ముగిసిన దివ్యాంగ విద్యార్థుల కళా సాంస్కృతిక పోటీలు
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రెండురోజుల పాటు దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన కళలు–సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దివ్యాంగ విద్యార్థుల దేశభక్తి, జానపద, భక్తిగీతాలకు నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. లఘునాటికలు, ఏకపాత్రాభినయాలతో అలరించారు. పలువురు విద్యార్థులు గీతాలాపన చేయగా కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. రెండోరోజున జిల్లా సమగ్ర శిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


