ఉన్నది 50 సెంట్లు
రికార్డుల్లో 2.06 ఎకరాలు..
● వీరఘట్టంలో ప్రభుత్వ భూమి కబ్జా
● ఆక్రమణలు తొలగించేందుకు యంత్రాంగం సన్నద్ధం
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీరఘట్టం మేజర్ పంచాయతీలోని గాసీవీధికి–మేదరి వీధికి మధ్యలో సర్వే నంబర్ 304లో ఉన్న ప్రభుత్వ స్థలం. పూర్వకాలంలో ఇది శ్మశాన వాటిక. 2.06 ఎకరాల్లో ఈ భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ అంత భూమి లేదు. 50 సెంట్లు మాత్రమే ఉంటుంది. ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వీరఘట్టం: వీరఘట్టం మేజర్ పంచాయతీలోని సర్వే నంబర్ 304లో ఉన్న స్థలంలో పలు ప్రభుత్వ భవనాలను నిర్మించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలాలను కేటాయించారు. వెల్నెస్ సెంటర్కు మంజూరైన రూ.36లక్షలతో భవన నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. ఇదే అదునుగా ఆ స్థలం తమదంటే తమదంటూ కొందరు చదును చేయడం ప్రారంభించారు. రూ.కోట్లు విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది దళారులు పావులు కదుపుతున్నారు. గతంలో ఈ స్థలాన్ని తమకు ఇచ్చేశారంటూ పలు సామాజిక వర్గాల వారు తగాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మంగళవారం పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సర్వే నంబర్ 304లో 2.06 ఎకరాల్లో శ్మశానవాటిక ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 50 సెంట్లు భూమి మాత్రమే ఉంది. మిగిలిన భూమిని కొత్తగా వేసిన రియల్ ఎస్టేట్లో కలిపేశారా... లేదంటే స్థలం పక్క ఉన్నవారు కలిపేశారా అన్న కోణంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తు న్నారు. ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టంచేశారు.
ఉన్నది 50 సెంట్లు


