హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ఇన్సాపూర్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు.
కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సోమవారం రాత్రి కూడా హైదరాబాద్. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.
తెలంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.


