శివరాత్రి ఉత్సవాలకు క్యూలు పటిష్టంగా ఉండాలి
● దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) కె.శోభారాణి ఆదేశించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎటువంటి తోపులాటలకు ఆస్కారం ఉండకూడదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు దర్శనానికి వెళ్లే మార్గంతో పాటు దర్శనం అనంతరం వచ్చే మార్గం వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎటువంటి తాత్కాలిక షాపులు లేకుండా చూసుకోవాలని, అడ్డుగా ఉండే వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరారు. భక్తుల రద్దీ ఒకే చోట ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఓలు వై.శ్రీనివాసరావు, ప్రసాదరావు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.


