మహిళలు, చిన్నారుల సంరక్షణకు చర్యలు
పార్వతీపురం: బాల్యవివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు మహిళా సంరక్షణ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్ల్లాలోని అన్ని సచివాలయాల మహిళా పోలీసులకు సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని మహిళలు, చిన్నారుల భద్రతను పర్యవేక్షించాలన్నారు. మహిళలపై వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు అండగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బాలికల సంరక్షణ విషయంలో రాజీపడకుండా మహిళా పోలీసులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


