సాక్షి, హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్లకు కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నిన్న(మార్చి 17, మంగళవారం) 2 లక్షల 35 వేల 678 LPG సిలిండర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.
ఎల్పీజీ సిలిండర్లు రీ ఫిల్లింగ్ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదార్లకు ప్రభుత్వం సూచించింది. సిలిండర్ల డెలివరీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మానిటరింగ్ చేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. సగటున రోజుకు 2,15,151 ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ జరిగేవని.. నిన్న అంతకు మించి డెలివరీ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న IOCL నుండి 93,887(+1%) సిలిండర్లు, HPCL నుండి 84,156 (+11,98%)సిలిండర్లు, BPCL నుండి 57,635 (+22.63%)సిలిండర్లు మొత్తం 2,35,678 సిలిండర్లు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది.


