అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
సనత్నగర్ (హైదరాబాద్): అనుమానం పెనుభూతమై కట్టుకున్న ఆలిని కడతేర్చింది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావంటూ కూరగాయలు కోసే కత్తితో భార్యను హతమార్చిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ వివరాలు తెలిపారు. తాండూరుకు చెందిన నరేశ్ (40), రేణుక (38) దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఫతేనగర్లోని వాసవీ బృందావన్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు కుమార్తెలున్నారు.
రేణుక గుర్తుతెలియని వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతోందంటూ తరుచూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మరోసారి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగి్వవాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ అక్కడే ఉన్న కూరగాయలు కోసే కత్తితో రేణుక గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
పిల్లల కళ్లముందే తల్లిని హతమార్చడం అందరినీ కలచివేసింది. పిల్లలు బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


