● నిరాశ మిగిల్చిన నిర్మలమ్మ పద్దు
● మన్యంలో రైల్వే సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆశించిన ప్రజలకు మరోసారి ఉత్తిచేయి చూపారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ఊసు లేకపోయింది. బడ్జెట్లో కేటాయించిన నిధులతో కొత్త లైన్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందో, లేదో చూడాలి. గుణుపూర్ నుంచి సాలూరు మీదుగా నర్సీపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు ఈసారీ ఎర్రజెండానే పడింది. గుణుపూర్ నుంచి జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాచిపెంట మీదుగా అరకు వెళ్లే రైలు రోడ్డు వేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా ప్రయోజనం లేకపోయింది. సాలూరు–విశాఖ ప్రత్యేక రైలు ఆశలు కూడా నీరుగారిపోయాయి. పార్వతీపురం పట్టణ రైల్వేస్టేషన్(కొత్తవలస) ఆధునికీకరణకు హామీ లభించలేదు. బెలగాం, కొమరాడ ప్రాంతాల్లోని రైల్వే గేటుల వద్ద నిత్యం ట్రాఫిక్తో ఇబ్బంది ఎదురవుతోంది. ఇక్కడ ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్ ఈసారి నెరవేరేలా లేదు.
● జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కరువైంది. గతంలో ఏఐబీపీ స్కీమ్ కింద తోటపల్లి ప్రాజెక్టుకు సుమారు రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆ తరహా గ్రాంట్ను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల తోటపల్లి, జంఝావతి వంటి ప్రాజెక్టులకు కేంద్రం తరఫున ఒక్క రూపాయి కూడా అందని పరిస్థితి. ఇటు కేంద్రం పట్టించుకోకపోవడం.. అటు రాష్ట్రంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కూడా దృష్టి సారించకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి.
ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన స్పెషల్ ప్యాకేజీ ఊసు లేదు. దీనివల్ల వెనుకబడిన గిరిజన ప్రాంతమైన మన్యం జిల్లాకు రిక్తహస్తమే మిగులుతోంది. జిల్లాలో జాతీయ రహదారి పరిధి తక్కువ. కేవలం రాజాపులోవ నుంచి విజయనగరం, రామభద్రపురం, సాలూరు మీదుగా జైపూర్ వెళ్లే జాతీయ రహదారిని పూర్తి చేయగలిగారు. అంతర్రాష్ట్ర రహదారి అయినప్పటికీ.. పార్వతీపురం, పాలకొండవైపు జాతీయ రహదారి ప్రకటన లేకపోవడం జిల్లావాసులను నిరాశకు గురి చేసింది. శ్రీకాకుళంలోని చిలకపాలెం జాతీయ రహదారి నుంచి రాజాం, రామభద్రపురం మీదుగా బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి.


