హైదరాబాద్: ఏ బంకు చూసినా కిటకిట.. చాంతాడంత బారులు.. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు. వాహనదారుల ఇక్కట్లు. బుధవారం రోజంతా నగరంలో కనిపించిన దృశ్యాలిలి. ఉదయం నుంచే ప్రధాన పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిక్కిరిసిపోయారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు దిగుమతులపై వదంతులు షికార్లు చేస్తుండటంతో వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. బాటిళ్లు, క్యాన్లలో అదనంగా నిల్వ చేసుకునేందుకు ఎగబడ్డారు.

సీఎన్జీ కోసం ఆటోలు, కార్లు అల్లంత దూరం క్యూ కట్టాయి. ఈ ప్రభావం ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై తీవ్రంగా పడింది. పెట్రోల్, గ్యాస్ బంకుల కేంద్రంగా భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఆయా బంకుల వద్ద బుధవారం నుంచి బందోబస్తు నిర్వహిస్తున్నారు.






