సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని టీ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ ఈ రోజు( సోమవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. 2026 T20 ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేసినందుకు గాను ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకొని ఎయిర్పోర్టు వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది. కాగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో తిలక్ వర్మ సభ్యునిగా ఉన్నారు.


