హైదరాబాద్: నగర శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ఉంటారు. సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం.రవీందర్, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు సి.హరీష్ చంద్రారెడ్డి, ఎన్.బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్హెచ్వో మల్లికార్జున రెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్ అలీని ప్రభుత్వం నియమించింది.
మరోవైపు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదారుడు రితేష్ రెడ్డి గన్లైసెన్స్ను రద్దు చేయాలని సీపీకి సిట్ అధికారులు లేఖ రాశారు. రితేష్రెడ్డికి 2017లో గన్ లైసెన్స్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. రివాల్వర్ మిస్ యూజ్పై చర్యలు తీసుకోవాలని సీపీని సిట్ అధికారులు కోరారు. అలాగే, అసాంఘిక కార్యక్రమాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ అడ్డాగా మారిందని, దాన్ని సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.
కాగా, మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు రాజకీయంగానూ కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. పలువురికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే.


