సుత్తెతో మోది.. డీజిల్‌ పోసి దహనం | Husband assassinated Wife and Father in Law | Sakshi
Sakshi News home page

సుత్తెతో మోది.. డీజిల్‌ పోసి దహనం

Mar 19 2026 2:04 AM | Updated on Mar 19 2026 2:04 AM

Husband assassinated Wife and Father in Law

రాజశ్రీ , రాజశేఖర్‌ , ప్రవీణ్‌

భార్య, మామను చంపిన భర్త

హనుమకొండ జిల్లాలో దారుణం

కాజీపేట అర్బన్‌: కన్న బిడ్డనిచ్చిన పాపానికి మామను, కట్టుకున్న భార్యను అతికిరాతకంగా సుత్తెతో తలపై మోది, ఇద్దరిపై డీజిల్‌ పోసి నిప్పంటించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హను మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని రాజీవ్‌గృహకల్ప సముదాయంలో బుధవారం చోటు చేసుకుంది. మృతు రాలి సోదరి తేజస్వి కథనం ప్రకారం.. కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలోని 5వ బ్లాక్‌ 24వ ప్లాట్‌లో బాషబోయిన రాజశేఖర్‌ (51) ఉంటున్నాడు. 

భార్య శ్రీలత సుమారు పదిహేనేళ్ల క్రితం గుండె నొప్పితో మృతి చెందింది. వీరికి ముగ్గురు కుమార్తెలు రాజశ్రీ, తేజస్వి, మనోజ్ఞ ఉన్నారు. రాజశేఖర్‌ ఆటో డ్రైవర్‌గా, వంట మనిషిగా పనులు చేస్తూ పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమార్తె రాజశ్రీని 2023లో వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ కుమార్తె తేజస్విని హనుమకొండలో ఉంటుండగా, మరో కుమార్తె డిగ్రీ చదువుతోంది. 

రాజశ్రీకి పెళ్లి సమయంలో రూ.3 లక్షల కట్నంతోపాటు ఇంటిసామగ్రి పెట్టి ఘనంగా పెళ్లి చేశాడు. వీరికి 2024లో బాబు జయాంశ్‌ జని్మంచగా, ఆరు నెలల క్రితం పాప పుట్టింది. ప్రవీణ్‌ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని మౌలాలిలో కోకాకోలా కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాప పుట్టిన నాటినుంచి వరకట్న వేధింపులతోపాటు అమ్మాయి పుట్టిందని, మరింత కట్నం తీసుకురమ్మని నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో రాజశ్రీ ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో కుడి చెయ్యి విరిగింది. దీంతో పనులు కూడా సరిగా చేయడం లేదని విసిగిస్తున్నాడు. 

నెలరోజుల క్రితం పాపకు అన్నప్రాసన చేయాలని తండ్రి వద్దకు రాగా, వారం రోజుల క్రితం వచ్చిన ప్రవీణ్‌ కూడా ఇక్కడే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఏమి జరిగిందో తెలియదు. బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్‌ మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై వెంట తెచ్చుకున్న సుత్తెతో నుదుటిపై దాడిచేశాడు. ఇద్దరికి తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది. ఇంకా బతికి ఉంటారని భావించిన ప్రవీణ్‌.. ఇద్దరిపై డీజిల్‌ పోసి నిప్పంటించాడు. 

ఆ తరువాత నిందితుడు తనకు వరుసకు అత్త (రాజశ్రీ పిన్ని) అయ్యే ఆమెకు ఫోన్‌ చేసి తన భార్య, మామ కాల్చుకుని చనిపోయారని సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే రాజశేఖర్‌ రెండవ కూతురు తేజస్వికి ఫోన్‌ చేసి సమాచారం తెలిపింది. హుటాహుటిన ఆమె రాజీవ్‌గృహకల్ప క్వార్టర్స్‌కు వచ్చారు. అప్పటికే రాజశేఖర్, రాజశ్రీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్ధితిలో ఉన్నారు. నుదిటిపై బలమైన గాయాలు ఉన్నాయి. 

తేజస్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, ప్రవీణ్‌ ఫిబ్రవరిలోనే వీరిని చంపాలని ప్లాన్‌ చేసుకున్నట్లు , అప్పుడే డీజిల్‌ కొనుగోలు చేసి క్యాన్‌ను క్వార్టర్‌లో ఓ మూలన పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement