రూ.50 లక్షల చెక్కులు మాయం
ఇప్పటికే రూ.40 లక్షలు విత్ డ్రా
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సాక్షి, కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధులు పక్కదారి పట్టాయి. పీఎఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఉద్యోగే ఈ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి ఉద్యోగుల చెక్కులను డ్రా చేశారని పీఎఫ్ విభాగం సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుషాయిగూడలోని ఈసీఐఎల్ సంస్థలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన రూ.50 లక్షల చెక్కులు మాయమయ్యాయి. కంపెనీలో పని చేసే దినసరి కూలీ పేరుతో రూ.40 లక్షలు డ్రా చేశారు. ఒకే ఎకౌంట్ నంబర్తో పెద్ద మొత్తంలో నగదు డ్రా కావడాన్ని బ్యాంకు అధికారులు పసిగట్టి ఈసీఐఎల్ పీఎఫ్ విభాగానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు మిగతా చెక్కులను నిలిపివేశారు. రోజూవారీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. కాగా, ఈ గోల్మాల్ వ్యవహారంలో పీఎఫ్ విభాగం సెక్రటరీపై∙ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


