చాలా మంది తమ రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ పొందడం లేదని, దాని కారణంగా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పోషకాహార నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రతి మనిషికి రోజుకు సుమారుగా 25 నుంచి 30 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అయితే నివేదికలు కేవలం 15 నుంచి 20 గ్రాములే వినియోగిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇది వ్యాధులకు దారితీసే ప్రమాదానికి సంకేతమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. గ్రామీణ ఆహారాల్లో పప్పుధాన్యాలు, ముతక ధాన్యాలలో కనీసం ఏదో రకంగా ఫైబర్ ఉంటుంది. కానీ పట్టణ ఆహారాల్లో ఆ లోటు అధికం అని చెబుతున్నారు నిపుణులు. అసలు ఫైబర్ ఎందుకు అవసరం అంటే..
మన ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..
మెరుగైన జీర్ణక్రియ, మలబద్ధకం నుంచి ఉపశమనం
పేగుల ఆరోగ్యానికి మద్దతు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు పోషణ
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
కడుపు నిండిన భావనను పెంచి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
ఫైబర్ అందించే ఆహారాలు
చియా గింజలు, కాయధాన్యాలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు వంటి సాధారణ ఆహారాలు ఈ లోటును పూరించగలవు. తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినడం లేదా హోల్-గ్రెయిన్ బ్రెడ్ ఎంచుకోవడం వంటి చిన్న, స్థిరమైన మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయని పోషకాహార నిపుణులు నొక్కి చెబుతున్నారు. భారతీయ ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు
చిరుధాన్యాలు (రాగి, జొన్న, బజ్రా) – వీటిలో కరిగే, కరగని ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి.
పప్పుధాన్యాలు (కందిపప్పు, పెసరపప్పు, మసూర్ పప్పు).
చిక్కుడు జాతి గింజలు (రాజ్మా, శనగలు, చిక్పీస్).
పండ్లు (జామకాయ, బొప్పాయి, అరటిపండు, ఆపిల్).
కూరగాయలు (పాలకూర, బెండకాయ, క్యారెట్లు).
తృణధాన్యాలు (బ్రౌన్ రైస్, గోధుమ చపాతీ).
కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని నివారించడానికి ఫైబర్ను క్రమంగా పెంచుకుంటూ..పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
డాక్టర్ ఆదర్శ గౌడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్,అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)
ICAR–నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు
(చదవండి: జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..! ఆ 12 అలవాట్లు..)


