హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనాలు ఆపి వర్షం వెలిసేదాక ఎదురుచూశారు.
మరోవైపు మెదక్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. తూప్రాన్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగలులతో కూడిన భారీ వర్షం పడింది. పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. అర్ధ గంటపాటు కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షాలతో వరి పంటతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతన్నలు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టి సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నారాయణ ఖేడ్, ఆందోలులోనూ జోరుగా వర్షం కురిసింది.


