కొనుగోళ్లు గోరంత !
జీసీసీ కొనుగోలు చేయాల్సిన ఉత్పత్తులు
సీతంపేట: గిరిజనానికి అండగా ఉండాల్సిన గిరిజన సహకార సంస్థ రానురాను ప్రాభవం కోల్పోతుంది. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఫలసాయాలను కొనుగోలు చేసి వారికి అండదండగా నిలబడాల్సిన జీసీసీ గిరిజనులు పండిస్తున్న ఉత్పత్తులు చాలా వరకు వ్యవసాయోత్పత్తులంటూ తప్పించుకుంటోంది. చేసేది లేక దళారీలకే గిరిజనులు తమ ఉత్పత్తులను విక్రయించాల్సిన పరిస్థితి. మరోవైపు సేల్స్మన్ నుంచి జీసీసీ డివిజనల్ మేనేజర్ వరకు 70 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జీసీసీ పయనమెటు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
● గిరిజనులకు నిత్యావసర సరుకులను సరఫరా చేయడం, సేకరించిన వస్తువులను ప్రాసెసింగ్ చేయడం, వాటికి మార్కెట్ ధర కల్పించేందుకు జీసీసీ చర్యలు తీసుకోవాలి. 32 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. అయితే, సంస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● పూర్తిస్థాయిలో అటవీఫలసాయాలు కొనుగోలు చేయకుండా కేవలం నిత్యావసర సరుకుల దుకాణాలను నడపడం, గిరిజన సంక్షేమ వసతిగృహాలకు నిత్యావసర సరుకులను సరఫరా చేయడం వంటి పనులు తప్ప గిరిజనులకు జీసీసీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగాల భర్తీ లేక..
విశాఖ జిల్లాలోని పాడేరు, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట, తూర్పుగోదావరిలో రంపచోడవరం తదితర చోట్ల జీసీసీ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం వివిధ కేడర్లలో దాదాపు 300లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్ లేదు. గోదాంలు నిర్వహించేందుకు సూపరింటెండెంట్లు, జీసీసీ నిర్వహణకు డివిజనల్ మేనేజర్, మేనేజర్ స్థాయి నుంచి సేల్స్మెన్ స్థాయి వరకు పోస్టులు ఖాళీ కావడంతో భవిష్యత్లో జీసీసీ మనుగడ ప్రశ్నార్థకం కానుందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సీతంపేట డివిజన్ కార్యాలయంలో డివిజనల్ మేనేజర్ పోస్టు ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అకౌంటెంట్, సీనియర్ మేనేజర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతంపేట, పాతపట్నం బ్రాంచ్ల పరిధిలో శాండీ ఇన్స్పెక్టర్లు 15, సేల్స్మెన్లు–12 పోస్టులు ఇన్చార్జిలతోనే కొనసాగుతున్నాయి. కార్యాలయంలో గోదాం ఇన్చార్జిలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యమే గిరిజన సహకార సంస్థకు శాపమైంది. కారుణ్య నియామకాలు లేవు. కొత్త పోస్టుల భర్తీలేదు. అటవీఉత్పత్తుల కొనుగోలు నామమాత్రమే. సరైన మద్దతు ధరలు లేవు. ఈ ప్రాంతంలో పండే అటవీఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు.
– విశ్వాసరాయి కళావతి,
పాలకొండ మాజీ ఎమ్మెల్యే
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాం. ఇటీవలే తమ సంస్థ ఽమద్దతు ధరలు ప్రకటించింది. కొండచీపుర్లు, కరక్కాయలు, నల్లజీడి వంటివి కొనుగోలు చేస్తున్నాం. ఖాళీ పోస్టుల్లో ఉన్న వారిని సర్దుబాటు చేసి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం.
– దాసరి కృష్ణ, జీసీసీ మేనేజర్, సీతంపేట
కొండచీపుర్లు, చింతపండు, ముసిడికి పిక్కలు, నల్లజీడి, కరక్కాయలు, నరమామిడిచెక్క, తిప్పతీగ, రెల్లబార్క్, ఉసిరికి పప్పు, నేలవేము, పాతాల గిరిడి, తేనె, మైనం, నరమామిడి చెక్క వంటివి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఎక్కువగా ఉత్పత్తయ్యే కొండచీపుర్లు, చింతపండు వంటివి మాత్రమే కొనుగోలు చేస్తున్నప్పటకీ వీటికి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడంతో గిరిజనులు దళారీలనే ఆశ్రయిస్తున్నారు. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించామని ఉన్నతాధికారులు ప్రకటించినప్పటకీ ఫ్లెక్సీలే తప్ప కొనుగోలు మాత్రం అంతంతమాత్రమేనని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఏజెన్సీలో విస్తృతంగా ఉసిరి, పైనాపిల్, పుసుపు, జీడీ, కందులు వంటి ఉత్పత్తులు ఎక్కువగా గిరిజనులు అంతరపంటలుగా పండిస్తుంటారు. ఇటువంటి వాటిని జీసీసీ కొనుగోలు చేస్తే రైతులకు కొంతమేర మేలు జరిగేది. ఎప్పటి నుంచో వీటిని కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. దళారీలు అడిగిన ధరకే విక్రయించి రైతులు నష్టపోతున్నారు.
ప్రాభవం కోల్పోతున్న జీసీసీ
రెండు, మూడు అటవీ ఫలసాయాలే కొనుగోలు
ప్రధాన పంటలన్నీ వ్యవసాయోత్పత్తులంటూ కొనుగోలు చేయని వైనం
సిబ్బంది కొరతతో జీసీసీ సతమతం
కొనుగోళ్లు గోరంత !
కొనుగోళ్లు గోరంత !
కొనుగోళ్లు గోరంత !
కొనుగోళ్లు గోరంత !


