ఎస్సీ కమిషన్కు వినతుల వెల్లువ
● దళితుల సమస్యలను యంత్రాంగం పట్టించుకోవడంలేదంటూ నిట్టూర్పు
విజయనగరం అర్బన్: జిల్లాలో దళితుల సమస్యల పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు దళితులు ఎస్సీ కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ అతిథి గృహంలో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దళిత నాయకులు భూ సమస్యలు, పట్టాల మంజూరులో జాప్యం, భూముల ఆక్రమణ, రిక్షా కార్మికులకు రుణాల మంజూరు లోపాలు, సంక్షేమ పథకాల అమలు కాగితాలకే పరిమితవుతున్నాయని కమిషన్ సభ్యునికి వినతులు సమర్పించారు. కొన్నేళ్లుగా ఫిర్యాదులు ఇస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. అందిన వినతులపై సంబంధిత అధికారులతో చర్చించి, బాధితులకు న్యాయం జరిగేలా కమిషన్ స్థాయిలో జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనకు తొలుత డీఆర్వో ఎం.నూకరాజు, ఆర్డీఓ దాట్ల కీర్తి, డీడీ అన్నపూర్ణమ్మ, ఈడీ వెంకటేశ్వరరావు, పలువురు దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు.


