ్లేలా హైస్పీడ్(యాక్సెస్ కంట్రోల్) రోడ్ కారిడార్లను ప్రతిపాదించింది. ప్రధానంగా నాలుగు రహదారులను ఇందుకోసం సూచించింది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే రాబోయే సంవత్సరాల్లో సరుకు రవాణాకు, ప్రజల ప్రయాణానికి సులువుగా ఉంటుందని అంచనా. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి, ఇదివరకే గుర్తించి బ్లాక్స్పాట్లను లేకుండా చేయడానికి ఈ రహదారులు దోహదపడతాయని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. హైస్పీడ్ కారిడార్లలో హైదరాబాద్–నాగ్పూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్(ఫ్యూచర్ సిటీ)–అమరావతి, మచిలీపట్నం పోర్టు, హైదరాబాద్– చెన్నై రహదారులు ఉన్నట్లు పేర్కొన్నారు. రోడ్ పాలసీకి ఏడు పిల్లర్లు.. 1. క్రమానుగత రహదారి నెట్వర్క్ అభివృద్ధి: ఎక్స్ప్రెస్వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు.. ఇలా అన్ని రహదారులపై ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణానికి వీలుగా అభివృద్ధి పర్చడం. 2. సమర్థవంతమైన, సఫల నెట్వర్క్ అందించడం: రహదారుల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, డేటాతో అనుసంధానం చేసేలా ఆధునిక సాంకేతికను వినియోగించి రహదారులను సుదీర్ఘ కాలం వినియోగించుకోవడం. 3. లోపాలను సరిదిద్దడం: అవసరమైన చోట బ్రిడ్జిలను నిర్మించి రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటం. 4. వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా..: ప్రతికూల వాతావరణం, వరదలు, దీర్ఘకాలంలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకుని ఉండేలా సుస్థిర రహదారుల నిర్మాణం 5. సామాజిక సుస్థిరత, సమ్మిళిత ఆర్థిక ప్రగతి: సమతుల్య అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేలా రహదారి వ్యవస్థను మెరుగుపర్చడం. 6. వాహనదారులకు సౌకర్యంగా..: సురక్షిత రహదారుల నిర్మాణంలో ఇంజనీరింగ్లో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయడం. రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు అవగాహన కలి్పంచడం. 7. గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ: పర్యావరణహితమైన పదార్థాలను రహదారుల నిర్మాణంలో వినియోగించడం, యంత్రాల రహిత రవాణా సదుపాయాన్ని పెంచడం. రహదారుల విస్తరణ ఎప్పుడు.. ఎలా.. రహదారి ప్రస్తుత కిలోమీటర్లు 2035కి ఎన్నికిలోమీటర్లు 2047కు ఎన్నికిలోమీటర్లు జాతీయ రహదారులు 4983 5493 7482 రాష్ట్ర రహదారులు 1687 4887 8600 జిల్లా ప్రధాన రహదారులు 11,536 13,096 14,800 జిల్లాలో ఇతర రహదారులు 15,852 18,097 20,420 ఎక్స్ప్రెస్వేలు –––––– 489 1800 మొత్తం కిలోమీటర్లు 34,058 42,062 53,102 లేన్–కిలోమీటర్లలో.. 46,000 78,411 1,15,000 -
జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్లో కర్రా శివాని కొత్త రికార్డు
న్యూఢిల్లీ: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణ స్విమ్మర్లు కర్రా శివాని రెండు పతకాలు, నందిగం శివకుమారి ఒక పతకం సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోరీ్నలో శివాని అండర్–14బాలికల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రజతం, 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో స్వర్ణం సొంతం చేసుకుంది. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ రేసును శివాని 31.98 సెకన్లలో ముగించి రెండో స్థానంలో .... శివ కుమారి (33.56 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ రేసును శివాని 2ని:29.30 సెకన్లలో ముగించి జాతీయ స్కూల్గేమ్స్ కొత్త రికార్డును నెలకొలి్పంది. గత ఆరేళ్లుగా రిధిమ (కర్ణాటక; 2ని:29.75 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును ఆమె సవరించింది. ప్రస్తుతం శివాని గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. -
2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పారీ్టకి పెడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం ‘ఆస్క్ కవిత’హ్యాష్ ట్యాగ్పై ‘ఎక్స్’లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని, నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. -
నో మీటింగ్స్.. నో అపాయింట్మెంట్స్.. రెండోరోజూ ఢిల్లీలోనే సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’ మహాధర్నాలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం హైదారాబాద్లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ హాజరుకావాల్సి ఉంది. కానీ.. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఎంపీలు, ఇతరత్రా ఎవరితోనూ భేటీ కాలేదు. ఎలాంటి సమావేశాల్లోనూ పాల్గొనలేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వచ్చిన రేవంత్ పూర్తిగా వారితోనే రోజంతా గడిపారు. సాధారణ పరిస్థితులు నెలకొని విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలిస్తే.. మంగళవారం రేవంత్ హైదరాబాద్కు తిరుగుపయనం అవుతారని అధికార వర్గాలు చెప్పాయి. -
మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభ?
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. మరోవైపు నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాలమూరు ఎత్తిపోతలపై అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 19న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక ప్రకటన చేయనున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి ఈ నెల 11న ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, వి.శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ‘కొడంగల్ లిఫ్ట్’పై బీఆర్ఎస్ వ్యతిరేకత90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఈ నెలాఖరు లేదా జనవరిలో మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. కేసీఆర్ ఈ సభలకు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నదీ జలాల అనుసంధానం పేరిట ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమానికి కేసీఆర్ ఇప్పటికే రూపకల్పన చేసినట్లు సమాచారం.కాళేశ్వరం మరమ్మతుల కోసం ఒత్తిడికాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ను మరమ్మతు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రభుత్వానికి జల విధానం లేకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న జరిగే భేటీలో కేసీఆర్ ప్రకటించే ఉద్యమ కార్యాచరణపై బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత కేసీఆర్ పార్టీ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వస్తున్న కేసీఆర్.. పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా స్పందించే అవకాశం ఉంది. -
‘మినీ మండళ్లు’ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగి అసెంబ్లీ కొలువు దీరి రెండేళ్లు పూర్తయినా ‘మినీ శాసనమండళ్లు’గా వ్యవహరించే అసెంబ్లీ కమిటీలు మాత్రం ఇప్పటికీ ఏర్పాటుకు నోచుకోలేదు. శాసనసభ నిర్వహణలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రెండేళ్లుగా భర్తీ కాలేదు. మరోవైపు అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులను సమన్వయం చేసే చీఫ్ విప్, విప్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. మండలిలోనూ ప్రభుత్వ విప్ పదవులు భర్తీ కాలేదు. దీంతో అసెంబ్లీ నిర్వహణలో వైఫల్యాలు చోటుచేసుకుంటూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరును విశ్లేషించి అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్దేశించే అసెంబ్లీ కమిటీలు లేకపోవడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పాటించట్లేదు. అసెంబ్లీకి ఉన్న సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే ఈ కమిటీలు ఆర్థిక, అంచనాల పరిశీలన, ప్రభుత్వ ఖర్చుల ఆడిట్, చట్టాల అమలు పర్యవేక్షణ, సభా కార్యకలాపాల నిర్వహణ, అసెంబ్లీ సభ్యుల అధికారాల పరిరక్షణ కోసం పనిచేస్తాయి. వివిధ శాఖల పనితీరు నివేదికలు, సిఫారసులను ఈ కమిటీలు ప్రభుత్వానికి అందిస్తాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంచేస్తోంది. కానీ అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు కమిటీలే ఏర్పాటు అసెంబ్లీలో అంతర్భాగమైన శాసనసభ, శాసనమండలికి సంయుక్తంగా, విడివిడిగా కలిపి మొత్తం 24 కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉభయ సభల సభ్యులతో కూడిన 13 కమిటీలు, శాసనసభకు ఐదు, మండలికి ఆరు కమిటీలు ఉంటాయి. అయితే ఇప్పటివరకు 4 సంయుక్త కమిటీలు, శాసనసభ, మండలికి బిజినెస్ అడ్వైజరీ కమిటీలే ఏర్పడ్డాయి. శాసనసభ, మండలి సభ్యులతో కూడిన పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, ఎస్టిమేట్స్ కమిటీలు 2023 డిసెంబర్లో ఏర్పడగా మీడియా అడ్వైజరీ కమిటీ ఇటీవల ఏర్పాటైంది. అయితే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి, కోదాడ ఎమ్మెల్యే అయిన పద్మావతిరెడ్డి చైర్పర్సన్గా ఎస్టిమేట్స్ కమిటీ ఏర్పాటవగా ఆమె మొదట్లోనే రాజీనామా చేశారు. నాటి నుంచి కొత్త కమిటీ నియామకం జరగలేదు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)ని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్గా నియమించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతోంది. షాద్నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య అధ్యక్షతన ఏర్పాటైన పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ మాత్రమే అడపదడపా భేటీ అవుతోంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎప్పుడో? డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో సభ్యుల హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని విపక్ష సభ్యులు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచందర్నాయక్ పేరును ఖరారు చేసినట్లు గతంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగలేదు. ప్రస్తుతం ఆయన సభలో కాంగ్రెస్ విప్గా కొనసాగుతున్నారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), ఆది శ్రీనివాస్ (వేములవాడ), బీర్ల ఐలయ్య యాదవ్ (ఆలేరు)లను సైతం విప్లుగా నియమించగా వారిలో అడ్లూరి మంత్రి అయ్యారు. దీంతో అసెంబ్లీలో చీఫ్ విప్తోపాటు రెండు ప్రభుత్వ విప్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండలిలో మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేస్తుండగా విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. సభ హుందాతనం కాపాడాలి రెండేళ్లు గడిచినా అసెంబ్లీ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకం అంశాన్ని గాలికి వదిలేశారు. అన్ని అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. సభ హుందాతనాన్ని కాపాడాలి. – హరీశ్రావు, మాజీ మంత్రిప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సభ నిర్వహణ మొదలు సభా సంప్రదాయాల వరకు అన్నింటినీ తుంగలో తొక్కి ప్రభుత్వం ఇష్టారీతిన సభ నడుపుతోంది. ఇప్పటికైనా అసెంబ్లీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
300 ఎకరాలు రూ. 8,000 కోట్లు!
శాసనసభకు కూతవేటు దూరంలోని హౌసింగ్ బోర్డు స్థలంలో వెలిసిన పెట్రోల్ బంకు.. దాని లీజు గడువు ముగిసి 20 ఏళ్లు అవుతోంది. కానీ ఖాళీ చేయట్లేదు. పోనీ లీజు అద్దె చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. నామమాత్రపు చిల్లర డబ్బులు అడపాదడపా చెల్లిస్తూ దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా అనుభవిస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడుతున్నారు.విజయనగర్ కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్ అది. ఓ రాజకీయ నాయకుడి గుప్పిట్లో చిక్కుకుంది. దశాబ్దాల క్రితం హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని దర్జాగా ఆ నేత వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ లీజు అద్దె మాత్రం చెల్లించట్లేదు. ఖాళీ చేయాలని కోరితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత విలువైన ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డు భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకొనే వీల్లేక.. లీజు రూపంలో ఆదాయం పొందలేక తెలంగాణ గృహనిర్మాణ మండలి కునారిల్లుపోతోంది. ఈ తరుణంలో అలాంటి భూములను ప్రస్తుతం వాటిని అనుభవిస్తున్న వారికి మార్కెట్ ధరకు అమ్మాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. బహిరంగ వేలం ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని ఇంకా ఎక్కువకు విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలో కేబినెట్ ముందు ఈ మేరకు ప్రతిపాదించి అందుకు ఆమోదం పొందేందుకు గృహనిర్మాణ శాఖ చర్యలు ప్రారంభించింది. రూ. 8 వేల కోట్ల వరకు ఆదాయం... హైదరాబాద్లోని కోకాపేట పరిసరాల్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇటీవల పలుమార్లు వేలం వేయగా రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోవడం తెలిసిందే. అలాగే మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని భూములు, అసంపూర్తి బహుళ అంతస్తుల భవన సముదాయాలను కూడా విక్రయిస్తోంది. ఇదే తరహాలో తెలంగాణ గృహనిర్మాణ మండలి భూములను కూడా విక్రయించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు మండలి అధికారులు ప్రభుత్వానికి వివరాలు సమరి్పంచారు. ఏయే భూముల్ని విక్రయించే అవకాశం ఉందో లెక్కలు తేల్చారు. వివిధ పద్ధతుల్లో లీజుల్లో ఉన్న ఈ భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ. 8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. లీజు భూములతోనే చిక్కు... గృహ నిర్మాణ మండలి వాణిజ్య అవసరాలకు భూములను లీజుకు ఇచ్చింది. కొన్నింటిని ప్రార్థనా స్థలాలకు, కబరిస్తాన్లకు ఇవ్వగా మరికొన్నింటిని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు అప్పగించింది. వాటి నుంచి నెలవారీగా రూ. 40 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా నామమాత్రంగా చిల్లర పైసలు మాత్రమే వసూలవుతున్నాయి. లీజు ధరలను గతంలో సవరించినా ఆ మొత్తాన్ని చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. లీజు గడువు పూర్తయిన వారు వాటిని ఖాళీ చేయట్లేదు. గతంలో చదరపు అడుగుకు రూ. 7 నామమాత్రపు లీజు ధర ఉండగా దాన్ని ఓసారి సవరించి రూ. 30కి పెంచారు. కానీ అందులో మూడో వంతు కూడా చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. రూ. 10 చొప్పున అడపాదడపా చెల్లించి ఆయా స్థలాలను ఖాళీ చేయకుండా అ«దీనంలో ఉంచుకుంటున్నారు. హైదరాబాద్లో ఇలాంటి 115 ఆస్తులు ఉండగా వాటి మొత్తం విస్తీర్ణం దాదాపు 256 ఎకరాలుగా ఉంది. వాటిల్లో ధార్మిక, కబరిస్తాన్ స్థలాలు పోను మిగతా వాటిని లీజుదారులకు విక్రయించడం లేదా బహిరం™గ వేలం ద్వారా విక్రయించడం తక్షణ అవసరమని గృహనిర్మాణ శాఖ తాజాగా నిర్ణయించింది. ఇలా విక్రయించడం ద్వారా సబ్ రిజిస్ట్రార్ ధర ప్రకారమైతే రూ. 2,450 కోట్లు, మార్కెట్ ధర ప్రకారమైతే రూ. 7,400 కోట్లు పొందొచ్చని అంచనాకొచ్చింది. వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పక్కన మిగిలి ఉన్న చిన్నచిన్న స్థలాల విక్రయం ద్వారా మరో రూ. 600 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది. దుకాణాల విక్రయం... హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో సొంత జాగాలో గృహనిర్మాణ మండలి కాంప్లెక్సులు నిర్మించింది. నాంపల్లి, బాగ్లింగంపల్లి, కేపీహెచ్బీ, సికింద్రాబాద్, ఎస్ఆర్ నగర్, బషీర్బాగ్, ఫతేమైదాన్, విద్యానగర్, సంతోశ్నగర్ తదితర చోట్ల ఉన్నాయి. వాటిల్లో 201 దుకాణాలను అద్దెకిచ్చారు. గతంలో ఓసారి 14 దుకాణాలను వాటి నిర్వాహకులకే విక్రయించగా మిగతావి ఉన్నాయి. ఐదేళ్లకోసారి అద్దెలను సవరించి 50 శాతం మేర పెంచాలనే ఒప్పందం ఉన్నా దుకాణాల నిర్వాహకులు దాన్ని పట్టించుకోకపోగా అద్దె చెల్లించకుండా, దుకాణాలు ఖాళీ చేయకుండా మొండికేస్తున్నారు. దుకాణదారుల నుంచి అద్దె వసూలు కష్టంగా మారిన నేపథ్యంలో వాటిని గంపగుత్తగా విక్రయించాలని నిర్ణయించారు.ఇంటి పక్క స్థలాల విక్రయం... కేపీహెచ్బీ లాంటి హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇప్పటికీ అక్కడక్కడా చిన్నచిన్న ప్లాట్లు మిగిలిపోయాయి. వాటి నుంచి బోర్డుకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వాటి పక్కనే ఉన్న ఇళ్ల వారికి వాటిని విక్రయించాలని ఇప్పుడు నిర్ణయించారు. ఇలాంటివి దాదాపు 400 బిట్లు ఉన్నాయి. సగటున ఒక్కోటి 35 గజాల మేర ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ ధర ప్రకారం వాటిని విక్రయించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు... విజయనగర్ కాలనీలో హౌసింగ్ బోర్డుకు దాదాపు 40కిపైగా ఆస్తులున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు అప్పట్లో ఒక్కోటి వెయ్యి గజాల (గరిష్టంగా) వరకు ఉన్న ప్లాట్లను కేటాయించారు. అవన్నీ లీజు రూపంలో ఇచ్చినవే. కానీ వాటి నుంచి లీజులు వసూలు కావట్లేదు. ఈలోగా కొందరు వాటిని ఇతరులకు విక్రయించడంతో ప్రస్తుతం ఆ ప్లాట్లు కొన్న వారి వారుసుల చేతుల్లో ఉన్నాయి. వాటి మార్కెట్ ధర నిర్ణయించి విక్రయించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో గజం ధర రూ. లక్షకుపైగా ఉన్నప్పటికీ ఆ భూములను కబ్జాలో ఉంచుకున్న వారు కేవలం గజం రూ. 5 వేలు చొప్పున నిర్ణయించి తమకు విక్రయించాలని గృహనిర్మాణ మండలికి విన్నవించారు. రూ. 350 కోట్లకుపైగా విలువైన భూములను కేవలం రూ. 10 కోట్లకే కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ, మార్కెట్ ధర నిర్ధారించి విక్రయిస్తామని గృహనిర్మాణ మండలి పేర్కొంటోంది. ఇలా మొత్తంగా అన్ని కలిపితే 300 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. హౌసింగ్ బోర్డు లీజు స్థలాలు, షాపుల క్రమబద్ధీకరణహౌసింగ్ బోర్డుకు చెందిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వగా వాటిలో ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. లీజు ఒప్పందం పునరుద్ధరించుకోని సంస్థలకు లేఖలు రాసి వాటి క్రమబదీ్ధకరణకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బోర్డుకు 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనగా మిగిలిన 287 షాపులకుగాను ప్రస్తుతం 62 షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ఏటా 10 శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి బోర్డుకు రూ. కోట్లు రావలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షాపు లు నిర్వహిస్తున్నవారు వాటిని కొనేందుకు ముందుకొస్తే మార్కెట్ ధరకు విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. షాపు నిర్వహణకు అనువుగా లేని స్థలాలను వేలంలో విక్రయించాలన్నారు. అలాగే బోర్డు గతంలో కేటాయించిన ఇళ్ల పక్కనే ఉన్న 100 గజాల్లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని సూచించారు. గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజి్రస్టేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని చెప్పారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ, 100 గజాల్లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజి్రస్టేషన్ చేసుకొని పక్కనే ఉన్న 100 గజాలలోపు స్థలాన్ని అడుగుతున్న వారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్ధాయి నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వాటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి’
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లాం. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం’ అని తెలిపారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 15వ తేదీ) ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు 42%కు పెంపు చట్టానికి ఆమోదం కోరుతూ ఆందోళన చేపట్టింది జేఏసీ. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేసింది. సామాజిక రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ధర్నాలో మహేష్గౌడ్తో పాటు వి. హనుమంతరావు, విల్సన్ ఎంపీ (డిఎంకే), కే. నారాయణ (సిపిఐ), వి. శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, మల్లు రవి ఎంపీ, అనిల్ కుమార్ యాదవ్లు హాజరయ్యారు. -
ఘెరం.. తమపై పోటీచేశారని కోపంతో మహిళలపైకి ట్రాక్టర్ ఎక్కించి
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సోమర్పేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పాపయ్య, బాలరాజ్ అనే ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో పాపయ్య గెలుపోందారు. దీంతో ఎన్నికల్లో తమ పైనే పోటీ చేశారనే కోపంతో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి తమ్ముడైన చిరంజీవి అనే వ్యక్తి బాలరాజ్ కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించాడు.ఈ ప్రమాదంలో బాలరాజుతో పాటు వారి కుటుంబ సభ్యులు బాలమణి, స్వరూప, భారతి, పద్మసత్వవలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో సోమర్పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ ఘటనపై సోమర్పేట గ్రామం భగ్గుమంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా కలిసి ఎల్లారెడ్డిలో 4 గంటలుగా ధర్నా చేపడుతున్నారు. ఎల్లారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మెుహరించారు. రాష్ట్రంలో మూడుదశలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఆదివారం రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చివరిదశ ఎలక్షన్లు 17 తారీఖున జరగనున్నాయి. -
సిద్దిపేట : కమనీయం కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మెదడు నష్టంపై కచ్చితమైన ‘మార్కర్’
సాక్షి, హైదరాబాద్: కార్డియాక్ అరెస్టు (గుండె స్తంభించడం) నుంచి బయటపడిన రోగుల్లో మెదడు పనితీరుకు సంబంధించిన నష్టాన్ని కచ్చితత్వంతో అంచనా వేయడానికి కొత్త తరహా రక్త పరీక్ష న్యూరోఫిలమెంట్ లైట్ (ఎన్ఎఫ్ఎల్)ఉపయోగపడనుందని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. మల్టిపుల్ స్క్లెరోసిస్ (రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధి) రోగుల్లో ఇప్పటికే వినియోగిస్తున్న ఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ కార్డియాక్ అరెస్టు రోగుల విషయంలోనూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్లోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నేతృత్వంలో యూరప్కు చెందిన 24 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 819 మంది రోగులపై ఈ పరిశోధన జరిగింది. ‘ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ జర్నల్లో డిసెంబర్ 11న ప్రచురితమైన ఈ అధ్యయనంలో, కార్డియాక్ అరెస్టు తర్వాత ఆరు నెలలకు రోగుల పరిస్థితిని అంచనా వేయడంలో ఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ 92 శాతం కచ్చితత్వాన్ని చూపినట్లు వెల్లడైంది. ముఖ్యంగా కార్డియాక్ అరెస్టు జరిగిన 24 గంటల్లో రోగి మెదడుకు వాటిల్లిన నష్టం స్థాయిని అంచనా వేసే అవకాశం ఈ కొత్త పరీక్షతో లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. 24 గంటల్లోనే ఫలితాలుఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ ప్రత్యేకత ఏమిటంటే, కార్డియాక్ అరెస్టు జరిగిన తర్వాత జరిపే ఈ పరీక్ష ఫలితాలు 24 గంటల్లోనే అందుబాటులోకి వస్తాయి. దీంతో ఐసీయూ వైద్యులు తొలిదశలోనే రోగి పరి స్థితిపై స్పష్టమైనఅవగాహన పొందగ లుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న న్యూరాన్– స్పెసి ఫిక్ ఎనోలేస్ (ఎన్ఎస్ఈ), ఎస్–100 ప్రోటీ న్ వంటి బయో మార్కర్లకు కొన్ని పరిమితు లు ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నిక్లాస్ నిల్సన్ తెలిపారు. మొత్తంగా నాలుగు రకాల బయో మార్కర్లతో పోల్చినప్పుడు ఎన్ఎఫ్ఎల్ మిగతా మూడింటికంటే మెరుగైన పనితీ రును చూపిందని అధ్య యనం రచయిత మారియోన్ మోసెబీ నాపే వెల్లడించారు.తీవ్రత గుర్తింపులో స్పష్టతఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ మెదడుకు జరిగిన నష్టం తీవ్రతను స్పష్టంగా గుర్తిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. కాగా ‘గ్లియల్ ఫైబ్రిల్లరీ ఆసిడిక్ ప్రోటీన్ –జీఎఫ్ఏపీ’ అనే మరో బయో మార్కర్ కూడా ప్రస్తుతం వాడుతున్న పరీక్షల కంటే మెరుగైన ఫలితాలు చూపుతున్నట్టుగా తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ అధ్యయనంలో రోగులను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో, 24 గంటలు తర్వాత, 48 గంటలు, అలాగే 72 గంటల తర్వాత రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఈ పరీక్ష ద్వారా రోగికి చికిత్స కొనసాగించాలా లేదా పల్లియేటివ్ కేర్ (సంరక్షణ విభాగం)కు మార్చాలా అనే క్లిష్ట నిర్ణయాల్లో వైద్యులకు కీలక మార్గనిర్దేశం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్టు రోగుల సంరక్షణలో ఇది గణనీయమైన మార్పు తీసుకువస్తుందని అంటున్నారు. -
బావ చూపిన బాటలో..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగిగా మారిన బావమరిదిని డ్రగ్ పెడ్లర్గా మార్చాడో బావ. ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎండీఎంఏ మాదకద్రవ్యాల దందా ప్రారంభించిన ఇతగాడు హైదరాబాద్కు చెందిన ఇద్దరిని సబ్– పెడ్లర్స్గా మార్చుకున్నాడు. వీరితో కలిసి కొన్నాళ్లుగా వ్యవహారాలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ముగ్గురికీ చెక్ చెప్పారు. మాసబ్ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో వీరిని అరెస్టు చేయడంతోపాటు 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదివారం వెల్లడించారు. ఆ రెండింటిలో సక్సెస్ కాకపోవడంతో...ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన ఉప్పుటూరి కార్తీక్ ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తి చేయలేకపోయాడు. సొంతూరిలో పాల కేంద్రం, గ్రానైట్స్ వ్యాపారం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో దురలవాట్లకు బానిసగా మారాడు. రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. నెల్లూరు నుంచి వచ్చి నేరేడ్మెట్లో స్థిరపడిన సీహెచ్ బాలాజీ ఇతడికి బావ అవుతాడు. 2022లో తండ్రి చనిపోవడంతో బాలాజీ డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ నెలకు రూ.22 వేల వరకు సంపాదిస్తున్నాడు. సిగరెట్తో మొదలుపెట్టి ఎండీఎంఏ వినియోగం వరకు వెళ్లిన ఇతగాడు ఆ డ్రగ్కు ఉన్న డిమాండ్ను కార్తీక్కు చెప్పాడు. దీంతో కార్తీక్ కూడా ఈ దందా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తొలినాళ్లలో బెంగళూరు వరకు వెళ్లి నైజీరియన్ల నుంచి ఈ డ్రగ్ ఖరీదు చేసి తెచ్చేవాడు. కొన్నాళ్లుగా నైజీరియన్లు నేరుగా ఇవ్వకుండా తమ ఏజెంట్ల ద్వారా పంపిస్తుండటంతో బెంగళూరుతోపాటు ఆదిలాబాద్కూ వెళ్లి తేవడం మొదలెట్టాడు. దీన్ని ఒక గ్రాము చొప్పున రీప్యాక్ చేసి ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఇతడి నుంచి బాలాజీ కూడా క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేసేవాడు. ఈ దందాలో దిగిన కార్తీక్ తన పేరును అలెక్స్గా మార్చుకున్నాడు. ఓ దశలో బాలాజీ ఇతడికి సబ్–పెడ్లర్గా మారిపోయాడు. బీటెక్ చదువుతున్న జీడిమెట్లకు చెందిన టి.దీపక్ పార్ట్టైమ్గా టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు కూడా ఎండీఎంఏ వినియోగం నుంచి విక్రేతగా మారాడు. డెడ్ డ్రాప్ విధానంలో సరఫరా...ఈ ముగ్గురూ తమ ఉనికి బయటపడకుండా ఎండీఎంఏను విక్రయిస్తున్నారు. ఆన్లైన్, సోషల్మీడియా కస్టమర్లతో రేటు ఖరారు చేసుకుంటారు. ఆపై వారికి క్యూఆర్ కోడ్ పంపి డబ్బు బదిలీ చేయించుకుంటారు. ఆపై ఏదైనా ఓ ప్రాంతంలో డ్రగ్ పెట్టి దాని ఫొటోతోపాటు లొకేషన్ను వినియోగదారుడికి షేర్ చేస్తారు. మిగిలిన ఇద్దరూ అలెక్స్ నుంచే సరుకు తీసుకుని పరిచయస్తులైన కస్టమర్లకు అధిక ధరలకు అమ్ముతున్నారు. వీళ్లు ఒక్కో గ్రాము రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలకు కొని... రూ.ఎనిమిది వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. వీరి దందాపై సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఎస్.బాలస్వామి నేతృత్వంలో ఎస్సై బి.మనోజ్కుమార్తో కూడిన బృందం మాసబ్ట్యాంక్లో వలపన్నింది. ఎండీఎంఏ సరఫరా చేయడానికి వచ్చిన అలెక్స్తోపాటు తీసుకోవడానికి వచ్చిన మిగిలిన ఇద్దరినీ పట్టుకుంది. -
చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి...
మహబూబాబాద్ రూరల్: వారిది ప్రేమ వివాహం.. అయినా కొంతకట్నం ఇచ్చారు. పెళ్లయిన ఏడాదినుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు అత్తామామ, మరిది వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా కొట్టి చంపి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతురాలి తల్లి కౌసల్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న (26) అదే గ్రామానికి చెందిన బానోత్ కిషన్, బుజ్జి దంపతుల కుమారుడు రామన్న ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం రూ.3 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జని్మంచారు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం కావాలంటూ స్వప్నపై వేధింపులు పెరిగాయి. గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. శనివారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోతుందని భయపడిన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. దీంతో కేసు తమపైకి వస్తుందని భావించిన అత్తామామలు, భర్త, మరిది మళ్లీ స్వప్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు నమ్మించాలని చూశారు. ఈ విషయం మృతురాలి గ్రామస్తులు, తల్లిదండ్రులకు తెలియగానే వారంతా రామన్న ఇంటికి చేరుకుని ఆగ్రహంతో అత్తింట్లో ఫరి్నచర్, టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటికే మృతురాలి అత్తామామలు, భర్త, మరిది పరారీలో ఉన్నారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్లో విలేకరులతో చిట్చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్కు రాలేదు. హరీశ్రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీపై పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, నదీ జలాల కేటాయింపు వంటి అంశాలపైనా ఉద్యమించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ స్వరూపం ఏ తరహాలో ఉండాలనే అంశంపై చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొంటుంది. నదీ జలాల పరిరక్షణలో విఫలం కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫ లమైందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభు త్వం 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు చాలంటూ కేంద్రం ముందు దేబిరిస్తోంది. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రం ముందు మోకరిల్లారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ ఎలా పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా ఉంది’అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ‘కృష్ణా, గోదావరి జలాలతోపాటు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు. రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండికొడుతోంది. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం, కావేరీ అనుసంధానం పేరిట ఆంధ్ర జలదోపిడీకి సహకరిస్తున్న విధానంపై ప్రజా ఉద్యమం తప్పదు’అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.ప్రజా ఉద్యమంపై లోతైన చర్చ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై ఈ నెల 19న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. లోక్సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
వైఎస్సార్ పిలిస్తే కాంగ్రెస్లోకి వచ్చా
సాక్షి, హైదరాబాద్: తాను హరీశ్రావుపై కోపంతో బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వెళ్లానని కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్ఎస్ను వీడడానికి, హరీశ్రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు. నన్ను కాంగ్రెస్లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్తో వైఎస్సార్ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్లేన్ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.హరీశ్తో వార్ నడుస్తూనే ఉంటుంది..కేసీఆర్ కుమార్తె కాబట్టి కవిత లీడర్ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్రావుకు, తనకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్గా రాజకీయం చేస్తే, హరీశ్రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు. తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
రెండో విడతలో 85.86% ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ముగియగా, ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ముగిశాక కౌంటింగ్ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా ఓటర్లే ఎక్కువ.. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లా టాప్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్బ్యాలెట్ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.పోటెత్తిన మహిళలు ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723ఏకగ్రీవమైనవి: 1205తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834రెండో విడతలో జరిగినవి: 3,911మూడో విడతలో జరిగేవి: 3,759(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు) -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..?
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్లో శ్రీకాంత్ను విజయం వరించింది.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్కుమార్ సర్పంచ్గా గెలుపొందినట్టుప్రకటించారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన బలరాం రాంచందర్లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు. -
తొలిలాగే మలి!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. బీఆర్ఎస్ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎవరికి ఎంత శాతం..?తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 14-21)
-
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
తీవ్ర విషాదం.. సర్పంచ్ అభ్యర్థి మృతి
సాక్షి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతను బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడని నిర్దారించడంతో, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజు కు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29,917 వార్డులకు బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది. -
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
-
స్టాండ్స్లోకి కిక్ చేసి.. ఉప్పల్లో మెస్సీ చర్య వైరల్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నా రు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం నుంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. స్టాండ్స్లోకి కిక్ చేసివీవీఐపీలు, ఫుట్బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఇక అభివాదం చేస్తు న్న సమయంలో ఫుట్బాల్ను స్టాండ్స్లోకి కిక్ చేసి మెస్సీ అభిమానులను అలరించిన తీరు వైరల్గా మారింది. ✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9— Congress (@INCIndia) December 13, 2025మ్యూజిక్.. మ్యాజిక్.. ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు. ఫలించిన పోలీసుల వ్యూహం..ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. మ్యాచ్ను వీక్షించేందుకు వస్తున్న యువత కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుదీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్ను ధరించి వెళ్లడం కనిపించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకూ చట్టాలు రావాలి
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగులు సమయ పాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి పరిరక్షణకు చట్టాలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వేతనాలు ఘనంగా ఉన్నా వారి వ్యక్తిగత జీవితం విరుద్ధంగా ఉంటోందని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన ఇలాంటి రంగం గురించి పాలకులు ఆలోచించాలని సూచించింది. ఆ ఉద్యోగుల హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదని ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అగ్రిమెంట్ను పాటించకుండా రాజీనామా చేస్తున్నందుకు రూ.5.9 లక్షల పరిహారం చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంపై ఫిర్యాదు చేసినా.. లేబర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టి.. తాజాగా తీర్పు వెలువరించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సామాజిక భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వాణిజ్యం, వ్యాపారం చేపట్టకుండా ఆపే ఒప్పందాలు చెల్లుబాటు కావన్నారు. ఈ కేసులో కంపెనీ ఏ ప్రాతిపదికన పరిహారం నిర్ణయించిందో తేల్చాలని కార్మీకశాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలంటూ కంపెనీకి తేల్చిచెప్పారు. -
హలీం, మటన్ బిర్యానీలకు 'మెస్సీ' ఫిదా
సాక్షి, హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మన హైదరాబాదీ వంటకాల రుచి చూశారు. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్కు ఫిదా అయ్యారు. భారత దేశ పర్యటనలో భాగంగా శనివారం భాగ్యనగరానికి వచ్చిన మెస్సీ.. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో బస చేశారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ప్యాలెస్లోని నిజాం లగ్జరీ సూట్లో గడిపారు. ఉప్పల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం రాత్రి విందులో ఆయన హైదరాబాదీ మటన్ బిర్యానీ అరగించారు. అలాగే ఆయనకు హలీమ్ను వడ్డించారు. ఇవేగాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయా, కబాబ్, పన్నీర్ టిక్కా, దాల్, నాన్ రోటీలు, ఖుబానీ కా మీటా, బడల్ కా మీటా, మలాయ్ కుల్ఫీ, ఇటాలియన్ ఫుడ్ కూడా మెనూలో పొందుపరిచారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫలక్నుమా ఫ్యాలెస్ అందాలకు మెస్సీ ముచ్చటపడ్డారు. ప్యాలెస్లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్ టేబుల్ను చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ ఆతిథ్యం మరిచిపోలేనిదని కితాబునిచ్చారు. -
పెరిగిన విదేశీ మారక నిల్వలు
సాక్షి, హైదరాబాద్: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) మళ్లీ పెరిగాయి. డిసెంబర్ 5తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.033 బిలియన్ డాలర్లు పెరిగి 687.26 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వరుసగా రెండు వారాల తగ్గుదల తర్వాత నిల్వలు పెరగడం గమనార్హం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారీగా బంగారం నిల్వల వృద్ధి కావడమే. ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 1.19 బిలియన్ డాలర్లు పెరిగి 106.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఫారెక్స్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 151 మిలియన్ డాలర్లు తగ్గి 556.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఫారెక్స్ నిల్వలు గత సెప్టెంబర్లో నమోదైన 704.89 బిలియన్ డాలర్ల ఆల్టైం హైకి సమీపంలోనే ఉన్నాయని, ఇవి 11 నెలలకు పైగా దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఫెడ్ నిర్ణయంతో లోహాలకు డిమాండ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 10న వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.5–3.75 శాతం పరిధికి తీసుకురావడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ డిసెంబర్ 12 నాటికి ఔన్స్కు 4,338 డాలర్లకు చేరి ఏడు వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. దేశీయంగా రికార్డు ధరలు దేశీయ మార్కెట్లో డిసెంబర్ 13న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,321గా ట్రేడైంది. ‘రూపాయి బలహీనత, పెట్టుబడి డిమాండ్ కొనసాగడం బంగారం ధరలకు బలమిచ్చాయి’అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. వెండికి ఊహించని ర్యాలీ దేశంలో వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 13న దేశీయంగా వెండి ధర గ్రాముకు రూ.204.10, అంటే కిలోకు రూ.2,04,100 కు చేరింది. వారం కిందట ఇదే ధర రూ.1.87 లక్షలుగా ఉండటం గమనార్హం. సౌర విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ రంగాల నుంచి పెరిగిన పారిశ్రామిక డిమాండ్, వరుసగా ఐదో ఏడాదీ కొనసాగుతున్న సరఫరా లోటు వెండి ధరలను పైకి నెడుతున్నాయి.రూపాయి పతనం ప్రభావంభారత రూపాయి డాలర్తో పోల్చితే 90 మార్క్ను దాటి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికి పైగా పడిపోవడంతో ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా మారింది. దీని ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత భారమయ్యాయి. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులుగా ఈ లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఎగుమతులు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఎగుమతుల విషయంలో తెలంగాణ గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా రాష్ట్ర ఎగుమతుల విలువలో పెరుగుదల నమోదయింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతుల మొత్తం విలువ 14,026 మిలియన్ డాలర్లు కాగా.. 2024–25లో అది 19,123 మిలియన్ డాలర్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024–25లో గత ఎనిమిదేళ్ల (2017–18 నుంచి) ఎగుమతుల గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఎగుమతుల విలువలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో స్థానం లభించింది. ఐటీ, ఫార్మానే కీలకం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఫార్మా, ఐటీ రంగాల నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ రెండు రంగాల నుంచి డ్రగ్ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్, సాఫ్ట్వేర్ సంబంధిత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024–25లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులున్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా పెరుగుదల నమోదైందని.. తెలంగాణకు ఐటీకి తోడు ఫార్మా ఎగుమతులు భారీగా ఉండటం వల్లే అత్యధిక పెరుగుదల నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ సామగ్రి, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలతోపాటు విత్తనాలు, బియ్యం, పత్తి లాంటి వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా తెలంగాణ నుంచి కొనసాగుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది. గుజరాత్ ఫస్ట్.. చండీగఢ్ లాస్ట్ దేశంలోనే అత్యధికంగా గుజరాత్ నుంచి ఎగుమతులు జరుగుతున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2017–18లోనే దాదాపు 70 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసిన ఆ రాష్ట్రం.. 2024–25 నాటికి 1,16,332 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను ఇతర దేశాలకు పంపింది. అయితే గత మూడేళ్లుగా గుజరాత్ ఎగుమతుల విలువల్లో తగ్గుదల నమోదవుతోంది. 2022–23లో 1.46 లక్షల మిలియన్ డాలర్లుగా ఉన్న గుజరాత్ ఎగుమతులు.. ఆ తర్వాతి ఏడాదిలో 1.34 లక్షలకు, దాని తర్వాతి ఏడాదిలో 1.16 లక్షల మిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో దేశంలోకెల్లా ఎగుమతుల విలువలు అతితక్కువగా ఉన్నాయి. 2024–25లో అక్కడి నుంచి జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 14 మిలియన్ డాలర్లు మాత్రమే. మరోవైపు తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతుల విలువ నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. -
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్... -
ముందుకెళ్తారా? మిన్నకుంటారా?
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా గత ప్ర భుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును సిట్ అధికారులు రెండో రోజైన శనివారమూ విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలే చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం దర్యాప్తు అధికారులకు మరో తలనొప్పి వచ్చిపడింది. దీని ఆధారంగా ముందుకు వెళ్తారా? లేక మిన్నకుండిపోతారా? అనేది తేలాల్సి ఉంది. విభాగాధిపతుల పర్యవేక్షణలోనే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పట్లో డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్ర భాకర్రావు చెప్తున్నారు. పోలీసులు సేకరించిన ఆ«ధారాల ప్రకారం ఈ అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం మొత్తం ప్ర భాకర్రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టు అయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్రావు వార్రూమ్గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అనుమానిత నంబర్ల ట్యాపింగ్కు రూపొందించిన లేఖపై హోంశాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. ఇది ఎస్ఐబీ నుంచి నిఘా విభాగాధిపతి, డీజీపీల ద్వారా హోం సెక్రటరీకి చేరుతుంది. ఆయన అందుబాటులో లేనప్పుడు మాత్రమే అత్యవసరమైతే ఎస్ఐబీ చీఫ్ లేఖ పంపిస్తారు. అయితే ఇలా జరిగిన మూడు రోజుల్లో హోం సెక్రటరీ నుంచి అను మతి తీసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ రివ్యూ చేస్తుంది. ఈ విషయాలను ప్రభాకర్రావు తన వాంగ్మూలంలో స్పష్టం చేస్తున్నారని తెలిసింది. గతంలో ఆయన నాంపల్లి కోర్టులో న్యాయవాదుల ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లోనూ ఆయా సెక్రటరీలు, డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావించారు. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పనిచేశానంటూ ప్రభాకర్రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకిస్తున్నారు. కస్టడీలో చెప్తున్న విషయాలే కాకుండా న్యాయస్థానంలో దాఖలైన అఫిడవిట్ను ప్రభాకర్రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుంది.సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు? ప్రభాకర్రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుంటే మాజీ డీజీపీలు, నిఘా విభాగం అధిపతుల్నీ విచారించడంతో పాటు అవసరమైతే వారినీ నిందితులుగా చేర్చాలి. ఓ నేరం చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. దానికి సహకరించిన వాళ్లు కూడా నిందితులే అవుతారు. ఈ విషయాన్నే చట్టం కూడా స్పష్టం చేస్తోంది. ప్రభాకర్రావు విచారణపై ఈ నెల 19న సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ అంశాలు ప్రస్తావిస్తారా? ఆయా అధికారుల విషయంలో ఎలా ముందుకు వెళ్తారు? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. -
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, భారత త్రివిధ దళాలు ప్రతినిత్యం అప్రమత్తతతోనే ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. అప్రమత్తత, యుద్ధసన్నద్ధతే మనల్ని విజయం వైపు తీసుకెళుతుందని, విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. యుద్ధ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం భారీగా ఉంటుందని, త్రివిధ దళాల సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని ఆయన చెప్పారు. శనివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో 216 బ్యాచ్కు చెందిన 29 మంది మహిళా అధికారులతో సహా మొత్తం 244 మంది కేడెట్లు పాల్గొన్నారు. వీరిలో భారత నావికాదళం నుంచి ఎనిమిది మంది అధికారులు, భారత కోస్ట్ గార్డ్ నుంచి ఆరుగురు, వియత్నాం వైమానిక దళం నుంచి ఇద్దరు అధికారులు ఉన్నారు. ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన ఫ్లయింగ్ బ్రాంచ్, నావిగేషన్, గ్రౌండ్ డ్యూటీ శాఖల ఫ్లైట్ క్యాడెట్లకు ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ప్రదానం చేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలు బహూకరించారు. భారత వాయుసేనతోపాటు పరేడ్లో పాల్గొన్న భారత నౌకాదళం, కోస్ట్గార్డ్స్ వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్ ఫ్లయింగ్ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యువ అధికారులనుద్దేశించి సీడీఎస్ మాట్లాడారు. మూడు సూత్రాలు మరవొద్దు..: మూడు మూల సూత్రాలను ఎప్పుడూ మరవొద్దని యువ అధికారులకు సీడీఎస్ అనిల్ చౌహాన్ సూచించారు. ‘మొదటిది.. జీవితమనేది సైకిల్ ప్రయాణం వంటిది. సమతుల్యత ఉంటేనే ప్రయాణం ముందుకు సాగుతుంది. రెండోది.. ప్రమాదకరమైన గర్వాన్ని, నిర్లక్ష్యాన్ని మీ దరిచేరనివ్వద్దు. మూడోది.. నిబంధనలు పాటించడంలో ఒక రాయిలా ఉండాలి’అని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం సైతం ఎన్నో మార్పులు చేసుకుంటోంది. ఈ తరుణంలో సర్విస్లోకి అడుగుపెట్టబోతున్న మీరు నూతన సవాళ్లకు తగినట్టుగా తయారు కావాలి. సాంకేతికత యుద్ధ క్షేత్రంలో కీలకంగా మారుతున్న తరుణంలో ఏఐ వాడకాన్ని పెంచడంతోపాటు అనేక నూతన సాంకేతికతలను భారత సైన్యానికి జోడిస్తున్నాం’అన్నారు. భారత సైన్యం కీర్తిని మీరు మరింత పెంచుతారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆకాశ్గంగ స్కైడైవింగ్ బృందం, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనలతో పాటు, పిలాటస్ పీసీ–7, కిరణ్, చేతక్ విమానాల ఫ్లై–పాస్ట్లు..సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం వైమానిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు. -
3 గంటలు స్టేటస్.. 24 గంటలూ సేల్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్గా నగరానికి వలసవచ్చి డ్రగ్ పెడ్లర్గా మారిన శ్రీకాకుళం వాసి వ్యవస్థీకృతంగా, కొత్త పంథాలో ఈ దందా చేస్తున్నాడు. వర్చువల్ నంబర్ వినియో గిస్తూ.. తన వద్దకు సరుకు వచ్చిన సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాడు. మాదకద్రవ్యాలను దోశల మాదిరిగా ప్యాక్ చేసి, డెలివరీ బాయ్స్ సహకారంతో ఆర్డర్ ఇచ్చిన వారి వద్దకు పంపిస్తున్నాడు. ఈ వ్యవహారం గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి ఐదేసి కేజీల చొప్పున గంజాయి, హష్ ఆయిల్, ద్విచక్ర వాహనం సహా రూ.70 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఈ వివరాలు వెల్లడించారు. సహచరుల కోసం దందా మొదలుపెట్టి.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వైకుంఠ రావు 2017లో హైదరాబాద్కు వలసవచ్చి, మాదాపూర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ధూల్పేట నుంచి గంజాయిని కొనుక్కుని వెళ్లి తన సహచర డ్రైవర్లకు విక్రయించే వాడు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి పూర్తిగా మాదకద్రవ్యాల దందా మొదలు పెట్టాడు. తొలుత ధూల్పేట నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్మేవాడు. 2020 నుంచి ఒడిశా విక్రేతల వద్ద నుంచి గంజాయి, హష్ ఆయిల్ తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి 2021లో సనత్నగర్, ఈ ఏడాది జూన్లో కొత్తవలస ఠాణాల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లాడు. ఆధారాలు చిక్కకుండా పథకం.. జైలు నుంచి బయటకు వచ్చిన వైకుంఠ రావు తన పంథా మార్చేశాడు. ఉనికి బయటపడకుండా దందా చేయడానికి నిర్ణయించుకుని ఒడిశాకు చెందిన హష్ ఆయిల్ తయారీదారుడు పాల్ ఖిలా, సప్లయర్ కృష్ణ జల్లాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.పాల్ నుంచి గంజాయి, హష్ ఆయిల్ సేకరించే కృష్ట నగరానికి తీసుకువచ్చి మాదాపూర్లోని వైకుంఠ రావు ఇంట్లో డెలివరీ ఇచ్చేవాడు. తన గుర్తింపు బయటపడకుండా వర్చువల్ నంబర్ వాడుతున్న వైకుంఠ రావు సరుకు వచ్చిన ప్రతిసారీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 వరకు ‘గ్రీన్ అవైలబుల్’అంటూ స్టేటస్ పెట్టేవాడు. దీన్ని చూసే ఇతడి రెగ్యులర్ కస్టమర్లు ఎంతెంత కావాలో వాట్సాప్లోనే ఆర్డర్ ఇచ్చేవారు. దానికి అయ్యే మొత్తాన్ని ఆన్లైన్లో వసూలు చేసే వైకుంఠ రావు, సరుకు పంపడానికి తన బంధువులైన బాలాజీ, చైతన్యలను డెలివరీ బాయ్స్గా ఏర్పాటుకున్నాడు. గంజాయి, హష్ ఆయిల్ టిన్నులను దోశ మాదిరిగా పేపర్లో ప్యాక్ చేసి, వీరి ద్వారా సరుకు అయిపోయే వరకు 24 గంటలూ సరఫరా చేసేవాడు. బాలాజీ చిక్కడంతో కదిలిన డొంక.. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో టోలిచౌకి వద్ద కాపుకాశారు. అక్కడ ఓ కస్టమర్కు గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన బాలాజీని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మాదాపూర్లోని వైకుంఠరావు గదిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ రావుతో పాటు అక్కడే ఉన్న పాల్, కృష్ణ, చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గది నుంచి హష్ ఆయిల్, గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును టోలిచౌకి పోలీసులకు అప్పగించారు. వైకుంఠ రావు ఫోన్ను తనిఖీ చేసిన పోలీసులు 120 మంది వినియోగదారులను గుర్తించారు. వీరిలో ఐటీ, సినీ రంగానికి చెందిన వారితో పాటు డాక్టర్లు, ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. వీరికి కుటుంబీకుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి రీహ్యాబ్కు పంపాలని నిర్ణయించామని, ఇలాంటి డ్రగ్స్ దందాలపై సమాచారం ఉంటే 8712661601 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని డీసీపీ వైభవ్ కోరారు. -
భార్యకు ఉరివేసి.. ఆత్మహత్య
గణపురం: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి భార్యకు ఉరివేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గణపురం ఎస్ఐ రేఖ అశోక్ కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కి గతంలో జరిగిన రెండు పెళ్లిళ్లలో ఒక భార్య చనిపోగా, మరొకరికి విడాకులిచ్చాడు. మైలారం గ్రామానికి చెందిన సంధ్యను 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి (19) గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సహకరించావంటూ భార్య సంధ్యతో రామాచారి తరచూ గొడవ పడుతున్నాడు. దీంతోపాటు రామాచారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రామాచారి శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఫోన్లో రికార్డు చేసి స్టేటస్గా పెట్టుకుని.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రామాచారి ఇంటికి వెళ్లి చూడగా సంధ్య, రామాచారిలు మృతి చెంది ఉన్నారని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
ఇండియా కూటమి కొనసాగుతుంది
సాక్షి, హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు రాకపోయినప్పటికీ దేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమి కొనసాగుతుందని, కూటమి పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజన్ ఇండియా చర్చాగోష్టిలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన శనివారం తాజ్కృష్ణ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో పాగా వేయాలన్న ఏకైక ఆకాంక్షతో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్)ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. యూపీలో ఉన్న 25 కోట్ల ఓట్లలో మూడు కోట్లను తొలగించాలని చూస్తోందని, ఆ పార్టీ ఎక్కువగా ఓడిపోయే స్థానాల్లోనే ఈ ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని కంపెనీకి ఓటర్ల తొలగింపు కోసం ఉద్దేశించిన మ్యాపింగ్ యాప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. బూత్స్థాయి అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, వారి చేతిలో సాంకేతికత కూడా లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, ఈసీ అంటే ఓట్లు తొలగించడం కాదని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడమని అన్నారు. ఓటరు కార్డులు నకిలీవి తయారు చేయడానికి వీల్లేకుండా పటిష్ట కార్డులు అమల్లోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో ఉన్న పార్టీల్లో బీఆర్ఎస్ తమకు పాత మిత్రుడని చెప్పారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ అంతకుముందు విజన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ (చర్చాగోష్టి)లో అఖిలేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాజీవనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందరికీ మంచి చేసేదే నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఏఐని దుర్వినియోగం చేయడం మంచిది కాదని, అది సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సైబర్ నేరాలు, పాస్వర్డ్ల చోరీ తదితర అక్రమాలన్నీ ఏఐతోనే సాధ్యమవుతాయని, ఈ ఏఐని సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటయినా ఆశ్చర్యం లేదని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
‘పాలమూరు’ తొలిదశ డీపీఆర్కు అనుమతివ్వండి: ఉత్తమ్ కుమార్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: మైనర్ ఇరిగేషన్ కోటాలో వాడుకోని 45 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద వాడుకుంటామని, ఈ మేరకు ప్రతిపాదనలతో ఇటీవల సమరి్పంచిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు అనుమతులివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా ట్రిబ్యునల్–2 నుంచి అవసరమైన అనుమతులు పొందాకే రెండోదశ పనులు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అనుమతులను సత్వరమే ఇప్పించాలని మంత్రి ఉత్తమ్ శనివారం కాంతారావుకు లేఖ రాశారు. ఈ లేఖను నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఢిల్లీలో కాంతారావును కలిసి అందజేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్కు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లోని వివిధ డైరెక్టరేట్ల నుంచి ఫాస్ట్ట్రాక్ విధానంలో సత్వర అనుమతులు ఇప్పించాలని లేఖలో ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో అందుబాటులోకి వచ్చిన 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించామని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను మే 6న నాగర్కర్నూల్ సీఈ నివృత్తి చేసినా అనుమతులు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్కు సీడబ్ల్యూసీలోని ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ నుంచి రావాల్సిన అనుమతులను సత్వరమే ఇప్పించాలని కోరారు. డైరెక్టరేట్ కోరిన మేరకు అదనపు సమాచారాన్ని ఈ నెల 8న ఈఎన్సీ (జనరల్) వివరంగా పంపించారని తెలియజేశారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి కృష్ణా ట్రిబ్యునల్–2 వెంటనే తీర్పు వెలువరించేలా సూచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తీర్పు వస్తే నిర్మాణంలోని తమ ప్రాజెక్టులకు సత్వర అనుమతులు పొందగలమన్నారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల్లసాగర్ ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దని సీడబ్ల్యూసీ, ఇతర చట్టబద్ధ సంస్థలను ఆదేశించాలని ఉత్తమ్ సూచించారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ గత నెల 21న టెండర్లను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోండి.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని నిలువరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. డ్యామ్ ఎత్తును 524.256 మీటర్లకు పెంచేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రూ. 70 వేల కోట్ల వ్యయంతో అనుమతులిచ్చిందని.. ఆల్మట్టి ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రొగ్రామ్ (ఏఐబీపీ) కింద ప్రాణహిత–చేవెళ్ల, సీతారామ–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి, ముక్తేశ్వర్ ఎత్తిపోతల, మోడికుంటవాగు, చనాకా–కొరాటా ప్రాజెక్టులను చేర్చి కేంద్ర నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే ముక్తేశ్వర్, చనాకా–కొరాటా, మోడికుంటవాగు, సీతారామ ప్రాజెక్టులకు టెక్నో–ఎకనామిక్ వయబిలిటీ అనుమతులను టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) జారీ చేసిందని గుర్తుచేశారు. దీంతో ఏఐబీపీ కింద చేర్చడానికి ఈ ప్రాజెక్టులు అర్హత సాధించాయని పేర్కొన్నారు. -
హైదరాబాద్.. రీ రిలీజ్కా బాప్
సినిమా అంటేనే వినోదం.. భారతీయుల జీవితంలో ఒక భాగం. థియేటర్లో కొత్త మూవీ రిలీజ్ అయినప్పడే కాదు.. పాత సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రీన్పై విడుదల అయినా జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రీరిలీజ్ సినిమాలను ఆదరించడంలో భారత్లో మన హైదరాబాద్ ముందుండటం విశేషం. థ్రో బ్యాక్–2025 పేరుతో...సినిమాలు, లైవ్ ఈవెంట్స్, నాటకాలు, కచేరీలు, క్రీడల ఆన్లైన్ టికెటింగ్లో మార్కెట్ లీడర్ బుక్మైషో.. థ్రోబ్యాక్–2025 పేరుతో రూపొందించిన నివేదిక ద్వారా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా 58 లక్షల మంది రీరిలీజ్ సినిమాలను థియేటర్లలో వీక్షించారు. రీరిలీజ్ విభాగంలో దేశంలో ఇంటర్స్టెల్లర్ టాప్లో నిలిచింది. అభిమాన తారల సినిమా మళ్లీ వెండి తెరపైకి రావడం ఒక ఎత్తు అయితే.. ఏళ్లు గడిచినా ఆ చిత్రం తాలూకా జ్ఞాపకాలు, కథ, పాత్రలు వీక్షకుల మదిలో ఎంత పాతుకుపోయాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. రీరిలీజ్ మూవీలకు అడ్డాగా మన భాగ్యనగరి నిలవడం గమనార్హం. మరో నగరానికి వెళ్లి మరీ.. లైవ్ ఈవెంట్స్ను ఆస్వాదించేందుకు జనం గడప దాటుతున్నారు. అంతేకాదు మరో నగరానికి వెళ్లి మరీ ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్లోని 1,32,000 సీట్ల సామర్థ్యం గల నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన కోల్డ్ప్లే లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఈవెంట్తో స్థానికంగా రూ.649 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. భారతీయులు వినోదాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకున్నారని నివేదిక తెలిపింది. ఇందుకోసం ఖర్చుకూ వెనుకాడడం లేదు. 18 లక్షల మందికిపైగా సోలోగా వెళ్లి ఈవెంట్స్ను ఎంజాయ్ చేశారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇది శక్తివంతమైన నిదర్శనం. ముఖ్యంగా పట్టణ మిలీనియల్స్, జెన్జీ ప్రేక్షకులు సోలో హాజరును సామాజిక వైఫల్యానికి బదులుగా స్వీయ భరోసాకు చిహ్నంగా భావిస్తున్నారు. వినోదానికే పండుగ» దేశవ్యాప్తంగా దసరా వీకెండ్లో 68 లక్షల మంది థియేటర్లలో అడుగుపెట్టారు. సంఖ్యాపరంగా ఆ తర్వాతి స్థానంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ నిలిచింది. » ముందస్తు టికెట్ల బుకింగ్లో రజనీకాంత్ ‘కూలీ’మూవీ రికార్డు సృష్టించింది. రిలీజ్కు ముందే 24 లక్షల మంది తమ టికెట్లను సొంతం చేసుకున్నారు. » కాంతార చాప్టర్–1 సినిమాను 6 లక్షల మందికిపైగా అభిమానులు రెండుసార్లు వీక్షించారు. » ఒక నగరం నుంచి మరోచోటకు వెళ్లి 5.62 లక్షల మంది ఫ్యాన్స్ లైవ్ మ్యూజిక్ను ఆస్వాదించారు.» రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య థియేటర్లకు పరుగుతీయడంలో బెంగళూరు వరుసగా రెండేళ్లు టాప్లో నిలిచింది. » 34,086 లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 17% పెరిగింది. » ప్రీమియం సీట్స్ బుకింగ్స్ రెట్టింపు అయ్యింది. అభిమానులు వీఐపీ సీట్స్, ఎలివేటెడ్ డెక్స్, ప్రీమియం లాంజ్, ఖరీదైన ఆతిథ్యం కోరుకుంటున్నారు. » లైవ్ ఎంటర్టైన్మెంట్ వీక్షకుల సంఖ్య వైజాగ్లో 409%, వడోదర 230, ఇండోర్లో 214, షిల్లాంగ్లో 213% పెరిగింది. » నాటక ప్రదర్శనలు వీక్షిస్తున్న అభిమానుల సంఖ్య 45% అధికమైంది. -
తెలంగాణలో పార్టీ పనితీరుపై రాహుల్గాంధీ సంతృప్తి
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మెస్సీ, రేవంత్రెడ్డిల మధ్య జరిగే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించేందుకు హైదరాబాద్కు వచ్చిన రాహుల్గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారని, ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన విషయాలను వివరించారని తెలిపాయి. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, మున్ముందు ఇదే పనితీరు కనబర్చాలని సూచించారని సమాచారం. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లు ఒకే కారులో రాహుల్తో కలిసి వచ్చారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాహుల్గాందీకి సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు. ఫీజు బకాయిలు చెల్లించాలి: కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కోసం నవంబర్ 17 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థి నాయకుడు రాకేశ్ దత్తా చేస్తున్న పాదయాత్ర 250 కి.మీ.తో శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రాకేశ్ దత్తా బృందాన్ని కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ దత్తా మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని 20 రోజులుగా పాదయాత్ర చేశానన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దని విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఖమ్మం నుంచి రాకేశ్ దత్తాతో పాటు విద్యార్థి నాయకులు గోనె శ్రీశ్రీ, ముదిగొండ పవన్, వాజెడ్ల అనిల్ తదితరులున్నారు. -
కాంగ్రెస్ అక్రమాలపై ప్రజాతీర్పు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, కాంగ్రెస్ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ నెల 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవడమే దీనికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులు తట్టుకుని ప్రజల మద్దతుతో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు శనివారం నందినగర్ నివాసంలో కేటీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ నేతలు, సర్పంచ్లు వందలాదిగా తరలిరావడంతో నందినగర్ నివాసం సందడిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో సర్పంచ్లుగా గెలుపొందిన వారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ను కలిశారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలవడం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కేటీఆర్ను కలిసిన వారిలో నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఉన్నారు. మరో వారం, పదిరోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచ్లను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామేశ్వరం కేఫ్లో అఖిలేశ్ యాదవ్తో కేటీఆర్ లంచ్ హైదరాబాద్ మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో కలసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. కేఫ్ యజమాని శరత్ ఇద్దరు నేతలకు ఘన స్వాగతం పలికి లంచ్ ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్.. హైదరాబాద్లోనూ రామేశ్వరం కేఫ్ను విజయవంతంగా నడుపుతుండటంపై యజమాని శరత్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కాగా, లంచ్ అనంతరం కేటీఆర్, అఖిలేశ్ యాదవ్తో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు. -
నేడే రెండో దశ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29,917 వార్డుసభ్య స్థానాలకు 71,071 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మర్నాడు ఆ ఎన్నికను చేపడతారు. రెండో విడతకు సంబంధించి 5 చోట్ల సర్పంచ్ స్థానాలతోపాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. అలాగే రెండు సర్పంచ్ స్థానాలు, 18 వార్డు ఎన్నికలపై కోర్టులో స్టే ఉండటంతో అక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు. 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్రాణి కుముదిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 3–4 పోటీ రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది. రెండో విడతలో... మొత్తం మండలాలు నోటిఫై: 193 గ్రామ పంచాయతీలు నోటిఫై: 4,333 వార్డులు నోటిఫై: 38,350 పోలింగ్ స్టేషన్లు: 38,337 రెండోదశలో ఓటర్ల సంఖ్య: 57,22,665 పురుషులు: 27,96,006 మహిళలు: 29,26,306 ఇతరులు: 153 పోలింగ్ జరగనున్న పంచాయతీలు: 3,911 పోలింగ్ జరిగే వార్డులు: 22,917 సర్పంచ్ అభ్యర్థులు: 12,782 వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 71,071 ఆర్వోలు నియామకం: 30,661 పోలింగ్ సిబ్బంది: 93,905 మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడు దశల ఎన్నికలకు) వెబ్కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,769 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 46,026 -
మెదక్: ప్రాణం తీసిన ఓటు..!
సాక్షి, మెదక్: పెద్దశంకరంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగింది.మృతుల్లో దంపతులు సహా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు. -
రామేశ్వరం కేఫ్లో అఖిలేష్ యాదవ్తో కేటీఆర్ భోజనం
సాక్షి, హైదరాబాద్: రామేశ్వరం కేఫ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం(డిసెంబర్ 13, శనివారం) రామేశ్వరం కేఫ్ రుచులను ఆస్వాదించారు. అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి అఖిలేష్ యాదవ్ తెలుసుకున్నారు. అఖిలేష్కు కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.రామేశ్వరం కేఫ్ యజమాని శరత్.. ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రామేశ్వరం కేఫ్లో లంచ్ అనంతరం, అఖిలేష్ యాదవ్, కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. -
సీఎం రేవంత్ జోరు కొనసాగేనా..?
మెస్సీ రాక.. మెస్సీ రాక.. ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మెస్సీ హైదరాబాద్కు రానున్న తరుణంలో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్. ఇదే కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి ఆటవిడుపు గురించి సరదాగా మాట్లాడుకుంటే..మెస్సీతో మ్యాచ్ను సీఎం రేవంత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే ఆయన తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్బాల్ ప్రాక్టీస్ను చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు రేవంత్. అందుకోసం యూనివర్శిటీకి చెందిన ఫుట్బాల్ క్రీడాకారులతో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మెస్సీ మొత్తంగా స్టేడియంలో ఉండే సమయం 20 నిమిషాలే. అందులో సీఎం రేవంత్తో ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు. అయినప్పటికీ దీన్ని సీఎం రేవంత్ సరదాగా తీసుకోవడం లేదు. సీరియస్గానే తీసుకున్నట్లున్నారు. అందుకోసమే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఫుట్బాల్ క్రీడాకారులకు సీఎం రేవంత్ దీటుగానే బదులిస్తూ తన కిక్లతో అలరిస్తున్నారు. అంతే కాకుండా తన పాస్లతో కూడా ఆకట్టుకుంటున్నారు రేవంత్. అదే జోరు కొనసాగేనా..?నేటి ఐదు నిమిషాల మెస్సీతో మ్యాచ్లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాలి. రాష్ట్ర ఫుట్బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన రేవంత్.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో చూడాలి. మెస్సీతో గేమ్ అంటే మామూలు కాదు.. ఆ విషయం రేవంత్కు తెలుసు. అందుకే అంత ప్రాక్టీస్ చేశారు రేవంత్,.ఫుట్బాల్ మ్యాచ్ కోసం టెక్నికల్గా పుంజుకుని మరీ తన వార్మప్ మ్యాచ్లను కొనసాగించారు రేవంత్. ఒకవేళ పొరపాటను మెస్సీతో గేమ్లో రేవంత్ పైచేయి సాధించారంటే ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చాలా స్పల్ప సమయం పాటు జరిగే మ్యాచ్ కాబట్టి పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే రేవంత్ అద్భుతం చేసి మెస్సీని ఆశ్చర్యపరుస్తాడా? అనేది ఫుట్బాల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. -
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్ప్లస్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు . -
సోషల్ మీడియా పోస్టులపై ఈటెల రాజేందర్ అసహనం
సాక్షి, హన్మకొండ: బీజేపీ నేత ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ బండి సంజయ్ PRO సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.నేను బీజేపీ పార్టీ ఎంపీని. నేను కూడా కొన్ని పోస్టులు చూశాను. అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అసలు అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా? ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారు. వీటిపైన పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. రెండో, మూడో విడత ఎన్నికలు అయ్యాక జరిగిన పరిణామాలన్నీ అధిష్ఠానానికి చెప్తానని ఈటెల పేర్కొన్నారు.అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేయడం, పార్టీ లోపల విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కోల్కత్తా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో కోల్కత్తా స్టేడియంలో జరిగిన పరిస్థితుల దృష్టా ఉప్పల్ స్టేడియంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్చలు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో, ఉప్పల్ స్టేడియం వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది.కోల్కత్తా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తం.కోల్కత్తా ఘటన కారణంగా ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాల మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. మెస్సీ పర్యటన దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. జెడ్ కేటగిరి భద్రతతో పాటు ప్రత్యేక బలగాల మోహరించినట్టు చెప్పారు. కాగా, 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మరోవైపు.. మెస్సీ వస్తున్న నేపథ్యంలో ఫలక్నామా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు.. మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో కోల్కత్తా స్టేడియంకు వచ్చిన మెస్సీ.. అలా వచ్చి.. ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తంచేశారు. దీంతో, కోల్కత్తాలోని స్టేడియంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. Kolkata, West Bengal: Angry fans vandalise the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the eventA fan of star footballer Lionel Messi said, "Absolutely terrible event. He came for just 10 minutes. All the leaders and ministers surrounded him. We couldn't see… pic.twitter.com/a3RsbEFmTi— ANI (@ANI) December 13, 2025 #WATCH | Kolkata, West Bengal: Angry fans resort to vandalism at the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the event. Star footballer Lionel Messi has left the Salt Lake Stadium in Kolkata. A fan of star footballer Lionel Messi said, "Absolutely terrible… pic.twitter.com/TOf2KYeFt9— ANI (@ANI) December 13, 2025 -
సర్పంచ్ ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయం..!
రాజన్న సిరిసిల్ల జిల్లా: చింతల్ఠాణా ఓటర్లు ఎన్నికల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ప్రచార సమయంలోనే గుండెపోటుతో మరణించాడు. అయితే ఎన్నికల్లో మరణించిన వ్యక్తికే ఓట్లు వేసి గ్రామస్తులు గెలిపించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చెర్ల మురళికి కత్తెర గుర్తు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో అలసిపోయి ఇంట్లో నిద్రిస్తుండగా ఈనెల 3న గుండెపోటుతో మరణించాడు. కానీ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో ఆ ఊరి ఓటర్లు భారీ మెజార్టీతో చనిపోయిన వ్యక్తి మురళిని గెలిపించారు. దీంతో సర్పంచ్ ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు వచ్చిన ఓట్లు..చింతల్ఠాణా గ్రామపంచాయతీకి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ బలపరిచిన కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బడుగు శ్రీనివాస్కు 40, ఇండిపెండెంట్ మంత్రి రాజలింగంకు 160, బీజేపీ బలపరిచిన సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. నోటాకు 5, చెల్లని ఓట్లు 44 పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. ఉపసర్పంచ్గా గొట్ల కుమార్యాదవ్ ఎన్నికయ్యారు. అయోమయంలో అధికారులుపోటీ చేసిన వ్యక్తి మరణిస్తే.. శాసనసభ ఎన్నికలు అయితే వాయిదా పడుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగించారు. అప్పటికే ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు ఇవ్వడంతో ఎవరికి వారు ప్రచారంలో ఉన్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి గుర్తును మార్పు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ముందుగానే ముద్రించిన బ్యాలెట్ పత్రాలు కావడంతో ఏమీ చేయలేక అధికారులు నోటాతో కలిపి ఆరు గుర్తులున్న బ్యాలెట్పత్రంతో ఎన్నికలు నిర్వహించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సానుభూతి పవనాలు వీచి చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.దీనిపై క్లారిటీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాశారు. సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఉన్న అభ్యర్థుల్లో రెండో స్థానం పొందిన వ్యక్తికి సర్పంచ్గా అవకాశం ఇస్తారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు చెబుతున్నారు. -
కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు..!
1 కోకాపేట్ మరోసారి రియల్ ప్రకంపనలను సృష్టించింది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) గత నవంబర్, ఈ డిసెంబర్ నెలల్లో మూడు దఫాలుగా నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో 29 ఎకరాలపైన రూ.3,862 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఇక్కడ భూమి హాట్కేక్లాగే అమ్ముడు కావడం విశేషం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కొలువుదీరిన పడమటి ప్రాంతం కార్పొరేట్ సంస్థలకు కొంగు బంగారంగా మారింది. కోకాపేట్ నియోపోలిస్ లే అవుట్లో 2021లో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో ఈ భూములపై సుమారు రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్లో 45.33 ఎకరాలను విక్రయించగా, రూ.3,300 కోట్లు లభించాయి. ఈసారి 29 ఎకరాలపైన రూ.3,862 కోట్లు లభించింది. 2023లో ఎకరం గరిష్టంగా రూ.100.75 కోట్లకు విక్రయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.151 కోట్లు పలికింది. రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి ఇంతటి భారీ స్థాయిలో స్పందన లభించడంతో ఇదే ప్రాంతంలో ఉన్న మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమవుతోంది.2 ఒకేచోట సకల సదుపాయాలు.. ఒకవైపు ఔటర్రింగ్రోడ్డు, మరోవైపు రాయదుర్గం వరకు కేవలం 5 కిలో మీటర్ల పరిధిలోనే వందలాది కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు రూ.కోట్లలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు అన్ని రకాల సదుపాయాలతో నియోపోలిస్ లే అవుట్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. సుమారు 200 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు మొదటి నుంచీ నియోపోలిస్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించగా రెండో దశలో 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించారు. మూడో దశలో 15 నుంచి 20 వరకు ఉన్న భూములకు బిడ్డింగ్ నిర్వహించారు. 3 రూ.7వేల కోట్లు లక్ష్యంగారియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న ఈ స్పీడ్ను ఇలాగే కొనసాగించేందుకు కొత్త సంవత్సరంలో మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. దీని ద్వారా సుమారు రూ.7 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎకరం సగటున రూ.100 కోట్ల చొప్పున విక్రయించినా నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రైజింగ్–47లో భాగంగా భారీ ఎత్తున ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.కోకాపేట్ ప్రత్యేకతలు.. కోకాపేట్ నియోపోలిస్ సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉంది. సుమారు రూ.300 కోట్లతో హెచ్ఎండీఏ ఈ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు తదితర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్లు వెడల్పుతో అంతర్గత రోడ్లను నిర్మించారు. నియోపోలిస్లో ఎన్ని అంతస్తులైనా హైరైజ్ బిల్డింగ్లను నిర్మించుకోవచ్చు. ఔటర్ రింగ్రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్కు 5 నిమిషాలు, ఎయిర్పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. -
Suma Kanakala: అది మా డేటింగ్ స్పాట్..
మా కుటుంబం మెట్టుగూడలో ఉండేది.. తరచూ సంగీత్ థియేటర్లో సినిమాలు చూసేందుకు వచ్చే వాళ్లం. రాజీవ్ కనకాలతో నా డేటింగ్ స్పాట్ అదే. ఇక్కడే పాప్కార్న్ తింటూ, కూల్డ్రింక్స్ తాగుతూ టైంపాస్ చేసే వాళ్లం. – సుమ, ప్రముఖ యాంకర్ రీల్ టు హీల్..సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులో 1969లో వెలిసిన సంగీత్ థియేటర్ ఇంగ్లిష్ సినిమాలకు ఐకానిక్ వేదిక. ఎలాంటి మలీ్టఫ్లెక్స్లు లేని సమయంలో బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో పాటు అనేక బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 2008లో ఈ థియేటర్ మూతబడడంతో అదే స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మితమైంది. ప్రస్తుతం ఈ స్థలంలో 300 పడకల మెడికవర్ ఆస్పత్రి వచ్చింది . అప్పటి రీల్ నుంచి ఇప్పుడు రోగాలను హీల్ చేసే ఆస్పత్రిగా అవతరించింది. అప్పట్లో తెరపై అనేక మంది నటుల హీరోయిజాన్ని ప్రదర్శించిన ఈ ప్రదేశంలో.. నేడు అనేక మంది ప్రాణాలను కాపాడుతూ నిజమైన హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అయితే ఇప్పటికీ సంగీత్ ల్యాండ్ మార్క్ అలాగే స్థిరపడి ఉండగా రానున్న రోజుల్లో దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కంగ్రాట్స్ డాడీ..
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు. -
ఓటరు మహాశయులకు సాష్టాంగ నమస్కారం!
రంగారెడ్డి జిల్లా: తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ అభ్యర్థి రాయికంటి భిక్షపతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉన్నానని, తనను ఆశీర్వదిస్తే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిధులు తెస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఓటర్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఓటు వేయమని అభ్యర్థించారు.నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవిమెట్పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు. -
Sarpanch Election: నా డబ్బులు నాకు ఇచ్చేయండి..!
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది. సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు. బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మెస్సీతో మేస్త్రీ ఫుట్బాల్.. ఆసుపత్రుల్లో గురుకుల విద్యార్థులు: హరీష్
సాక్షి, కోఠి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్లే సమయం ఉంది కానీ.. గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు.బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ శనివారం ఉదయం విద్యార్థులను పరామర్శించి.. ఫుడ్ పాయిజన్కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో వసతులు, భోజనం కూడా సరిగా లేదు. 90 మంది బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఫుట్బాల్ ఆడటంలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారు. మెస్సీతో మేస్త్రీ ఫుట్బాల్ ఆట కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కబ్జాలు, కమీషన్లకే రేవంత్ రెడ్డి పరిమితం.. పిల్లలను పట్టించుకోవడం లేదు. 61 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. పిల్లలను పరామర్శించరా?. రేవంత్ది విజన్ 2047 కాదు.. పిల్లల పాలిటి పాయిజన్ 2047.మొన్న శామీర్పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మాదాపూర్లో 43 మంది విద్యార్థులు కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని విద్యార్థులు ఉన్నారు. దొడ్డు బియ్యం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఫుట్బాల్ ఆడటంలో రేవంత్ బిజీగా ఉన్నారు. ప్రజల సొమ్ముతో సీఎం సోకులు తీర్చుకుంటున్నారు. కబ్జాలు, కమీషన్లకే టైమ్ సరిపోవడం లేదా?. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు. బాత్ రూమ్లు కడిగే బ్రష్లతో.. వంట సామన్ కడుగుతున్నారట.చలి తీవ్రత పెరిగింది. చల్ల నీళ్లతో అమ్మాయిలు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లలో 116 మంది విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. విద్యా కమిషన్ ఎక్కడికి పోయింది?. పేదల మనసులు చదువుతా అని డైలాగ్స్ కొట్టడం కాదు.. పేద పిల్లల ఆకలి తీర్చండి. రాహుల్ గాంధీ పేదల కోసం రాడు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడు. ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ వస్తారట. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే రాహుల్ ఎందుకు అడగడం లేదు?. కోఠి, నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అడిగి తెలుసుకోవాలని రాహుల్కు విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నారులు.. నేను పోను గురుకుల పాఠశాలకు అన్నట్లుగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాత్రి వరకూ కొనసాగిన విచారణ అనంతరం, రెండో రోజు కూడా కీలక అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్టు సమాచారం.విచారణ పురోగతిని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో, ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలిస్తోంది.గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో, సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. FSL నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా, సింక్ అయిన డేటా వివరాల కోసం యాపిల్, జిమెయిల్ కంపెనీల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రక్రియలో సిట్ ఉంది. క్లౌడ్ సర్వర్లలో ఉన్న డేటా, లాగిన్ వివరాలు, యాక్సెస్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే తన డివైస్ల నుంచి తొలగించింది కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమేనని ప్రభాకర్ రావు వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన వాగ్మూలంలో ఎంతవరకు నిజం ఉందన్నది యాపిల్, జిమెయిల్ సంస్థల నుంచి వచ్చే డేటాతో తేలనుంది.రెండో రోజు విచారణలో పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు?, ఆదేశాలు ఎవరిచ్చారు?, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సమకూర్చే దిశగా సిట్ దర్యాప్తు వేగం పెంచింది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత మంది అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగే అవకాశం ఉంది. -
బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
హైదరాబాద్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమన్నారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ‘ప్రైడ్ ప్లేస్’తో సమస్యల పరిష్కారం: చారుసిన్హా.. ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశామని, సీఐడీ, మహిళా భద్రత విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్ను ఆశ్రయించవచ్చన్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. ట్రాన్స్జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కలి్పంచేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తప్సీర్ ఇకుబాల్, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రత విభాగ డీసీపీ లావన్యనాయక్ జాదవ్, సైబరాబాద డీసీపీ సృజనతో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నేను వస్తున్నానని రోడ్లు వేశారు..
హైదరాబాద్: ఇరవై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే నన్ను తీసి రోడ్డుపై వేశారని.. తాను మొండిదానినని ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ‘జాగృతి జనం బాట’కార్యక్రమం మూడో రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, నాగమయ్యకుంట బస్తీలలో పర్యటించి అనంతరం రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అడిగే వారు ఉంటే ఏ సమస్యకైనా ముందడుగు పడుతుందన్నారు. అందులో భాగంగానే సమస్యలపై నిలదీసేందుకు తాను ముందుకు వచ్చానని తెలిపారు. నేను వస్తున్నానని అంబర్పేటలో రోడ్లు వేశారు.. తెలంగాణ రాకముందు హైదరాబాద్ బస్తీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేరుకు హైదరాబాద్లో ఉన్నామే తప్ప గ్రామాల్లో ఉన్న దానికంటే ఘోర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి అంబర్పేటలో రాత్రికి రాత్రి రోడ్లు వేశారని, యాకత్పురాలో మంచినీటి కాలుష్య సమస్యను పరిష్కరించారని చెప్పుకోచ్చారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచి్చన ఏ హామీని పరిష్కరించలేదన్నారు. అంతకు ముందు బోనాలతో, గుర్రపు బగ్గీలతో కవితకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహేందర్, శివారెడ్డి, మనోజ్గౌడ్, డేవిడ్, మీనా తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలి కాచిగూడ: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనం భాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ముసారాంబగ్ బ్రిడ్జి పనులపై ఆరా..అంబర్పేట: అంబర్పేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జనంబాట కార్యక్రమంలో శుక్రవారం అంబర్పేట నియోజకవర్గంలో పలు సమస్యలను పరిశీలించారు. అంబర్పేట ఫ్లైఓవర్ సరీ్వసు రోడ్డు, అలీకేఫ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ముసారాంబగ్ బ్రిడ్జి పనులను ఆమె జాగృతి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం అంబర్పేట మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట పలువురు జాగృతి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. -
Lionel Messi: భారీ బందోబస్తు
ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్కు భారీ బందోబస్తు కల్పించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టేడియం బయటా లోపలా కలిపి 450 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలను అమర్చి పర్యవేక్షణ కోసం మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఆయన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మాట్లాడారు. మెస్సికి జెడ్ కేటగిరీ బందోబస్తు ఉంటుందని సీపీ వెల్లడించారు. ఆయన ప్రయాణానికి ఆటంకం ఏర్పడకుండా ప్రత్యేక గ్రీన్ చానల్ రూట్మ్యాప్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియం వద్ద టికెట్ విక్రయాల్లేవ్.. స్టేడియం ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో టికెట్లను, పాస్లను విక్రయించడం లేదని సీపీ స్పష్టం చేశారు. టికెట్ లేనివారు స్టేడియం వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నారు. మ్యాచ్ను టీవీల్లో వీక్షించాలని సూచించారు. 3 గంటల ముందే అనుమతి... టికెట్లు, పాస్లున్న వారిని స్టేడియంలోకి 3 గంటల ముందే అనుమతించనున్నట్లు సీపీ తెలిపారు. ఆట ప్రారంభమయ్యే సమయానికి వచ్చి ఆందోళన పడవద్దని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మెట్రో రైల్, ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలన్నారు మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరీ్ణత స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలని సీపీ సూచించారు. టికెట్ ఒకసారి స్కాన్ అయిందంటే.. మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విషయంలో నిర్వాహకులు అనంత్ మాట్లాడుతూ.. టికెట్ మొబైల్లో సాఫ్ట్ కాపీ రూపంలోనే ఇస్తారని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రవేశం ఉంటుందన్నారు. ఒకసారి స్కాన్ అయితే మళ్లీ వినియోగించే అవకాశం ఉండదన్నారు. పాస్ హోల్డర్లు బార్ కోడ్ ఉన్న ఫిజికల్ పాసులు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు, జిరాక్స్, స్క్రీన్ షాట్లను అనుమతించబోమన్నారు. -
మెస్సీ మేనియా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లో వేచిన సాయంత్రం.. ఈ రోజే సాకారం.. నగరమంతా మంత్రముగ్ధం.. ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల కోలాహలం.. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మెస్మరైజ్లో మునిగితేలే అపూర్వ ఘట్టం.. భాగ్య నగరం క్రీడా స్ఫూర్తితో ఓలలాడే అరుదైన సమయం.. శనివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదిక కానుంది. అర్జెంటీనా సూపర్స్టార్ లియోనెల్ మెస్సీ పాల్గొనే ప్రత్యేక మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి 20 నిమిషాల పాటు మ్యాచ్లో పాల్గొననుండటం మరో విశేషం. భావి ఫుట్బాల్కు నాంది.. ప్రస్తుతం హైదరాబాద్లో క్రికెట్, టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్ వంటి క్రీడలకు మంచి అభిమాన వలయం ఉన్నప్పటికీ, ఫుట్బాల్ అంతగా పెద్ద స్థానాన్ని సంపాదించలేదు. అయితే.. మెస్సీ వంటి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, అంతర్జాతీయ ప్రమాణం ఉన్న ఈవెంట్ ఇంతకుముందు లేకపోవడంతో ఈ మ్యాచ్ నగరానికి భవిష్యత్ ఫుట్బాల్ అభివృద్ధికి నాందిగా మారుతుందనే విశ్లేషణ నగర క్రీడాభిమానుల్లో వినిపిస్తోంది. అంబరాన్నంటే అతిపెద్ద సంబరం.. ⇒ మ్యాచ్లో మెస్సీతో పాటు లూయిస్ సూయారేజ్, రోడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. ఈ మ్యాచ్తో నగరంలో ఫుట్బాల్ పట్ల ఆసక్తిని పెంచే ప్రేరణగా భావిస్తూ, పాఠశాలలు, యూనివర్సిటీలలో ఫుట్బాల్ క్లబ్లు, ట్రైనింగ్ సెషన్ల పట్ల అభిరుచిని పెంచే అవకాశాలు పెరగనున్నాయి. హైదరాబాద్లో ఇప్పటి వరకు బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రధానంగా ఉండగా.. ఫుట్బాల్కు పెద్ద సంబరంగా ఈ ఈవెంట్ నిలుస్తోంది. ⇒ మెస్సీ వంటి ప్రపంచ విజేత కావడంతో ఫుట్బాల్ అంటే అభిమానమున్న యువతకు ఆదర్శంగా మారనుంది. మెస్సీ కొత్త క్రీడా దశదిశలను నిర్దేశించనున్నారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లలో ఫుట్బాల్ శిక్షణ, స్థానిక క్లబ్లు, క్రీడా స్థాయి పెంచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, మెస్సీ ఫుట్బాల్ క్లినిక్ ద్వారా చిన్న పిల్లలు, యువతకు అవకాశం ఇస్తున్నందున, స్థానిక క్రీడా సంబంధిత ప్రమాణాలు పెరిగేందుకు ఇది పెద్ద ప్రేరణగా ఉండనుందని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా.. నగరంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, ఇక్కడి క్రీడా సంప్రదాయానికి కొత్త చైతన్యం తీసుకొచ్చే అవకాశం వంటిదేనని చెప్పుకోవచ్చు. -
నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శని వారం హైదరాబాద్కి వస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీ వర్సెస్ రేవంత్ టీంల ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు రాహుల్ రానున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం రాత్రి ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు. రాహుల్ టూర్ ఇలా! కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయ ల్దేరనున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్తారు.అక్కడ రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ రాత్రి 7:15 గంటలకు బయల్దేరి 7:55 నిమిషాలకు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకుంటారు. మెస్సీ టీంతో రేవంత్ టీం ఆడే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షిస్తారు. ఆ తర్వాత రాత్రి 9:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరుతారు. 10:30 గంటలకు ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్తారు. -
మురికికాల్వలో బ్యాలెట్ పేపర్లు
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్ కేంద్రం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో.. బీఆర్ఎస్ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపించారు.నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లను ఆర్డీఓ అశోక్రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు. -
హార్డ్డిస్క్ల కోణంలో..
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు శుక్రవారం సిట్ కార్యాలయంలో లొంగి పోయారు. ఉదయం 11 గంటలకు తన కుమారుడితో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఉన్న సిట్ ఆఫీస్కు వచ్చారు. ఈయన్ని అధికారులు వారంపాటు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించనున్నారు. తొలి రోజు సిట్ ఏసీపీ పి.వెంకటగిరితోపాటు సంయుక్త పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రభాకర్రావును ప్రశ్నించారు. ఎస్ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్రావును ప్రశ్నిస్తున్న అధికారులు తొలిరోజు ధ్వంసం చేసిన, రీప్లేస్ చేసిన హార్డ్డిస్క్ల కోణంలో ప్రశ్నించారు. ఆధారాలు మాయం చేయడానికే..: సుదీర్ఘకాలంలో ఎస్ఐబీలో పనిచేసిన ప్రభాకర్రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతోనే 2023 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఆ రోజు రాత్రి ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్–కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లానని, అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను ఆఫ్ చేయించానని మరో నిందితుడు, ఎస్ఓటీ చీఫ్గా వ్యవహరించిన ప్రణీత్రావు వెల్లడించారు. ఈ వార్ రూమ్లో ఉన్న 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 26 హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేయడంతోపాటు మరో ఏడింటిని కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.ధ్వంసం చేసిన హార్డ్డిస్క్ల్ని మూసీ నదిలో పారేసినట్లు ప్రణీత్రావు అంగీకరించారు. ఇదంతా ప్రభాకర్రావు ఆదేశాల మేరకే చేసినట్లు అతడు వెల్లడించిన నేపథ్యంలో ఆ హార్డ్డిస్క్ల కోణంలో సిట్ ప్రశ్నలు సంధించింది. వీటికి ప్రభాకర్రావు స్పందిస్తూ నిర్ణీత కాలం తర్వాత డేటాను ధ్వంసం చేసే నిబంధన ఎస్ఐబీలో ఉందని, తమ వద్ద దేశ భద్రతకు సంబంధించిన, సున్నిత సమాచారం ఉంటుందని, అందుకే అలా చేస్తుంటామని చెప్పారు. అయితే నిబంధనల మేరకు కేవలం డేటాను డిలీట్ చేయాల్సి ఉండగా హార్డ్డిస్క్ల ధ్వంసం, రీప్లేస్ అనేది కేవలం ఆధారాలు మాయం చేయడానికే అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.ఈ కారణంగానే ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతోపాటు ఐక్లౌడ్, క్లౌడ్ల పాస్వర్డ్స్ను మార్చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. దీనికి స్పందించిన ప్రభాకర్రావు తాను ఎలాంటి ఆధారాల ధ్వంసానికీ ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగా అధికారులు మూసీ నది నుంచి, గ్రీన్లాండ్స్లోని ఎస్ఐబీ కార్యాలయం పరిసరాల నుంచీ కొన్ని ఆధారాలు గతంలో సేకరించారు. ఈ వివరాలను ప్రభాకర్రావు ముందు ఉంచి ప్రశ్నించగా, ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారని అధికారులు చెబుతున్నారు.బెదిరింపు వసూళ్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలతోపాటు ఎవరి ఆదేశాల మేరకు ఈ నేరాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలనూ సిద్ధం చేశారు. ప్రతి రెండు గంటలకు కాసేపు విరామం ఇస్తూ విచారించారు. ప్రభాకర్రావు కోరినప్పుడల్లా విశ్రాంతి, మందులు ఇస్తున్నామని, రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆయన నిద్ర కోసం కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. -
‘రింగు’కు హంగులు లేవు..
ఎనిమిది వరుసల రోడ్డు, చమక్కున మెరిసేలా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, రెండు వరుసల సర్విసు రోడ్డు, ఏ చిన్న రోడ్డుకు కూడా క్రాసింగ్ ఇబ్బంది లేకుండా కిలోమీటరుకు ఒక వంతెనతో దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్ప్రెస్వే రింగురోడ్డుగా నిలిచిపోవాల్సిన ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగురోడ్డు) ఇప్పుడు ఏ ప్రత్యేకతలు లేని సాధారణ జాతీయ రహదారిగా నిర్మాణం కాబోతోంది. ఆ రోడ్డు మీద వాహనాల రద్దీ సాధారణంగానే ఉండబోతోందని ట్రాఫిక్ స్టడీ ద్వారా తేల్చి ఎనిమిది వరుసలకు బదులు ఆరు వరుసల రింగురోడ్డే సరిపోతుందని ఇటీవల నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరిన్ని ప్రత్యేకతలపై వేటు వేసింది.సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం (162 కి.మీ. నిడివి)లో మొత్తం 204 వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిల్లో జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్ చేంజ్ వంతెనలు ఉంటాయి. మూసీనది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరానది మీద పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రా నది మీద తూప్రాన్ వద్ద మూడు పెద్ద వంతెనలుంటాయి. వాగులువంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాల్వలు, భవిష్యత్లో నిర్మించబోయే కొన్ని నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులుంటాయి.ప్రతి ముప్పావు కి.మీ.కు ఒకటి చొప్పున ఏదో ఒక నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు వీటిని భారీగా తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఎన్హెచ్ఏఐని ఆదేశించింది. సగటున ప్రతి రెండు కి.మీ.కు ఒకటి చొప్పున నిర్మించేలా డిజైన్ మార్చి వంతెనల సంఖ్యను తగ్గించాలని పేర్కొంది. వెరసి వాటి సంఖ్యను సగానికి సగం తగ్గించి వంద లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి వద్ద ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.మరో పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ భేటీ అయ్యి ట్రిపుల్ఆర్ బడ్జెట్కు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ తరుణంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ముందస్తు సమావేశం నిర్వహించి రింగురోడ్డు బడ్జెట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం, రోడ్డు నిర్మాణ వ్యయం, జీఎస్టీ, ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.21,550 కోట్ల అంచనా వ్యయం ఉంది.రింగురోడ్డు ఒక భాగానికి ఇంత భారీ వ్యయం సరికాదని, దీన్ని భారీగా తగ్గించాలని ఆదేశించారు. వంతెనల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాటిని సగానికి సగం తగ్గించటం ద్వారా ఖర్చును భారీగా తగ్గించొచ్చని తేల్చారు. వంతెనల సంఖ్య తగ్గితే కొన్ని చిన్న రోడ్లకు రింగురోడ్డును దాటేందుకు వీలుండదు. కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదించిన నీటి కాలువలకు కూడా ప్రస్తుతం దారి విడవాల్సిన అవసరం లేదని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ ఔట్... ఔటర్ రింగురోడ్డు తరహాలో రీజినల్ రింగురోడ్డుకు రోడ్డు పొడవునా లైటింగ్ వ్యవస్థ ఖరారైంది. కేంద్ర కార్యదర్శి ఆదేశంతో ఇప్పుడు దాన్ని తొలగించారు. పట్టణాలు, పెద్ద గ్రామాలు ఉన్న చోట మాత్రమే జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన తరహాలో సాధారణ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. మిగతా చోట్ల ఎలాంటి లైట్లు ఉండవు. దీంతో ధగధగలాడాల్సిన రింగురోడ్డు సాధారణ రోడ్డు తరహాలో రాత్రి వేళ చిమ్మ చీకట్లలోనే ఉండనుంది.యాక్సెస్ పాత్ మాయం తొలుత రింగురోడ్డుకు రెండు వరుసల సర్విసు రోడ్డును ప్రతిపాదించారు. నెల రోజుల క్రితం దాన్ని రద్దు చేసి ఆ స్థానంలో సాధారణ యాక్సెస్ పాత్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ యాక్సెస్ పాత్ను కూడా ఉపసంహరించుకున్నారు. ఏడు మీటర్ల సర్విసు రోడ్డుకు బదులు మూడు మీటర్ల యాక్సెస్ పాత్ ఉన్నా కొంత ఉపయోగం ఉండేది. కోట గోడ తరహాలో 5 మీటర్ల ఎత్తుతో ఉండే రింగురోడ్డును అనుకొని ఉండే పొలాలు, ఇతర ప్రైవేటు భూముల్లోకి వెళ్లేందుకు వీలుగా ఆ యాక్సెస్ పాత్ ఉపయోగంగా ఉంటుంది.సర్వీసు రోడ్డు తరహాలో ఫుత్పాత్, మధ్యలో డివైడర్ లాంటివి కాకుండా సాధారణ కచ్చా రోడ్డులాగా అది ఉంటుంది. దాని మీదుగా వెళుతూ పక్కనే ఉన్న ప్రైవేటు భూములోకి చేరుకునే వీలుంటుంది. ఇప్పుడు ఆ యాక్సెస్ పాత్ ఖర్చును కూడా తప్పించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అంటే రింగురోడ్డును ఆనుకొని ఎలాంటి రోడ్డు ఉండదు. కేవలం అంతమేర వదిలిన సాధారణ ఎగుడుదిగుడు ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. అందులో కనీసం కచ్చా రోడ్డు కూడా ఉండదు. వెరసి రింగురోడ్డును ఆనుకొని దిగువ గుండా వాహనాలు ముందుకు వెళ్లే వెసులుబాటు ఉండదు. పది రోజుల్లో కొత్త బడ్జెట్ కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి సూచన మేరకు పొదుపు చర్యలు పాటించటం ద్వారా ఎంత మేర బడ్జెట్లో కోత పెట్టొచ్చో ఎన్హెచ్ఏఐ అధికారులు లెక్కలేస్తున్నారు. మరో పదిరోజుల్లో రివైజ్డ్ ప్రాథమిక బడ్జెట్ను అందజేయాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. కొత్త లెక్కలతో మరోసారి భేటీ ఉంటుంది. దానికి ఆయన ఓకే చెబితే.. వెంటనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ముందుంచుతారు. ఆ కమిటీ ఓకే చెప్పగానే ఉత్తర రింగు టెండర్లు ఖరారు అవుతాయి. -
ఐ–ఫోన్లకూ తప్పని ఫేక్ లోన్యాప్ల బెడద
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ భద్రత పరంగా సురక్షితంగా భావించే ఐ–ఫోన్లకు ఫేక్లోన్ యాప్ల బెడద తప్పడం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగానే యాపిల్ యాప్ స్టోర్లో ఇటీవల మూడు ఫేక్ లోన్ యాప్లను గుర్తించినట్టు కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్) వెల్లడించింది. థిన్లోన్, రిష్నాలోన్, అంబాలా క్యాష్ అనేవి నకిలీ యాప్లు అని తెలిపింది.ఈ యాప్లను గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. ఈ యాప్లను డౌన్లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించి ఆ తర్వాత ఆన్లైన్ బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డాక్యు మెంట్లు లేకుండా లోన్లు ఇస్తామని ఊదరగొట్టే ఈ యాప్లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. అనుమానాస్పద యాప్లకు సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1930లో లేదా cybercrime. gov. in లో ఫిర్యాదు చేయా లని అధికారులు సూచించారు. -
దొంగిలించి.. తిరిగి అప్పగించి
చౌటుప్పల్: చోరీ చేసిన బంగారు ఆభరణాన్ని తిరిగి అదే ఇంటిముందు వదిలేసి వెళ్లాడొక దొంగ. దొరికి పోతానని భావించాడో.. మరేదైనా కారణ మో తెలియకపోయినా.. రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణా న్ని మాత్రం బాధితురాలి ఇంటి ముందు వదిలేసి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కాట్రేవు గ్రామంలో శుక్ర వారం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరా లివి. గ్రామానికి చెందిన గున్రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారు లు.. జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. వృద్ధ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు.ఎప్పట్లాగే బుధవారం ఉద యం 5 గంటలకు రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటినుంచి బయట కు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే పడుకుంది. ఆ సమయంలో తలుపు లకు గడియ పెట్టకపోవడంతో.. నేరుగా దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. పడుకు న్న వృద్ధురాలి తలకు దుప్పటి చుట్టి.. కొట్టి.. ఆమె దిండు కింద ఉన్న నాలుగున్న ర తులాల బంగారు పుస్తెలతాడుతో పారిపోయాడు. అయి తే దొంగ చోరీ చేసే ముందు వీధి దీపాలను ఆపేశాడు. ఇంత పకడ్బందీగా చో రీ చేసిన దొంగ కొత్త వ్యక్తి ఏమాత్రం కాదని, తమ గ్రామస్తుడేనని పలు వురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.ఘటన జరిగిన రోజు పోలీ సులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పోలీసు లు జాగిలాలు వస్తాయని, దొంగ ఎక్కడున్నా పట్టుకుంటాయని గ్రామంలో చర్చ జరిగింది. ఇలాగైతే తాను దొరికిపోతానని, పరువుపోతుందని భావించిన ఆ దొంగ.. రెండు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి బంగారు ఆభర ణాన్ని తిరిగి బాధితురాలికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటి తలుపు వద్ద పుస్తెలతాడు వదిలేసి వెళ్లాడు. పాలు తీసుకొచ్చేందుకు బయటికెళ్తున్న బాధితురాలి భర్త రంగారెడ్డి.. పుస్తెలతాడును గమనించి తీసుకున్నాడు. -
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్ఫోన్ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
బంజారాహిల్స్: ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు. అయితే ట్యూషన్లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్ను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు. పోలీసులు మానసపై బీఎన్ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది. -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
మొబైల్స్కు డ్రాయిడ్ లాక్ ముప్పు!
సాక్షి, హైదరాబాద్: కేవలం కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలు, ఐటీ ఉద్యోగులకు సంబంధించిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లకు మాత్రమే పరిమితమైన ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ ప్రస్తుతం స్మార్ట్ఫోన్లకూ విస్తరించాయి. ఆండ్రాయిడ్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని డ్రాయిడ్ లాక్ అనే మాల్వేర్తో సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నట్లు జిమ్పెరియం వెల్లడించింది. మొబైల్ఫోన్ సెక్యూరిటీ రంగంలో పేరుగాంచిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా అప్రమత్తత జారీ చేసింది. అపరిచిత మెయిల్స్, లింకులు, యాప్ల రూపంలో డ్రాయిడ్ లాక్ ఎటాక్స్ జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఒక్కసారి ఫోన్లో ప్రవేశిస్తే... ఈ మాల్వేర్తో కూడిన లింకులు, యాప్లను ఒకసారి క్లిక్ చేస్తే ఫోన్లో నిక్షిప్తం అయిపోతుంది. ఆ వెంటనే మాల్వేర్ ఆయా ఫోన్ల స్క్రీన్లను లాక్ చేస్తుంది. రిమోట్ యాక్సెస్ విధానంలో ఫోన్లోని ఎస్సెమ్మెస్లు, కాంటాక్టులు, ఆడియో రికార్డింగ్స్ తదితరాలకు సంబంధించిన యాక్సెస్ను సైబర్ నేరగాళ్లకు ఇస్తుంది. ఈ–కేటుగాళ్లు మాల్వేర్ ప్రోగ్రామింగ్ను ఆ విధంగా చేస్తున్నారు. ఫ్యాక్టరీ రీసెట్, లాక్ ప్యాట్రన్స్ను సైతం అధీనంలోకి తీసుకుంటున్నారు. కనీసం ఫోన్ను చార్జింగ్ చేయడానికి కూడా ఈ మాల్వేర్ అవకాశం ఇవ్వదు. ఫోన్ వినియోగదారులు ఎంత ప్రయత్నించినా అన్లాక్, రీసెట్, స్విచ్ఛాఫ్ చేయలేరు. కేవలం ఫోన్ స్క్రీన్పైన కనిపించేలా నేరగాడు పంపే సందేశాన్ని మాత్రమే చూడగలుగుతారు. బిట్ కాయిన్లలో డిమాండ్ చేస్తూ... కొన్ని సందర్భాల్లో ఈ మాల్వేర్ ఫోన్లోని డేటాను ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా అది యజమాని అధీనంలో లేకుండా చేస్తుంది. అలా ఎన్క్రిప్ట్ అయిన డేటాను డీక్రిప్ట్ చేయడానికి, ఫోన్ అన్లాక్ కోసం భారీ మొత్తం చెల్లించాలంటూ ఫోన్ స్క్రీన్పై సందేశం కనిపిస్తుంటుంది. కొందరు సైబర్ నేరగాళ్లు ఈ డ్రాయిడ్ లాక్ ఎటాక్స్తో ఫోన్లను అ«దీనంలోకి తీసుకుంటూ వాటిలోని యూపీఐ యాప్స్, నెట్ బ్యాంకింగ్లను వినియోగించి బాధితుడి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి ర్యాన్సమ్వేర్ ఎటాక్తో లాక్ అయిన కొన్ని ఫోన్ స్క్రీన్లపై నిర్ణీత కాలానికి కౌంట్డౌన్ టైమింగ్ కూడా డిస్ప్లే అవుతుంది. అన్లాక్, డిక్రిప్షన్ పాస్వర్డ్ను ఆ సమయం తర్వాత నిర్వీర్యం చేస్తామని.. ఇక మీ ఫోన్లోని డేటా శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని సైబర్ నేరగాళ్లు బెదిరిస్తుంటారు. ఈలోగా తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలోకి మార్చి తాము సూచించిన విధంగా పంపాలని స్పష్టం చేస్తున్నారు.ఎలాంటి ప్రయత్నం చేసినా నష్టమే.. ఎవరైనా ఆ టైమర్ను, సెల్ఫోన్ను, మాల్వేర్ ప్రోగ్రామ్ను మార్చాలని ప్రయత్నించినా.. బిట్ కాయిన్ రూపంలో చెల్లించినట్లు తప్పుడు వివరాలతో మెయిల్ పంపినా నేరగాళ్లు నిర్దేశించిన డెడ్లైన్ తగ్గిపోతూ కౌంట్డౌన్ టైమర్లో మార్పులు రావడం ఈ మాల్వేర్కు ఉన్న మరో లక్షణం. ఫిషింగ్ మెయిల్స్తోపాటు యాప్స్, లింకుల ద్వారా మాత్రమే ఈ ఎటాక్స్ జరుగుతాయని సైబర్క్రైమ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ తరహా ఎటాక్స్పై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అపరిచిత లింకులు, మెయిల్స్ను ఓపెన్ చేయడం, అనధికారిక లింకుల ద్వారా వచ్చే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలో ఈ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయని.. చాలా మంది వారి ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, డేటా కోసం సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసినంత సొమ్మును బిట్కాయిన్లుగా చెల్లిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తాలు అందిన తర్వాతే వారి ఫోన్లు అన్లాక్ అవుతున్నాయని వివరిస్తున్నారు. -
గులాబీ జోష్..
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ అంటోంది.పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానంగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
పోలవరం–నల్లమలసాగర్పై సుప్రీంకు!
సాక్షి, హైదరాబాద్: పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పక్కనపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం–నల్లమలసాగర్ను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాకుండా గోదావరి–కావేరి అనుసంధానాన్ని నల్లమలసాగర్ నుంచే చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ చర్యలను అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశాన్ని న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసులో తెలంగాణ తరఫున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం ఢిల్లీలో కలిసి కోరనున్నారు. ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీని ప్రతివాదిగా చేర్చి కేసు వేయాలని సింఘ్వీకి ఉత్తమ్ సూచించనున్నారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలపై మరో న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తున్నారు. ఆయన స్థానంలో సింఘ్వీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు డీపీఆర్కు ఏపీ టెండర్లు.. పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎస్ఆర్)ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖతోపాటు సీడబ్ల్యూసీకి అందించి మదింపు చేయిస్తోంది. మరోవైపు ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేయడానికి వీలుగా గత నెలలోనే టెండర్లు పిలిచింది. పోలవరం నుంచి నల్లమలసాగర్కు తొలిదశలో... నల్లమలసాగర్ నుంచి సోమశిలకు రెండోదశలో... ఆ తర్వాత కావేరికి తరలించాలని యోచిస్తోంది. కేంద్రం సంకేతాల నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి నీటిని తరలించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) నుంచి నీటి తరలింపునకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మతి తెలపగా... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నీటిని తరలించాలని సూచించింది. అంతేకాకుండా ఇచ్చంపల్లి బ్యాక్వాటర్ నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ కొన్ని షరతులతో ఇచ్చంపల్లికి అంగీకరించగా ఏపీ మాత్రం బేషరతుగా పోలవరం–నల్లమలసాగర్–సోమశిల–కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరడం.. అందుకు కేంద్రం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో దీన్ని అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ఉంది. -
అత్యధికమే.. అనుకూలమేనా?
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. బీఆర్ఎస్ పోటీపై నిశితంగా..... ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు. రెండు దశలకు మరింత పకడ్బందీగా.. తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


