వ్యవసాయానికి నిధులు
వ్యవసాయరంగానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అన్నదాత–సుఖీభవ పథకం ద్వారా కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేంద్రం ఇచ్చిన పెట్టుబడి సాయం నిధులే రైతుకు దిక్కవుతున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయింపు ఉండడం వల్ల మరోసారి కేంద్ర సాయమే రైతును ఆదుకోనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు కేటాయించారు. జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం వంటి ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. నిధులు విడుదలైతే మరింత సాగుకు ఊతమిచ్చినట్లవుతుంది. జీడిపప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి చెట్ల పెంపకంపైనే గిరిజన రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. సరైన ప్రోత్సాహకం, మద్దతు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. జీడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కలగానే మిగులుతోంది.


