అన్నలకు ‘ఆధార’మేదీ..? | New complications for the surrendered Maoists | Sakshi
Sakshi News home page

అన్నలకు ‘ఆధార’మేదీ..?

Mar 17 2026 5:33 AM | Updated on Mar 17 2026 5:33 AM

New complications for the surrendered Maoists

లొంగిపోయిన మావోలకు కొత్త చిక్కులు

రివార్డుల అందజేతకు ఆధార్‌ తప్పనిసరి

పునరావాస కల్పనలో జాప్యం..?

2025 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా పరిసరాల్లో సుమారు 25 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉండి లొంగిపోయిన కోరుట్లకు చెందిన పసుల వసంతకు ఇప్పటికీ పునరావాస సాయం అందలేదు. కారణం.. ఆమెకు ఆధార్‌ కార్డు లేకపోవడమే! 

2025 అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 197మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కొత్తగా రిక్రూట్‌ అయిన 140 మంది మినహా మిగతావారికి ఆధార్‌కార్డులు లేవు.  

2026 ఫిబ్రవరిలో మావోయిస్టు పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావుతోపాటు సుమారు 180 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో సగానికిపైగా మావోయిస్టులకు ఎలాంటి ఆధారాలూ లేవు.  

కొత్త ఆధార్‌ కోసం తిప్పలు
ఈ లెక్కన లొంగిపోయిన మావోయిస్టుల్లో చాలామందికి ఆధార్‌కార్డులు లేవు. కొత్తగా ఆ«ధార్‌ కార్డు సృష్టించుకోవడం సమస్యగా మారింది. ఆధార్‌ కార్డులు లేని మావోయిస్టులు తమ సొంత గ్రామాల్లో ఉన్న ఇళ్లల్లో.. లేకుంటే కొత్తగా అద్దె ఇంట్లో ఉన్నట్లు చిరునామాపై రెవెన్యూ అధికారుల నుంచి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్‌తోపాటు తాము మావోయిస్టు పా

లో అజ్ఞాతంలో ఉండి లొంగిపోయిన సందర్భంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రం జతచేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న తరువాత కొన్ని సాంకేతిక సమస్యలతో ఆధార్‌కార్డులు వెంటనే రావడం లేదు. ఒకటికి రెండు సార్లు అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ఆధార్‌ జారీ సంస్థ నుంచి కొత్త ఆధార్‌ కార్డు వస్తుంది. అనంతరం పాన్‌కార్డు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.

పునరావాసంలో జాప్యం తప్పదా..!?
కొత్త ఆధార్‌ కార్డులు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం ఫలితంగా పునరావాస కల్పనలో జాప్యం జరుగుతోంది. ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్నవాళ్లు కావడంతో వారికి ఎలాంటి గుర్తింపు కార్డులూ లేవు. వీరిలో చాలామంది పెద్దగా చదువుకున్న వారు కాకపోవడంతో పాఠశాలల్లో పుట్టిన తేదీలు లేక ఆధార్‌ నమోదు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారులు రెసిడెన్స్‌ సరి్టఫికెట్‌ ఇవ్వాలన్నా.. పంచనామాలో సాక్షులు సరిగా దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఇలా ఆధార్‌ కార్డు నమోదు కావడానికి నెల నుంచి రెండు నెలల కాలం పడుతోంది. పేరున్న మావోలకు ఉన్నతాధికారుల నుంచి ఉన్న సహకారంతో త్వరగానే ఆధార్‌కార్డులు వస్తున్నప్పటికీ సాధారణ మావోయిస్టులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఈ క్రమంలో లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డుల అందజేత, పునరావాస కల్పనలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      – కోరుట్ల   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement