వృద్ధుడి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: స్థానిక ఇందిరా నగర్ లో ఏడు పదుల వయస్సున్న ఓ వృద్ధుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఇందిరానగర్ లో ఆర్కే సదన్ అపార్టెమెంట్ వాచ్మన్గా పనిచేస్తున్న అల్లు త్రినాథ్ (70) భార్య భవానీతో ఉంటున్నాడు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన త్రినాథ్ ఆదివారం రాత్రి యాసిడ్ తాగేశాడు. గమనించిన భార్య హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లైంగిక దాడి కేసులో
ముద్దాయికి 14 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: 2021వ సంవత్సరంలో రామభద్రపురం పీఎస్ లో లైంగికదాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో పాతరేగకు చెందిన ముద్దాయి గునపు సింహాద్రికి విజయనగరం మహిళా కోర్టు, 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి 14 ఏళ్ల కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే పాతరేగకు చెందిన గునపు సింహాద్రి అదే గ్రామానికి చెందిన ఒక మహిళపై బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రామభద్రపురం పోలీస్స్టేషన్ లో 2021లో అప్పటి ఎస్సై ఎస్.కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. అప్పటి సాలూరు రూరల్ సీఐ ఎల్.అప్పల నాయుడు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టులో నిందితుడు గునపు సింహాద్రి నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు పై విధంగా తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.
ఇద్దరికి గాయాలు
పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నందివానివలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామం నుంచి తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై రైతులు పొలం పనులకు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
2,407 లీటర్ల సారా ధ్వంసం
పార్వతీపురం రూరల్: వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు 2,407.95 లీటర్ల సారాను స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో, మధ్యవర్తుల సమక్షంలో ఈ సారాను పారబోసి నిర్వీర్యం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ కుమార్, ఎకై ్సజ్ సీఐ ఎస్.శిరీష, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
విజయనగరం గంటస్తంభం: నగరంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారు సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబాన్ని ఫౌండేషన్ దత్తత తీసుకుని, వారి బాగోగులు చూసుకుంటుండడం గమనార్హం. ప్రతినెలా ఇలాగే ఆ కుటుంబానికి అవసరమైన బియ్యం, నూనె, పప్పుదినుసులు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు.
ప్రత్యేక ఆధార్ కేంద్రాల ఏర్పాటు
విజయనగరం టౌన్: ప్రజల సౌకర్యార్థం ఎంపిక చేసిన పలు ప్రదేశాల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందించడం జరుగుతోందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సోమవారం కోరారు. ఈ నెల 4వ తేదీ వరకు కంటోన్మెంట్ పరిధిలోని గీతాంజలి పాఠశాల, సిక్కుల గుడి వద్ద, 5 నుంచి 7వ తేదీ వరకు మయూరి జంక్షన్, ఆర్కే జూనియర్ కళాశాలల వద్ద, 9 నుంచి 11వ తేదీ వరకు కామాక్షి నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ వద్ద ఆధార్ శిబిరాలు అందుబాటులో ఉంటాయన్నారు. కొత్త ఆధార్ కార్డులు కావాలన్నా, పాత ఆధార్ కార్డుల్లో తప్పులు సవరణ చేయాలన్నా ఆయా శిబిరాలను సంప్రదించాలన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య


