సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.
ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది.
కాంగ్రెస్కు స్థానం లేదు..
ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది.


