అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
● వడ్డీ వ్యాపారులతో పట్టణ సీఐ సమావేశం
పార్వతీపురం రూరల్: అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం సాగించినా, పరిమితికి మించి వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించినా చట్టపరమైన చర్యలు తప్పవని పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు హెచ్చరించారు. ఈ నెల 5న సాక్షి దినపత్రికలో వెలువడిన అప్పుల ఊబిలో చిరు వ్యాపారులు శీర్షికపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో వడ్డీ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరమని, అప్పుల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనల పరిధిలోనే వ్యాపారాలు నిర్వహించాలని, వేధింపులపై ఫిర్యాదులు అందితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అధిక వడ్డీల కోరల్లో చిక్కిన బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. సమావేశంలో పట్టణ ఎస్సైలు ప్రయోగమూర్తి, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా


