కన్నీటి వేళ.. కారుణ్య హస్తం
పార్వతీపురం రూరల్ : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన సాలూరు హెడ్ కానిస్టేబుల్ డి.ఆనందరావు, రోడ్డు ప్రమాదంలో మరణించిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి కుటుంబాలకు విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ కింద మంజూరైన రూ.75,000 (ఒక్కొక్కరికి) చొప్పున చెక్కులను మృతుల భార్యలు అనిత, లలితలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కష్టకాలంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని, అధైర్యపడకుండా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మృతుల కుటుంబాలకు అందాల్సిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


