హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు.


