బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పార్వతీపురం: బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న సంస్థలు.. జువైనల్ జస్టిస్ 2016 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలల సంరక్షణ కోసం ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నప్పటికీ జువైనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం–2015) ప్రకారం.. సెక్షన్–41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. నిర్దేశించిన ప్రొ ఫార్మాలో ఫిబ్రవరి 13లోగా డైరెక్టర్ బాలల సంక్షేమం, సంస్కరణలో సేవలు అండ్ వీధి బాలల సంక్షేమశాఖ, రోటరీనగర్, విద్యాధరపురం, విజయవాడ 520012 కార్యాలయానికి దరఖాస్తు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94403 32581 నంబర్ను సంప్రదించాలన్నారు.
ముగిసిన భద్రతా మాసోత్సవాలు
● ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026’ శుక్రవారంతో ముగిశాయి. డీపో ప్రాంగణంలో జరిగిన ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ ఏఆర్దామోదర్ మాట్లాడుతూ రవాణా నియమాలు పాటించడమే ప్రమాదాల నివారణకు మార్గ మని అన్నారు. ప్రమాద రహితంగా విధులు నర్వహించిన విజయనగరం, ఎస్.కోట డిపో డ్రైవర్లను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ హెచ్.దివ్య, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ డైరీనే కీలకం
విజయనగరం క్రైమ్: విజయనగరం గోకపేటలో నివసిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో రెండో రోజు శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమ్య అధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు, భూ పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తనవల్ల లబ్ధిపొందిన అధికారుల ఫోన్నంబర్లు, లబ్ధి వివరాలు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా రిజిస్ట్రార్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది.
రాములోరి రథయాత్ర నేడు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి రథయాత్ర మహోత్సవం శనివారం కనులపండువగా జరగనుంది. దీనికోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కల్యాణోత్సవం అనంతరం రామతీర్థంలో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శనివారం వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపిస్తారు. ఉదయం 8 గంటలకు శ్రీ మద్రామాయణ పారాయణం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపిస్తారు. సాయంత్రం 6 గంటలకు పండిత సదస్సు నిర్వహించి పలువురు వేద పండితులకు సన్మాన మహోత్సవం జరిపిస్తారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రమూర్తిని ఊరేగింపుగా ఉత్తర రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులు చేస్తారు. రథంపై విశేష పూజలు నిర్వహించిన తరువాత రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆలయం నుంచి కుమ్మరి ఖానా మీదుగా తిరిగి దేవస్థానం తూర్పు రాజగోపురం వద్దకు స్వామివారి రథాన్ని తీసుకువస్తారు. సమీప గ్రామాలైన జగ్గరాజుపేట, సీతారామునిపేట, గొర్లిపేట గ్రామాలకు చెందిన భక్తులు ఎప్పటిలాగే రథాన్ని ముందుకు నడిపిస్తారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 40 మంది పోలీసులతో ఆ శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉత్సవ విజయవంతానికి భక్తులు సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు.


