ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో జరిగింది చిన్న పార్టీ కాదని, అదో పెద్ద డ్రగ్స్ మాఫియా అని, బడా రాకెట్ నడుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ యువతను చెడగొట్టడానికి ఈ డ్రగ్స్ మాఫియా పనిచేస్తోందని విమర్శించారు. ఈ ముఠా వెనుక ఉన్న వారిని ఈగల్ టీం బయటకు లాగుతుందని, త్వరలోనే ఈ రాకెట్లో ఉన్న వారి పేర్లు బయటకు వస్తాయని అన్నారు. ఆదివారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పదేళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, ఇప్పుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మనోహర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక నిలబడినందుకు తాండూరు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో పెకిలించేలా అందరూ సహకరించాలని, రోహిత్రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గాంధీభవన్ వద్ద దిష్టిబోమ్మల దహనం
కేటీఆర్తోనే తెలంగాణలోనే డ్రగ్స్ కల్చర్ వచ్చిందని రోహిత్రెడ్డి వ్యవహారంతో మరోమారు రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు అన్నారు. ఆదివారం ఉదయం గాంధీభవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబోమ్మను దహనం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించాలని, ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం సాయంత్రం గాం«దీభవన్ ఎదుట కేటీఆర్, పైలెట్ రోహిత్రెడ్డిల దిష్టిబోమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుర్రం శ్యాంచరణ్రెడ్డి, ఎర్రమల్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిధర్ తదితరులు పాల్గొన్నారు.


