హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. చిన్నారి అదృశ్యంపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
ఈ క్రమంలో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వెంట తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపాడు.
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.


