రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి లక్ష్యం
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పనిచేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరం రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ఫ్లాట్ఫామ్లో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏసీ డార్మిటరీ, రిటైరింగ్ రూమ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వీఐపీ లాంజ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పీఎన్ఆర్ కలిగి ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను అతి తక్కువ ఖర్చుకే అందజేస్తున్నామన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. పారదర్శకత, యాక్సెస్, డిజిటల్ సౌలభ్యం ఉందన్నారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు దీర్ఘకాలం వేచి ఉండేవారికి, సీనియర్ సిటిజన్లకు, పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఐఆర్సీటీసీ ద్వారా క్యాటరింగ్, హాస్పిటాలిటీ సేవలను లైసెన్స్డ్ మెస్సర్స్ గుడ్పుడ్ క్యాటరింగ్ సర్వీసులను అందజేస్తుందని చెప్పారు. అనంతరం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్, ఐఆర్సీటీసీ రీజనల్ మేనేజర్ అనూజ్ దత్తా తదితరులు పాల్గొన్నారు.
డీఆర్ఎం లలిత్ బోహ్రా


