అప్రమత్తతే భద్రతకు శ్రీరామరక్ష
పార్వతీపురం రూరల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రయాణంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని డ్రైవర్లు తమ బాధ్యతాయుత డ్రైవింగ్తో నిలబెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల మృతుల సంఖ్య 2024లో 65 ఉండగా, 2025లో 105కు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోందన్నారు. విమానాల్లో మాదిరిగా బస్సుల్లోనూ అత్యవసర ద్వారాల (ఎమర్జెన్సీ ఎగ్జిట్) వినియోగంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బట్టే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రమాదరహితంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గాప్రసాద్, సీఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


