సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో జనగణనపై ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. మే 11 నుండి జూన్ 9 వరకూ తొలివిడత జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో దశ జనగణన 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకూ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ వెల్లడించారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని పేర్కొన్నారు.
16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. కాగా జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణనే కీలకం.
దేశంలో చివరగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లోనే జరగాల్సి ఉండగా కోవిడ్–19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సెస్–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు.


