సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓ చికెన్ సెంటర్పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నాడు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్ను స్థానిక ప్రజలకు, చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఇవాళ మధ్యాహ్నం సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ కే.రామచంద్రారెడ్డి తన సిబ్బందితో చికెన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. కాగా, సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది.


