అల్లూరి సీతారామరాజుకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan pays tribute to Alluri Seetharama Raju | Sakshi
Sakshi News home page

అల్లూరి సీతారామరాజుకు వైఎస్ జగన్ నివాళి

May 7 2026 10:56 AM | Updated on May 7 2026 11:26 AM

YS Jagan pays tribute to Alluri Seetharama Raju

తాడేపల్లి : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తుచేశారు. నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.

గిరిజనులను సంఘటితం చేసి..
అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన  విప్లవకారుడు. ఆయన 1897, జూలై 4 న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో జన్మించారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో (మన్యం) గిరిజనులను సంఘటితం చేసి, వారి హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1922లో ‘రంపా తిరుగుబాటు’ చేపట్టారు. చింతపల్లి తదితర పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి, ఆయుధాలను చేజిక్కించుకున్నారు. మన్య ప్రజలు ఆయనను ‘మన్యం వీరుడు’ అని ప్రేమగా పిలుచుకుంటారు. బ్రిటీషర్లు ఆయనను పట్టుకోవడానికి పదివేల రూపాయల బహుమానం ప్రకటించారు. చివరకు 1924, మే 7న చింతపల్లి అడవుల్లో ఆంగ్లేయులు ఆయనను చెట్టుకు కట్టి కాల్చి చంపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement