కేన్సర్పై అవగాహనతోనే విజయం
పార్వతీపురం రూరల్: ముందస్తు పరీక్షే ప్రాణరక్ష అని, అవగాహనతోనే కేన్సర్ మహమ్మారికి కళ్లెం వేయవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ కేన్సర్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా ఆరోగ్య కార్యాలయం నుంచి పట్టణ వీధుల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే అనర్థాలకు హేతువులని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వ్యాయామం నిత్యకృత్యం కావాలని ఆకాంక్షించారు. ‘మత్తుకు దూరం–బతుకుకు మార్గం’ అనే సూత్రాన్ని పాటించాలని, ప్లాస్టిక్ రహిత జీవనం, సమతుల ఆహారం ద్వారా వ్యాధులను నివారించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎనన్సీడీ అధికారి డాక్టర్ జగన్ మోహనరావు, ఇతర వైద్యాధికారులు విజయమోహన్, సూర్యకౌశిక్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.


