మార్గదర్శకాలు విడుదల చేసిన ఏఐసీటీఈ
విద్యాసంస్థల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సును దూర విద్య, ఆన్లైన్ విధానంలో నేర్చుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, అప్లైడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్టŠస్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, డిజైన్ అండ్ ప్లానింగ్ కోర్సులను కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు వీలు కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ను ఏఐసీటీఈ తాజాగా విడుదల చేసింది. కొత్త సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న సంస్థల్లో కోర్సుల పొడిగింపు, దూరవిద్య, ఆన్లైన్ మోడ్లో కోర్సుల నిర్వహణకు మార్గదర్శకాలను పొందుపర్చింది.
కంప్యూటర్ కోర్సులు పూర్తిగా సాంకేతికమైనవి కావడంతో నిపుణులైన బోధకులు ఉండాలని, అప్పుడే కోర్సుల నిర్వహణకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. కంప్యూటర్ కోర్సులు బోధించే అధ్యాపకులు ఆయా రంగాల్లో కనీసం మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. బోధన అనుభవం పదేళ్లకు తగ్గకుండా ఉండాలని సూచించింది. ఆన్లైన్ ద్వారా బోధించే అధ్యాపకుల పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఐసీటీఈ నిబంధన పెట్టింది. ఆన్లైన్ మెటీరియల్పై కూడా మండలి నిష్ణాతులు ముందుగా పరిశీలిస్తారు.
ఎమర్జింగ్ కోర్సులకు ఆధునిక బోధన ప్రణాళిక ఉండాలని తెలిపింది. నైపుణ్యం కీలకంగా ఏఐసీటీఈ చెబుతోంది. కంప్యూటర్ కోర్సులను ఆన్లైన్లో బోధించే విద్యార్థులకు అవసరమైన స్కిల్ను నేర్పాలనే షరతు పెట్టింది. దీనికోసం విద్యా సంస్థలు సాఫ్ట్వేర్ సంస్థల భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలి. ఎన్ని గంటలు ప్రాక్టికల్ అనుభవం కలి్పస్తారనేది స్పష్టం చేయాలి. ఒక్కో కోర్సుకు ఒక్కో విధమైన నైపుణ్యం ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సులకు కోడింగ్ను సాఫ్ట్వేర్ నిష్ణాతులతో అందించే ఏర్పాటు చేయాలని విద్యా సంస్థలను ఆదేశించింది. మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు గుర్తింపు ఉండే సంస్థల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించింది.


