ఘనంగా కనికరమాత యాత్ర
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు
● ముగిసిన నవీనా ప్రార్థనలు
కొత్తవలస: మండలంలోని కొండడాబాల వద్ద ఉన్న వ్యాకులమాత యాత్ర మహోత్సవం ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయానికి 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ చర్చిలో 1914వ సంవత్సరంలో ఫారిస్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించిన వ్యాకులమాత ప్రతిమను కుల మతాలకు అతీతంగా ఆరాధించడం ఇక్కడ ప్రత్యేకత.
ముగిసిన ప్రార్థనలు
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొండపై గడిచిన తొమ్మిది రోజులుగా ఫాదర్ గొంగాడ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రార్థనలు శనివారం రాత్రి ముగిశాయి. కనికరమాతను ప్రత్యేక పల్లకిలో ఉంచి క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం అతిమేత్రాణులు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు విచారణ కర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పటిష్టమైన బందోబస్తు
యాత్రకు వేలాది మంది తరలి రావడంతో ఎటువంటి లవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో సీఐ సీహెచ్.షణ్ముఖరావు పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. అలాగే భక్తుల రాకపోకలకు సింహాచలం, మద్దిలపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యే సర్వీసులు నడిపారు.


