ఈ నెల 22న తొలి విడత నిధుల విడుదల
నర్మెట్టలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లను నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.
దీనికి కొనసాగింపుగా రెండో విడతను సుమారు 20 రోజుల తర్వాత విడుదల చేసి రూ. 2,650 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. మూడో విడతను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేసి మొత్తం రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తిచేస్తామని చెప్పారు. మూడు విడతలు గా కలిపి రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్లు జమ అవుతాయని వివరించా రు. రైతులకు ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేయడం ప్రభు త్వ సంకల్పమని తుమ్మల పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఆదివారం చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.


