భూముల హక్కుదారులకే పాస్పుస్తకాలు ఇవ్వాలి
● ఫిబ్రవరి, మార్చిలో పంపిణీ వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి
విజయనగరం అర్బన్: ఆయా భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలను అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్, రీసర్వే, ఐవీఆర్ఎస్ సర్వే, జాయింట్ ఎల్పీఎంఎస్, స్వమిత్వ, రైస్ మిల్లుల తనిఖీలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేసేటప్పుడు వీలైనంతవరకు వాటిని అసలు హక్కుదారుకే అందజేయాలని స్పష్టం చేశారు. ప్రతినెలా 9వ తేదీలోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 10 నుంచి 14వ తేదీ వరకు మ్యుటేషన్ (ఫారం–8) ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు సుమోటో కరెక్షన్లు పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్ ప్రక్రియలో ట్రాన్జాక్షన్, కరెక్షన్, డెడ్ కరెక్షన్స్గా విభజించి పనులు చేయాలని, ప్రతి నెలా 30వ తేదీలోపు అన్ని దిద్దుబాట్లను పూర్తి చేసి, ఈ–కేవైసీ అనంతరం తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని వివరించారు.
మ్యుటేషన్ దరఖాస్తులు పునఃసమీక్షించాలి
జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ అంశాలు, భూసర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 12 గ్రామాల్లో, మార్చి నెలకు సంబంధించి 61 గ్రామాల్లో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులను పునఃసమీక్షించాలని, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని సూచించారు. రీ–సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, జాయింట్ ఎల్పీఎంల విభజన, ఆన్లైన్ సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో జిల్లా కేంద్రం నుంచి డీఆర్ఓ ఈ.మురళి, సర్వేశాఖ ఎ.డి విజయకుమార్తో పాటు ఆర్డీఓలు, డీఎల్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


