కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,42,060
చీపురుపల్లి: భక్తుల కొంగుబంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ.2,42,060 ఆదాయం లభించినట్లు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 డిసెంబర్ 10 నుంచి 2026 ఫిబ్రవరి 4 వరకు ఆదాయం లెక్కింపు జరగ్గా భక్తులు మొక్కుబడులు, కానుకల ద్వారా హుండీల నుంచి రూ.2,42,060 లభించింది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎస్.నానాజీబాబు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, సభ్యులు ఇప్పిలి పార్వతి, లెంక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు ‘సేఫ్టీ డ్రైవింగ్’పై అవగాహన
పార్వతీపురం రూరల్: సేఫ్టీ డ్రైవింగ్పై జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఆర్టీసీ రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్న్స్పెక్టర్ సీహెచ్ వేణు శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్రేకులు, లైట్లు, టైర్ల పనితీరును తనిఖీ చేసుకోవడంపై సిబ్బందికి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రేబిస్తో బాలుడి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన రామవరపు రమణ(9) కుక్కకాటు వచ్చిన రేబిస్తో మృతి చెందాడు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామంలోని పిచ్చికుక్క రమణ ముఖంపై కాటువేసింది. అప్పట్లో బొబ్బిలి సీహెచ్సీకి తరలించి వ్యాక్సిన్ వేయించి చికిత్స అందించారు. మంగళవారం మళ్లీ జ్వరం రావడంతో స్థానిక వైద్యులు పరిశీలించి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా రమణ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందినట్లు తల్లిదండ్రులు వెంకటరత్నం,తండ్రి సంగమేశ్వర్రావులు తెలిపారు.కుక్క కాటు కారణంగా రేబిస్ వ్యాధి సోకడంతోనే విద్యార్థి రమణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెప్పారు. రమణ స్థానిక ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు.
విజయనగరం లీగల్: జిల్లా న్యాయసేవా అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.బబిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు విజయనగరం కోటలోని మోతీమహల్, ఎంఆర్ కాలేజీ (అటానమస్) వేదికగా జరుగుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఉదయం 10గంటల నుంచి 11:30 గంటల వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల వరకు, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని, దరఖాస్తుతో పాటు స్టాంపులు అంటించిన కవర్లు పంపిన అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ (httpr://vizianagaram. dcourts.gov.in) నుంచి హాల్టెకెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్లపై ఫొటో అటెస్టేషన్ లేని వారు వెంటనే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలని, అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,42,060
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,42,060


