రాష్ట్రంలో జంగిల్ రాజా పరిపాలన
● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాలూరు రూరల్: రాష్ట్రంలో జంగిల్ రాజా పరిపాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యే పరిస్థితి అవసరం ఉంది. రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్రపతికి గవర్నర్ తెలియజేయాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన కుటుంబంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడి హత్యాయత్నానికి పాల్పడే విధంగా ఉందని దీనిపై పోలీసులు స్పందించిన తీరు దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్లు చెబితే పోలీసులు కేసులు కట్టేస్తారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వీడియోలు స్పష్టంగా ఉన్నప్పటికీ నిందితులపై పోలీసులు కనీసం ఒక్క కేసుకూడా నమోదు చేయలేదన్నారు. స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఆవేశంలో కొన్ని మాటలు దొర్లుతాయని అలాంటి సందర్భాల్లో సరిచేసుకున్నప్పుడు ఆ మాటలను వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. అలా అయితే గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ని అన్న మాటలకు ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. రాష్టంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


