కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి | Sreedhar Babu With Tanzanian Team | Sakshi
Sakshi News home page

కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి

Mar 14 2026 4:56 PM | Updated on Mar 14 2026 6:15 PM

Sreedhar Babu With Tanzanian Team

సాక్షి, హైద‌రాబాద్‌: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారత, ఎమర్జింట్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలెప్మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.

శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాంజానియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ‘తెలంగాణ - టాంజానియా' మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సామాజిక, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బలమైన పునాదిగా మారిందన్నారు. ఆ దిశగా తెలంగాణ వేసిన అడుగులు ప్రపంచ పటంలో మన రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం, మెంటార్ షిప్, నైపుణ్య మార్పిడి అందిస్తామన్నారు. అక్కడ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్‌ ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

‘మీ సేవ’ ద్వారా డోర్ స్టెప్ సిటిజన్ సర్వీసెస్ డెలివరీ, ‘వీ హబ్’ మార్గ నిర్దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహాం, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం తదితర అంశాల్లో ఒక ‘నాలెడ్జ్ పార్ట్నర్’గా వ్యవహరిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై మార్గనిర్దేశం చేస్తామన్నారు. బ్లూ ఎకానమీ, టూరిజంలో టాంజానియా అవలంభిస్తోన్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసి... తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

‘డిజిటల్ ఎకానమీగా మారాలన్న మా లక్ష్య సాధనలో తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకం. ఐటీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో సాధించిన ప్రగతి, చేపట్టిన సంస్కరణలు మాకు స్ఫూర్తిదాయకం. అందుకే.. తెలంగాణతో కలిసి పని చేసేందుకు త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకుంటాం’ అని టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని సోరాగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఫాత్మా మబ్రూక్ ఖమిస్, జాంజిబార్ ఐసీటీ అథారిటీ సీఈవో శుకూరు అవాద్ సులేమాన్, ప్రెసిడెంట్స్ డెలివరీ బ్యూరో - హెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ జాన్ మహుండి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement