● బంగారు కొండలు
● రాష్ట్రస్థాయి పోటీల్లో 15మంది
విద్యార్థులకు గోల్డ్మెడల్స్
● అభినందించిన హెచ్ఎం, సిబ్బంది
చీపురుపల్లి: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ పోటీల్లో మండలంలోని మెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మెట్టపల్లి విద్యార్థులు 15 మంది బంగారు పతకాలు సాధించారు. దీంతో మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం విజ య్కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో మదర్ థెరీసా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలకు మెట్టపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు వెళ్లినట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో బంగారు పతకాలు సాధించగా ఒక విద్యార్థి క్రాఫ్ట్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు చెప్పారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ ఎ.కుమార్, క్రాఫ్ట్ టీచర్ పి.వేదలక్ష్మిలను అభినందించారు.


