నేరడిలోకి ఏనుగులు
భామిని: మండలంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి భామిని మండలం నేరడి–బి లోకి ఏనుగులు ప్రవేశించి అల్లకల్లోలం నృష్టించాయి. ఏనుగుల తాకిడితో పాడి పశువులు పరుగులు తీశాయి. కళ్లాల్లోని కోత యంత్రాలు, ట్రాక్టర్లపై ఏనుగులు దాడి చేస్తాయని భయపడి రాత్రికి రాత్రి బయటకు తీసుకువచ్చారు. ఆదివారం పగలంతా బిల్లుమడ–నేరడి గ్రామాల మధ్య పొలాల్లో ఏనుగులు తచ్చాడాయి. కానీ అటవిశాఖాధికారుల జాడ లేకుండా పోయింది.
అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయొద్దు
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ముట్టడి వంటి కార్యక్రమాలు చేయకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా, శాంతికి విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, ద్వేషపూరిత సందేశాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనల్లో పాల్గొన్నా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి, జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


