ఆశా వర్కర్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు
● కలెక్టర్ హెచ్చరిక
పార్వతీపురం: ఆశా వర్కర్లు విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరింలో వైద్యాధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క జ్వరం కేసు నమోదైనా ఆశాలపై చర్యలు తప్పవన్నారు. దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, దోమల ద్వారా మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర వ్యాధులు నమోదైతే సహించేది లేదన్నారు. జ్వరాల నివారణకు అవసరమైన శిక్షణను ఆశా వర్కర్లకు ఇవ్వాలన్నారు. దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి, వాటిని నివారించే వరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి వై.మణి, జిల్లా ప్రొగ్రాం మేనేజర్లు డా.ఎం.వినోద్కుమార్, డా.టి.జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.


