ఈ ఏడాదైనా పాట పాడతారా?
వేలం పాట పక్కాగా నిర్వహిస్తాం
●జిల్లాలోని వీరఘట్టం మండలం వండవ కొండపై ఉన్న 150 ఎకరాల్లో ఉన్న 1302 జీడి మొక్కలకు ఫిబ్రవరి 10న పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ వేలం పాటలో తోటలు లీజుకు వెళ్లకపోతే మళ్లీ ఫిబ్రవరి 20న వేలం పాట నిర్వహిస్తారు.
●వేలం పాటలో పాల్గొనే వా రు ముందుగా వారు పాడబో యే తోటలను చూసుకోవాలి.
●ప్రతి పాటదారు ధరావత్తు సొమ్ము రూ.5000తో పాటు రూ.25వేలు నగదు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలి.
●పాట ముగిసిన వెంటనే నగదు సాల్వెన్సీ కాకుండా ధరావత్తు సొమ్ముతో కలిపి 1/3 వంతు అదే రోజు విధిగా చెల్లించాలి.
●పాట ఖరారైన వ్యక్తికి పాన్కార్డు, ఆధార్కార్డు తప్పకుండా కలిగి ఉండాలి.
వండువ పంచాయతీలోని జీడి తోటల నుంచి గత కొనేళ్లుగా ఫలసాయం అందుతోంది. ఏటా పూత సమయంలో అటవీ శాఖాధికారులు వేలం నిర్వహిస్తున్నారు.అలా వచ్చిన మొత్తంలో 60 శాతం పంచాయతీకి, 40 శాతం అటవీ శాఖకు చెందుతుంది. అయితే మూడేళ్లుగా వేలంపాట జరగకపోవడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. రెండేళ్ల క్రితం ఫలసాయం రూ.1.26 లక్షలు రావడంతో ఇందులో 60 శాతం వాటా కింద రూ.75 వేలను వండవ పంచాయతీకి అటవీశాఖ అధికారులు జమచేశారు. గతేడాది వేలం పాటకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికా రులే పర్యవేక్షణ చేశారు. 510 కిలోల జీడి పిక్కలు దిగుబడి వచ్చింది. అంటే గతేడాది ధర ప్రకారం కేవలం రూ.59 వేలు మాత్రమే ఆదా యం వచ్చింది. ఈ ఏడాది ఎలాగైనా వేలం పాట నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.
వీరఘట్టం:
మార్కెట్లో జీడి పిక్కల ధర ప్రస్తుతం కిలో రూ.140 నుంచి రూ.150 ధర పలుకుతోంది. గతేడాది సీజన్లో రూ.160 వరకు ధర పలికింది. అదే జీడి పప్పు ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.820 నుంచి రూ.870 ధర పలుకుతోంది. ఈ తరుణంలో ఎకరా జీడితోటలో పంట బాగా పండితే ఆ రైతుకు కనకవర్షం కురుస్తుంది. అయితే వీరఘట్టం మండలంలోని వండువ కొండపై 150 ఎకరాల జీడి తోటలు ఉన్నా జిల్లా అటవీశాఖకు మాత్రం గడిచిన మూడేళ్లుగా అరకొర ఆదాయం మాత్రమే వస్తోంది. గతంలో ప్రతి ఏటా జీడితోటలకు వేలం జరిగే సమయంలో దళారులు రంగప్రవేశం చేసి ధర తగ్గించేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారు. గడిచిన మూడేళ్లుగా ఎవరూ వేలం పాటకు ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికారులే సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ సీజన్ మొదలు కావడంతో ఈనెల 10న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో జీడితోటలు వేలం వేసేందుకు జిల్లా అటవీశాఖాధికారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీరఘట్టం మండలంలోని వండువ కొండల్లో 1980లో 62.5 ఎకరాల్లో జీడితోటలు వేశారు. మళ్లీ 1982లో 87.5 ఎకరా ల్లో జీడితోటలు వేశా రు. మొత్తం 150 ఎకరా ల్లో సుమారు 3750 జీడిమొక్కలను వేసి ఈ కొండలో సాగుచేశా రు. మొక్కలు వేసిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం బాగా రావడంతో అటవీశాఖకు, గ్రా మ పంచాయతీకి బాగానే ఆదాయం వచ్చేది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, ఈదురుగాలుల ధాటికి వాటిలో రెండు వంతుల మొక్కలు నేలమట్ట మయ్యాయి. ప్రస్తుతం 1302 జీడి మొక్కలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఈ మొక్కలకు మాత్రమే వేలం పాట నిర్వహించనున్నారు.
క్రమేపీ వండువ కొండల్లో ఉన్న జీడి మొక్కల సంఖ్య తగ్గుతోంది. 1980–82 మధ్య కాలంలో సుమా రు 3750 మొక్కలు వేస్తే ప్రస్తుతం 1302 మొక్కలే ఉన్నాయి. ప్రతి ఏటా సీజన్లో ఉపాధిహామీ పథ కం ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. అప్పు డు పాత మొక్కలు నేలమట్టమైనా కొత్త మొక్కలతో ఫలసాయం పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. అయితే ఈ కొండల్లో జీడి తోటలపై సస్యరక్షణ చర్యలు చేపట్టక, నిర్వహణ లేక ఏటా ఫలసాయం తగ్గుతోంది. ఇలాగే వదిలేస్తే మరో మూడేళ్లలో ఉన్న మొక్కలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి, పంచాయతీకీ ఆదాయం రావాలంటే అధికారులు సమన్వయంతో ఇక్కడ జీడితోటల పెంపకంపై దృష్టి సారించాల్సి ఉంది.
జీడి తోటల వేలానికి గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా వేలం పాటను పక్కాగా నిర్వహిస్తాం. వేలం పాటను సిండికేట్ చేస్తే రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఎవరైనా లోపాయికారీగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
–టీవీ రమణమూర్తి,
డిప్యూటీ రేంజర్, వీరఘట్టం
ఈ ఏడాదైనా పాట పాడతారా?


