పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలోనూ, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారిని పుష్పాలతో లంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
ఇంటి వివాదంలో ఒకరిపై దాడి
పార్వతీపురం రూరల్: ఇంటి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అరసాడ ఆనందరావు మూడేళ్ల క్రితం సవర కుమార్ వద్ద ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి ముందున్న దుకాణాన్ని తొలగించే విషయంలో గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా, సంక్రాంతి తర్వాత ఖాళీ చేస్తానని కుమార్ అంగీకరించాడు. అయితే గడువు ముగిసినా దుకాణం తొలగించకపోవడంతో మంగళవారం ఉదయం ఇంటిలో సామాన్లు సర్దుతున్న ఆనందరావు, కుమార్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుమార్, అతని భార్య లక్ష్మమ్మ కలిసి కర్రతో దాడి చేయడంతో ఆనందరావు తల, దవడ భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


