breaking news
Parvathipuram manyam District News
-
కలెక్టరేట్ను తాకిన నిరసన సెగ
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల జోరుపార్వతీపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వినతులు పోటెత్తాయి. కనుమరుగవుతున్న సాగునీటి కాలువలను కాపాడాలని, గిరిజనుల భూములకు హక్కులు కల్పించాలని, నివాసాల మధ్య డంపింగ్ యార్డును రద్దు చేయాలని, తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు, గిరిజనులు, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. కబ్జాల చెరలో కాలువలు..కాపాడండి పార్వతీపురం కేంద్రంగా బెలగాం నుంచి నర్సిపురం వరకు వరహాల గెడ్డ, సాగునీటి కాలువలు కబ్జాకు గురవుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు తదితరులు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డికి ఫిర్యాదు చేశారు. సురేష్ స్కూల్, వైకేఎం కాలనీల వద్ద కాలువలను మట్టితో కప్పేసి పక్కా భవనాలు నిర్మిస్తున్నారని, వరదలు వస్తే కాలనీలు జలమయం కావడం ఖాయమన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే కోట్లాది రూపాయల విలువైన నీటి వనరులు ఆక్రమణలకు గురవుతున్నాయని, పాత రికార్డుల ఆధారంగా సర్వే చేసి కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన భూములకు అడంగల్ పునరుద్ధరించాలి కురుపాం మండలం సప్పగొత్తిలిలో 1973లో 50 ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ‘డీ’ పట్టాలకు సంబంధించి ఈ ఏడాది అడంగల్, వన్–బి నిలిపివేయడంతో రాయితీలు అందడం లేదని బాధితులు వాపోయారు. అటవీ అధికారులు ట్రెంచ్లు తవ్వుతున్నారని, తక్షణమే రీ–సర్వే చేసి హక్కులు కల్పించాలని విన్నవించారు. నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ వద్దు పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని దళిత, బీసీ నివాస ప్రాంతాల (1, 2, 19, 20 వార్డులు) మధ్య కంపోస్ట్ యార్డు (ఎంఆర్ఎఫ్) ఏర్పాటును స్థానిక యువకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రోగాల బారిన పడకముందే యార్డును ఊరికి 4 కిలోమీటర్ల దూరంలోని అట్టలి సమీపానికి తరలించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మద్దతుతో నిరసన తెలిపారు. మూడేళ్లుగా దాహం కేకలు పట్టించుకోరా? సీతానగరం మండలం చినభోగిలి ఎస్సీ వీధిలో మూడేళ్లుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రూ.1000 పనులకు కూడా నిధులు లేవని అధికారులు దాటవేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క వీధులకు వెళ్తే గొడవలు జరుగుతున్నాయని, తక్షణమే కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. -
పాలకొండను చుట్ట్టుముట్టిన పోలీసులు
డీఎస్సీ అక్రమాలకు నిరసనగా పాలకొండలోని వైఎస్సార్ కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం 6 నుంచి పోలీసులు పట్టణాన్ని ముట్టడించారు. ఇతర మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రంలోకి వచ్చే మార్గాలన్నింటిలోనూ మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులను పట్టణంలోకి అనుమతించలేదు. నాలుగు మండలాలకు చెందిన కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకుల ఇళ్లనూ చుట్టుముట్టారు. వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటిని కూడా భారీగా పోలీసులు, ప్రత్యేక పార్టీలతో దిగ్బంధించారు. వివిధ మార్గాల్లో ఎమ్మెల్సీ ఇంటి వద్దకు నియోజకవర్గంలో నాలుగు మండలాల నాయకులు చేరుకున్నారు. 11 గంటల సమయంలో ఎమ్మెల్సీ ర్యాలీకి సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే వారిని నిర్భందించడం, అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని విక్రాంత్ ధ్వజమెత్తారు. డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నందునే.. అది బయట పడకూడదనే కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులపై ఉక్కుపాదం మోపిందని విమర్శించారు. పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ దుప్పాడ పాపినాయుడు, సీనియర్ నాయకులు పాలవలస ధవళేశ్వరరావులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. స్టేషన్కు తరలించారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నిడగల్లు గూడ గ్రామానికి చెందిన బిడ్డిక సుబ్బారావు (42) మద్యానికి బానిసై రోజంతా మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని భార్య గౌరి, కుమారుడు ప్రదీప్ మందలించడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం గడ్డి మందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, అక్కడ వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంచడంతో మెరుగైన చికిత్స కోసం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో సుబ్బారావు మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య కుమారుల ఫిర్యాదు మేరకు జియ్యమ్మ వలస ఎస్సై ఎన్.ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.దుర్గాదేవి గుడిలో చోరీదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటో స్టాండ్ వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో సోమవారం తెల్ల వారు జామున హుండీ చోరీకి గురైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై పెదమానాపురం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిసర ప్రాంతాలను శీలించినట్లు తెలిపారు. హుండీలో సుమారు రూ.20 వేల వరకు భక్తులు వేసిన నగదు ఉంటుందని చెప్పారు. ఈ విషయమై పెదమానాపురం ఎస్సై కళాధర్ వద్ద ప్రస్తావించగా దొంగలు ఎటువైపు నుంచి వచ్చారో తెలియడానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆటోస్టాండ్ వద్ద తెల్ల వారు జామున ప్రయాణికుల కోసం ఉంచిన ఆటోలో కొంత నగదు రెంచీలు దొంగలు తీసుకుని పోయినట్లు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కాలువలో పడి బాలిక మృతిగరుగుబిల్లి: బట్టలు ఉతికేందుకు వెళ్లిన బాలిక తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధానకాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందింది. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలోని దళాయివలస పంచాయతీ మధుర శివరాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల నిషా(15) గ్రామ సమీపంలోని కాలువ వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. కాలువ ప్రాంతానికి వెళ్లిన కుమార్తె ఇంటికి చేరుకోక పోవడంతో కాలువ ప్రాంతంలో పరిశీలించగా అందులో పడి మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన తండ్రి రాజు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి అనంతరం బాలిక మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తె నిషాకు మతిస్థిమితం లేదని తండ్రి చెప్పాడు. తమకు ఉన్న ఇద్దరు కుమార్తెల్లో పెద్దకుమార్తె నిషా చిన్న వయస్సులోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రాజు, ఇందుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేజీకి 900 గ్రాములే..!
రామభద్రపురం: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని వాటిని పరిష్కరించే నాథుడు కరువయ్యాడని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించే ఆహార సలహా సంఘాలు కానరావడంలేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇష్టానుసారం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బియ్యం పంపిణీలో డీలర్ల ఇష్టారాజ్యం జిల్లాలో రేషన్ 1254 దుకాణాలు ఉండగా వాటి పరిఽథిలో ఉన్న 5,70,980 కార్డులకు 9,02,06 మెట్రిక్ టన్నులు బియ్యం 11 ఎంఎల్ఎస్ గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. అయితే చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. డీలర్లు తూకాల్లో కిలోకి 100 గ్రాముల పైడి కోత విధించి బియ్యం ఇస్తున్నారని వాపోతున్నారు. మరి కొన్నిచోట్ల 20 కిలోలకు గాను సుమారు 3 కిలోల వరకు తక్కువ ఇస్తున్నట్లు తెలిసింది.ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే..ఎంఎల్ఎస్ గోదాంల నుంచే తూకాలు తక్కువ చేసి బియ్యం సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వాటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా.. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాముల నుంచి డీలర్లు తీసుకుని రేషన్ దుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తారు.అయితే గోదాముల నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోందని డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోదాము నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 48 కిలోలే వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు రేషన్ దుకాణాల్లో అకస్మిక తనిఖీలు చేస్తున్న సమయంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే తూకంలో తేడాలు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల నుంచి బియ్యం తీసుకునేటప్పుడు డీలర్లు ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని గోదాము నిర్వాహకులు, డీలర్లు కలిసి కార్డుదారుల మీదకు నెడుతున్నారని, ఇరు పక్షాలు కలిసి పేదల పొట్ట కొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెత్తి చూడని లీగల్మెట్రాలజీ అధికారులు తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు లబ్ధిదారులు నష్టపోతున్నా కనీసం కన్నెత్తి చూడడం లేదని, మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమమతమవుతున్నారని లబ్ధిదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మార్చి నెలలో రేషన్ డీలర్లకు చెందిన కాటాలను పరిశీలించి సీళ్లు వేశారు. అందుకు ఒక్కో డీలర్ నుంచి కాటా సీలుకు రూ.600, ఎప్పుడైనా కాటా రిపేరు వస్తే మరమ్మతు చేయడానికి రూ.400లు మొత్తం రూ.1000 తీసుకుని తాత్కాలిక రసీదు ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఒరిజినల్ లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారైనా తనిఖీలు చేపట్టకపోవడంతో డీలర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీని అధికారులు కూడా తనిఖీ మానేశారనే విమర్శలు లేకపోలేదు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్డీవో అధ్యక్షతన ప్రజా సంఘాలు, అన్ని వర్గాలు, రాజకీయ పార్టీప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘం సభ్యులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చించాల్పి ఉంది. అయితే అధికారులు ఆహార సలహా కమిటీల ఏర్పాటు గాని, సమావేశాలు ఏవీ నిర్వహించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారుల పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేయకపోవడంతో పాటు ఆహార సలహా కమిటీ కానరాకపోవడంతో పేదలకు నిత్యావసర సరుకుల సరఫరా ఇష్టానుసారం చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇష్టాను సారం పేదలకు రేషన్ డీలర్ల బియ్యం పంపిణీ లబ్ధిదారులకు కోత విధిస్తున్న రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ గోదాం నిర్వాహకులు ఇవ్వడం లేదంటున్న డీలర్లు పర్యవేక్షించని ఉన్నతాధికారులు తనిఖీలు చేయని లీగల్ మెట్రాలజీ అధికారులు ఇటీవల అకస్మికంగా గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు -
దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపు ● ‘అనే నేను’ ప్రచార కార్యక్రమానికి శ్రీకారంవిజయనగరం గంటస్తంభం: దేశ స్వాతంత్య్ర స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశ నిర్మాణంలో భాగస్వాములు ‘అనే నేను’ ప్రచార కార్యక్రమాలను ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా కాకుండా దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆగస్టు 14న జిల్లా వ్యాప్తంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలు తమ ఇళ్ల వద్ద లేదా ప్రముఖ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అలాగే ప్రభుత్వ భవనాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లను జాతీయ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమాన్ని నిర్వహించి, దేశ భవిష్యత్తు కోసం తాము చేయగలిగే కృషిపై విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. యువత, విద్యార్ధులు, ప్రముఖలు, క్రీడాకారులు, పౌరులు జాతీయ జెండాను చేతబట్టి ‘అనే నేను...దేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను’ అంటూ 30 నుంచి 60 సెకన్ల స్వీయ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి చెందిన భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆలోచిద్దాం..ఆచరిద్దాం..అభివృద్ధి చెందిన భారత్ను నిర్మిద్దాం అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. -
‘జైల్ భరో’ ఉద్రిక్తం
● పోలీసుల అడ్డగింత ● కలెక్టరేట్ ఎదుట నిరసన హోరు!పార్వతీపురం రూరల్: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ’జైల్ భరో’ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. పాత బస్టాండ్ వద్ద ప్రారంభమైన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. 26 మంది ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించగా, మిగిలిన నాయకులు ఆంక్షలను ధిక్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లి భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి సూర్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ తదితరులు మాట్లాడుతూ..అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశీయ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను హరించే నూతన లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షిస్తూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని స్పష్టం చేశారు. సౌందర్య థియేటర్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కు చేరుకున్న మరో ప్రదర్శనలో రైతు కూలీ, గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొని నినాదాలు చేశారు. అరెస్టయిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. -
కరువు మండలాలుగా ప్రకటించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంటలకు అందరు రైతులకు ఉచిత బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. విశాఖ డెయిరీ అవినీతిపై శాసనసభ హౌస్ కమిటీ రిపోర్ట్ బయటపెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లీటరుపాలుకు రూ.5 ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. 2024 పంటల బీమాను అపరాలు, జీడి మామిడికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ అలైన్ మెంట్ మార్చి నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లోకవరపు ఆదినారాయణ మూర్తి, గోపాలం, గొంప కృష్ణమూర్తి, వర్రి మల్లయ్య, డి.వర్మ, వేమిరెడ్డి లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులతో అధికారులే నేరుగా మాట్లాడాలి
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులే నేరుగా అర్జీదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఉప కలెక్టర్ బి.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ ప్రభావతితో కలిసి మొత్తం 70 వినతులను కలెక్టర్ స్వీకరించారు. వాటిలో 19 రెవెన్యూకు సంబంధించినవి కాగా 51 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఫిర్యాదు దారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్ఎస్ పోర్టల్లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ వైర్ల సమస్య, గ్రామీణ రహదారుల మరమ్మతులు, తాగునీటి బోరు, అన్నదాత సుఖీభవ, దివ్యాంగుల పెన్షన్, భూ ఆక్రమణలు, వెబ్ల్యాండ్లో భూమి వివరాల మార్పు, పట్టాదారు పాస్పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించే ఉద్దేశంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కుటుంబ కలహాలు, భూవివాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు, మోసాలు తదితర సమస్యలపై ఎస్పీకి విన్నవించారు. ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరితగతిన పరి ష్కారం చూపాలని ఆదేశించారు. తీసుకున్న చర్యల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మొత్తం 10 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంసోమవారం నిర్వహించగా మొత్తం 27 అర్జీలు వచ్చాయి. జలంత్రకోట, నువ్వాగడలకు బీటీ రోడ్డు నిర్మించాలని, అలాగే కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రం నుంచి పోషకాహారం ఇప్పించాలని మనగకు చెందిన ఎం.గజపతి కోరారు. ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని కవిటికి చెందిన పెద్దింటి లక్ష్మి వినతి ఇచ్చారు. నల్లబొంతుకు గ్రావెల్ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. -
న్యాయం జరిగేంతవరకు పోరాడతాం
మొత్తం భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది బాడంగి, డొంకినవలస రెవెన్యూ పరిధిలోని మొత్తం 32ఎకరాలభూములపైన కోర్టులో కేసు నడుస్తోంది. మాభూములు మాకు ఇప్పించాలంటూ కోర్టువారిని కోరాం. తీర్పువచ్చేంతవరకు ఎవరూ ఆక్రమణలు చేయడానికి వీలులేదు. – గండిశంకరరావు, రైతు, గ్రామపెద్ద, డొంకినవలస కోర్టులో కేసు ఉండగా దౌర్జన్యం తగదు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటేనే భూములిచ్చాం డొంకినవలసలో రైతుల ధర్నా -
‘దారి’ విషయాన్ని దాటవేసిన అధికారులు
● అధికారుల వివరణతో ప్రజల్లో వ్యక్తం అవుతున్న అనుమానాలుపాచిపెంట: మండలంలోని పోతులగెడ్డ సమీపంలో పిండ్రంగివలస రహదారి అంశంపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో సంబంధిత శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ సూర్య సుబ్రహ్మణ్య శర్మ వివరణ ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణ అసలు ప్రశ్నకు పొంతన లేకుండా ఉందని స్థానికులు అంటున్నారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వ రహదారి ప్రైవేట్ వెంచర్లో కలిసిందా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రహదారి మార్గాన్ని మార్చి ఉంటే.. ఎవరి అనుమతితో మార్చారు? పాత రహదారి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ప్రజలు సంతకాలు చేసి పంచాయతీ తీర్మానం ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అధికారులు ధారాదత్తం చేయవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది ఉందా? లేదా? అన్నది ఇక్కడ ప్రధాన సమస్య కాదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ రహదారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? లేదా? అన్నదే తమ ప్రశ్న అని, ఈ వ్యవహారంపై అధికారులు ఆధారాలతో సహా స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
గిరిజన సంఘాల ఆధ్వర్యంలో.... ఘనంగా ఆదివాసీ దినోత్సవం
సీతంపేట: ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్యపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి బిడ్డిక తేజేశ్వరరావు, స్థానిక జేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సీతంపేటలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. దోనుబాయి రోడ్డు కూడలి నుంచి ఐటీడీఏ వరకు ప్రదర్శనగా వెళ్లారు. సందెమ్మతల్లి వద్ద పూజలు చేశారు. అనంతరం ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఉన్న ఆదివాసీ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేశారు. డప్పులు, వాయిద్యాలు, నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కొందరు కోర్టులకు వెళ్లి సవాల్ చేసి కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీల రిజర్వేషన్లను కూడా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వాటిని తరిమి కొట్టడానికి బిర్సాముండా, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రేపటి తరం కోసం ప్రతీ ఆదివాసీ కూడా ఐక్యతతో ముందుకు వెళ్లాలన్నారు. జీవో నంబర్ 3కిబదులు ప్రత్యేక చట్టం చేయాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకులమీద సోషల్మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటువంటి వారిని జాతిద్రోహులుగా గుర్తిస్తామని ప్రకటించారు. ఐటీడీఏ ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరిస్తాం ఈనెల 11న ఐటీడీఏ అధికారులు ఐటీడీఏలో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజనులమంతా బహిష్కరిస్తామని నాయకులు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజున నిర్వహించే కార్యక్రమాన్ని ఐటీడీఏ పరిధిలో మాత్రం తేదీ మార్చి జరపడం సమంజసం కాదన్నారు. గతంలో పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇలా వాయిదా వేసి గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రానున్న రోజుల్లో ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుండంగి సరస్వతి, ఆదివాసీ ఐక్యవేదిక న్యాయ సలహాదారు ఆరిక మన్మథరావు, నిమ్మక కాంతారావు, బిడ్డిక ఉమామహేశ్వరరావు, ఎస్.చిరంజీవులు, ఎస్.సాయికుమార్, ఎస్.రాము, ఎం.రవికుమార్, ఎం.శ్యాం, సూరిబాబు, హెచ్.మోహన్రావు, కె.సుబ్బారావు, కె.కాంతారావు, హరిప్రసాద్, జె.రామకృష్ణ, సురేష్, ఎం.భాస్కరరావు,బి.రామ్మోహన్రావు, వినోద్, ఎస్.గంగారావు, కె.వెంకునాయుడు, రామస్వామి, హెచ్.అదిలక్ష్మి, ఎ.కళావతి, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురంలో.. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన నాయకులంతా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈమేరకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన గిరిజనులతో కలిసి స్థానిక వైటీసీ నుంచి గుమ్మలక్ష్మీపురం గ్రామం వరకు జై ఆదివాసీ..జైజే ఆదివాసీ.. అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైటీసీలో గిరిజన ఉత్సవం నిర్వహించారు. పలువురు విద్యార్థులు, గిరిజన యువత గిరిజన సంప్రదాయ వేషధారణలతో అలరించారు. డప్పువాయిద్యాలు వాయిస్తూ..నృత్యాలు చేస్తూ సంప్రదాయాల్ని చాటిచెప్పారు. గిరిజనులంతా ఐక్యంగా ఉండాలంటూ ఈ సందర్భంగా వక్తలైన నాయకులు గిరిజన సమాజానికి పిలుపునిచ్చారు. -
కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు సెల్లార్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల నమోదు, అర్జీల స్థితికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్ చేయవచ్చునని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రజల ఫీడ్బ్యాక్ సేకరణ కోసం క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు మొబైల్ ద్వారా స్కాన్చేసి సేవలపై అభిప్రాయాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోర్డులు దెబ్బతిన్నా వెంటనే మార్చాలని, ఈ విధానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గుండెపోటుతో సీపీఎం నేత మృతిసీతంపేట: సీపీఎం సీనియర్ నాయకుడు, గిరిజన సంఘం నేత బిడ్డిక అప్పారావు (56) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. సీతంపేటలో శనివారం జరిగిన మన్యం బంద్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామమైన చిన్నకంబలో ఆదివారం గుండెపోటు రావడం, క్షణాల్లోనే మృతిచెందడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. దశాబ్దాల తరబడి ఉద్యమబాటలో నడిచి మంచి పేరున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి తీరని లోటని సీపీఎం, గిరిజన సంఘాలు, ప్రజా, ఉద్యోగుల సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు● జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీ శంకర్ పాచిపెంట: ఎరువుల విక్రయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎరువుల దుకాణాల యజమానులను పార్వతీపురం జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీ శంకర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పాచిపెంట మండలకేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. రైతులకు నిబంధనల మేరకు ఎరువులను విక్రయించాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడరాదని డీలర్లకు సూచించారు. ముఖ్యంగా రైతులకు బలవంతంగా లింక్డ్ ప్రొడక్టులను అంటగట్టరాదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో ఈ–పంట నమోదు, ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్లో క్రాప్ మానిటరింగ్, ఎవల్యూషన్న్ను పరిశీలించారు. ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టా రైతులకు ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏ ఈఓ చింతాడ గణేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. శాకంబరీ అలంకరణలో కామాక్షి అమ్మవారుపాచిపెంట: సాలూరు పట్టణంలో వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారు శాకంబరీ అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శాకంబరీ అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
దారి దోపిడీ..
● 11న ఐటీడీఏ నిర్వహించనున్న దినోత్సవాన్ని బహిష్కరిస్తాం ● గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు 2020లో కురుపాం, భద్రగిరి ఆస్పత్రి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న నాటి ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి(ఫైల్) నేడు రంగులు మార్చి, బోర్డు పెట్టి ప్రారంభించిన అదే భవనంపాచిపెంట: ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారుల కళ్లముందే ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైంది. పాచిపెంట మండలంలోని పోతులగెడ్డ సమీపంలో పిండ్రంగివలసకు వెళ్లే పీఆర్ (పీఐయూ) శాఖకు చెందిన బీటీ రహదారిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన లేఅవుట్ లో కలిపేశాడు. దీంతో ఏళ్లుగా ప్రజలు వినియోగిస్తున్న పాత రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది. దానికి బదులుగా ప్రభుత్వ భూమిలో కొత్త రహదారిని ఏర్పాటు చేశారు. సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేయడంతోపాటు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో రహదారి ఏర్పాటు చేయడంతో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ ఈ విషయంపై వార్తలు వచ్చినా సంబంధిత రెవెన్యూ, పీఆర్(పీఐయూ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేసిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు.. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన కొత్త రహదారికి అనుమతులు ఉన్నాయా? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ రోడ్డునే మింగేసిన రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు లేఅవుట్లో కలిపేసిన పీఆర్(పీఐయూ) శాఖ బీటీ రోడ్డు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో కొత్తదారి.. అధికారుల మౌనంపై విమర్శలు -
నవ్విపోదురు గాక..!
సాక్షి, పార్వతీపురం మన్యం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు పూర్తి చేసుకున్న కురుపాం, భద్రగిరి ఆసుపత్రులను..రంగులు మార్చి, ప్రజా వినియోగంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వానికి రెండేళ్లు పట్టింది. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో 30 పడకల నుంచి 50 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాలను, కురుపాంలో 50 పడకల నూతన సీహెచ్సీ భవన ప్రారంభోత్సవాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం చేపట్టిన విషయం విదితమే. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆస్పత్రుల ఘనతంతా వారి ఖాతాలో వేసుకుని, మరోమారు తమ ‘క్రెడిట్ చోరీ’ బుద్ధిని బయటపెట్టుకున్నారు. వాస్తవానికి భద్రగిరి ఆస్పత్రి పరిపాలన ఆమోదం 18.11.2019లో వచ్చింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా..మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హయాంలోనే రూ.8.95 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. గత ఎన్నికల సమయానికే ఆస్పత్రి భవనం పనులు దాదాపు 50 – 60శాతం పూర్తి చేశారు. కురుపాం ఆస్పత్రి అదనపు భవనాలకు సైతం 2020లో సుమారు రూ.3 కోట్ల నాబార్డు నిధులతో శంకుస్థాపన చేశారు. గత ఎన్నికలకు ముందు, 2024 సమయానికే 95 శాతం పనులు పూర్తి కాగా.. కేవలం ఎలక్ట్రికల్ వర్క్స్ మాత్రమే మిగిలాయి. అప్పట్లో భవనానికి వేసిన పచ్చ, నీలం రంగులను మార్చి.. శనివారం ప్రారంభించారు. అంటే.. దాదాపు రంగులు మార్చడానికే చంద్రబాబు ప్రభుత్వానికి రెండేళ్లు పట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజనులకు వైద్యసేవలు సక్రమంగా అందని పరిస్థితి. అదనపు భవనాలు పూర్తయినా, ప్రారంభించకపోవడంతో ఒకే పడకపై నలుగురు, ఐదుగురు చొప్పున రోగులను ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. చికిత్స చేయలేక, పడకలు చాలక పార్వతీపురం పంపించేశారు. కురుపాం ఆస్పత్రిలో పాముకాటుకు మందు లేకపోవడంతో ఇటీవల ఓ విద్యార్థి చనిపోయాడు. గత ప్రభుత్వానికి పేరు రాకూడదనే.. గత జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వానికి, నాటి స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి పేరు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతోనే ఇన్నాళ్లూ ఆస్పత్రి భవనాలను ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. ఈ రెండు భవనాల ప్రారంభోత్సవం, గిరిజన ప్రజలు వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రెండేళ్ల కాలంలో జిల్లా పరిషత్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు పదేపదే ప్రస్తావించారు. వారి ఒత్తిడితోనే ఇన్నాళ్లకు రిబ్బను కటింగు చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ భవనాల ప్రారంభోత్సవ సమయంలో కార్పొరేట్ హంగులతో నిర్మాణం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు కితాబిచ్చారు. శంకుస్థాపన, భవనం నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యిందన్న విషయాన్ని మర్చిపోయి అచ్చెన్న నిజాలు మాట్లాడేశారా? అని వైఎస్సార్సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రంగులు మార్చడానికే రెండేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కురుపాం, భద్రగిరి ఆస్పత్రులు అనుమతులు తేవడం, పూర్తి చేసింది మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి రిబ్బన్ కటింగు మాత్రం నేటి పాలకులది కార్పొరేట్ భవన హంగులంటూ మంత్రి అచ్చెన్న కితాబు మరోసారి చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీభద్రగిరి ఆస్పత్రి అప్పట్లో ఒక మెడికల్ సెంటర్గా ఉండేది. నేరుగా సీహెచ్సీకి అప్గ్రేడ్ చేశారు. దీనివల్ల ఒక్క డాక్టరే చాలా కాలం పని చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే శాసనసభలో అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న పుష్పశ్రీవాణి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. డాక్టర్లను పెంచాలని అడిగారు. అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే జీరో వేకెన్సీ కింద మొత్తం సిబ్బందిని భర్తీ చేశారు. సుమారు ఏడుగురు వైద్యులను నియమించారు. మందులు, డాక్టర్లు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని గిరిజనులు గుర్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు
బలిజిపేట: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరగడంతో ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో సోమవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ర్యాలీ, ధర్నాకు అనుమతులు లేనందున హాజరవడానికి వీలులేదని వైఎస్సార్సీపీ బలిజిపేట మండల నాయకులకు ఆదివారం రాత్రి నోటీసులు అందించారు. సోమవారం ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారనే ముందస్తు సమాచారం ఉన్నందున శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీచేశామని పోలీస్ సిబ్బంది నాయకులకు తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీ, ధర్నాలు నిర్వహించే పక్షంలో చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు పంపించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, జెడ్పీటీసీ రవికుమార్ తెలిపారు. -
ఆదివాసీలకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని గిరిజన సోదర, సోదరీమణులకు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం దేశ సాంస్కృతిక వైవిద్యానికి ప్రతీకలన్నారు. గిరిజనుల అభ్యున్నతికి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాది వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకులు దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాష్కెంట్లో రాణించిన గురునాయుడు ● ఆసియా వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో హ్యాట్రిక్ నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరుగుతున్న జూనియర్ ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026 పోటీ ల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్లిఫ్టర్ శనపతి గురునాయుడు సత్తాచాటాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగంలో స్నాచ్లో 119 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 146 కేజీల బరువును ఎత్తి రెండు విభాగాల్లోనూ వెండి పతకాలు సాధించాడు. మొత్తం 265 కేజీల బరువును స్కోర్చేసి ఆ విభాగంలోనూ మరో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకే పోటీలో మూడు వెండి పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు. హక్కుల కోసం రోడ్డెక్కిన క్రైస్తవులు విజయనగరం క్రైమ్: దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, హక్కులను పరిరక్షించాలని దక్షిణ భారత బాప్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సంఘమిత్ర డాక్టర్ ఆర్.ఎస్.జాన్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం వీధి మీదుగా కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చి వరకు ర్యాలీ సాగింది. మతం మారినంత మాత్రాన కులం మారదు, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతలు తొలగిపోవు అంటూ నినదించారు. మతం పేరిట దళిత ముస్లింలు, క్రైస్తవుల ప్రాథమిక హక్కులను రద్దుచేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఆర్బీని తరలించే దిశగా సీఎం చంద్రబాబు కుట్ర విజయనగరం గంటస్తంభం:విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన ఆర్ఆర్బీ(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు)ని అమరావతికి తరలించే దిశగా సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఇదే విషయమై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ పబ్లిక్ స్కూల్లో శనివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేజోన్ ఉన్న విశాఖలో ఆర్ఆర్బీ ఉంటేనే ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని టీడీపీ నేత పి.విజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వ నిర్ణ యం వల్ల యువత నష్టపోయే ప్రమాదం ఉందని బీజేపీ నాయకుడు కుసుమంచి సుబ్బారావు పేర్కొనగా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. -
షో అదిరింది!
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఉత్సవం నీరు గారింది.. సాక్షి, పార్వతీపురం మన్యం: కట్టూబొట్టు.. వేషభాషలో గిరిజనాన్ని అనుకరించారు. మాటలో ఆదివాసీల పట్ల మమకారం కురిపించారు. అంతా ‘షో’ వరకే... గిరిజనుల సమస్యలపై మన్యం బంద్ ఒక వైపు జరుగుతుండగానే.. మరోవైపు ఆదివాసీ దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే, పార్వతీపురంలో శనివారం నిర్వహించారు. గిరిజన సంఘాలను ముక్కలుగా విడగొట్టి, చేపట్టిన ఉత్సవం ఆదివాసీలకు కాకుండా.. ప్రజా ప్రతినిధులు, అధికారులకే పండగలా మారింది. గిరిజన మంత్రి ఉన్నచోటే గిరిజనులకు అవమానం ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ సభకు గిరిజనులకు అడుగడుగునా అవమానమే జరిగింది. కనీసం ఆదివాసీల పండగ పేరిట నిర్వహించిన ఉత్సవంలోనూ గిరిజనేతరులకే ప్రాధాన్యం ఇచ్చారు. వేదిక ముందు గానీ.. సభ ముందు వరుసలో గానీ దాదాపు ఆదివాసీలు కూర్చోలేదు. ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులతోనే కుర్చీలన్నీ నింపేశారు. వేదికకు దూరంగా, చిట్టచివరనే గిరిజనులు ఆసీనులయ్యారు. అప్పటి వరకూ నృత్యాలు చేసిన గిరిజన విద్యార్థులు సైతం కుర్చీలు లేక, దూరంగా నిల్చున్నారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. సభ అంతా పూర్తయ్యేసరికి దాదాపు మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయింది. అప్పటి వరకూ ఏ ఒక్కరికీ భోజనాలు లేవు. కనీసం తాగునీరు ఇచ్చే దిక్కు లేదు. పిల్లలు, పెద్దలు అంతా ఆకలితో అలమటించి పోయారు. దాదాపు 2.30 సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం ముగియడంతో ఒక్కసారిగా అంతా భోజనాల వద్దకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు నియత్రించాల్సి వచ్చింది. చాలామందికి అక్కడ అందించిన ఆహారం సరిపోలేదు. మళ్లీ వరుసలోకి వెళ్దాం అనుకున్నా, అప్పటికే పెద్ద ఎత్తున భోజనాల కోసం గుమిగూడి ఉండటంతో చాలామంది అర్ధాకలితోనే వెళ్లిపోయారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉన్న అడవి తల్లి విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పూజలు చేయడం, సారె సమర్పించడం ఆనవాయితీ. కలెక్టర్, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు మాత్రమే కొన్ని గిరిజన సంఘాలను తీసుకుని ర్యాలీగా అడవి తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీలోనూ గిరిజనులు కనిపించలేదు. కేవలం గిరిజన విద్యార్థులతోనే వెళ్లారు. అక్కడ వనమాత విగ్రహానికి పూజలు జరిపి, పాలాభిషేకం చేసి, సారె సమర్పించారు. జిల్లాలో ముగ్గురు ఎస్టీ శాసన సభ్యులు.. అందునా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ రాలేదు. గిరిజన సంఘాలు చీలిపోయి, కొన్ని దూరంగా ఉన్నాయి. పేరుకే ఉత్సవం.. పండగ అంతా అధికారులు, ప్రజా ప్రతినిధులదే సభలో చిట్టచివరన ఆదివాసీలు ఆకలితో అలమటించిన గిరిజన విద్యార్థులు, మహిళలు గిరిజనులంతా ఒక వైపు.. గిరిజన శాఖ మంత్రి మరోవైపు ఓవైపు జీఓ నంబర్ 3, ఇతర ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనులంతా ఒక వైపు పోరాడుతుండగా, ఆ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి.. వారిని విబేధిస్తూ, బంద్ రోజునే ఉత్సవాలు నిర్వహించారు. ఇదే సమయంలో మంత్రి సంధ్యారాణితో పాటు, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు.. గిరిజనుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించడం కంటే.. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీని, ఆ పార్టీ అధినేతను తిట్టడానికే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. డీఎస్సీపై సవాళ్లు చేయడం.. ప్రతిపక్ష పోరాటాన్ని చిన్నది చేస్తూ దూషించడంతో.. అసలు వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, గిరిజనులు తెల్ల ముఖాలు వేశారు. -
భీమసింగి ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి అప్పగిస్తే ఉద్యమిస్తాం
రాజాం: జిల్లాలో భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీని మూసేసి, ఆ భూములను ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్ట్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు ప్రభుత్వం కట్టబెడితే ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజాంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమసింగిలో ఉన్నది కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ అని, విజయరామగజపతి కోపరేటివ్ సుగర్స్ లిమిటెడ్ కింద 1969లో రైతుల అంతా సొసైటీగా ఏర్పడి ఏర్పాటుచేశారన్నారు. 1977లో పరిశ్రమలో చక్కెర తయారీ ప్రారంభమైందన్నారు. ఇది రైతుల భాగస్వామ్యంతో సాధ్యమైందని గుర్తుచేశారు. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 18 మండలాల్లోని 16 వేల మంది రైతులు ఇందులో సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారన్నారు. 1999లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో 2002లో మూతపడిందని వెల్లడించారు. 2004లో వైఎస్సార్ పాదయాత్ర సమయంలో ఫ్యాక్టరీ పరిస్థితిని రైతులు వివరించారని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ తెరిపించారన్నారు. మళ్లీ ఫ్యాక్టరినీ వినియోగంలోకి తేవాలని వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోపరేటివ్తో కమిటీని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఏపీఐఐసీకి ఆ భూములు బదిలీచేసేందుకు తీర్మానాలు చేయడం రైతులను మోసగించడమేనని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ చేయడం, భూములు అమ్మడం చంద్రబాబు సర్కారుకు నిరంతర ప్రక్రియగా మారిపోయిందన్నారు. 65 ఎకరాల పరిధి ఉన్న ఖరీదైన భీమసింగి ఫ్యాక్టరీ భూమిని అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ఫ్యాక్టరీకి 2 కిలోమీటర్ల దూరంలో హైవే గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉందని, పది కిలోమీటర్లు దూరంలో విజయనగరం ఉందని, 40 కిలోమీటర్లు దూరంలో పోర్టు ఉందని, పక్కనే రైల్వే లైన్ ఉందని గుర్తుచేశారు. ఇన్ని పారిశ్రామిక సౌకర్యాలు ఉన్న ఫ్యాక్టరినీ పునఃఉత్పాదనకు సిద్ధం చేయకుండా ఇలా భూములు అమ్మేస్తామని సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యమైన రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా, పబ్లిక్ హియరింగ్ పెట్టకుండా మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సబబుకాదని హితవుపలికారు. ఈ విషయాన్ని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పోరాడుతామని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ పూర్తిగా సహకార సంఘంతో ఉందని, ఆరోజు ప్రతి రైతు రూ.111లు చెల్లించి 16వేల మంది సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు ఇది రూ.40 కోట్లు షేర్ కేపిటల్గా ఉందని, రూ.32 కోట్ల వరకు ప్రభుత్వ ఈక్విటీ, మిగిలినది రైతుల ఈక్విటీగా ఉందని వివరించారు. అప్పట్లో ఇక్కడ రైతులే భూ సేకరణ చేశారన్నారు. విజయనగరం జిల్లాలోని 15 మండలాలతో పాటు భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభపురం, ఆనందపురం, భీమిలి మండలాల రైతులకు ఈ ఫ్యాక్టరే ఆధారమని వివరించారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంకిలి ఫ్యాక్టరీ మూసేస్తే ఒప్పుకోం.. సంకిలిలోని ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఫ్యాక్టరీ పరిస్థితిని ఇప్పటికే ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, పాలవలస విక్రాంత్లు మండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని యాజమాన్యం ఆకస్మికంగా నిలుపుదలచేస్తే పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఆ రోజు సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బొత్స సత్యనారాయణ, పాలవలస రాజశేఖరం, సాంభశివరాజు తదితరులు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరినీ తెరవాల్సిందే... స్థానిక మంత్రి, ముఖ్యమంత్రులదే ఆ బాధ్యత మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
మన్యం బంద్ విజయవంతం
సీతంపేట: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మన్యంబంద్ విజయవంతమైంది. సీతంపేటలో ఉదయం నుంచే షాపులు తెరచుకోలేదు. 11 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గిరిజన సంఘం కార్యాలయం నుంచి సీతంపేట వారపు సంతవరకు ర్యాలీ చేశారు. అనంతరం కొద్ది సేపు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని, జీఓ నంబర్ 3ను చట్టం చేయాలని, గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. నాన్షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని నినదించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, గిరిజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు కె.భాస్కరరావు, శ్రీరాములు, బి.అప్పారావు, గంగాధర్, పి.సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
పార్వతీపురం రూరల్: ఆన్లైన్ బెట్టింగ్లు, జల్సాలకు బానిసై రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.71.40 లక్షల విలువైన 42 తులాల బంగారు ఆభరణాలను నూటికి నూరు శాతం రికవరీ చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి వెల్లడించారు. స్థానిక మెట్టువీధికి చెందిన సువ్వాడ సతీష్ ఓ టిఫిన్ సెంటర్లో పని చేస్తుంటాడు. సంపాదన చాలక, జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగా ఈ నెల 2, 3 తేదీల్లో సీతానగరానికే చెందిన కుర్మదాసు కిశోర్, వక్కలగడ్డ సురేష్ల ఇళ్ల తాళాలను ఇనుప రాడ్డుతో పగులగొట్టి మొత్తం 42 తులాల బంగారం అపహరించాడు. ఈ వరుస చోరీలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాధితుల ఫిర్యా దుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దొంగ కదలికలను పసిగట్టారు. శనివారం ఉదయం స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సతీష్ ఇంట్లో దాచిన మంగళసూత్రాలు, గాజులు, నెక్లెస్లు తదితర 42 తులాల స్వర్ణాభరణాలను సీజ్ చేసి, అతడిని కోర్టు రిమాండ్కు తరలించారు. రూ. 71.40 లక్షల విలువైన 42 తులాల బంగారం స్వాధీనం ఆన్లైన్ బెట్టింగ్ల కోసమే దొంగతనాల బాట -
రోల్ మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలి
గుమ్మలక్ష్మీపురం: మెరుగైన వైద్యసేవలు అందించి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోల్ మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు నాబార్డ్ – 225 నిధులు రూ.8.95 కోట్లతో భద్రగిరిలో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ ఉంటే ప్రయోజనం ఏం ఉంటుందని, కావున రిఫర్ చేయకుండా సాధ్యమైనంత వరకూ స్థానిక ఆస్పత్రిలోనే ప్రజలకు వైద్య సేవలు అందివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో అన్నారు. అవే అబద్దాలు.. ఎన్నికల ముందు చెప్పిన అబద్దాలనే జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ ఈ సమావేశంలోనూ కొనసాగించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 10.50 లక్షల కోట్లు అప్పు చేసిందని ఓ సారి, రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని మరోసారి నిడకడలేని మాటలు చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చాం.. అధికారంలోకి వచ్చాక హామీలన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో రివ్యూ చేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు చూసి గుండె దడ పుట్టిందన్నారు. అన్ని హామీలు అమలు చేయాలంటే డబ్బుల్లేవంటూనే ఒకటి రెండు తప్ప సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి మోదీ సహకారం అందిస్తుండంతోనే రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. దీనికి ముందు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ భద్రగిరి ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్పు చేయాలంటూ ఇన్చార్జ్ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఆర్డీఓ మాధురి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి వస్తే.. మాకేంటి..!
దత్తిరాజేరు: మండలంలోని వింద్యవాసి గ్రామంలో శనివారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు ముఖం చాటేయడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని రామమందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వచ్చే సమయానికి కేవలం ముగ్గురు నలుగురు రైతులు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడక్కడ ఉన్న వారందరిని పిలిచినా రాకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలే కుర్చీల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మంత్రి వేదిక మీద కూర్చునే సమయానికి కూడా రైతులను అందుబాటులో ఉంచలేకపోయారని ఆర్డీఓపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఒక సమయంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామస్తులకు పథకాలు అందకపోవడంతో బాయ్కాట్ చేశారని కొందరు చర్చించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గ్రామంలో రీసర్వే చేసిన తన పేరున ఉండాల్సిన భూమి తక్కువగా ఉందని రైతు కోలా జగదీశ్వరరావు నిలదీయడంతో మంత్రి తరువాత మాట్లాడుదామని రైతుని కూర్చోమని సముదాయించారు. రీసర్వే ప్రొఫైల్ తేలేదని.. రైతులను తీసుకురాలేకపోయారని తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గొభ్యంలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గ్రామ నాయకుల మధ్య మంత్రి ఉంటుండగానే తీవ్ర వాగ్వాదం జరగడంతో మంత్రి చేసేది లేక రెండు గృహాలు వద్ద ఫొటోలు తీసుకొని కాసేపు రామమందిరంలో సేదదీరి వెనుదిరిగారు. ముందుగా దత్తిరాజేరు కేజీబీవీ ఆవరణలో డార్మెటరీ గదులను, ఎంఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్.తాత, తహసీల్దార్ హరికిరణ్, ఎంఈఓ వెంకటరావు, సుధాకర్, సర్వశిక్ష అభియాన్ ఈఈ మురళి, డీఈ ప్రసాద్, ఏఈ ఉపేంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వింద్యవాసిలో పాస్ పుస్తకాల పంపిణీకి ముఖం చాటేసిన రైతులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కొండపల్లి -
ముగిసిన నైపుణ్యాభివృద్ధ్ధి శిక్షణ
విజయనగరం అర్బన్: స్థానిక మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సహకారంతో ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బందికి ‘ప్రయోగశాల విధానాలు, భద్రత, దసీ్త్రకరణ, నాణ్యతా వ్యవస్థలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామయ్య మాట్లాడుతూ.. ప్రయోగశాలల్లో భద్రతా ప్రమాణాలు, నాణ్యతా విధానాలు, ప్రామాణిక కార్యాచరణ పద్ధతులను పక్కాగా అమలు చేయడం వల్ల పనితీరు, విశ్వసనీయత పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎంఎస్ లాబొరేటరీస్ క్వాలిటీ కంట్రోల్ హెడ్ కె.లీలాకిరణ్కుమార్, ఎంఐఎంఎస్ క్వాలిటీ అక్రిడిటేషన్ కో ఆర్డినేటర్ జె.విజయ్కుమార్ పాల్గొని ప్రయోగశాల నిర్వహణ, భద్రతపై దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ల్యాబ్ సెక్యూరిటీ, రసాయనాల సురక్షిత నిల్వ, పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, జీవ భద్రత, అత్యవసర పరిస్థితుల ఎదుర్కోవడం వంటి ప్రమాదాల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు ప్రాయోగిక అవగాహన కల్పించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రయోగశాల సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
కుంకీ ఏనుగుల తరలింపు
సీతానగరం: మండలంలోని జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న కుంకీ ఏనుగులను తెర్లాం మండలం రామినాయుడువలస ప్రాంతంలో ఉన్న ఏనుగులను మచ్చిక చేసేందుకు వీలుగా జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసూన పర్యవేక్షణలో ఆ ప్రాంతానికి శనివారం తరలించారు. అటవీ శాఖ, స్థానిక పోలీసుల సహకారంతో మండల కేంద్రం మీదుగా భారీ భద్రత చర్యల నడుమ తరలించారు. జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపైకి రావడంతో ట్రాకర్స్ ముందస్తు హెచ్చరికలు చేశారు. ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు ఏ మేరకు మచ్చిక చేసుకొని ఈ ప్రాంతం నుంచి తీసుకుపోతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒడిశా వైపు ఏనుగుల గుంపు భామిని: మండలంలోని పాలవలస గిరిజన గ్రామ సమీపంలో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు శనివారం ఒడిశా గ్రామాల వైపు పయనమయ్యాయి. గడిచిన వారం రోజులుగా పాలవలస గిరిజనులకు కునుకు లేకుండా చేసిన ఈ గుంపు గ్రామ సరిహద్దుల నుంచి బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ ఏనుగుల వెంట నడిచారు. -
డోలీ మోతలకు పరిష్కారం చూపుతాం
పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డోలీ మోతలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో వారు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రూ.855.68 లక్షల విలువైన ట్రాక్టర్లు, వ్యవసాయ, ఉపాధి సామగ్రిని పంపిణీ చేశారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణం కోసం రూ.2,600 కోట్లు కేటాయించామని చెప్పారు. జీఓ నంబర్ 3 రద్దుతో నష్టపోయిన గిరిజన యువతకు అదే స్థాయి రక్షణ కల్పించేలా కొత్తజీవో తీసుకువస్తామని ప్రకటించారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించే దిశగా జిల్లాలో ‘ఆరోగ్య విప్లవం’, ‘మన్యం వీడియో డాక్టర్’ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి గిరిజన కుటుంబం విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి ఆకాంక్షించారు. గిరిజన యువత తమ మూలాలను మరువకుండానే, ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొని రాణించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన థింసా, సోరమంజి నృత్యాలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓలు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొన్నారు. -
మెప్పు కోసమే పాశవిక దాడులు
రామభద్రపురం: వెన్నుపోటు పార్టీ నాయకత్వం మెప్పు కోసమే వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలపై విజయవాడలో టీడీపీ శ్రేణులు పాశవిక దాడులకు పాల్పడ్డాయని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మండిపడ్డారు. పార్టీ మండల కార్యాలయంలో విలేకరులతో శనివారం వారు మాట్లాడారు. ఇటీవల కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన బొండా ఉమను వెన్నుపోటు పార్టీ అధినాయకత్వం ప్రశ్నించడంతో అధిష్టానం వద్ద మార్కులు కొట్టేందుకు ఇటువంటి నీచమైన సంస్కృతికి తెరతీశారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే దీక్షా శిబిరాలపై కోడి గుడ్లు, టమాటాలు, నీళ్ల బాటిళ్లు విసిరి బీభత్సం సృష్టించడం హేయమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుత దీక్షలు కొనసాగుతుంటే ప్రజాదరణను చూసి ఓర్వలేక దీక్షా శిబిరాలపై పచ్చమూకలు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకువస్తే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. మంత్రి వర్గ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలంనాయుడు, తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు తదితరులు ఉన్నారు. దిశ చట్టాన్ని ఉపసంహరించు కోవడం హేయమైన చర్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి -
ఒడిశా టు నెల్లూరు
● పశువుల అక్రమ రవాణాబొబ్బిలి: పశువుల రవాణా గుట్టు చప్పుడు కాకుండా కాదు.. బహిరంగంగా తరలిస్తున్నారు. ఒడిశా నుంచి పార్వతీపురం అక్కడి నుంచి పట్టణం గుండా పశువులను వధ శాలకు జోరుగా తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు తరలిస్తున్నట్టు చెబుతున్నా ఎక్స్పోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం, ఒడిశా నుంచి పశువులను చిన్న వాహనాల్లో తరలించడంతో అవి ఆకలి, దాహానికి అలమటించడం బయటకు కూడా కనిపిస్తోంది. చిన్న వాహనంలో ఐదారు పశువులను తరలిస్తున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఇతర శాఖల అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. బొబ్బిలి సంత ఉండేటప్పుడు అక్కడి నుంచి తరలించేవారు. ఇప్పుడు పట్టణ శివారు గుండా తరలిస్తూ అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల్లోకి వీటిని మార్చేందుకు రామభద్రపురం, బొబ్బిలిలోని రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఓ వైపు ఎస్పీ అన్ని దారులూ మూసేశామని చెబుతున్నా అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి సెలవు దినాల్లోనూ, పండగ రోజులు, ప్రముఖుల పర్యటనల సమయాలను ఎంచుకుని మరీ రవాణా జరుపుతున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
విద్యార్థులే పని మనుషులు
కొమరాడ: మండలంలోని ఎండభద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్నారులను వంట కలప తెచ్చే పనిమనిషులుగా వినియోగిస్తున్నారు. వంట కలప మోస్తున్న చిన్నారుల వీడియోలు సోషల్మీడియాలో శనివారం హల్చల్ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. చదువుకునేందుకు పిల్లలను పంపిస్తే కట్టెలు తెచ్చేందుకు అడవికి పంపించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే పాఠశాల సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపించారు. సుమారు 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంటలు చేయడం, కట్టెలు తెచ్చేందుకు చిన్నారులను వినియోగించడం సరికాదని, వార్డెన్పై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కడ్రక వెంకటరావు డిమాండ్ చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పేదకుటుంబాల పిల్లలకు చదువు కష్టాలు తప్పడంలేదని తల్లిదండ్రులు నిట్టూర్చుతున్నారు. ● మారని ఎండభద్ర ఆశ్రమపాఠశాల సిబ్బంది తీరు ● పట్టించుకోని ఉన్నతాధికారులు -
సాగని రిజిస్ట్రేషన్లు
రీసర్వే పూర్తయినా..● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించని వివరాలు ● రెండేళ్లుగా రైతుల అవస్థలు ● కొందరికి అందని పాస్ పుస్తకాలుబలిజిపేట: రీ సర్వే ప్రక్రియ పూర్తయింది.. అయినా పలు గ్రామాల భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించడం లేదు.. దీంతో ఆయా గ్రామాలకు చెందిన భూములు క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను విక్రయించి కష్టాల నుంచి గట్టెక్కుదామంటే కుదరడం లేదు. రెండేళ్లుగా ఇలా సమస్య నలుగుతూనే ఉంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇటు పాలకులుగాని.. అటు అధికారులుగాని దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఆ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... బలిజిపేట మండలం పలగర, తుమరాడ, వెంగాపురం, శివరాంపురం గ్రామాలకు చెందిన రైతుల భూములు రిజిస్ట్రేషన్లు జరగక క్రయ, విక్రయాలకు నోచుకోవడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పోర్టల్లో రీసర్వేకు సంబంధించిన వివరాలు కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓ వైపు రీసర్వే పూర్తయింది. పాస్ పుస్తకాలు కూడా కొద్ది మందికి తప్ప అందరికీ వచ్చేశాయి. అయితే వాటిలో తప్పులు సరి చేసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే సరిగా ఉన్న వారి భూములను క్రయ విక్రయాలు జరపాలంటే కుదరడం లేదు. దీంతో అత్యవసర ఖర్చుల నిమిత్తం భూములను అమ్ముదామంటే కుదరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఈ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వేకు సంబంధించి అధికారులు చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా తమ భూములు క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
ఆక్రమణలపై చర్యలేవీ?
పూసపాటిరేగ: మండల పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయని, రానురాను రహదారులు (చిన్నవిగా) కుచించుకుపోతున్నాయని పట్టించుకోరా అని పతివాడ ఎంపీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనాయుడు ఆర్అండ్బీ జేఈ మీనా పట్నాయక్ను ప్రశ్నించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మహంతి కల్యాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రహదారుల ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన జీవో ఉన్నా క్షేత్రస్థాయిలో అది అమలుకావడం లేదని సభ్యులు అన్నారు. ఎమ్మెల్సీ పి.సురేష్బాబు స్పందిస్తూ ఈ విషయం కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలో 55 శాతం మాత్రమే వర్షపాతం(తక్కువ) ఉండడం వల్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, దీనిపై సభలో తీర్మానం చేయాలని కనిమెల్ల, పతివాడ ఎంపీటీసీ సభ్యులు అల్లాడ రమేష్, పతివాడ అప్పలనాయుడు పట్టుబట్టారు. సరిపడ ఎరువులు సరఫరా చేయాలి.. గ్రామీణ ప్రాంతాల రైతులు సాగు చేస్తున్న పంటలకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని ఎమ్మెల్సీ సురేష్బాబు కోరారు. అల్లాడపాలెంలో ఎక్కువమంది బోదకాలు వ్యాధితో బాధపడే వారు ఉన్నారని, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వైద్యం అందేలా చూడాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలు, కాలుష్యం వల్ల చాలామంది కేన్సర్ బారినపడుతున్నారని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రతాప్, ప్రమీలాదేవి, రాజ్కుమార్లకు సూచించారు. ప్రజాసమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు? మండల పరిధిలో ఈ ఏడాది పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన పాఠశాలల వివరాలతో పాటు తక్కువ మార్కులు వచ్చిన పాఠశాలల వివరాలు తెలియజేయాలని ఎంఈవో రాజ్కుమార్ను ఎమ్మెల్సీ సురేష్బాబు అన్నారు. కొవ్వాడ గ్రామంలో తాగునీటి సమస్యకు కారణమైన మోటార్ మరమ్మతులు చేస్తే నేటికీ దాని బిల్లులు మంజూరు చేయకపోవడానికి కారణమేంటని పలువురు సభ్యులు నిలదీశారు. గతంలో జరిగిన ఎన్నో సమావేశాల్లో ఎన్నో సమస్యలు లేవనెత్తామని, అవి ఇప్పటికీ పరిష్కారం కాలేదని అటువంటప్పుడు సమావేశాలెందుకని గోవిందపురం ఎంపీటీసీ సభ్యురాలు దంగుడుబియ్యపు సునీత అధికారులను అడిగారు. ఇప్పటికై నా సభ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీడీవో ఎం.రాధిక, వైస్ ఎంపీపీ అల్లా రమేష్, ఉద్యాన శాఖ అధికారి ఉమాభరణి, డిప్యూటీ తహసీల్దారు సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ రోడ్ల ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం తగదు రహదారులు కుచించుకుపోతున్నా పట్టించుకోరా? పూసపాటిరేగను కరువు మండలంగా ప్రకటించాలి మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ డైరెక్టర్ దుర్మరణం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన తుమ్మలపేట పీఏసీఎస్ డైరెక్టర్ పతివాడ గోవింద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సారిపల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం విజయనగరంలో మరో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోవింద్ మృతితో స్వగ్రామమైన కొండగుంపాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే నాగమాధవి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మార్కెఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు గోవింద్ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పక్కిలో ఏనుగుల గుంపు బొబ్బిలి రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు బొబ్బిలి, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లోని పంట చేలు, మొక్కజొన్న, చెరుకు పంటలను నాశనం చేస్తున్నాయి. శనివారం పక్కి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. అక్కడే ఉన్న ఓ మామిడి తోటలో తిష్టవేశాయి. గత రెండు రోజులుగా మండలంలోని రాముడువలస, శివడవలస, పక్కి పరిసర ప్రాంతాల్లోని వరినారు, మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. ఏనుగుల గుంపును ఇక్కడి నుంచి సీతానగరం మండలం జోగింపేట ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు కుంకీ ఏనుగును శనివారం పక్కి గ్రామానికి తీసుకువచ్చారు. ఆ కుంకీ ఏనుగు ద్వారా ఏనుగుల గుంపును తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.విద్యుత్ షాక్కు గురై ఆవు మృతి మెరకముడుదాం: మండలంలోని చిన బంటుపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్కు గురై పాడి ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పల్లి లక్ష్మీనారాయణ ఆవులు మేస్తుండగా గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న బోరుబావి ప్యానెల్ బోర్డు విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు ఆవుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో లక్ష్మీనారాయణ తనకు జీవనాధారమైన రూ.50 వేల విలువ చేసే ఆవు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయానని బోరున విలపిస్తున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. -
జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్కు ప్రాజెక్టుల ఆహ్వానం
● నమోదుకు ఈ నెల 15 చివరి తేదీ ● జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞాన, సాంకేతిక మండలి (ఏపీసీఓఎస్టీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32వ జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ–2026)కు సంబంధించిన ప్రాజెక్టుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల నమోదును తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ లో ‘స్టూడెంట్స్/చిల్డ్రన్ సైంటిస్ట్స్ అండ్ గైడ్స్’ విభాగం ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రతి ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్ధులు మాత్రమే పాల్గొనాలి. ఒకరిని ‘గ్రూప్ లీడర్’గా, మరొకరిని ‘గ్రూప్ మెంబర్’గా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శీర్షిక ఎంపిక చేసిన ఉపాంశానికి అనుగుణంగా ఉండాలి. నమోదు సమయంలో విద్యార్ధుల ఫోటోలు, ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ చిరునామాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధన నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ జాతీయస్థాయి క్యాక్రమం ఎంతో తోడ్పడుతుందని డీఈఓ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల ఇందులో చురుగ్గా పాల్గొని అధిక సంఖ్యలో ప్రాజెక్టులను నమోదు చేయాలని, విజయనగరం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నమోదుకు ఈ నెల 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే జిల్లా కో–ఆర్డినేటర్ టి.రాజేష్ (ఫోన్: 9440444674), జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు (ఫోన్:940009294)లను సంప్రదించాలని సూచించారు. -
● పారాది బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్
పారాది వేగావతి నదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్వేపై నిరంతరం ట్రాఫిక్జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మరమ్మతులకు గురైన పాత బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తాత్కాలిక కాజ్వేపై నుంచే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పొరపాటున కాజ్వేపై ఒక్క వాహనం నిలిచిపోయినా, నదిలో నీటి ప్రవాహం పెరిగినా ట్రాఫిక్ జామ్ అవుతోంది. శుక్రవారం దాదాపు రెండు గంటల పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – బొబ్బిలి రూరల్ -
ఒకరికి ఒకరే..!
జియ్యమ్మ వలస రూరల్: ఒకే విద్యార్థి..ఒకే..ఉపాధ్యాయుడితో మండలంలోని జోగులడుమ్మ పాఠశాల పనిచేస్తోంది. విద్యాశాఖలో జరుగుతున్న ఈ వింతపోకడను చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకపక్క పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తుంటే మరోపక్క ఎంపీపీ, యూపీ పాఠశాలలను ఎత్తేసే క్రమంలో ప్రభుత్వ విద్యను పేద కుటుంబాలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు ఈ పాఠశాలలన్నీ ఎన్నికల్లో ఓట్లు వేసే పోలింగ్ కేంద్రాలుగా మారిపోతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాది ఒకే విద్యార్థితో ఉన్న నీలమాంబపురం పాఠశాల నేడు కనుమరుగైందని అంతేకాకుండా మండలంలో అనేక చోట్ల నలుగురు, ఐదుగురు విద్యార్థులతో పాఠశాలలు నిర్వహిస్తున్నారంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బీజేపురంలో ఈ ఏడాదే ప్రారంభమైన శ్రీ ఆదిత్య విద్యా మందిర్ పాఠశాలకు సుమారు 50 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అదే బీజేపురంలో వివేకవర్ధిని పాఠశాలలో 150, పెదమేరంగి సత్య కై లాస్ పాఠశాలలో 130 మంది, తిరుమల సాయి పాఠశాలలో 460 మంది, ఎస్ఎస్కేపీ పాఠశాలలో 147 మంది విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తుంటే ప్రభుత్వ విద్యాశాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. తల్లికి వందనం పేరిట ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.13 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో వేస్తుంటే కొంతమంది అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారో దీనిపై సమగ్ర సర్వేను నిర్వహించవలసిన బాధ్యత విద్యాశాఖకు లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
రాజాం సిటీ: విధులకు హాజరై ఇంటికి తిరిగి వస్తు న్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. పొందూరు మండలం అంతకాపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో మలుపువద్ద రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వె ళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన యువకుడు సమ్మ సా యిసురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. బరంపురానికి చెందిన సమ్మ సాయిసురేష్ (30) కుటుంబంతో సహా ఏడాది క్రితం రాజాం వచ్చాడు. తండ్రి సతీష్బాబు అనారోగ్యానికి గు రికావడంతో రాజాంలో బజాజ్ ఫైనాన్స్లో సేల్స్మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ప్రతిరోజూ ఉదయం 9గంటలకు విధులకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో సందర్శించి రాత్రి 9గంటల సమయంలో ఇంటికి చేరేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరైన సురేష్ పొందూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో సంఘట నా స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయాన్ని సహోద్యోగి పి.ప్రకాశరావు కుటుంబసభ్యులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతునికి తల్లి ధనలక్ష్మి, తండ్రి సతీష్బాబు, ఓ సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ధ నలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చే స్తున్నామని ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్ తెలిపారు. -
పాఠశాలల్లో గుడ్ల పరిశీలన
రాజాం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను ఎంఈఓ యాగాటి దుర్గారావు శుక్రవారం పరిశీలించారు. పెనుబాక, కంచరాం, బొద్దాం తదితర పాఠశాలల్లో గుడ్ల పరిమాణంపై ఆరాతీశారు. వంట ఏజెన్సీతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న గుడ్ల పరిమాణం చిన్నదిగా ఉండడంపై ఈనెల 7న సాక్షిలో ‘గుడ్డు చిన్నబోయింది’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈఓ పలు పాఠశాలలో వాటిపై ఆరాతీయడంతో పాటు ఏజెన్సీతో మాట్లాడారు. గుడ్డు పరిమాణం తగ్గితే బిల్లులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం జరిగాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జీ స్టేడియంలో బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అండర్–17, 23 వయస్సుల విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపిక పోటీలను పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, శాప్కోచ్లు పర్యవేక్షించారు. సెంచూరియన్లో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్క్లేవ్’నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్క్లేవ్–2026’ శుక్రవారం నిర్వహించారు. భవిష్యత్ నైపుణ్యాలు, కత్రిమ మేధస్సు, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమ–విద్యా భాగస్వామ్యంపై నిపుణులు చర్చించారు. ఏఐతో సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అపిటోరియా ఫార్మా ప్లాంట్ హెడ్ డాక్టర్ కె. సాంబిరెడ్డి సూచించారు. పరిశోధనలు, స్టార్టప్లకు మరింత ప్రోత్సాహం అవసరమని సీఐఐ చైర్మన్ జి.కృష్ణమోహన్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతను వీసీ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకట రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలుబొబ్బిలి: పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం జంక్షన్లో శుక్రవారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని కృష్ణాపురానికి చెందిన చొక్కాపు ఈశ్వర రావు ఆలయం రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి బైక్పై వెళ్తున్నాడు.అదే సమయంలో మెయిన్రోడ్డులో బైక్పై వస్తున్న పట్టణానికి చెందిన బి. వెంకట్రావు, డి.అప్పలనాయుడులను ఈశ్వర రావు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. వారిని స్థానికులు సీహెచ్సీకి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. తీవ్ర గాయాల పాలైన ఈశ్వర రావును విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కె. నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బీభత్సం
● మూడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, బైక్ ధ్వంసం భామిని: రోడ్డుపై వాహనాల రాకపోకలు, పొలాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు, వరితీతలో వలస కూలీలు. అందరూ చూస్తుండగానే శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది.భామిని మండలం నేరడి బ్యారేజీ సమీపంలో ఏబీ రోడ్డుపై బత్తిలి నుంచి భామిని వైపు వస్తున్న సిమెంట్ బస్తాల ఖాళీ లారీ రోడ్డుపై కుడివైపు మితిమీరిన వేగంతో వస్తూ రోడ్డు సైడ్న ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లి కొత్తగా వేసిన భారీ రౌండ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనే ఉన్న రెండు విద్యుత్ స్తంభాలపై గల పాత ట్రాన్స్ఫార్మర్ను పడగొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో ప్రాణనష్టం తప్పిందని పొలంలో పనిచేస్తున్న అంతా ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపక్కనే బైక్ను నిలిని పొలం పనులు చేస్తున్న నేరడికి చెందిన రైతు పాతపట్నం కోదండ రావు బైక్ ప్రమాదంలో తునాతునకలైంది. కొద్ది దూరంలో పోలంలోని రైతులు కేకలు వేయడంతో ప్రమాదానికి కారణమైన లారీ నిలిపివేసి డ్రైవర్ పరుగులు తీశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జనసేన నాయకుడిపై దాడివిజయనగరం రూరల్: నగరానికి చెందిన జనసేన నాయకుడు గురాన అయ్యలుపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నగరంలోని మంగలివీధిలో ఉన్న నూకాలమ్మ ఆలయానికి సంబంధించి జనసేన నేతకు, స్థానికుల మధ్య నెలకొన్న పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య శుక్రవారం జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. దీంతో స్థానికులు కొందరు అయ్యలుపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. దాడి విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కార్మిక సంక్షోభం..!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులకు సంక్షేమం కరువైంది. గతంలో ఉన్న బీమా సాయాన్ని, హామీలను గాలికొదిలేసింది. సభ్యత్వం రెన్యువల్ చేయడానికి నాలుగు ఓటీపీలు వస్తుండడంతో, అవగాహన లేక చాలామంది సభ్యత్వానికి దూరమవుతున్నారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందన్న ప్రచారం అంతా అబద్ధం. – మజ్జి ఆదిబాబు, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కార్మికులందరూ తప్పనిసరిగా తమ ఐడీ కార్డులను, సభ్యత్వాన్ని సకాలంలో రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ ఉంటేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కై ్లమ్లు మంజూరవుతాయి. సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. కార్మికులకు రెన్యువల్, పథకాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – టి.సుజాత, కార్మిక శాఖ ఉప కమిషనర్, విజయనగరం విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేంది. కొత్త పథకాలను అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలకు సైతం మంగళం పాడేసింది. సంక్షేమాన్ని విస్మరిస్తూ సంక్షోభంలోకి నెట్టేయడంపై కార్మికలోకం ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 6,09,096 మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు కార్మిక శాఖలో నమోదైన భవన నిర్మాణ కార్మికులు 1,22,502 మంది మాత్రమే. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు, మట్టి పని చేసేవారు, ఇటుక బట్టీ వర్కర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని, సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి నేటి వరకు ఆ హామీల ఊసే ఎత్తకపోవడంతో కార్మిక లోకం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అందని సాయం.. ఆవేదనలో కార్మికలోకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అత్యద్భుతంగా అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సాయం పూర్తిగా నిలిచిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన సాయం ఇలా.. ● వైఎస్సార్ కల్యాణమస్తు: భవన, ఇతర నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు రూ.20,000 చొప్పున లబ్ధి. ● వైఎస్సార్ బీమా (ప్రమాద మరణం): బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం. ● సహజ మరణం, వైకల్యం: సహజ మరణానికి రూ.1 లక్ష, ప్రమాదంలో వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు. ● రిజిస్టర్ కాని కార్మికులకు సైతం: రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యానికి రూ.2.5 లక్షల సాయం. ● ఆరోగ్యశ్రీ వైద్య సేవలు: అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకు పూర్తి ఉచిత వైద్యం ● ప్రస్తుతం వివాహ కానుక కింద రూ.20 వేలు, ప్రసూతి సహాయం కింద రూ.20వేలు, సహజ మరణం సహాయం రూ.50వేలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20వేలు మాత్రమే కార్మికులకు అందుతున్నాయి. ప్రమాద బీమాను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలకు సైతం గండి మొత్తం 6,09,096 మంది కార్మికులకు దక్కని భద్రత సార్వత్రిక ఎన్నికల హామీలకు మంగళం! వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడమే తప్ప సాయం సున్నా అవగాహన లేక వేలాది మంది రెన్యువల్కు దూరం -
తల్లిదండ్రుల కళ్లముందే కన్నపేగు మృత్యువాత
మక్కువ:/సాలూరురూరల్: ఒక్కగానొక్క వారసుడు మంచి చదువులు చదివి, కుటుంబాన్ని ఆదుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. తల్లిదండ్రుల కళ్లముందే రోడ్డు ప్రమాదం రూపంలో ఆ విద్యార్థి అనంతలోకాలకు చేరుకోవడంతో వారి రోదన అంతుపట్టలేకుండా ఉంది. హృదయ విదారకమైన ఈ సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం కవిరిపల్లి గ్రామానికి చెందిన భద్రాది అఖిల్ (15) సీతానగరం మండలం జోగింపేట పాఠశాలలో పదవతరగతి చదువుతున్నాడు. నాన్నా నీరసంగా ఉంది. నన్ను ఆస్పత్రికి ఒకసారి తీసుకువెళ్లండి అంటూ కొడుకు ఫోన్చేయడంతో, తండ్రి శంకరరావు ఉదయం పాఠశాలకు వెళ్లి కొడుకు అఖిల్ను ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం ఇంటివద్ద భోజనం చేసిని అఖిల్ వైద్యపరీక్షలు చేయించుకునేందుకు సాలూరు ఆస్పత్రికి ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులతో కలిసి బయల్దేరాడు. సాలూరు మండలం పందిరిమామిడివలస గ్రామం సమీపంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో ట్రాక్టర్ వెనుకభాగానికి తగలడంతో ద్విచక్రవాహనంతో పాటు రహదారిపై ముగ్గురూ బోల్తా పడ్డారు. దీంతో గాయాలపాలైన అఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తండ్రి శంకరరావు గాయాలపాలయ్యాడు. సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అఖిల్ వైద్యపరీక్షలు చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం ప్రాణాలు కోల్పోయిన పదవతరగతి విద్యార్థి అఖిల్ తండ్రి శంకరరావుకు గాయాలు -
ఆండ్ర జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
మెంటాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను ఆంధ్రప్రదేశ్ మీదుగా గోదావరికి అనుసంధానించే ప్రతిపాదిత మార్గంలో ఉన్న ఆండ్ర జలాశయాన్ని జాతీయ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఇంజినీరు దేవానందరావు, అంతరరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీరు టి.గోవిందరావు నేతృత్వంలోని ఈ బృందం జలాశయం ప్రస్తుత స్థితిగతులను, ఇక్కడ చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రూ. 54,019 కోట్ల మెగా ప్రాజెక్టు సుమారు రూ. 54,019 కోట్ల అంచనా వ్యయంతో నదుల అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు బృంద అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ రిజర్వాయర్కు, అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని జంఝావతి జలాశయానికి, విజయనగరం జిల్లాలో ఉన్న ఆండ్ర, తాడిపూడి జలాశయాలకు అనుసంధానిస్తారు. ఆపై అనకాపల్లి జిల్లాలోని రైవాడ రిజర్వాయర్కు గోదావరి నది జలాలను మళ్లిస్తామని వివరించారు. తొలివిడత క్షేత్రస్థాయి పరిశీలన నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రధాన కాలువ ఆండ్ర జలాశయం మీదుగా వెళ్లనుందని, ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి తొలి పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీసి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్శనలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీరు వేణుగోపాల్, ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈ గోవిందరావు, ఆండ్ర రిజర్వాయర్ డీఈ రామునాయుడు, ఏఈ కృపాంద్, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కుట్ర?
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026బంద్ విచ్ఛిన్నానికి..● బంద్ రోజునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు ● ఆదివాసీ దినోత్సవం తేదీ మార్పుపై గిరిజన సంఘాల ఆగ్రహం11న సీతంపేట ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవంసీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో అమరావతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నందున అక్కడికి మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో 9వ తేదీకి బదులు 11న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, గిరిజనసంఘాలు, గిరిజన ప్రజలు, పెద్దలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇకపై సోమవారమే పీజీఆర్ఎస్సీతంపేట: ఇకపై ప్రతి సోమవారం మాత్రమే ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వారంలో ప్రతి శుక్రవారం, సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించేవారమని ఇకపై వారంలో సోమవారం ఒకరోజు మాత్రమే ఉంటుందన్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇన్చార్జ్ పీఓ అందుబాటులో ఉంటారని, గిరిజనులు తమ సమస్యలను వినతుల రూపంలో విన్నవించుకోవచ్చన్నారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు వీలుగా మార్పు చేశామని గమనించాలని కోరారు. పార్వతీపురం రూరల్: మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. అధికారుల సమీక్షా సమావేశానికి పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో, ఏకంగా రెండు గంటల పాటు ఆఫీసు బయట వరండాలో నేలపై కూర్చుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాసరాజు, డీపీహెచ్ఓ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, సిబ్బంది మధ్యాహ్నం 2:10 నుంచి 2:15 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకునే సరికి అధికారులు సమావేశం ప్రారంభించి తలుపులు మూసివేశారు. దీంతో అడ్మిన్, హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, ఉమెన్ ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకు చెందిన సుమారు 35 మంది సెక్రటరీలు లోపలికి వెళ్లలేక బయటే ఉండిపోయారు. అసలు ఆ సమావేశం ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టతలేని సిబ్బంది.. సాయంత్రం నాలుగు గంటల వరకు వరండాలోనే వేచిచూశారు. లోపల ఉన్న అధికారులు డోర్లు తీయకపోవడం, కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతో చేసేది లేక నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జీవో–3 పరిరక్షణ, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం అమలుకు మద్దతుగా ఆగస్టు 8న పిలుపునిచ్చిన మన్యం బంద్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఏటా ఆగస్టు 9న నిర్వహించే అంతర్జాతీయ ఆది వాసీ దినోత్సవాన్ని ఈసారి ఒక రోజు ముందుగా.. అంటే 8న నిర్వహించాలని నిర్ణయించడంపై ఆదివాసీ, గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆగస్టు 9నే ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన సంఘాలు ముందురోజు ఐటీడీఏ వద్దనున్న అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం వంటివి చేస్తుంటారు. మరుసటి రోజు అధికారిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు. ఈసారి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన తేదీని మార్చడం వెనుక ఉద్దేశం ఏమిటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మంత్రి సంధ్యారాణి తీరును దుయ్యబడుతున్నాయి. అదే రోజున మన్యం బంద్కు పిలుపు ఆగస్టు 8న మన్యం బంద్కు పిలుపునివ్వడంతో, రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ శనివారం నిర్వహిస్తున్నందున ఆర్టీసీ అధికారులు సహకరించాలని ఆదివాసీ, గిరిజన సంఘం, ప్రజా సంఘాల నాయకులు రామస్వామి, రంజిత్ కుమార్, బలరాం, బి.వి.రమణ, గొర్లి వెంకటరమణ, రెడ్డి వేణు తదితరులు కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆందోళనకారులు బస్ సర్వీసులను నిలువరించక ముందే బస్సులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మణరావును కలిసి వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి ఏజెన్సీ బంద్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.●అధికారిక కార్యక్రమాలకు గిరిజనులను, సంఘాలను తరలించి బంద్ ప్రభావాన్ని తగ్గించాలనే ప్రయత్నమేనని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరో పిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే తేదీ మార్పు చేయాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని సంఘాల నాయకులు చెబుతున్నారు. బంద్ను బలహీనం చేసే వ్యూహమా..? కూటమి నేతలు గత ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీనే అమలు చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీనికితోడు జీవో 3పై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూటకో ప్రకటన చేస్తూ మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే జీవో–3, గిరిజన భూ హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న మన్యం బంద్కు స్పందన లేదనే భావన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని గిరిజన, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. బంద్ రోజునే ప్రభు త్వ ఆధ్వర్యంలో భారీగా గిరిజన ఉత్సవాలు నిర్వహించి ఉద్యమ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని మండిపడుతున్నాయి. జీవో–3లో మంత్రిని ప్రశ్నిస్తూ మన్యం వెలసిన పోస్టర్లు -
కామన్వెల్త్ విజేతకు ఘనంగా స్వాగతం
● అజయ్బాబుపై అపూర్వ అభిమానం చూపిన గ్రామస్తులునెల్లిమర్ల రూరల్: కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకం సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన వెయిట్లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు శుక్రవారం తన స్వగ్రామం కొండవెలగాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విజయనగరం ఎత్తు బ్రిడ్జి వద్ద నుంచి అజయ్ బాబును ర్యాలీగా కొండవెలగాడకు తీసుకువెళ్లారు. దారిపొడవునా అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అజయ్కు అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీ గదల సన్యాసి నాయుడు, ఎంపీటీసీ మొయిద అక్కోజీ, చంద్రంపేట సర్పంచ్ కర్రోతువెంకట రమణ తదితరులు అజయ్ బాబును సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకం సాధించడం జిల్లాకు, స్వగ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. గ్రామానికి చేరుకున్న అజయ్ బాబుకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.విజయనగరంలో సత్కారం విజయనగరం: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్ బాబుకు ఘన స్వాగతం లభించింది. పోటీలు ముగించుకుని శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న అజయ్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుశ్శాలువాతో సత్కరించారు. అదేవిధంగా జిల్లా క్రీడాఫ్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
● మా కడుపు కొట్టి.. ఉత్సవాలా?
‘మా కడుపు కొట్టి, ఆదివాసీ ఉత్సవాలు నిర్వహించేందుకు మనసు ఎలా వస్తుందని వైటీసీ గిరిజన గర్భిణి వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు వాపోయారు. ఏళ్లతరబడి అందిస్తున్న తమను తొలగించడంతో రోడ్డున పడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ పార్వతీపురం ఐటీడీఏ వద్ద శుక్రవారం ఉదయం నుంచి రాత్రివరకు నిరసన తెలిపారు. వర్షం కురుస్తున్నా అక్కడే బైఠాయించారు. 20 నెలలుగా బకాయి జీతాలు ఇవ్వలేదని వాపోయారు. దీనిపై పీఓ వైశాలి స్పందిస్తూ ఏఎన్ఎంలతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
పోలమాంబ హుండీల ఆదాయం రూ.8,90,817
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను దేవదాయశాఖ, బొబ్బిలి తనిఖీదారు ఎన్.రాజకుమారి, ఈవో వీవీ సూర్యనారాయణ, ట్రస్ట్బోర్డు చైర్మన్ ఎన్.తిరుపతిరావు, కమిటీసభ్యులు, గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం లెక్కించారు. ఈఏడాది మార్చి26 నుంచి ఆగస్టు 6వతేదీ వరకు వనంగుడి, చదురుగుడిలో మొత్తం రూ.8,90,817 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో మాజీచైర్మన్లు, ధర్మకర్తలు, కురుపాం మండలం శ్రీవారిసేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎల్నినో ప్రభావంపై అవగాహన
● ఆత్మ సౌజన్యంతో కార్యక్రమం ● క్షేత్రస్థాయిలో వరిసాగును పరిశీలనవేపాడ: ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను అధిగమించేందకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ మేరకు గురువారం వేపాడ మండలంలోని చినదుంగాడలో వ్యవసాయశాఖ మండల ఏఓ స్వాతి ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతు శిక్షణ కేంద్రం అధికారిణి నిర్మల మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని దీనికి ప్రత్యామ్నాయంగా చోడి, కొర్ర తక్కువ నీరు అవసరం ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. సైంటిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎల్నినో వల్ల వర్షాలు లేక నారుమడి ఎక్కడైనా ఎండిపోయినట్లయితే 19.19.19ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి అంతా పిచికారీ చేసినట్లయితే నీటి ఎద్దడి నుంచి వరి నారును కాపాడుకోవచ్చునని వరి పంటలో స్వల్పకాలిక రకాలు వెద పద్ధతిలో సాగుచేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం కూడా వర్షాలు లేకపోతే చోడి, కొర్ర లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవడం వల్ల 6–8 టన్నుల సేంద్రియ ఎరువు భూమిలో చేరి 50% వరకు ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. కొత్తవలస ఏడీఏ భానులత మాట్లాడుతూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని వరి పంటకు ఎకరాకు రూ.200 చొప్పున చెల్లిస్తే రూ.40,000 వరకు ఇన్సూరెనన్స్ కవర్ అవుతుందని, నారు వేసిన వారు, వెద పద్ధతిలో సాగు చేసిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేపాడ, వీలుపర్తి, కుమ్మపల్లి వీఏఏలు వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
● వీరు మారరంతే..
ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా.. వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతూ కన్నవారికి కన్నీరు మిగిలిస్తున్నారు.. ముఖ్యంగా యువత ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదు.. ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించి వెళ్తున్నారు.. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోవడం లేదు.. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి, అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రాకపోవడం బాధాకరం. మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనంపై నలుగురు, మరో వాహనంపై ముగ్గురు హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణిస్తూ సాక్షి కంటపడ్డారు. – గజపతినగరం -
ఉసురు తీస్తున్న ఉపాధి
బొబ్బిలి: రాష్ట్రాలు విడిచి వచ్చి ఉపాధి కోసం బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్లో పనిచేస్తున్న కార్మికులకు సౌకర్యాలు, వేతనాల కన్నా యజమానుల నిర్లక్ష్యం వల్ల వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. చుట్టుపక్కల ఎంత మంది నిరుద్యోగులున్నా గతంలో జీఓలు విడుదల చేసినప్పటికీ స్థానికులను యాజమాన్యాలు చేర్చుకోవడం లేదు. గ్రోత్ సెంటర్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. అదేవిధంగా వివిధ స్కిల్డ్, అన్స్కిల్డ్ తో పాటు ఉన్నతోద్యోగాలు చేసేవారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వారైతే తక్కువ వేతనం, ప్రమాదాలు జరిగినా అంతదూరం నుంచి వచ్చి అల్లరి చేయరు. పైగా 10 గంటల నుంచి 12 గంటల వరకూ పనిచేయించుకోవచ్చు. ఏమైనా అయితే కంపెనీలకు నచ్చినంత పరిహారం ఇచ్చినా గమ్మునుంటారనే తీరు గ్రోత్సెంటర్లో నడుస్తోంది. స్థానిక గురుదత్త కంపెనీలో మంగళవారం మృతి చెందిన బికాస్ అనే యువకుడికి ఎంతో భవిష్యత్తున్నప్పటికీ చిన్నతనంలోనే ఇక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెంది కుటుంబ సభ్యులను అనాథలను చేయడంలో అధికారులు, యజమానుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బెర్రీలో ఐదుగురు ఒకేసారి బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్లో నాలుగేళ్ల క్రితం ఇరుకు గదిలో ఉంటున్న 14 మంది గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు బీహార్కు చెందిన యువకులే కాలిన గాయాలతో మృతి చెందారు. అలాగే ఇక్కడున్నపెట్రోల్ బంకులో ముగ్గురు మృతి చెందారు. ఫర్నేస్ కాలిపోయి బాలాజీ కంపెనీలో నలుగురు మృతి చెందారు. సుమారు 12 సంవత్సరాల క్రితం సంక్రాంతి సమయంలో జరిగిన బెర్రీ కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దహన సంస్కారాలకు, పరిహారం కింద ఏడు లక్షలు చొప్పున పరిహారం ముట్టజెప్పారు. అదే గ్రోత్ సెంటర్లో ప్రమాదాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు అందించిన అత్యధిక పరిహారమంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా మృతిచెందితే రూ.2లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరు కాక గ్రోత్ సెంటర్లోని పలు పరిశ్రమల్లో ఇప్పటివరకూ దాదాపు 20 నుంచి 30 మంది ప్రాణాలు విడిచి ఉంటారని కార్మికులే చెబుతున్నారు. గ్రోత్సెంటర్లో పరిశ్రమల కన్నా యజమానుల నిర్లక్ష్యమే అధికం తక్కువ వేతనంతో ఎక్కువ పని.. మృతి చెందితే సెటిల్మెంట్లు ఇక్కడ పనిలో బిహార్, ఎంపీ ప్రాంతాల వారురక్షణ లేదు.రక్షణ పరికరాలివ్వరు ఇక్కడి కంపెనీల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు రక్షణ పరికరాలు ఉండడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వారు మృత్యువాత పడుతున్నారు. కంపెనీల భవనాలు కూడా నాణ్యత లేకుండా ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ కంపెనీ గోడ కూలి మేకల పెంపకదార్లు ఇద్దరు మృతి చెందారు. కంపెనీలపై కేసులుండడం లేదు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సెటిల్మెంట్లు చేస్తున్నారే తప్ప కేసులు ఉండడం లేదు. దీని వల్ల కార్మిక శాఖ, కంపెనీల తరపున రావాల్సిన నాణ్యమైన పరిహారం ఆయా కుటుంబాలకు అందడం లేదు. పైగా మధ్యవర్తులు తలదూర్చి డబ్బులు చేతులు మారుతున్నాయి. దీని వలన ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో వారి రక్తసంబంధీకులను ఇక్కడే దహనం చేసి కన్నీళ్లతో తిరిగి వెళ్లిపోతున్నారు. కంపెనీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోరు సాంబయ్య, అంబేడ్కర్ పోరాట సమితి, బొబ్బిలి ఎదిరించి అడిగితే ముడుపులు ఇచ్చి కామ్ చేస్తారు గ్రోత్ సెంటర్ కార్మికులకు అసౌకర్యాలున్నాయని, భద్రత లేదని, ఇరుకు గదుల్లో పెట్టి ఉంచుతున్నారని ప్రశ్నించిన వారికి ముడుపులు ఇచ్చి కామ్ చేస్తున్నారు. ఏపీఐఐసీ ఎం.డి కాని, స్థానిక పాలకులు కాని ఏనాడైనా గ్రోత్సెంటర్లోని పరిశ్రమలు, సౌకర్యాలపై ఆరా తీశారా? ప్రెస్మీట్లు పెట్టారా? అంటే అదీ లేదు. మరి కంపెనీల యాజమాన్యాలు నిర్లక్ష్యం ఎందుకు వీడుతాయి.? పొట్నూరు శంకర రావుఅధికారులెవరూ ఉండరు గ్రోత్ సెంటర్లో పరిపాలన భవనం దాదాపు ఓ కలెక్టరేట్ను తలపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు ఎవరూ ఉండడం లేదు. ఓ కంప్యూటర్ ఆపరేటర్, వాచ్మన్ మాత్రమే ఉంటారు. వారానికో రెండు వారాలకో వచ్చే అధికారులు ఓ సారి తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా అధికారుల అవసరం ఉందంటే విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటుంది. -
మద్యంతర ఉత్తర్వులు..!
వీరఘట్టం: ఎవరేమనుకుంటే మనకేమి? మన పని జరిగిపోతే చాలని భావిస్తోంది టీడీపీ మద్యం సిండికేట్. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎకై ్సజ్శాఖ అడ్డుగోలుగా నిర్ణయం తీసుకోవడం వెనుక మద్యం సిండికేట్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఒక బార్ను వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు అనుమతి ఇస్తూ ఎకై ్సజ్శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకై ్సజ్శాఖ వర్గాలే విస్తుపోయేలా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నోటిఫికేషన్ లైసెన్స్ పార్వతీపురంలో.. గతంలో బార్ల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఎకై ్సజ్ పాలసీని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మాత్రమే బార్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. ఆ నిబంధనల మేరకు గతంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయించారు. ఆ విధంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్లు ఏర్పాటయ్యాయి. అయితే ఇదిలా ఉండగా..ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిబంధనలను తోసిరాజని వీరఘట్టానికి బదిలీ పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఒక బార్ను వీరఘట్టం పంచాయతీకి మార్చాలని టీడీపీ సిండికేట్ భావించింది. కానీ వీరఘట్టం పంచాయతీ పరిధిలో బార్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. ఇదే విషయాన్ని ఎకై ్సజ్శాఖ స్పష్టం చేసింది. అయినా సరే టీడీపీ సిండికేట్ రాజధాని స్థాయిలో పావులు కదిపింది. పార్వతీపురంలో ఉన్న బార్ను నిబంధనలకు విరుద్ధంగా నైనా సరే వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ఏకంగా ఎకై ్సజ్శాఖ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసేలా కథ నడిపించింది. టీడీపీ మద్యం సిండికేట్తో కుమ్మకై ్కన ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు జీఓ జారీ చేశారని ఎకై ్సజ్శాఖ వర్గాలే విమర్శిస్తున్నాయి. పంచాయతీల్లో అసాంఘిక పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు బార్లు ఏర్పాటు చేయకూడదన్నది గతంలో తీసుకున్న నిబంధన. అయినా సరే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ టీటీపీ మద్యం సిండికేట్ దోపిడీకి ప్రభుత్వం తలుపులు తెరచింది.దీనిపై వీరఘట్టం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బార్ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.ఇది ప్రభుత్వ నిర్ణయంపార్వతీపురంలో ఉన్న సీఆర్బీ వైన్స్ రెస్టారెంట్ అండ్ బార్ను వీరఘట్టంలో పెట్టుకునేందుకు బార్ యజమాని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు మేరకు బార్ను వీరఘట్టం తరలించేందుకు అనుమతులు వచ్చాయి.ఇది ప్రభుత్వ నిర్ణయం. బార్ ఏర్పాటుకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. కె.సహదేవ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం జిల్లా బార్ ఏర్పాటు చేస్తే గొడవలు పెరుగుతాయివీరఘట్టంలో ప్రస్తుతం ఉన్న మూడు మద్యం దుకాణాల వల్ల చీకటి పడితే రోడ్లపై నిత్యం ఏదో ఒక తగాదా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బార్ ఏర్పాటు చేస్తే మరిన్ని తగాదాలు ఏర్పడతాయి. బార్ ఏర్పాటును అడ్డుకుంటాం. వీరఘట్టం పట్టణ అభివృద్ధికి ఏదో ఒక మంచి పనిచేయండి తప్ప బార్లు ఏర్పాటు చేసి తగాదాలను పెంచవద్దు. జె.అమర్నాథ్, వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్ తరలింపు ఉత్తర్వులు జారీ చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు బార్ ఏర్పాటును అడ్డుకుంటామంటున్న వీరఘట్టం ప్రజలు -
ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు
పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 8న ఉదయం 10 గంటలకు పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షే మ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతి థిగా హజరవుతారన్నారు. గిరిజన కళా, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, స్వయం సహా యక సంఘాల మహిళలు, వన్ధన్ వికాస్ కేంద్రా ల సభ్యులు, యువత, రైతులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి తదితరులు పాల్గొన్నారు. పనుల్లో నాణ్యతలో రాజీ వద్దు జిల్లాలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలు, సంక్షేమ వసతి గృహల పనులను జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పదొద్దని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరె డ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న భవనాల నిర్మాణ పురోగతిపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్ట ర్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తర చూ తనిఖీలు నిర్వహించి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు. సమావేశంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పీఓలు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఈఓ పి.బ్రహ్మజీరావు తదితరులు పాల్గొన్నారు. 8న భద్రగిరిలో 50 పడకల సీహెచ్సీ ప్రారంభం భద్రగిరిలో నాబార్డ్ నిధులు రూ.8,95 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)ని ఈనెల 8న ప్రారంభించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయంతో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. -
శాకంబరీ దేవిగా గారమ్మ
పాలకొండ రూరల్: నమ్ముకున్నవారి కొంగు బంగారంగా పాలకొండ గ్రామ దేవత గారమ్మ విరాజిల్లుతున్నారు. ఇటీవల అమ్మవారికి ఆషా డం సారె సమర్పించిన భక్తులు గురువారం కాయగూరలు సమకూర్చటంతో గారమ్మ శాకంబరీగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలో పట్టణ పురవీధులకు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మసేవలో నిమగ్నమయ్యారు. స్థానికులు అందించిన కూరగాయలతో అర్చకులు అమ్మవారిని, ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శాకంబరీ దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో స్థానికులు బారులు తీరారు. -
నిరసన దీక్ష
డీఎస్సీ దగాపై పార్వతీపురం వైఎస్సార్ కూడలిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న యువతకు సంఘీభావం తెలుపుతూ నినదిస్తున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూ నిరుద్యోగులు కదంతొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నారా లోకేశ్ బాధ్యత వహించా లని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ, నియామకాల్లో అవకతవకల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు తారుమారయ్యాయని, ఎంత కష్టపడి చదివి నా నిరుద్యోగులుగా మిగిలిపోయామని వాపోయా రు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిరుద్యోగులకు కష్టాలు తప్పడంలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3వేలు భృతిహామీ నెరవేర్చలేదని, విద్యార్థుల చదువులకు ఆధారమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నారని జెన్జీ యువత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు పాలన కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలకు కురుపాంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంఘీభావం తెలిపారు. కురుపాం దీక్షలో పుష్పశ్రీవాణి స్వయంగా పాల్గొన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. – సాక్షి, పార్వతీపురంమన్యం యువత ఉద్యమ స్ఫూర్తిని అందుకోవాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిలదీయాలి. నిరుద్యోగభృతి, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. డీఎస్సీ అవతవకలపై విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ నోరుమెదకపోవడం విచారకరణం. తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. అప్పటివరకు నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీసీఎం -
జిల్లాలో ఐదు సీహెచ్సీల ఏర్పాటు
● లైవ్లీ హుడ్ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.రాజ్కుమార్రామభద్రపురం: జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా రూ.75 లక్షలతో ఐదు కస్టమ్స్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా లైవ్లీ హుడ్ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.రాజ్కుమార్ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సీహెచ్సీ షెడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన గురువారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 27 కస్టమ్ హైరింగ్ సెంటర్లు మంజూరు కాగా మొదటి విడతలో రామభద్రపురం, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, ఎల్కోట మండలాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే ఈ సీహెచ్సీలలో రైతుల వ్యవసాయ సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, రొటొవేటర్లు, పవర్ ట్రిల్లర్స్, స్ప్రేయర్స్ దమ్ము సెట్లు తదితర వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంచుతూ ఎఫ్పీవోల ద్వారా తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వనున్నారన్నారు.ఈ నెల 15 లోగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని 117 ఎకరాల్లో మునగసాగు వేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పెరియా కులం యూనివర్సిటీ నుంచి పీకేఎం మునగ విత్తనం తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ మునగ పంట నుంచి కాయలు కాకుండా ఆకులు కోసి బాగా ఆరబెట్టి పొడి తయారు చేసి విక్రయించనున్నారన్నారు. దత్తిరాజేరు మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే 5 మండలాల్లో 406 మంది రైతులతో వెదురు సాగు చేసేందుకు ఎంపిక చేశామన్నారు. మునగ, వెదురు సాగు చేసే రైతులకు వీబీజీ రామ్జీ పథకం నుంచి ఆర్థిక సాయం అందిచనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం సత్యవతి పాల్గొన్నారు. -
కరుణించిన వరుణుడు
పాలకొండ రూరల్: కొద్ది రోజులుగా అన్నదాతలు వరుణుడి కరుణ కోసం ఎంతో ఆశగా ఎదు రు చూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మండల వ్యాప్తంగా భారీ వర్షం దాదాపుగా రెండు గంటలపైబడి కురిసింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే వరి భూముల్లో సాగునీరు లేక తీవ్ర ఎండలకు నష్టపోతున్న పంటకు ఈ వర్షం జీవం పోషింద ని కర్షకులు పేర్కొంటున్నారు.తాజా తడులతో తమ పంటలకు ఎరువులు, క్రిమిసంహార మందులు అందించేందుకు వెసులుబాటు కలిగిన ట్లు చెబుతున్నారు. మరోవైపు ఎరువుల వాడకంలో అవసరమైన సూచనలతో మందులు వేయాలని మండల వ్యవసాయాధికారి వరప్రసాద్ సూచించారు. ముదురు నారు వేసేందు కు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షంతో పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. వార్డుల్లో పలు చోట్ల కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు రోడ్లపైకి చేరింది. భామిని: ఏనుగుల దాడిలో ఆస్తులు కోల్పోయిన బాధితులందరికీ తగిన పరిహారం అందించనున్నట్లు జిల్లా అటవీశాఖాదికారి జీఏపీ ప్రసూన గురువారం తెలిపారు. ఈ మేరకు భామిని మండలం పాలవలస గిరిజన గ్రామంలో నాలుగు ఏనుగుల దాడిలో సర్వం కోల్పోయిన గిరిజన బాధితులను ఆమె కలిసి ఓదార్చారు. నష్టాలనుంచి బయట పడడానికి నింబంధనల మేరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ గ్రామంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తరలింపుపై బాధిత గిరిజనులు ఆమెకు మొర పెట్టుకున్నారు. తమ ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎఫ్ఓ ప్రసూన వెంట సబ్ డీఎఫ్ఓ సంజయ్ ఎల్లా, ఎఫ్ఆర్ఓ మణికంఠేష్, ఎఫ్ఎస్ఓ రామకృష్ణ, ఎఫ్బీఓ కేశవరావు, ట్రాకర్స్ ఉన్నారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ సాలూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సీపీఐ నాయకులు కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నుంచి ఈ నెల 15 వరకు దేశ వ్యాప్తంగా జరుగతున్న ప్రజా చైతన్య పాదయాత్రలను నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ కార్యదర్శి బలగ రాధానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. -
సహజ ఆహారమే పిల్లలకు శ్రీరామరక్ష
పార్వతీపురం: పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్కు సహజమైన పౌష్టికాహారమే శ్రీరామ రక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఐసీడీఎస్ సమీక్షా సమవేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బిడ్డపుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వడం, రెండేళ్లవరకు తల్లిపాలు అందించడం అత్యవసరమని సూచించారు. రెండేళ్లలోపు పిల్లలకు చక్కెర, అధిక ఉప్పు, మసాలాలు, కూల్డ్రింక్స్, ప్రోపెస్ చేసిన జ్యూస్లకు దూరంగా ఉంచి పండ్లు, కూరగాయలు, సహజ ఆహారాన్ని అలవాటు చేయాలని తెలిపారు. పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించకుండా స్వయంగా తినే అలవాటు పెంపొందించాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబ ఆదాయం రెట్టింపు లక్ష్యంగా కార్యాచరణ జిల్లాలోని ప్రతి కుటుంబం కనీసం రూ. 5లక్షల వార్షిక ఆదాయం సాదించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక కొత్త ఆదాయ వనరుల యూనిట్ను ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాల రుణాలను ఉత్పాదక రంగాలకే వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత విద్య, వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని కుటుంబ వ్యయాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నపాటి అనారోగ్యాలకు ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్.ప్రభావతి, సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు. -
గురువులపై విద్యార్థుల గుర్రు
గుమ్మలక్ష్మీపురం: విద్యాబుద్ధులు నేర్పని ముగ్గురు టీచర్లు మా కొద్దంటూ..విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు నిరసన చేపట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని గొయిపాక పంచాయతీ కుంతేసు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోడల్ స్కూల్గా మారింది. కాగా రెగ్యులర్ ఉపాధ్యాయులు ముగ్గురు ఉంటుండగానే..ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి బొబ్బిలి, విజ యనగరం నుంచి డిఫ్యుటేషన్పై ఇద్దరు ఉపాధ్యాయులను ఆ పాఠశాలకు నియమించారు. ఐదుగు రు ఉపాధ్యాయులున్న ఆ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5 తరగతులకు చెందిన 54 మంది విద్యార్థులున్నారు. అయితే డిప్యుటేషన్పై వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు కె.నాగభూషణరావు, వై.శ్రీనివాసరావు రెగ్యులర్గా పాఠశాల సమయానికే హాజరై విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ..సమయం పూర్తయ్యాకే వెళ్తుండగా..మిగిలిన ముగ్గురు రెగ్యుల ర్ ఉపాధ్యాయులు మాత్రం సమయానికి పాఠశాల కు హాజరుకాకపోవడం, లేటుగా రావడం, వచ్చినా ..కొద్దిసేపు ఉండి వెళ్లిపోతుండడం, విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పకపోవడం, ప్రధానంగా పాఠశాలకు తాగివస్తుండడం, పాఠాలు చెప్పే టీచర్లతో గొడవలకు దిగడం వంటి చర్యలను గమనించిన గ్రామస్తులు ఆగ్రహింహించారు. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని గురువారం పాఠశాలకు తాళం వేసి, పాఠశాల ఆవరణలోనే టెంటు వేసి విద్యార్థులతో పాటు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కు దిగారు. తాగుబోతు టీచర్లు మాకొద్దు. వేరే టీచర్లు కావాలి. చక్కని విద్యను అందివ్వాలి. పాఠశాల పవిత్రతను కాపాడాలంటూ పీఎంసీ చైర్మన్ కిల్లక శంభు, వైస్ చైర్మన్ కిల్లక శ్రీను, కిల్లక రాజారా వు, గుంపస్వామి, జగ్గారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం ఈ సమాచారం తెలుసుకున్న ఎంఈఓ సీహెచ్.శ్రీనివాసరావు కుంతేసు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి, తక్షణమే ఆ ముగ్గురు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, కుంతేసు నుంచి వేరే పాఠశాలలకు పంపివేస్తామని, వేరే పాఠశాలల నుంచి మరో ముగ్గురు ఉపాధ్యాయుల్ని డిప్యుటేషన్పై నియమిస్తామని హామీ ఇవ్వడంతో, కాసేపటికి గ్రామస్తులు నిరసన విరమించారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే మరింత ఉధృతంగా నిరసనకు దిగుతామని గ్రామస్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు. -
వీఆర్ఎస్ అధికారుల తీరుపై రైతుల మనస్తాపం
మక్కువ: ఎల్నినో ప్రభావంతో ఈఏడాది రైతులు పంటల సాగు విషయంలో ఇబ్బందులు పడే ఆస్కారముందని ఇరిగేషన్ అధికారులకు ముందుగానే సమచారం ఉంది. వర్షాలు కురవక, వీఆర్ఎస్ ప్రాజెక్ట్లో నీరుచేరని విషయం తెలుసు. ఈ ఏడాది పంటల సాగువిషయంపై నారుమడులు తయారుచేయకముందు, ఇరిగేషన్ అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించుంటే, ప్రత్యామ్నాయం చూసుకునేవాళ్లమని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించి, నారమడులను రైతులు తయారుచేశారు. వాటిని కాపాడుకునేందుకు మోటార్లు, ట్యాంకర్లు, బిందెలతో నీటిని తీసుకెళ్లి తడుపుకుంటూ కాపాడుకున్నారు. మరమ్మతులకు గురైన స్పిల్వే ద్వారా లీకేజీనీటిని, ఇరిగేషన్ అధికారులు అరికట్టకుండా, పనుల పేరిట కాలువ మధ్యలో ట్రెంచ్లు కొట్టి నదులోకి వదిలేశారు. కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఏడాది సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 156 మీటర్ల నీటి నిల్వ ఇదిలా ఉండగా వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ ద్వారా కాలువలకు సాగునీటిని శుక్రవారం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. వీఆర్ఎస్(ఎఫ్ఆర్ఎల్) పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవెల్ 161.00మీటర్లు కాగా, ప్రస్తుతం 156.00మీటర్ల నీటి నిల్వ ఉంది. అంటే ప్రాజెక్ట్లో నీటినిల్వ కేవలం 35శాతం మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. కాలువల ద్వారా నీటిని పూర్తిస్థాయిలో విడిచిపెడితే, ప్రస్తుతమున్న నీరు కేవలం 15రోజులు మాత్రమే సరఫరా అవుతుంది. ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలిసినప్పటికి, చేసిందంతా చేసి, ఇప్పుడు మెప్పుకోసం నీరు విడుదలకు సిద్ధమయ్యారని రైతులు విమర్శిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోయి, ప్రాజెక్ట్ నిండకపోతే సాగుచేసిన పంటలు నష్టపోతే ఆనష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలంటూ పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ డీఈఈ సురేష్ను వివరణ కోరగా నారుమడులు బతికిద్దామనే ఆలోచనతో నీరు విడుదలకు సిద్ధమయ్యామన్నారు. 15ఎల్, బొబ్బిలి టెయిలెండ్ వరకు కాలువల పనులు జరిపించడంతో, మధ్యలో ట్రెంచ్కొట్టి లీకేజీనీటిని నదిలోకి విడిచిపెట్టామన్నారు. నీరువిడుదల అంశంపై గురువారం నీటిసంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి, నీటివిడుదల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. -
‘మీ పోలీస్–మీకు తెలుసా?’
పార్వతీపురం రూరల్: చట్టాలపై అవగాహన కల్పించి, యువతను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు అక్షర సమరానికి శ్రీకారం చుట్టారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ’మీ పోలీస్–మీకు తెలుసా?’ పేరిట ఈ నెల 9న విద్యార్థులకు నిర్వహించనున్న ప్రత్యేక పరీక్ష ప్రచార పోస్టర్ను ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సైబర్ నేరా లు, గంజాయి కట్టడి, రహదారి భద్రత, మహిళా రక్షణ, పోలీసుల విధులపై విద్యార్థుల పరిజ్ఞానా న్ని ఈ పరీక్ష అంచనా వేస్తుంది. విద్యార్థి దశలోనే మంచిచెడుల విచక్షణ అలవడుతుందని, యువత సృజనాత్మకంగా ఆలోచిస్తేనే సురక్షిత సమాజం సాధ్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నెల 9న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష జరుగుతుంది. 21 ఏళ్లలోపు విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఆసక్తి ఉన్నవారు పట్టణ పోలీసుల వద్ద కానీ, పరీక్షకు గంట ముందు కేంద్రం వద్ద కానీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. 30 నిమిషాల వ్యవధిలో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి డ్రాప్ బాక్స్లో వేయాలి. విజేతలైన మొదటి ముగ్గురికి ఎస్పీ చేతులమీదుగా బహుమతులు, పాల్గొన్న వారందరికీ ఆన్లైన్ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, జీఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?
● ఎస్ఎమ్ఏ వ్యాధి నివారణకు రూ.కోట్లలో ఇంజక్షన్ ● డబ్బులు దోచుకునేందుకేనే ఇన్ప్లూయన్సర్స్ ● సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారిన వైనం ● ఎవరినీ ఉపేక్షించేది లేదు: ఎస్పీవిజయనగరం టౌన్: స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ(ఎస్ఎంఎ) టైప్–1 అనే ఒక తీవ్రమైన, జన్యుపరమైన నరాల కండరాల వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్కు రూ.కోట్లలో ఖర్చుచేయాల్సి ఉంది. లక్షల్లోనే తట్టుకోలేని నిరుపేద కుటుంబాలకు కోట్లు ఖర్చు అంటే ఆశలు వదులుకోవాల్సిందే. అటువంటి వారికి పునర్విక విషయంలో ప్రపంచమంతా స్పందించడం విశేషం. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో పూల్బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న లిటిల్ కృష్ణ అనే బాబు ఇదే వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే. ఆ బాబును కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు బాధ్యతగా సాయమందించారు. ఎందరో సమాజ సేవకులు రోడ్లెక్కి డబ్బులు సేకరించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది సభ్యులుగా ఉన్న కొందరు ఇన్ప్లూయన్సర్స్ ఇదే అదునుగా తీసుకుని డబ్బులు దోచుకోవడానికి తమ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని పూర్తికానిచ్చేశారు. అందుకోసం వారు బాబు తల్లిదండ్రులను సైతం మభ్యపెట్టి, డబ్బులు వచ్చే మార్గాలను, ప్రజలను నేరుగా మోసం చేసే ప్రక్రియలో సగటు మనిషిని పూర్తిగా తమ మానవత్వానికి కల్పిత కథలు జోడించి, ఆ వీడియోలను వారు అనుకున్న పథకం ప్రకారం సోషల్ మీడియోలో పోస్టులు పెడుతూ బాబు ఇంజక్షన్కు కావాల్సిన కోట్లరూపాయల టార్గెట్ను పూర్తిచేసుకున్నారు. బాబు తల్లిదండ్రుల నుంచి వాటా వసూలు ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ బాబుకు కావాల్సిన ఇంజక్షన్కు కోట్ల రూపాయలను సమకూర్చడంలో తమకు రావాల్సిన వాటాను సైతం బాబు తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేసినట్లు భోగట్టా. చెక్కుల రూపంలో, నగదు రూపంలో సుమారు రూ. 50 లక్షలపైనే గుంజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యోపాపమంటూ ఇప్పుడిప్పుడే ప్రజల్లో మంచి పేరుతెచ్చుకుంటున్న సింగర్స్, యాక్టర్స్ సైతం వీరు చేసిన పాపాలకు నెటిజన్లకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తంతు అంతా గమనించిన విజయనగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవహారాన్ని వెలికి తీయగా అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దోచుకున్న వారంతా రోజుకో కొత్త వెర్షన్లో సమాధానాలు చెబుతుండడంతో కథ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒక్క విజయనగరమే కాదు..ఏకంగా ఉభయ రాష్ట్రాల్లోనే ఎంతో మంది వద్ద ఇన్ఫ్లూయన్సర్స్ భారీగా దోచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకడు బైక్ అమ్మేశానని, మరొకరు ఇల్లు, కారు అమ్మేశానని, మరికొందరు తన బంగారం సైతం అమ్మేసి డబ్బులు పంపించానని కట్టుకథలే అల్లారా ? అసలు ఏది నిజం ? చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడడం, శవాలపైన డబ్బులు ఏరుకోవడం, ఈజీమనీ సంపాదించడంలో ఇటువంటి మోసాలకు పాల్పడడం పట్ల నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎవరికై నా సాయమందించాలంటే అందులో వాస్తవమెంత ఉందో కూడా అర్థం కాని పరిస్ధితి తలెత్తింది. ఇదిలా ఉంటే తాజాగా దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు తమ బిడ్డకు ఇంజ్షన్ కోట్లలో ఖర్చవుతుందని సాయమందించాలని కోరారు. విజయవాడలో రిషి అనే చిన్నారి ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి చిన్నారుల పరిస్ధితి ఏంటి? ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి సమస్య పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
చివరి భూములకందని సాగునీరు
● ఆందోళనలో రైతన్నలు గరుగుబిల్లి: జంఝావతి కాలువ ద్వారా శివారు భూములకు సాగునీరు అందకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంఝావతి ప్రాజెక్టు ద్వారా పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లోని సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో గరుగుబిల్లి మండలంలోని జంఝావతి హైలెవెల్ కాలువ ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయడంతో గరుగుబిల్లి మండలంలోని మొదటి గ్రామమైన సీతారాంపురం వరకు మాత్రమే సాగునీరు సరఫరా అవుతోంది. మిగిలిన గ్రామాలైన ఉల్లిభద్ర, గొల్లవానివలస, గొట్టివలస, గరుగుబిల్లి, పెద్దూరులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికే వరినారుమళ్లను సిద్ధం చేయడంతోపాటు వివిధ గ్రామాల్లో వేసిన వరి వెదలు కూడా ఎండలకు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. కాలువ శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తో ఆర్థిక వెసులుబాటు
వీరఘట్టం: ఎల్నినో పరిస్ధితులను ఎదుర్కొంటూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ డా. ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. మండలం తలవరం పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వరి, చేపల మిశ్రమ పెంపకం కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి పొలంలో దాదాపు 350 చేప పిల్లలను కలెక్టర్ తన చేతుల మీదుగా వదిలి, వినూత్న కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి లభ్యత తక్కువగా ఉన్న తరుణంలో, ఎల్నినో ప్రభావం ఉన్న సమయాల్లోనూ రైతులకు స్థిరమైన ఆదాయం అందించడానికి ఈ సమగ్ర వ్యవసాయ నమూనా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకే వనరు నుంచి అటు వరి పంటను, ఇటు చేపల దిగుబడిని పొందవచ్చునని ఇది రైతులకు ఆర్థికంగా మంచి వెసులబాటు ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోనే తొలిసారిగా ప్రారంభించిన మోడల్ కార్యక్రమం రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర ప్రాంతాల రైతులు కూడా దీనిని స్ఫూరిగా తీసుకోవాలని సూచించారు. ఈ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో సాగులో ఉన్న వరి పంటను పరిశీలించారు. చీడ, పీడల నివారణ కోసం పంటలో పిచికారీ చేస్తున్న జీవామృతాల తయారీ విధానాన్ని ఏఓ జె.సౌజన్య వివరించారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో గట్టు మీద చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పొలం గట్టుపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్, జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీశంకర్, జిల్లా మత్య్సశాఖ అధికారి టి.సంతోష్కుమార్, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం ఎం.షణ్ముఖనాయుడు, తహసీల్దార్ వి.రాజేశ్వరరావు, ఎంపీడీఓ బి.వెంకటరమణ, సబివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
సమస్యలపై శంఖారావం
శృంగవరపుకోట: దళిత, గిరిజన వాడల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమరమే సమస్యలపై శంఖారావం అని సిటు కార్యదర్శి మద్దిల రమణ చెప్పారు. దళితవాడలు, గిరిజన పల్లెల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించి, పరిష్కారం కోసం పనిచేసేందుకే గత నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కేవీపీఎస్, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో శంఖారావం పేరుతో కార్యక్రమాలు చేశామన్నారు. కులవ్యవస్థ ఏరూపంలో ఉన్నదీ, దళితులు గిరిజనుల నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు పాలక ప్రభుత్వాలు ఎలా కల్పిస్తున్నాయి అనే అంశాలపై సర్వే చేశామన్నారు. దళితులకు శ్మశానవాటికలు లేవు. ఉన్నవాటికి సౌకర్యాలు లేవు. ఉన్నత వర్గాల వారికి శ్మశాన వాటికలవద్ద షెడ్, బోర్లు, కాంపౌండ్ నిర్మించారు. దళితులకు మాత్రం నీరుపారే గెడ్డల్లో సౌకర్యాల్లేకుండా వివక్ష చూపుతున్నారు. దళితులు గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పాలకులు, అధికారులు పట్టాలు మంజూరు చేయకుండా, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసి, చట్టప్రకారం భూమి ఇవ్వాలి. సాగులో ఉన్న వారికి పట్టాలు మంజూరు చేయాలి. మాన్సాస్, పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ కౌలురైతు పట్టా మంజూరు చేయాలి. , దళితులు, గిరిజనులు నివాసముంటున్న ప్రాంతంలో కాలువలు, సీసీ రోడ్లు తాగునీరు సమస్య పరిష్కారం చేయాలి. పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ బోర్డు నుంచి లోన్లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని తహసీల్దార్ డి.శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన గిరిజన సంఘం నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, గిరిజనులు, దళితులు పాల్గొన్నారు. -
ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ప్రత్యేకశిక్షణ
● సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య నెల్లిమర్ల: ఈ ఏడాది విద్యార్థులకు ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ఎక్సెలెనన్స్ సెంటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా నెల్లిమర్లలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అధికారులు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమంపై ఉన్న సామాజిక చిన్నచూపును, వివక్షను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో సంక్షేమం ప్రతి విద్యార్థి హక్కు అని, వసతి, భోజనం, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో 1350 మంది శానిటరీ వర్కర్లను, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంక్షేమం, శాఖ ఒక కుటుంబమని, కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. గతంతో పోలిస్తే, వసతిగృహాల్లో సౌకర్యాలు, విద్య మెరుగుపడ్డాయని, టెన్త్, ఇంటర్ ఫలితాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.రూపవతి సమావేశానికి అధ్యక్షత వహించగా, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె .ఎస్. శ్రీనివాసచార్యులు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి వీహెచ్ రాధా కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, ఎస్డబ్ల్యూహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. -
సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలి
● ఆర్డీఓ ఆర్ మాధురిసీతానగరం: పార్వతీపురం మన్యంజిల్లాలో రేషన్ డిపోలద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులోగా వినియోగదారులకు అందజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.మాధురి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో రేషన్ షాపులో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను బుధవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రేషన్ షాపులో ఈ–పోస్ యంత్రం పనితీరు, సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లును ఆర్డీవో భౌతికంగా పరిశీలించారు. అనంతరం రేషన్కార్డు దారులతో ముఖాముఖి మాట్లాడి సరుకుల సరఫరావిధానం, తూకాలు, నాణ్యత, పంపిణీ వేళలపై అడిగి తెలుసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలులేదా అలసత్వం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుకు సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సరుకులు అందేలా చూడాలని డీలర్లు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. తూకంలో తేడాలు వచ్చినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, డీటీలు ఉమామహేశ్వరరావు, పైడిరాజు, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.మాధురి బుధవారం పంపిణీ చేశారు. మండలంలోని లచ్చయ్యపేట సచి వాలయం పరిధిలో రీసర్వే పనులుపూర్తి చేసిన గ్రామాల్లో తప్పులులేని పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను ముమ్మరం చేసిందన్నారు. పట్టాదార్ పుస్తకాల్లో ఎక్కించవలసిన నంబర్లున్న ఆయా భూములకు సంబంధించిన లిఖిత పూర్వకంగా దఖలు పడిన రికార్డులతో తమదృష్టికి తేవాలన్నారు.అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుగర్ఫ్యాక్టరీలో ఉన్న బియ్యంగోదాంల నుంచి సుంకి పురుగుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, కాలువల సమస్యలున్నాయని కాలువలు, తాగునీరు, సుంకిఉరుగులునివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఆర్డీఓ ఆర్ మాధురి దృష్టికి తెచ్చారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్కుమార్ పాల్లొన్నారు. -
నలుదిక్కులా.. నిరసన సెగ!
–10లోగురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026పార్వతీపురం: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభా కరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సన్నాహకాలపై బుధవారం నిర్వహించిన జూమ్ సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల నుంచి ఉత్తమ సాంస్కృతిక బృందాలను ఎంపిక చేసి విద్యార్థులకు వెంటనే శిక్షణ ప్రారంభించాలని సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక చైతన్యం ప్రతిబింబించే సాంస్కృతి క, క్రీడా ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ కె.హేమలత తో పాటు వివిధ శాఖల అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. పాలకొండ: పాలకొండ గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధారాణిపై ఆ శాఖ ఈఈ సోమేశ్వరరా వు బుధవారం విచారణ చేపట్టారు. పట్టణంలో ని బాసూరు వీధి సచివాలయంలో వార్డు ఇంజనీర్లును విచారించి వారి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. ఇటీవల వార్డు ఇంజినీర్లు తమ లాగిన్ నుంచి సిమెంట్ బస్తాలు తమకు తెలియకుండా ఏఈ పక్కదారి పట్టించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టామని ఈఈ తెలిపారు. ఇప్పటికే లబ్ధిదా రులను విచారించామని, ప్రస్తుతం ఇంజినీరింగ్ అసిస్టెంట్లను విచారిస్తున్నామని ఆయన తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. సాలూరు: పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లో ఈ నెల 10న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్, కన్వీనర్ డి.శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో రెయిన్ గ్రూప్ ఆటోమోటివ్ లిమిటెడ్, అర్న ఎనర్జిస్, ఎలక్ట్రో స్టీల్ కేస్టింగ్ లిమిటెడ్ తదితర కంపెనీలకు చెందిన హెచ్ఆర్ ప్రతినిధు లు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ తదితర వివరాలతో పాటు ఒరిజినల్, జెరాక్స్ పత్రాలు తీసుకుని మేళాకు హాజరు కావాలన్నా రు. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నంబర్ లేని వారు కూడా ఈ మేళాకు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అప్రెంటిస్ తరువాత సంబంధిత అభ్యర్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అప్రంటిస్ అడ్వయిజర్ శ్రీనివాసరావు 9573644439 నంబరును సంప్రదించాలని సూచించారు. పార్వతీపురం రూరల్ : ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఆచరణలో అడుగున పడిపోవడంతో.. దాదాపు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి జ్వాలలు రగులుకుంటు న్నాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు, ఏజెన్సీ హ క్కుల ఉల్లంఘన, ఫీజు బకాయిల నుంచి ఇంధన ధరల పెంపు వరకు వివిధ సమస్యలపై ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ ఫెడరేషన్లు, కార్మికులు ఇప్పటికే కలెక్టరేట్ల ఎదుట ఆందోళన బాట పట్టారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఈ నిరసన గళానికి శ్రుతి కలుపుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ధర్నాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై భగ్గు గద్దెనెక్కే ముందు ఇచ్చిన ప్రధాన హామీలు, పథకా లు నీటి మూటలుగా మిగిలిపోయాయన్న విమర్శ లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. అర్హులకు అన్యాయం జరిగిందని, ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబడు తూ డిమాండ్ చేస్తున్నారు. చట్టాల రక్షణకై గిరిజనుల గర్జన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఉపాధికి జీవాధార మైన జీఓ నంబర్–3 రద్దుతో తలెత్తిన పరిస్థితు లపై ఆదివాసీ సంఘాలు రగిలిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, గిరిజన భూములకు రక్షణ కవచమైన 1/70 చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఉపాధ్యాయులపై ఉక్కుపాదం.. కార్మికుల కన్నీరు విద్యాశాఖలోనూ తీవ్ర అశాంతి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ ఫెడరేషన్లు ఆందోళనలకు దిగుతున్నాయి. మరోవైపు ఏకంగా రూ.7,000 కోట్ల మేర ఫీజు బకాయి లు పేరుకుపోవడం, మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కరవవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే దిశగా సర్కారు అడుగులు వేస్తుండటంతో.. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారంటూ ఆందోళనలు ఉద్ధృతం చేశారు. కూడగడుతున్న వ్యతిరేకత సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్న ఇంధన ధరల పెంపు, ప్రభుత్వ ఏకపక్ష జీఓలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ సహా వామపక్ష, ఇతర ప్రజా సంఘాలు నిత్యం కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగుతున్నాయి.హామీలు నమ్మి ఓటేసిన నిరుద్యోగులను, యువతను ఈ కూటమి ప్రభుత్వం నిలువునా వంచించింది. మెగా డీఎస్సీ–2025 పేరుతో తీవ్రమైన అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు మొండిచేయి చూపారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించి నిజాయితీపరులకు న్యాయం చేయాలి. మరోవైపు రూ.7,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులు వీధి పాలు అయ్యే పరిస్థితి వచ్చింది. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను స్వస్తి పలికే వరకు మా పోరాటం ఆగదు. – అనంత నాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గిరిజనుల విద్యా, ఉపాధి హక్కులకు జీవనా ధారమైన జీఓ నంబరు–3 రద్దయ్యాక ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం వెంటనే దానికి ప్రత్యామ్నా య చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆదివా సీల భూములను కాపాడే 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలి. గిరిజనుల హక్కు లను కాలరాస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ను జయప్రదం చేయాలి. – కె.రామస్వామి, గిరిజన కార్మిక సంఘం నాయకుడు -
బాలికల వసతిగృహంలో న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ
పార్వతీపురం రూరల్ : జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం – 2ను మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆదేశాల మేరకు హాస్టల్ను సందర్శించిన ఆమె విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, వసతిగృహంలో పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు తనిఖీల్లో భాగంగా హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించి, నిర్వాహకులను పిలిచి విద్యార్థులకు అందిస్తున్న రోజువారీ భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో ఆమె నేరుగా ముఖాముఖి మాట్లాడారు. నిబంధనల ప్రకారం మెనూను పాటిస్తున్నారా.. లేదా? రోజూ సరైన భోజనం పెడుతున్నారా లేదా? అని విద్యార్థినులను అడిగి నిర్ధారించుకున్నారు. వసతిగృహంలో పరిశుభ్రత పాటిస్తున్న తీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ గదులతో పాటు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆమె హితవు పలికారు. -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురి మృతి
విజయనగరం టౌన్: మండలంలోని బియ్యాలపేట గ్రామంలో నేలబావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాగిత నరసింగరావు(30) మంగళవారం రాత్రి పశువులను మేపుతూ కాలుజారి నూతిలో పడి మృతిచెందాడు. ఆయనకు భార్య లీలావతి ఉంది. మృతుని తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.అశోక్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చీపురుపల్లి: మండలంలోని కలిసెట్టిబడి గ్రామానికి చెందిన చింత సురపునాయుడు గడ్డి మందు తాగి మృతి చెందాడు. పాల్పడ్డాడు. సూరపునాయుడు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతోనే గడ్డి మందు తాగి మృతి చెందినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో లాడ్జిలో యువకుడు.. విజయనగరం టౌన్: మండలంలోని గుణుపూరు పేటకు చెందిన యువకుడు విజయనగరంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బుధవారం జరిగిప ఈ సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు, గుణుపూరు పేట గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుణుపూరుపేటకు చెందిన పడాల భరత్ కుమార్ (30) మంగళవారం విజయనగరం పట్టణంలోని బాలాజీ లాడ్జిలో బస చేశాడు. ఉదయం 10.30 గంటల సమయంలో గుండెనొప్పి అని పడిపోవడంతో హోటల్ సిబ్బంది 108కి కాల్ చేశారు. అయితే అప్పటికే మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. భరత్కుమార్కు ఇంకా వివాహం కాలేదు. సోదరుడు గణేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై కమల్ భార్గవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి.. గుర్ల: మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన గెద్ద గడ్డి నాయుడు (39) విద్యుత్ షాక్తో మృతిచెందాడు. గడ్డి నాయుడు మంగళవారం రాత్రి తన పొలానికి నీరు కట్టడానికి వెళ్లి విద్యుత్ మోటార్ ఆన్చేయగా షాక్కు గురై మృతి చెందాడు. రాత్రి సమయంలో వెళ్లిన వ్యక్తి అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్ మోటార్ వద్ద చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య పైడిరాజు, కుమారుడు దినేష్ ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు. గ్రోత్ సెంటర్లో బీహార్ యువకుడు.. బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్లో బీహార్ యువకుడు మృతి చెందాడు. అక్కడి గురుదత్త ఎంటర్ ప్రైజర్స్ అనే పరిశ్రమలో పొడి మిశ్రమాన్ని వేరు చేసే ఇనుప జల్లెడకున్న ఇనుప రాడ్ ఛాతీ, చేతుల మీదుగా గుచ్చుకోవడంతో బీహార్లోని రాజ్కార్ తాలూకా ప్రొక్రైరా గ్రామానికి చెందిన బికాస్ మాజీ (26) అనే యువకుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు బుధవారం గ్రోత్సెంటర్లోని గురుదత్త కంపెనీకి వెళ్లి మృతదేహాన్ని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. మృతుడి సహచర కార్మికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం మధ్యాహ్నానికి బొబ్బిలి చేరుకున్నారు.నాలుగేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న బికాస్కు ఏడాది కిందటే వివాహమైనట్లు చెబుతున్నారు. మృతుడికి భార్య అనిషాదేవి, రెండు నెలల కుమార్తె మిస్టీ ఉన్నారు. డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ కె.నారాయణ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. -
నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట
–10లో● నేటి నుంచి రిలే దీక్షలు పార్వతీపురం రూరల్ : డీఎస్సీ అర్హులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆదివారం వరకు (ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు) నాలుగు రోజుల పాటు స్థానిక వైఎస్సార్ విగ్ర హం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతాయి. తొలి రోజైన గురువారం ఉద యం బలిజిపేట మండల యువత, మధ్యాహ్నం పార్వతీపురం పురపాలక సంఘం యువత ఈ శిబిరం దీక్షలో కూర్చుంటారు. యువత, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఒక బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
అనుమానాస్పద వ్యక్తులను విచారణ చేస్తాం
విజయనగరం టౌన్: ఇండియా వన్ ఏటీఎం చోరీ కేసులో అనుమానితులందరినీ విచారణ చేస్తామని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ సంఘటన జరిగిన గంట్యాడ మండలం లక్కిడాం జంక్షన్ లో మంగళవారం రాత్రి చోరీ జరిగిన ఏటీఎం ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. చోరీ జరిగిన తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి, 50 మందితో కూడిన 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించి ఏటీఎం తాడుతో బొలెరో వాహనానికి కట్టి కొంతదూరం లాక్కెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఏటీఎంలో రూ.లక్షా50వేలు నగదు ఉంటుందన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా పోలీస్యంత్రాంగం అప్రమత్తమైందని, నేరస్థలాన్ని ఇప్పటికే క్లూస్ టీమ్ పరిశీలించిందని, ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించామన్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలనే లక్ష్యంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజ్లు సేకరించామన్నారు. అవసరమైన చోట సాంకేతిక నిపుణుల సహకారంతో డిటిజల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారులు ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలని, జిల్లా సరిహద్దులతో పాటూ పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం పెంచి నిందితుల కదలికలపై నిఘా ఉంటాలని, ఎమ్ఓ క్రిమినల్స్ను విచారణ చేయాలని ఆదేశించారు. ఏటీఎం కేంద్రాల భద్రత విషయంలో బ్యాంక్ యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నాణ్యమైన సీసీ టీవీ కెమెరాలు, అలారం వ్యవస్ధ, తగినంత లైటింగ్, భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్కు లేదా డయల్ 100/ 112కి సమాచారమందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గంట్యాడ ఎస్సై డి.సాయికృష్ణ, సీసీఎస్ సీఐ డీడీ.నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియా వన్ ఏటీఎం చోరీ స్ధలాన్ని పరిశీలించిన ఎస్పీ -
సంస్కృతికి ప్రతిబింబంగా ‘ఆదివాసీ దినోత్సవం’
పార్వతీపురం రూరల్ : గిరిజన హక్కుల పరిరక్షణ, వారి విలక్షణ సంస్కృతీ సాంప్రదాయాలను సమున్నతంగా చాటిచెప్పేలా జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) ఆర్.వైశాలి పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ ఆవరణలోని ‘గిరిమిత్ర’ హాల్లో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, నాయకులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 9న ఉత్సవాలు జరగనుండగా, జిల్లా స్థాయిలో ఆగస్టు 8నే మిన్నంటేలా నిర్వహించేందుకు అధికారులు, గిరిజన సంఘాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆదివాసీల సమగ్ర అభివృద్ధితో పాటు వారి ఉనికిని, ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పీఓ పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంప్రదాయ గిరిజన నృత్యాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. గిరిజన వైభవాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, సంఘాల నాయకులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. -
లక్షణంగా రప్పించి పొమ్మన్నారు..!
రాజాం: అంతన్నారు..ఇంతన్నారు..చివరకు చేతులెత్తేశారు..లక్ష రూపాయల ప్రైజ్ మనీ అంటూ ప్రచారం చేసి విద్యార్థులను ఆశపెట్టారు. పలుచోట్ల పోటీ పరీక్షలు పెట్టి విజేతలను ఎంపికచేసి, వివరాలు ప్రకటించారు. ప్రైజ్ మనీ మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు. ఈ తంతు ఎక్కడో జరగలేదు..జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు సందర్భంగా విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు చేసిన తతంగం. జిల్లాలో ఎయిర్పోర్టు ప్రారంభం సందర్భంగా నెలరోజుల ముందునుంచే ఆర్భాటం చేశారు. రూ.30 కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ హడావుడిని విద్యాశాఖ మరింత ఎక్కువచేసింది. లోకేష్ బాబు చూస్తాడనో మెచ్చకుంటాడనో గొప్పలకు పోయింది. జిల్లా వ్యాప్తంగా తొలుత మండల స్థాయి, అనంతరం జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ట్యాగ్లైన్ పోటీలను పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించింది. మండలంలో ప్రతి పోటీకి ఒక్కో విజేతను ఎంపికచేశారు. అనంతరం వారందరికి జిల్లా స్థాయిలో నిర్వహించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపికచేశారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.1 లక్ష ప్రైజ్ మనీ ప్రకటించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలకు సైతం ప్రైజ్లు ఇస్తామని (నగదు ఎంతనేది చెప్పలేదు) అన్నారు. ఇలా నాలుగు విభాగాల్లో పాఠశాల, కళాశాల స్థాయిలో జిల్లా విజేతలతో పాటు మండల స్థాయిలో నాలుగు విభాగాల్లోని విజేతలను జూలై 31న భోగాపురం రావాలని పిలిచారు. ముందురోజు బహుమతులు ఇస్తామని, విద్యాశాఖ అధికారులతో సత్కారాలు జరుగుతాయని ఆర్బాటం చేశారు. సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వారిని భోగాపురం తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత వారిని పట్టించుకోకపోగా, పోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని, ప్రైజ్లు ఇంటికి పంపిస్తామని చెప్పి విద్యార్థులను వెనక్కు పంపించేశారు. ఆ సమయంలో బస్సులు లేక, అక్కడ వసతి లేక అటు విద్యార్థులు, ఇటు వారిని తీసుకెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ రాత్రి నానా అవస్థలు పడి, పైవేట్ వాహనాలు ద్వారా ఇంటికి చేరుకున్నారు. వేలరూపాయల చేతిచమురు వదిలించుకున్నారు. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ అంటూ భారీ ప్రచారం చేసి, పోటీలు నిర్వహించి, విద్యార్థులకు ఆశలు పెట్టిన అధికారులు ఇంతవరకూ ప్రైజ్ మనీ విద్యార్థులకు అందించలేదు. భోగాపురం వెళ్లిన వారిని కనీసం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రభుత్వ విద్యాశాఖ తీరు అంటూ మండిపడుతున్నారు. అధికారులు ఏమంటున్నారంటే.. భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించడం, విజేతలను భోగాపురం రమ్మని చెప్పడంపై జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు వివరణ ఇచ్చేందుకు ఫోన్ లిఫ్ట్చేసేందుకు నిరాకరించారు. రాజాం ఎంఈఓలు ప్రవీణ్కుమార్, యాగాటి దుర్గారావుల వద్ద సాక్షి ప్రస్తావించగా, మండల స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించామని, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.లక్ష ప్రైజ్మనీ ఇస్తామన్నారని చెప్పారు. మండల స్థాయి విజేతలను సైతం భోగాపురం రమ్మన్నారని, ఎటువంటి ప్రైజ్లు ఇంతవరకూ ఇవ్వని విషయం వాస్తవమేనని వెల్లడించారు. ఉన్నతాధికారులకు ఈ విషయంపై సమాచారం ఇచ్చామని, త్వరలో బహుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రైజ్మనీ అన్నారు..కామ్గా ఉన్నారు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా విద్యార్థులకు పలుపోటీపరీక్షలు జిల్లా స్థాయిలో ఎంపికలు ప్రథమ స్థానానికి రూ.1 లక్ష అంటూ ప్రకటనలు ముందురోజు రమ్మని ఆదేశాలు వెళ్లిన తరువాత వెనక్కు పంపించేసిన అధికారులు తిప్పలు పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు విజేతలకు ఇంతవరకూ అందని రూ.లక్ష పారితోషకం -
దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే
● ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు ● అసిస్టెంట్ కమిషనర్ శిరీష హెచ్చరికవిజయనగరం క్రైమ్: మండల పరిధిలోని దుప్పాడలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవదాయ శాఖకు చెందిందని దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష బుధవారం స్పష్టం చేశారు. సదరు భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారని ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీసుల సహాయంతో ఆ స్థలాన్ని నేరుగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ స్థలం దుప్పాడ గ్రామస్తుల సంక్షేమానికి ఉద్దేశించినదని, గ్రామస్తులు మినహా వేరెవరైనా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలను తొలగించి, సదరు స్థలంలో రామాలయం నిర్మించాలని దుప్పాడ గ్రామస్తులు నిర్ణయించారని.. వారి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
8న ఏజెన్సీ బంద్
పార్వతీపురం రూరల్ /సీతంపేట: గిరిజనుల ఉపాధికి జీవనాధారమైన జీఓ నంబరు–3కి ప్రత్యామ్నా య చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, ఏజెన్సీ భూములను రక్షించే 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8న రాష్ట్ర వ్యా ప్త ఏజెన్సీ బంద్కు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో బుధవారం వివిధ గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీతంపేటలో వాల్పోస్టర్లు విడుదల చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన జీఓ–3 లక్ష్యాలకు అనుగుణంగా, నేతల ఎన్నికల హామీ మేరకు ప్రత్యామ్నాయంగా శ్యామ్నాయక్ చట్టాన్ని తేవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేలా కోర్టు కేసుల పేరుతో 1/70 చట్టాన్ని నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ గిరిజన యువత ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని, ఈ చట్టాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన హక్కుల సాధన కోసం ఈ నెల 8న నిర్వహించే ఏజెన్సీ బంద్కు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపి జయప్రదం చేయా లని విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల నేతలు కె.రామస్వామి, పి.రంజిత్ కుమార్, బి.వి.రమణ, సీతారాం, రెడ్డి ఈశ్వరరావు, గంగునాయుడు, దాసు, వేణు, ఇందిర, తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమానికి సిద్ధం కావాలి
పాలకొండ: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై యువత, విద్యార్థులు ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కల్యాణ ఏఎంజీ ఫంక్షన్ హల్లో నియోజకవర్గానికి ని సంబంధించి టౌన్ హల్ సమావేశం బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండేళ్ల తరువా త డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థులను దగా చేశారని ఆరోపించారు. లోకేష్ యువగళం సభ్యుల కు ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త జీఓ తెచ్చి అక్రమాలకు పాల్పడి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు కట్ట బెట్టారని తెలిపారు. అర్హులైన వారికి, మెరిట్ మా ర్కులు వచ్చిన వారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ లిస్టు అభ్యర్థుల డేటాను మాయం చేశారని తెలిపారు. మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు రాలేదో ప్రభు త్వం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. స్పోర్ట్ కోటాను 3 శాతంకు పెంచి 29 క్రీడలను 65కు పెంచారని వివరించారు. వారి నుంచి రూ. 15 లక్షలు చొప్పున తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై అభ్యర్థులు ఆధారాలతో కోర్టుకు వెళ్లారని, హైకోర్టు కూడా విచారణ జరపా లని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఉన్న డిమాండ్లుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్కు బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు నిరుద్యోగులు, యువత తరఫున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు యువతకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని కోరారు. సమావేశంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్త లు, పలు వర్గాల ప్రజలు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ
పార్వతీపురం రూరల్ : విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పార్వతీపురం, పాలకొండ, సాలూరు పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలను ఎస్ఈ పి.త్రినాథరావు ప్రారంభించారు. ప్రజలు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు ముందస్తు భద్రతా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల నిర్మాణ సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలని ఎస్ఈ సూచించారు. భవనాలపైకి ఇనుప రాడ్లు, పరంజా సామగ్రి తీసుకెళ్లే సమయంలో విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో లైన్ క్లియరెన్స్ పొందాకే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇటీవల దుకాణాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టే క్రమంలో లైన్ల స్పర్శ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అవగాహన లోపమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇళ్లలో నాణ్యమైన పరికరాలనే వినియోగించాలని, తడి బట్టలు లేదా తడి చేతులతో స్విచ్లను తాకరాదని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది ప్లకార్డులతో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. -
నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్
విజయనగరం అర్బన్: స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో చాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ సెంట్రల్, బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింబోసిస్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ ఒ.నరేష్కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు విస్తృతంగా ఏర్పడ్డాయన్నారు. ముఖ్యంగా విజయనగరంలో సరికొత్త పెట్టుబడులు పెట్టే వారికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. సరికొత్త పారిశ్రామిక టెక్నాలజీ ప్రాజెక్టులపై గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ రమాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు టెట్ కష్టాలు!
నేటి నుంచి టెట్ రామభద్రపురం: విద్యార్హత, వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ఉత్తీర్ణత నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో పాటు టీచర్లకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ పరీక్ష తప్పకుండా రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అయ్యవార్లు తలలు పట్టుకుంటున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించడంతో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా, టీచర్లకు టెట్ కష్టాలు తెచ్చిపెట్టిందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. టీచర్లకు టెట్ కష్టాలు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో సమానంగా టీచర్లు కూడా 150 మార్కులకే టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు మళ్లీ టెట్ అర్హత పరీక్షలు రాయాల్సి రావడం సవాల్గా మారింది. ఎస్టీటీలు ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్, సైకాలజీ సిలబస్లలో 150 మార్కులు రాయాల్సి ఉండగా స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లిష్, తెలుగు టీచర్లు ఇంగ్లిష్తో పాటు తెలుగు సిలబస్ ఉంటుంది. సైన్స్, గణితం, సోషల్ టీచర్లు తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సిలబస్ను రాయాలి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు అందరూ సైకాలజీ సిలబస్ కూడా రాయాల్సి ఉంది. కొత్త సిలబస్, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాయాల్సి ఉండడంతో అయ్యవార్లలో ఆందోళన కలిగిస్తోంది. 3 కేంద్రాలు.. 12,358 అభ్యర్థులు నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ నేటి నుంచి 16వ తేదీ వరకు టెట్ ఆందోళనలో అయ్యవార్లు తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు టెట్ కష్టాలు తప్పలేదని ఆవేదన విజయనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షకు 12,358 మంది హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించటంతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగా పరీక్ష కేంద్రంకు హాజరు కావాలని సూచించారు. డెంకాడ మండలం చింతలవలసలో డాక్టర్ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగ వద్దనున్న సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అయాన్ డిజిటల్ జోన్లో జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతి రోజు మూడు కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని, అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్/పాన్/ ఓటరు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షకు సంబంధించి ఎటువంటి సందేహాలు, సమస్యలు నివృత్తి చేసుకునేందుకు 95503 94572, 96180 42932, 99895 68641 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించండి
మక్కువ: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని శంబర, మక్కువ ప్రాంతాల్లోని పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో వైద్యారోగ్య సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..వైద్యసేవలు, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. 4డీ లక్షణాల గుర్తింపు లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆర్బీఎస్కే 2.0 స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుండె జబ్బు, కేన్సర్, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, తగిన చికిత్స, వైద్య సలహాలు అందేలా చూడాలన్నారు. సంచార చికిత్స శిబిరాలతో పాటు గ్రామగ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎల్.శివాజీనాయుడు, ఆర్.చంద్రశేఖర్, బి.ఫణీంద్ర, సీహెచ్వో సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
పనసవలస విద్యార్థికి గోల్డ్ మెడల్
రేగిడి: మండలంలోని పారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కడగల కార్తీక్కు రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్(స్వర్ణ పతకం) లభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.సునీత ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రన్నింగ్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో విద్యార్థి పాల్గొని, విశేష ప్రతిభ కనబరచడంతో స్వర్ణ పతకం వరించిందన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి, ఐదో స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులంతా సదరు విద్యార్థిని అభినందించారు. అదనపు ఎస్పీ పరిశీలన సీతానగరం: మండల కేంద్రంలోని మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగి బంగారు ఆభరణాలు అపహరణకు గురికాగా ఆ ఇంటిని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, నిత్యం జనసంచారం ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చన్నారు. ఆయన వెంట ఎస్ఐ హేమలత తదితరులు ఉన్నారు. ‘హోటల్ మేనేజ్మెంట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంవిజయనగరం క్రైమ్: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం ఇన్చార్జ్ శివరామకృష్ణ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు. బీఎస్సీ(హెచ్హెచ్ఏ) మూడేళ్ల కోర్సుకు ఇంటర్మీడియట్లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్కు ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు అందుబాటులో ఉందని, ఈ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి వయోపరిమితి లేదన్నారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక హోటళ్లు, ఫైవ్స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బ్యాంకు లోన్ సదుపాయం ఉంటుందని, బాలబాలికలకు వేర్వేరుగా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలకు అందజేయాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9701343846, 9100558006, 9700440604లను సంప్రదించాలని కోరారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలి● జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్పార్వతీపురం రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, వరినాట్లకు నీటి కొరత ఏర్పడిందని, రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీ శంకర్ ఓ ప్రకటనలో మంగళవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 28,883 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని, ప్రస్తుతం నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దమ్ము చేసి వరినాట్లు(ఉభాలు) వేయడానికి తగినంత నీరు లేదన్నారు. ఎల్నినో వల్ల ఏర్పడిన ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. మెట్టు, కాలువ చివరి భూముల్లో రాగులు, కొరల్రు, మినుము, పెసర వంటి పంటలు వేసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి విజయనగరం టౌన్: అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన స్థానిక పట్టణంలోని కేఎల్ పురంలో మంగళవారం జరిగింది. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..కేఎల్ పురంలో నివాసం ఉంటున్న మేడపల్లి లావణ్య(31) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని, ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలి భర్త వృత్తి రీత్యా దుబాయ్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి రమణి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఏఎస్ఐ రామలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
యువ గుండెకు ఏమైంది?
యువత గుండె అకస్మాత్తుగా ఆగిపోతోంది..దృఢంగా ఉన్న వారు సైతం కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో గుండెపోటు బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాల్లో యువత సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానం, ఆహారపు అలవాట్లే హార్ట్ ఎటాక్కు కారణం కాగా జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే 35 ఏళ్ల మహిళ గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉంటే ఇదే విజయనగరానికి చెందిన గోపి అనే 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు బారినపడ్డాడు. బంధువులు అప్రమత్తమై విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స అనంతరం డిశార్జ్ అయ్యారు. హార్ట్ఎటాక్ లక్షణాలు ఇవీ.. గుండెపోటుకు గురైన సమయంలో ఛాతిలో నొప్పి విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా చెమట పడుతుంది. వాంతులు వచ్చే భావన కలుగుతుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లూ చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతిపై పెట్టినట్లు అనిపిస్తున్నా..శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగానే భావించాలి. ఛాతిలో వచ్చిన నొప్పి.. ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమట వస్తున్నా హార్ట్ ఎటాక్గానే అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా గుండెజబ్బుగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండెపోటుకు గురవుతున్న యువత పెరుగుతున్న ఆకస్మిక మరణాలు జీవనశైలిలో స్వల్ప మార్పులతో హృదయం పదిలం: వైద్య నిపుణులు అంతా 25 నుంచి 35 ఏళ్లలోపు వారే.. జిల్లాలో తక్కువ వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురియ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అధికంగా గుండె జబ్బుల బారినపడుతున్నారు. గతంలో పౌష్టికాహార విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి హార్ట్ ఎటాక్(గుండెపోటు)కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. -
ఇబ్బందులకు గురవుతున్నారు..
డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెరపైకి తీసుకురావడం సరైంది కాదు. దీని వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే బాగుండేది. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. – జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి -
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : సబ్ కలెక్టర్
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహిద్దామని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై గిరిజన సంఘాల నాయకులతో మంగళవారం ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆహార కమిటీ, ఆహ్వాన కమిటీ, సాంస్కృతిక కమిటీ తదితర కమిటీలను నియమించనున్నట్టు తెలిపారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆదివాసీ దినోత్సవం ఒక వేదిక అన్నారు. వేడుకల నిర్వహణలో గిరిజన సంఘాల నాయకులు, పెద్దలు, యువత, మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న గిరిజన జేఏసీ నాయకులు ఉత్సవాల నిర్వహాణపై పలు సలహాలు సూచనలిచ్చారు. సమావేశంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఆదివాసీ జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు, బి.రామ్మోహన్రావు, ఎం.రవికుమార్, ఎన్.కాంతారావు, జె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘దివిసీమ గాంధీ’ మండలికి పోలీసుల నివాళి పార్వతీపురం రూరల్ : ‘దివిసీమ గాంధీ’గా గుర్తింపు పొందిన మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి, ఇతర అధికారులు మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, విద్యా వికాసం, తెలుగు భాషా పరిరక్షణకు మండలి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దివిసీమలోని నిరుపేదలకు వేలాది ఎకరాల బంజరు భూములను పంపిణీ చేసిన ఆయన జీవితం, సేవాభావం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఏఏఓ బాలరాజు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిందని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 5 నుంచి 20 వరకు హెల్ప్డెస్క్లో ధ్రువపత్రాల పరిశీలన, 12, 13 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 20న ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పించారు. ఆగస్టు 26న సీట్ల కేటాయింపు ఉంటుందని, 27 నుంచి 29వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో చేరా లని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతిగృహం, డిజిటల్ తరగతులు, గ్రంథాలయం, ల్యాబ్లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రవేశాలు, ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. పాలకొండలో భారీ వర్షం పాలకొండ రూరల్: మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు.. సాగులో వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు పాలకొండలో మంగళవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉరుములు, మెరుపులతో సుమారు 40 నిమిషాల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో రైతులు ఊరట చెందారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ వర్షంతో రైతులు పొలం బాట పట్టారు. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. -
టెన్త్ ఉత్తీర్ణులు ఇంటర్లో చేరాలి : కలెక్టర్
పార్వతీపురం: జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్లో ఏదో ఒక కళాశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల అధికారులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతిగృహాల్లో కేటాయించిన సీట్లను వందశాతం భర్తీ చేయాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేయని యువత, ఉద్యోగులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియెట్, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించాలి ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మార్ట్ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో ప్రతీ రోజు శిక్షణలు నిర్వహించాలని, పంట బీమా శాతం వందకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాలూరులో మిలెట్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలు, వేలాది మంది రైతులకు ఉపాధి, ఆదాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. జీడి తోటల్లో అంతర్ పంటలు, పాఠశాలల్లో నర్సరీలు, చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పౌష్టికాహార లోపంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పురోగతిపై జూమ్ సమావేశంలో సమీక్ష నిర్వహించిన ఆయన అంగన్వాడీ సేవలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు, సీడీపీఓలు, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు. -
బడ్జెట్ తలకిందులవుతోంది!
నెలవారీ వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు రూ.1,300 ఉన్న 26 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు ఏకంగా రూ.1,700 దాటిపోయింది. సన్నబియ్యం కొందామంటేనే భయమేస్తోంది. బియ్యం ధరలకు తోడు అన్ని సరుకుల ధరలూ పెరిగిపోవడంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. నూకల ధరలు కూడా మండిపోతుండటంతో సామాన్యులు బతకడం కష్టంగా మారింది. అక్రమ నిల్వలపై తనిఖీలు చేసి, ప్రభుత్వం వెంటనే ధరలను నియంత్రించాలి. – అంబటి సురేష్, ప్రైవేటు ఉద్యోగి, నర్సిపురం ● -
దుకాణానికి వెళ్లాలంటే..
కిరాణా దుకాణానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాం. చిల్లరగా కిలో సన్నబియ్యం కొనాలంటే రూ.65 పైనే చెల్లించాల్సి వస్తోంది. బ్రాండ్ల పేరుతో, 26 కిలోల ప్యాకింగ్ నెపంతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. కూలి నాలి చేసుకునే మాలాంటోళ్ల బతుకు మరింత భారంగా మారింది. రెక్కల కష్టం బియ్యం కొనుగోలుకే సరిపోతోంది. మార్కెట్లో అధికారుల పర్యవేక్షణ, ధరల నియంత్రణ ఏమాత్రం కనిపించడం లేదు. సామాన్యుల కష్టాలను గుర్తించి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. –ఎమ్.కుసుమ, గృహిణి, పార్వతీపురం ● -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ వరాలేవీ?
విజయనగరం గంటస్తంభం: భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఇటీవల వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర వాసులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడమంటే ఇదేనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. మంగళవారం విజయనగరానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, కాసేపు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చివరకు ఈ ప్రాంత ప్రజల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయానికి భోగాపురం పేరు కాకుండా వైజాగ్–జీఎంఆర్ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభ ఆద్యంతం పరస్పర ప్రొగడ్తలకే పరిమితమైందన్నారు. విజయనగరం జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతీయకుండా విమానాశ్రయానికి భోగాపురం పేరును కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు.. ఉత్తరాంధ్రలో నాగావళి–వంశధార నదుల వివాదం, కొటియా గ్రామాల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, మూతపడిన పరిశ్రమలు, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీ స్పందించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు డోలీల్లో రోగులను తరలించే పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మోదీని పొగిడేందుకే కార్యక్రమం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, నాయకులు బుగత అశోక్, అలమండ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి ఎలాంటి హామీలు ఇవ్వలేదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి హామీలిస్తారోనని వేచి చూసిన వారికి తీవ్ర నిరాశ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
విజయనగరం గంటస్తంభం: పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, తొలుత భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం భూముల రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22–ఎ దరఖాస్తులు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం వంటి వాటిపై సమీక్షించారు. ఆగస్టు నెలకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలని, సెప్టెంబరు నెలాఖరులోపు 50 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి కావాలని, ఫేజ్–3లో పెండింగ్లోని పాస్పుస్తకాల పంపిణీని కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలి.. జీవో నంబరు 444 కింద వీఆర్వో, ఎంపీడీవో లాగిన్లలో ఉన్న 22–ఎ దరఖాస్తులను ఈ నెలలోనే పరిష్కరించాలని, ఏ దరఖాస్తు పెండింగ్లో ఉండకూడదని అధికారులకు జేసీ స్పష్టంచేశారు. రెవెన్యూ వన్ స్కానింగ్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఐదో స్ధానంలో ఉందని, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి, మరింత మెరుగైన ర్యాంకు సాధించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశానికి డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సర్వే ఏడీ విజయ్కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్లైన్లో హాజరయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలి అధికారులతో సమీక్ష సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ -
గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చట్టాలపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు పెసా చట్టంపై మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రసాదరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత పరిపాలనలో కీలకమైన పెసా చట్టం, గిరిజన ఉప ప్రణాళిక అమలుకు అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు. 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాలకు పెసా చట్టం వర్తిస్తుందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం అమలుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గిరిజనుల భూమి, నీరు, అటవీ వనరులు, సంస్కృతి, పాలనా వ్యవస్థలపై వారి హక్కులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గిరిజన చట్టాలు, ఉప ప్రణాళికపై విస్తృత అవగాహనతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయవచ్చునని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, డీడీఓ శర్మ, పెసా చట్టం రాష్ట్ర కో ఆర్డినేటర్ సంతోష్, ఎంపీడీఓ సుశీల, డిప్యూటీ ఎంపీడీఓలు చక్రపాణిరావు, చిన్నబ్బులు, ఫ్యాకల్టీలు శ్రీనివాసు, సుమాంజలి, నరేష్ పాల్గొన్నారు. -
బ్లేడ్తో గొంతు కోసుకొని..
● వంగర పోలీస్స్టేషన్ వద్ద తలగాం వాసి ఆత్మహత్యాయత్నంవంగర: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద తలగాం గ్రామానికి చెందిన కిమిడి సునీల్ గొంతు కోసుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎస్ఐ షేక్ శంకర్ తెలిపిన వివరాలిలా.. కొన్నాళ్ల క్రితం సునీల్ ఎం.సీతారాంపురానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకున్నాడు. భర్త సునీల్, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీలత వంగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త సునీల్తో పాటు ఆమె అత్తమామలపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువర్గాలను మంగళవారం పోలీస్స్టేషన్కు పిలిపించగా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా ఈ కేసులో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ స్టేషన్లోనే సునీల్ బ్లేడుతో గొంతు, చేయి భాగం కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు అతడిని రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల తాళ లేకనే సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బంధువుల ఆరోపణ. -
మాజీ సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్సీ విక్రాంత్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాలకొండకు చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్..తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. – పాలకొండ రూరల్ నకిలీ వైజాగ్ టీఎంటీపై హెచ్చరికవిజయనగరం: వైజాగ్ టీఎంటీ పేరుతో మార్కెట్లో నకిలీ, నాసిరకం టీఎంటీ రీబార్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్ఐఎన్ఎల్) వెల్లడించింది. గృహ నిర్మాణదారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అసలైన వైజాగ్ టీఎంటీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. నాసిరకం ఉక్కు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడంతో భవనాల భద్రత, బలం, మన్నికపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతి అసలైన రీబార్పై వైజాగ్ టీఎంటీ బ్రాండింగ్తో పాటు ఆర్ఐఎన్ఎల్ గుర్తు స్పష్టంగా ఉంటుందని, కొనుగోలు సమయంలో వాటిని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉత్పత్తి అసలు ధనంపై సందేహాలుంటే సమీప ఆర్ఐఎన్ఎల్ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా నకిలీ ఉత్పత్తులకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
రాజాం సిటీ: ఏమరపాటుగా ఉన్న ప్రయాణికులను టార్గెట్గాచేసుకుని చోరీకి పాల్పడిన నిందితులను రాజాం పోలీసులు పట్టుకున్నారు. ఐదు నెలల క్రితం చీపురుపల్లి నుంచి రాజాం మీదుగా స్వగ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల దగ్గర బంగారు నగలు చోరీచేసి పరారైన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకుని సంబంధిత బాధితులకు సోమవారం బంగారం అప్పగించారు. ఇందుకు సంబంధించిన టౌన్ సీఐ డి.నవీన్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం సతివాడ గ్రామానికి చెందిన మరిశర్ల భాగ్యలక్ష్మి, భర్త సూర్యనారాయణలు ఈ ఏడాది మార్చి 3న సికింద్రాబాద్ నుంచి రైలులో వస్తూ చీపురుపల్లిలో దిగారు. అక్కడి నుంచి రాజాం మీదుగా స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. రాజాం చేరుకుని ఆటో దిగి వారితో తీసుకువచ్చిన బ్యాగును చూసుకున్నారు. అందులో ఉన్న ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన మెహర్వాన్ ఆలీ, ఇర్షాద్ ఆలీగా గుర్తించారు. రాజాం ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్, విజయనగరం సీసీఎస్ బృందంతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లి నిందితులను అరెస్టుచేసి వారి నుంచి బంగారునగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత బాధితులకు సోమవారం బంగారం నగలను అప్పగించామని సీఐ తెలిపారు. -
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి
పార్వతీపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో క్లెయిమ్లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకుడు, రాష్ట్ర సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి జె.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డితో పాటు ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫామ్–6, 7, 8లు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచుకోవాలని, తొలగించిన, సవరించిన పేర్ల జాబితాలను గ్రామ, మండల కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్, ఆన్లైన్ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా 18ఏళ్లు నిండే యువతను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్.వైశాలి. డీఆర్ఓ కె. హేమలత, ఆర్డీఓ కె. మాధురి, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు ప్రారంభం రాజకీయ ఆర్భాటమే
విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార వేదికగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. రైతుల భూములతో నిర్మించిన విమానాశ్రయానికి విజయనగరం జిల్లా పేరు పెట్టకుండా విశాఖపట్నం పేరు పెట్టడం అన్యాయమన్నారు. నిర్వాసిత రైతులకు పూర్తి పరిహారం, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కల్పించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమన్నారు. ఉపాధి కల్పన, స్ధానిక యువతకు ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ పాల్గొన్నారు. -
బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష
పార్వతీపురం రూరల్: పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలల వరకు తల్లిపాలే శ్రీరామరక్ష అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి స్పష్టంచేశారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం పార్వతీపురంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిబ్బందితో తల్లిపాల ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. శిశువుకు తల్లిపాలు సంజీవనిలా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఐఓ డా.వై.విజయ్ మోహన్, ఆర్బీఎస్కే పీఓ డా.టి.జగన్మోహనరా వు, డీపీఎంఓ రవికుమార్ రెడ్డి, డీఎంఓ సూర్యనారాయణ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీఓ లీలారాణి, డీపీహెచ్ఎన్ఓ విజయలక్ష్మి, డీసీఎం విజయలత, సూపర్వైజర్లు పుష్ప, ఇందిర, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో కష్టాల నివేదన
● వెల్లువెత్తిన అర్జీలుపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డికి విన్నవించుకున్నారు. భూకబ్జాలు, ఉపాధ్యాయుల కొర త, సంక్షేమ పథకాలు అందకపోవడం తదితర స మస్యలతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. కాళ్లు చేతులు లేని ఆ దేహాన్ని మోసుకుంటూ ఓ భార్య పడుతున్న ఆరాటం..అన్యాయాన్ని ఎదిరించలేక ఆ దివ్యాంగుడి కళ్లలో ఉబికివస్తున్న ఆవేదన..సోమవారం కలెక్టరేట్లో అందరినీ కలిచివేసింది. బలిజిపేట మండలం పెద్దింపేటకు చెందిన వెన్నెల వెంకటరాజు అనే వృద్ధ దివ్యాంగుడికి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 53–7, 53–9 స్థలంలో 2018లో వెన్నెల దామోదర్ అనే వ్యక్తి తాత్కాలికంగా ఇల్లు కట్టుకునేందుకు రేకుల షెడ్డు, పశువుల పాక వేశాడు. ఇప్పుడు ఆ స్థలం ఖాళీ చేయమంటే దిక్కున్న చోట చెప్పుకోమంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఊరి పెద్దలు చెప్పినా పెడచెవిన పెడుతున్నాడు. ‘అయ్యా.. నేను కదలలేని వాడిని. నా చేతకానితనాన్ని ఆసరాగా తీసుకుని నా స్థలాన్ని మింగేయాలని చూస్తున్నాడు.. ఆ కబ్జాకోరు బెదిరింపుల నుంచి కాపాడి నా స్థలం నాకు ఇప్పించండి సారూ‘ అంటూ వెంకటరాజు తన భార్య సాయంతో అధికారుల ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. బడికి వెళ్తున్నామన్న సంబరమే తప్ప..అక్కడ తమకు పాఠాలు చెప్పే పంతుళ్లు ఎవరొస్తారో ఆ పసిబిడ్డలకు తెలియదు. నిన్న వచ్చిన సారు ఇవాళ రాడు. ఇవాళ వచ్చిన సారు రేపు రాడు. ఇది మక్కువ మండలం అలుగరువు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దుస్థితి. 1 నుంచి 4వ తరగతి వరకు 45 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న ఈ బడిలో గత రెండేళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేడు. అంతా డిప్యుటేషన్ల మీదే నెట్టుకొస్తున్నారు. రోజుకో టీచర్ వస్తుండడంతో ఆ పసివాళ్ల చదువులు అగమ్యగోచరంగా మారాయి. నిబంధనల ప్రకారం కనీసం ఇద్దరు రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిన చోట, ఒక్కరూ లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ‘మా పిల్లల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది సారూ.. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకై నా కనీసం ఇద్దరు సీఆర్టీలనైనా నియమించి ఆ గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయండి అంటూ పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దళితుల భూములపై పెత్తందారుల కన్ను మక్కువ మండలం పాపయ్యవలసలో 50 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన డీ–పట్టా భూములను కాజేసేందుకు కొందరు పెత్తందార్లు రెవెన్యూ అధికారుల అండతో యత్నిస్తున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. తక్షణమే ఆ భూములను రీ–సర్వే చేసి దళితుల పేరిట ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. -
‘తల్లికి వందనం’ ఏదీ సారూ..!
కలెక్టరేట్ ప్రాంగణంలో ఓ తల్లి చేతిలో ఓ సాధారణ కాగితం..దానిపై వచ్చీరాని అక్షరాలతో రాసిన అర్జీ..పక్కన బిక్కుబిక్కుమంటూ నిలబడిన ఐదో తరగతి చదువుతున్న కూతురు. ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అమాయకత్వంతో పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందిన నిమ్మ దేవి అధికారుల ముందుకు వచ్చింది. ‘అయ్యా నాకు రావాల్సిన ’తల్లికి వందనం’ డబ్బులు రాకుండా చేశారని మాకు మీరే న్యాయం చేయాలి‘ అంటూ ఆ తల్లి అధికారులకు విన్నవించేందుకు తన కుమార్తెను వెంటేసుకుని, వచ్చీరాని రాతతో ఆ అమాయకపు తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఫిర్యాదు చేసింది. అలాగే ఇదే విషయమై, సాంకేతిక కారణాలతో ’తల్లికి వందనం’ సాయం జమకాలేదంటూ మరో 11 మంది మహిళలు సైతం ప్రజావాణిలోని ప్రత్యేక కౌంటర్లో అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. -
కరువు ముప్పు..!
కనుచూపు మేరలో..బొబ్బిలి: జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో ఏటా వరి సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు 30 శాతం కూడా ఉభాలు కాలేదు.వరి నారు వేసిన 21 రోజుల్లో నాట్లు వేసుకోవాల్సి ఉన్నా ఇప్పటికే చాలా చోట్ల 35 నుంచి 40 రోజులుగా వరి నారు ముదిరి పోతోంది. కాలువలు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. వరి నారును కొంతమంది మళ్లీ వేసుకున్నారు. అదీ పనికి వచ్చేలా లేదు. కరువు పొంచి ఉంది. రెండు నెలలుగా రైతులు వర్షం కోసం కంటిమీద కునుకులేకుండా ఎదురు చూస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చి వెళ్లిపోతున్నాయే తప్ప చుక్క నీరు రాల్చడం లేదు. ఇటీవల వచ్చిన తుఫాన్ వర్షాలు కూడా అంతే. రెండు రోజులు మేఘావృతమై పూలజల్లులు కురవడం, మరుసటి రోజంతా మాడు పగిలే ఎండలుకాయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. రైతులను ఆదుకుని కరువునుంచి గట్టెక్కించే చర్యలుతీసుకోవాలి కానీ అదిశగా కనీసం అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.జిల్లాలో గడిచిన రెండునెలల్లో వర్షపాతం వివరాలు(మి.మీలలో) నెల సాధారణ కురిసిన జూన్ 123.5 96.3జూలై 100.5 41.9 బోర్ల వద్ద ఎండుతున్న వరిపైరు వీఆర్ఎస్, పాల్తేరు చానళ్లలో కానరాని సాగునీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ప్రభుత్వం ఆగస్టు వచ్చేసినా 30శాతం కూడా పడని వరినాట్లు -
అలసత్వం వద్దు
ప్రజా సమస్యల పరిష్కారంలో పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మే రకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక ఉపకలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఎస్డీసీ డి. ధర్మరాజులతో కలిసి మొత్తం 69 వినతులను స్వీకరించారు. వాటిలో 16 రెవెన్యూకు సంబంధించినవి కాగా 53 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్ఎస్ పోర్టల్లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు నాణ్యత, రైతుభరోసా, విద్యుత్ బిల్లు, గోకులం షెడ్ల బకాయిలు, భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దిష్ట గడువులోగా సత్వరమే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను విచారణ చేసి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ప్రతి వారం పీజీఆర్ఎస్కు వచ్చే సమస్యలు తక్షణం పరిష్కరించాలని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఇచ్చిన వినతులు ఎంతవరకు పరిష్కారమయ్యాయనేది వారికి ఫోన్ చేసి అడగాలన్నారు. క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించామన్నారు. అనంతరం మొత్తం 15 వినతులు స్వీకరించారు. కుక్ ఉద్యోగం నుంచి అటెండర్ ఉద్యోగానికి ప్రమోట్ చేయాలని ఎస్ఎస్ మణుగుకు చెందిన కె.శ్రీరాములు కోరాడు. మర్రిపాడు, పూతికవలస రహదారి మరమ్మతులు చేయాలని, బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని పత్తిక కుమార్ వినతిపత్రం అందజేశాడు. పవర్టిల్లర్లు ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సాంబయ్య, సుక్కయ్యలు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీపీఎం ఎం.వి.రమణ, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేయాలి
పార్వతీపురం: ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేర కు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేయని శాఖలు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే సోమవారం నాటికి 100 శాతం రిజిస్ట్రేషన్లు సాధించాలని సూచించారు. ఈ నెలాఖ రు నాటికి కనీసం 54 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. కోర్సుల ప్రగతిని ప్రతినెలా సమీక్షిస్తామని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్ ఇన్కు స్పందన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యానాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సోమవారం నిర్వహించిన ప్రత్యేక ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 15మండలాల నుంచి మొత్తం 58 కాల్స్ వచ్చాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యానాణ్యత, సంక్షేమ కార్యక్రమాలపై సూచనలు, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ‘‘మన్యం డ్యాన్స్’’ ‘‘మెగా కోలాటం’’ ‘‘ ఆనందలహరి’’ ‘‘ ముస్తాబు’’ వంటి వినూత్న కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, విద్యార్థుల ప్రవేశాలు, హాజరు మెరుగుపడ్డాయని పలువురు అభినందించారు. విద్యార్థుల సామర్థ్యాలు, అభిరుచులను గుర్తించేందుకు సైకో మెట్రిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో విద్యారంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ రీ –సర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రీసర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతోపాటు పీజీఆర్ఎస్, ఇతర రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని సూచించారు. సరిహద్దు వివాదాలు, రెవెన్యూ రికార్డుల దిద్దుబాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ మాధురి, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పాలకొండ: పాలకొండ గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధారాణిపై పీడీ ధర్మరాజు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. పాలకొండ మండల గృహనిర్మాణ శాఖ పోస్టు నుంచి తప్పించి వీరఘట్టం ఏఈకి ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏఈపై ఇటీవల పాలకొండ పట్టణంలోని సచివాలయ వార్డు ఇంజినీర్లు నగరపంచాయతీ కమిషనర్తోపాటు గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేకుండా తమ లాగిన్ నుంచి గృహనిర్మాణ శాఖ లబ్ధిదారులకు సిమెంట్ అందించకుండా అందించినట్లు ఏఈ నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ ఈఈ సోమేశ్వరరావు లబ్ధిదారులను విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర వేడుకలను దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలు, స్టాళ్లు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉండాలని చెప్పారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరిస్తామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో 189 వినతుల స్వీకరణవిజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 189 వినతులు స్వీకరించారు. ఇందులో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి వినతిని నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యంతో విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన తర్వాతే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికల్లో నమోదు చేయాలని సూచించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి భూ వివాదాలు, సర్వే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున క్షేత్రస్ధాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిరంతరం సమీక్షించాలని సూచించారు. 1100 ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ఫ్రీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజల్లో ఈ సేవలపై మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాఖల వారీగా వినతులు పంచాయతీరాజ్–30, డీఆర్డీఏ– 18, గ్రామ సచివాలయ శాఖ– 15, విద్య–13, ఇతర శాఖలు–12, విద్యుత్–9, మున్సిపల్–8, వైద్య ఆరోగ్య శాఖ–5, డీసీహెచ్ఎస్–1. చట్టపరిధిలో సత్వరన్యాయం: 21 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్ విజయనగరం టౌన్: చట్టపరిధిలో బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలూ శ్రమిస్తుందని, బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విని వాటికి సంబంధించిన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. తమ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యలను పూర్తిగా విని, వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల క్రికెట్ సమరం
పార్వతీపురం రూరల్: జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆమోదంతో నిర్వహించిన స్పోర్ట్స్ ఈవెంట్స్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఉద్యోగుల మధ్య మైత్రీభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. క్రీడాకారులు మైదానంలో క్రీడాస్ఫూర్తిని చాటగా, క్రికెట్ ఇన్చార్జ్ లక్ష్మణ్ జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీలో భాగమైన ‘పూల్–ఎ’ మ్యాచ్ల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మొత్తం 18 ప్రభుత్వ శాఖల జట్లు ఈ పూల్లో పోటీపడుతున్నాయి. తొలి విడతలో వీబీ–జీ రామ్జీ వర్సెస్ పశుసంవర్ధక, వైద్యారోగ్య వర్సెస్ ఆడిట్, ఇరిగేషన్ వర్సెస్ పంచాయతీరాజ్, కలెక్టరేట్ వర్సెస్ ఏపీఈపీడీసీఎల్, మున్సిపల్ వర్సెస్ అగ్రికల్చర్, ట్రైబల్ వెల్ఫేర్ వర్సెస్ ఎస్సీఎస్డబ్ల్యూ, పౌరసరఫరాలు వర్సెస్ ట్రెజరీస్, రెవెన్యూ వర్సెస్ సర్వే జట్లు తలపడనున్నాయి. విద్యాశాఖ, పీఆర్ ఎడ్యుకేషన్ జట్లు తదుపరి రౌండ్లలో విజేతలతో పోటీపడతాయి. మొదటి రౌండ్ విజేతలు తర్వాతి దశలు, సెమీఫైనల్స్ (ఎం–15, ఎం–16) దాటుకుని ’పూల్–ఎ’ విజేతను నిర్ణయించే ఆఖరి ఫైనల్ (ఎం–17) పోరుకు చేరుకుంటాయి. -
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 600మంది కీడాకారులు హాజరయ్యారు. అండర్–14,16,18, 20 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లీలా కృష్ణ, శ్రీకాంత్ తెలిపారు. -
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామం వద్ద వేగావతి నది నుంచి ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వీఆర్ఓ వెంకినాయుడు ఆదివారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘా పెట్టామని, అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామని, సెలవు రోజు కావడంతో ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యలు తహసీల్దార్ తీసుకుంటారని చెప్పారు. గిన్నిస్ రికార్డ్స్’లో విజయనగరం వాసివిజయనగరం టౌన్: అమెరికాలో సిలికానాంధ్ర సహకారంతో 300 మంది మృదంగ కళాకారులతో ఒకే వేదికపై 30 నిమిషాల పాటు రూపొందించిన లయవిన్యాసం కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరానికి చెందిన డాక్టర్ పత్రి సతీష్ కుమార్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ప్రస్తుతం చైన్నెలో ఉంటున్న ఆయన తెలుగువాడిగా, విజయనగరం వ్యక్తిగా రికార్డు అందుకోవడం పట్ల విజయనగర సంగీతాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్ మండపాక రవి, సంగీతాభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. 2.5 కిలోల గంజాయి పట్టివేతవిజయనగరం టౌన్: ఒడిశా రాష్ట్రంలోని మునిగుడ ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్ర రాజధాని చైన్నెకి అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు రూ.లక్షా 25వేల విలువైన 2.5 కిలోల గంజాయిని రైల్వేపోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్పీ ఎస్సై వి.బాలాజీరావు మాట్లాడుతూ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ఫామ్స్పై తనిఖీ నిర్వహిస్తుండగా ఒడిశాలోని కొంధమాల్ జిల్లాకు చెందిన ధర్మేంద్ర పల్లా అనే వ్యక్తి గంజాయిని చైన్నె తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, గంజాయి స్వాధీనం చేసుకుని నిదితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం రైల్వేకోర్టుకు తరలించామని చెప్పారు. శృంగవరపుకోట: మండలంలోని సన్యాసయ్యపాలెం గ్రామంలో 16 కేవీఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు వస్తున్న విద్యుత్ కనెక్ష న్ కట్ చేసి, ట్రాన్స్ఫార్మర్ దించేసి డీటీఆర్ వైండింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి దొంగిలించి తీసుకుపోయారు. ఉదయం గ్రామానికి విద్యుత్ సరఫరా లేదన్న కంప్లైంట్తో లైన్కు వచ్చిన సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ దించేసి విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి వెంటనే ఎస్.కోట ఏఈ జి.రామారావుకు తెలిపారు. ఈ మేరకు ఆయన వెంటనే ఎస్కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాజువాకలో బొబ్బిలి యువతి ఆత్మహత్యబొబ్బిలి: పట్టణానికి చెందిన ముస్లిం యువతి విశాఖ జిల్లా గాజువాకలో ఆత్మహత్యకు పాల్ప డింది. బొబ్బిలికి చెందిన రషీదా బేగం(26) విశాఖలోని ఓ బ్యూటీ పార్లర్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. ఓ పీజీ హాస్టల్లో ఉంటూ తాను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్కు నిత్యం వెళ్లి వస్తుంటుంది. అయితే ఆదివారం ఆమె గాజువాకలోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని అందులోనే ఉరి వేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదని, పోలీసుల నుంచి త్వరగా రమ్మని సమాచారం వచ్చిందన్నారు. వెంటనే తండ్రి నూర్ఖాన్, తల్లి మున్నీబేగంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బొబ్బిలి తీసుకువచ్చేందుకు విశాఖ వెళ్లారని మృతురాలి పెదనాన్న కుమారుడు విలేకరులకు తెలిపాడు. -
15తులాల బంగారం ఆభరణాల చోరీ
సీతానగరం: మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్లో మెయిన్ రోడ్డును ఆనుకుని నివాసం ఉంటున్న కూర్మదాసు కిరణ్ ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 15 తులాల బంగారం ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్సై ఎం.హేమలత తెలిపారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన అనంతరం ఇంట్లో తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి బీరువా తెరిచే సరికి అందులో భద్రపర్చిన బంగారం నగలు లేవపోవడాన్ని గుర్తించి ఇరుగు పొరుగువారికి తెలియజేసి, బాధితుడు కిరణ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని క్లూస్టీమ్ సందర్శించి వేలిముద్రలను సేకరించినట్లు ఎస్సై చెప్పారు. మార్కెట్లో దొంగతనం జరిగిన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినట్లు తెలిపారు. పార్వతీపురం సీఐ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హేమలత తెలియజేశారు. -
ఏఐ ఫ్యూజన్ సదస్సులో ‘సీతం’ ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలో ఏఐ రంగం అగ్రశ్రేణి నిపుణులతో ఆదివారం జరిగిన ‘ఏఐ ఫ్యూజన్ వైజాగ్’ అనే సదస్సులో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు నాయకత్వంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బోష్, జేపీ మార్గాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు చెందిన సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులు, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, భవిష్యత్ ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా మాట్లాడే ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి భవిష్యత్ సాంకేతిక సవాళ్లకు వారిని సిద్ధం చేస్తాయని డాక్టర్ శశిభూణరావు తెలిపారు. ప్రపంచ స్థాయి అనుభవాన్ని విద్యార్థులకు అందించడమే తమ సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన సీతం కళాశాల బృందానికి నిర్వాహకులు జ్జాపికలను అందజేశారు. -
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీల ‘చలో ఢిల్లీ’
పార్వతీపురం రూరల్: సగానికి పైగా జనాభా.. చట్టసభల్లో నామమాత్రపు ప్రాతినిధ్యం. ఈ అసమానతలను రూపుమాపుతూ, రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు 34శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం దక్కాలంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని కోరారు. కులవృత్తుల వికాసానికి రూ.15 వేల కోట్లతో ‘ఆర్టిజన్స్ వెల్ఫేర్ స్కీమ్’, ప్రత్యేక సబ్ప్లాన్న్ చట్టాన్ని తీసుకురావాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ గర్జనకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు సంఘీభావం తెలిపారు. బాధ్యతల పంపిణీ మన్యం జిల్లా ఉపాధ్యక్షులుగా జి.రవి, పాత గౌరీశంకర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా బోను మధుయాదవ్, కార్యదర్శిగా కుప్పిలి సంతోష్, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడిగా మహేష్ నియమితులయ్యారు. కార్యక్రమంలో మోహనన్రావు, తోకాడ రాము, సి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్ చట్టసభల్లో 3శాతం రిజర్వేషన్లు.. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్ -
● సన్మానం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్బాబు కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించినందుకు గాను ఆయన తండ్రి శ్రీనివాసరావును గ్రామస్తులు ఆదివారం ఘనంగా సత్కరించారు. అజయ్బాబు దేశానికే కాదు..గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చారని గ్రామపెద్దలు ప్రశంసించారు. కొడుకును ప్రోత్సహించి, అతడి విజయానికి దోహదపడిన తండ్రిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు మొయిద అప్పారావు, నాయకులు ఆదినారాయణ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. -
చినుకు కినుకు..!
● పెద్దగెడ్డకు గండం ● పూర్తిస్థాయికి చేరని నీటిమట్టం ● అన్నదాతల్లో ఆందోళనపాచిపెంట: మండలంలోని పెద్దగెడ్డ జలాశయంపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ జలాశయం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం 209.70 మీటర్ల వద్ద మాత్రమే నీరు ఉంది. ప్రస్తుతం పెద్దగెడ్డ ఆయకట్టు రైతుల ఆశలన్నీ వర్షాలపైనే ఉన్నాయి. జలాశయంలో నీటిమట్టం పెరిగితేనే పంటలకు ఊరట లభిస్తుందని, లేకుంటే తీవ్ర నష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు. 40 క్యూసెక్కుల నీటి విడుదల ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్పిల్వే, ప్రధాన కాలువ ద్వారా ఇటీవల రోజుకు 40 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం నుంచి అది కూడా నిలుపుదల చేశారు. ఈ నీరు ప్రస్తుత ఆయకట్టు అవసరాలకు సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల భవిష్యత్తుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. 150 క్యూసెక్కులు వదిలితే 40రోజులకే డెడ్ స్టోరేజ్.. ప్రస్తుత ఆయకట్టుకు సరిపడా నీరు అందించాలంటే రోజుకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని పెద్దగెడ్డ జలాశయ అధికారులు చెబుతున్నారు. అయితే అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తే 40 రోజుల్లోనే జలాశయం పూర్తిగా డెడ్ స్టోరేజ్కు చేరుకునే ప్రమాదం ఉందని, వర్షాలు సకాలంలో కురవకపోతే సాగునీటి సమస్య మరింత తీవ్రం కానుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు చెబుతున్నారు. జలాశయంలో నీరు ఉన్నప్పటికీ అవసరమైనంతగా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కూడా లేకపోవడంతో పంటలు నిలబడతాయో లేదో భయంగా ఉంది. అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని రైతులకు భరోసా కల్పించాలి. ఈదుబిల్లి సుధీర్ నాయుడు, ఆయకట్టు రైతు, మిర్తివలస -
బళ్లారి రాఘవకు పోలీస్ శాఖ నివాళులు
పార్వతీపురం రూరల్: తెలుగు నాటక రంగ పితామహుడు తాడిపత్రి రాఘవాచార్యులు (బబళ్లారి రాఘవ) జయంతి వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవ గొప్ప నటుడే కాకుండా, తెలుగు నాటక రంగానికి జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడని కొనియాడారు. కళ ద్వారా ఆయన ప్రజల్లో తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని స్మరించుకున్నారు. వృత్తిరీత్యా గొప్ప న్యాయవాది కూడా అయిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఏఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వారిపై ఎందుకో వివక్ష?
● ఎంటీఎస్ ఉపాధ్యాయులకు అందని జీతాలు ● రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులుబలిజిపేట: ఎంటీఎస్ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారికి జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. వారు ఎప్పుడు ఏ పాఠశాలకు డిప్యుటేషన్ పేరిట వెళ్లాల్సి వస్తుందో తెలియదు. మండల, డివిజన్స్థాయిలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు వారికి కౌన్సెలింగ్ జరిగేటప్పుడు వారికి అన్యాయం జరుగుతోందనేది జగమెరిగిన సత్యం. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు అన్ని నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా వారికి న్యాయం జరిగిన దాఖలాలు లేవు. పాఠశాలలు జూన్ నెలలో ప్రారంభించినా నేటికీ వారికి జీతాలు అందకపోవడం గమనార్హం. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన సాంకేతిక కారణాలు చూపుతూ జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తున్నారు. స్వల్ప వేతనంతో జీవనం సాగిస్తున్న ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో వారు పనిచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 400మందికి పైగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. జూన్ నెలలో బదిలీల అనంతరం కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలంటూ సాకులు ఉపాధ్యాయుల తప్పిదం లేకపోయినా పొజిషన్ ఐడీల మ్యాపింగ్, క్యాడర్ స్ట్రెంత్ డిస్ప్లే, ఇతర సాంకేతిక ప్రక్రియలు పూర్తికాకపోవడంతో బిల్లులు సమర్పించలేని పరిస్థితి ఎదురైంది. జూన్ నెలలో జిల్లా కౌన్సెలింగ్ జరిగిన తరువాత రోజున ఎంఈఓలు మండలస్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి విధుల నిర్వహణకు పాఠశాలలు కేటాయించి ఎప్పుడు, ఎక్కడికి అవసరమైతే అక్కడికి డిప్యుటేషన్పై వెళ్లాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. జూన్ నెలలో జీతాల బిల్లులు పెట్టిన తరువాత ఎంటీఎస్లకు జిల్లా కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో జీతాల బిల్లులకు సాంకేతిక సమస్య ఎదురైంది. బిల్లులు సక్రమంగా పెట్టనందున జూలైలో జీతాలు అందలేదు. పోనీ జూలైలో అయినా సక్రమంగా సాగుతోందా? అంటే అదీ జరగలేదు. దీంతో వారికి రెండు నెలల జీతాలు అందలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు వారి జాయినింగ్ ఆర్డర్లు, కుల ధ్రువీకరణ పత్రం పట్టుకుని జిల్లా ఎస్టీఓ కార్యాలయానికి రావాలని సూచించడంతో ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యలు పరిష్కరించి జీతాలు మంజూరుచేయాలని వారు కోరుతున్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో స్థిరమైన విధానం లేదు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు చెల్లించాలి. దీనిపై సంఘాల తరఫున డిమాండ్ చేశాం. నిధి పోర్టల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎస్టీఓ కార్యాలయానికి వ్యక్తిగతంగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవిధంగా కాకుండా డీడీఓల ద్వారా అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది. ఎం.శేషగిరి, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా -
లెక్కలేని తనం..!
కొత్తవలస: భక్తితో పైసా పైసా కూడబెట్టి అమ్మవారికి సమర్పించుకునే భక్తుల నమ్మకాన్ని దేవాదాయశాఖ అదికారులు నిలువునా దోచుకుంటున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులే పక్కా అక్రమాలకు తెరలేపారు. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామం సమీపంలో గల పుణ్యక్షేత్రం ధారపైడితల్లమ్మ అమ్మవారి ఆలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంవారం లక్షల్లో నగదు, బంగారం, వెండి భక్తులు సమర్పిస్తుండగా కేవలం రూ.4వేలు, రూ.5వేలు వస్తున్నాయని కానుకలు సమర్పించిన భక్తులకు రసీదులు కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధార పైడితల్లిమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి స్థానికంగా ఉండటే గిరిజనులు అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఆలయానికి ప్రతి ఆదివారం, మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడే వంటలు చేసుకుని అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తులు లక్షల్లో కానుకలు చెల్లిస్తూ వస్తున్నారు. దీంతో భక్తులు సమర్పించిన కానుకులకు సరైన లెక్కలు లేకపోవడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖకు అప్పజెప్పారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అధికారులు ఆది,మంగళవారాల్లో ఉదయం ఆలయం వద్ద హుండీని ఏర్పాటు చేసి సాయంత్రం కొంతమంది భక్తుల మధ్య హుండీలోని కానుకలను లెక్కించేవారు. కాగా రెండు సంవత్సరాల నుంచి అధికారులు ఈ తంతంగాన్ని పక్కన పెట్టి వారే స్వయంగా సంచుల్లో కానుకలను భక్తుల నుంచి స్వీకరించడం మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారంఆలయంలో దేవదాయశాఖ హుండీని ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హుండీలు ఏర్పాటుచేయకపోగా ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలకు రసీదులు ఇస్తాం. ఆ కానుకులు మా సంచుల్లో వేయండి అంటూ వసూళ్లకు దిగడం గమనార్హం. అయితే భక్తులు సమర్పిస్తున్న కానుకలకు, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేదు. సంచుల్లో వసూలు చేస్తున్న కానుకలకు, అధికారులు ఇస్తున్న రసీదులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. దేవదాయశాఖ అధికారుల్లో కరువైన జవాబుదారీతనం ధార పైడితల్లమ్మ ఆలయంలో కానరాని హుండీ నేరుగా భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్న అధికారులుమా శాఖ అధికారులపై భక్తులు నమ్మకం ఉంచాలిహుండీని ఏర్పాటు చేస్తే దొంగలు దోచుకుపోతున్నారు. అందుకే వారం వారం మా సిబ్బంది వచ్చి భక్తుల నుంచి నేరుగా సంచుల్లో కానుకలను సేకరిస్తున్నాం. వంద రూపాయలకు పైబడి కానుక ఇచ్చిన భక్తులకు రసీదు ఇస్తున్నాం. భక్తులు, గ్రామస్తులకు మాపై నమ్మకం ఉండాలి. శ్రీనివాసరావు, ఆలయ ఈఓ లక్షల్లో దోచుకు పోతున్నారుఈ ఆలయానికి వారంలో రెండు రోజుల పాటు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులు సమర్పించిన కానుకులు లక్షల్లోనే ఉంటాయి. అలాగే పలువురు భక్తులు బంగారం, వెండి ఆభరణాలు సైతం సమర్పించుకుంటున్నారు. అయినా అదికారులు నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో కానుకలను సేకరిస్తూ 30 మందికో 40 మందికో తూతూమంత్రంగా రసీదులు ఇచ్చి మిగిలిన సొమ్ము దోచుకుపోతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలి. – ఉగ్గిన పద్మనాభస్వామి, అప్పన్నదొరపాలెం, గ్రామపెద్ద ఆగ్రహంలో భక్తులు, గ్రామస్తులు అమ్మవారికికి మేము సమర్పించే కానుకలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప అధికారుల జేబులు నింపడానికి కాదని భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీని ఏర్పాటు చేయకుండా సంచుల్లో కానుకలను స్వీకరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
వెలుగు మార్కెట్
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026మసకబారిన వెలుగు మార్కెటింగ్ కేంద్రాలు చీకటి మయమవుతున్నాయి. వన్ధన్ వికాసకేంద్రాలు ఇప్పటికే మూలకు చేరాయి. దీంతో గిరిజనుల ఆదాయవనరులు సన్నగిల్లుతున్నాయి. ఒక్కో గిరిజన కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం మాట అటుంచితే ఇప్పటికే దళారీ వ్యాపారుల మాయలో పడి నష్టపోతున్నారు. ఇటు జీసీసీ వంటి సంస్థలు ఉన్నా నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. సీతంపేట: గిరిజన ప్రధాన ఆదాయ వనరులు చింతపండు, జీడి, పైనాపిల్, పసుపు, కంది పంటలు. వాటిని పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనేది ఐటీడీఏ ఆశయం. వెలుగు ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నెలకొల్పి తద్వారా ఆదాయ వనరులు మహిళా సంఘాలకు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం వన్ధన్ వికాస కేంద్రాలు (వీడీవీకే)ల పేరుతో ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పి ఉత్పత్తులను మార్కెట్ చేయాలనేది ఉద్దేశం. ఐటీడీఏ పరిధిలో సుమారు 12వేల ఎస్హెచ్జీ గ్రూపులు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం పసుపు, చింతపండు, జీడి ప్రాసెసింగ్ కేంద్రాలను పది చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక్కో యూనిట్కు ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే వెలుగు ద్వారా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక మూతపడ్డాయి. జీడి ప్రాసెసింగ్ కేంద్రాలను శంభాం, జిల్లేడుపాడు, సీతంపేటలలో ఏర్పాటు చేశారు. వాటికి కూడా భారీ యంత్రాలను సమకూర్చారు. మహిళా సంఘాలు ప్రాసెస్ చేసి జీడిపిక్కలు తీసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసినా సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆయా కేంద్రాలు తెరుచుకోలేదు. సీజన్లో చింతపండు కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి నాణ్యమైన చింతపండును పిక్కతీసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి వసతిగృహాలు, ఇతర మార్కెటింగ్ కేంద్రాలకు విక్రయించాలనేది ఉద్దేశం. ఈ యూనిట్ను సీతంపేటలో ఏర్పాటు చేసినా అదికూడా పనిచేయడం లేదు. స్థానికంగా ఐటీడీఏ సమీపంలో ఈ కేంద్రాలు నెలకొల్పినప్పటికీ దిబ్బగూడలో నెలకొల్సిన పసుపు ప్రాసెస్ యూనిట్ తప్ప మరేమీ నడవడం లేదు. వాటిన్నింటికీ సుమారు రూ. కోటి వరకు వెచ్చించినా నిధుల వృథా తప్ప ప్రయోజనం లేదని గిరిజనులు పెదవివిరుస్తున్నారు. వెలుగు అదికారుల సరైన పర్యవేక్షణ లేదు. ఈ మార్కెటింగ్ కేంద్రాలపై దృష్టిసారించాలని సంబంధిత వెలుగు అధికారులకు ఎప్పటి నుంచో విన్నవిస్తున్నాం. లక్షల్లో వృథా చేశారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. గిరిజనులకు మంచి మార్కెట్ సదుపాయాలు కల్పించి ఉపాధి సౌకర్యాలు మెరుగుపర్చాలి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ ఏజెన్సీలో సుమారు 15 వేల ఎకరాల్లో పైనాపిల్ పండుతుంది. దాదాపు 50 టన్నులు ఉత్పత్తి వస్తుంది. ఈ ఏడాది ధరలు లేక గిరిజన రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు బజార్లకు తీసుకువెళ్లి కొద్దిమంది మాత్రమే విక్రయాలు జరిపారు. జీడి పంట 30 వేల ఎకరాల్లో పండుతుంది. 5లక్షల కిలోల ఉత్పత్తి ఏటా జరుగుతుంది. పసుపు 5 వేల ఎకరాల్లో సాగవుతుంది. సుమారు 10 వేల కిలోల ఎండు పసుపు ఉత్పత్తి అవుతుంది. చింతపండు 5 వేల ఎకరాల్లో పండుతుంది. ఏడాదికి 100 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఉసిరి 200 ఎకరాల్లో పండగా 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. గిరిజనుల అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా నెలల తరబడి నిల్వ ఉంచి అనంతరం వాటిని విక్రయించుకోవడానికి వీలుగా కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాలు లేవు. గతంలో సీతంపేట వారపు సంత వద్ద రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీ పూర్తిగా పాడైంది. మూలనపడిన వన్ధన్ కేంద్రాలు రూ.కోటిపైనే వృథాగా యంత్రాలు గిరిజనులకు మధ్య దళారులే దిక్కు మూతపడిన జీడి ప్రాసెసింగ్ కేంద్రం -
సాహిత్యానికే వన్నెతెచ్చిన సృజనశీలి ‘తులసి’
విజయనగరం టౌన్: తెలుగు సాహిత్యాన్ని దశ దిశ లా వ్యాప్తి చేసి, తన జీవితాన్ని సాహిత్యానికి అంకి తం చేసిన సాహిత్య సృజన శీలి చాగంటి తులసి అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. భార త సాహిత్య రంగానికి చాగంటి తులసి చేసిన అవిర ళకృషి మరువలేనిదని కొనియాడారు. తులసి సా హిత్య రచనలను ఆమె సమక్షంలోనే సమీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని సాహితీవేత్తలు ఆనందపరవశులయ్యారు. స్థానిక పాల్నగర్లో తులసి స్వగృహంలో చాగంటి తులసి సాహితీ సమాలోచన పేరుతో సాహిత్యంలో విశేష కృషి చేసినటువంటి సాహితీవేత్తలను సముచితరీతిలో ఆదివారం సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జిఎస్.చలం, రత్నాల బాలకృష్ణ ఆధ్వర్యంలో వారికి చా.సో కథా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు తులసి కథల సంపుటి యాష్–ట్రే పుస్తకావిష్కరణ చేశారు. చాగంటి కృష్ణకుమారి సమీక్షించారు. సచీ రౌత్రాయ్ అనువాద కథల్ని ధవళ సర్వేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త రామసూరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తులసి సాహిత్యంపై యువ సాహితీవేత్తలు దుప్పల రవికుమార్, కూరెళ్ల శ్రేయ, సుభ, గీతా రమాదేవి, రత్నాల బాలకృష్ణ ప్రసంగించారు. 90 ఏళ్ల వయసులో సాహిత్యంపై మక్కువ చూపిస్తున్న చాగంటి తులసి కీర్తిని కొనియాడారు. చింతా అప్పలనాయుడుకు చా.సో కథా పురస్కారం వ్యంగ్య శైలిలో దోపీడి వ్యవస్థను తూర్పారబట్టిన ‘నగ జనకరి నాం నాం..’ అంటూ తన కథల ద్వారా దండోరా మోగిస్తున్న కథకుడు చింతా అప్పలనాయుడు చా.సో కథా పురస్కారం అందుకున్నారు. ఉత్తరాంధ్ర నుడికారాన్ని, యాసను, భాషను ప్రతి కథలోనూ ఇంకించి, రైతులు, దళితుల, గిరిజనుల దోపిడీకి కారణమైన వ్యవస్థలో లోపాలను తన రచనల ద్వారా ఎత్తి చూపారని సాహితీవేత్తలు విశ్లేషించారు. ఉత్తరాంధ్ర సంభాషణలు, వాలకాలు, చతు రోక్తులు, మాటలు, సామెతలు, దుక్కి, ఇలమీద దేవత, అరిసేతిలో బువ్వ, పువ్వు వంటి కవితా సంకలనాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి న చింతా అప్పలనాయుడుకు చాసో కథా పురస్కా రంతో సత్కరించారు. రూ.10 వేలు నగదు పురస్కారం, జ్ఞాపిక, శాలువతో సత్కరించారు. ఆయన రాసిన ‘నకజనకరి నాం..నాం..’ కథల సంపుటిని సరిపల్లి నాగరాజు సమీక్షించారు. తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికికి అనువాద పురస్కారం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికి చాగంటి తులసి అను వాద పురస్కారం దక్కింది. ఈ మేరకు రూ.15 వే లు నగదు పురస్కారం, జ్ఞాపిక, సాలువతో ఆమెను గౌరవప్రదంగా సత్కరించారు. ద్వారం దుర్గాప్రసా ద్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో లిప్తకాలపు స్వప్నం పుస్తకాన్ని లండ సాంబ మూర్తి సమీక్షించా రు. తొలి అనువాదం లిప్తకాలపు స్వప్నంతో ప్రతిష్టాత్మక తెలుగు యూనివర్సిటీ అనువాద పురస్కారాన్ని అందుకుని, సాహితీ జగత్తులో కథా రచయిత్రిగా, అనువాదకురాలిగా, నవలా రచయిత్రిగా, సంపాదకురాలిగా తనదైన ముద్రతో స్వర్ణ ముందుకు సాగుతున్నారన్నారు. మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలు, సమాజంలోని రక రకాల కోణాలు విశ్లేషించే కథలతో నల్ల బంగారం, గోడ అవతల వంటివి కథా సంపుటులుగా వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయన్నారు. -
కొలిక్కిరాని కొత్త పంచాయతీలు
దత్తిరాజేరు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని మధుర గ్రామాలను పంచాయతీలుగా మార్పు చేసే ప్రతిపాదనలపై ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు ఉన్న మధుర గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి మండల పరిషత్ అధికారులు అర్హత ఉన్న మధుర గ్రామాల ప్రజలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నారు.అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తీర్మానాలు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా అందిన దత్తిరాజేరు మండలంలోని గదబవలస, మర్రివలస, పోలవంగర, పాపయ్యవలస, జగన్నాథపురం, మజ్జిపేట గ్రామాల ప్రతిపాదనలను గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వానికి పంపించారు. అయితే నేటివరకు కొత్త పంచాయతీల ఏర్పాటు గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో మధుర గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా పాత పంచాయతీల స్థానంలో నిర్వహిస్తారా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయండిపాపాయ్యవలసతో పాటు అర్హత ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయండి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా మాగ్రామ పంచాయతీకి జమ అవుతాయి. తద్వారా గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రత్యేక పంచాయతీగా ఉండడం వల్ల అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ఎస్. శ్రీనివాసరావు, పాపయ్యవలస గ్రామం ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రతిపాదనలు ప్రభుత్వ ఆదేశాల మేరకే మండలంలోని ఆరు మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు గత ఏడాది డిసెంబర్లో అప్పుడు ఉన్న అధికారులు పంపించారు. కొత్త పంచాయతీలు ఎప్పడు ఏర్పాటు చేస్తారన్నది ఉన్నతాధికారుల నుంచి సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే తెలియజేస్తాం. ఎస్.తాత ఎంపీడీఓ దత్తిరాజేరుకొత్త పంచాయతీలతో స్వయం ప్రతిపత్తి అన్ని అర్హతలు ఉన్న గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైతే స్వయం ప్రతిపత్తి సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మధుర గ్రామాలు అభివృద్ధి విషయంలో చిన్నచూపుకు లోనవుతున్నాయి. అలాగే మధుర గ్రామాల ప్రజలకు గ్రామ పంచాయతీల ద్వారా అందాల్సిన పథకాల విషయంలో ఆన్నాయం జరుగుతోందనే భావన వ్యక్తమ వుతోంది. పెద్ద పంచాయతీల పరిధిలో రెండో మూడో మధుర గ్రామాలకు వచ్చే నిధులు పెద్ద పంచాయతీకే వినియోగించే అవకాశాలే అధికం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు అర్హతలు ఉన్న మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గత ఏడాది హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు 6 మధుర గ్రామాలపై వీడని సందిగ్ధం -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
పార్వతీపురం: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు, వాటి స్థితిని మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవడంతో పాటు1100 టోల్ఫ్రీ కాల్సెంటర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్లో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ’క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన ఇవ్వండి పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ప్రజలను కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నారు యాజమాన్యంపై అవగాహన అవసరంపాలకొండ రూరల్: ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ స్థితి నుంచి వరి పంట సాగులో యాజమాన్య పద్ధతులు అవసరమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామాన్ని ఆయన ఆదివారం సందర్శించి అక్కడి రైతులతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అక్కడి పంటల సాగు తీరుపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సాగునీటి ఎద్దడి ఏర్పడే సమయంలో నారు యాజమాన్యం, వర్షం అనుకూలించే ప్రాంతాల్లో స్వల్పకాలిక వంగడాలను వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ స్థితిగతులను ఏ విధంగా అధిగమించాలనే అంశాలపై సీతంపేట వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, పి.సౌజన్య తదితరులు వివరించారు. ప్రకృతి విపత్తులనుంచి నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాపై అవగాహన కలిగి ఉండాలని, సకాలంలో బీమా చేయడం వల్ల అర్థిక వెసులుబాటు ఉంటుందని వ్యవసాయ సహాయకుడు వి.గుణశేఖర్ తెలిపారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని ఆదివారం కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన కె.సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. రూ. 2.50లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతల కు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
700 క్యూసెక్కుల నీరు సరఫరా
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శనివారం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. గత కొంత కాలంగా ఖరీఫ్ సీజన్కు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 24,788 ఎకరాల ఆయకట్టు భూములకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టుకు నీటి అవసరం ఉండడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంపుదలచేసి మొత్తం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 61.96 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ ● ప్రజలు సురక్షితంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు విజయనగరం గంటస్తంభం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనాల రాకపోకలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి ఈఎంఎస్ వ్యవస్థతో వాహనాల కదలికలను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన 4,860 బస్సుల్లో ప్రయాణించిన ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సెర్ప్ డైరెక్టర్(అడ్మిన్) ఎ.కల్యాణ్ చక్రవర్తితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగించినందుకు జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్శాఖ ముందస్తు ప్రణాళికతో చేపట్టిన భద్రతా, బందోబస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రద్దీ ఏర్పడినప్పటికీ అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా స్పందించి ట్రాఫిక్ను త్వరితగతిన సాధారణ స్ధితికి తీసుకువచ్చారన్నారు. బందోబస్తు విధులను అత్యంత క్రమశిక్షణతో, నిబద్దతతో నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎయిర్పోర్టుకు శంఖారావం చేసిన కోడూరు వాసి బాడంగి: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన యోగా శిక్షకుడు కడిమిశెట్టి రమేష్కు అరుదైన అవకాశం లభించింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం తొలుత శంఖానాదం చేశారు. విజయనగరం డిప్యూటీ కలెక్టర్ శర్మ సూచనల మేరకు ప్రధాని మోదీ పాల్గొన్న సభాస్థలి వద్ద శంఖారావంపూరించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు రమేష్ తెలిపారు. -
తమ్ముళ్ల ఖాతాలోకి.. పంచాయతీల సొమ్ము!
● గిరిజన పంచాయతీలే టార్గెట్ ! ● పనులు చేయకుండానే స్వాహా ● రూ.18 లక్షల వరకు పక్కదారి సాక్షి, పార్వతీపురం మన్యం: సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత గిరిజన పంచాయతీల్లో కనీస పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు జరిగిన దాఖలాల్లేవు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి మళ్లిపోతున్నాయి. వారి సొంత జేబులో సొమ్ములా వాడేసుకుంటున్నారు. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో గల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కొద్ది రోజుల కిందట డ్రా చేసినట్లు సమాచారం. సాలూరు మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా చేసినట్లు భోగట్టా. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలనే ఇందుకు ఎంచుకున్నారు. పనులు చేయకుండా నిధులు డ్రా చేయడం పట్ల తాము ఇరకాటంలో పడిపోతామేమో అని ఆయా కార్యదర్శులు ఆందోళనలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడం.. మండల అధికారుల సిఫార్సులు కూడా ఉండడంతో నోరు మెదపలేక పోతున్నారు. ఇప్పుడు ఆయా పంచాయతీల్లో నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని తెలుస్తోంది. గిరిజన పంచాయతీలే అధికం.. నిధులు డ్రా చేసిన పంచాయతీల్లో ఎక్కువ భాగం గిరిజన, గిరి శిఖర ప్రాంతాలే ఉన్నాయి. అది కూడా గతంలో వైఎస్సార్ సీపీ సర్పంచ్లు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీలనే ఎంచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భాగోతం బయట పడినా నిందను వారి మీదకు నెట్టేయవచ్చన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఈ పంచాయతీల్లో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ప్రశ్నించలేని పరిస్థితిలో వారు ఉండటం ఆ ‘తమ్ముడికి’ కలిసి వచ్చింది. కొత్తవలస పంచాయతీ నుంచి రూ.2,00,364, కందులపథం పంచాయతీ నుంచి 1,00,300, తోణాం రూ.1,49,978, సారిక రూ.2,00,482, మరిపల్లి రూ.1,00,300, కురుకుట్టి 2,50,750, అన్నంరాజువలస రూ.2,49,216, తుండ రూ.2,00,010, గంజాయిభద్ర రూ.లక్ష, పట్టుచెన్నూరు రూ.1.50 లక్షలు, కూర్మరాజుపేట రూ.50,622, కొదమ నుంచి రూ.1.20 లక్షల చొప్పున నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా కావడం.. మెజారిటీ పంచాయతీలు గిరిజన ప్రాంతానికి చెందినవే అవ్వడం గమనార్హం. పాచిపెంట మేజర్ పంచాయతీలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ కోసమని మంత్రి అనుచరుడి పేరు మీద రూ.లక్ష రూపాయల నిధులు డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు చేతులా సంపాదనకు అలవాటు పడిన తెలుగు తమ్ముళ్లు.. ప్రత్యేక అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, పనులు చేయకుండానే నిధులు దోచేస్తుండడం పట్ల గ్రామస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటివి ఏవైనా ప్రత్యేక అధికారుల అనుమతితోనే జరగాలి. 15వ ఆర్థిక సంఘం ఆఖరి విడత నిధులపై కన్నేసిన ఆ మండల స్థాయి నాయకుడు 12 గ్రామ పంచాయతీల్లో నిధులను ఎలాంటి పనులూ చేయకుండానే డ్రా చేశారని సమాచారం. ముఖ్యంగా ఎల్ఈడీ దీపాలు కొనుగోలు పేరిట ప్రత్యేక అధికారుల మీద ఒత్తిడి తెచ్చి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఆయా పంచాయతీల్లో స్థానిక నాయకులకు కూడా చెప్పకుండానే ఈ తంతు నడపడంపై ఆయా పంచాయతీల్లో ఉన్న అధికార పార్టీ నాయకులకూ మింగుడు పడడం లేదు. -
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం జరుగుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే అంశంపై న్యాయమూర్తులు, న్యాయవాదులతో శనివారం చర్చించారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్బౌన్స్ తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణ నుంచి పూల్బాగ్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి, మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. 90 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని, మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం కోర్టు ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
● రూ.50 వేలు సాయం అందించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్లవిజయనగరం అర్బన్: వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన విజయనగరం బాబామెట్ట నివాసి కోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కోటి రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.50 వేలు అందజేశారు. ఆయన వెంట ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ గాదం మురళి, వర్మరాజు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు కె.సుధాకర్, కాశిరెడ్డి నవీన్, సతీష్, సాయికుమార్, మువ్వల భాస్కర్, శ్రీహరిబాబు, రవి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినులకు కడుబండి పరామర్శ
శృంగవరపుకోట: మండలంలోని తాటిపూడి వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల కళాశాలలో జ్వరాల బారినపడిన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం పలువురు నేతలతో కలిసి పరామర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అక్కడే ఉన్న కొ ట్టాం పీహెచ్సీ వైద్యాధికారి హారికతో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న సేవల గురించి, ప్రిన్సి పాల్ శారదాబాయితో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, కళాశాలలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతులు,ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎటువంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, నాయకులు వాకాడ రాంబాబు, కె.వెంకటరావు, టి.సాంబరాజు, డి.సన్యా సిదేముడు, ఆల్తి బాబురావు, ఎస్.కనకం, చిన్నా మాస్టర్ ఉన్నారు. -
పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
● రైతుల నెత్తిన మరింత భారం ● చెల్లింపునకు పాట్లురామభద్రపురం: ఖరీఫ్ సీజన్లో వరి మినహా పత్తి, మొక్కజొన్న తదితర మిగతా పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే వరి పంటకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు గడువును పొడిగించింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు, తీసుకోని వారితో పాటు కౌలు రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ గడువు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,16,990 హెక్టార్లు. ఇందులో వరి 97,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇప్పటి వరకు వెదలు, ఉబాలుతో వరి సాగు చేసింది 10,600 హెక్టార్లు, మొక్కజొన్న 7,212 హెక్టార్లలో సాగైంది. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రెండు పంటలకుగాను ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు, తీసుకొని వారు కలిపి 6,393 హెక్టార్లకు 56,600 మంది రైతులు సుమారు రూ.31 లక్షలు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. వాతావరణ ఆధారిత పథకం కింద పత్తి 2,112 హెక్టార్లకుగాను 462 మంది రైతులు 81 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా ప్రీమియం సుమారు రూ.3,87 లక్షలు చెల్లించారు. చెల్లింపునకు పాట్లు ఎల్నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. అయితే మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీ)ఆర్ఎస్కేలు, డిజిటల్ కేంద్రాలలో సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో రైతులు ప్రీమి యం చెల్లింపు కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ పా ట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రైతులు తా ము చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తేనే బీమా పథకాలు వర్తించనున్నాయి. అన్నదాతపై బీమా భారం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ఆ భారాన్ని రైతులపైనే వేసింది. ఒక వైపు ఎలినినో ప్రభావంతో వర్షాలు లేక పొలంలో తాము కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతుండటం, చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులే పంటల ప్రీమియం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా అన్నదాత మరిన్ని కష్టాలు పడుతున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ–పంట ఆధారితంగానే బీమా ప్రీమియం చెల్లించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపైనే వేసింది.15లోగా ప్రీమియం చెల్లించాలి రైతు ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. రైతులు చివరి వరకు వేచి ఉండకుండా బ్యాంకులో రుణాలు ఉన్న వారు, లేని రైతులు మొబైల్ యాప్ ద్వారా లేక ఆర్ఎస్కేలు, సీఎస్సీల వద్ద ప్రీమియం చెల్లించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మధుసూదనరావు, ఏడీఏ, బొబ్బిలి -
‘ఇస్రో అకాడెమియా కనెక్ట్’లో సీతం అధ్యాపకులు
విజయనగరం అర్బన్: విశాఖపట్నం ఆంధ్రయూనివర్సిటీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇస్ట్రో అకాడెమియా కనెక్ట్’ ఒకరోజు సదస్సులో సీతం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ పరిశోధనలు, విద్యార్థులకు ఇంటర్న్షిప్, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రయోగ వాహనాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో విద్యా సంస్థలకు ఇస్రో పూర్తి సహకారం అందిస్తుందని ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ ఎం.గణేష్ పిళ్లై పేర్కొన్నారు. ఈ సదస్సులో పొందిన విజ్ఞానాన్ని ప్రత్యేక వీక్షణ కార్యక్రమాలతో విద్యార్థులతో పంచుకుంటామని అధ్యాపకులు తెలిపారు. జాతీయ స్థాయి పరిశోధనల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు కళాశాల కృషి చేస్తోందని సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు పేర్కొంటూ పాల్గొన్న అధ్యాపకులను అభినందించారు. -
కక్షసాధింపుతోనే మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
● యూనివర్సిటీలను సైతం పాడు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ● మాజీ ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి: ఏయూ మాజీ వీసీ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని సస్సెండ్ చేసేందుకు రాత్రికి రాత్రి ఇచ్చిన కమిటీ నివేదికను ఆసరా చేసుకో వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని పదవీ విరమణ రోజునే సస్సెండ్ చేయడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆయన పదవీకాలంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆఘమేఘాల మీద నివేదిక తెప్పించుకుని కొత్త కమిటీ ద్వారా సస్పెండ్ చేయడం ముమ్మాటికీ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్ణయమేనన్నారు. వాస్తవానికి యూనివర్సిటీ అంతర్గత విచారణ పూర్తి కాకముందు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, వెంటనే నివేదిక తెప్పించుకోవడం సస్సెండ్ చేయడం చకచకా జరిగిపోయాయన్నారు. ఇన్నాళ్లుగా యూనివర్సిటీలో అంతా బాగుండి, ఆయన పదవీ విరమణ రోజే చంద్రబాబుకు అక్రమాలు గుర్తొచ్చాయా అని శంబంగి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు యూనిర్సిటీల్లోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగినన్ని అక్రమాలు, అధర్మాలు ఎక్కడా జరగలేదన్నారు. రాత్రి వేళల్లో చీకటి జీఓలు విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటైనా మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. మరో పక్క పత్రికా ఎడిటర్లపైనా కేసులు నమోదు చేసేందుకు జీఓలు విడుదల చేయడం దేశంలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ఇటువంటి చీకటి జీఓలు విడుదల చేయడం మానుకుని ఉన్న మూడేళ్ల కాలం ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలని చంద్రబాబుకు హితవు పలికారు.రైతు సేవా కేంద్రంలో చోరీ బొబ్బిలి రూరల్: మండలంలోని సిహెచ్.బొడ్డవలస గ్రామ రైతు సేవా కేంద్రలో శుక్రవారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు హార్టీకల్చర్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఆరికతోట నాగభూషణం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పది గంటల వరకు తాను విధుల్లోనే ఉన్నానని, అప్పుడే తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్ఎస్కే తాళాలు పగిలి ఉన్నాయని లోపలికి వెళ్లి చూస్తే కంప్యూటర్, ప్రింటర్, టీవీ కనిపించలేదని దొంగలు వాటిని పట్టుకుపోయారని సుమారు రూ.లక్షన్నర విలువుంటుందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నెల్లిమర్ల రూరల్: భోగాపురంలో విమానాశ్రయ ప్రారంభోత్సవానికి నెల్లిమర్ల మండలం నుంచి సుమారు 6వేల మందిని ప్రత్యేక బస్సుల్లో తరలించిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం డెంకాడ మండలం నాతవలస టోల్గేట్ సమీపంలో ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజన నాణ్యతపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నం పూర్తిగా ముద్దగా మారడంతో చాలా మంది ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. బ్రేక్ఫాస్ట్గా ఇచ్చిన పులిహోర సైతం ఉడకలేదని ప్రజలు ఆరోపించారు. చాలా మంది తినకుండానే ఆకలితో వెనుతిరిగారు. దీంతో అక్కడున్న టీడీపీ నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమయ్యారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ మండల నాయకుడు గేదెల రాజారావు తెలిపారు. -
ఆరోగ్యశ్రీ వర్తించినా.. అదనపు వసూళ్లు..!
● అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ● నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామూళ్ల కోసం మౌనంనెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులువిజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరు రోగులకు వచ్చిన సమస్యే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశ్రీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది అధికారులకు చెబితే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఓ అధికారి సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సర్కార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా కమర్షియల్గా మార్చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రస్టు ఇచ్చే నిధులతో పాటు అదనంగా కూడా రాబట్టుకునే పనిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన కో పేమెంట్స్ ఆరోగ్యశ్రీ పథకంలో కో పేమెంట్స్ బాగా పెరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు వసూళ్లకే కో పేమెంట్స్ అని నెట్వర్క్ ఆస్పత్రులు పేరు పెట్టాయి. కో పేమెంట్ లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స గాని, శస్త్రచికిత్సలు చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు ఇష్టపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయనే విషయం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామ్మూళ్ల కోసం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోగుల నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల అదనపు వసూళ్లుకు అడ్డులేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీపురుపల్లికి చెందిన ఓబాలుడికి హైడ్రాసిల్ నొప్పి రావడంతో విజయనగరం పట్టణంలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రిలో చూపించగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో ఇన్పేషేంట్గా చేర్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాలుడికి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అదనంగా మరో రూ.8 వేలు బాలుడి కుటుంబ సభ్యుల దగ్గర ఆస్పత్రి సిబ్బంది తీసుకున్నారు. విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల్లో అ వ్యక్తికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ రూ.50 వేలు అదనంగా అవుతుందని చెప్పడంతో అంత ఇచ్చుకోలేమని చెప్పి, మరో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా రూ.15 వేల వరకు అదనంగా ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆ ఆస్పత్రిలో ఆ వ్యక్తిని చేర్పించారు. ఉచితంగా వైద్య సేవలు అందించేలా చూడాలి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించే ప్రతినెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు ఉంటారు. వారిని పర్యవేక్షించేందుకు టీమ్ లీడర్లు కూడా ఉంటారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేవిధంగా చూడాల్సింది వారే. ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందే ప్రతిరోజూ రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవల గురించి ఆరా తీయాలి. అదేవిధంగా డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? అని రోగులనుంచి ఆరా తీయాలి. అయితే ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి రోగికి నెట్వర్క్ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అదనంగా డబ్బులు అడినట్లయితే సంబంధిత ఆస్పత్రి మిత్రాకుగాని, నాకు గానీ లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డాక్టర్ కె. సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
డీఎస్సీ లీకేజీ పాపం ప్రభుత్వానిదే..
ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అడుగడుగునా అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్హులైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై ఇప్పటికే నిరుద్యోగ యువత, విద్యార్థు లు ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్న్రెడ్డి పిలుపు మేరకు మన్యం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. మా ప్రధాన డిమాండ్ ఒకటే.. ఈ మెగా స్కామ్పై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో యువతతో కలిసి రిలే నిరాహార దీక్షలు, 10న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు చేపడతాం. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. – పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి పార్వతీపురం రూరల్: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మన్యం జిల్లా ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు పార్లమెంట్ పరిశీలకులు చిన అప్పలనాయుడు శుక్రవారం కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అర్హతలేని వారికి క్రీడా కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి లీకేజీకి పునాది వేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలో పని చేసిన వారికే టాప్ ర్యాంకులు రావడం దీనికి నిదర్శనమన్నారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను గాలికొదిలేసిందని విమర్శించారు. దాదాపు రూ. 9,500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, ఫీజు లు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ నిధుల ను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. నేటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. బకాయిలతో సహా నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరారు. పార్టీ పలు అనుబంధ విభాగాల నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై సీఎంఓకు ఫిర్యాదు చేస్తా..
● మక్కువ రెవెన్యూ అధికారులపై మండిపడిన ఆర్డీఓ ● ఒకరికిచ్చిన పట్టాపై మరొకరికి పొజిషన్ పట్టా ఎలా ఇచ్చారు? మక్కువ: ఓ వ్యక్తికి అందించిన ఇంటి పట్టాపై.. అదే స్థలంలో మరో వ్యక్తికి ఎలా పొజిషన్ పట్టా ఇచ్చా రు? దీని వల్ల రెండు కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని మీకు తెలియదా..! ఈ విషయంలో మీపై సీఎంఓకు రిపోర్టు రాస్తానంటూ పార్వతీపు రం ఆర్డీఓ కె.మాధురి మక్కువ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని చెముడు గ్రామానికి చెందిన బొద్దూరు కృష్ణకి గత జగనన్న ప్రభుత్వం లేఔట్లో 84/11లో ఇంటి పట్టా మంజూరు చేసింది. అదే స్థలంలో అదే గ్రామానికి చెంది న బుసాల సావిత్రి అనే మహిళకు రెవెన్యూ అధికా రులు 2024లో పొజిషన్ పట్టా మంజూరు చేశారు. దీంతో సావిత్రి కృష్ణకు మంజూరు చేసిన ఇంటి స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ సమస్యపై పలుమార్లు బొద్దూరు కృష్ణ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపో వడంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ ఏడాది ఏప్రిల్ 24న ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఆర్డీఓ మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఒకరికి పట్టా ఇచ్చిన దానిపై వేరొకరికి పొజి షన్ పట్టా ఎలా ఇచ్చారు? పరిశీలన చేయకుండా ఇలా పొజిషన్ పట్టా ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు. అప్పటి తహసీల్దార్ హోదాలో పొజిషన్ పట్టా జారీ చేసిన ప్రస్తుత మక్కువ తహసీల్దార్ కార్యాలయ ఉప తహసీల్దార్ ఇబ్రహీంను ఆర్డీఓ ప్రశ్నించారు. వీఆర్ఓ, ఆర్ఐ రిపోర్టు మేరకు పొజిషన్ పట్టా ఇచ్చానని ఉప తహసీల్దార్ చెప్పడంతో వారి చెబితే కేసు స్టడీ చేయకుండా ఇచ్చేస్తారా? అంటూ నిలదీశారు. ఇందుకు బాధ్యులైన అందరిపై సీఎంఓకు రిపోర్టు రాస్తానని హెచ్చరించారు. మాన్యువల్ భూ రికార్డుల కంప్యూటరీకరణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మక్కువ ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీ చేశారు. -
వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా నాయుడు
పార్వతీపురం రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభా గం నూతన బాధ్యులను పార్టీ కేంద్ర కార్యాల యం ప్రకటించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపింది. ఈ మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పల్లా అనంత నాయుడు నియమితులయ్యారు. కురుపాం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ముంజి సురే ష్కు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని వివి ధ నియోజకవర్గాల యువజన విభాగ సమన్వ యం, సంస్థాగత బాధ్యతల నిమిత్తం ఈ ప్రకటన విడుదల చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భామిని: మండలంలో కొబ్బరి తోటల్లో గజరా జులు సంచరిస్తున్నాయి. బిల్లుమడలో కొబ్బరి తోటలను శుక్రవారం నాశనం చేశాయి. వంశ ధార నదీ తీరం వెంబడి నాలుగు ఏనుగుల గుంపు పంటలపై దాడులు చేశాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల వరుస దాడులతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. పార్వతీపురం: జిల్లాలో మలేరియా, ఇతర జ్వరా ల నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్షేత్ర స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాల ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్వరాల కేసులను గుర్తించి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు, యాక్ట్ కిట్లు అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలలో అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య శిబిరాల వివరా లు, రోగుల వ్యాధుల వర్గీకరణను ప్రతీ రోజూ ప్రొఫార్మా ప్రకారం నమోదు చేసి నివేదికలు పంపాలని, గ్రామాల్లో ఫ్రైడే – డ్రైడే కార్యక్ర మాన్ని సమర్ధవంతంగా నిర్వహించి, లార్వా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ గత నెలలో 1.25 లక్షలకు పైగా ఓపీ సేవలు అందించామని, జూలై 1 నుంచి 30వరకు 47,324 మందికి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంత ర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. ప్రజలను సభా వేదికలకు తరలించే బస్సులు నిర్ణీత సమయానికి బయలుదేరి గమ్యస్థానానికి చేరేలా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. బస్సుల్లో ఖాళీలు ఉంటే బఫర్ జాబితా నుంచి వెంటనే భర్తీ చేయాలని, ప్రయాణి కుల వివరాలను జిల్లా గ్రూపులలో వెంటనే పంపించాలని ఎంపీడీఓలకు ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
లోకేశ్దే బాధ్యత
మెగా డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అవకతవకలు, లీకేజీలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాలి. ఈ వైఫల్యానికి కారణమైన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలన్నది మా పార్టీ తరఫున ప్రధాన డిమాండ్. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తక్ష ణమే ఆ భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం ఘటనలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసును సాకుగా చూపి, కక్షసాధింపు చర్య ల్లో భాగంగానే అరెస్టులకు పాల్పడుతున్నారు. గురువారం విశాఖ విమానాశ్రయం నుంచి జైలు వరకు వైఎస్ జగన్ పర్యటనకు ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసి అడ్డుకున్నా వేలాదిగా జనం తర లిరావడమే చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం. పార్టీలకతీతంగా అంతా జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నా రు. ప్రభుత్వం ఇప్పటికై నా డీఎస్సీ దోషులపై చర్యలు తీసుకోవాలి. –శరగడం చిన అప్పలనాయుడు, పార్లమెంటు పరిశీలకులు -
డీఎస్సీ పేరిట దగా..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువత ను, వారి తల్లిదండ్రులను మోసం చేసింది. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి మెడలు వంచిన తరహా లోనే.. రాష్ట్రంలోనూ ‘జెన్–జి’ యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్సీపీ అండతో యువత వీధి పోరాటాలకు సిద్ధమవుతోంది. చంద్రబాబు మెడలు వంచైనా సరే... నిరుద్యోగులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అందించే బాధ్యతను వైఎస్సార్సీపీ తీసుకుంటుంది. – అలజంగి జోగారావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే -
మంత్రి లోకేశ్కు సవాల్ చేస్తున్నా..
మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. గతంలో వైఎస్ జగన్మోహన్న్రెడ్డి బయటపెట్టిన ప్రతి అంశంపై స్పష్టమైన సమయపాలనతో విచారణ జరగాలి. నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాడేందుకు మా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఎన్నికల్లో నిరు ద్యోగ భృతి ఇస్తామన్న కూటమి సర్కారు నేటికీ మోసం చేస్తూనే ఉంది. డీఎస్సీలో డబ్బులిచ్చి, అనర్హులను ఎంపిక చేసుకున్నారు. సీబీఐ విచారణ జరిపించాలి. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మంత్రి లోకేశ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిందే. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ -
లెక్కలేని ఓట్లు.. లక్షకు మించి..!
సాక్షి, పార్వతీపురం మన్యం: అనుకున్నదే అయ్యింది. ఓట్ల రాజకీయం మొదలైంది. భారీ సంఖ్యలో ఓట్లకు గండం ఏర్పడింది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2026 మే 25 నాటికి జిల్లాలో 7,90,562 ఓట్లు ఉండగా.. సర్ ప్రక్రియ తర్వాత 7,15,443గా లెక్క తేలాయి. ఇందులో పురుషులు 3,49,188 కాగా.. మహిళలు 3,66,189 మంది ఉన్నారు. ఇతరులు 66 మంది. సవరించిన జాబితా ప్రకారం.. మరణించిన వారు 36,003.. గుర్తించలేని/గైర్హాజరు 11,280, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 17,284, డబుల్ ఎంట్రీలు 10,462, ఇతరులు 90 ఓట్లు కలిపి మొత్తం 75,119 ఓట్లు డోలాయమానంలో ఉన్నాయి. ఈ ఓట్లన్నీ దాదాపు తొలగిపోయినట్లే. ఇదంతా ఒక ఎత్తయితే.. 19,952 ఓట్లు మ్యాపింగ్ కాకుండా మిగిలిపోయాయి. చిన్నచిన్న తప్పులు (తార్కిక వైరుధ్యాలు) ఉన్న ఓట్లు ఏకంగా 1,07,112 ఓట్లు ఉండడం గమనార్హం. పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పు దొర్లడం వంటివని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ తిరస్కరించారు. ఈ లెక్కన దాదాపు 1.50 లక్షలకు పైగా ఓట్లకు గండం ఏర్పడినట్లే. వీరందరికీ నోటీసులు ఇస్తామని అధికారులు అంటున్నారు. ఫారం 6, 7, 8ల ద్వారా తిరిగి ఓటును పునరుద్ధరించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందన్నది ప్రశ్నార్థకమే. ప్రతి నియోజకవర్గంలో 30 వేల నుంచి 40 వేల వరకూ ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. సర్ ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా సాగింది. ఎన్యుమరేషన్ ఫారాలు శతశాతం పంపిణీ చేశామని చెబుతున్న అధికారులు.. చిరునామా లేక, ఇతర కారణాల వల్ల వాటిని తిరిగి తీసుకోలేకపోయిన ఓట్లు వేలల్లో ఉండడం గమనార్హం. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలు దగ్గరుండి కథ నడిపించారన్న విమర్శలు వచ్చాయి. రానున్న పంచాయతీ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, గ్రామీణ ప్రాంతాలు.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లనే లక్ష్యంగా చేసుకొని అధికారి పార్టీకి చెందిన నాయకులు చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్య నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం పాలకొండ 87,799 92,575 14 1,80,388 కురుపాం 86,331 91,328 41 1,77,700 పార్వతీపురం 85,443 87,815 8 1,73,266 సాలూరు 89,615 94,471 3 1,84,089 డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలను ప్రతి ఓటరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఓటరు పేరు నమోదు కాకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగుతున్నట్లయితే సంబంధిత ఎన్నిక ల నమోదు అధికారి/సహాయ ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి ఆగస్టు 30లోగా దరఖా స్తు చేసుకోవచ్చు. మ్యాపింగ్, తార్కిక వైరుధ్యా లు కేటగిరీలలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత ఓటర్లు ఎన్నిక ల సంఘం సూచించిన పత్రాలలో ఏదో ఒక పత్రాన్ని, ఆధార్ కార్డుతో పాటు, నిర్దేశిత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. – ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి. -
ఎన్సీఎస్ కర్మాగారంలో సీబీఐ సోదాలు!
సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అంతర్భాగమైన లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారానికి సంబంధించిన ఆస్తులపై శుక్రవారం పలుచోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపినట్టు తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, విజయనగరం, లచ్చయ్యపేటలో ఉన్న కంపెన్నీ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు సమాచారం. 2015 ఆర్ధిక సంవత్సరంలో నేషనల్ స్పాట్ (ఎన్ఎస్ఈఎల్) ఎక్సేంజ్ లిమిటెడ్ నుంచి రూ.155 కోట్ల రాసుగర్, మెటీరియల్, బొగ్గు వ్యాపారం నిమిత్తం ఎన్సీఎస్ యాజమాన్యం రుణం తీసుకుని 16 అకౌంట్లలోకి సర్దుబాటు చేసింది. తీసుకున్న రుణం సకాలంలో తీర్చక పోవడం, సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏదో కుంభకోణం జరిగిందన్న అనుమానంతో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. సోదాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
పర్యాటకానికి కేరాఫ్ పార్వతీపురం మన్యం
సీతంపేట: పర్యటకానికి కేరాఫ్ అడ్రస్గా పార్వతీపురం మన్యం జిల్లా నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి మంగళవారం మన్యం సవారి బైక్ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక అడ్వంచర్ పార్కు నుంచి సున్నపుగెడ్డ వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్ట్రన్ ఘాట్స్ గ్రీనరీ ఒక గ్రీన్ వరల్డ్లా కనిపిస్తుందని, పర్యాటకులు మేఘాల నడుమ ప్రయాణించేలా రైడ్ విత్ క్లౌడ్ అనుభూతిని అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కాంక్రీట్ జంగిల్ దాటి అడవుల్లో కనీసం 3 గంటలు సమయం గడిపితే శరీరానికి లభించే ఆక్సిజన్, ఆరోగ్యంపై పరిశోధనలు సైతం సానుకూల ప్రభావం చూపుతాయన్నా రు. సున్నపుగెడ్డ మార్గం లాంటి మరిన్ని పర్యా టక రూట్లను త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం సోమగండి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.మాధురి, డీఆర్ డీఏ పీడీ ప్రభావతి, తహసీల్దార్ శ్రీకన్య, ఎంపీ డీఓ మిశ్రో, తదితరులు పాల్గొన్నారు. సాలూరు: అధికారుల నిర్లక్ష్యమో కూటమి ప్రభుత్వ వైఫల్యమో మన్యంలో మరో చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. కేవలం జ్వరం వచ్చి సరైన చికిత్స అందక ఇటీవల చిన్నారులు మృత్యువాత పడుతున్న సంఘట నలు పాఠకులకు విదితమే. తాజాగా బుధవా రం సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ శిఖపరువు గ్రామానికి చెందిన మూడే ళ్ల చిన్నారి కేవలం జ్వరంతో సరైన చికిత్స అందక మరణించింది. వివరాల్లోకి వెళితే శిఖపరు వు గ్రామంలో నివాసముంటున్న కూనేటి రా ము, జానులకు ఒక్కగానొక్క కుమార్తె మేరీ. మేరీకి ఈ నెల 27వ తేదీన జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక తోణాం పీహెచ్సీకి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో చిన్నారికి వైద్యపరీక్షలు చేయగా టైఫాయిడ్, మలేరియా నెగటివ్ వచ్చిందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. చికి త్స అందించేందుకు ఆస్పత్రిలో ఉండాలని వైద్యసిబ్బంది చిన్నారి తల్లిదండ్రులకు సూచించారు. అయితే తమ గ్రామం దగ్గరే కావున వచ్చి చికిత్స తీసుకుంటామని చెప్పి పాపను తల్లిదండ్రులు ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. 27 సాయంత్రం, 28న ఉదయం, సాయంత్రం చిన్నారిని పీహెచ్సీకి తీసుకురాగా వైద్యం అందించారు. 29 ఉదయం తమ గ్రామం నుంచి పీహెచ్సీకి వెళ్లేందుకు వాహనం ఏమీ రాకపోవ డం, తల్లిదండ్రులిద్దరు జలుబు, జ్వరంతో ఉండడంతో చిన్నారిని పీహెచ్సీకి తీసుకువెళ్లలేకపోయారు. ఈలోగా చిన్నారికి ఇంటి వద్దే విరో చనాలై మరణించింది. గురువారం శిఖపరువు గ్రామానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి వెళ్లి వైరల్ జ్వరంతో మృతి చెందిన చిన్నా రి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైరల్ జ్వరంతో చిన్నారి మరణించిందని, ఆమె తల్లిదండ్రులు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని తెలియజేశా రు. అయితే ఇదే గ్రామంలో సబ్సెంట ర్ ఉన్నప్పటికీ గ్రామంలో చిన్నారి అనారోగ్యంతో మరణించడంపై ప్రజల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువా రం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయ ని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
గిరిజన బాలికలకు నృత్య‘శిక్ష’ణ!
విజయనగరం అర్బన్/పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర యం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ ముందు ‘మెప్పు’ కోసం చంద్రబాబు సర్కారు పాకులాడుతోంది. థింసా నృత్య శిక్షణ పేరిట గిరిజ న బాలికలను అవస్థలకు గురిచేస్తోంది. ‘గిన్నిస్ రికా ర్డు’ ఆర్భాటం కోసం వేలాది మంది గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులను చదువులకు దూరం చేయడం, మండే ఎండలో శిక్షణ ఇస్తుండడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రికార్డు సంఖ్యలో 14 వేల మంది గిరిజన బాలికలతో థింసా నృత్యం చేయించాలని సర్కారు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐటీడీఏ పాడేరు పరిధి నుంచి 7 వేల మంది, పార్వతీపురం మన్యం నుంచి 3 వేలు, రంపచోడవరం నుంచి 2 వేలు, సీతంపేట నుంచి 2 వేల మంది 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలికలను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 26వ తేదీ నుంచి ఎయిర్పోర్టు గ్రౌండ్లో థింసా నృత్యంపై శిక్ష ణ ఇస్తోంది. శిక్షణ, ప్రచారం మోజుపై ఉన్న ఆసక్తి గిరిజన బాలికలకు సదుపాయాలు కల్పించడంలో చూపడం లేదు. సరైన తిండిలేక, పడుకునేందుకు చోటులేక నరకయాతన పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల్లో సరైన వసతులు లేకుండా పశువులకంటే హీనంగా వసతిగృహాలు, కళాశాలల్లో ఉంచడంపై బాలికల తలిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో గోదావరి పుష్కరాలు, యోగాసన సాధన, ఆలయాల వద్ద జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ.. ప్రచారం పేరుతో ప్రాణాలు తీయడం చంద్రబాబుకు అలవాటని, గిరిజన బాలికలు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ గిరిజన సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆకలి కేకలు.. రికార్డులు తిరగరాయాలన్న ఆకాంక్షే తప్ప, సుదూ ర ప్రాంతాల నుంచి వచ్చే బాలికల కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి నృత్య సాధన పేరిట గంటల తరబడి ఎండలోనే శిక్షణ ఇస్తున్నారు. వీరికి విజయనగరం జిల్లాలోని డెంకా డ, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ ప్రాంతా ల్లోని వసతి కేంద్రాల్లో, విశాఖ సరిహద్దుల్లోని తగరపువలస, భీమిలి మండలాల వసతి కేంద్రాల్లో బాలికలకు ఆశ్రయం కల్పించారు. 150 మందికి మాత్రమే వసతి ఉన్న ఆయా కేంద్రాల్లో మరో 200 మంది వరకు అదనంగా చేర్చడంతో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. పిల్లలకు వండిన అన్నం సరిపో క, అర్ధాకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఫ్యాన్లు పనిచేయక, ఉక్కబోత, విషపురుగు ల బెంగతో బాలికలు నిద్రకుదూరమవుతున్నారు. 14 వేల మంది బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దుర్వాసన మధ్యే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని గిరిజన విద్యార్థిని, ఉపాధ్యాయురాలు తెలిపారు. బలి పశువులుగా టీచర్లు.. ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి విద్యార్థినులతో పాటు వారిని పర్యవేక్షించేందుకు వచ్చిన గిరిజన సంక్షేమ పాఠశాలల టీచర్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 13 వేల మంది బాలికల్లో 50 మందికి ఒకరు వంతున దాదాపు 260 మంది టీచర్లను గైడ్లుగా నియమించా రు. ‘పిల్లల బాధ్యత మాపై తోసేశారు.. కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు, రాత్రి పడుకోవడానికి సరిప డా స్థలం కూడా లేదు.. పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఏదైనా విపత్తు జరిగితే అధికారులు తప్పించుకుంటారు.. మా సరిస్థి తి ఏమిటి?’ అంటూ పలువురు టీచర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్టహాసంగా థింసా నృత్యం చేయించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న సర్కారు.. తక్షణమే బాలికలకు నాణ్యమైన భోజనం, రక్షణ, సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని గిరిజన, విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి. ప్రచార ఆర్భాటం.. గిరిజన బాలికల ప్రాణాలతో చెలగాటం! థింసా శిక్షణ పేరిట నరకయాతన 14 వేల మంది బాలికలను తరలించి చేతులెత్తేసిన అధికారులు డెంకాడ, భోగాపురం మండలాల్లో అస్తవ్యవస్తంగా వసతులు.. కన్నీరు పెడుతున్న విద్యార్థినులు, టీచర్లు బయటకు చెప్పుకోలేక మదనపడుతున్న వైనం -
ఉరకలెత్తిన ఉత్సాహం
భోగాపురం జాతీయరహదారిపై ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితరులు జననేత రాకతో సాక్షి ప్రతినిధి, విజయనగరం: జై జగన్.. జైజై జగన్.. అన్నా.. మళ్లీ నువ్వే సీఎం.. అన్న నినాదాలతో జాతీయ రహదారి హోరెత్తింది. జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా అభిమానలోకం ఉరకలెత్తే ఉత్సాహంతో వెంటసాగింది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది. శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్ జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లా మీదుగా గురువారం వెళ్లిన జననేతకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జననేత రాకకోసం జాతీయ రహదారిపై వివిధ కూడళ్లలో ఎదురుచూశారు. ఆయన కనిపించేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలు, యువత, విద్యార్థులు నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, నాతవలస, సీహెచ్ అగ్రహారం తదితర కూడళ్లకు చేరుకుని జననేత రాకకోసం ఎదురు చూశారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి.. దాని శ్రీకారానికి మీరే కారణం.. థాంక్యూ జగన్ సర్ అంటూ ప్ల కార్డులు చూపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు పక్కన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. రైతులు...యువత జననేతతో కరచాలనానికి ఎగబడ్డారు. ఎక్కడికక్కడ ఆయన వాహనానికి స్వాగతం పలుకుతూ అడుగు పడనివ్వకుండా.. కాన్వాయ్ ముందుకు సాగనివ్వకుండా అభిమాన దడి కట్టేశారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జననేత వెంట శ్రీకాకుళం వరకు సాగారు. గజమాలతో స్వాగతం నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండల అప్పలనాయుడు సారథ్యంలో వందలాది మంది యువకులు గజమాలతో స్వాగతం పలికారు. దాదాపు కిలోమీటరు దూరం నుంచి కనిపించేలా ఆకాశానికి భూమికి నిచ్చెన వేసేలా పార్టీ రంగులతో గజమాల భారీ క్రేన్కు వేలాడుతూ జననేతకు స్వాగతించింది. వేలాది కార్యకర్తల నడుమ ఆ గజమాల వైఎస్ జగన్ మెడలో అలంకారమై తనకుతాను పులకించిపోయింది. ఈ కార్యక్రమం ఆద్యంతం భోగాపురం, డెంకాడ మండలాల కార్యకర్తలు యువతలో నూతనోత్సాన్ని నింపింది. సీహెచ్ ఆగ్రహరంలో... సీహెచ్ అగ్రహారం కూడలిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకుని వైఎస్ జగన్కు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జైజగన్ అంటూ నినదించారు. పోలీసు ఆంక్షలను ఛేదించి.. భోగాపురం విమానాశ్రయం నిమిత్తం ప్రధాని రాకతో ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ పోలీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిలువరించేందుకు ఉపయోగించింది. అయితే, జననేతను చూడాలన్న లక్ష్యంతో జనం వివిధ మార్గాల్లో జాతీయ రహదారికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు తమ ఊరు రావడంతో తమ ఇంటికి పండగ వచ్చినట్లు.. తమ ఇంట్లో సంబరం జరుగుతున్నట్లు ఫీలయ్యారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను సైతం తమతో పాటు తీసుకొచ్చి తమ అభిమాన నాయకుడితో ఫొటోలు తీయించి షేక్ హ్యాండ్ చేయించడానికి ఉత్సాహపడ్డారు. ● భోగాపురంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, నాయకులు యు.శివారెడ్డి, యు.విజయబాస్కరరెడ్డి, కె.వెంకటరమణ తదితరులు జననేతకు స్వాగతం పలికారు. ● నాతవలస వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వైఎసార్సీపీ యువజన, ఐటీ విభాగం అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్, మణిదీప్, తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన అనుచరులతో కలిసి జగనన్నకు స్వాగతం పలికేందుకు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు, నాయకులు మావుడి రంగునాయుడు పాల్గొన్నారు. సిరిసహస్రకు జగనన్న ఆశీస్సులు జననేత రాకకోసం.. విజయనగరం రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించేందుకు విజయనగరం జిల్లా మీదుగా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేతకు విజయనగరం నియోజకవర్గ నేతలు ఘనస్వాగతం పలికారు. నాతవలస, సీహెచ్ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై జననేతకు మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కోలగట్ల శ్రావణిని జననేత ఆశీర్వదించారు. జననేతకు అభిమాన హారతి స్వాగతం పలికేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు జనసంద్రంగా మారిన జాతీయ రహదారి జననేతను చూసి కేరింతలు కొట్టిన అభిమానులు విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్హన్ రెడ్డికి ఆనందపురం వద్ద జెడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర పుష్ఫగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆమెను జగన్ ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. -
బందోబస్తు విధులు సమర్థంగా నిర్వహించాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో రహదారులను పరిశీలించారు. ఆక్టోపస్ ఐజీ శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టీలతో కలిసి ప్రధానిపాల్గొనే సభకు బస్సులు వచ్చే మార్గాలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. నిర్మాణ పనులు అవుతున్నందున ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు, ర్యాంపులు నిర్మించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధులు నిర్వహించేందుకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దన్నారు. బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభ నిర్వహించే ప్రాంతాలను, ఎయిర్పోర్టు ఆవరణలో పలు ప్రాంతాలను డాగ్స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, వెల్ఫేర్ డీఐజీ అన్భురాజన్, బెటాలియన్ కమాండెంట్ రవిశంకరరెడ్డి, విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రికి పెద్ద జబ్బు..!
● సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయిన ప్రధానమైన వైద్య పరీక్షలు ● ప్రైవేటు ల్యాబ్ల్లో రూ.వేలల్లో ఖర్చు చేస్తున్న రోగులువిజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఒంట్లో నీరసంగా ఉంటోందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు సుగర్ వ్యాధికి సంబంధించి హెచ్బీఏవన్సీ పరీక్ష రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆమె ఆస్పత్రిలోని ల్యాబొరేటరీ వద్దకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఆ పరీక్ష లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి హెచ్బీఏవన్సీ పరీక్ష చేయించింది. ● గంట్యాడ మండలానికి చెందిన భవాని అనే మహిళకు థైరాయిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబొరేటరీకి వెళ్లగా థైరాయిడ్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.600 పెట్టి చేయించుకుంది. ● జామి మండలానికి చెందిన రామునాయుడు అనే వ్యక్తికి జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యులు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) రాశారు. దీంతో సీబీపీ పరీక్ష కోసం ల్యాబొరేటరీ వద్దకు వెళ్లాడు. ఇక్కడ సీబీపీ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి చేయించుకున్నాడు. వీరు ముగ్గురే కాదు. ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి వచ్చిన అనేక మంది రోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయినా సర్వజన ఆస్పత్రికి జబ్బు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీసం వైద్య పరీక్షలు కూడా అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందని రోగులు ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలల నిత్యం అధిక సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తారు. అయితే ఉచితంగా వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడం వల్ల చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి రోగులకు దాపురించింది. నిలిచిపోయిన ప్రధాన వైద్య పరీక్షలు రోగులకు వ్యాధి నిర్ధారణలో ప్రధానమైన వైద్య పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయాయి. మధుమేహం(సుగర్) వ్యాధి నిర్ధారణలో అతి ప్రధానమైన హెచ్బీఏ1సీ (మూడు నెలల సుగర్ను నిర్ధారించే) పరీక్ష కొద్ది రోజులుగా చేయడం లేదు. అదేవిధంగా థైరాయిడ్ పరీక్ష అయితే రెండున్నర నెలలుగా చేయడం లేదు. ముఖ్యంగా సీబీపీ(కంప్లీట్ బ్లడ్పిక్షర్) పరీక్ష కూడా గత కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ప్రస్తుత సీజన్లో ఈ పరీక్ష చాలా అవసరం. ఎందుకంటే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీబీపీ పరీక్షను ప్రతి రోగికి వైద్యులు రాస్తారు. కొరవడిన ముందుచూపు టీడీపీ సర్కార్ కు ముందు చూపు కొరవడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి కావడంతో సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 1000 నుంచి 1200 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు కూడా అత్యధికంగా జరుగుతాయి. ఈ క్రమంలో ముందస్తుగానే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలకు అవసరమైన టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి. కిట్లు అయిపోయే వరకు సరఫరా చేయక పోవడం పట్ల రోగులు మండిపడుతున్నారు. -
మహిళలు లక్షాధికారులుగా ఎదగాలి
పార్వతీపురం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉపాధి కోరేవారిగా కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి లక్షాధికారులు కావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా పారిశ్రామకవేత్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగా పురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తపరిశ్రమల స్థాపనకు అవసరమైన రుణాలు, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మహిళల ఆదాయం పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ప్రభుత్వ పథకా లను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్. ప్రభావతి, ఎల్డీఎం ఎస్.సోమశేఖర్, మెప్మా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్త పరిశ్రమలతో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించి జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీపీ) సమావేశంలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, ఎగుమతుల ప్రోత్సాహంపై సమీక్షించారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి స్థానిక వనరుల ఆధారంగా విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ టి.సీతారాం, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన పెదపెంకి మహిళలు
పెదపెంకి గ్రామంలో సమస్యలపై మహిళలు రోడ్డెక్కారు. గ్రామంలోని కూరాకుల వీధి, కాపువీధికి చెందిన మహిళలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెదపెంకి బస్టాండ్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. వీధి కాలువలు వేస్తామని గుమ్ములు పెట్టి వదిలేశారు. తాగునీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నాం. గుమ్ముల్లో వృద్ధులు పడిపోతున్నారు. కాలువ గుమ్ముల్లో నీరు నిల్వ ఉండి దుర్గంధంగా మారుతోంది. దోమల బెడద ఎక్కువగా ఉండి జ్వరాలు సోకుతున్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గ్రామాన్ని ఎప్పుడు బాగుచేస్తారో తెలియదు కానీ గడిచిన 4నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల నిర్మాణాలు జరుపుతామని జేసీబీలతో గుమ్ములు తీసి వదిలివేయడం దారుణంగా ఉందని మహిళలు ఆగ్రహించారు. కార్యక్రమంలో నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
ఇంటింటికీ నీరసం!
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ఆశించిన స్థాయిలో స్పందన కానరావడం లేదు. సొంత క్యాడర్ నుంచే ఊపు అందుకోలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న ప్రారంభించినప్పటికీ.. తొలి రెండు రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ఆశించిన ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పుకోదగ్గపాలన లేక... మహిళలకు ఉచిత బస్సు పథకం మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవని.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల్లో భారీగా కోత విధించడం వల్ల నిలదీతలు తప్పవన్న భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. అభివృద్ధి పనులు జరగడం లేదు. ప్రధాన పట్టణాలతో పాటు, గ్రామాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎరువులు రైతులకు దొరకడం లేదు. వీటిపై ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపైనా ప్రజల నుంచి ప్రతిఘటన ఉంటుందన్న భయం నాయకుల్లో ఉంది. దీనికితోడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక స్థాయిలో కార్యకర్తలు ఎదురుచూసిన పనులు జరగలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఉందని, అదే కార్యక్రమంపై ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలు, నాయకుల్లో ఆశించిన స్థాయిలో పాల్గొనే ఉత్సాహం కనిపించడం లేదని, కార్యక్రమం కేవలం లాంఛనప్రాయంగా కొనసాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలను పక్కనపెట్టి టీడీపీ ఒక్కటే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడంపై ఆ రెండు పార్టీ ల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకొండ వంటి నియోజకవర్గంలో కూడా ఆశించిన స్థాయిలో కార్యక్రమం జరగడం లేదు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు ఉండగా.. వీటి పరిధిలో సుమారు 2,57,047 గృహాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గాల్లోని మూడింటిలో మొక్కుబడిగా కార్యక్రమం సాగుతుండగా.. జనసేన ఎమ్మెల్యే ఉన్న పాలకొండ నియోజకవర్గంలో పేరుకే నిర్వహించి, మమ అనిపిస్తున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వంలో తాము కూడా కీలక భాగస్వాములమేనని, ప్రచార కార్యక్రమాల్లో తమకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిందని బీజేపీ, జనసేన నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. మొదట్లోనే ఇలా ఉంటే.. ముందున్న రోజుల్లో ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లి ఆశించిన ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు తాడంగి సాయిబాబు, సహాయ కార్యదర్శి ఊర్లక నాగార్జున డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం లిడికి వలసలో బుధవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వచ్చిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను ప్రశ్నించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... గోచెక్క పంచాయతీ లిడికివలస గ్రామం కొత్త లిడికివలస నుంచి లిడికివలస మీదుగా తాడంగివలస, ఆడారు పంచాయతీ జిల్లేడువలస మీదుగా ఒడిశా సరిహద్దు వరకు గిరిజన గ్రామాలకు అనుసంధానంగా రోడ్లు వేయాలని వినతిపత్రం అందజేశారు. -
బిల్లులు ఆపండి..!
బలిజిపేట: మండలంలోని పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనుల నిర్వహణలో మూడుముక్కలాట సాగుతుండడంతో ప్రత్యేక నిధులు మంజూరుచేసిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు శిరోభారంగా మారింది. పెదపెంకిని దత్తత తీసుకుని ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చుదిద్దుదామనుకుని ఉపాధిహామీ పథకం ద్వారా 5.85కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. నిధుల వినియోగంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య మూడుముక్కలాట జరుగుతుండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించిన నిధుల ప్రాప్తికి పనులు నాణ్యతతో జరిగాయా అంటే అదేమీ లేదని రుజువైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పనుల నిర్వహణపై అసంతృప్తి చెంది కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత పనుల బిల్లులు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. పనుల పర్యవేక్షణకు తరచూ బృందాలను పంపిస్తున్నారు. అందరు భాగస్వాములే.. పెదపెంకి అభివృద్ధి పనుల్లో లోపాలకు ఎమ్మెల్యే విజయచంద్ర, స్థానిక నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ భాగస్వాములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేకు మద్య విభేదాలు ఉండడంతో రణరంగం జరిగిందని చెబుతున్నారు. పనులు ప్రారంభించేటప్పుడు స్థానిక నాయకులు కొంతమందికి పనులు అప్పగించి చేయిస్తుండగా ఎమ్మెల్యే విజయచంద్ర వచ్చి ఆయన ప్రతిపాదించిన వ్యక్తికి కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన అధికారులు కొత్త కాంట్రాక్టర్ చేత పనులు చేయించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఇష్టానుసారం పనులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారితో కుమ్మకై ్క వారి పాత్ర వారు పోషిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. బృందాల పర్యవేక్షణ ఇటీవల రాష్ట్రస్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి పనుల నాణ్యతను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పేషీ నుంచి ఓఎస్డీ కె.సాయినవీన్ బృందం వచ్చి గ్రామంలో జరిగిన పనుల నిర్వహణ ఏవిధంగా ఉంది, ఏం జరుగుతోంది? ప్రజల అభిప్రాయం ఏమిటి? వారి సమస్యలు ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది పెదపెంకిలో ముందుగా 5.80కోట్లతో 66సీసీ రోడ్లు, 18ఆర్డబ్ల్యూఎస్ పనుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. ఆ తరువాత అంతర్గత పరిణామాలతో 49సీసీ రోడ్ల నిర్మాణాలు చేయాలని వాటికే నిధుల కేటాయింపు అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 17సీసీ రోడ్ల నిర్మాణాల బిల్లుల విషయం సందిగ్థంలో పడింది. సీసీ రోడ్లకు సంబంధించి 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది. ఉపాధిహామీ పథకంలో రూపురేఖలు మారడంతో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యేవరకు బిల్లుల సమస్య ఉండే అవకాశాలున్నాయి. జరిగిన పనులకు బిల్లులు చెల్లింపు చేయాలని కోరుతున్న కాంట్రాక్టర్లు పనుల విషయంలో ముఖం చాటేస్తుండడంతో పనుల్లో తాత్సారం జరుగుతున్నట్లు సమాచారం. ఇంతలో ఒక్కసారిగా పిడుగుపడినట్టు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పనులు ఎంతమేర జోరుగా సాగుతాయో? లేదా నత్తనడకగా సాగుతాయా ? అనేది వేచి చూడాల్సిందే. డిప్యూటీ సీఎం ఆదేశాలు పెదపెంకిలో చేసిన పనుల్లో నాణ్యతా లోపాలు పనులు పరిశీలిస్తున్న కొత్త బృందం -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
● స్కానింగ్ కేంద్రాల నమోదు తప్పనిసరి ● పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై డీఎంహెచ్ఓ సమీక్షపార్వతీపురం రూరల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం (పీసీపీఎన్డీటీ–1994) ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి.విజయలక్ష్మి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం పటిష్ట అమలు, కార్యాచరణపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు విధిగా ‘డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫ్ పీసీపీఎన్డీటీ’లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. లింగ వివక్షను అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా మండళ్లలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 1800 233–2447 టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ వెల్ల డించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం జిల్లాలో మాతృ, శిశు మరణాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో డీఐఓ వై.విజయ్ మోహనన్, డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు కేవీఎస్.పద్మావతి, కె.విజయపార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ప్రోగ్రాం అధికారులు జగన్మోహనరావు, రవికుమార్ రెడ్డి, ఎస్.కె.హఫీజా, వైద్యులు నాగరాజు, కమల, రవి, పద్మజ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీహెచ్ఏవో విజయలక్ష్మి పాల్గొన్నారు. -
30 కార్లతో జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం
సాలూరు రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి స్వాగతం పలికేందుకు నాతవల స కూడలి వద్దకు సుమారు 30 కార్లతో సాలూ రు నియోజకవర్గం నుంచి ఉదయం 9 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలదేరనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం జన్నదొర తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడు తూ రాజకీయ కుట్రలతో సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనకు ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ ధైర్యం చెప్పేందుకు జగన్ మోహన్ రె డ్డి వస్తున్నారన్నారు. సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని రాజన్నదొర కోరారు. పాచిపెంట: ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ధింసా నత్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పాచిపెంట మండలంలోని పలు గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులను బుధవారం ఎనిమిది బస్సుల్లో తరలించారు. ఈ బస్సులను పి.కోనవలస వద్ద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. సీతంపేట నుంచి.. సీతంపేట: భోగాపురంలో ధింసా నృత్యం చేయడానికి సుమారు 2 వేల మంది విద్యార్థులను అధికారులు బుధవారం తరలించారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల గిరిజన విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. రేగిడి: మండల పరిధిలోని లచ్చన్నవలస ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న మంతిన హేమలత బ్రెయిన్ స్ట్రోక్తో బుధవారం మృతిచెందినట్లు ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఈ నెల 24న పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ డే సమావేశం నిర్వహించిన సమయంలో ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మెదడులో రక్తనాళాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారని ఎంఈఓ వెల్లడించారు. -
కుంకీలతో రైతుల సమస్యకు పరిష్కారం
సీతానగరం: శాసీ్త్రయ, మానవీయ, సుస్థిర పద్ధతుల ద్వారా ప్రజలను, అటవీ మృగాలను రక్షంచడమే ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె.పవన్కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో అప్పయ్యపేట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్ర శిలాఫలకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ బుధవారం పర్చువల్ విధానంలో అమరావతి నుంచి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి మనది కాదని మనమే ప్రకృతికి చెందిన వారమని, మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రకృతిపై సమానమైన హక్కు ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో ఇచ్చి న హామీని నేడు అమలు చేశామన్నారు. మంత్రిగుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఏనుగులవల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చూడాలన్న ప్రజలకల నేటికి నెరవేరిందన్నారు. అందుకు కుంకీ ఏనుగులు దోహద పడతాయన్నారు. కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్డ్డి మాట్లాడుతూ మన్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి ముగింపు పలకడం ఆనందదాయక మన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బి.విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఆర్డీఓ కె. మాధురి, జిల్లా అటవీ శాఖఅధికారి ప్రసూన, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సీహెచ్ దీనకుమార్, అటవీ అధికారి రవికుమార్, మనోజ్కుమార్, ఏనుగుల పర్యవేక్షణ అధికారి మణికంఠేష్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టానికి తగిన ఫలితం దక్కాలి
బలిజిపేట: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగు ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మహిళలు నడుం బిగించారు. దశాబ్దాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నా న్యాయం జరగడం లేదన్న బాధతో రగి లిపోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారికిచ్చే వేతనంలో తమకు పావు వంతు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. పాదయాత్ర, ఎన్నికల హామీ నెరవేర్చాలి ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత, రెగ్యులర్ కాని పక్షంలో మినిమమ్ టైం స్కేలు వంటి పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చా రు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచి నా సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటిన తరువాత తెప్ప తగలేయడం అంటే ఇదే అని వారు మండిపడుతున్నారు. వారి డిమాండ్లు ఇవే: సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలి. హెచ్ఆర్ పాలసీని అమలుచేయాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. కానిపక్షంలో మినిమం టైం స్కేలు వర్తింపచేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 60నుంచి 62ఏళ్లకు పెంచడంతో పాటు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందజేయాలి. ఉద్యో గ భద్రతతో పాటు పెన్షన్, ఈఎస్ఐ, సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. డీఎస్సీ, ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో వెయిటేజీ కల్పించాలి. రాష్ట్ర హైకో ర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుపర్యాయాలు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఈ నెల 30, 31తేదీల్లో కలెక్టరేట్ వద్ద ధర్నాకు శ్రీకా రం చుట్టారు. సీఐటీయూ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా చేస్తున్న శ్రమదోపిడీ ఇకచాలు. న్యాయపరమైన కోరికలను నెరవేర్చాల్సిందే. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలి. డిమాండ్ల పరిష్కారానికి 30, 31తేదీలలో కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. –మన్మథరావు, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి, బలిజిపేట -
‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ జిల్లా స్థాయి పోటీల విజేతలు
విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’–‘వై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్’ థీమ్పై జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రవేఖనం, క్విజ్ పోటీలు ఎంఆర్సంస్కృత ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మండల స్థాయిలో ఎంపికై న విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు విజేతలకు బహుమతులు ప్రకటించారు. జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల విజేతలు ప్రథమ: ఎస్.భానుప్రకాశ్ (జెడ్పీహెచ్ జరజాపుపేట), ద్వితీయ: జి.హేమలత (జెడ్పీహెచ్ వల్లాపురం), తృతీయ: కె.గీత (కేజీబీవీ, మెరకముడిదాం), చిత్రలేఖనం విజేతలు ప్రథమ: పి.బాలాజీ (జెడ్పీహెచ్ బొద్దూరు), ద్వితీయ: బి.జయశ్రీ (జీజీహెచ్ఎస్ విజయనగరం), తృతీయ: సీహెచ్.సంధ్య (జెడ్పీహెచ్ఎస్, బుడతనాపల్లి), క్విజ్ విజేతలు ప్రథమ: ఎం.లోహిత, బి.చరణ్ (ఏపీఎంఎస్, అక్కివరం), ద్వితీయ: పి.తనిష్క (జెడ్పీహెచ్ చీపురుపల్లి), బి.కొండలరావు (జెడ్పీహెచ్ఎస్, పాలవలస), తృతీయ: ఎం.శంకర్ (జెడ్పీహెచ్ఎస్ గోవిందపురం), సీహెచ్.మౌనిక (జెడ్పీహెచ్ఎస్ కుమిలి). విద్యార్థుల్లో సృజనాత్మకత, జిల్లాపై గౌరవభావాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని డీఈఓ పేర్కొన్నారు. -
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026
ఇంట్లో ముగ్గురమూ జ్వరాల బారిన పడ్డాం. ఇప్పుడు మా పాప రాజేశ్వరికి బాగాలేదు. డోకిశీల ఆస్పత్రికి తీసుకెళ్తే మందులు ఇచ్చి పంపేశారు. తగ్గడం లేదు. కనీసం పరీక్షలు కూడా చేయడం లేదు. పార్వతీపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాం. పరీక్షలు చేసి మలేరియా అన్నారు. రూ.10 వేల వరకూ ఖర్చు అయ్యింది. అప్పు చేశాం. – చిరంజీవి, కొత్తవలస గ్రామం మా ఇంట్లో నాకు, మా ఆయన కు, బాబుకు కూడా జ్వరాలే. నెల రోజులుగా గ్రామంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం రూ.5 వేల వరకూ ఖర్చు చేశాం. ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా తగ్గడం లేదు. – స్వాతి, కొత్తవలస గ్రామం సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర తీవ్రతతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలోని మూడు ఏరియా ఆస్పత్రులు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రిలో సగటున రోజుకు 2 వేలకుపైగా ఓపీ నమోదవుతోంది. ఇందులో సగం మంది వరకు జ్వరం లక్షణాలతో ఉన్నవారే ఉంటున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వేల రూపాయలు ఖర్చు కావడంతో పేద గిరిజన వర్గాలు లబోదిబోమంటున్నాయి. ఇంటిల్లిపాదీ జ్వరాల బారిన పడడంతో వైద్యానికి తీసుకెళ్లే దిక్కు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండడం లేదు. రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా చాలడం లేదు. ఒక్కో బెడ్మీద ఇద్దరు, ముగ్గురు చొప్పున చికిత్స పొందుతున్నారు. మలేరియా కేసులే అధికం ఈ ఏడాది ఐదారునెలల్లోనే మన్యంలో 700 పైబడి మలేరియా కేసులు నమోదైనట్టు వైద్య రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. జూన్ నుంచి ఆగస్టు వరకూ మలేరియా కేసులు ఏటా ఎక్కువగా నమోదవుతుంటాయి. దీనికి సంబంధించి ముందస్తు చర్యలను వైద్యశాఖ చేపట్టలేదు. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా కేసులకు కూడా సాధారణ పారాసిటమాల్ టాబ్లెట్, ఇంజక్షన్లు ఇచ్చి సరిపెడుతున్నారు. ఎన్ని రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ●కొద్ది రోజులుగా వాతావరణం మారింది. చిరు జల్లులు, పరిసరాల్లో నిల్వ నీరు, బురద, తాగునీటి కాలుష్యం వంటి కారణాలతో వైరల్ జ్వరాలు, మలేరియా, డయేరియా వంటివి వ్యాప్తి చెందుతున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వర పీడితులు పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొత్తవలస గ్రామంలో కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వర పీడితులు ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు కూడా రోగాల బారిన పడడంతో ఇంట్లో గంజి కాచే దిక్కు కూడా ఉండడం లేదని గిరిజనులు అంటున్నారు. డోకిశీల పీహెచ్సీకి వెళ్తే.. సాధారణ జ్వరం మాత్రలు ఇచ్చి పంపుతున్నారని, కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని వాపోతున్నారు. గ్రామంలో జ్వరాల తీవ్రత అధికంగా ఉందని, వైద్య శిబిరం నిర్వహించాలని కోరితే.. ఏఎన్ఎం, ఆశలను పంపించి.. బ్యానర్ పెట్టి, సాధారణ మందులు ఇచ్చి మమ అనిపించేశారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రాము తెలిపారు. చేసేది లేక, ఆటోకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చి, పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిని రోగులు ఆశ్రయిస్తున్నారని.. అక్కడ వైద్యానికే వేలాది రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పారు. గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ దేరుగండ గ్రామానికి చెందిన తోయక ఈశ్వరరావు, సుజాత దంపతుల కుమారుడు వరుణ్(10) ఇదే మండలంలోని టిక్కబాయి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల మలేరియా బారిన పడ్డాడు. మందులు వాడినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సాలూరు మండలం ఎగువమెండంగిలో ఇటీవల అనారోగ్యంతో గిరిజన బాలుడు మృతి చెందారు. వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. 75 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 14 ఏళ్లలోపు వారే ఐదుగురు ఉన్నారు. -
బిల్లుల చెల్లింపులో అనుమానాలు..!
● డిప్యూటీ ఎంపీడీఓకు తెలియకుండా లాగిన్లో అప్రూవల్ ● కంప్యూటర్ ఆపరేటరే వెండర్ సంతకవిటి: మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జనరల్ ఫండ్ నుంచి బిల్లుల చెల్లింపు పలు అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్తో కలిసి పంచాయతీ ప్రత్యేకాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓకు తెలియకుండా లక్షల్లో డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల నుంచి ఈఓపీఆర్డీ లాగిన్లో బిల్లులు చెల్లింపునకు అవకాశం ఇవ్వగా అదే అదునుగా గ్రామాల్లో లక్షల్లో చెల్లింపులు చేపట్టినట్లు సమాచారం. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓను వివరణ కోరగా దాదాపు రూ.12 లక్షలు బిల్లులు చెల్లింపులు జరగడం వాస్తవమేనన్నా రు. ఈఓపీఆర్డీ పాత లాగిన్, పాస్వర్డ్ వాడుతుండడంతో ఆయనకు తెలపకుండానే కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కటై బిల్లులు చెల్లింపులు చేశారన్నారు. ఇందులో చాలా పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటరే వెండర్గా ఉన్నారని దర్యాప్తు చేయాలని కోరారు. వనంగుడిలో పైడితల్లి చండీయాగంవిజయనగరం టౌన్: ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో వేదపండితులు బుధవారం చండీయాగం నిర్వహించారు. సుమారు వందమందికిపైగా భక్తులు యాగంలో పాల్గొన్నారు. యాగ విశిష్టతను వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను యాగంలో పాల్గొన్న భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి ,తరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామికి విశిష్ట పూజలు విజయనగరం టౌన్: గురుపౌర్ణమి పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్దనున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి విశ్వబ్రాహ్మణ పురోహితులు లక్కోజు ఓంకార్ సిద్దాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి అభిషేకాలు చేశారు. అనంతరం సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు, ప్రతినిధులు వేముల సురేష్బాబు, లక్కోజు బాబు, సంజీవి, శ్రీనివాసరావు భక్తులు పాల్గొన్నారు. -
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పాలనే బాధ్యతతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టాం. దేశంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై యువత రోడ్డెక్కితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో... ఇక్కడ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కచ్చితంగా రాజీనామా చేయాలని విద్యార్థి లోకం తరపున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు సూటిగా చెబుతున్నాం.. మీ ప్రభుత్వంలో ఒక మంత్రి శాఖలో అవినీతి జరిగితే, నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఇప్పటివరకు మీరెందుకు స్పందించలేదు? విద్యార్థులంటే మీకంత చిన్నచూపా? మీ కొడుకు ’మాలోకం’ చేసిన ఘనకార్యాలను ఒకసారి పరిశీలించి, తక్షణమే ఆయన్ని బర్తరఫ్ చేయండి. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలు, మహిళలకు రూ.1500 ఏమయ్యాయి? ప్రతి జనవరిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన ఊసేలేదు. జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ’ఇంటికో అబద్ధం’ అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తోంది. మన్యం జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలి. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం -
రోడ్డెక్కిన విద్యార్థులు
రేగిడి: మండల పరిధిలోని జోడుబందల, సరసనాపల్లి, కందిశ, తునివాడ గ్రామాలకు చెందిన విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు. పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేందుకు సకాలంలో బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు పెంచాలంటూ జోడుబందల కూడలిలో రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంట సమయం వాహనాలను అడ్డుకోవడంతో సమాచారం అందుకున్న ఎస్సై వి.బాలకృష్ణ ఆందోళన ప్రదేశానికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. అవసరమైన బస్సులను తక్షణమే వేళకు నడపాలని విద్యార్థులు కోరారు. బస్సు సర్వీసుల పెంపు విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎస్ఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


